ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్లే వారు అయినా, ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లే విద్యార్థులు అయినా.. విమానం ఎక్కేముందు వారి సూట్కేసుల్లో దుస్తుల కంటే ఎక్కువగా ఆహార ప్యాకెట్లు కనిపిస్తుంటాయి. దీనికి కారణం విదేశాల్లో భారతీయ ఆహారం అంతగా దొరకకపోవడం లేదా ఖర్చు అధికంగా ఉండటం. అందుకే ఇక్కడి నుంచి విదేశాలు వెళ్లేవారు తమతో పాటు ఇక్కడి ఆహారాన్ని మోసుకెళుతుంటారు. ముంబై, అహ్మదాబాద్ల నుంచి విదేశాలకు వెళ్లేవారికి ఇక్కడి గల్లీల్లో ఉండే గుజరాతీ కిచన్లే ‘అన్నపూర్ణలు’గా మారాయి. న్యూజెర్సీ, కాలిఫోర్నియా తదితర నగరాల్లో ఉండే భారతీయులు ఈ హోమ్ కిచెన్ల రుచుల కోసం క్యూ కడుతుంటారు.
ఎన్ని పెద్ద బ్రాండ్లు ఉన్నా..
న్యూజెర్సీలో పనిచేసే పలువురు భారతీయ టెక్కీలు తమ 30 కిలోల లగేజీలో దాదాపు 8 కిలోలు కేవలం ఈ తినుబండారాలకే కేటాయిస్తుంటారు. థెప్లా, ఫాఫ్డా, ఖాక్రా, రెడీ-టు-ఈట్ పావ్ భాజీ తదిరత వంటకాలు వాక్యూమ్ సీలింగ్ సాంకేతికతతో నెల రోజుల పాటు తాజాగా ఉంటున్నాయి. అమెరికాలో ఎన్ని పెద్ద బ్రాండ్లు అందుబాటులో ఉన్నా, గుజరాతీ మహిళలు (బెన్స్) ఎటువంటి రసాయనాలు లేకుండా చేసే ‘ఇంటి రుచి’కి ఏదీ సాటిరాదని ప్రవాసులు చెబుతుంటారు.
బడ్జెట్ ఫ్రెండ్లీ రుచులు
విదేశాలకు వెళ్లే కొత్తలో విద్యార్థులు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఆహార ఖర్చు . న్యూయార్క్ వంటి నగరాల్లో ఒక వెజిటేరియన్ శాండ్విచ్ ధర సుమారు 5 నుండి 7 డాలర్లు (రూ. 400 - 600) ఉండగా, భారత్లో కేవలం 20-30 రూపాయలకే లభించే థెప్లా ప్యాకెట్లు వారికి గొప్ప ఊరటనిస్తున్నాయి. అమెరికాలో లభించే ప్యాక్డ్ ఫుడ్ కంటే ఇవి ఐదు రెట్లు తక్కువ ధరకే లభిస్తుండటం విద్యార్థుల బడ్జెట్కు పెద్ద ప్లస్ పాయింట్ అవుతోంది.
ప్రకటనలు లేని వ్యాపారం
ఈ గుజరాతీ కిచెన్ల వెనుక ఎటువంటి భారీ మార్కెటింగ్ టీమ్లు లేవు. ముంబైలోని విలే పార్లే, ఘాట్కోపర్ వంటి ప్రాంతాల్లోని గృహిణులు నాణ్యతనే పెట్టుబడిగా పెట్టి అంతర్జాతీయ స్థాయికి తమ వ్యాపారాన్ని తీసుకువెళ్లారు. ‘ఇందుబెన్ ఖాక్రావాలా’ లాంటి సంస్థల స్ఫూర్తితో తమ ఇంటి వంటగదుల నుంచే పలువురు మహిళలు టెక్కీల ఆకలిని తీర్చే పనిలో నిమగ్నమవుతున్నారు.
తెల్లవారుజాము నుంచే విదేశీ ఆర్డర్ల సందడి
అహ్మదాబాద్కు చెందిన సెజల్ షా లాంటివారు తెల్లవారుజామున 4 గంటలకే తమ ‘కిచెన్’లో వంట పనిని ప్రారంభిస్తారు. విదేశాల్లో ఉండే ఐటీ నిపుణుల కోసం, విద్యార్థుల కోసం రుచికరమైన వంటకాలను సిద్ధం చేస్తారు. ఈ చిన్న కిచెన్ల నుండి వెళ్లే ఆహారం అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లోని భారతీయ మేధావుల ఆకలిని తీరుస్తోంది.
సంస్కృతుల ఎగుమతి
విదేశాల్లో స్థిరపడిన వారు కూడా తమ పిల్లల కోసం, బంధువుల కోసం ఈ వంటకాలను ప్రత్యేకంగా తెప్పించుకుంటున్నారు. స్టార్టప్లు, గిగ్ ఎకానమీ యుగంలోనూ, గుజరాతీ మహిళల వ్యాపార దృక్పథం గ్లోబల్ మార్కెట్లో ఒక కొత్త ట్రెండ్ను సృష్టించింది. కేవలం రుచి మాత్రమే కాదు, ఒక సంస్కృతిని, అనుబంధాన్ని ఈ వంటకాల ద్వారా వారు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారనడంలో సందేహం లేదు.
ఇది కూడా చదవండి: ‘రైతే ఎప్పటికీ రారాజు’.. అమెరికా ఒప్పందంలో స్పష్టం!


