పంచమహల్(గుజరాత్): ఉపాధ్యాయులంటే భయం భక్తి లేకుండా పిల్లలను పెంచితే వాళ్లు చివరకు ఎలా ప్రవర్తిస్తారో ఓ విద్యార్థి పాఠశాల సాక్షిగా చేసి చూపించాడు. ఉపాధ్యాయురాలిని తోటి పరీక్షార్థుల ఎదుటే ఒక విద్యార్థి చాచి చెంపదెబ్బ కొట్టాడు. పరీక్షకు ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావని ప్రశ్నించినందుకు పట్టరాని ఆగ్రహంతో ఇంతటి దుస్సాహసానికి తెగించాడు.
విద్యాబుద్దులు నేర్పే ఉపాధ్యాయురాలితో ఎలా ప్రవర్తించాలనే కనీస ఇంగితజ్ఞానం లేని ఆ 18 ఏళ్ల విద్యార్థిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేయగా వెనువెంటనే బెయిల్పై బయటికిరావడం వ్యవస్థలోని లోపాలనూ కళ్లకు కట్టింది. గుజరాత్లోని పంచమహల్ జిల్లా షేహ్రా పట్టణంలోని ఎస్జే దేవ్ హైస్కూల్లో గత నెల 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీస్ ఇన్స్పెక్టర్ అంకుర్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం ఆరోజు ఉదయం స్కూల్లో 12 తరగతి సెకండ్ ప్రిలిమినరీ టెస్ట్కు 18 ఏళ్ల విద్యార్థి మొహమ్మెద్ ఖాన్ అన్సారీ చాలా ఆలస్యంగా వచ్చాడు. ఎగ్జామ్హాల్లోకి అడుగుపెట్టగానే ఆలస్య మెందుకైందని టీచర్ ప్రశ్నించగా పెళ్లున ఆమె చెంప పగలగొట్టాడు. ‘‘నేనేం చేసిన ఇంట్లో ఎవరూ అడగరు. అలాంటిది నువ్వెవరు నన్ను అడగడానికి?’’ అని ప్రశ్నించాడు. మూడ్రోజుల తర్వాత తండ్రి, 15–20 మంది స్నేహితులతో కలిసి స్కూల్కొచ్చి ‘‘టౌన్లో ఒక్కదానివే ఉంటున్నావు. జాగ్రత్త’’ అని టీచర్ను బెదిరించారు. బెదిరింపులపై ఫిర్యాదు అందటంతో పోలీసులు ఫిబ్రవరి మూడో తేదీన కేసు నమోదుచేసి పిల్లాడిని అరెస్ట్చేశారు. తర్వాత బెయిల్పై బయటికొచ్చాడు.


