కొడుకు కోసం ‘నరసింహావతారం’! | 60 yr old Gujarat farmer kills leopard while saving son | Sakshi
Sakshi News home page

కొడుకు కోసం ‘నరసింహావతారం’!

Jan 30 2026 5:06 AM | Updated on Jan 30 2026 5:06 AM

60 yr old Gujarat farmer kills leopard while saving son

చిరుతపులిని చంపి బిడ్డను కాపాడుకున్న రైతు

వెరవాల్‌(గుజరాత్‌): గిర్‌ అడవుల అంచున.. మృత్యువు పంజా విసిరితే, ఒక సామాన్య రైతు పరాక్రమం ముందు ఆ క్రూర మృగం చిత్తయింది. కన్నకొడుకును రక్షించుకోవడానికి ఆ తండ్రి చేసిన పోరాటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇది కేవలం ఒక వార్త కాదు.. చావు ముంగిట నిలబడి గెలిచిన ఒక యోధుడి గాథ!

అర్ధరాత్రి.. మృత్యువు పంజా
గిర్‌ సోమనాథ్‌ జిల్లాలోని గాంగ్డా గ్రామం. 60 ఏళ్ల రైతు బాబు వాజా తన ఇంటి వరండాలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. చుట్టూ చిమ్మచీకటి.. నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఒక్కసారిగా పొలాల్లో నుంచి ఒక చిరుతపులి ఆకలిగొన్న రాక్షసిలా బాబు మీదకు దూకింది. బాబు చేతిని పట్టుకుని ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా.. ఆయన పెట్టిన కేకలు విని కొడుకు శార్దూల్‌ పరుగున వచ్చాడు.

కొడుకుపై దాడి.. తండ్రి విశ్వరూపం
తండ్రిని వదిలేసిన ఆ క్రూర మృగం.. సాయం కోసం వచ్చిన కొడుకు మీదకు లంఘించింది. కొడుకుపై దాడి చేస్తున్న చిరుతను చూసి ఆ తండ్రిలో రక్తం ఉడికిపోయింది. వయసు భారమైనా, ఆపదలో ఉన్న కొడుకును చూసి ఆయనలో దాగి ఉన్న వీరుడు మేల్కొన్నాడు. పక్కనే ఉన్న కొడవలి, ఈటె  అందుకున్నాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ చిరుతపై విరుచుకుపడ్డాడు. కొన్ని నిమిషాల పాటు సాగిన ఆ ప్రాణాంతక పోరాటంలో.. బాబు వాజా పంజాకు పంజా విసిరి ఆ చిరుతను అక్కడికక్కడే హతమార్చాడు!

నాన్న ప్రేమకు సెల్యూట్‌
చిరుత దాడిలో బాబు వాజా, అతని కొడుకు శార్దూల్‌ తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఉనా పట్టణంలోని ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆత్మరక్షణ కోసం చిరుతను చంపినప్పటికీ, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అటవీ శాఖ అధికారులు బాబు వాజాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాణం తీయడం నేరమే కావచ్చు.. కానీ ప్రాణం పోయే స్థితిలో ఒక తండ్రి చూపిన తెగువకు సోషల్‌ మీడియాలో నెటిజన్లు సెల్యూట్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement