భారత్‌ నౌకలకు ఇరాన్‌ గ్రీన్‌ సిగ్నల్‌.. జైశంకర్‌ ఏమన్నారంటే? | S Jaishankar Confirms Iran Allows Passage For Two Indian Tankers Through Strait Of Hormuz, Details Inside | Sakshi
Sakshi News home page

భారత్‌ నౌకలకు ఇరాన్‌ గ్రీన్‌ సిగ్నల్‌.. జైశంకర్‌ ఏమన్నారంటే?

Mar 16 2026 10:25 AM | Updated on Mar 16 2026 11:57 AM

S jaishankar explains iran hormuz pass for 2 indian tankers

న్యూఢిల్లీ: హర్మూజ్‌ జలసంధిపై ఆంక్షలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌తో తాను జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ సంతోషం వ్యక్తం చేశారు. 

‘ప్రస్తుతం నేను ఇరాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాను. ఈ చర్చలు ఫలితాల్ని ఇస్తున్నాయి. ఇరాన్‌తో భారత్‌ నిరంతరం టచ్‌లోనే ఉంటుంది. చర్చల ద్వారా దౌత్యపరమైన విజయాలు లభిస్తుంటే వాటిని పరిశీలించడంలో తప్పులేదు. నేనుకూడా అదే చేస్తున్నాను’ అని  ఫైనాన్షియల్ టైమ్స్‌ ఇంటర్వ్యూలో జైశంకర్ తెలిపారు. ‘ఖచ్చితంగా, ఆయా దేశాలతో సమస్యలుంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. భారత్‌ దృక్కోణం నుండి ఇరాన్‌తో చర్చలు జరపడం,సమన్వయం చేసుకోవడం మంచిది. పరిష్కారం సైతం లభిస్తోందన్నారు.

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధంత కొనసాగుతోంది. క్రమంలో ప్రపంచ దేశాలపై ఆర్థిక పరమైన ఒత్తిడి తెచ్చేలా ఇరాన్‌ తన హర్మూజ్‌ జలసంధిపై ఆంక్షలు విధించింది. తమని కాదని చమురు నౌకల రవాణాని కొనసాగిస్తే వాటిని పేల్చుతామని హెచ్చరించింది. అందుకు కొనసాగింపు ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధిలో నేవల్‌ మైన్స్‌ను నింపేసింది. 700నౌకలను నిలిపివేసింది

ఈ క్రమంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఇరాన్‌తో చర్చలు జరిపారు. హర్మూజ్‌ జలసంధిలో భారత్‌ నౌకలపై ఆంక్షలు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో హర్మూజ్‌ జలసంధి గుండా వెళ్లేందుకు భారత్‌ గ్యాస్‌, చమురు నౌకలకు అనుమతి ఇచ్చినట్లు ఇరాన్‌ ప్రకటించింది. భారత్‌ జెండాలతో జలసంధి గుండా వెళ్లొచ్చని సూచించింది.

ఆరోణల్ని ఖండించిన జైశంకర్‌
భారత జెండాతో ఉన్న నౌకలకు సంబంధించి ఇరాన్‌తో ఎలాంటి ‘సమగ్ర ఒప్పందం’లేదని విదేశాంగ మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా భారత్‌ నౌకలకు అనుమతి ఇవ్వడం ద్వారా ఇరాన్‌ ప్రతిఫలం పొందిందనే ఆరోపణలను ఆయన ఖండించారు. ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరం. భారత్‌-ఇరాన్‌ల మధ్య చిరకాల సంబంధం ఉంది. దాని ఆధారంగా చర్చలు జరిపినట్లు పునరుద్ఘాటించారు.  భారత్‌ నౌకలకు అనుమతి ఇవ్వడం శుభపరిణామం. అయినప్పటికీ హర్మూజ్‌ జలసంధి నుంచి భారత్‌కు రావాల్సిన నౌకలు చాలా ఉన్నాయి. వాటి విషయంలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement