సిమ్లా: చిరుతపులికి చిక్కి ప్రాణాలతో బయటపడటం ఊహకందని విషయం. కానీ.. చిరుతపులి బారి నుంచి తనను తాను రక్షించుకోవడానికి పెద్ద సాహసమే చేశాడో యువకుడు. ఎలాంటి ఆయుధాలు లేకుండా రాళ్లు రప్పలతో తిరుగుబాటు చేశాడు. చివరికి నిస్సహాయ స్థితిలోకి వెళ్లిన చిరుతపులి ప్రాణాలు కోల్పోయింది. స్వల్ప గాయాలపాలైన యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. హిమాచల్ ప్రదేశ్ సోలన్ జిల్లాలో సోమవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్కిలోని సర్లి గ్రామానికి చెందిన ప్రవేశ్ శర్మ ఐటీఐ చదువుతున్నాడు.
సోమవారం ఉదయం పొలానికి వెళ్లగా చిరుత దాడి చేసింది. ఊహించని ఘటనతో నివ్వెరపోయిన యువకుడు సహాయం కోసం అరుస్తూనే.. చిరుతపులికి తన మెడ చిక్కకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ క్రమంలో చిరుతపులి దవడలు అతని చేతికి చిక్కాయి. చేతికి అందిన రాళ్లతో ఆ చిరుతపులి దవడలు, గోళ్లపై దాడి చేశాడు. పది నిమిషాలకు పైగా సాగిన పోరాటంలో చివరకు ఆ చిరుతపులి ప్రాణాలు కోల్పోయింది. యువకుని భుజాలు, కాళ్ళు, చేతులు, ముఖంపై అనేక గాయాలు అయ్యాయి. ఈలోపు అటవీ అధికారులు చేరుకుని యువకుడిని ఆస్పత్రికి తరలించారు.


