యూపీలో మత్తు మందిచ్చి పట్టుకున్న అటవీసిబ్బంది
గాజియాబాద్: పాఠాలు వినేందుకు విద్యార్థులు రావాల్సిన పాఠశాలకు వాళ్ల కంటే ముందే ఒక చిరుతపులి రావడంతో పాఠశాల యాజమాన్యం అవాక్కైంది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి దానిని పట్టుకునేందుకు కృషిచేసింది. ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లోని గోవిందాపురం ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పాఠశాల వైపుగా ఒక చిరుత రావడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
ఇది చూసిన పాఠశాల యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయడం, వాళ్లు వెంటనే బోను, మత్తుమందు ఇంజెక్షన్లతో అటవీశాఖ సిబ్బందిని వెంటేసుకుని రంగంలోకి దిగడం చకచకా జరిగిపోయాయి. ఎట్టకేలకు చిరుతను పాఠశాల టాయిలెట్ గదిలో గుర్తించారు. గది గోడకు నాలుగు అడుగుల రంధ్రం చేసి అందులోంచే మత్తు ఇంజెక్షన్ను చిరుత మీదకు ప్రయోగించి అది నిద్రపోయేలా చేశారు. బోనులోకి ఎక్కించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సహరన్పూర్లోని శివాలిక్ కొండల్లో చిరుతను వదిలేస్తామని సబ్ డివిజనల్ అధికారి డాక్టర్ సలోని చెప్పారు.


