జెరూసలేం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్యం తర్వాత ఒకే రోజులో జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా నిలిచిన హమాస్ దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. హమాస్ 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగం, సముద్రం, గగనతలం నుంచి సమన్వయ దాడి జరిపింది. ఈ దాడిలో సుమారు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
తాజా ఇజ్రాయెల్ పర్యటనలో మోదీ హమాస్ దాడి గురించి ఇజ్రాయెల్ పార్లమెంట్ (క్నెసెట్)లో ప్రసంగించారు. అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడి అమానుషమైనది. 1.4 బిలియన్ భారతీయుల తరఫున నేను సంతాపం తెలియజేస్తున్నాను. ఇజ్రాయెల్ బాధను భారత్ అనుభవిస్తోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో మేము మీతో ఉన్నాం అని హామీ ఇచ్చారు.
ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ..‘భారతదేశానికి కూడా ఇలాంటి గాయాలు ఉన్నాయి. ఉగ్రవాదం ఎంతటి విషాదాన్ని మిగులుస్తుందో మాకు తెలుసన్నారు. ఈ ప్రసంగం ద్వారా మోదీ, ఉగ్రవాదం ఒక దేశానికే పరిమితం కాకుండా ప్రపంచానికి ముప్పుగా అభివర్ణించారు. ఉగ్రవాదం ఎక్కడైనా జరిగితే, అది మానవత్వంపై దాడి చేసినట్లేనని స్పష్టం చేశారు.


