జార్ఖండ్ ప్రమాదంపై దర్యాప్తునకు అవరోధాలు
న్యూఢిల్లీ: జార్ఖండ్లో ఏడుగురి మృతికి కారణమైన 40 ఏళ్ల నాటి బీచ్క్రాఫ్ట్ సీ90ఏ విమానంలో బ్లాక్బాక్సు (కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్లు) లేదని డీజీసీఏ వెల్లడించింది. దానికి చివరిసారిగా 1987లో అర్హత సరి్టఫికెట్ జారీ చేసినట్లు పేర్కొంది. రెడ్బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన బీచ్క్రాఫ్ట్ సీ90ఏను ఎయిర్ అంబులెన్స్గా ఉపయోగిస్తున్నారు.
ఈ నెల 23న జార్ఖండ్ నుంచి ఢిల్లీకి అత్యవసరంగా బయలుదేరగా మధ్యలోనే కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో ఐదుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది. ఈ విమానాన్ని 1987లో తయారు చేసినట్లు గుర్తించారు. అర్హత సమీక్ష సర్టిఫికెట్ వచ్చే ఏడాది జనవరి 20దాకా చెల్లుబాటు అవుతుందని అధికారులు వెల్లడించారు.
అయితే, విమానంలో బ్లాక్బాక్సు లేకపోవడం దర్యాప్తునకు అవరోధంగా మారింది. విమానానికి సంబంధించిన కీలక సమాచారం అందుబాటు లేకుండాపోయింది. నిబంధనల ప్రకారం.. 5,700 కిలోల కంటే బరువు ఉన్న విమానంలో కాక్పిట్ వాయిస్ రికార్డర్ కచ్చితంగా ఉండాలి. ప్రమాదానికి గురైన విమానం బరువు 4,583 కిలోలుగా తేల్చారు. విమానంలో లోపాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ వర్గాలు స్పష్టంచేశాయి.


