చైబాసా (జార్ఖండ్): ఆమె గుండెలకు హత్తుకున్నది తన ప్రాణాన్ని.. ఆ గుంపు నిప్పు పెట్టింది ఆ ప్రేమనే.. ముక్కుపచ్చలారని ఏడాది పసికందును, గుండెల్లో హత్తుకున్న తల్లిని.. మూఢత్వం రగిలించిన మంటలు బూడిద చేశాయి. చేతబడి అనే ఒక అబద్ధపు ముద్ర.. కన్నపేగును, అమ్మ ఒడిని నిలువునా దహించివేసిన వేళ, అక్కడ కాలిపోయింది ఇద్దరు మనుషులు మాత్రమే కాదు.. ఈ సమాజపు మానవత్వం.. నాగరిక సమాజం తలదించుకునేలా జార్ఖండ్లో మంత్రగత్తె నెపంతో ఒక మహిళను, ఆమె ఏడాది వయసున్న పసికందును సజీవ దహనం చేసిన ఘోరం వెలుగు చూసింది.
మంత్రగత్తె నెపంతో..
పశ్చిమ సింగ్భూమ్ జిల్లా కుమారదుంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ దారుణంపై పోలీసుల కథనమిది. మృతురాలి బంధువు ఒకరు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మరణించారు. అయితే, ఆ మహిళ చేసిన చేతబడి వల్లే అతను చనిపోయాడని స్థానికులు కొందరు నమ్మారు.
ఈ క్రమంలో అర్ధరాత్రి దాదాపు 12 మంది వ్యక్తులు ఆమె ఇంటిపై దాడి చేశారు. భార్యాభర్తలిద్దరినీ బయటకు లాగి ఘర్షణకు దిగారు. గందరగోళం మధ్య, ఆమె చేతిలో ఏడాది బాబు ఉండగానే దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. తల్లి, బిడ్డ అక్కడికక్కడే మంటల్లో కాలి బూడిదయ్యారు. ఈ దాడిలో భర్త కూడా గాయపడగా, అతను ఎలాగోలా ప్రాణాలతో తప్పించుకుని రాత్రంతా బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశాడు.
చదవండి: కేసులు పెట్టిందని.. కక్ష పెంచుకుని..
బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు జగన్నాథ్పూర్ ఎస్డీపీవో రాఫెల్ ముర్ము తెలిపారు. కేవలం మూఢనమ్మకాలతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దాడిలో పాల్గొన్న ఇతర మహిళలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. గాయపడిన భర్తను చికిత్స నిమిత్తం కుమారదుంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


