ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్ భేటీ | Google CEO Sundar Pichai lands in India for AI summit | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్ భేటీ

Feb 18 2026 10:40 AM | Updated on Feb 18 2026 11:36 AM

Google CEO Sundar Pichai lands in India for AI summit

న్యూఢిల్లీ: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బుధవారం  ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో పాల్గొనేందుకు భారత్ చేరుకున్న పిచాయ్, ప్రధానితో ప్రస్తుత సాంకేతిక పరిణామాలు, కృత్రిమ మేధ భవిష్యత్తుపై చర్చించారు. మరోవైపు ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ భారత్‌లో ఏఐ ప్రభావంపై  మాట్లాడారు. భారత ఐటీ రంగం మన ఎగుమతులకు వెన్నెముక అని, ఏఐ దీనికి  అపారమైన అవకాశాలను కల్పిస్తుందని  పేర్కొన్నారు. ఏఐ ఆధారిత అవుట్‌సోర్సింగ్, ఆటోమేషన్ కారణంగా 2030 నాటికి భారత ఐటీ రంగం 400 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ‘పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్’ అనే మూడు సూత్రాల ఆధారంగా మానవ హక్కులను కాపాడుతూ, పర్యావరణహితంగా ఏఐని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ప్రధాని పేర్కొన్నారు.

గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల సీఈఓ సుందర్ పిచాయ్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొనేందుకు బుధవారం భారతదేశానికి చేరుకున్నారు. ఫిబ్రవరి 20న  ఆయన ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. చాలా కాలం తర్వాత మాతృభూమికి రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘భారతదేశానికి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది.. ఇక్కడ లభించిన సాదర స్వాగతం నా మనసుని తాకింది’ అంటూ పిచాయ్ తన 'ఎక్స్‌’ ఖాతాలో పేర్కొన్నారు.

న్యూఢిల్లీలోని ‘భారత్ మండపం’లో ఐదు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 16న ప్రారంభమైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ‘ఇండియా ఏఐ మిషన్’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో  సామాన్యుల జీవితాల్లో ఎలా సానుకూల మార్పు తీసుకురావచ్చనే అంశంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి టెక్ సీఈఓలు, దేశాధినేతలు పలు అంశాలపై ఈ వేదికపై చర్చించనున్నారు.

ఈ సదస్సు ప్రారంభానికి ముందు ఒక జాతీయ మీడియాతో మాట్లాడిన సుందర్ పిచాయ్.. భారత్‌తో ఏఐ రంగంలో భాగస్వామ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ దేశాల్లో భారత్ ఒకటి అని, ఇక్కడ ఏఐ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. కేవలం సాంకేతికతను అందించడమే కాకుండా, మౌలిక సదుపాయాల కల్పన, స్థిరమైన ఇంధన వనరుల పెట్టుబడులు, ఓపెన్ డేటాసెట్స్, స్థానిక ప్రతిభను ప్రోత్సహించడం తదితర అంశాల్లో భారత్‌కు గూగుల్ పూర్తి సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు.

ఈ మెగా సదస్సులో సుందర్ పిచాయ్‌తో పాటు ప్రపంచ స్థాయి దిగ్గజాలు తమ గళాన్ని వినిపించనున్నారు. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ఆంత్రోపిక్ వ్యవస్థాపకులు డారియో అమోడై తదితర ప్రముఖులు ఈ వేదికపై ప్రసంగించనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 20న ఉదయం 9:30 గంటలకు సుందర్ పిచాయ్ తన కీలక ప్రసంగాన్ని ప్రారంభించనున్నారు, దీనిపై టెక్ ప్రపంచంలో భారీ అంచనాలు  ఉన్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement