న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో ప్రదర్శించిన ఒక రోబో డాగ్ విషయమై వివాదం తలెత్తింది. ఉత్తరప్రదేశ్కి చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రతినిధులు ప్రదర్శించిన ఆ రోబో డాగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చైనాకు చెందిన యూనిట్రీ (Unitree) సంస్థ తయారు చేసిన రోబోను తామే తయారు చేశామని యూనివర్సిటీ ప్రతినిధులు పేర్కొనడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీ తీరును తప్పుబడుతూ పలువురు ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ వివాదానికి ప్రధాన కారణం యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నేహా సింగ్ చేసిన వ్యాఖ్యలేనని తెలుస్తోంది. ఈ రోబో పేరు ‘ఓరియన్’ (Orion) అని, దీనిని గల్గోటియాస్ యూనివర్సిటీలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రూపొందించిందని నేహా సింగ్ ఒక వీడియోలో పేర్కొన్నారు. ఇది నిఘా, పర్యవేక్షణ పనులను సమర్థవంతంగా చేయగలదని, క్యాంపస్ అంతటా స్వేచ్ఛగా తిరుగుతుందని ఆమె వివరించారు. అయితే, వీడియో చూసిన నెటిజన్లు అది చైనా కంపెనీ యూనిట్రీకి చెందిన రోబోగా గుర్తించి, యూనివర్శిటీ సొంతంగా తయారు చేసిందన్న వాదనను తప్పుబడుతున్నారు.
This has been developed by the Centre of excellence at Galgotiyas University.
“Also we are the first private university that has invested around 350 crores in Artificial Intelligence”. 🧘 https://t.co/NJfDzL7lG2 pic.twitter.com/TMqfSB6K0v— Harsh Kumar (@itsmeharsh_09) February 17, 2026
సోషల్ మీడియాలో చైనా రోబో డాగ్ విషయమై తీవ్ర వ్యతిరేకత రావడంతో గల్గోటియాస్ యూనివర్సిటీ ఎట్టకేలకు దీనిపై స్పష్టతనిచ్చింది. ఈ రోబోను తాము తయారు చేయలేదని, అలాగే తాము రూపొందించినట్లు ఎక్కడా చెప్పలేదని యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మేము ఈ రోబోను తయారు చేయలేదు. అయితే భవిష్యత్తులో భారత్లోనే ఇలాంటి సాంకేతికతను రూపొందించేలా మా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం’ అని యూనివర్సిటీ స్పష్టం చేసింది. విద్యార్థులకు అత్యాధునిక సాంకేతికతపై అవగాహన కల్పించేందుకే చైనా, సింగపూర్, అమెరికా వంటి దేశాల నుండి పరికరాలను తెప్పిస్తున్నట్లు వెల్లడించింది.
చైనాకు చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ ‘యూనిట్రీ’ ఈ క్వాడ్రపెడ్ (నాలుగు కాళ్ల) రోబోలను తయారు చేస్తుంది. జంతువుల కదలికలను పోలి ఉండే ఈ రోబోలు అడ్డంకులను అధిగమించడంలో, వివిధ తనిఖీల్లో వినోద రంగంలో ఉపయోగపడుతున్నాయి. బోస్టన్ డైనమిక్స్ వంటి సంస్థల రోబోలతో పోలిస్తే, యూనిట్రీ రోబోలు తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండటం విశేషం.
ఇది కూడా చదవండి: ‘నేషనల్ ఏఐ ప్లాన్’తో దూకుడు..


