ఢిల్లీ: పలు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. నాలుగు రాష్ట్రాలు, ఒకే కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు మార్చి మధ్యలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు మంగళవారం ఈ మేరకు వెల్లడించాయి. కీలకమైన పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో పాటు కేరళ, అస్సాం అసెంబ్లీల గడువు మేలో, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ గడువు జూన్లో ముగియనున్నాయి.
వాటన్నిటికీ వచ్చే ఏప్రిల్లోనే ఎన్నికలు జరపాలని ఈసీ భావిస్తోంది. ఇందుకు సంబంధించి మార్చిలో షెడ్యూల్ విడుదల చేస్తామని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల సన్నద్ధతను అంచనా వేయడంతో పాటు ముందస్తు ఏర్పాట్ల నిమిత్తం ఈసీ బృందాలు ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాయి. సర్ ప్రక్రియ అనంతరం అస్సాం, పుదుచ్చేరిల్లో తుది ఓటర్ల జాబితాను ఈసీ ఇప్పటికే విడుదల చేసింది.
తమిళనాడులో బుధవారం, కేరళలో ఫిబ్రవరి 21న, కీలకమైన పశి్చమబెంగాల్లో 28న ఓటర్ల జాబితాలు వెలువడనున్నాయి. 2021లో పశి్చమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఏకంగా 8 విడతల్లో జరిగాయి. ఆ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విడతల్లో పోలింగ్ జరిగిన ఎన్నికలుగా అవి రికార్డులకెక్కాయి! ఇక తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో, తీవ్రవాద ప్రభావిత అస్సాంలో 2 విడతల్లో పోలింగ్ జరిగింది.
అస్సాంలో ఈసీ పర్యటన
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్కుమార్, కమిషనర్లు సుఖ్బీర్సింగ్ సంధు, వివేక్ జోషితో కూడిన ఈసీ బృందం మంగళవారం రెండో రోజు కూడా అస్సాంలో పర్యటించింది. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించింది.


