నిప్పులు చెరిగిన షమీ.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్‌! | Ranji Trophy Semifinal BEN Vs JK Day 3, Shami Picks 8 Wickets Fans Reacts, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

నిప్పులు చెరిగిన షమీ.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్‌!

Feb 17 2026 12:12 PM | Updated on Feb 17 2026 12:34 PM

Ranji Trophy Semifinal BEN vs JK Day 3 Shami Picks 8 Wickets Fans Reacts

టీమిండియా వెటరన్‌ పేసర్‌, బెంగాల్‌ బౌలింగ్‌ స్టార్‌ మొహమ్మద్‌ షమీ మరోసారి సత్తా చాటాడు. రంజీ ట్రోఫీ 2025-26 రెండో సెమీస్‌ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో చెలరేగాడు. కళ్యాణిలోని బెంగాల్‌ క్రికెట్‌ అకాడమీ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా జమ్మూ కశ్మీర్‌- బెంగాల్‌ మధ్య ఆదివారం మ్యాచ్‌ మొదలైంది.

328 పరుగులకు ఆలౌట్‌
టాస్‌ గెలిచిన జమ్మూ కశ్మీర్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. బెంగాల్‌ బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ (49), షాబాజ్‌ అహ్మద్‌ (42) రాణించగా.. సుదీప్‌ కుమార్‌ ఘరామి (146) శతక్కొట్టాడు. మిగిలిన వారిలో సుమంత గుప్తా 39 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ 97.1 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌట్‌ అయింది.

జమ్మూ కశ్మీర్‌ బౌలర్లలో స్టార్‌ పేసర్‌ అకీబ్‌ నబీ (Auqib Nabi) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. సునిల్‌ కుమార్‌ (Sunil Kumar) మూడు, యుధ్‌వీర్‌ సింగ్‌ చరఖ్‌, అబిద్‌ ముస్తాక్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం జమ్మూ కశ్మీర్‌ మొదటి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టగా.. మంగళవారం నాటి మూడో రోజు ఆటలో 302 పరుగులకు ఆలౌట్‌ అయింది.

ఆది నుంచే నిప్పులు చెరిగిన షమీ
ఆది నుంచే నిప్పులు చెరిగిన బెంగాల్‌ పేసర్‌ షమీ.. ఓపెనర్లు శుభం ఖజూరియా (3), యావర్‌ హసన్‌ (2)లను వచ్చీరాగానే వెనక్కి పంపాడు. అదే విధంగా అబ్దుల్‌ సమద్‌ (82), కన్హయ్య వాధవాన్‌ (29) రూపంలో రెండు కీలక వికెట్లు తీశాడు.

అంతేకాదు.. అబిద్‌ ముస్తాక్‌ (27), వన్షజ్‌ శర్మ (3), ఆకిబ్‌ నబీ (42), యుధ్‌వీర్‌ సింగ్‌ చరఖ్‌ (33)ల వికెట్లు కూడా షమీ తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఎనిమిది వికెట్లు కూల్చి సత్తా చాటాడు. మిగిలిన బెంగాల్‌ బౌలర్లలో టీమిండియా స్టార్‌ ముకేశ్‌ కుమార్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. షమీ విజృంభణ కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ 26 పరుగుల ఆధిక్యం సంపాదించగలిగింది.

ఆడినా లాభమేంటి?
గతేడాది మార్చిలో చివరగా టీమిండియా తరఫున వన్డే బరిలో దిగాడు షమీ. అంతకు ముందు నెలలో టీ20లు ఆడాడు. అయితే, అతడు భారత్‌ తరఫున టెస్టులు ఆడి దాదాపు మూడేళ్లు కావస్తోంది.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో సత్తా చాటినా టీమిండియా సెలక్టర్లు అతడిని పట్టించుకోవడం లేదు. తాజా రంజీ సీజన్‌లోనూ ఆకట్టుకున్నా అతడికి పిలుపునివ్వలేదు. ఈ విషయం గురించి చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాట్లాడుతూ.. షమీకి మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ లేదని వ్యాఖ్యానించగా.. తాను ఆటతోనే సమాధానం చెబుతున్నానని షమీ కౌంటర్‌ ఇచ్చాడు. అందుకు తగ్గట్టుగానే తాజా మ్యాచ్‌లోనూ సత్తా చాటి మరోసారి టీమిండియా సెలక్ట ర్లకు గట్టి వార్నింగే ఇచ్చాడు.

చదవండి: గంభీర్‌కు గోల్డెన్‌ ఆఫర్‌!.. హెడ్‌కోచ్‌ పదవికి గుడ్‌బై?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement