విశాఖ : సముద్ర తీరాన సాయంత్రపు సువర్ణ కాంతుల్లో ధైర్యం, శౌర్యం, సంప్రదాయం ఒకే వేదికపై సాక్షాత్కరించాయి.
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ నేపథ్యంలో బీచ్రోడ్డులో నిర్వహించిన ముందస్తు సన్నాహక కార్యక్రమం నగరాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
ఆకాశాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్లిన యుద్ధవిమానాల ఘోష, సముద్రపు అలలపై ప్రతిధ్వనించిన దేశభక్తి స్వరాలు అక్కడికి చేరుకున్న ప్రతి హృదయాన్ని కదిలించాయి.
భారత నావికాదళం, కోస్ట్గార్డుకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు సమన్వయంతో చేసిన విన్యాసాలు వేగం, క్రమశిక్షణ, కచ్చితత్వానికి ప్రతీకలుగా నిలిచాయి.
చేతక్ హెలికాప్టర్ నుంచి మెరైన్ కమాండోలు సముద్రంలోకి దిగిన తీరు, అక్కడి నుంచి మెరుపువేగంతో నేలమీదకు చేరిన యుద్ధ విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
వివిధ దేశాలకు చెందిన నావికాదళ సిబ్బంది సమన్వయంతో కవాతు చేస్తూ అంతర్జాతీయ సౌహార్దాన్ని చాటారు.


