నితీశ్‌ కుమార్‌ రెడ్డి వీరోచిత పోరాటం | Ranji Trophy: Bengal complete resounding innings win despite Nitish Reddy 90 | Sakshi
Sakshi News home page

నితీశ్‌ కుమార్‌ రెడ్డి వీరోచిత పోరాటం

Feb 10 2026 8:49 PM | Updated on Feb 10 2026 8:49 PM

Ranji Trophy: Bengal complete resounding innings win despite Nitish Reddy 90

బెంగాల్‌తో జరిగిన రంజీ ట్రోఫీ 2026 క్వార్టర్‌ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు ఇన్నింగ్స్‌ 90 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆంధ్ర ఓడినా, ఇన్నింగ్స్‌ పరాజయాన్ని గట్టెక్కించేందుకు నితీశ్‌ కుమార్‌ రెడ్డి చేసిన పోరాటం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో నితీశ్‌ 144 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసి ఔటయ్యాడు. 

టెయిలెండర్లు కేఎస్‌ నరసింహ రాజు (25), త్రిపురణ విజయ్‌ (46)తో కలిసి నితీశ్‌ చూపిన పోరాటపటిమ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. నితీశ్‌ ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లోనూ (33) ఓ మోస్తరు పరుగులు చేశాడు. అలాగే ఓ వికెట్‌ కూడా తీశాడు.

రెండు ఇన్నింగ్స్‌ల్లో నితీశ్‌ మినహా ఎవ్వరూ రాణించకపోవడంతో ఆంధ్రకు ఇన్నింగ్స్‌ పరాభవం తప్పలేదు. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలుపుతో బెంగాల్‌ సెమీస్‌కు చేరింది. ఫిబ్రవరి 15న మొదలయ్యే రెండో సెమీఫైనల్స్‌లో ఈ జట్టు జమ్మూ అండ్‌ కశ్మీర్‌తో తలపడుతుంది. అదే రోజు మొదలయ్యే తొలి సెమీస్‌లో ఉత్తరాఖండ్‌-కర్ణాటక పోటీపడతాయి.

పాపం.. ఒక్క పరుగు తేడాతో ట్రిపుల్‌ మిసయ్యాడు
ఈ మ్యాచ్‌లో బెంగాల్‌ యువ బ్యాటర్‌ సుదిప్‌ కుమార్‌ ఘరామీ తృటిలో ట్రిపుల్‌ సెంచరీ మిస్‌ అయ్యాడు. కష్టాల్లో (43-3) ఉన్న జట్టును గట్టెక్కించి, 299 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు.

రంజీ ట్రోఫీ చరిత్రలో ఓ ఆటగాడు 299 పరుగుల వద్ద ఔట్‌ కావడం ఇదే మొదటిసారి. 1988-89 సీజన్‌లో మహారాష్ట్ర ఆటగాడు శంతాను సుగ్వేకర్‌ 299 పరుగుల వద్ద అజేయంగా మిగిలిపోయాడు. యావత్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో ఘరామీతో సహా ఇప్పటివరకు కేవలం ముగ్గురే 299 పరుగుల వద్ద ఔటయ్యారు.

ఈ ఇన్నింగ్స్‌లో ఘరామీ 596 బంతుల్లో 31 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 299 పరుగులు చేశాడు. వనడౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన అతను.. ఆరో వికెట్‌కు సుమంత్‌ గుప్తాతో (81) 165 పరుగులు, ఏడో వికెట్‌కు హబీబ్‌ గాంధీతో (95) 221 పరుగుల భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

ఘరామీ బ్యాట్‌ నుంచి జాలువారిన ఈ మారథాన్‌ ఇన్నింగ్స్‌ ఆధునిక రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత సుదీర్ఘ ఇన్నింగ్స్‌ల్లో (12 గంటలకు పైబడి) ఒకటిగా నిలిచిపోతుంది. ఈ హీరోయిక్‌ ఇన్నింగ్స్‌తో బెంగాల్‌ను ఒంటిచేత్తో గట్టెక్కించిన ఘరామీ, ఒక్క పరుగు తేడాతో అరుదైన ట్రిపుల్‌ సెంచరీ మిస్సై నిరాశగా పెవిలియన్‌ బాట పట్టాడు.

ఘరామీ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌ కారణంగా బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 629 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసి ఆలౌటైంది. ఆఖర్లో టీమిండియా ఆటగాడు, బెంగాల్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ (53) కూడా మెరుపు అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు.

రాణించిన భుయ్‌
దీనికి ముందు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో రికీ భుయ్‌ (83) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. శ్రీకర్‌ భరత్‌ (47), షేక్‌ రషీద్‌ (46), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (33) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు.

టీమిండియా బౌలర్‌, బెంగాల్‌ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ ఐదు వికెట్లతో విజృంభించగా.. మరో టీమిండియా బౌలర్‌, బెంగాల్‌ పేసర్‌ ఆకాశ్‌దీప్‌ 4 వికెట్లతో సత్తా చాటాడు. షమీ సైతం ఓ వికెట్‌ పడగొట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement