టీ20 ప్రపంచకప్కు సహా అతిథ్యమిస్తున్న శ్రీలంకకు అతి భారీ షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు వనిందు హసరంగ హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా మెగా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఐర్లాండ్ మ్యాచ్లో హసరంగ గాయంతో బాధపడుతూనే బౌలింగ్ చేశాడు. అయితే మ్యాచ్ అయిపోయాక తీసిన ఎంఆర్ఐ స్కానింగ్లో హసరంగ ఎడమ కాలి హ్యామ్స్ట్రింగ్లో తీవ్రమైన చీలక ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.
దీంతో అతను ఉన్నపళంగా ప్రపంచకప్ నుంచి వైదొలిగాడు. ఐర్లాండ్ మ్యాచ్లో హసరంగ గాయంతో బాధపడుతూనే తన కోటా 4 ఓవర్లు పూర్తి చేసి 3 వికెట్లు (25 పరుగులిచ్చి) తీశాడు. ఈ ప్రదర్శన కారణంగానే ఆ మ్యాచ్లో శ్రీలంక విజయం సాధించింది. హసరంగ విషయాన్ని లంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
అతనికి ప్రత్యామ్నాయంగా 31 ఏళ్ల లెగ్ స్పిన్నర్ దుషన్ హేమంతను ఎంపిక చేసింది. హేమంత బౌలింగ్ శైలి హసరంగను పోలి ఉంటుంది. హేమంత శ్రీలంక ఆడబోయే తదుపరి మ్యాచ్లో బరిలోకి దిగవచ్చు. శ్రీలంక ఫిబ్రవరి 12న జరిగే మ్యాచ్లో ఒమన్తో తలపడనుంది.
హసరంగ స్థానాన్ని హేమంత భర్తీ చేసినా, ఆ స్థాయి ప్రదర్శనలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. హసరంగ లేని లోటు శ్రీలంకకు సూపర్-8 దశలో స్పష్టంగా కనిపించవచ్చు. గత కొంతకాలంగా హసరంగ తరుచూ గాయాల బారిన పడుతూ కీలక సమయాల్లో జట్టుకు అందుబాటులో ఉండలేకపోతున్నాడు.
హసరంగ వైవిధ్యభరితమైన బౌలర్గానే కాకుండా బ్యాటింగ్లోనూ మెరుపులు మెరిపించగల సమర్దుడు. హసరంగ స్థాయి ఆటగాడిని శ్రీలంక త్వరలో తయారు చేసుకోలేకపోతే, చాలా నష్టపోవాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్లో శ్రీలంక.. ఐర్లాండ్, ఒమన్, ఆస్ట్రేలియా, జింబాబ్వే జట్లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. ఈ జట్టు తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై ఘన విజయం సాధించి, సూపర్-8 దిశగా సాగుతోంది. గ్రూప్ దశలో శ్రీలంకకు ఎలాంటి ఇబ్బందులు (ఆస్ట్రేలియా మినహా) ఎదురుకాకపోయినా, సూపర్-8లో మాత్రం ఇబ్బందిపడాల్సి ఉంటుంది.


