పావురాల రెట్టలతో పరువు పోయినా.. ఓ శుభవార్త | BWF revamps World Tour: India Open stays but Syed Modi International To | Sakshi
Sakshi News home page

పావురాల రెట్టలతో పరువు పోయినా.. ఓ శుభవార్త

Feb 10 2026 2:18 PM | Updated on Feb 10 2026 2:24 PM

BWF revamps World Tour: India Open stays but Syed Modi International To

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు

అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో టోర్నీల నిర్వహణకు సంబంధించి బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ (BWF) పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం పలు టోర్నమెంట్‌లో స్థాయిని తగ్గించడంతో పాటు మరికొన్ని టోర్నీలను అదనంగా చేర్చారు.

వరల్డ్‌ టూర్‌ టోర్నమెంట్‌ల నిర్వహణ కోసం గత ఏడాది 32 దేశాలు దరఖాస్తు చేయగా, ఈసారి డిమాండ్‌ మరింతగా పెరిగి 56 దేశాలు మ్యాచ్‌ల నిర్వహణకు ఆసక్తి చూపించాయి. 

అస్తవ్యస్త నిర్వహణ పట్ల విమర్శలు.. అయినా ఓ శుభవార్త
దాంతో భిన్న దేశాల్లో ఆటకు గుర్తింపు తీసుకురావడంలో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో మార్పులు చేయాల్సి వచ్చిందని బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటించింది. దీని ప్రకారం భారత్‌ ఎప్పటిలాగే కచ్చితంగా నిర్వహించే ఏడాదికి నాలుగు టోర్నీల సంఖ్య తగ్గి రెండుకు పరిమితం అయింది.

ఇక 2023లో సూపర్‌–750 టోర్నీగా గుర్తింపు తెచ్చుకున్న ఇండియా ఓపెన్‌ (India Open Retains)అదే స్థాయిలో కొనసాగుతుంది. ఇటీవల ఈ టోర్నీ అస్తవ్యస్త నిర్వహణ పట్ల పలు విమర్శలు వచ్చిన... అదృష్టవశాత్తూ బీడబ్ల్యూఎఫ్‌ నుంచి ఎలాంటి చర్యలూ ఎదురు కాలేదు. 

సయ్యద్‌ మోడీనే స్థాయి తగ్గించి
అయితే మరో టోర్నీ సయ్యద్‌ మోడీ సూపర్‌–300 స్థాయి మాత్రం మారింది. లక్నోలో ప్రతీ ఏటా భారత మాజీ షట్లర్‌ సయ్యద్‌ మోడీ సంస్మరణార్ధం నిర్వహించే ఈ టోర్నీని ఇప్పుడు సూపర్‌–100కు పరిమితం చేశారు.

ఇండియా ఓపెన్‌ కాకుండా తమకు సూపర్‌–100 మాత్రమే దక్కే అవకాశం ఉండటంతో దేశంలో చాలా ఏళ్లుగా జరుగుతున్న టోర్నీ కాబట్టి పేరు మార్చకుండా సయ్యద్‌ మోడీనే స్థాయి తగ్గించి కొనసాగించాలని నిర్ణయించుకున్న భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) స్పష్టం చేసింది. ఇప్పటి వరకు భారత్‌లో కొనసాగుతున్న మరో రెండు సూపర్‌–100 టోర్నీలు (గువహటి, ఒడిషా)లను సర్క్యూట్‌నుంచి బీడబ్ల్యూఎఫ్‌ పూర్తిగా తొలగించింది.  

మొత్తం 36 టోర్నీలు... 
బీడబ్లూఎఫ్‌ కొత్త క్యాలెండర్‌ ప్రకారం ఒక ఏడాదిలో టోర్నీలను ఆరు స్థాయిల్లో విభజించారు. బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ అన్నింటికంటే అగ్రభాగాన ఉంటుంది. ఆ తర్వాత 5 సూపర్‌–1000, 5 సూపర్‌–750, 9 సూపర్‌–500, 8 సూపర్‌–300 టోర్నీలు జరుగుతాయి. తొలి సారి సూపర్‌–100 టోర్నీలను కూడా ప్రధాన టూర్‌ సర్క్యూట్‌లో చేర్చారు. ఏడాదికి 8 సూపర్‌–100 టోర్నమెంట్‌లు నిర్వహిస్తారు.

గతంలో సూపర్‌–1000 టోర్నీలు నాలుగు మాత్రమే ఉండగా ఇప్పుడు వాటిని ఐదుకు పెంచారు. అన్ని టోర్నీలు కలిపి మొత్తం ప్రైజ్‌మనీని 26.9 మిలియన్‌ డాలర్లకు (సుమారు రూ. 245 కోట్లు) పెంచుతున్నట్లు కూడా బీడబ్ల్యూఎఫ్‌ ప్రటించింది. ఫార్మాట్‌లో కూడా స్వల్ప మార్పు చోటు చేసుకుంది.

లీగ్‌ కం నాకౌట్‌ పద్ధతిలో
ఇప్పటి వరకు తొలి మ్యాచ్‌నుంచి ‘నాకౌట్‌’ కాగా...ఇప్పుడు దీనిని మార్చి లీగ్‌ కం నాకౌట్‌ పద్ధతిలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఒక్కో ప్లేయర్‌ ఒక టోర్నీలో కనీసం రెండు మ్యాచ్‌లైనా ఆడే అవకాశం కల్పించాలనేదే అందుకు కారణం. టీమ్‌ ఈవెంట్లు సుదిర్మన్‌ కప్, థామస్‌ కప్, ఉబెర్‌ కప్‌లలో కూడా జట్ల సంఖ్యను పెంచనున్నారు. 

మరింత ఎక్కువ మందికి బ్యాడ్మింటన్‌కు చేరువ చేసే క్రమంలో భాగంగా సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లను టీవీల్లో ప్రసారం చేయాలని ఫెడరేషన్‌ నిర్ణయించింది. దీని ప్రకారం ఏడాదికి కనీసం 3 వేల మ్యాచ్‌లు ప్రసారం అయ్యేలా ఏర్పాట్లు చేస్తారు.  

పావురాల రెట్టలు
న్యూఢిల్లీలో ఇండియా ఓపెన్‌ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో వసతులు అధమంగా ఉన్నాయని.. ప్రాక్టీస్‌ కోర్టులన్నీ దుమ్ముధూళీతోనే నిండిపోయాయని డెన్మార్క్‌ షట్లర్‌ మియా బ్లిచ్‌ఫీల్డ్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.

బ్లిచ్‌ఫీల్డ్‌ విమర్శలకు మరింత బలం చేకూర్చేలా మ్యాచ్‌లు జరిగే సమయంలో పలుమార్లు కోర్టులో పావురాలు రెట్ట వేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడాశాఖ దిద్దుబాటు చర్యలకు దిగి.. మరోమారు ఇలాంటి పొరపాట్లు, నిర్వహణ వైఫల్యాలు తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని నిర్ణయించింది. 

Advertisement
 
Advertisement
Advertisement