IND vs PAK: థాంక్యూ.. బీసీసీఐ రియాక్షన్‌ వైరల్‌ | BCCI Breaks silence on Pak Agreeing play T20 WC Vs IND Jay Shah Reference | Sakshi
Sakshi News home page

IND vs PAK: థాంక్యూ.. బీసీసీఐ రియాక్షన్‌ వైరల్‌

Feb 10 2026 1:41 PM | Updated on Feb 10 2026 3:29 PM

BCCI Breaks silence on Pak Agreeing play T20 WC Vs IND Jay Shah Reference

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ యథావిధిగా జరుగనుంది. కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న దాయాదులు ముఖాముఖి పోరులో తలపడేందుకు పాక్‌ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) జోక్యంతో టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్‌ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

థాంక్యూ చెబుతున్నా
ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) స్పందించిన తీరు వైరల్‌గా మారింది. బీసీసీఐ తరఫున ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘ఐసీసీ చైర్మన్‌ (జై షా), ఆఫీస్‌ బేరర్లకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం. ఈ సమస్యకు సరైన పరిష్కారం వెదికినందుకు బీసీసీఐ తరఫున నేను ఐసీసీకి థాంక్యూ చెబుతున్నా.

అతిపెద్ద విజయం ఇది
పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డులతో చర్చించి.. అన్ని వర్గాల వాదనలు విని ఐసీసీ సమస్యను పరిష్కరించింది. క్రికెట్‌ మనుగడలో ఇది అత్యంత కీలక నిర్ణయం. ఆట కొనసాగుతూనే ఉండాలి. ప్రపంచకప్‌ విజయవంతం కావాలి. ఐసీసీ సాధించిన అతిపెద్ద విజయం ఇది.

బంగ్లాదేశ్‌ బోర్డు కూడా ఐసీసీని ప్రశంసించింది. ప్రతి ఒక్కరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతిమంగా క్రికెట్‌ ఒక్కటే అందరికీ ముఖ్యమైనది. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌ సజావుగా సాగాలి’’ అని రాజీవ్‌ శుక్లా ఐసీసీకి ధన్యవాదాలు తెలిపారు.

భద్రతా కారణాలు చూపుతూ బంగ్లా
కాగా వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న మొదలైన ఈ టోర్నీ నుంచి భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్‌ తప్పుకొంది. భారత్‌లో తాము మ్యాచ్‌లు ఆడలేమంటూ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో తమను ఆడించాలన్న అభ్యర్థనను తిరస్కరించడంతో టోర్నీ నుంచి వైదొలిగింది.

మధ్యలో ఎంటరైన పాక్‌
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్తాన్‌ సైతం తాము టోర్నీ ఆడమని తొలుత సంకేతాలు ఇచ్చి.. ఆ తర్వాత మాట మార్చింది. కేవలం టీమిండియాతో మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తామని పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. క్రికెట్‌ ప్రపంచంలో అత్యంత క్రేజ్‌ ఉన్న ఈ మ్యాచ్‌ జరుగకపోతే ఐసీసీకి భారీ ఆర్థిక నష్టం సంభవించే ప్రమాదం ఉంది.

ఈ ప్రభావం బంగ్లా, పాక్‌లతో పాటు అన్ని సభ్య దేశాల మీదా పడుతుంది. ఈ నేపథ్యంలో లాహోర్‌లో పాక్‌, బంగ్లా బోర్డు అధికారులతో చర్చలు జరిపిన ఐసీసీ బృందం.. పాక్‌ భారత్‌తో మ్యాచ్‌ ఆడేలా ఒప్పించింది. ఎప్పటిలాగే ముందు నుంచి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాక్‌.. యూటర్న్‌ తీసుకుని టీమిండియాతో మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైంది.

చదవండి: IND vs PAK: పాక్‌ యూటర్న్‌.. స్పందించిన ఐసీసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement