ఊహాగానాలే నిజమయ్యాయి. టీమిండియాతో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయాన్ని పాకిస్తాన్ మార్చుకుంది. క్రికెట్ స్ఫూర్తిని కొనసాగించే ఉద్దేశంతో తమ జట్టు భారత్తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది.
యూటర్న్ వెనుక గల కారణాలు?
ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీ సోమవారం ధ్రువీకరించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ మీడియా సమావేశం సందర్భంగా నక్వీ ‘బాయ్కాట్’ నిర్ణయాన్ని తాము వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఓ రిపోర్టర్.. యూటర్న్ వెనుక గల కారణాలు, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)తో చర్చల వల్ల పాక్కు ప్రయోజనం చేకూరిందా? అని అడిగాడు.
శుభవార్తలే అందిస్తాం
ఇందుకు బదులుగా.. ‘‘కొన్ని నిమిషాల ముందే మా నిర్ణయం మార్చుకున్నాం’’ అని నక్వీ సమాధానమిచ్చాడు. మరి అయితే శుభవార్త ఉందా? అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. ‘‘మేము ఎల్లప్పుడూ శుభవార్తలే అందిస్తాం కదా!.. బంగ్లాదేశ్ ఈ విషయంలో ఏం చెప్పిందో అందరూ చూశారు కదా
పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడాలని బంగ్లాదేశ్ అభ్యర్థించింది. వాళ్ల సమస్యలు తొలగిపోయాయి. అందుకే వాళ్లు మమ్మల్ని భారత్తో మ్యాచ్ ఆడమని చెప్పారు’’ అని నక్వీ పేర్కొన్నాడు.
మన కోసం ఏమీ అడగలేదా?
అయితే, మన (పాకిస్తాన్) సొంత ప్రయోజనాల కోసం వారు ఈ విషయంలో అంగీకరించేలా చేశామా? అని రిపోర్టర్ అడుగగా.. ‘‘కేవలం బంగ్లాదేశ్కు మద్దతుగా మాత్రమే మనం నిలబడ్డాం. ఇది వాళ్ల సొంత విషయం. మనకోసం మనం ఏమీ అడగలేదు’’ అని నక్వీ నీళ్లు నమిలాడు.
కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. భారత్లో తమకు భద్రత లేదంటూ ఆరోపించిన బంగ్లాదేశ్.. తమ వేదికను కూడా లంకకు మార్చాలని ఐసీసీని కోరింది.
అయితే, బంగ్లాదేశ్ చెప్పినదాంట్లో నిజం లేదని తేల్చిన ఐసీసీ.. ఇందుకు నిరాకరించింది. నిర్ణయం మార్చుకోవాల్సిందిగా గడువు ఇచ్చింది. కానీ బంగ్లా పట్టువీడలేదు. దీంతో ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించింది ఐసీసీ.
పాకిస్తాన్ జోక్యం..
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటూ తొలుత తాము బంగ్లాకు మద్దతుగా టోర్నీని బహిష్కరిస్తామని లీకులు ఇచ్చి.. ఆ తర్వాత కేవలం భారత్తో మాత్రమే మ్యాచ్ ఆడమని మాట మార్చింది. ఒకవేళ భారత్- పాక్ మ్యాచ్ రద్దయితే ఐసీసీతో పాటు సభ్య దేశాలన్నీ ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది.
రంగంలోకి లంక బోర్డు
ఈ క్రమంలో శ్రీలంక బోర్డు సైతం పాక్ నిర్ణయం పట్ల ఘాటుగా స్పందించింది. గతంలో పాక్ పర్యటనలో తమపై ఉగ్రదాడి జరిగినా.. ఇంకా ఆ దేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ తమ జట్టు అక్కడ పర్యటించేలా చేస్తున్నామని పేర్కొంది. కానీ ఇప్పుడు తమ దేశంలో భారత్తో ఆడే మ్యాచ్ను పాక్ బహిష్కరిస్తే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినందున భారీగా నష్టపోవాల్సి ఉంటుందని పాక్కు లేఖ రాసింది.
బంగ్లాకు రిలీఫ్
యూఏఈ సైతం ఇదే తరహాలో పీసీబీకి లేఖ రాయగా.. బంగ్లాదేశ్ సైతం భారత్తో మ్యాచ్ ఆడాలని కోరింది. ఈ నేపథ్యంలో ఐసీసీ బృందం లాహోర్ వెళ్లి పీసీబీ చైర్మన్తో చర్చించగా.. బంగ్లాదేశ్కు ఊరట లభించింది. టోర్నీ నుంచి తప్పుకొన్నందుకు ఎలాంటి ఆంక్షలు ఉండవని ఐసీసీ పేర్కొంది.
ఇదిలా ఉంటే.. పాక్ బంగ్లాదేశ్ను అడ్డుపెట్టుకుని భారత్తో ద్వైపాక్షిక సిరీస్ల పునరుద్ధరణ, తమ ఆటగాళ్లతో భారత జట్టు కరచాలనం చేయడం.. తదితర షరతులు పెట్టినట్లు తొలుత వార్తలు వచ్చాయి.
ఐసీసీ ఇందుకు నిరాకరించి కేవలం బంగ్లా విషయంలో మాత్రమే సానుకూలంగా స్పందించిందని తెలిసింది. ఈ విషయం నెట్టింట వైరల్గా మారగా.. నక్వీ తమ కోసం ఐసీసీని ఏమీ అడగలేదని ప్రత్యేకంగా నొక్కివక్కాణించడం గమనార్హం. కాగా షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్- పాక్ తలపడటం ఖాయమైంది.
చదవండి: Bangladesh Cricket: ఐసీసీ మీటింగ్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్కి ఉపశమనం
Mohsin Naqvi Statement on India Vs Pakistan match #PAKvIND #Pakistan pic.twitter.com/Mm523Uldb3
— Ravish Bisht (@ravishbofficial) February 9, 2026


