భారత్-శ్రీలంక వేదికగా ప్రస్తుతం టీ20 ప్రస్తుతం జరుగుతోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా.. మన దేశానికి రాకూడదని బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకోవడంతో.. బంగ్లా జట్టు ప్రపంచకప్ నుంచి తప్పుకొంది. దీని స్థానంలో స్కాట్లాండ్ జట్టు టోర్నీలో అడుగుపెట్టింది. మరోవైపు 15వ తేదీన భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఐసీసీ మీటింగ్ జరగ్గా.. ఇందులో బంగ్లాదేశ్ జట్టుకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటన విడుదల చేసింది.
బంగ్లాదేశ్ జట్టు ప్రపంచకప్లో పాల్గొనకపోవడంపై నిరాశ వ్యక్తం చేసిన ఐసీసీ.. ప్రస్తుత అంశానికి సంబంధించి బంగ్లా బోర్డుపై ఎలాంటి ఆర్థిక, క్రీడాపరమైన, పరిపాలానా జరిమానా విధించబోమని ధ్రువీకరించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం.. ఈ అంశాన్ని వివాద పరిష్కార కమిటీకి తీసుకెళ్లే హక్కు.. బంగ్లా బోర్డుకి ఉందని స్పష్టం చేసింది. దీని వల్ల ఆ హక్కుకి ఎలాంటి భంగం కలగదని, అది యధాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. అలానే బంగ్లాదేశ్లో 2031 పురుషుల ప్రపంచకప్ జరగడానికి ముందు ఓ ఐసీసీ ఈవెంట్కి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తన ప్రకటనలో తెలియజేసింది.
ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 15న కొలంబోలో టీమిండియాతో జరిగే ప్రపంచకప్ మ్యాచ్లో పాల్గొనాలని పాక్ జట్టుని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. భారతదేశం బయట తమ మ్యాచ్లని నిర్వహించాలనే అభ్యర్థనని ఐసీసీ తిరస్కరించిన తర్వాత బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకొంది. ఈ సమయంలో తమకు మద్ధతుగా నిలిచిన పాకిస్తాన్కి బంగ్లా బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం కృతజ్ఞతలు చెప్పారు.


