సాక్షి, బాన్సువాడ: మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. అధికార కాంగ్రెస్పై ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదు.. బీజేపీ మనిషి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జుక్కల్ నియోజకవర్గం బాన్సువాడ(బిచ్కుంద మున్సిపాలిటీ) మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉచిత బస్సు పేరిట మహిళలను మోసం చేశారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశాడు రేవంత్. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది, ఒక్క హామీ అయినా నేరవేరిందా?. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది.
ఒక ఆంబోతు రెండు దున్నపోతులంటూ పోచారం బండ కట్టుకొని బాయిలో దూకలే అంటూ ఎద్దవా చేశారు. పోచారానికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి. కాంగ్రెస్ నేతలందరూ స్టువర్టుపురం దొంగలే. కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ బంగారు తెలంగాణ అయింది. ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు.


