కరీంనగర్: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేసిన బండి సంజయ్.. కబ్జాదారుల అంతు చూస్తామన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ బాధ్యత తనేదనంటూ హామీ ఇచ్చారు. ‘మీ ఆస్తులకు రక్షణ బాధ్యత నాది. కబ్జాదారుల అంతు చూస్తా. చచ్చి బతికి మీకు సేవ చేసేందుకే వచ్చిన. ఈ జన్మాంతం మీ సేవకుడినే. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం. కరీంనగర్లో మేయర్ పీఠం దక్కించుకోబోతున్నాం. బీఆర్ఎస్ నాలుగు సీట్లకే పరిమిత కాబోతుంది. కాంగ్రెస్-ఎంఐఎం కలిసినా 20 సీట్లలోపే వస్తాయి’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.
కొందరు సర్వేల పేరిట గొప్పలు చెప్పుకుంటున్నారు
పలువురు నేతలు సర్వేల పేరిట గొప్పలు చెప్పుకుంటున్నారని మంత్రి శ్రీధర్బాబు విమర్శించారు. కరీంనగర్ జిల్లాలో అల్గనూరులో 8వ డివిజన్లో మంత్రి శ్రీధర్బాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా శ్రీధర్బాబు ప్రసంగిస్తూ.. ‘ 40 స్థానాలకు పైగా సీట్లు గెలుచుకుని కరీంనగర్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగురవేయబోతున్నాం. కొందరు సర్వేల పేరిట వారికి వారే గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ, పేద ప్రజల్లో చిరునవ్వు చూడాలనుకునే పార్టీ కాంగ్రెస్. అందుకే ప్రజలన్నీ గమనిస్తారు.. కాంగ్రెస్ను గెలిపిస్తారు’ అని ధీమా వ్యక్తం చేశారు.


