తీరని కోరికలపై అమ్మకు లేఖలు
హనుమకొండ కల్చరల్: మేడారం సమ్మక్క–సారలమ్మల మహాజాతర ముగిసినా, భక్తుల ఆరాధన మాత్రం హుండీల రూపంలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. హనుమకొండలోని టీటీడీ కల్యాణమండపంలో కొనసాగుతున్న హుండీల లెక్కింపులో భక్తుల నిష్కల్మషమైన నమ్మకాలు, చిత్రవిచిత్రమైన కోరికలు లేఖల రూపంలో బయటపడుతున్నాయి.
ఒక భక్తుడు రూ.1116 హుండీలో వేసి, తన కూతురికి పెళ్లి కావాలని కోరుకున్నాడు. ‘వచ్చే జాతర నాటికి మనవడు పుడితే.. భార్య, కూతురు, అల్లుడు, మనవడితో కలిసి వచ్చి మొక్కులు తీర్చుకుంటా తల్లీ’.. అని ఆ లేఖలో పేర్కొన్నాడు. ‘మా ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవాలి’.. అని ఒక ప్రేమజంట విన్నవించుకోగా.. రూ. 70 లక్షల విలువైన భూ వివాదం తనకే అనుకూలంగా పరిష్కారం కావాలని మరో భక్తుడు లేఖ రాశాడు. కోరిక నెరవేరితే నిలువెత్తు బంగారం (బెల్లం), కోడి, మేకతో మొక్కులు చెల్లిస్తామని మొక్కుకున్నాడు.
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తమను రెగ్యులరైజ్ చేసేలా ఆశీర్వదించాలంటూ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు రాసిన లేఖ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరికొందరు భక్తులు విదేశాల్లో అవకాశాలు రావాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని తమ కోరికలను అమ్మవార్ల ముందు ఉంచుకున్నారు. తన కొడుకు బారి నుంచి కాపాడాలని వంద రూపాయల నోటుపై రాసి సమ్మక్క–సారలమ్మలను వేడుకున్నాడో భక్తుడు.


