న్యూఢిల్లీ: బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తన మాజీ అనుచరుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూపై విమర్శలు గుప్పించారు. విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహిస్తున్న సమయంలో ఈ ఇద్దరు నేతలు ఎదురుపడటంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
2024 లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ను వీడి, బీజేపీలో చేరిన బిట్టూను ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. నిరసన తెలుపుతున్న ఎంపీల మధ్య నుండి బిట్టూ వెళ్తుండగా, రాహుల్ గాంధీ ఆయనను చూపిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇదిగోండి.. ఒక ద్రోహి ఇటుగానే వెళ్తున్నారు.. అతని ముఖం చూడండి’ అని ఎద్దేవా చేశారు. అంతటితో ఆగకుండా, బిట్టూ వైపు చేయి చాపి ‘హలో బ్రదర్, నా ద్రోహి మిత్రమా.. కంగారు పడకు, నువ్వు మళ్లీ తిరిగి కాంగ్రెస్లోకే వస్తావు" అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.
రాహుల్ గాంధీ కరచాలనం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, రవనీత్ బిట్టూ తిరస్కరించారు. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బిట్టూ ఆయనను దేశ శత్రువు అని అభివర్ణించారు. కాంగ్రెస్ దేశాన్ని అమ్మేస్తోందని ఆయన ఆరోపించగా, దానికి బదులుగా బీజేపీయే దేశాన్ని విక్రయిస్తోందని కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువురు నేతల మధ్య కొద్దిసేపు వాడీవేడీ చర్చ జరిగింది.
రవనీత్ బిట్టూ-రాహుల్ గాంధీ మధ్య విభేదాలు ఈనాటివి కావు. 2024లో రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో సిక్కుల గురించి చేసిన వ్యాఖ్యలపై బిట్టూ తీవ్రంగా మండిపడ్డారు. అప్పట్లో రాహుల్ను ‘దేశంలోనే నంబర్ వన్ ఉగ్రవాది’ అని బిట్టూ విమర్శించడం పెను దుమారం రేపింది. తాజాగా పార్లమెంట్ వేదికగా జరిగిన ఈ పరిణామం, గత కొంతకాలంగా వీరి మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరాన్ని మరోసారి బహిర్గతం చేసింది.


