ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో హృదయవిదూరకమైన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి భారత్ సిటీలోని ఒక అపార్ట్మెంట్లో ఉంటున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో 9వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను పాఖి (12), ప్రాచి (14), విషిక (16)గా పోలీసులు గుర్తించారు.
ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు చిన్నప్పటి నుండి ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, స్నానం, భోజనం, పాఠశాలకు వెళ్లడం, నిద్రపోవడం లాంటి ప్రతి దైనందిన కార్యకలాపాన్ని కలిసే చేసేవారని చుట్టుపక్కలవారు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ముగ్గురు బాలికలు ఆన్లైన్ గేమింగ్కు బానిసలయ్యారు. ముఖ్యంగా ‘కొరియన్ లవ్ గేమ్’ అనే టాస్క్ ఆధారిత ఆన్లైన్ గేమ్ను వీరు నిత్యం ఆడేవారని తెలుస్తోంది. ఈ క్రమంలో గేమింగ్ మానుకోవాలని తల్లిదండ్రులు వారిని గట్టిగా మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అక్కాచెల్లెళ్లు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అన్ని కోణాల్లోనూ కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. మానసిక ఒత్తిడి లేదా ఈ తరహా విపరీత ఆలోచనలు ఉన్నవారు సహాయం కోసం మానసిక నిపుణులు సంప్రదించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: తేనెటీగల దాడి: పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన వంట మనిషి


