కామారెడ్డి టౌన్: కుక్కకాటుకు సంబంధించి మూడో డోసు టీకా వేయించుకున్న కొద్దిసేపటికే రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్ప త్రి (జీజీహెచ్)లో చోటుచేసుకుంది. కామారెడ్డిలోని అయ్యప్ప నగర్కు చెందిన కల్లూరి అర్చన–రమేశ్ దంపతుల కూతురు క్రితర్ష (2)ను గతనెల 25న కుక్క కరిచింది. జీజీహెచ్లో ఇప్పటికే రెండు డోసుల రేబిస్ వ్యాక్సిన్ వేయించారు. ఆదివారం మధ్యాహ్నం మూడో డోస్ వేశారు. టీకా వేసిన ఐదు నిమిషాలకే చిన్నారి అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆందోళనకు గురైన తండ్రి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు.
వైద్యులు పరీక్షించి అప్పటికే పాప మృతి చెందిందని నిర్ధారించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయిందని ఆరోపిస్తూ బంధువులు, స్థానికులు జీజీహెచ్కు చేరుకుని ఆందోళనకు దిగారు. ఎమర్జెన్సీ వార్డు లోని ఈసీజీ మిషన్లు, అద్దాలు, ఫరి్నచర్ను ధ్వంసం చేశారు. అడ్డువచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేశారు. సుమారు నాలుగు గంటలపాటు ఉద్రిక్తత కొనసాగింది. కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పడంతో ఆందోళన విరమించారు. రేబిస్ వ్యాక్సిన్ వికటించే అవకాశం తక్కువని, మరణానికి అసలు కారణాలను విశ్లేషిస్తామని ఆస్పత్రి ఆర్ఎంవో సంతోష్ తెలిపారు.


