నేటి తరం తల్లిదండ్రులుగా కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న ‘జెన్ జీ’లు తమ పిల్లల పెంపకంలో పాతకాలపు పద్ధతులను పక్కన పెడుతూ, సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా మధ్య పెరిగిన ఈ తరానికి డిజిటల్ ప్రపంచంపై పూర్తి అవగాహన ఉంది. అందుకే వీరు స్క్రీన్ టైమ్ను ఒక అడ్డంకిగా భావించకుండా, దానిని ఉపయుక్తమైన పనిగా చెబుతున్నారు.
పిల్లల ప్రారంభ దశ అభివృద్ధిలో డిజిటల్ ఎక్స్పోజర్,స్వీయ అనుభవాలు పరస్పర విరుద్ధమైనవి కావని, అవి ఒకదానికొకటి తోడ్పడతాయని ‘జెన్ జీ’ పేరెంట్స్ చెబుతున్నారు. ఆధునిక పేరెంటింగ్ను తమదైన శైలిలో తిరగరాస్తున్నారు. గత తరాల వారు స్క్రీన్ టైమ్ అంటే ఆందోళన చెందుతారు. అయితే సాంకేతికతను, సృజనాత్మకతను స్క్రీన్పై చూసిన జెన్ జీ తల్లిదండ్రులు ఇప్పుడు ఈ చర్చను ‘ఎంత సమయం?’ అనేలా కాకుండా ‘ఏం చూస్తున్నారు’ అనే దిశగా మళ్లించారు. గంటల లెక్క కాకుండా, పిల్లలు చూసే కంటెంట్ నాణ్యత, వారి ఉద్దేశ్యం ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
‘జెన్ జీ’ పేరెంట్స్కు డిజిటల్ అలసట (Digital Fatigue)పై అవగాహన ఉండటంతో స్క్రీన్ వినియోగాన్ని మరింత విజ్ఞతతో కూడిన పద్ధతిలో పిల్లలు ఉపయోగించేలా పర్యవేక్షిస్తున్నారు. డిజిటల్ ప్రపంచంతో అనుసంధానమై ఉండటం వల్ల కలిగే మానసిక ఒత్తిడిని గుర్తించిన జెన్ జీ తల్లిదండ్రులు, ఆఫ్లైన్ కార్యకలాపాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. బొమ్మలు గీయడం, నిర్మాణ నమూనాలు రూపొందించడం (Building Blocks), ఆరుబయట ఆడుకోవడం మొదలైనవాటి ద్వారా పిల్లల్లో భావోద్వేగ వికాసం మెరుగుపడుతుందని ‘జెన్ జీ’ పేరెంట్స్ నమ్ముతున్నారు.
అటు డిజిటల్ పరిజ్ఞానం, ఇటు శారీరక శ్రమ.. ఈ రెండింటి మధ్య సమతుల్యతను పాటించడం ద్వారా పిల్లల ఆలోచనా శక్తిని, ఊహాశక్తిని పెంపొందించవచ్చని ఈ తరం భావిస్తోంది. కాగా తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారుతున్న నేపథ్యంలో పాఠశాలలు కూడా తమ విద్యాబోధనలో మార్పులు చేస్తున్నాయి. తరగతి గదుల్లో కేవలం డిజిటల్ పరికరాలకే పరిమితం కాకుండా, విద్యార్థులు ప్రశ్నించేలా, సహచరులతో కలిసి మెలిగేలా ప్రోత్సహిస్తున్నారు.


