సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కీలకమైన ఫోరెన్సిక్ ల్యాబ్ బిల్డింగ్ మొదటి ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే పలు కీలక కేసులకు సంబంధించిన పేపర్ ఫైల్స్ అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది.
శనివారం ఉదయం 10గం. ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలను గమనించిన వాచ్మన్ అధికారులకు సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. భవనం అంతటా దట్టమైన పొగలు అలముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే.. తీవ్రంగా శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయగలిగారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇక ఈ ల్యాబ్లోనే డీఎన్ఏ పరీక్షలు, ఫింగర్ప్రింట్ విశ్లేషణకు సంబంధించిన వివరాలు ఉంటాయి. మొదటి ఫ్లోర్లో కంప్యూటర్లతో పాటు, ఫోరెన్సిక్ ల్యాబ్ల్లో వినియోగించే కెమికల్స్ ఉంటాయి. కీలక కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలను ఇక్కడే భద్రపరుస్తారు. వాటికి సంబంధించిన పేపర్ వర్క్ పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం అందుతోంది.
ఓటుకు నోటు కేసులో వీడియో, ఆడియో ఫైల్స్తో పాటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. అలాగే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డాటా, హార్డ్ డిస్కులు ఇక్కడే ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఇవి సేఫేనా? అనేదానిపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.


