సాక్షి హైదరాబాద్ : డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంలో అకస్మిక దాడులు నిర్వహించింది. నిషేదిత మందులు అమ్ముతున్న రెండు మెడికల్ షాపులను గుర్తించి వాటిని సీజ్ చేసింది.
మహబూబాబాద్ జిల్లా, మారిపెడ గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి మెడికల్ షాప్లో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ జరిపిన దాడులలో నిషేదిత మందులు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వాటిని సీజ్ చేసి మందుల దుకాణం నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్రమంగా వినియోగిస్తున్న మందులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
నిర్వాహకులు నిబంధనలకు అనుగుణంగా మెడికల్ షాపు నిర్వహించడం లేదని అదే విధంగా గుర్తింపు పొందిన డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా పాల్వంచలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెడికల్ షాపులో డ్రగ్ లేబుల్ ట్యాంపరింగ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో స్టాక్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు.
అధికారులు దాడులలో ట్రామాడోల్ ఇంజెక్షన్లు, మాత్రలు మరియు అల్ప్రజోలం మాత్రలను అధికారులు సీజ్ చేశారు. నిషేదిత మందులు అమ్మడం, లేబుల్ ట్యాంపరింగ్ చేయడం చట్టరీత్యా నేరమని దీనికి రెండేళ్ల దాక జైలుశిక్ష పడే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.


