ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహణకు మార్గం సుగమమైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)- పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య చర్చలు సఫలమయ్యాయి. ఫలితంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా దాయాదులు తలపడటం ఖాయమైంది.
ఐసీసీ అధికారిక ప్రకటన
ఇందుకు సంబంధించి ఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. “ఐసీసీ, పీసీబీ మధ్య చర్చలు సఫలమయ్యాయి. నిర్మాణాత్మక ఒప్పందాలు, ఐకమత్యంగా ముందుకు సాగటం, క్రికెట్ అత్యుత్త ప్రయోజనాలు.. సమగ్రత, నిబద్ధత, పరస్పర సహకారం.. తదితర అంశాల ఆవశ్యకతను గుర్తించిన ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ను విజయవంతంగా పూర్తి చేసేందుకు.. ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనే నిబంధనల పట్ల అన్ని బోర్డులు గౌరవభావంతో ఉన్నాయి. క్రికెట్ స్ఫూర్తితో ముందుకు సాగాలని సభ్య దేశాలు నిర్ణయించాయి. ఇక బంగ్లాదేశ్ విషయంలోనూ మా వైఖరి మారలేదు.
ఎలాంటి ప్రభావం ఉండదు
200 మిలియన్లకు పైగా క్రికెట్ అభిమానులు ఉన్న పెద్ద మార్కెట్లో ఆట అభివృద్ధికి ఐసీసీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తున్నాం. ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నందుకు ఆ జట్టుపై దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం ఉండదని హామీ ఇస్తున్నాం.
తగిన ప్రమాణాలు పాటిస్తేనే బంగ్లాకు ఆ ఛాన్స్
అదే విధంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఎలాంటి పెనాల్టీలు విధించడం లేదు. అంతేకాదు.. ఐసీసీ ఈవెంట్ల ఆతిథ్య ప్రక్రియ, అందుకు తగిన ప్రమాణాలు కలిగి ఉంటే.. తప్పక 2031 పురుషుల క్రికెట్ వరల్డ్కప్ కంటే ముందు జరిగే ఐసీసీ టోర్నీకి వేదికగా బంగ్లాదేశ్కు అవకాశం ఉంటుంది’’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది.
పాక్ ఓవరాక్షన్
కాగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ వరల్డ్కప్ టోర్నీ-2026కు ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలో ఆడేలా ఒప్పందం కుదిరింది. అయితే, బంగ్లాదేశ్కు మద్దతుగా తాము భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామని పాక్ బెదిరింపులకు దిగింది. దీంతో ఐసీసీ- పీసీబీతో చర్చలు జరుపగా యూటర్న్ తీసుకుని.. టీమిండియాతో ఆడేందుకు అంగీకరించింది.
ఇదిలా ఉంటే.. భారత్- బంగ్లాదేశ్ మధ్య కొన్నాళ్లుగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లా ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను బీసీసీఐ విడుదల చేసింది. దీంతో భారత్లో తాము వరల్డ్కప్ ఆడము అని.. శ్రీలంకలో తమకు ఆడే అవకాశం ఇవ్వాలని బంగ్లా ఐసీసీని కోరింది. అయితే, బంగ్లాదేశ్ వాదనలో నిజం లేదని కొట్టిపారేసిన ఐసీసీ.. మరోసారి ఆలోచించాలని సూచించింది.
ఫైనల్గా యూటర్న్
కానీ తమ ప్రభుత్వం నిర్ణయం మేరకు టోర్నీ నుంచి తప్పుకొనేందుకైనా సిద్ధమని బంగ్లాదేశ్ చెప్పగా.. ఐసీసీ సరేనంది. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ను చేర్చించింది. ఈ విషయంలో ఓవరాక్షన్ చేసిన పీసీబీ భారత్తో మ్యాచ్ బహిష్కరణ అని కొత్తరాగం ఎత్తుకుంది.
అయితే, శ్రీలంక, యూఏఈ, బంగ్లా బోర్డులు భారత్- పాక్ మ్యాచ్ జరుగకపోతే ఆర్థికంగా భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ లేఖలు రాశాయి. ఐసీసీ సైతం ఈ విషయంలో గట్టిగానే నిలబడింది. దీంతో పాక్ మాట మార్చి భారత్తో ఆడేందుకు అంగీకరించింది.
చదవండి: పాక్ కోసం బంగ్లాను ఒప్పించారా?: నీళ్లు నమిలిన పీసీబీ చీఫ్


