T20 WC 2026: సంజూ శాంసన్‌కు జాక్‌పాట్‌ | T20 WC 2026: India Coach Confirms Abhishek Sharma Doubtful For Namibia Clash, Massive Update On Bumrah | Sakshi
Sakshi News home page

T20 WC 2026: సంజూ శాంసన్‌కు జాక్‌పాట్‌

Feb 10 2026 7:40 PM | Updated on Feb 10 2026 7:54 PM

T20 WC 2026: India Coach Confirms Abhishek Sharma Doubtful For Namibia Clash, Massive Update On Bumrah

టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌ సంజూ శాంసన్‌ జాక్‌పాట్‌ కొట్టాడు. ఇటీవల న్యూజిలాండ్‌ సిరీస్‌లో దారుణంగా విఫలమవడంతో ప్రపంచకప్‌ మ్యాచ్‌లు ఆడే సువర్ణావకాశాన్ని కోల్పోయిన అతను.. అనూహ్యంగా ప్లేయింగ్‌ ఎలెవెన్‌లోకి వచ్చేలా ఉన్నాడు. ఫిబ్రవరి 12న నమీబియాలో జరుగబోయే మ్యాచ్‌లో సంజూ ఆడటం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. 

రెగ్యులర్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ గత కొన్ని రోజులుగా కడుపు సమస్యతో బాధపడుతుండటం సంజూకి కలిసొచ్చేలా ఉంది. నమీబియాతో మ్యాచ్‌ సమయానికి అభిషేక్‌ అందుబాటులో ఉండటం కష్టమేనని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్‌ టెన్ డష్కటే పరోక్షంగా వెల్లడించాడు. 

ఇవాళ (ఫిబ్రవరి 10) అతను మీడియాతో మాట్లాడుతూ.. అభిషేక్‌ సహా మిగతా కీలక ఆటగాళ్లకు సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చాడు. అభిషేక్‌ కడుపు సమస్యతో బాధపడుతూ ఇంకా జట్టుతో కలవలేదని, నమీబియా మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువని చెప్పాడు. అభిషేక్‌ గైర్హాజరీలో సంజూ శాంసన్‌కు అవకాశం రావచ్చని పరోక్షంగా వెల్లడించాడు. ఒకవేళ సంజూ తుది జట్టులోకి వస్తే ఇషాన్‌ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు.

డష్కటే.. బుమ్రా, వాషింగ్టన్‌ సుందర్‌ అందుబాటులో ఉండే విషయంపై కూడా అప్‌డేట్‌ ఇచ్చాడు. బుమ్రా జ్వరంతో తొలి మ్యాచ్ మిస్ అయినా, ఇప్పుడు పూర్తిగా ఫిట్ అయ్యాడని, ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టాడని, నమీబియాపై ఆడేందుకు సిద్దంగా ఉన్నాడని వెల్లడించాడు.

వాషింగ్టన్ సుందర్ కూడా రిబ్ ఫ్రాక్చర్‌ నుంచి కోలుకొని జట్టులో చేరాడని తెలిపాడు. సుందర్‌ అందుబాటులోకి వస్తే ఎవరిపై వేటు పడుతుందనే విషయంపై మాత్రం డష్కటే స్పష్టతనివ్వలేదు.

ఇదే సందర్భంగా డష్కటే భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌పై కూడా స్పందించాడు. పాక్‌తో మ్యాచ్‌ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుందని అన్నాడు. పాక్‌ తమ మనసు మార్చుకొని భారత్‌తో ఆడేందుకు సిద్దమవడం మంచి పరిణామంగా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌ ప్రత్యేకంగా ఉండబోతుందని తెలిపాడు.

కాగా, బుమ్రా, సుందర్‌ అందుబాటులోకి వస్తే ఎవరిని తప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సిరాజ్‌ స్థానంలో బుమ్రా వచ్చినా, సుందర్‌ కోసం ఎవరిని తప్పిస్తారన్నది చర్చనీయాంశమైంది. అవకాశాలను పరిశీలిస్తే, అక్షర్‌ పటేల్‌ స్థానంలో సుందర్‌ తుది జట్టులోకి రావచ్చు. అభిషేక్‌ అందుబాటులోకి రాక సంజూ శాంసన్‌కు అవకాశం వస్తే.. నమీబియాతో మ్యాచ్‌కు భారత తుది జట్టు ఇలా ఉండవచ్చు.

నమీబియాతో మ్యాచ్‌కు భారత తుదిజట్టు (అంచనా)
ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, రింకూ సింగ్‌, శివం దూబే, వాషింగ్టన్‌ సుందర్‌, వరుణ్‌ చక్రవర్తి, అర్ష్‌దీప్‌ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement