సోషల్ మీడియా వినియోగానికి పలు నిబంధనలు విధించిన ఆస్ట్రేలియా ఇప్పుడు ఏఐ సాయంతో మరో ప్రయోగానికి సిద్ధం అయ్యింది. నిన్నటి వరకు 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేసిన ఆ కంగారూ గడ్డ.. కృత్రిమ మేధతో అత్యాదునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం చేసింది. ఆస్ట్రేలియా వేస్తున్న ఈ అడుగులు ప్రపంచ టెక్ దిగ్గజాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఏఐ కారణంగా ముంచుకొస్తున్న ముప్పును ముందే పసిగట్టి, దేశాన్ని డిజిటల్ గాడిలో పెట్టేందుకు సిద్ధమైన ఆస్ట్రేలియా వ్యూహం ఏమిటి?
సోషల్ మీడియా బ్యాన్ తర్వాత..
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న ఆస్ట్రేలియా, ఇప్పుడు టెక్ ప్రపంచంలో మరో కీలక ముందడుగు వేసింది. కేవలం నిషేధాలతోనే సరిపెట్టకుండా, భవిష్యత్తు సాంకేతికత అయిన కృత్రిమ మేధను (ఏఐ)ఒక క్రమపద్ధతిలో గాడిలో పెట్టేందుకు సిద్ధమైంది. తాజాగా ఆస్ట్రేలియా తన ‘నేషనల్ ఏఐ ప్లాన్’ను అధికారికంగా ప్రకటించి, ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది.
కొత్త చట్టాలు లేవు.. పాతవే పక్కాగా..
సాధారణంగా ఏవైనా నూతన సాంకేతికతలు వచ్చినప్పుడు ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందిస్తుంది. కానీ ఆస్ట్రేలియా ఒక భిన్నమైన వ్యూహాన్ని అనుసరించింది. ఏఐ నియంత్రణ కోసం ప్రత్యేకంగా కొత్త చట్టాలు తీసుకురావడానికి బదులుగా, ప్రస్తుతం ఉన్న వాటినే ఉపయోగించి కొత్త రిస్క్లను అరికట్టాలని నిర్ణయించింది. దీనివల్ల అనవసరమైన జాప్యం లేకుండా తక్షణమే నియంత్రణ సాధ్యమవుతుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వ సంస్థలకే బాధ్యత
ఈ ప్రణాళికలో భాగంగా వివిధ ప్రభుత్వ విభాగాలు, రెగ్యులేటరీ సంస్థలకు కీలక బాధ్యతలు అప్పగించారు. తమ పరిధిలోని రంగాల్లో ఏఐ వల్ల ఎలాంటి హాని కలుగుతుందో గుర్తించి, వాటిని అడ్డుకోవడంలో ఆయా సంస్థలే ప్రాథమిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే, ప్రజల భద్రతను పణంగా పెట్టకుండా, సమతుల్యం పాటించడం ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు ఉద్దేశంగా తెలుస్తోంది.
మూడు అంశాల వ్యూహం
ఆస్ట్రేలియా ప్రకటించిన ఈ జాతీయ ఏఐ ప్రణాళిక ప్రధానంగా మూడు అంశాల చుట్టూ తిరుగుతుంది. మొదటిది అత్యాధునిక డేటా సెంటర్ల ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం. రెండవది ఏఐ వల్ల ఉద్యోగాలు పోకుండా చూస్తూనే, పౌరుల్లో ఏఐ నైపుణ్యాలను పెంచడం. మూడవది ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం. ఈ మూడు లక్ష్యాలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్
ఈ ప్రణాళికలో అత్యంత ఆసక్తికరమైన అంశం 'ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్' ఏర్పాటు. 2026 నాటికి ఈ ప్రత్యేక సంస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది ఏఐ వల్ల ఎదురయ్యే ముప్పులను నిరంతరం పర్యవేక్షిస్తుంది. సాంకేతికత ఎంత వేగంగా పెరిగినా, దానికి తగినట్లుగా ప్రభుత్వ స్పందనను సిద్ధం చేయడంలో ఈ ఇన్స్టిట్యూట్ కీలక పాత్ర పోషించనుంది.
చాట్ జిపిటి, జెమినిపై నిఘా
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రాజ్యమేలుతున్న జనరేటివ్ ఏఐ టూల్స్ చాట్ జీపీటీ, జెమిని వల్ల కలిగే ప్రమాదాలను అంచనా వేయడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ కొత్త ప్రణాళికను వాడుకోనుంది. వీటి ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా, భద్రతా పరమైన లొసుగులు తలెత్తకుండా నిరంతరం నిఘా ఉంచడం ఈ వ్యూహంలో భాగం.
భద్రతతో కూడిన సాంకేతిక ప్రగతి
‘సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ మా ప్రణాళికను మరింత బలోపేతం చేస్తాం’ అని ఫెడరల్ ఇండస్ట్రీ మినిస్టర్ టిమ్ ఐర్స్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియన్లందరికీ సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అటు సాంకేతిక పురోగతిని, ఇటు సామాజిక భద్రతను ఒకేసారి సాధించే దిశగా ఆస్ట్రేలియా వేస్తున్న అడుగులు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయనడంలో సందేహం లేదు.
ఇది కూడా చదవండి: ‘బంగ్లా’కు సహకరిస్తాం.. భారత్కు రండి’


