మూగబోయిన పౌరహక్కుల గళం | US civil rights leader Jesse Jackson dies aged 84 | Sakshi
Sakshi News home page

మూగబోయిన పౌరహక్కుల గళం

Feb 18 2026 4:55 AM | Updated on Feb 18 2026 4:55 AM

US civil rights leader Jesse Jackson dies aged 84

అమెరికాలో పౌరహక్కుల ఉద్యమనేత జెస్సీ జాక్సన్‌ అస్తమయం 

మార్టీన్‌ లూథర్‌కింగ్‌ తర్వాత ఉద్యమాన్ని ఉరకలెత్తించిన జాక్సన్‌ 

హక్కుల యోధుని మరణంతో వెల్లువెత్తిన సంతాపాలు

షికాగో: అమెరికాలో పౌర హక్కుల ఉద్యమాన్ని దశాబ్దాల తరబడి విజయవంతంగా నడిపించిన హక్కుల యోధుడు, రాజకీయవేత్త జెస్సీ లూయిస్‌ జాక్సన్‌ (84) తీవ్ర అనారోగ్య సమస్యలతో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మార్టీన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ హత్య తర్వాత జాక్సన్‌ పౌరహక్కుల ఉద్యమాన్ని తన భుజస్కంధాలకెత్తుకుని అమెరికాలో కీలక నల్లజాతి నేతగా ఎదిగారు.

2017లో ఆయనకు పార్కిన్సన్‌ వ్యాధి సోకింది. గత నవంబర్‌లో మెదడులో అసమతుల్యత(ప్రోగ్రెసివ్‌ సుప్రాన్యూక్లియర్‌ పాల్సీ) కారణంగా జీవిత చరమాంకంలో మాట్లాడలేని, నడవలేని స్థితికి చేరుకున్నారని జాక్సన్‌ కుటుంబం ఒక ప్రకటనలో పేర్కొంది. జాన్సన్‌కు ఒక కుమార్తె, ఐదుగురు కుమారులు ఉన్నారు. పౌర హక్కుల కోసం పోరాడుతూనే పేదలు, ఆఫ్రికన్‌ అమెరికన్లు, నిరుద్యోగుల కోసం అవిశ్రాంతంగా పోరాడారు. విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాల అభ్యున్నతికి పాటుపడ్డారు. 

కింగ్‌కు శిష్యుడిగా చేరి.. 
1941 అక్టోబర్‌ 8వ తేదీన సౌత్‌ కరోలినా రాష్ట్రంలోని గ్రీన్‌విల్లే పట్టణంలో జాక్సన్‌ జన్మించారు. విద్యార్థి దశలో బేస్‌బాల్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్‌ బాగా ఆడేవారు. తర్వాత ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా ఎదిగారు. 1960 దశకంలో విద్యారి్థనేతగా ఎదిగారు. ప్రఖ్యాత పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టీన్‌ లూథర్‌ కింగ్‌ బోధనలకు ఆకర్షితుడై పాతికేళ్ల వయసులో 1965లో ఆయనకు శిష్యుడిగా చేరిపోయారు. 1968 ఏప్రిల్‌లో లూథర్‌ కింగ్‌ను హత్యచేసినప్పుడు ఆయన చివరిసారిగా జాక్సన్‌తోనే మాట్లాడారని, ఈయన చేతుల్లోనే ఆయన తుదిశ్వాస విడిచారని చెబుతుంటారు. కింగ్‌కు అసలైన ఉద్యమవారసుడు ఇతనే అని అప్పట్లోనే అంతా భావించారు. కింగ్‌ సారథ్యంలో నడిచే ‘సదరన్‌ క్రిస్టియన్‌ లీడర్‌షిప్‌ కాన్ఫెరెన్స్‌’కు షికాగో శాఖకు జాక్సన్‌ సారథ్యం వహించారు.

ఆఫ్రికన్‌ అమెరికన్ల సర్వతోముఖాభివృద్ధి కోసం ‘ఆపరేషన్‌ బెŠల్‌డ్‌బాస్కెట్‌’కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నల్లజాతీయులకు శ్వేతజాతీయుల సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించడం, నల్లజాతీయులు తయారుచేసి వస్తూత్పత్తులను శ్వేతజాతీయుల సంస్థలతో కొనిపించడం, ఆఫ్రికన్‌ అమెరికన్లకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం సహా ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టారు. అద్భుతమైన వాక్చాతుర్యంతో హక్కుల కార్యకర్తల్లో ఉద్యమాగి్నకి ఎగదోసేవారు. ఓవైపు ఉద్యమాల్లో పాల్గొంటూనే రాజకీయాల్లోనూ చేరారు. 1984, 1988 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం పోటీపడి విఫలమయ్యారు.

ఆ తర్వాత కూడా అణగారిన వర్గాల సామాజిక న్యాయం, పౌర హక్కులు, రాజకీయ చైతన్యమే లక్ష్యంగా లాభాపేక్షలేని ‘రెయిన్‌బో/పుష్‌ కూటమి’సంస్థలను స్థాపించి విజయవంతంగా నడిపించారు. వెనుకబడిన వర్గాల కోసం సంపన్న వర్గాలు, ప్రభుత్వాలతో మధ్య వర్తిత్వం నడిపిన గొప్ప దౌత్యవేత్తగా పేరొందారు. 1999లో కువైట్‌ను ఇరాక్‌ ఆక్రమించినప్పుడు 700 మందికిపైగా విదేశీ వనితలను విడిపించడంలో ఈయన దౌత్యం గొప్పగా పనిచేసింది. శ్వేతజాతీయ పోలీస్‌ అధికారి నేలకు గొంతు అదిమిపట్టడంతో ఊపిరాడక చనిపోయిన నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణానంతరం ఆయన కుటుంబాన్ని జాక్సన్‌ కలిసి పరామర్శించారు.

ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధం ఆపాలని పిలుపునిచ్చారు. 2000 సంవత్సరంలో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ ఈయనకు అమెరికా అత్యున్నత పౌరపురస్కారం ‘ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌’తో సత్కరించారు. జాక్సన్‌ మరణంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సహా పలు ప్రపంచ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement