బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఛైర్మన్ తారిఖ్ రెహమాన్తో పాటు మంత్రులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢాకాలోని జాతీయ పార్లమెంట్ దక్షిణ ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమం జరిగింది.
అయితే కొత్త ప్రభుత్వ కేబినెట్లో హిందూ మైనారిటీ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు నితాయ్ రాయ్ చౌదరికి చోటు దక్కడం విశేషం. ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ నియమించిన 25 మంది క్యాబినెట్ మంత్రులలో నితాయ్ రాయ్ చౌదరి ఒకరు. ఆయనకు సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు కేటాయించనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
నితాయ్ రాయ్ ఫిబ్రవరి 12న జరిగిన జాతీయ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన మగురా-2 నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు. తన ప్రత్యర్థి అయిన జమాత్-ఏ-ఇస్లామీ అభ్యర్థిని భారీ మెజారిటీతో ఓడించారు
ఎవరీ నితాయ్ రాయ్ చౌదరి?
77 ఏళ్ల నితాయ్ రాయ్ చౌదరి 1949లో బంగ్లాదేశ్లోని మగురా జిల్లాలో జన్మించారు. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. తన ప్రాథమిక విద్యను మగురా గవర్నమెంట్ కాలేజీలో పూర్తి చేశారు. అనంతరం ఢాకా విశ్వవిద్యాలయం నుండి లా (న్యాయశాస్త్రం) పట్టా పొందారు. ఢాకా యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు.
అక్కడే ఆయన రాజకీయ జీవితానికి పునాది పడింది. 1988లో మగురా-2 నియోజకవర్గం నుండి తొలిసారిగా జాతీయ పార్లమెంట్కు నితాయ్ రాయ్ ఎన్నికయ్యార. ఆయన ప్రస్తుతం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వైస్ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. గతంలో ఆయన విద్య, యువజన, క్రీడల శాఖల మంత్రిగా కూడా పనిచేశారు. నితాయ్ రాయ్ కుమార్తె నిపుణ్ రాయ్ చౌదరి కూడా బీఎన్పీలో అత్యంత క్రియాశీలక నాయకురాలగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.


