ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘మదనపల్లె పరిధిలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిపి, ఆపై హత్యచేసి, నీటి డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటన మీకు, మీ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా?’ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు కాపాడలేకపోయారని నిలదీశారు. ఇకనైనా మేలుకుని తక్షణమే శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టి మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించి.. వారి ప్రాణాలు కాపాడటంపై దృష్టి పెట్టాలని చంద్రబాబుకు హితవు పలికారు.
ఈ మేరకు సోమవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. ‘నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల గిరిజన బాలిక, వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలం ఎ.కంబాలదిన్నెలో మూడేళ్ల బాలిక, తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారి లైంగిక దాడికి గురై, ఆపై హత్యకు గురయ్యారు. ఇలా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక బాలికలు, మహిళలపై ఎన్నో దారుణమైన ఘటనలు జరిగాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఈ ఘటనలను తేలిగ్గా తీసుకుందనేది వాస్తవమన్నారు. ఎల్లో మీడియాలో హడావుడి ప్రకటనలు చేయడం, అనంతరం ఆ విషయాన్ని వదిలేయడం సహజంగా మారిందన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రశ్నించిన వారు మాజీ మంత్రులైనా వారి ఇళ్లమీద పోలీసులను వాడుకుని ఒక వ్యూహంతో దాడులు చేయించి, ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు హత్యాయత్నాలు చేయించడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ కల్పించడంపై చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. శాంతిభద్రతలపై హోం మంత్రి బాధ్యత వహించరని, చంద్రబాబు కుమారుడు ఆయన శాఖలను నీరుగారుస్తూ.. అందరి శాఖల్లో వేలుపెడతారని విమర్శించారు.
ఏ మంత్రీ దేనికీ బాధ్యత వహించరన్నారు. ‘ముఖ్యమంత్రిగా మీకు ప్రచారం తప్ప మరేమీ పట్టదు. సొంత జేబులు నింపుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడమే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నవారి పనిగా మారిపోయింది. మరి ఇలాంటి దారుణాలపై ఎవరు దృష్టిపెడతారు?’ అని చంద్రబాబును ప్రశ్నించారు. ‘చంద్రబాబు సృష్టించిన పొలిటికల్ గవర్నెన్స్తో, రెడ్బుక్ రాజ్యాంగంతో పోలీసు సహా వ్యవస్థలను కలుషితం చేస్తే ఇక లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది? ఎలా బతుకుతుంది? చిన్నారులకు, మహిళలకు రక్షణ ఎక్కడ నుంచి లభిస్తుంది?

మీ పాలనా వైఫల్యాలకు, అసమర్థతకు అభం శుభం తెలియని బాలికలు, మహిళలు బలైపోవాలా? ప్రతిరోజూ భయంతో బతకాలా? పైగా అన్యాయం జరిగిందని ఎవరైనా పోలీస్స్టేషన్కు వెళ్తే, బాధితులపైనే ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా జైళ్లకు పంపుతున్నారు’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో ఓ టీడీపీ నాయకుడు మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేస్తే కేసు కట్టి అరెస్టు చేయాల్సిన పోలీసులు మూడు రోజులు స్టేషన్ చుట్టూ తిప్పి, చివరకు టీడీపీ నేతల ఒత్తిడితో తమపైనే హత్యాయత్నం కేసు పెట్టి జైళ్లకు పంపారని ఆ బాలిక కుటుంబ సభ్యులు వాపోతున్నారని వెల్లడించారు. ఈ లెక్కన రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరుగుతుందని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.
Shame on you, @ncbn garu!
మదనపల్లి జిల్లా నీరుగట్టువారిపల్లిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారంచేసి, ఆపై హత్యచేసి, డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటన మీకు, మీ ప్రభుత్వానికి సిగ్గు చేటు కాదా. బాలిక కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఎందుకు ఆ చిన్నారిని కాపాడలేకపోయారు?
నంద్యాల జిల్లా… pic.twitter.com/QcR3jyWo0I— YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2026


