Chandrababu Naidu government
-
మా ఉద్యోగాలు అనర్హులకు ఇచ్చేశారు.. మా జీవితాలను రోడ్డున పడేశారు
-
అనితకు బిగ్ షాక్.. APకి కొత్త హోంమంత్రి!
-
మా భవిష్యత్తు మట్టి కొట్టుకుపోయింది.. మెరిట్తో సర్కారు ‘ఆటలు’!
సాక్షి, అమరావతి: ‘‘మంత్రి నిర్వాకంతో మా భవిష్యత్తు మట్టి కొట్టుకుపోయింది. తమ వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఇష్టానుసారంగా నియమాలు మార్చారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీలో అంతులేని అక్రమాలు చేశారు..! ఎన్నిసార్లు లోకేశ్ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు..! 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లు మాకు న్యాయం చేయండి...! మెగా డీఎస్సీ మెరిట్ లిస్టులో నా పేరొచ్చింది. 1:1 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయింది. తీరా సెలక్షన్ లిస్టులో నా పేరు లేదు. కారణం అడిగితే.. ఆ పోస్టు స్పోర్ట్స్ కేటగిరీలో ఇచ్చామని.. హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల పోస్టు మిస్సయ్యిందని చాలా తేలిగ్గా సమాధానం చెబుతున్నారు. వెరిఫికేషన్కి వచ్చినంత మాత్రాన జాబ్ ఇస్తామన్నట్లు కాదని అంటున్నారు..! కోర్టు ఆర్డర్ కాపీ పట్టుకుని తిరుగుతున్నా లెక్క చేయడం లేదు..! నేషనల్ గేమ్స్లో బంగారు పతకం సాధించినా నాకు పోస్టు ఇవ్వలేదు.. రజతం, కాంస్య పతకం ఉన్నవారికి మాత్రం ఉద్యోగాలిచ్చారు.. సర్టిఫికెట్లు పరిశీలించకుండా పోస్టులు ఇచ్చేశారు...! అసలు ఏ పరీక్షా రాయని వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం ఇచ్చి మెరిట్లో ఉన్న మాకు అన్యాయం చేశారు..! మెరిట్ లిస్టులో వచ్చిన వారికి రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగం ఇవ్వడంతో నాకు రావాల్సిన ఉద్యోగం రాకుండా పోయింది...! కటాఫ్ మార్కులు ప్రకటించకపోవడం వల్ల చాలా గందరగోళంగా ఉంది...! ఉన్నది 3 పోస్టులు... ముగ్గురమే ఉన్నాం... కానీ ఫైనల్ జాబితాలో నా పేరు లేదు. కారణం అడిగితే స్పోర్ట్స్ కోటాలో ఆ జాబ్ ఇవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారు..! నిబంధనలకు విరుద్ధంగా టీచర్ పోస్టులను భర్తీ చేశారని మా బాధ ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోవడం లేదు..! ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు.. మాకు మీరు మాత్రమే న్యాయం చేయగలరు..!!’’ ఇదీ మెగా డీఎస్సీ 2025 వేలాది మంది బాధిత అభ్యర్థుల ఆక్రందన!! మెరిట్లో ఉండి అన్యాయానికి గురైన అభ్యర్థులు బుధవారం పెద్ద ఎత్తున తరలివచ్చి తాడేపల్లిలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ గోడు చెప్పుకున్నారు. డీఎస్సీ నిర్వహణ, టీచర్ పోస్టుల ఎంపికలో జరిగిన అనేక అక్రమాలను ఆయనకు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారంతా కలిసి మీడియాతో మాట్లాడారు.తమకు జరిగిన అన్యాయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరిస్తున్న డీఎస్సీ–2025 బాధిత అభ్యర్థులు నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ను పక్కనబెట్టారు నేను నేషనల్ గేమ్స్లో బంగారు పతకం విజేతను. మా జిల్లా నుంచి 6 పోస్టులు ఉంటే రజతం, కాంస్య పతక విజేతలకు ఉద్యోగాలు ఇచ్చి నాకు బంగారు పతకం ఉన్నా ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. – అనిగి దుర్గయ్య, పోలవరం మండలం, ఏలూరు జిల్లా లోకేశ్ వద్దకు వెళితే.. మెగా డీఎస్సీలో ర్యాంక్ తెచ్చుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు కూడా హాజరయ్యా. ఎస్జీటీ ఉర్దూ మీడియంలో పరీక్ష రాసింది నలుగురం మాత్రమే. అందులో ముగ్గురిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. ఎస్టీ వర్గానికి చెందిన నా పేరు తుది జాబితాలో లేదు. రోస్టర్ నంబర్లు అటూ ఇటూ చేసి నన్ను కాదని ఒక మహిళకు ఇచ్చారు. క్యారీ ఫార్వర్డ్ పోస్టు కాబట్టి నాకు కచ్చితంగా రావాలి. నాకు జాబ్ ఎందుకు రాలేదో వివరాలు చెప్పమని అప్లికేషన్ రాసిస్తే పక్కన పడేశారు. దానిపై స్టాంప్ వేసి ఇస్తే కోర్టుకు వెళ్తారని, అందుకే ఆ పని చేయబోమని అధికారులు చెప్పారు. మంత్రి నారా లోకేశ్ను కలవడానికి ఛాంబర్కు వెళ్తే అనుమతి లేదంటూ ఓఎస్డీ నా అప్లికేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ శాఖకు పంపించారు. చివరకు ఎస్టీ కమిషన్ను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది.– ఎం.జగదీష్ నాయక్, వైఎస్సార్ కడప జిల్లాఇష్టారీతిన నియమాలు మార్చారు నేను ఉర్దూ మీడియంలో చదువుకున్నా. పదో తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ కాగా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. ఇంటర్ నుంచి ఇంగ్లిష్ మీడియం. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సందర్భంగా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలన్నారు. ఈ డీఎస్సీలో గతంలో లేని విధంగా నియమాలు మార్చారు. – ఎండీ షాబుద్దీన్, విశాఖ జిల్లాచాలా అన్యాయం.. నేను ఎస్సీని. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చక్కగా జరిగింది. నాకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత డీఈవో ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మళ్లీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ అడిగితే పంపా. మాకు 3 పోస్టులు ఉన్నాయి. మేము ముగ్గురమే ఉన్నాం. కానీ ఫైనల్ జాబితాలో మాత్రం నా పేరు లేదు. కారణం అడిగితే స్పోర్ట్స్ కోటాలో ఆ జాబ్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. నాకు చాలా అన్యాయం జరిగింది. – ఇందిర, కృష్ణా జిల్లాఅన్నీ బాగున్నా జాబ్ రాలేదు.. నేను కరాటే బ్లాక్బెల్ట్ ఛాంపియన్ను. మా ఊరిలో 37 మంది డీఎస్సీ రాస్తే నేను ఒక్కదాన్నే పాస్ అయ్యా. నేను ఓపెన్ కేటగిరీలో ఉన్నా రిజర్వేషన్ కేటగిరీలో పిలిచారు. నా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ బాగా జరిగింది. కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. కారణం అడిగితే అప్పటికే అన్ని పోస్టులు భర్తీ అయ్యాయని చెప్పారు. గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. నాది బీసీ–డీ అయితే నన్ను ‘బీసీ–సి’గా చూపారు. కోర్టుకు వెళ్లినా ఎలాంటి విచారణ జరిపించడం లేదు. మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎందుకు చేశారంటే సమాధానం చెప్పలేదు. – నాగలక్ష్మి, గుంటూరు జిల్లాఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? బీసీ–ఈ వర్గానికి చెందిన నేను సెకండ్ ప్లేస్లో ఉన్నా. ఎస్ఏ పోస్టు సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లా. అధికారులు కంగ్రాట్స్ కూడా చెప్పారు. కానీ సెలక్షన్ లిస్టులో నా పేరు లేదు. కారణాలు చెప్పలేదు. ఎన్నిసార్లు లోకేశ్ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిల్చినప్పుడు ఉద్యోగం రావాలి కదా? ఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? వెరిఫికేషన్ చేసినంత మాత్రాన జాబ్ ఇవ్వాలా? అని మాట్లాడారు. మెగా డీఎస్సీలో జరిగిన అన్యాయానికి న్యాయం చేయగలిగేది మీరు ఒక్కరు మాత్రమే. మీపై ఎంతో విశ్వాసం ఉంది. – షర్మిల, మదనపల్లె. అన్నమయ్య జిల్లాజీవో 77 ప్రకారం ఓపెన్ కేటగిరీలో మెరిట్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేయాలి. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం మహిళలు, పీహెచ్సీ, ఎక్స్సర్వీస్మెన్, స్పోర్ట్స్కోటా పోస్టులు భర్తీ చేయాలి. అయితే ప్రభుత్వం అలా చేయలేదు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారట.. నాకు డీఎస్సీలో 75 మార్కులు వచ్చాయి. తొలి జాబితాలోనే నా పేరు వచ్చింది. సర్టిఫికెట్ల పరిశీలన కూడా బాగా జరిగింది. కానీ ఉద్యోగం రాలేదు. ఎందుకు అని అడిగితే.. మీ కులంలో స్పోర్ట్స్ కోటాలో ఇంకొకరికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. మరి ముందే అతడు ఉన్నాడని తెలిసీ నన్ను ఎందుకు పిలిచారు? 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లు ఇప్పుడు కూడా న్యాయం చేయండి. – బాలకృష్ణ, కాకినాడ, జిల్లాఅవకాశం ఉన్నా పోస్టు ఇవ్వలేదు డీఎస్సీ మెరిట్లో నాకంటే ముందు ఒక అమ్మాయి ఉంది. ఆమె కానిస్టేబుల్. ఆమెది ఫేక్ సర్టిఫికెట్. మేం ఫిర్యాదు చేస్తే ఆమెను క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత నేను ఉన్నా నాకు అవకాశం ఇవ్వలేదు. విజయనగరానికి చెందిన అమ్మాయికి జాబ్ ఇచ్చారు. ఒక పోస్టు క్యాన్సిల్ అయితే తర్వాత అభ్యర్థికి ఇవ్వబోమని, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. – దుర్గామల్లిక, అమలాపురం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లామా గోడు చెబుతుంటే ‘ఫేక్’ అంటున్నారు.. మాది పేద మత్స్యకార కుటుంబం. కోచింగ్కు వెళ్లలేదు. కష్టపడి చదివా. ఫిజికల్ సైన్స్ బీసీ–సీలో నాది మూడో ర్యాంక్. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఓవరాల్ మెరిట్లో నాది 53వ ర్యాంక్. 10వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి ఓపెన్లో కాకుండా బీసీ–సీ కేటగిరీలో పోస్టు ఇచ్చారు. అతడిని ఓపెన్లో పంపించి ఉంటే నాకు మా కేటగిరీలో జాబ్ వచ్చి ఉండేది. నాకు జాబ్ ఎందుకు రాలేదని అధికారులను అడిగితే ఒక అమ్మాయి స్పోర్ట్స్ సర్టిఫికెట్తో వచ్చిందని చెప్పారు. మా గోడు ‘సాక్షి’లో ప్రచురిస్తే మమ్మల్ని ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు. – శ్రావణ్కుమార్, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లాతీరని అన్యాయం.. నాది బీసీ–ఏ. ఇందులో ఒకటే పోస్టు ఉంది. నేను ఒక్కదాన్నే ఉన్నా. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినా చివరకు ఉద్యోగం రాలేదు. మహిళా రిజర్వేషన్లో ఒక పోస్టు ఉంది. అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా. ఫిజికల్ సైన్స్లో మాకు అర్హత ఉంది. ఎమ్మెస్సీ చదివా. నాకు స్పోర్ట్ సర్టిఫికెట్ ఉన్నా జనరల్ కేటగిరీలో దరఖాస్తు చేశా. కానీ నాకు తీరని అన్యాయం చేశారు. – లక్ష్మీపార్వతి, వైఎస్సార్ కడప జిల్లా మెరిట్లో ఉన్నా అన్యాయం.. నాది జనరల్ కేటగిరిలో 76వ ర్యాంక్. ఓహెచ్లో ఫస్ట్ ర్యాంక్. జిల్లాలో ఫస్ట్ వచ్చా. కానీ నాకు మొదటి విడతలో కాకుండా రెండో దశలో కాల్ లెటర్ పంపారు. మెడికల్ టెస్టు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా జరిగింది. కానీ జాబ్ రాలేదు. రోస్టర్లో మరొకరు ముందు ఉన్నారని చెప్పారు. 137వ ర్యాంక్ వచ్చిన ఆమెకు జాబ్ ఇచ్చారు. మెరిట్లో ఉన్నా నాకు ఇవ్వకుండా అన్యాయం చేశారు. – నరసింహారావు, ప్రకాశం జిల్లాఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిటోరియస్ క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 4 ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదు నేను ఎస్ఏ సోషల్లో డీఎస్సీ రాశా. మా బీసీ–డీ కేటగిరీలో 7 పోస్టులు ఉంటే 5 పోస్టులు జనరల్లో మిగిలిన రెండు మా కేటగిరీలో ఉన్నాయి. నన్ను సర్టిఫికెట్ పరిశీలనకు పిలిచినా జాబ్ ఇవ్వలేదు. నా పోస్టు హారిజాంటల్ రిజర్వేషన్లో మరొకరికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. డీఈవో ఆఫీస్లో అడిగితే తమకేమీ తెలియదని విజయవాడ వెళ్లమన్నారు. అక్కడకు వెళ్తే తమకు సంబంధం లేదంటున్నారు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు. మాకు మీరు మాత్రమే న్యాయం చేయగలరు. – ఏకాంబరం, మాదిరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా జీరో ర్యాంకు వారికి ఉద్యోగం ఇచ్చారు నా సర్టిఫికెట్ వెరిఫికేషన్ బాగా జరిగింది. నాది బీసీ–బీలో మూడో పోస్టు. కానీ జాబ్ రాలేదు. నాకు ఇవ్వకుండా స్పోర్ట్స్ కేటగిరీలో ఇచ్చామని చెప్పారు. నాపేరు రిజెక్ట్ లిస్ట్లో కూడా లేదు. అదేమని అడిగితే సమాధానం చెప్పడం లేదు. నాకు అన్యాయం చేసి జీరో ర్యాంక్ ఉన్న వ్యక్తికి స్పోర్ట్స్ కోటా కింద జాబ్ ఇచ్చారు. – రాణి, కృష్ణా జిల్లాడిగ్రీ లేకున్నా పోస్టు ఇచ్చారు మాకు (మహిళలకు) ఓపెన్ కేటగిరీలో 30 పోస్టులు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా కింద అందులోకి ఒకరిని తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు డిగ్రీ లేదు కాబట్టి అది పూర్తి చేసుకోవడానికి మూడేళ్ల సమయం ఇచ్చారు. అంటే.. అర్హత లేకున్నా ఉద్యోగం ఇచ్చి, ఆ తర్వాత చదువుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆమెది ఓసీ. ఆమెను తీసుకొచ్చి మా కేటగిరీలో వేశారు. దాంతో నా ఛాన్స్ పోయింది. – వీరవేణి, తూర్పు గోదావరి జిల్లా కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. నాకంటే ముందు ఒకరికి ఉద్యోగం ఇచ్చారు. అతడిది ఫేక్ సర్టిఫికెట్ అని తేలడంతో పోస్టింగ్ ఆపారు. జాబితాలో ఆ తర్వాత ఉన్న నాకు ఉద్యోగం ఇవ్వకుండా క్యారీ ఫార్వర్డ్ చేశామని చెప్పారు. ఇక్కడ అన్ని అర్హతలున్న నేను ఉన్నా, నాకు జాబ్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. – సతీష్, పశ్చిమ గోదావరి జిల్లాఅన్నీ సరిగా ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు ఎస్సీ వర్గానికి చెందిన నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని ఓపెన్లో చూపారు. గ్రీవెన్స్ సెల్లో దరఖాస్తు చేస్తే నావన్నీ కరెక్టుగా ఉన్నాయని, జాబ్ ఎక్కడివ్వాలో తెలియడం లేదని సమాధానం చెప్పారు. ఆశ్చర్యం ఏమిటంటే నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారిని మా కేటగిరీలో చూపారు. నాకంటే తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని ఓపెన్లో చూపారు. ఎవరిని కలిసినా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. – కె.శరత్బాబు, కాకినాడ, తూ.గో జిల్లా స్పోర్ట్స్ కోటాలో ఆయా శాఖలు నిర్వహించే అర్హత పరీక్షల్లో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలని సవరించిన జీవో వైకల్యం సర్టిఫికెట్ ‘రిజెక్ట్’.. గెరివి అంజనప్పకు ఒక కన్ను పూర్తిగా లేదు. మరో కంటికి రక్త సరఫరా లేదు. ఆయనకు కంటి చూపు లేదని ధ్రువీకరిస్తూ మెడికల్ బోర్డు (అనంతపురం జీజీహెచ్) 40 శాతం వైకల్యంతో సర్టిఫికెట్ ఇచ్చినా పట్టించుకోకుండా రిజెక్ట్ చేశారు. విజయవాడ వచ్చి కమిషనరేట్లో కలిసినా తామేమీ చేయలేమంటున్నారు. – హెచ్.వసంత్కుమార్, అనంతపురం జిల్లా (అభ్యర్థి గెరివి అంజనప్ప తరపున మాట్లాడారు)ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది... నిబంధనలకు విరుద్ధంగా అడుగడుగునా అవినీతి, అక్రమాలతో డీఎస్సీ –2025 ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. 1 : 1 పద్ధతిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి హాజరై ఉద్యోగం వస్తుందన్న భరోసాతో ఇంటికెళ్లిన వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. స్పోర్ట్స్ కేటగిరీ పేరుతో అర్హులైన అభ్యర్థుల పొట్టగొట్టారు. అర్హులకు అన్యాయం చేసి పోస్టులను అమ్ముకోవడంపై సీబీఐతో విచారించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. – ఎ.రవిచంద్ర, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
సభలో చంద్రబాబు పరువు తీసిన ప్రజలు
-
మా భూములివ్వం.. బాబు ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో ఇప్పటికే 50 వేల ఎకరాలు తీసుకున్న చంద్రబాబు సర్కారు.. మరో 50 వేల ఎకరాలు కావాలంటూ తమను వేధిస్తోందని, మూడు పంటలు పండే పచ్చటి భూములను ఇచ్చేదే లేదని ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామాల రైతులు స్పష్టం చేశారు. తమ ప్రమేయం లేకుండానే లే అవుట్లు, ప్లాట్లు వేస్తోందని.. రిజిస్ట్రేషన్లు సైతం చేసేస్తోందని మండిపడ్డారు. తరతరాలుగా భూమిని నమ్ముకుని బతుకుతున్న తమకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తమ గోడు ఏమాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో దిక్కుతోచక వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ కష్టాన్ని వివరించామని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి నేతృత్వంలో ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామాలకు చెందిన రైతులు వైఎస్ జగన్ను కలిసి తమ కష్టాలను వివరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఒప్పందం ప్రకారం డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని చెప్పారు. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పట్ల మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. రెండో విడత భూసేకరణ పేరుతో రైతులను భయపెడుతున్నారని, ఉన్న అరెకరం పొలం ఇచ్చి తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తుండటం దుర్మార్గమన్నారు. పెనుమాకలో మినీ రిజర్వాయర్ పేరుతో పనులు మొదలుపెట్టిన ప్రభుత్వం.. రైతుల పొలాలను అడ్డగోలుగా తవ్వేసిందని చెప్పారు. పక్కనే భూ సేకరణకు భూములివ్వని రైతుల పొలాలను 20 అడుగుల లోతు వరకు చెరువుల్లా తవ్వేసి.. వ్యవసాయానికి పనికి రాకుండా చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షంతో ఆ పొలాలన్నీ చెరువుల్లా మారిపోయాయని చెప్పారు. తామంతా (రైతులు) ఆవేదనతో అల్లాడిపోతుంటే కూటమి నాయకులు మాత్రం పొలాల్లో తవ్వేసిన మట్టి, ఇసుక అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికే రాజధాని కోసం ఇళ్లు, పొలాలను ఇచ్చేసిన రైతులకు ప్రభుత్వం వాగుల్లో ప్లాట్లు కేటాయించడం అత్యంత దారుణమని మండిపడ్డారు.ఎంత మంది రైతులను చంపేద్దామనుకున్నారు?రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఒప్పందం ప్రకారం డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పట్ల మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఉన్న అరెకరం పొలం ఇచ్చి కుటుంబాలను ఎలా పోషించుకోవాలన్న రైతుల ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. అనుమతి లేకుండా రైతుల పొలాలను అడ్డగోలుగా తవ్వేయడం దుర్మార్గం కాదా? భూసేకరణకు భూములివ్వని రైతుల పొలాల్లో 20 అడుగుల లోతున చెరువుల్లా తవ్వేశారు. ఇటీవల కురిసిన వర్షంతో ఆ పొలాలన్నీ చెరువుల్లా మారాయి. డ్రెడ్జింగ్ చేసి ఇసుకను పక్కనే కుప్పలుగా పోశారు. రైతులు ఆవేదనతో అల్లాడిపోతుంటే కూటమి నాయకులు మాత్రం రైతుల పొలాల్లో మట్టి, ఇసుక అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. మంచి ప్లాట్లు నేతలు తీసుకుని, రైతులకు వాగుల్లో ప్లాట్లు కేటాయించడం చూసి ఎంతో మంది బోరున విలపిస్తున్నారు. ఇలా అధికారులకు తన గోడు చెప్పుకుంటూనే ఓ రైతు గుండె పగిలి చనిపోయాడు. ఇప్పుడు రైతుల పొలాలను తవ్వేసి, ఇంకెంత మంది రైతులను ఇలా చంపేద్దామనుకుంటున్నారు? కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసం రైతుల జీవితాలను మట్టిపాలు చేయాలనుకోవడం చాలా తప్పు. బలవంతపు భూసేకరణ పేరుతో రైతులను వేధించడం ఇకనైనా ఆపాలి. – దొంతిరెడ్డి వేమారెడ్డి, వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తవైఎస్ జగన్ హామీతో ధైర్యం వచ్చిందిచంద్రబాబు ప్రభుత్వ తీరుతో తామంతా నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నామని, ఈ ప్రభుత్వం తమ పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని రాజధాని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధలను సీఆర్డీఏ కమిషనర్, మంత్రి లోకేశ్.. ఉండవల్లిలోనే ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వినలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నామని తెలిపారు. ఉన్న అరకొర భూములు ప్రభుత్వానికి ఇచ్చేస్తే తరతరాలుగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాల భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశామన్నారు. తమ బాధలను సావధానంగా విన్న వైఎస్ జగన్.. అండగా ఉంటామని తమకు హామీ ఇచ్చినట్టు రైతులు తెలిపారు. ఈ అన్యాయంపై రైతుల పక్షాన నిలబడి న్యాయస్థానాల్లో పోరాడతామని హామీ ఇచ్చారన్నారు. జగన్ హామీతో తమకు ధైర్యం కలుగుతోందన్నారు. ప్రభుత్వమే దగ్గరుండి రైతుల పొలాలను తవ్వేయడం, భూములు ఇవ్వని రైతుల పొలాల్లో వారి అనుమతి లేకుండా లే అవుట్లు వేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని తెలుసుకుని వైఎస్ జగన్ మండిపడ్డారని తెలిపారు.చంద్రబాబు, లోకేశ్ మా గోడు వినలేదునాకు ఉన్నదే కొంచెం భూమి. అందులో కొంత కృష్ణా నదిలో కొట్టుకుపోయింది. మిగిలింది సీడ్ యాక్సిస్ రోడ్ అంటున్నారు. దాని పక్కనే బఫర్ జోన్ అంటున్నారు. ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని భూమిలో కూడా లేఅవుట్ వేశారు. నాకు భూమి మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. సీఆర్డీఏ కమిషనర్ మా మొర ఆలకించడం లేదు. మా ఎమ్మెల్యే లోకేశ్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోనే ఉంటారు. మా రైతులను పిలిచి మా గోడు వినాలి. పచ్చని పంటలు పండే భూములు ఇవ్వడానికి మేం సిద్ధంగా లేము. ప్రభుత్వం స్పందించక పోవడంతో న్యాయం చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశాం. వైఎస్సార్సీపీ లీగల్గా అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. – శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి రైతుభూములివ్వడం ఇష్టం లేదుతరతరాలుగా మేము అనుభవిస్తున్న భూమిని ల్యాండ్ పూలింగ్కు ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. 12 ఏళ్లుగా ఇదే మాట మీదే ఉన్నా. ఈ భూమిని నమ్ముకునే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. పిల్లలను చదివించుకుంటున్నా. అన్నం పెట్టే పొలాన్ని ఇవ్వడం మాకిష్టం లేదు. – శంకర్రావు, ఎర్రపాలెం రైతుప్రభుత్వం తీరుతో నిద్ర కరువు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కారణంగా మేం రోజూ నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వడం ఇష్టం లేదని మొత్తుకుంటున్నా నోటీసులు, నోటిఫికేషన్ల పేరుతో మమ్మల్ని అధికారులు వేధిస్తున్నారు. వైఎస్ జగన్ హామీతో మాకు ధైర్యమొచ్చింది. – అశోక్ రెడ్డి, ఉండవల్లి రైతుమా పొలాన్ని పనికి రాకుండా చేశారుమా గ్రామ రైతులు ఏడాదంతా పూల తోటలు సాగు చేస్తారు. ఎకరం పొలంలో ఏడాదికి రూ.3–4 లక్షలు సంపాదిస్తాం. రెండెకరాలున్న రైతులు ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా తరతరాలుగా బతుకుతున్నారు. మొదటి విడత భూసేకరణకు పోను మా గ్రామంలో 450 ఎకరాల భూమి మాత్రమే మిగిలి ఉంది. మా సమ్మతి లేకుండానే ఆ భూముల్లో కూడా ప్లాట్లు వేసి రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రభుత్వమే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. మా పొలాల చుట్టూ మెరక తోలేస్తున్నారు. వర్షాలు కురిస్తే నీరు నిలబడిపోయి ఆ పొలం వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది. ఇలాగైతే మేం ఏం తిని బతకాలి? – శివరామ్, రైతు, నిడమర్రు -
అయ్యా మీరే దిక్కు ఉండవల్లి రైతులు ఆవేదన
-
చంద్రబాబుకి షాకిచ్చిన రాజధాని రైతులు
సాక్షి, తాడేపల్లి: అమరావతి రాజధాని భూముల అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేసింది. భూసేకరణను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సమయంలోనే ఉన్నపళంగా ఆ గ్రామాల్లో సీఆర్డీఏ గ్రామసభ నిర్వహించడం తీవ్ర దుమారం రేపింది. ఇది “కుట్ర రాజకీయాలే”నని చెబుతూ.. చంద్రబాబు సర్కార్కు రైతులు షాకిచ్చారు. గ్రామసభల్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంత రైతులు మరోసారి తమ సమస్యలతో రోడ్డెక్కారు. పెనుమాక, ఉండవల్లి ప్రాంత రైతులు తమ భూములపై కొనసాగుతున్న వివాదాలు, నోటిఫికేషన్లు, నోటీసులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలియకుండానే భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేశారని, భూములు ఇవ్వాల్సిందేంటూ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.తమ సమస్యలను నేరుగా మాజీ సీఎం వైఎస్ జగన్కు చెప్పుకోవడానికి రైతులు సిద్ధమవుతున్న తరుణంలోనే హఠాత్తుగా పెనుమాకలో సీఆర్డీఏ అధికారులు గ్రామసభ నిర్వహించడం మరింత చర్చనీయాంశంగా మారింది. “రాజధానికి భూమి ఇవ్వాలి” అనే పేరుతో సమావేశాలు పెట్టి తమపై ఒత్తిడి తెస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జగన్తో సమావేశం ఉన్న రోజే గ్రామసభ నిర్వహించడాన్ని రైతులు అనుమానాస్పదంగా చూస్తున్నారు. తమ గొంతు నొక్కే ప్రయత్నంగా ఇది మారిందని, ప్రభుత్వ వైఖరి వేధింపులుగా ఉందని వారు మండిపడుతున్నారు. అంతేకాదు.. గ్రామసభకు టీడీపీ నేతలను పిలవడంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రైతుల నిలదీతతో అధికారులు నీళ్లు నమిలారు. ఆపై చేసేది లేక టీడీపీ నేతలు, అధికారులు గ్రామసభ నిర్వహించకుండానే వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ అంశంలో న్యాయం చేయాలని కోరుతూ రైతులు వైఎస్ జగన్ను కలవబోతున్నారు. మరోవైపు భూసేకరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు ఇచ్చారని అధికారులు చెబుతున్నప్పటికీ, రైతులు మాత్రం “తొలి విడతలోనే భూములు ఇచ్చాం… మళ్లీ భూములు ఎలా ఇవ్వాలి?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు లేకపోతే ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య తమ బాధలను నేరుగా జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు ముందుకు రావడం, మరోవైపు అదే సమయంలో గ్రామసభ నిర్వహణకు ముందుకు రావడం.. ఆ సభను రైతులు బహిష్కరించడం.. రాజధాని రాజకీయాల్లో కొత్త దుమారానికి దారి తీసింది. -
చంద్రబాబు సర్కారుపై 'సమరభేరి'
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సమరభేరి మోగింది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం యువతరం కదంతొక్కింది. చంద్రబాబు సర్కారుపై గళమెత్తి గర్జించింది. వినూత్న నిరసనలు, ప్రదర్శనలతో రణన్నినాదమై రగిలింది. డీఎస్సీ పేపర్ లీక్, అడుగడుగునా చోటుచేసుకున్న అవకతవకలు స్పోర్ట్స్ కోటా పోస్టుల అమ్మకంపై దుమ్మెత్తిపోసింది. మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. తక్షణం అర్హులకు న్యాయం చేయాలని, లేకుంటే మెగా డీఎస్సీ పేరుతో దగా చేసిన చంద్రబాబు సర్కారుకు ఘోరీ ఖాయమని ధ్వజమెత్తింది. ప్రతిభకు పాతరేయడం, రిజర్వేషన్లకు గండికొట్టడంపై భగ్గుమంది. కాసులిచ్చిన వారికే పోస్టులు దక్కడంపై మండిపడింది. తక్షణం సీబీఐ విచారణ జరపాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని నినదించింది. ఈ సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాల నేతలు, వైఎస్సార్ సీపీ నాయకులు కలెక్టర్లు, ఆర్డీవోలకు వినతిపత్రాలు సమర్పించారు. సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టారని గుర్తుచేశారు. ముందే మెరిట్ లిస్టు ప్రకటించి అర్హులకు వైఎస్ జగన్ ఉద్యోగాలిచ్చారని ప్రశంసించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనకాపల్లిలో మానవహారం చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, కృష్ణాజిల్లా మచిలీపట్నంలోనూ యువత ఆందోళన చేశారు. కలెక్టర్లకు వినతిపత్రాలిచ్చారు. బందరులో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లా నరసరావుపేట, బాపట్లలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యువత కదంతొక్కారు. కలెక్టరేట్ల వద్ద దర్నాలు నిర్వహించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు. ప్రకాశం జిల్లాల్లోనూ ఆందోళనలు జరిగాయి. నెల్లూరులో పోలీసులు కలెక్టరేట్కు తాళాలు వేశారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోనూ యువకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ యువకులు ర్యాలీలు నిర్వహించారు. పోలీసులు అడ్డుకోవడంతో వైఎస్సార్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ ఆందోళనలు సాగాయి. చిత్తూరు కలెక్టరేట్ వద్ద యువకులు మెడకు ఉరితాళ్లు బిగించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా కలెక్టరేట్లను యువకులు ముట్టడించారు. వైఎస్సార్ కడప జిల్లాలో యువత బైక్ ర్యాలీలు నిర్వహించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా యువత కదంతొక్కింది. డీఎస్సీ అక్రమాల బాధ్యుల్ని శిక్షించాల్సిందే: జక్కంపూడి రాజాసాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకొంటున్న మెగా డీఎస్సీ అడుగడుగునా అక్రమాలు, అవకతవకలతో దగా డీఎస్సీగా మారిందని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఫలితాల్లో జరిగిన భారీ కుంభకోణానికి పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. డీఎస్సీ బాధితులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు భారీ నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేసి, అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం విశాఖ మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన అత్యంత పారదర్శకమైన డీఎస్సీ నోటిఫికేషన్ను అడ్డగోలుగా రద్దుచేసి, ధనార్జనే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇచ్చిందని విమర్శించారు. ‘అర్హులకు కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో బేరాలు కుదుర్చుకున్న వారికే కాల్ లెటర్లు ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్పోర్ట్స్ కోటా జీవోలను ఇష్టారాజ్యంగా మార్చి తాడాట, బొంగరం ఆటలు ఆడేవారికి ఉద్యోగాలిచ్చి అర్హులైన ప్రతిభావంతులను ముంచేశారు. లోకేశ్ను వెంటనే కేబినెట్ నుంచి తప్పించి, ఈ వ్యవహారంలో ఆయన్ని ఏ–1గా చేర్చి అరెస్టు చేయాలి’ అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు మాట్లాడుతూ డీఎస్సీ కుంభకోణంపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. -
అర్హులను తొక్కేసి.. అడ్డగోలు డ్రామాలు!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ –2025లో అక్రమాలను కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు పడరాని పాట్లు పడుతోంది! అడ్డదారిలో ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా అవన్నీ సక్రమమే అంటూ అడ్డగోలుగా అబద్ధాలు చెబుతోంది. ఓ అభ్యర్థి గతంలో తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో (రెండు వేర్వేరు పుట్టిన తేదీలు) సంపాదించిన క్రీడల సర్టిఫికెట్తో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోస్టల్ శాఖ నిర్ద్వందంగా తిరస్కరించింది. అలాంటి అభ్యర్థికి ఈ డీఎస్సీలో ఏకంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టు కట్టబెట్టేసి ఎలాంటి తప్పులేదంటూ రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకోవడం విస్తుగొలుపుతోంది.సోమవారం సచివాలయంలో పర్యాటక, యుజవన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్, శాప్ ఎండీ భరణిని ముందుపెట్టి ప్రభుత్వం తన తప్పులను ఒప్పులుగా చిత్రీకరించేందుకు యత్నించి భంగపడింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మభ్యపెట్టే యత్నం చేసింది. క్రీడా సర్టిఫికెట్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది, శాప్ అధికారులది కాదని.. క్రీడా సంఘాలు మాత్రమే ఇస్తాయంటూ అర్థంలేని వాదన వినిపించింది. డీఎస్సీ క్రీడా కోటాలో ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను వెబ్సైట్లో, బహిరంగంగా ప్రదర్శించకుండా దాచిపెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ‘క్రిడయ్’ యాప్లో పెట్టామంటూ సమర్థించుకోవడం దుర్నీతిని బట్టబయలు చేస్తోంది.కోర్టు కేసులను ఎదుర్కొని పారదర్శకంగా నియామకాలు చేపట్టినట్లు స్పెషల్ సీఎస్ అజయ్జైన్ గొప్పగా ప్రకటించారు. అయితే, అంతర్ జిల్లా స్థాయిలో సర్టిఫికెట్లు తెచ్చుకున్న క్రీడాకారులకు యథేచ్ఛగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసిన ప్రభుత్వం.. అంతర్జాతీయ క్రీడాకారులకు మాత్రం పోస్టులు ఇచ్చేందుకు ఎందుకు నిరాకరించిందో మాత్రం చెప్పడం లేదు. ఆయా అంతర్జాతీయ క్రీడాకారులు హైకోర్టును ఆశ్రయించగా అధికారుల తీరును తప్పుబట్టి అక్షింతలు వేసిన తరువాతే డీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారు.మరి పారదర్శకత ఎక్కడ పాటించారు? హైకోర్టు ఆదేశాలతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పుకొచ్చారు. మరి నియామకాల సమయంలోనే తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందుతున్న వారి వివరాలతో సహా అర్హులైన అభ్యర్థులు శాప్కు ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోలేదో చెప్పలేక నీళ్లు నమిలారు. ఇక ఈ డీఎస్సీ తర్వాత క్రీడా కోటాలో రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ జీవోను సవరించడంపై అధికారులు వివరణ ఇస్తూ.. ప్రభుత్వ పాలసీ పర్మినెంట్గా ఉండదని సమర్థించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ప్రభుత్వానికి పాలసీ పర్మినెంట్గా ఉండదట!మీడియా: డీఎస్సీ ముగిసిన తర్వాత స్పోర్ట్స్ కోటా 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ జీవోను ఎందుకు సవరించారు? మళ్లీ రాత పరీక్షను ఎందుకు తప్పనిసరి చేశారు? క్రీడా సర్టిఫికెట్లు, డిగ్రీల జెన్యూనుటీని ఎలా పరిశీలించారు?స్పెషల్ సీఎస్, శాప్ ఎండీ: ప్రభుత్వానికి పాలసీలు పర్మినెంట్గా ఉండవు. క్రీడా పాలసీ కూడా అంతే. క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్ను బట్టి పాలసీ మారిపోతుంది. అప్పటి పాలసీ ప్రకారం రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చాం. కొన్నిసార్లు చట్టాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. శాప్లో ప్రత్యేక స్రూ్కటినీ బృందాలను పెట్టి ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీ ద్వారా 1 : 5 నిష్పత్తిలో జాబితా తయారు చేశాం. వాటిని వారం రోజులు వెబ్సైట్లో పెట్టి అభ్యంతరాలు స్వీకరించి తర్వాత తుది జాబితాను సిద్ధం చేశాం. 421 పోస్టులకుగాను 382 పోస్టులు భర్తీ చేశాం. క్రీడా సంఘాలు, ఫెడరేషన్ల నుంచి జెన్యూనుటీ సర్టిఫికెట్లు తీసుకొచ్చాం. స్రూ్కటినీ కమిటీలో ఆయా వర్సిటీల అధికారులు పరిశీలించి ఓకే చేశారు.ఇదీ వాస్తవం: ప్రభుత్వం చెబుతున్నట్లుగా క్రీడా సంఘాలు, ఫెడరేషన్ల నుంచి క్రీడాకారుల జెన్యూనుటీ సర్టిఫికెట్లను తీసుకుంటే ఒక్కటి కూడా మీడియాకు చూపించలేదు. వాస్తవానికి ధ్రువపత్రాల పరిశీలన సమయంలో క్రీడా సంఘాల ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించాలి. జాతీయ స్థాయిలో అయితే ఫెడరేషన్ సభ్యులు ప్రభుత్వ నియామకాల్లో కచ్చితంగా పాల్గొంటారు. గత ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగాల భర్తీ సమయంలో తొలుత జిల్లా స్థాయిలో ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో వడపోత చేపట్టారు. పైగా అçప్పుడు రాత పరీక్షల్లో అర్హత సాధిస్తే ఉద్యోగం కల్పించారు. డీఎస్సీ మాదిరిగా క్రీడా సర్టిఫికెట్ చూసి ఉద్యోగం ఇవ్వలేదు. 1.34 లక్షల మందితో సచివాలయాల ఉద్యోగాల భర్తీ నిర్వహించినప్పుడు రాని ఆరోపణలు ఇప్పుడు 2025 డీఎస్సీలో మాత్రమే ఎందుకు వస్తున్నాయో ఈ ప్రభుత్వం చెప్పలేకపోతోంది. పైగా ఇతర రాష్ట్రాల్లో చదివిన ఉద్యోగార్థుల వివరాలను ఆయా వర్సిటీల్లో పరిశీలించకుండానే చేసేసినట్టు చెబుతోంది.శాప్.. పూటకో మాట!డీఎస్సీ ఉద్యోగార్థుల క్రీడా సర్టిఫికెట్లను పారదర్శకంగా స్రూ్కటీని చేసినట్లు స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ బల్లగుద్ది చెప్పారు. సర్టిఫికెట్ల పరిశీలనలో ‘శాప్’ పారదర్శకత ఏపాటిదో చెప్పేందుకు ఈ ఉదంతమే ఓ నిదర్శనం. 2024 సెప్టెంబర్లో న్యాయస్థానాల్లో ఉద్యోగాల భర్తీ సందర్భంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ క్రీడాకారుడు ‘ప్రాసెస్ సర్వర్ పోస్టు’ కోసం క్రీడా కోటాలో దరఖాస్తు చేసుకున్నారు. 2021 డిసెంబర్ 24–28 వరకు అనంతపురంలో జరిగిన సాఫ్ట్బాల్ నేషనల్ మీట్లో పాల్గొని తన టీమ్ రజత పతకం సాధించినట్లు అతడు పేర్కొన్నారు.ఈ క్రీడా సర్టిఫికెట్లు శాప్ పరిశీలనకు రావడంతో ‘మాస్టర్మైండ్’ తన వాటా కింద రూ.3 లక్షలు వసూలు చేసి అంతా సక్రమమేనంటూ అధికారులతో చెప్పించడంతో సదరు క్రీడాకారుడికి ఉద్యోగం వచ్చేసింది. అయితే దీనిపై ఓ అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగానికి ఎంపికైన సదరు క్రీడాకారుడు ఆ సమయంలో సాఫ్ట్బాల్ నేషనల్ మీట్లో పాల్గొనలేదని, ఆ సమయంలో అతడు ఓ కళాశాలలో బీపీఈడీ కోర్సు చదువుతున్నట్లు ఆధారాలు సమర్పించారు.దీనిపై సింగిల్ బెంచ్ ధర్మాసనం ఆదేశాల మేరకు మరోసారి సర్టిఫికెట్లను పరిశీలించిన శాప్ అధికారులు అవి సరైనవి కాదని తేల్చారు. దీనిపై సదరు క్రీడాకారుడు డివిజనల్ బెంచ్ను ఆశ్రయించగా శాప్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. తాము ఆ క్రీడాకారుడికి నోటీసులు ఇచ్చినప్పటికీ ఫిజికల్ టెస్టుకు హాజరు కాలేదని, ఆటలో నైపుణ్యం లేదని పేర్కొంది. దీనిపై తాజాగా హైకోర్టు శాప్ అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో స్పెషల్ సీఎస్ చెబుతున్నట్లుగా శాప్ నిజంగానే అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తుంటే కోర్టు ఉద్యోగాల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనపై పూటకో మాట ఎందుకు చెబుతోంది? ఏ రాజకీయ శక్తి చేతుల్లో శాప్ బందీగా మారిపోయింది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.తొలుత సదరు సాఫ్ట్బాల్ క్రీడాకారుడి సర్టిఫికెట్ సరైనదే అంటూ ధ్రువీకరించిన శాప్.. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో మరోసారి ఆ సర్టిఫికెట్లు నిజమైనవి కావంటూ మాట మార్చినట్లు స్పష్టం చేస్తున్న హైకోర్టు ఆర్డర్ సర్వీసు రూల్స్కు ముందు జీవో సవరణ?కూటమి ప్రభుత్వం తన తప్పులను సమర్థించుకునే క్రమంలో అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. డీఎస్సీ 2025 ముగియడమే ఆలస్యం.. స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వటాన్ని ఎత్తివేసింది. తొలుత డీఎస్సీకి ముందు ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు రూల్స్ను సవరిస్తూ 19–04–2025న అప్పటి సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారం డీఎస్సీలో పరీక్ష లేకుండా క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు.డీఎస్సీ ముగిసిన తర్వాత ఈ ఏడాది మే 15న ఏపీ సబార్డినేట్ అండ్ సర్వీసు రూల్స్ను మళ్లీ సవరిస్తూ సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కచ్చితంగా డిపార్ట్మెంట్ పెట్టే రాత పరీక్షలో అర్హత సాధించాలని పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే.. ఈ ఏడాది మే 15న సబార్డినేట్ అండ్ సర్వీసు రూల్స్ సవరణ కంటే ముందే.. మే 14 క్రీడా శాఖలో జీవోను సవరిస్తూ స్పెషల్ సీఎస్ అజయ్జైన్ ఉత్తర్వులు ఇవ్వడం!నేషనల్ గేమ్స్కు ప్రాధాన్యమా?క్రీడా పాలసీ 2024–29 రూపకల్పనలో కూటమి ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరించింది. ‘మాస్టర్మైండ్’ చెప్పినట్టే పాలసీ పురుడు పోసుకుంది. డీఎస్సీలో అక్రమాలకు మార్గం సుగమం అయింది. పాలసీ రూపకల్పన సమయంలోనే క్రీడా సంఘాలను ప్రభుత్వం సంప్రదించి ఉంటే.. సీనియర్ నేషనల్స్కు ప్రాధాన్యం దక్కాల్సిన చోట నేషనల్ గేమ్స్ పెట్టడంపై క్రీడా సంఘాలు ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తాయి? పదేపదే జీవోలను సవరించామని ఎందుకు డిమాండ్ చేస్తాయి? వీటికి ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేదు.గొప్పగా 65 క్రీడలకు అవకాశం కల్పించాలని చెబుతున్న ప్రభుత్వం.. ఏపీలో అంతగా ప్రాచుర్యంలో లేని క్రీడలను ఎందుకు చేర్చింది? ఫెడరేషన్లలో గుర్తింపు పొందిన ఏపీ క్రీడా సంఘాలకు కచ్చితంగా శాప్ గుర్తింపు ఇవ్వాల్సి ఉండగా వాటిని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తోంది? మాస్టర్మైండ్ మాట వింటేనే క్రీడా సంఘాలు మనుగడ సాగించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఇవన్నీ పరిశీలిస్తుంటే అర్హులకు పోస్టులు ఇవ్వకుండా అన్యాయం చేసినట్లు స్పష్టమవుతోంది.పోస్టల్ శాఖలో రిజెక్ట్.. డీఎస్సీలో పోస్టింగ్మీడియా: విజయనగరం జిల్లాలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి ఒకరు తప్పుడు డేట్ ఆఫ్ బర్త్లతో ఉద్యోగం పొందారని ప్రభుత్వానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే ఏం చేశారు? గతంలో పోస్టల్ శాఖ ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది కదా? పోలీసులు సైతం ఆమె తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో మోసం చేసినట్టు ధ్రువీకరించారు?స్పెషల్ సీఎస్, శాప్ ఎండీ: విజయనగరం జిల్లా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణిపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఆ జిల్లా ఎస్పీ సైతం దీన్ని ధ్రువీకరిస్తూ పత్రం ఇచ్చారు. సదరు క్రీడాకారిణి నేషనల్ గేమ్స్లో కాంస్య పతకం సాధించారు. ఆమె 20–5–1992 డేట్ ఆఫ్ బర్త్తో క్రీడల్లో పాల్గొంది. ఆమె స్కూల్లో డేట్ ఆఫ్ బర్త్ కూడా అదే. మేం క్రీడా సంఘాలు, ఫెడరేషన్ నుంచి సైతం జెన్యూనుటి తీసుకున్నాం.ఇదీ వాస్తవం: విజయనగరం జిల్లాకు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి రెండు పుట్టిన తేదీలతో చలామణి అయినట్లు జిల్లా ఎస్పీకి 08–4–2016న స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ నివేదిక సమర్పించారు. ఎస్వీఆర్ మూర్తి అనే వ్యక్తి సదరు క్రీడాకారిణిపై విశాఖ రేంజ్ డీఐజీకి ఆధారాలతో సహా 19–02–2016లో ఫిర్యాదు చేశారు. దీనిపై డీఐజీ ఆదేశాలతో విజయనగరం ఎస్పీ విచారణ చేపట్టారు. విచారణ చేసిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు 08–04–2016న సదరు క్రీడాకారిణి 20–05–1992, 10–05–1993 డేట్ ఆఫ్ బర్త్లతో చలామణి అయినట్టు ధ్రువీకరిస్తూ నివేదిక సమర్పించారు.తొలుత 10–05–1993 పుట్టిన తేదీతో (10–11–2010న) పాస్పోర్టు పొందగా, తర్వాత 06–08–2015న రూ.ఐదు వేలు జరిమానా చెల్లించి పుట్టిన తేదీ 20–05–1992తో కొత్త పాస్పోర్టు పొందినట్టు వెల్లడించారు. అయితే 10–05–1993 (తప్పుడు పుట్టిన తేదీ)తోనే ఆమె 2012లో కామన్వెల్త్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో 53 కిలోల మహిళల విభాగంలో ప్రాతినిధ్యం వహించింది. ఇలా అండర్ ఏజ్లో తప్పుడు డేట్ ఆఫ్ బర్త్తో జాతీయ పోటీల్లోనూ పాల్గొంది. ఇక 2015 సమయంలో 20–05–1992 పుట్టిన తేదీతో నేషనల్ గేమ్స్లో పాల్గొని పతకం సాధించింది.డీఎస్సీ నోటిఫికేషన్కు ముందు సదరు క్రీడాకారిణి పోస్టల్ శాఖలో ‘పోస్టల్ అసిస్టెంట్’ (రిజిస్టర్ నం, ఎస్పీ3ఈ153ఏ149బీఈ5ఎఫ్) ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలపై ఫిర్యాదులు అందడంతో పోస్టల్ శాఖ విచారించి ఆమెను ఉద్యోగానికి ఎంపిక చేయకుండా తిరస్కరించింది. అలా పోస్టల్ శాఖ సదరు అభ్యర్థి మోసాన్ని గుర్తించి ఎంపికకు నిరాకరిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నేషనల్ గేమ్స్లో 20–05–1992 తేదీతో ఆడారని, ఎటువంటి పోలీసు కేసులు లేవని చెబుతూ తన తప్పిదాన్ని సమర్థించుకుంటోంది.ఈ ఏడాది ఏప్రిల్ 24న ‘డీఎస్సీ డీల్స్’ కథనంలో సదరు క్రీడాకారిణి నియామకంపై ఆధారాలతో ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. అప్పటి నుంచి ఆమె క్రీడా సర్టిఫికెట్ జెన్యూనుటీ నిజమైనదేనని చెప్పాలంటూ క్రీడా సంఘాలపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం కాదా? 2025 ఆగస్టు 11న ఓ క్రీడాకారుడు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే అప్పుడు పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు తప్పును దాచేందుకు మల్లగుల్లాలు పడుతోంది. 2016లో విజయనగరం జిల్లాకు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి వేర్వేరు పుట్టిన తేదీలతో చలామణి అయినట్టు ధ్రువీకరించిన నివేదిక -
పేకాటలో ఫస్ట్ వస్తే టీచర్ ఉద్యోగం, సొల్లు కబుర్లు చెప్పడం కాదు
-
రెండేళ్ల పాలన నచ్చితే చప్పట్లు కొట్టండి.. తుని ప్రజల రియాక్షన్
-
బైజూస్ పేరుతో పచ్చ పైత్యం!
సాక్షి, అమరావతి: రెండేళ్ల పాలనలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోలేక ఎల్లో మీడియా ద్వారా గత ప్రభుత్వ పాలనపై విషం కక్కుతోంది. ఈ క్రమంలో పేదింటి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడిన ట్యాబ్ల పంపిణీని తీవ్రంగా తప్పుపట్టింది. పేదింటి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను ఉచితంగా అందించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన బైజూస్ కంటెంట్పై ఏడుపుగొట్టు రాతలు రాస్తోంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సాంకేతిక పరికరాలను రూపొందించే శాంసంగ్ సంస్థ ట్యాబ్లలో ఉచితంగా బైజూస్ కంటెంట్ను అందిచడాన్ని జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తోంది.వాస్తవానికి శాంసంగ్ సంస్థ 8.7 అంగుళాల స్క్రీన్తో ట్యాబ్లను రూపొందిస్తోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఒకే ప్రమాణాలతో తయారు చేస్తోంది. అలాంటి పేరెన్నిక కలిగిన ట్యాబ్లను చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. పైగా అందులో అత్యంత ఖరీదైన గ్లోబల్ కంటెంట్ను (బైజూస్) నిక్షిప్తం చేసి మరీ అందించింది. ఇంతటి విప్లవాత్మక చర్య విద్యా వ్యవస్థలో ఎన్నడూ జరగలేదు. దీన్ని ఓర్వలేని చంద్రబాబు అండ్ కో గతంలోనూ పిల్లలు ట్యాబ్ వాడి చెడిపోతున్నారంటూ తప్పులు రాతలు రాయించి పేదింటి విద్యార్థులను తీవ్రంగా అవమానించింది. ప్రజా వ్యతిరేకత పెరగడంతో ఇప్పుడు మరోసారి అక్కసు వెళ్లగక్కింది. 9 అంగుళాల స్కీన్ర్ పెడితే?చంద్రబాబు ఎల్లో మీడియా 8.7 అంగుళాక స్క్రీన్ నిబంధన కేవలం ఒక కంపెనీకే లబ్ధి చేకూర్చేందుకు పెట్టారని వింత వాదన తెరపైకి తెచ్చింది. అదే, 9 అంగుళాలు స్క్రీన్ పెట్టినా ఇలాంటి తప్పుడు వాదనే వినిపిస్తుంది. వాస్తవానికి చంద్రబాబు అండ్కోకు పేదింటి బిడ్డలు ఉన్నత ప్రమాణాలతో విద్యను నేర్చుకోవడం నచ్చదు. పేదలు అక్షర జ్ఞానానికి చేరువ అవుతున్న ప్రతిసారీ ‘ఆంగ్లం వద్దు.. తెలుగు ముద్దు’ అంటూ పుక్కిట ఉపన్యాసాలు గుప్పించి వ్యవస్థలను కలుషితం చేసింది. అందుకే జగన్ ప్రవేశపెట్టిన ఆంగ్ల మాధ్యమంపైనా బురదజల్లింది.అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాబ్ల పంపిణీని ఎత్తేసింది. రెండో ఏడాదికే విద్యార్థి కిట్లు (సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర) పంపిణీ చేయలేమంటూ ఎక్కడో జరుగుతున్న యుద్ధంపైకి నెపాన్ని నెట్టేసి తప్పించుకుంది. డీఎస్సీ నియామకాల అక్రమాలపై నిరుద్యోగ యువత రగలిపోతుంటే కనీసం స్పందించని చంద్రబాబు, ఎల్లో మీడియా.. ఉన్నట్లుండి బైజూస్కు దోచిపెట్టారంటూ అడ్డగోలు కథనం అచ్చేయడం విస్తుగొలుపుతోంది. -
దొంగ ఎత్తులు.. నక్కజిత్తులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తీరు దొంగే దొంగా.. దొంగా.. అని అరిచినట్లుంది. నక్కజిత్తులతో ప్రజలను మాయ చేయాలని చూస్తోంది. ఉచిత ఇసుక ముసుగులో రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు ఎప్పటిలాగే తప్పుడు ప్రచారానికి దిగింది. తానే ఇసుక దందా నడుపుతూ గతంలో అక్రమాలు జరిగాయని విష ప్రచారం చేస్తోంది. ఇందుకు ‘ఈనాడు’ తందానా అంటోంది. ఈ క్రమంలో జగన్ హయాంలో ఇసుక దోపిడీ జరిగిందని, దానికి భారీగా జరిమానాలు విధిస్తున్నారంటూ అడ్డగోలు కథనం అచ్చేసింది. ప్రస్తుత చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో, 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఇష్టానుసారం సాగాయి. సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఇంటి వెనుక కూత వేటు దూరంలోనే ఇసుక మాఫియా కృష్ణా నదిని కొల్లగొట్టడంపై 2019 ఏప్రిల్ 4వ తేదీన ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అక్రమాలకు కళ్లెం వేస్తూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా సైతం విధించింది. రాష్ట్రంలో ఇసుక అక్రమాలపై గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సిట్ కూడా కేసు నమోదు చేసింది. ఇప్పుడు కూడా అదే ప్రాంతంలో ఇసుక తవ్వకాలు ఇష్టానుసారం జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పట్లో ప్రభుత్వానికి ఆదాయం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పారదర్శక ఇసుక విధానం అమలైంది. 2019 వరకు ఇసుకపై ఒక్క రూపాయి ఆదాయం రాని పరిస్థితుల్లో పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించి, ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేలా చేసింది. ఐదేళ్లలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.3,750 కోట్ల ఆదాయం లభించింది. ఆదాయం రావడమే కాకుండా, ఇసుక తవ్వకాలు క్రమబద్ధంగా జరిగి ప్రజలకు సులభతరంగా ఇసుక అందుబాటులోకి వచ్చింది. ధరలు కూడా టీడీపీ ప్రభుత్వం కంటే బాగా తగ్గాయి. బాబు రాగానే అక్రమాలు మొదలు2024లో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఇసుక దందా మొదలైంది. ఎన్నికల ఫలితాలు వచ్చీ రావడంతోనే.. జగన్ ప్రభుత్వం వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 70కిపైగా రీచ్ల్లో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకపై టీడీపీ నేతల కన్ను పడింది. నేతలు ఎక్కడికక్కడ ఆ ఇసుక యార్డులను స్వాధీనంలోకి తీసుకుని యథేచ్ఛగా అమ్మేసుకున్నారు. సగానికి పైగా ఇసుక అమ్మేసుకున్నాక.. యార్డుల్లో పెద్దగా నిల్వలు లేవంటూ మిగిలిన కొద్దిపాటి ఇసుకను ప్రజలకు విక్రయించారు. అనంతరం ఉచిత ఇసుక విధానం అని చెప్పి రీచ్లు, స్టాక్ యార్డుల్లో ధరల పట్టిక పెట్టి మరీ ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. తవ్వకం చార్జీలు, లోడింగ్ చార్జీలు, రవాణా చార్జీలు అన్నీ కలిపి టన్ను ఇసుక రూ.1000 నుంచి రూ.2 వేల వరకు విక్రయిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఇసుక రీచ్లు, డీ సిల్టింగ్ పాయింట్లను టెండర్ల విధానంలోనే టీడీపీ నేతలకు కట్టబెట్టి అధికారికంగానే ఇసుకను అమ్ముతున్నారు. తవ్విన ఇసుకలో కొంత స్థానికంగా అమ్ముతూ, మిగిలిన ఇసుకను హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్ వంటి పెద్ద నగరాలకు తరలిస్తున్నారు.ప్రస్తుతం యథేచ్ఛగా⇒ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉచితం ముసుగులో ఇసుక అక్రమాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు.. నదులు, వాగులు, వంకలే కాకుండా పొలాలను కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్లు ఇసుక తవ్వి, అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. గోదావరి, కృష్ణ, పెన్నా, చిత్రావతి, నాగావళి సహా అన్ని నదుల నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది.⇒ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను పట్టించుకోకుండా, సుప్రీంకోర్టు సూచనలను సైతం లెక్క చేయకుండా.. అనుమతి లేని రీచ్లలో ఇసుకను తోడేస్తున్నారు. కార్మికులతోనే తవ్వకాలు చేయాల్సివుండగా, ప్రతిచోటా పొక్లెయిన్లు, జేసీబీలు, హిటాచీల వంటి భారీ యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి. ఉచితం అంటూనే 18 టన్నుల లారీ ఇసుకను రూ.30-60 వేల వరకు అమ్ముతున్నారు.⇒ ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల నుంచి హైదరాబాద్కు, అనంతపురం సరిహద్దుల నుంచి కర్ణాటకకు, చిత్తూరు సరిహద్దు నుంచి కర్ణాటక, తమిళనాడుకు భారీ ఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతోంది. అన్నిచోట్లా కూటమి ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నాయి. వారి ఆధ్వర్యంలోనే అక్రమ తవ్వకాలు జరుగుతుండగా.. చినబాబుకు ఆ మేరకు కమీషన్లు ఠంచనుగా చేరిపోతున్నాయి.⇒ చినబాబుకు కప్పం చెల్లిస్తూ ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు.. నదులు, వాగులను కొల్లగొడుతూ వేల కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాను దాచి పెట్టేందుకు గతంలో అక్రమాలు జరిగాయని, ఆ అక్రమాలకు జరిమా నాలు విధిస్తున్నారని ఎల్లోమీడియా అండతో చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేస్తోంది. -
అంతులేని నిర్లక్ష్యం.. అర్హులకు అన్యాయం!
సాక్షి, అమరావతి: పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు టీచర్ పోస్టులపై ఎంతో ఆరాటంతో అహోరాత్రులు డీఎస్సీ–2025 కోసం శ్రమిస్తే చంద్రబాబు సర్కారు అక్రమాలతో నింపేసిందని నిప్పులు చెరుగుతున్నారు. మెరిట్.. వెర్టికల్.. హారిజాంటాల్ రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా సర్టిఫికెట్ల పరిశీలనకు ఒక పోస్టుకు ఒక్కరినే పిలవడం, ధ్రువపత్రాల్లో లోపాలుంటే సరిచేసుకునే అవకాశం ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారని అభ్యర్థులు వాపోతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక పాత్ర పోషిస్తుంది. పోస్టుల భర్తీ విధివిధానాలను అత్యంత జాగరూకతతో రూపొందిస్తుంది. ఆ విధానాలను మెగా డీఎస్సీ 2025లో ఒక్కటీ అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ అభ్యర్థులకు తీరని నష్టం వాటిల్లిందని పేర్కొంటున్నారు. జిల్లా ఎంపిక కమిటీలు చేయాల్సిన పనిని కేంద్ర కార్యాలయమే చక్కబెట్టడం.. తాము ఇచ్చిన జాబితాలోని అభ్యర్థులనే సర్టిఫికెట్ల పరిశీలనకు పిలవటాన్ని చూస్తుంటే గూడుపుఠాణి బోధపడుతోందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘నేను 25 ఏళ్లుగా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నా. ఎన్నో డీఎస్సీలు నిర్వహించినా ఈ తరహా ప్రక్రియ ఎన్నడూ చూడలేదు. ఏం జరిగిందో చెప్పలేని పరిస్థితి..’ అని విద్యాశాఖ కీలక అధికారి ఒకరు వ్యాఖ్యానించడం మెగా డీఎస్సీ నిర్వహణలో లొసుగులకు అద్దం పడుతోంది. అవకాశం ఇవ్వకుండా అక్కడికక్కడి రిజెక్ట్..! ఏపీపీఎస్సీ ప్రస్తుతం వివిధ ఉద్యోగాల భర్తీకి 1:1 నిష్పత్తిలో ఫలితాలు విడుదల చేస్తోంది. పరీక్షల అనంతరం సర్టిఫికెట్ల పరిశీలనకు ముందు అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్లు, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ పరిశీలించిన తర్వాతనే 1:1 నిష్పత్తిలో ఫలితాలను ప్రకటిస్తోంది. సర్టిఫికెట్ల పరిశీలనకు ఏవి తేవాలో ప్రచురిస్తుంది. విడుదల చేసిన ఫలితాల్లో హాల్టికెట్ నంబర్ ఉన్నవారు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరవుతారు. నిర్ణీత సర్టిఫికెట్లు లేకుంటే సమర్పించేందుకు అవసరాన్ని బట్టి 3 రోజుల వరకు గడువునిస్తారు. ఈలోగా సదరు అభ్యర్థి పరిస్థితిపై ప్రత్యేక ఫైల్ అంతర్గతంగా సిద్ధం చేస్తారు. ఎలాంటి సర్టిఫికెట్లు లేవు..? ఎన్ని రోజులు గడువు ఇచ్చారు..? ఒకవేళ సర్టిఫికెట్లు తేలేకపోతే తర్వాత మెరిట్ అభ్యర్థి ఎవరు..? అనేది అందులో ఉంటుంది. ఇచ్చిన గడువులోగా బోర్డు సంతృప్తి చెందితే ఎంపిక చేస్తారు. లేదంటే రెండో స్థానంలో ఉన్న అభ్యర్థిని పిలుస్తారు. కానీ మెగా డీఎస్సీ–2025లో అంతా తారుమారుగా చేశారు. 1:1 నిష్పత్తిలో అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపినా మెరిట్ కమ్ రిజర్వేషన్ (వర్టికల్/హారిజాంటాల్) ప్రకారం చేయలేదని తేటతెల్లమవుతోంది. ఇలా చేస్తే అన్ని విధాలుగా అర్హులైన వారికి మాత్రమే కాల్ లెటర్లు వెళతాయి. అన్నీ సక్రమంగా ఉన్న అభ్యర్థులకు తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది. కానీ డీఎస్సీ 2025 కాల్ లెటర్ల విడుదలకు ముందు ఎలాంటి రిజర్వేషన్లను పరిశీలించిన దాఖలాలు లేవు. నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన డీఎస్సీ అభ్యర్థుల పత్రాలకు సంబంధించి చిన్న లోపం కనిపించినా ఒక్కరోజు కూడా గడువు ఇవ్వకుండా అక్కడే తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఇదేం రిజర్వేషన్ లెక్కో? 1:1 నిష్పత్తి ప్రకారం జోన్ ఆఫ్ కన్సిరడేషన్, పోస్ట్ పరిధిలోకి వచ్చిన వారికి మాత్రమే కాల్ లెటర్లు పంపి సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచినట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. హారిజాంటాల్ రిజర్వేషన్ ప్రకారం ఒక కేటగిరీలో 10 పోస్టులు ఉంటే అందులో 7 పోస్టులు మెరిట్ ద్వారా, 3 పోస్టులు హారిజాంటాల్ ద్వారా (ఉమెన్/ స్పోర్ట్సు/ఎక్స్ సర్వీస్మెన్/ పీడబ్లు్యడీ (ప్రత్యేక అవసరాలు) భర్తీ చేయాలని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన బాధిత అభ్యర్థి ఏకాంబరం (బీసీ–డీ) వివరాలను ఉదహరించారు. చిత్తూరు జిల్లాలో బీసీ–డీ కేటగిరిలో 7 పోస్టులు ఉండగా ఒకటి హారిజాంటాల్లో ఉమెన్కు కేటాయిస్తూ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. భర్తీ ప్రక్రియలో 5 పోస్టులను మెరిట్ ప్రకారం, 2 పోస్టులను హారిజాంటల్లో భర్తీ చేసినట్లు అధికారులు చెప్పారు. మెరిట్లో చివరి ర్యాంకర్ 114కి ఇచ్చామని (వాస్తవానికి 114వ ర్యాంకు అభ్యర్థి ఎస్టీ అయినా బీసీ–డీలో చూపించారు), కానీ ఏకాంబరం ర్యాంకు 125 కాబట్టి అతడికి పోస్టు వచ్చే అవకాశం లేదని చెప్పారు. మెరిట్లో ఉమెన్ లేకపోతే హారిజాంటాల్ ప్రకారం కింద ర్యాంకు ఎంత ఉన్నా పైకి తెచ్చి భర్తీ చేయాలని పేర్కొన్నారు. అర్హత ఉన్నా ఏకాంబరానికి అన్యాయం! వాస్తవానికి మెరిట్లో భర్తీ చేసిన ఐదు పోస్టుల్లో చివరి అభ్యర్థి ఉమెన్. ఆమె ఓవరాల్ ర్యాంకు 116. దీంతో హారిజాంటల్ పోస్టు భర్తీ అయిపోయింది. ఇక మిగిలిన రెండు పోస్టులను మెరిట్లో భర్తీ చేయాలి. 116వ ర్యాంకు అభ్యర్థి తర్వాత... ఆరో స్థానంతో 125వ ర్యాంకు సాధించిన ఎం.ఏకాంబరం ఉన్నారు. అతడికి ఒక పోస్టు ఇస్తే, మరో పోస్టును 133వ ర్యాంకులో ఉన్న మరో అభ్యర్థికి (బీసీ–డీలో 7వ ర్యాంకు) ఇవ్వాలి. కానీ చివరి రెండు పోస్టులను పీహెచ్ అభ్యర్థులతో నింపారు. వాస్తవానికి జిల్లాలో ఎస్ఏ సోషల్కు 113 పోస్టులు ఉన్నాయి. వీటిని అన్ని కేటగిరీల (బీసీ, ఎస్సీ,ఎస్టీ, ఓసీ) అభ్యర్థులకు వర్టికల్ రిజర్వేషన్లో చూపించారు. అయితే స్పోర్ట్సు, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్లు్యడీ వారికి వర్టికల్ రిజర్వేషన్లో కాకుండా హారిజాంటల్లో చూపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీల్లో ఏ కేటగిరీలో ఎవరిని భర్తీ చేస్తారో నోటిఫికేషన్లో చెప్పకుండా బీసీ–డీ కేటగిరీలోని రెండు పోస్టులను పీడబ్లు్యడీ అభ్యర్థులకు ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మొత్తం అన్ని పోస్టులోనూ హారిజాంటల్లో పీడబ్లు్యడీ అభ్యర్థులకు నాలుగు పోస్టులు కేటాయిస్తే.. వాటిలో రెండు బీసీ–డీలోనే భర్తీ చేయడంతో ఆ వర్గంలో మిగతా అభ్యర్థులకు అన్యాయం జరిగింది. దీంతో అర్హుడైనప్పటికీ ఏకాంబరం పోస్టు కోల్పోవాల్సి వచ్చింది. డిలీట్.. అప్లోడ్.. డిలీట్! వెబ్సైట్లో డీఎస్సీ జాబితాపై దాగుడుమూతలు మెగా డీఎస్సీ 2025లో తప్పులు జరిగాయనేందుకు ఇది మరో ఉదాహరణ. డీఎస్సీ ప్రక్రియ ముగియగానే వాస్తవాలను దాచి పెట్టేందుకు వెబ్సైట్ నుంచి మొత్తం డేటా తొలగించిన అధికారులు.. తాజాగా డేటాను మళ్లీ అప్లోడ్ చేశారు. శనివారం మీడియాతో సమావేశం నిర్వహణకు కొద్ది గంటల ముందు వివరాలను హడావుడిగా అప్లోడ్ చేసి అంతా సక్రమంగానే చేశామని చెప్పుకునేందుకు యత్నించారు. ఈసారి కొత్తగా ఎంపిక జాబితాలను సైతం అప్లోడ్ చేసి మళ్లీ వాటిని తొలగించడం కొసమెరుపు. డీఎస్సీలో అక్రమాలను ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి తెస్తున్న విషయం తెలిసిందే. దీంతో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. డీఎస్సీ డేటాతో పాటు అభ్యర్థుల ఎంపిక జాబితాలను పలువురు శనివారం డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఆదివారం రోజు తుది ఎంపిక జాబితాలను అధికారులు మళ్లీ తొలగించారు. -
ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ పోయి వ్యక్తి మృతి! నాలుక గీసుకోడానికా మీరు మంత్రులు అయింది..
-
భారీగా పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు..?
-
డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి
-
మోత మోగిపోద్ది.. ఇక ఆర్టీసీ చార్జీల బాదుడు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై మరో బాదుడుకు సిద్ధమవుతోంది. ఆర్టీసీ చార్జీల రూపంలో రాష్ట్ర ప్రజలపై ఏడాదికి ఏకంగా రూ.300 కోట్ల అదనపు భారం మోపేందుకు సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ) ఈ మేరకు ప్రతిపాదనల్ని సమర్పించింది. సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో చార్జీల పెంపుపై రెండు ప్రతిపాదనలను సమర్పించింది. ఆర్టీసీని సక్రమంగా నిర్వహించేందుకు అదనపు నిధులు కేటాయించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. చార్జీలు పెంచుకోవాలని సూచించడంతో ప్రయాణికులపై ఆర్థికభారం అనివార్యం కానుంది. నిధులివ్వలేం.. చార్జీలు బాదేయండిఆర్టీసీని సక్రమంగా నిర్వహించేందుకు ఏటా రూ.220 కోట్లు మంజూరు చేయాలని ఆర్టీసీ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ ప్రతినెలా కోల్పోతున్న రాబడికి ప్రభుత్వం దశల వారీగా నిధులు విడుదల చేస్తోంది. కానీ.. ఇతర నిర్వహణ వ్యయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీని నిర్వీర్యం చేస్తోందని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆర్టీసీని ప్రైవేటీకరించే పన్నాగంతోనే ఈ విధంగా వ్యవహరిస్తోందని దుయ్యబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఏటా రూ.220 కోట్లు అదనంగా కేటాయించాలని కోరారు. కానీ.. ఆ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. ఆర్టీసీకి ఏమాత్రం నిధులు కేటాయించలేమని తేల్చి చెప్పింది. చార్జీలు పెంచుకుని నష్టాలను పూడ్చుకోవాలని సూచించింది. దాంతో చార్జీల పెంపుదలకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సమర్పించారు.ఏటా రూ.300 కోట్ల బాదుడేప్రయాణికుల నుంచి చార్జీల ద్వారా ఏటా రూ.300 కోట్లు అదనపు రాబడి సాధించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రయాణికుల నుంచి టికెట్ చార్జీల రూపంలో ఏటా రూ.6,551.69 కోట్ల రాబడి వస్తోంది. కాగా నిర్వహణ వ్యయం పెరుగుదలను సాకుగా చూపిస్తూ చార్జీల పెంపునకు రెండు ప్రతిపాదనలను ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు.ప్రతిపాదన 1: – కిలోమీటరుకు 4.15 పైసలు చొప్పున పెంచుతారు. ఆ ప్రకారం కిలోమీటరుకు ప్రస్తుతం సగటు ప్రాథమిక చార్జీ 124.85 పైసలుగా ఉంది. ఆ చార్జీని 129 పైసలకు పెంచుతారు. దాంతో ప్రయాణికులపై ఏటా రూ.217.64కోట్ల అదనపు భారం పడుతుంది.ప్రతిపాదన 2: ఆర్టీసీ ఏటా రూ.300 కోట్ల అదనపు రాబడి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే రెండో ప్రతిపాదనను సమర్పించింది. ఆ ప్రకారం చార్జీలు కిలోమీటరుకు 5.72 పైసల చొప్పున పెంచుతారు. దాంతో ప్రయాణికులపై ఏటా రూ.300 కోట్ల అదనపు భారం పడుతుంది. ఆర్టీసీ చార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు. ప్రభుత్వం పచ్చజెండా ఊపగానే చార్జీల మోత మోగనుంది. -
తప్పుపై తప్పు.. స్పోర్ట్స్ డీఎస్సీ మాకు తెలీదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మెగా డీఎస్సీ–2025లో అవకతవకలకు పాల్పడి ఉక్కిరి బిక్కిరి అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం కొత్త కథలు చెబుతూ తప్పుపై తప్పు చేస్తూ దొరికిపోతోంది. ఈ కుంభకోణంపై ఎట్టకేలకు ఆలస్యంగా స్పందించింది. పోస్టుల భర్తీలో తీవ్ర అవకతవకలకు పాల్పడటాన్ని ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. చేసిన స్కామ్లో అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వం ఎనిమిది రోజుల తర్వాత ఈ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. శనివారం విద్యాశాఖ అధికారులను ముందుకు నెట్టి, తూతూ మంత్రంగా వివరణ ఇప్పించే ప్రయత్నం చేసి.. అందులోనూ అడ్డంగా బుక్కయింది. శనివారం సాయంత్రం విద్యాభవన్లో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు పొంతన లేని జవాబులిస్తూ.. కొన్నింటికి సమాధానం దాటవేశారు. స్పోర్ట్స్ డీఎస్సీ గురించి తనకు తెలియదని చెప్పడం కుంభకోణం జరిగిందనడానికి మరింత బలం చేకూరుస్తోంది. ఈ సమావేశంలో మెగా డీఎస్సీ–2025ను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ చెప్పుకొచ్చారు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించి 241 కేసులు నమోదైనప్పటికీ, రికార్డు సమయం 148 రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేశామన్నారు. మెగా డీఎస్సీ–2025 నిర్వహణ ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ ర్యాంకుపై పొంతన లేని సమాధానాలు చెప్పారు. అలాగే, స్పోర్ట్సు కోటా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జరిగిన తప్పులపై తనకు తెలియదని, అది తన పరిధికాదన్నట్టు జవాబు దాటవేశారు. నవీన్ విషయంలో 3 సమాధానాలుమీడియా: మెగా డీఎస్సీలో ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్గా, టీజీటీలో ఆరో ర్యాంకు సాధించారు. టాప్ ర్యాంక్ సాధించిన అతనికి పోస్టు ఎందుకు నిలిపివేశారు? ఎలాంటి తప్పు జరక్కుంటే ఇలా ఎందుకు చేశారు. అసలు ఆయనకు టాప్ ర్యాంకు ఎలా వచ్చింది?కార్యదర్శి: శాఖలో పనిచేసే ఏ ఉద్యోగి అయినా పరీక్ష రాయాలన్నా, కోర్సులు చదవాలన్నా ఆ శాఖ అనుమతి తప్పనిసరి. నవీన్ ముందస్తు అనుమతి తీసుకోలేదు. అందుకే అతడి పోస్టును నిలిపివేశాం. నవీన్ రెండు పరీక్షలు రాశారు. పరీక్ష రాసేంత వరకు ఇక్కడ పనిచేశాడు. ఓ దాంట్లో 1వ ర్యాంక్, రెండో దాంట్లో 6వ ర్యాంక్ వచ్చింది. అతను సెలెక్షన్ లిస్టులో ఉన్నారు. కానీ వెరిఫికేషన్ కోసం రాలేదు. దీంతో నిబంధన ప్రకారం అతన్ని రిక్రూట్మెంట్ చేయలేకపోయాం. నవీన్ కోర్టుకు వెళ్లాడు. కోర్టుల్లో మా వాదనలు వినిపించాం. అతను వెరిఫికేషన్ ప్రక్రియకు ఎందుకు రాలేదో అతనికే తెలియాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్కు రాకపోవడంతో అతని పోస్టు పక్కన పెట్టాం. వాస్తవం: నవీన్ రెండు పోస్టులకు ఉత్తమ ర్యాంకులు సాధించాక అతనితో తన కాంట్రాక్టు ఉద్యోగానికి రాజీనామా చేయించారు. అనంతరం అతడి డీఎస్సీ లాగిన్ ఐడీని బ్లాక్ చేశారు. అతను కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకునేందుకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించారు. 1:1 పద్ధతిలో సర్టిఫికెట్ల పరిశీలన కార్యదర్శి: గత అనుభవాల దృష్ట్యా వెయిటింగ్ లిస్టు కాకుండా 1ః1 పద్దతిలో సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచాం. వెరిఫికేషన్లో ఎవరైనా ఫెయిల్ అయితే ఆ తర్వాత వారిని వెరిఫికేషన్కు పిలిచాం. హారిజాంటల్ రిజర్వేషన్లు స్పోర్ట్స్, మహిళ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్కు ఇవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రస్తుతం పేపర్లలో వస్తున్న కథనాలన్నీ హారిజాంటల్ రిజర్వేషన్లకు సంబంధించినవే. వాస్తవం: 1:1 పద్దతిలో సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిస్తే.. కాల్ లెటర్లు వచ్చిన వారంతా మెరిట్ లేదా హారిజాంటల్ రిజర్వేషన్లో ఉన్నవారే. వీరందరికీ ఉద్యోగం రావాలి. సర్టిఫికెట్లు సరిగా లేకపోతే వారిని రిజెక్ట్ చేసి, రెండో స్థానంలో ఉన్న వారికి అవకాశం ఇవ్వాలి. ఇక్కడ కాల్ లెటర్లు వచ్చిన వారంతా మెరిట్ లేదా హారిజాంటాల్ రిజర్వేషన్లో ఉన్నవారే. అలాంటి వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. స్పోర్ట్సు కోటా వారిచ్చిందే చేశాం కార్యదర్శి: డీఎస్సీ స్పోర్ట్సు కోటా అంశంలో శాప్ ఇచ్చిన అంశాలనే పరిగణనలోకి తీసుకున్నాం. అక్కడేం జరిగిందో మాకు తెలియదు. పరీక్ష లేకుండా పోస్టులు ఇవ్వాలన్నది డీఎస్సీ భర్తీ నాటి పాలసీ. ప్రభుత్వంలో పాలసీలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు పాలసీ మారితే మాకు సంబంధం లేదు. జీఏడీ ఇచ్చిన జీవో ప్రకారం మేం చేశాం. స్పోర్ట్స్ సెపరేట్గా హ్యాండిల్ చేద్దాం. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు దక్కించుకున్న వారు కూడా కష్టపడి ఉద్యోగాన్ని సాధించారు. వాస్తవం: డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో రెండు విధానాలు అనుసరించారు. ఒకటి రెగ్యులర్ డీఎస్సీలో స్పోర్ట్స్ సర్టిఫికెట్లకు క్రీడల ప్రాధాన్యం ప్రకారం వెయిటేజీ ఇచ్చి పోస్టులు భర్తీ చేస్తారు. కానీ, ఈ ప్రభుత్వం కొత్తగా రెండో విధానం ఈ డీఎస్సీ వరకు అమలు చేసింది. ప్రత్యేకంగా క్రీడా పాలసీ–2024–29ను డీఎస్సీకి ముందు తీసుకొచ్చింది. ఇందులో ఎటువంటి రాత పరీక్ష (టెట్/డీఎస్సీ) లేకుండా క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేసింది. భర్తీ ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ పాలసీని సవరించి, రాత పరీక్ష తప్పనిసరి చేసింది. ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదుకార్యదర్శి: డీఎస్సీలో లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. తప్పు పట్టలేదు.వాస్తవం: డీఎస్సీ నిర్వహణలో 33,830 గ్రీవెన్సెస్ వచ్చాయి. ఈ విషయాన్ని అధికారులు రాత పూర్వంగా ప్రకటించారు. జిల్లా, జోనల్ స్థాయిలో తమకు సంబంధం లేదు.. రాష్ట్ర కార్యాలయంలో తేల్చుకోండి అని, మరికొందరికి నిర్లక్ష్యంగా సమాధానం పంపించారు. మరి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని చెప్పడంలో అర్థం లేదు. కాపీయింగ్, లీకేజీకి ఆస్కారం లేదుకార్యదర్శి: డీఎస్సీలో కాపీయింగ్, లీకేజీకి ఆస్కారం లేదు. అంతా ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. వాస్తవం: తూర్పు గోదావరి జిల్లాలో ఓ సెంటర్లో మాస్ కాపీయింగ్ చేశారని 11 మంది డీఎస్సీ అభ్యర్థులను అధికారులే స్వయంగా అనర్హులుగా ప్రకటించారు. వారంతా కోర్టుకు పోగా అధికారులు నేరం రుజువు చేయలేకపోయారు. దాంతో వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. (కాపీయింగ్పై మరోసారి ప్రశ్నించగా అలా అనలేదని సమాధానం చెప్పారు)వాస్తవాలు దాచి సమాధానం దాటవేతడీఎస్సీ అక్రమాలలో కీలకమైన ఆరోపణలపై విద్యా శాఖ సమాధానం దాటవేసింది. ఎస్సీఈఆర్టీలో పనిచేసే నవీన్కు టాప్ ర్యాంక్ రావడంపై కార్యదర్శి కోన శశిధర్ మూడు రకాలుగా సమాధానం చెప్పారు. అనుమతి తీసుకోలేదు కాబట్టి పక్కనపెట్టామని ఒకసారి.. కౌన్సిలింగ్కు రాలేదు కాబట్టి పక్కన పెట్టామని మరోసారి చెప్పారు. వాస్తవానికి నవీన్కు కాల్ లెటర్ వెళ్లకుండా అభ్యర్థి డీఎస్సీ లాగిన్ ఐడీని అధికారులు బ్లాక్ చేశారు. ఆ విషయం బాధిత నవీన్ హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొన్నాడు. పైగా కాంట్రాక్టు ఉద్యోగి పరీక్ష రాసేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరి అనే అంశంపై సమాధానం దాటవేశారు. అలాగే, అతను ఎస్సీఈఆర్టీలో పనిచేస్తూ టాప్ ర్యాంకులు సాధించడం యాదృచ్ఛికమా లేక ఏమైనా తప్పు జరిగిందా అనే అంశంపైనా సరైన సమాధానం ఇవ్వలేదు.గ్రీవెన్స్లోనూ తప్పులేకాల్ లెటర్లు అందుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లిన తర్వాత అన్నీ సక్రమంగానే జరిగాయని చెప్పిన అధికారులు ఎంపిక లిస్టులో అభ్యర్థుల పేర్లను గల్లంతు చేశారు. ఈ విషయమై బాధిత అభ్యర్థులు విద్యా శాఖ ఏర్పాటు చేసిన గ్రీవెన్సెస్ రిడ్రెసెల్ సెల్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో చాలా మంది అభ్యర్థులకు సరైన సమాధానం లభించలేదని వాపోయారు. మరికొందరికి రాత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో అధికారుల నిర్లక్ష్యం కనిపించింది.దొంగ సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగం!డీఎస్సీ స్పోర్ట్స్ కోటా డైరెక్టు నియామకాలే కాదు.. రాత పరీక్షల్లో స్పోర్ట్స్ సర్టిఫికెట్ వెయిటేజీల్లోనూ అక్రమాలు జరిగాయి. అసలు ఆటే రాని వ్యక్తులు దొంగ సర్టిఫికెట్లు పెట్టి పోస్టులు కొట్టేశారు. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో ఓ మహిళకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. రాత పరీక్షకు తోడు స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ జత చేయడంతో పోస్టు కట్టబెట్టారు. అయితే సదరు మహిళ ఎన్నడూ క్రీడా మైదానంలో కాలు పెట్టింది గానీ, జిల్లా, రాష్ట్ర, స్థాయిలో ఆడింది గానీ లేకుండా ఏకంగా జాతీయ స్థాయి సర్టిఫికెట్ పుట్టించి మరీ పోస్టు కొట్టేశారు. సదరు వ్యక్తి భర్త పీఈటీ కావడంతో మాస్టర్ మైండ్ ఏజెంట్లతో కలిసి ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి పోస్టు తెచ్చుకున్నారు. దీనిపై పలువురు అభ్యర్థులు శాప్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు ఆర్టీఐ ద్వారా సమాచారం కోరితే ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తూ పిటిషనర్లను బెదిరించడం గమనార్హం.ఇదో అవినీతి క్రీడ⇒ విజయనగరం జిల్లాకు చెందిన ఓ వెయిట్ లిఫ్టర్ను కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టల్ శాఖ క్రీడా కోటా ఉద్యోగానికి అనర్హురాలిగా ప్రకటించింది. అనూహ్యంగా ఆమెకు ఏపీ డీఎస్సీ క్రీడా కోటాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పోస్టు ఇచ్చారు. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో పోస్టల్ శాఖను మోసగించే ప్రయత్నం చేయడంతో ఆమెపై గతంలో అనర్హత వేటు వేశారు. అలాంటి ఈమెకు ఏపీలో ఎలా ఉద్యోగం ఇచ్చారు? ఆమె రెండు వేర్వేరు ఏజ్ గ్రూప్స్లో ఆడినట్టు విజయనగరం జిల్లా పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఆధారాలతో గతేడాది ఆగస్టులోనే శాప్కు ఫిర్యాదులు చేశారు. అప్పుడు ఆ ఫిర్యాదును పట్టించుకోలేదు. నెల క్రితం ‘సాక్షి’లో కథనం వచ్చాక విచారణ చేస్తామని శాప్ అధికారులు ప్రకటించారు. కానీ ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఆమె ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ⇒ విజయనగరానికి చెందిన మరో క్రీడాకారుడు జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ చూపించి పతకాలు పొందారు. ఏపీ డీఎస్సీలో క్రీడా కోటా ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే అతన్ని నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ తర్వాత అతను కేంద్ర ప్రభుత్వ పోస్టల్ శాఖలో ఇదే క్రీడా కోటాలోనే ఉద్యోగం పొందారు. ఇక్కడ పోస్టల్ శాఖ అనర్హులుగా తేల్చిన వ్యక్తికి ఏపీలో ఉద్యోగం ఇస్తే.. ఏపీలో తిరస్కరించిన వ్యక్తికి పోస్టల్ శాఖలోనే ఉద్యోగం వచ్చింది. ఇలాంటి ఘటనలే డీఎస్సీ క్రీడా కోటాలో ఎంపికల పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి.⇒ కర్నూలు జిల్లాలో స్థానికంగా మెరిట్ అభ్యర్థులను పక్కన పెట్టి నాన్–లోకల్ కోటాలో వేరే జిల్లా వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారు. ఇక్కడ నాన్–లోకల్లోకి వచ్చేవారు స్థానికుల కంటే మెరిట్ జాబితాలో అగ్రస్థానంలో ఉండాలి. కానీ, సదరు ఉద్యోగి స్థానికుల కంటే రెండు స్థానాలకు దిగువన ఉన్నా నాన్లోకల్ కోటాలో అక్కడ పోస్టును భర్తీ చేశారు. పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులకు ఇది తప్పు అని తెలిసినా పట్టించుకోలేదు. అసలు ఓపెన్ కేటగిరీలో ఓ పోస్టు భర్తీ చేశాక, నాన్ లోకల్లో మరో పోస్టును ఎలా భర్తీ చేస్తారు? -
రాజధాని రైతులపై సర్కారు అరాచకం
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాడేపల్లి రూరల్: ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వలేదని చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఎన్ని విధాలుగా వేధించాలో అన్ని విధాలుగా వేధిస్తోంది. భూములు ఇవ్వలేదన్న ఆగ్రహంతో పలు రైతుల పొలాల చుట్టూ మూడువైపులా రిజర్వాయర్ తవ్వకాలు జరిపారు. దీంతో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక రైతులు పంట పండించుకునే పరిస్థితి లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు.తాజాగా ఎటువంటి వరద రాకపోయినా కొండవీటి వాగు గట్లకు గండికొట్టి ఆ నీటిని రిజర్వాయర్లోకి వదిలేశారు. దీంతో ఈ నీరు రిజర్వాయర్లో ప్రవహించి ల్యాండ్ పూలింగ్కు ఇవ్వని రైతుల భూముల చుట్టూ చేరాయి. 15 అడుగుల లోతు ఉన్న రిజర్వాయర్ నిండిపోవడంతో పంట పొలాల నేల కోతకు గురై రిజర్వాయర్లో కలిసిపోతోంది. పలువురి రైతుల పొలాలు కూడా రిజర్వాయర్లో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. రైతులను భయభ్రాంతులకు గురిచేసి, తన లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం భావిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి..⇒ కొండవీటి వాగు రిజర్వాయర్ కోసం పంటపొలాలు ఇవ్వని రైతులను ప్రభుత్వం, అధికారులు మూడు నెలలుగా ఇదేవిధంగా వేధిస్తున్నారు. వాటిలో కొన్ని దారుణాలను చూస్తే...⇒ మొదట లారీలతో పంటపొలాల్లో వున్న కరెంటు స్తంభాలను గుద్దించి, వైర్లు తెంచేశారు. మూడు నెలల నుండి విద్యుత్ను పునరుద్ధరించాలంటూ ఆ శాఖ అధికారుల చుట్టూ తిరిగినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.⇒ రైతులు పంట పొలాలకు విద్యుత్ మోటార్లు బదులు ఆయిల్ మోటార్లు తీసుకువచ్చినా.. వాటినీ చోరీ చేశారు.⇒ పంటపొలాల్లో ఉన్న విద్యుత్ బోర్లకు భూమిలోపల ఉన్న పైపులను పీకివేశారు. ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడు.⇒ విద్యుత్ సరఫరా లేకపోవడంతో నీరురాక మునగ, అరటి తోటలు ఎండిపోయాయి.⇒ పంటపొలాలకు దారులు లేకుండా చేయడం, ఉన్న దారులను తవ్వడం, 15 అడుగుల లోతులో పంట పొలాలకు ఆనించి గోతులు తీయడంతో మట్టి పెళ్లలు విరిగి ఆ పొలాల్లో పడడం వంటి చర్యలు రైతులను ఆవేదనకు గురిచేస్తున్నాయి.⇒ పెనుమాక గ్రామంలో వెయ్యి కుటుంబాలకు తాగునీటి సరఫరాను అందజేసేందుకు పైపులైను ఏర్పాటు చేశారు. ఆ పైపులైన్లపై కూడా తరచూ మట్టిపెళ్లలు విరిగి పగిలిపోతున్నాయి. నెలకి కనీసం 15 రోజులు తాగునీరు అందక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పొలాలను పరిశీలించిన దొంతిరెడ్డిసీఎం చంద్రబాబు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాననే విషయాన్ని మర్చిపోయి భూ దాహంతో రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి (డీవీఆర్) అన్నారు. రాజధాని గ్రామమైన పెనుమాకలో రిజర్వాయర్ గండ్లు తెంపివేయడంతో పూలింగ్కు ఇవ్వని పంటపొలాలను నీరు ముంచెత్తింది. ఈ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.దురుద్దేశంతో ప్రభుత్వం ప్రభుత్వం దురుద్దేశంతో పనిచేస్తోంది. నిజంగా కొండవీటి వాగుకు గండిపడి రిజర్వాయర్లోకి నీళ్లువస్తే.. కృష్ణానది నుంచి కొండవీటి వాగుకు గేట్లు ఎత్తి నీళ్లు ఎందుకు వదిలారు. ఒకవైపు గండిపడితే రెండోవైపు గండి పెట్టాల్సిన అవసరం ఏముంది? – కళ్లం శ్రీకాంత్ రెడ్డి భూమి ఇచ్చినా.. ప్రయోజనం ఏముంది? భూములు ఇచ్చేంత వరకు నా ఇంటి చుట్టూ తిరిగారు. సీఆర్డీఏ అధికారులే మా ఇంటికి వచ్చి ఒప్పంద పత్రాన్ని తీసుకున్నారు. నెల రోజుల తర్వాత నా 2 ఎకరాలకు ప్లాట్లు కేటాయిస్తామన్నారు. వారు చెప్పి ఆరు నెలలు అవుతోంది. ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా ఫలితం లేదు. పైగా నా పొలంలో పంట పండించుకుంటుంటే రాత్రికి రాత్రి బోర్లు దొంగిలించారు. దానివల్ల పంట పూర్తిగా ఎండిపోయింది. – బండి వెంకట రెడ్డిపంటలు ఎండిపోయాయి...ఎకరంన్నర పొలంలో మునగతోట వేశాను. మరో ఎకరం 30 సెంట్లలో అరటి పంట వేశాను. రిజర్వాయర్ను పొలానికి ఆనించి తీయడంతో బోర్లు రావడం లేదు. కొండవీటి వాగు నుంచి నీళ్లు తీసుకుందామంటే పొలం చుట్టూ తవ్వేశారు. విద్యుత్ సరఫరా లేదు. చివరకు చేతికి వచ్చిన పంట ఎండిపోయి రూ.లక్షా50 వేలు నష్టం వచ్చింది. రైతులను నష్టపరిస్తే వారే భూములు ఇస్తారని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వం. – పోలిశెట్టి శ్రీనివాసరావుప్రభుత్వ పెద్దలు చెప్పడం వల్లే...మూడు నెలల కిందట లారీ డ్రైవర్లు విద్యుత్ స్తంభాలను ఢీకొట్టడంతో ఒకేరోజు 10 స్తంభాలు పడిపోయాయి. విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించి పంట పొలాలకు విద్యుత్ సరఫరా ఇవ్వడం లేదు. ప్రభుత్వ పెద్దలు చెప్పబట్టే ఇలా చేస్తున్నారు. – పోలిశెట్టి రామ్మోహన్ -
ఖరీఫ్లోనూ కర్షకుడికి కష్టాలే!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతతో ఖరీఫ్లో సాగుపై అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. జూన్ 1వ తేదీ వస్తున్నా విత్తనాలు, ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలమైంది. అదునుకు వేరుశనగ విత్తనమే కాదు.. కనీసం పచ్చిరొట్ట విత్తనం కూడా సరఫరా చేయలేక చేతులెత్తేస్తోంది. ఎరువులను యాప్ ద్వారా పంపిణీ చేసేందుకు సిద్ధపడడంతో ఈసారి కూడా యూరియా, డీఏపీ కోసం యూరియా, డీఏపీ కోసం రైతులకు అగచాట్లు తప్పేటట్టు కన్పించడం లేదు. సీజన్కు ముందుగా పెట్టుబడి సాయం లేదు. ఇన్పుట్సబ్సిడీ ఎలాగూ లేదు. ఉచిత పంటల బీమా అసలే లేదు. కనీసం స్వచ్ఛంద పంటల బీమాను కూడా రైతులకు దూరం చేశారు. ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వర్షాధార ప్రాంతాల్లోనే కాదు, సాగునీటి వనరులున్న ప్రాంతాల్లోనూ రైతులు ఖరీఫ్ సాగుకు ముందుకెళ్లలేకపోతున్నారు.అదునుకు విత్తనమేది?ఖరీఫ్లో రాష్ట్రంలో సాధారణ విస్తీర్ణం 77.12 లక్షల ఎకరాలు కాగా, ఖరీఫ్–2026లో 81.50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా 37.85 లక్షల ఎకరాల్లో వరి, 9.89 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 12.87 లక్షల ఎకరాల్లో ప్రత్తి, 8 లక్షల ఎకరాల్లో అపరాలు, తదితర పంటల సాగును లక్ష్యంగా పెట్టారు. ఈసారి ముందస్తుగా సాగునీటి విడుదలకు షెడ్యూల్ ప్రకటించామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది.కోతల వేళ వైపరీత్యాల బారిన పడకుండా పంటలను కాపాడుకోవచ్చంటూ మే 4 నుంచి పెన్నా డెల్టాకు, జూన్ 1 నుంచి గోదావరి డెల్టాకు జూలై 1 నుంచి కృష్ణా డెల్టా ఆయకట్టుకు, అలాగే, మిగిలిన ఆయకట్టులకు సాగునీటి షెడ్యూల్ను విడుదల చేసింది. కానీ అందుకు తగినట్టుగా విత్తన సరఫరా చేయలేకపోతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏటా రెండు సీజన్లు కలిపి కనీసం 400 కోట్లతో సబ్సిడీ విత్తనాన్ని సరఫరా చేసేవారు. గడిచిన రెండేళ్లుగా సబ్సిడీ విత్తన పంపిణీలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా కోతలు పెడుతుండడంతో రైతులు అదునుకు సబ్సిడీ విత్తనం దొరక్క దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.బకాయిలతో ముందుకురాని కంపెనీలు2026–27 వ్యవసాయ సీజన్లో ఖరీఫ్లో రూ.179 కోట్లతో 4.82 లక్షల క్వింటాళ్ల విత్తనం సరఫరా చేయాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారులు ప్రతిపాదించారు. 2.20 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 1.62 లక్షల క్వింటాళ్ల వరి, 92 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు టెండర్లు ఖరారయ్యాయి.అయితే గడిచిన రెండేళ్లకు చెందిన రూ.187 కోట్ల విత్తన సబ్సిడీ బకాయిల చెల్లింపులో చంద్రబాబు ప్రభుత్వ ఎగవేత ధోరణికి నిరసనగా విత్తన సరఫరాకు కంపెనీలు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఏపీ సీడ్స్ వద్ద అందుబాటులో ఉన్న పచ్చిరొట్ట విత్తనాలను అరకొరగా పొజిషన్ చేయగా, వేరుశనగ ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో చెప్పలేని దుస్థితి. దీంతో రాయలసీమ రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎల్నినో పరిస్థితులున్నప్పటికీ సీమ జిల్లాల్లో ప్రస్తుతం ఆశాజనకంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో అదునుకు విత్తనం సరఫరా చేసి ఉంటే రైతులకు ఎంతగానో మేలు జరిగేది. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగు వేయలేదు.అందని పెట్టుబడి సాయం.. అటకెక్కిన పంటల బీమాఅధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామన్న చంద్రబాబు తొలి ఏడాది నిస్సిగ్గుగా రూ.10,716 కోట్లు ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఏడు లక్షల మందికి కోత పెట్టి రూ.14వేలతో సరిపెట్టారు. ఈ ఏడాది అయినా సీజన్కు ముందుగా పెట్టుబడి సాయం అందిస్తారేమో అని ఆశపడిన రైతులకు నిరాశే ఎదురైంది. కానీ మరో రెండ్రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నా పెట్టుబడి సాయం ఊసెత్తడం లేదు.రెండేళ్లుగా పైసా పెట్టుబడి సాయం అందించకపోవడంతో కౌలు రైతులుగగ్గోలు పెడుతున్నారు. 2024 జూన్లో కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం బకాయిలు ఎగ్గొట్టడంతో 2023–24 సీజన్కు సంబంధించి దాదాపు రూ.1385 కోట్ల బీమా పరిహారం రైతులకు అందలేదు. 2024–25, 2025–26 వ్యవసాయ సీజన్లలో ప్రభుత్వం బీమా ప్రీమియం బకాయిలు రూ.1095.11 కోట్లు ఎగ్గొట్టడంతో కంపెనీలు ఏపీని బ్లాక్లిస్ట్లో పెట్టేశాయి. మరోవైపు కరువు బకాయిలు రూ.327 కోట్లతో పాటు 2024–25 సీజన్లో రూ.650 కోట్లకుపైగా పంట నష్టపరిహారం నేటికీ జమ చేయలేదు. రూ.500 కోట్ల మేర సున్నా వడ్డీ రాయితీ రెండేళ్లుగా చెల్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం ఎగనామం పెట్టింది. దీంతో ఖరీఫ్ సాగు వేళ రైతుల చేతిలో చిల్లిగవ్వ లేక అప్పుల కోసం తిప్పలు పడుతున్నారు.యాప్ ద్వారా ఎరువులు.. ఆందోళనలో రైతులుఎరువుల కొరతేమీ లేదంటూ పదేపదే ప్రకటనలు ఇస్తున్న టీడీపీ ప్రభుత్వం ఈసారి యాప్ ద్వారా పంపిణీ అంటూ మెలిక పెట్టి, ఆంక్షలు విధిస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు 2025–26 వ్యవసాయ సీజన్కు సంబంధించి జాతీయ స్థాయిలో 39.054 మిలియన్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం 20.012 మిలియన్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. దీంతో ఈ సారి రాష్ట్రానికి జరిపిన కేటాయింపుల మేరకు ఎరువులు సరఫరా జరిగే అవకాశాల్లేవని తెలుస్తోంది.రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్కు 18.09 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం 8.20 లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయంటున్నారు. రాష్ట్రంలో యూరియా ఏ స్థాయిలో దారిమళ్లుతోందో రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఎలాంటి పంటలు సాగులేని ఏప్రిల్, మే నెలల్లో ఇప్పటికే 2 లక్షల టన్నుల ఎరువుల అమ్మకాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 75 వేల టన్నుల యూరియా, 30 వేల టన్నుల డీఏపీ అమ్మకాలు జరిగాయంటే ఏ స్థాయిలో పక్కదారి పడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చంద్రబాబు ప్రభుత్వం మొక్కుబడి సమీక్షలతో సరిపెడుతుందే తప్ప వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించలేకపోతోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.⇒ రాష్ట్రంలో ఖరీఫ్లో సాధారణ విస్తీర్ణం: 77.12 లక్షల ఎకరాలు⇒ ఖరీఫ్ 2026 సాగు లక్ష్యం: 81.50 లక్షల ఎకరాలు⇒ వరి: 37.85 లక్షల ఎకరాలు⇒ వేరుశనగ: 9.89 లక్షల ఎకరాలు⇒ పత్తి: 12.87 లక్షల ఎకరాలు⇒ అపరాలు తదితర పంటలు: 8 లక్షల ఎకరాలు -
సర్కారు ఉక్కిరిబిక్కిరి!
తిరుపతి టాస్క్ఫోర్స్: డీఎస్సీ–2025లో అవకతవకలు బట్టబయలు కావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. దాన్నుంచి బయట పడేందుకు కొత్తగా ఉపాధ్యాయులైన వారిని పావులుగా వాడుకునేందుకు స్కెచ్ వేసింది. మెరిట్ కలిగి ఉండీ, ఉద్యోగం రాని బాధితుల తరఫున పోరాడుతున్న వైఎస్సార్సీపీ పైకి వారిని ఉసిగొల్పేందుకు శక్తి వంచన లేకుండా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో తిరుపతి వేదికగా బాలాజీ కాలనీలోని లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో ‘నిరుద్యోగులపై గొడ్డలి వేటు’ అంటూ సమావేశం నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది.స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు ఈ సమావేశానికి వచ్చే పరిస్థితి ఉండదని భావించి డీఈవోను అడ్డం పెట్టుకుని మార్గ నిర్దేశం చేసింది. దీంతో డీఈవో కాస్తా టీడీపీ నేతగా పరకాయ ప్రవేశం చేశారు. ప్రభుత్వ పెద్దల సూచన మేరకు.. శనివారం మీటింగ్ ఉందని డీఎస్సీ–2025లో పోస్టింగ్ పొందిన ప్రతి ఉపాధ్యాయుడు మీటింగ్కు హాజరు కావాలని డీఈవో కేవీఎన్ కుమార్ తన సిబ్బందితో ఫోన్లు చేయించారు. ఓ దశలో వచ్చి తీరాల్సిందేనని బెదిరించారు. తీరా ఆ సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులు.. అక్కడ టీడీపీ నేతలు ఉండటం చూసి బిత్తర పోయారు.డీఎస్సీ కుంభకోణంపై గళమెత్తిన వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సమావేశానికి తమను మభ్యపెట్టి రప్పించడం తగదని అసహనం వ్యక్తం చేశారు. అధికారిక సమావేశం అని చెప్పి ప్రతిపక్ష పార్టీలను విమర్శించమని నిర్దేశించడం తగదని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో వారికి ఎదురు చెబితే దాడులు చేస్తారని జడిసి మిన్నకుండిపోయారు. ఈ సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు, టీడీపీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, రాంభూపాల్రెడ్డి 2 గంటల పాటు టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు.టీడీపీ కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కాగా, పార్టీ సమావేశాన్ని తలపించేలా రాజకీయ నేతలు ఉపన్యాసాలు ఇవ్వడం ఏమిటని ఉపాధ్యాయులు తలలు పట్టుకున్నారు. తుదకు తమను పార్టీ కార్యకర్తలుగా చేశారని వాపోయారు. ‘ప్రభుత్వం ఇలా చేయడం తగదు. మమ్మల్ని ఇలా పిలిపించడం ఏమాత్రం సరికాదు. తప్పు జరిగింది కాబట్టే ప్రభుత్వం ఇంతగా భయపడుతోందని అర్థమవుతోంది.లేకుంటే ఇంత దొంగచాటుగా సమావేశం నిర్వహించడం ఏమిటి? పొరపాట్లు జరిగి ఉంటే హూందాగా ఒప్పుకుని సరిచేయాలి. అర్హత ఉన్న వారికి ఉద్యోగం రాకపోవడం నిజంగా నేరమే’ అని ఈ సమావేశానికి హాజరైన పలువురు ఉపాధ్యాయులు వ్యాఖ్యానించారు. ఈ విషయమై మీడియా ప్రతినిధులు డీఈవోను సంప్రదిస్తే.. ఆ సమావేశంతో తనకు సంబంధం లేదని విచిత్ర సమాధానం చెప్పడం కొసమెరుపు. అసలు ఏ అధికారంతో శాప్ చైర్మన్ రవి నాయుడు ఈ సమావేశం నిర్వహించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని బాధిత డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు.సీన్ 1 : ‘డీఎస్సీ కుంభకోణంతో మన పరువుపోతోంది. మనమేమో గొప్పగా నిర్వహించామని ఇన్నాళ్లూ చెప్పుకున్నాం.. ఇలాగే సైలెంట్గా ఉంటే మన గ్రాఫ్ తగ్గిపోతుంది.. ఏదో ఒకటి చేయాలి.. లేదంటే ప్రజల్లో పలుచనైపోతాం.. చేసేదేదో త్వరగా చేయండి’ అని ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆందోళనతో దిశా నిర్దేశం చేశారు.సీన్ 2 : డీఎస్సీ కుంభకోణాన్ని అంతా తానై నడిపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శాప్ చైర్మన్ రవి నాయుడు రంగంలోకి దిగారు. తిరుపతి డీఈవోపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ పరువు కాపాడటం కోసం తమకు సహకరించాలని, ఇది ‘పెద్దల’ నిర్ణయం అని చెప్పారు.సీన్ 3 : ‘హలో.. మేము డీఈవో కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. 2025 డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శనివారం తిరుపతిలో డీఈవోతో సమావేశం ఉంది. ఉదయం 10 గంటలకు బాలాజీ కాలనీలోని లక్ష్మీనారాయణ కళ్యాణ మండపం వద్దకు కచ్చితంగా చేరుకోవాలి. ఎట్టిపరిస్థితిలో మిస్ కాకూడదు. మీటింగ్కు హాజరుకాని వారిపై కఠిన చర్యలు ఉంటాయి’ అని ఫోన్ ద్వారా హుకుం జారీ.సీన్ 4 : అఫీషియల్ సమావేశం అని చెప్పడంతో కొత్త ఉపాధ్యాయులంతా పనులు మానుకుని శనివారం హుటాహుటిన తిరుపతి చేరుకున్నారు. సమావేశం ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలోకి వెళ్లగానే అక్కడి వాతావరణం చూసి భయపడ్డారు. ఏమైనా మాట్లాడితే స్టేజి పైనున్న టీడీపీ నేతల అనుచరులు తన్నేలా ఉన్నారని నోరు మూసుకుని కూర్చున్నారు. ఈ గోలంతా తనకెందుకని అనుకున్న డీఈవో గైర్హాజరయ్యారు.సీన్ 5 : ‘మీరంతా కష్టపడి టీచర్ ఉద్యోగాలు సంపాదించారు. కానీ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కాదంటోంది. వారికి తగిన విధంగా మీరు సమాధానం ఇవ్వాలి. లేదంటే మీకు ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంపై మరక పడుతుంది’ అని శాప్ చైర్మన్ రవినాయుడు దిశానిర్దేశం చేశారు. ఇందుకు ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, రాంభూపాల్రెడ్డి వంత పాడారు. రాజకీయ సభకు ఉపాధ్యాయులా!?విద్యాభివృద్ధి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన డీఈవో, అధికార పార్టీ రాజకీయ కార్యక్రమాలకు ఉపాధ్యాయులను సమీకరించే పనిలో నిమగ్నం కావడం దారుణం. డీఎస్సీలో జరిగిన అవకతవకలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు అధికార పార్టీ కొత్తగా నియమితులైన టీచర్లతో రాజకీయ సభ నిర్వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఆ సభకు డీఈవో కార్యాలయం నుంచి టీచర్లకు ఫోన్లు చేసి రప్పించడం ఇంకా దారుణం. విద్యా కార్యక్రమమని భావించి హాజరైన ఉపాధ్యాయులకు రాజకీయ ఉపన్యాసం వినిపించడం ఏమాత్రం సబబు కాదు. ఈ అంశంపై కలెక్టర్ వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. – వందవాసి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి, తిరుపతిటీడీపీ అడ్డాగా డీఈవో ఆఫీస్జిల్లా విద్యా శాఖ అధికారి అధికార పార్టీకి ఏజెంట్గా వ్యవహరిస్తూ తన పదవికి మచ్చ తెచ్చారు. ఈయన్ను తక్షణం విధుల నుంచి తొలగించాలి. జిల్లా విద్యా శాఖ కార్యాలయం అధికార పార్టీకి అడ్డాగా మారింది. అధికార పార్టీ ఏర్పాటు చేసే సభలకు కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులను సమీకరించే సాధనంగా డీఈఓ కార్యాలయాన్ని ఉపయోగించడం దారుణం. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ఉద్దేశంతో డీఈవో ఉపాధ్యాయులకు ఫోన్లు చేసి సభకు హాజరు కావాలని ఆదేశించడం దుర్మార్గం. ఆయన ఆ పదవికి అనర్హుడు. తక్షణం తొలగించాలి. లేని పక్షంలో ఉద్యమిస్తాం. – అక్బర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, తిరుపతిడీఈఓను సస్పెండ్ చేయాలిడీఈవో స్థాయి అధికారి ఓ పార్టీకి కొమ్ము కాయడం దారుణం. పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటం సహించరాని విషయం. డీఎస్సీలో జరిగిన అవినీతిపై వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసనలకు భయపడి ఉపాధ్యాయులను ఉసిగొల్పాలనుకోవడం దారుణం. అధికారిక మీటింగ్ అని చెప్పి, ఉపాధ్యాయులను మభ్యపెట్టి పార్టీ మీటింగ్లకు హాజరు కావాలని హుకుం జారీ చేసిన డీఈఓను తక్షణం సస్పెండ్ చేయాలి. – డాక్టర్ ఓబుల్రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తిరుపతిఎవరు చెబితే ఇలా చేశారు?డీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డీఈవో తీరు విమర్శలకు తావిస్తోంది. విద్యా వ్యవస్థను రాజకీయాలకు ముడిపెట్టి పబ్బం గడుపుకుంటున్నారు. జిల్లా విద్యాశాఖలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న తరుణంలో, వాటిపై దృష్టి సారించకుండా పార్టీ మీటింగ్లకు ఉపాధ్యాయులను పంపే కార్యక్రమంలో ఉండటం దారుణం. ఇలాంటి వ్యక్తులు ఆ పదవికి అనర్హులు. ఇలాంటి వ్యవహారాలతోనే ‘పది’ ఫలితాలపై ప్రభావం పడుతోంది. ఇంతకూ ఎవరు చెబితే డీఈవో ఈ సమావేశం నిర్వహించారో వెల్లడించాలి. – సుందరరాజు, ఎన్ఎల్ఎస్ఏ జాతీయ అధ్యక్షుడుఅబ్బే.. మేం పిలవలేదు..డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు తిరుపతిలో శనివారం మీటింగ్కు హాజరు కావాలని మేము ఎవరికీ చెప్పలేదు. డీఈవో ఆఫీస్ నుంచి తాను చెప్పినట్లు ఎవరూ కాల్స్ చేయలేదు. కొత్తగా ఎంపికైన టీచర్లను మీటింగ్ పేరుతో పిలిపించి.. టీడీపీ వాళ్లు నిర్వహించిన మీటింగ్కు హాజరు కావాలని మేము చెప్పలేదు. నాకు ఈ అంశంతో సంబంధం లేదు. పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శనివారం నేను పిచ్చాటూరు, సత్యవేడు ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాల పరిశీలనలో ఉన్నాను. నా పేరు చెప్పి, డీఈవో ఆఫీస్ నుంచి ఎవరైనా ఫోన్లు చేసి ఉపాధ్యాయులను పిలిపించారేమో విచారిస్తాను. – కేవీఎన్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి -
గెట్ అవుట్! చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పిన అమిత్ షా?
-
ఖర్జూరనాయుడు లేదా చంద్రబాబులా ఉండాలి! బాగా ప్లాన్ చేశావ్ బాబు..
-
ప్రజలు లేరని ప్రభుత్వ ఉద్యోగులను తరలిస్తావా? చంద్రబాబు అసలు బాగోతం
-
చంద్రబాబుకు కొత్త టెన్షన్.. బయటపడ్డ లోకేష్ స్కాముల చిట్టా..
-
టీడీపీ మహానాడు పై వరుదు కళ్యాణి సెటైర్లు..
-
అన్ని అక్రమ కేసులు, అరెస్టులు.. చంద్రబాబుపై న్యాయవాదులు సీరియస్
-
కూటమి నేతల భూ ఆక్రమణలపై స్వామీజీలు ఆగ్రహం
-
రాత్రి 10 గంటలకు డోర్ కొట్టి చిత్రహింసలు పెడుతుంది.. కేవలం జగన్ ఇచ్చిన ఇల్లు
-
బయటపడ్డ DSC స్కామ్! లోకేష్ వెన్నులో వణుకు
-
రాజ్యసభకు లింగమనేని.. కరకట్ట ప్యాలెస్ కు రిటర్న్ గిఫ్ట్
-
పొగాకు రైతులకు నష్టాల సెగ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో పొగాకు రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. గతేడాది కొనేవారు లేక నల్లబర్లీ పొగాకు రైతులు నష్టపోగా.. ఈసారి కొనుగోలు కేంద్రాల్లో పొగాకు బోర్డు అధికారుల తీరు కారణంగా వర్జీనియా రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. బోర్డు అనుమతి ఇచ్చిన పరిధిలోనే సాగుచేసి మంచి దిగుబడి సాధించి.. నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేసినా గిట్టుబాటు ధర దక్కడం లేదు. ప్రభుత్వ చేతకానితనం వల్ల రెండేళ్లుగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.2024–25 సీజన్లో నల్లబర్లీ పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. బాండ్లు ఇచ్చిన కంపెనీలు కొనుగోలు సమయంలో చేతులెత్తేయడంతో రైతుల వద్ద 53 వేల టన్నులు పేరుకుపోయాయి. అతికష్టంమ్మీద 20 వేల టన్నులు సేకరించగా.. నేటికీ రైతుల వద్ద 33 వేల టన్నులు పాత పొగాకు నిల్వలు ఉండిపోయాయి. ఇళ్లవద్దే ఉండిపోయిన బేళ్లు అమ్ముడుపోక, నిల్వ ఖర్చులు, వడ్డీలు, కూలీ ఖర్చులు తడిసి మోపెడవటంతో నల్లబర్లీ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ ఏడాది అదే పరిస్థితి వర్జీనియా పొగాకు (వైట్ బర్లీ) రైతులు ఎదుర్కొంటున్నారు.తిరస్కరణకు గురవుతున్న బేళ్లే ఎక్కువ2025–26 సీజన్లో 2.93 లక్షల ఎకరాల్లో పొగాకు సాగవగా.. రెండో ముందస్తు అంచనా ప్రకారం హెక్టార్కు 2,276 కిలోల దిగుబడి చొప్పున ఈ ఏడాది కనీసం 2.61 లక్షల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. దక్షిణాది నల్ల నేలల్లో పొగాకుకు సగటున కిలోకి రూ.212.07, ఉత్తరాది తేలిక నేలల్లో పొగాకుకు సగటున కిలోకు రూ.237.21 చొప్పున మాత్రమే ధర లభిస్తోంది. ఒంగోలు, టంగుటూరు, కొండెపి, వెల్లంపల్లి వేలం కేంద్రాల్లో 45–47 శాతం, పొదిలి, కనిగిరి, కందుకూరు, కలిగిరి, డీసీ పల్లి కేంద్రాల్లో 36–40 శాతం, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం కేంద్రాల్లో 35–43 శాతం మేర బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. తిరస్కరించిన పొగాకును వెనక్కి తీసుకెళ్లడానికి బేలుకు రూ.2 వేల వరకు అదనంగా ఖర్చవుతోందని రైతులువాపోతున్నారు.45 రోజులైనా 5 శాతమే వేలంపొగాకు వేలం కేంద్రాలు ప్రారంభించి 45 రోజులైంది. ఇప్పటివరకు కేవలం 9,500 టన్నుల పొగాకు మాత్రమే వేలం జరిగింది. అంటే ఉత్పత్తిలో 5 శాతానికి మించి రైతులు ఇప్పటివరకు అమ్ముకోలేకపోయారు. గతేడాది ఇదే సమయానికి 33,860 టన్నులు వేలంలో అమ్ముడయ్యింది. 2023–24లో సగటున కిలోకు రూ.288.65 చొప్పున దక్కితే.. ఈ ఏడాది కిలోకు రూ.237.21కి మించి దక్కడం లేదు. అదీ కూడా మార్కెట్కు తీసుకొచ్చిన బేళ్లలో 5 శాతం బేళ్లకే ఈ ధర లభిస్తోంది. ఏటా సగటు ధర పెరగాల్సింది పోయి.. 2023–24తో పోలిస్తే ఈ ఏడాది రైతు కిలోకు దాదాపు రూ.51 తక్కువ ధరకు అమ్ముకోవాల్సి దుస్థితి దాపురించింది. ఫలితంగా రెండేళ్లలో రూ.3,100 కోట్లకు పైగా రైతులకు నష్టపోతున్నారని అంచనా.నిత్యం నిరసనల్ని పట్టించుకోని ప్రభుత్వంఏ పొగాకు వేలం కేంద్రానికి వెళ్లినా రైతుల నిరసనలతో హోరెత్తిపోతున్నాయి. నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కడుపు మండిన రైతులు పొగాకును తగలబెట్టే స్థాయికి వచ్చారు. అయినా ప్రభుత్వం తనకేమీ పట్టనట్టుగా మిన్నకుండిపోతోంది.ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలిపొగాకు సాగు చేసే వారిలో అత్యధికులు కౌలు, సన్నకారు రైతులే. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేక తీవ్ర ఆరి్థక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. రెండేళ్లుగా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక రైతులు సంక్షోభంలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకుని తక్షణమే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంపై దృష్టి సారించాలి. -
చేతికి వచ్చి చేజారిన పోస్టు.. ‘సారూ’.. తారుమారు!
జిల్లా టాపర్ అయినా జాబు రాలేదు..ఎస్సీ విభాగంలో నేను శ్రీకాకుళం జిల్లా టాపర్ అయినా నాకు ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటాలో ఒక మహిళకు ఉద్యోగం ఇచ్చారు. దీనిపై ఫిర్యాదు చేస్తే ఆ పోస్టింగ్ నిలిపారు. తర్వాత మెరిట్ అభ్యర్థిగా నాకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉన్నా ఆరు నెలలుగా ప్రభుత్వం స్పందించడం లేదు. – కె.అనిల్కుమార్, డీఎస్సీ బాధితుడు, శ్రీకాకుళంసాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025లో విస్తుగొలిపే వాస్తవాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నడుమ ఏళ్ల తరబడి శ్రమించి సాధించుకున్న అరుదైన అవకాశాన్ని చంద్రబాబు సర్కారు కాల రాసిందని కాల్ లెటర్లతో వెరిఫికేషన్కు సైతం హాజరై మోసపోయిన అర్హులైన అభ్యర్థులు మండిపడుతున్నారు. జిల్లాకు ఓ విధానం అమలు చేసి ‘హారిజాంటల్’ రిజర్వేషన్ అని పేరు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పోస్టుకు ఒక్కరే అభ్యర్థిని (1:1 నిష్పత్తి) సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచి, అన్నీ సక్రమంగా ఉన్నట్లు ప్రకటించిన తరువాత తీరా తుది జాబితాలో తమ పేర్లు గల్లంతు చేశారని అర్హులు వాపోతున్నారు. ఒక పోస్టుకు ఒక్కరినే పిలిస్తే.. హాజరైన అభ్యర్థి సర్టిఫికెట్ల్లలో లోపం ఉంటే ఆ విషయం చెప్పి వారిని పక్కనబెడతారు. అనంతరం రెండో స్థానంలో ఉన్నవారికి అవకాశం కల్పించాలి. కానీ ఇక్కడ ఉద్యోగాలకు ఎంపికైన వారికే కాల్ లెటర్లు పంపి సర్టిఫికెట్ల పరిశీలనకు రావాల్సిందిగా నిర్ణీత తేదీని ప్రకటించారు. అన్ని పత్రాల పరిశీలన పూర్తి చేసి అంతా సక్రమమేనంటూ ప్రకటించారు. కానీ తుది ఎంపిక జాబితాలో మాత్రం అర్హుల పేర్లు లేకుండా చేశారు. ప్రభుత్వ నిర్వాకానికి బలైన ప్రతిభ గల డీఎస్సీ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మందికి పైగా ఉన్నట్లు చెబుతున్నారు.మెరిట్లో ఉన్నారని ప్రకటించి మోసం..!డీఎస్సీ ఫలితాలను ప్రకటించేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం అభ్యర్థులకు వచ్చిన మార్కులతో మెరిట్ లిస్ట్ విడుదల చేయాలి. కానీ డీఎస్సీ 2025లో మాత్రం ఫలితాల ప్రకటన వరకు ఒక విధానం.. సర్టిఫికెట్ల పరిశీలనకు మరో విధానం.. తుది ఎంపిక జాబితా విడుదల సమయంలో మరో విధానాన్ని అమలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్ష రాసిన అభ్యర్థులంతా మెరిట్ లిస్ట్ను పరిశీలించే వీలు లేకుండా చేశారని ఆక్రోశిస్తున్నారు. మెరిట్ లిస్టును ప్రకటించిన తర్వాత సెలక్షన్ లిస్ట్ తయారు చేసి కౌన్సెలింగ్ నిర్వహించాలి.కానీ మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా ‘సెలెక్టెడ్’ అభ్యర్థులను ఒక పోస్టుకు ఒక్కరినే (1:1) ఎంపిక చేసి సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. పరీక్ష రాసిన 3,36,307 మందిలో కేవలం 16,437 పోస్టులకు అంత మందికే కాల్ లెటర్లు పంపారు. కాల్ లెటర్లు పంపిన వారిని నిర్ణీత తేదీల్లో ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని లేఖల్లో పేర్కొన్నారు. చెక్ లిస్టు సరి చూసుకున్న తర్వాత వారిని ‘ఓకే’ కూడా చేశారు. అయితే తిరస్కరణ జాబితాలో పేర్లు లేని, సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయిన కొందరు అభ్యర్థుల పేర్లను తుది ఎంపిక జాబితాల్లో నుంచి తొలగించడం గమనార్హం.గోడు పట్టించుకోని విద్యాశాఖ మంత్రి కార్యాలయం..తమ సర్టిఫికెట్లు అన్నీ సరిగా ఉన్నాయని ప్రకటించాక కూడా పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదని జిల్లా అధికారులను ప్రశ్నిస్తే... ఇందులో తమదేం లేదని, రాష్ట్ర కార్యాలయంలో సంప్రదించాలని సలహా ఇచ్చారు. బాధితులంతా రాష్ట్ర కార్యాలయంలో సంప్రదిస్తే.. మళ్లీ డీఎస్సీకి ప్రయత్నించండని ఉచిత సలహా ఇచ్చి అవమానించారని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ డీఎస్సీలో ప్రభుత్వం అనుసరించిన విధానాల ప్రకారం.. మెరిట్లో ఉండి, పోస్టు వస్తుందన్న వారికే కాల్ లెటర్లు పంపారు. వారికి సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తి చేశారు. చివరకు వారికి మొండిచెయ్యి చూపించారు. అర్హులు తమకు జరిగిన అన్యాయంపై విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని సంప్రదించగా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేది లేక న్యాయ పోరాటానికి దిగారు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కావాలంటూ ఎం.ఏకాంబరానికి వచ్చిన కాల్ లెటర్ చిత్తూరు జిల్లా మాదిరెడ్డిపల్లికి చెందిన ఎం.ఏకాంబరం (బీసీ–డి) డీఎస్సీలో ఎస్ఏ సోషల్ స్టడీస్ విభాగంలో 125వ ర్యాంకు సాధించారు. జిల్లాలో బీసీ–డీ కేటగిరీలో 7 పోస్టులు ఉండగా ఆయన ఆరో అభ్యర్థి. ఆగస్టు 28న సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలని కాల్ లెటర్ అందింది. అన్ని పత్రాలు పరిశీలించి అధికారులు ధ్రువీకరించారు. కానీ సెలక్షన్ లిస్టులో అతడి పేరు లేదు. అంతకు ముందే పెట్టిన రిజెక్ట్ లిస్టులోనూ ఏకాంబరం పేరు లేదు. ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తే.. ‘గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసుకోండి..’ అని డీఈవో సమాధానం ఇచ్చారు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం టి.విజయలక్ష్మికి వచ్చిన కాల్ లెటర్చిత్తూరు జిల్లా యాదమర్రికి చెందిన టి.విజయలక్ష్మి (ఓసీ) స్కూల్ అసిస్టెంట్ (ఇంగి్లష్) ఎస్జీటీలో 647వ ర్యాంకు వచ్చింది.ఆగస్టు 29న సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రావాలని ఆమెకు కాల్ లెటర్ పంపారు. వెరిఫికేషన్ కూడా పూర్తయింది. కానీ ఫైనల్ ఎంపిక జాబితాలో మాత్రం పేరు లేదు. అటు రిజెక్ట్ లిస్టులో కూడా పేరు లేదు. దీనిపై డీఈవో కార్యాలయంలో సంప్రదించగా.. స్పోర్ట్సు కోటాలో మీ పోస్టు పోయిందని సమాధానం చెప్పారు. గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తే కటాఫ్ అంతకు ముందే అయిపోయిందని చెప్పారు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రావాలంటూ ఇ.శ్రీనివాసులుకు వచ్చిన కాల్ లెటర్ ప్రకాశం జిల్లా యర్రగొండపాలేనికి చెందిన ఇ.శ్రీనివాసులు (బీసీ–డి) ఎస్జీటీలో 87వ ర్యాంకు సాధించారు. ఆగస్టు 29న సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలని ఆయనకు కాల్ లెటర్ అందింది. అయితే 2,665 ర్యాంకు అభ్యర్థికి హారిజాంటల్ రిజర్వేషన్ పేరుతో పోస్టు ఇచ్చారు. దీనిపై శ్రీనివాసులు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తే 85 ర్యాంకుతో పూర్తయిందని మౌఖికంగా, 58వ ర్యాంకుతో పూర్తయిందని రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇందులో ఏది నిజం?సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం వై.శ్రవణ్కు వచ్చిన కాల్ లెటర్అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడ నరసాపురానికి చెందిన వై.శ్రవణ్కుమార్(బీసీ–ఏ) ఎస్ఏ ఫిజికల్ సైన్స్లో 52వ ర్యాంకు, బీసీ–ఏ కోటాలో 3వ ర్యాంకు సాధించారు. ఆగస్టు 29న సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. కానీ 10 రోజుల తర్వాత విడుదలైన లిస్టులో ఆయన పేరు లేదు. అటు రిజెక్ట్ లిస్టులోనూ కనిపించలేదు. దీనిపై ఆర్జేడీ కార్యాలయంలో గ్రీవెన్స్కు దరఖాస్తు చేయగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఎస్.పృథ్వీరాజుకు వచ్చిన కాల్ లెటర్నెల్లూరు జిల్లా సంగం గ్రామానికి చెందిన ఎస్.పృథీ్వరాజ్ (బీసీ–బీ) టీజీటీ తెలుగు జోన్–2లో 157వ ర్యాంకు సాధించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సెప్టెంబర్ 9న గుంటూరులో జరిగింది. కానీ 15న విడుదలైన సెలక్షన్ లిస్టులో ఆయన పేరు లేదు. దీనిపై విద్యాభవన్లోని గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు స్పందన లేదు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం బండారు యమునకు వచ్చిన కాల్ లెటర్విశాఖ జిల్లాకు చెందిన బండారు యమున (బీసీ–డీ మహిళ) ఫిజికల్ సైన్స్లో 68వ ర్యాంకు సాధించారు. సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత తనకు రావాల్సిన పోస్టును 311వ ర్యాంకు సాధించిన అభ్యర్థికి ఇచ్చారని యమున ఆవేదన వ్యక్తం చేసింది. అంత పెద్ద ర్యాంకు వచ్చిన వారికి ఎలా ఇచ్చారని జిల్లా అధికారులను ప్రశ్నిస్తే ‘స్పోర్ట్సు కోటా’లో ఇచ్చామని చెబుతున్నట్లు పేర్కొంది. జనరల్ విభాగంలో పరీక్ష రాసి 311వ ర్యాంకు పొందిన అభ్యర్థికి స్పోర్ట్సు కోటాలో ఉద్యోగం ఇచ్చినట్లు చూపారు. మెగా డీఎస్సీలో ఇలాంటి విచిత్రాలు మరెన్నో!⇒ వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లికి చెందిన షేక్ నసీమూన్ (బీసీ–ఈ) డీఎస్సీ 2025లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సైన్స్లో 43వ ర్యాంకు సాధించింది. సెప్టెంబర్ 7న సర్టిఫికెట్ల పరిశీలనకు కాల్ లెటర్ అందింది. అదే రోజు జిల్లా కేంద్రంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాగా అన్నీ సక్రమంగా ఉన్నట్లు ప్రకటించి పోస్టు ఓకే చేశారు. తీరా నాలుగు రోజుల అనంతరం విడుదలైన ఎంపిక జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో అధికారులను సంప్రదించగా.. ‘బై మిస్టేక్ వల్ల మీకు కాల్ లెటర్ అందింది..’ అంటూ చేతులు దులుపుకొన్నారు. జిల్లా కలెక్టర్, డీఈవో కార్యాలయాల చుట్టూ తిరిగినా ఆమెకు న్యాయం జరగలేదు.అలా ఎలా ఇచ్చేస్తారు?డీఎస్సీ రాసి సర్టిఫికెట్ వెరిఫికేషన్కు కూడా హాజరయ్యా. రిజెక్టెడ్, సెలెక్టెడ్ లిస్ట్లో నా పేరు లేదు. స్పోర్ట్స్ కోటాలో పోస్టు ఇచ్చినట్లు చెప్పారు. నాది 198వ ర్యాంక్ అయితే స్పోర్ట్స్ కోటా కింద పోస్ట్ ఇచ్చిన వ్యక్తి ర్యాంక్ 872. నాకు కాల్ లెటర్ ఇవ్వక ముందే స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగింది. మరి నాకు ఇవ్వాల్సిన పోస్టు స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చామని ఎలా చెబుతారు? – ఎస్.నూకరాజు, కాకినాడసుప్రీంకోర్టు ఉత్తర్వులను పట్టించుకోరా?మెరిట్లో ఉన్నవారికి పోస్ట్లు ఇవ్వాలని.. మెరిట్ను డీ మెరిట్ చేయవద్దని సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా పోస్టులను ఇచ్చేశారు. ప్రతిభగల నాలాంటి వారికి అన్యాయం జరిగింది. ఓపెన్ కేటగిరిలో 30 పోస్ట్లు ఉన్నాయి. 87వ ర్యాంక్ వచ్చిన నాకు పోస్టు ఇవ్వలేదు. ప్రతిభను గుర్తించకపోతే ఎలా? – పి.ప్రతిభ, రాజమండ్రితీరని అన్యాయం..సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు కొంతమందికి మాత్రమే వ్యక్తిగతంగా సందేశాలు పంపి పిలిచారు. రిజర్వేషన్ నిబంధనలను సక్రమంగా అమలు చేయలేదు. ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ మార్కులను పారదర్శకంగా ప్రకటించలేదు. ఒకే అభ్యర్థి అనేక పోస్టుల జాబితాల్లో కొనసాగడంతో పలువురు అర్హులు ఉద్యోగాలను కోల్పోయారు. అభ్యర్థులకు తీరని అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. – దేవరకొండ వెంకట్రావు దర్శి, ప్రకాశం జిల్లానా ఉద్యోగం.. ఇతరులకు ఇచ్చారుడీఎస్సీ 2025లో బయాలజీ సైన్స్ ఉర్దూ మీడియం పరీక్ష రాశా. 57.77 మార్కులు వచ్చాయి. ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన నాకు ఎస్ఏ పోస్టు ఇవ్వాలి. నాకివ్వాల్సిన పోస్టును బీసీ–ఈ అభ్యర్థికి ఇచ్చారు. న్యాయం చేయాలని 8 నెలలుగా అధికారులకు, విద్యాశాఖ మంత్రికి, చివరకు సీఎంకు విన్నవించుకున్నా ఫలితం లేదు. –సయ్యద్ జమీల్, రాయచోటి, అన్నమయ్య జిల్లా -
తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి
-
హైబ్రిడ్ వంకాయలు, టమాటాలు చూశా.. హైబ్రిడ్ మహానాడు ఏందిరా స్వామి
-
నువ్విచ్చేది ఏంటి బోడి... మహిళా రిజర్వేషన్లపై లోకేష్ కామెడీ కామెంట్స్
-
మహానాడుపై TDP మహిళ సంచలన ఆడియో
-
మెగా డీఎస్సీ అక్రమాలపై YSRCP పోరుబాట..
-
కూటమి రాక్షస పాలనపై YSRCP పోరుబాట
-
బాబు సర్కారు కుట్ర.. ఆర్టీసీని ప్రైవేట్కు ఇచ్చేద్దాం!
సాక్షి, అమరావతి: రాష్ట రోడ్డు రవాణా సంస్థను చంద్రబాబు కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా ప్రైవేట్కు ధారాదత్తం చేయడానికి పూనుకుంది. రూ.500 కోట్లు కేటాయిస్తే.. 750 ఇ–బస్సులను ఆర్టీసీనే నిర్వహించవచ్చు. నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వమే నిధులు కేటాయిస్తుంది కూడా. ఫలితంగా ఆర్టీసీ దర్జాగా మనుగడ సాగిస్తుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అందుకు ససేమిరా అంటోంది. ప్రైవేటుకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో నిర్వహించే సమీక్షా సమావేశంలో ఈ మేరకు రాజ ముద్ర వేసేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తొలి దశలో 750 బస్సులతో మొదలుపెట్టి.. దశల వారీగా మొత్తం 8 వేల బస్సులను ప్రైవేటుపరం చేసే కుతంత్రానికి పదును పెడుతోంది. 52 వేల మంది ఉద్యోగులతో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఆర్టీసీని మొత్తంగా అమ్మేయడానికి కార్యాచరణను వేగవంతం చేసింది. ఇ–బస్సుల విధానం ముసుగులో ఆర్టీసీకి తిలోదకాలు ఇచ్చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించేసింది. అందుకు తొలి దశలో 750 ఇ–బస్సులతో ప్రై‘వేటు’ కార్యాచరణకు రంగం సిద్ధం చేసింది. ప్రధాన మంత్రి ఇ–బస్ సేవా పథకం కింద దేశంలో 10 వేల ఇ–బస్సులను ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ఏపీకి 1,050 బస్సులు కేటాయించారు. 750 సాధారణ బస్సులు కాగా, మరో 300 బస్సులు తిరుపతి – తిరుమల మధ్య ఘాట్ రోడ్డు సర్వీసుల కోసం నిర్వహిస్తారు. ఈ ఘాట్ రోడ్డు బస్సులను ప్రైవేటు సంస్థల ద్వారా నిర్వహించడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకు పెద్దగా అభ్యంతరాలు లేవు. కానీ రాష్ట్రంలో నిర్వహించాలని నిర్ణయించిన 750 బస్సులను ఆర్టీసీనే సొంతంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. నిర్వహణ సాధ్యం కాదంటూ .. 750 ఇ– బస్సులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సింది కేవలం రూ.500 కోట్లు మాత్రమే. ఆ బస్సుల చార్జింగ్ సదుపాయాల కోసం ఆర్టీసీ డిపోల్లో హైటెన్షన్ కనెక్టివిటీ, ఇతర మౌలిక వసతుల కోసం రూ.89 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అందులో కేంద్ర ప్రభుత్వం రూ.80 కోట్లు ఆర్థిక సహాయం అందిస్తుంది. కాబట్టి ఆర్టీసీ కేవలం రూ.9 కోట్లు వెచ్చిస్తే సరిపోతుంది. దాంతో 750 ఇ–బస్సులను ఆర్టీసీనే సొంతంగా నిర్వహించొచ్చు. ఫలితంగా ఆర్టీసీ మనుగడకు ఎటువంటి ఇబ్బందీ రాదు. ఈ విషయాన్ని పూర్తి గణాంకాలతో సహా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు రవాణా శాఖ ఉన్నతాధికారులకు వివరించాయి. నిపుణులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ 750 ఇ–బస్సులను సొంతంగా నిర్వహించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వ పెద్దలు తిరస్కరించారు. అందుకోసం రూ.500 కోట్లు కేటాయించేది లేదని తేల్చి చెప్పారు. త్వరలోనే ఆ 750 బస్సులు ప్రైవేటు సంస్థల ద్వారా నిర్వహణకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. సీఎం చంద్రబాబు త్వరలో నిర్వహించే సమీక్షా సమావేశంలో అందుకు ఆమోద ముద్ర వేయనున్నారని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. దశల వారీగా ఆర్టీసీపై ప్రై‘వేటే’ ఆర్టీసీ ప్రైవేటీకరణ కేవలం 750 ఇ–బస్సులకే పరిమితం కాదు. మొత్తం బస్సులను దశల వారీగా ప్రైవేటుపరం చేసేందుకే ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఆర్టీసీలో ప్రస్తుతం 11 వేల బస్సులు ఉన్నాయి. వాటిలో 8 వేలు ఆర్టీసీ సొంత బస్సులు కాగా, 3 వేల బస్సులను అద్దె విధానంలో నిర్వహిస్తున్నారు. అద్దె ఒప్పంద కాల పరిమితి ముగియగానే ఆ 3 వేల బస్సులను తొలగిస్తారు. ఇక ఆర్టీసీకి చెందిన 8 వేల బస్సుల స్థానంలో ప్రైవేటు సంస్థల ద్వారా దశల వారీగా ఇ–బస్సులను ప్రవేశ పెడతారు. ఆర్టీసీ కొత్తగా ఒక్క బస్సును కూడా కొనుగోలు చేయదు. సగటున రోజుకో బస్సును తొలగిస్తోంది. అంటే కొద్ది కాలంలోనే రాష్ట్ర రోడ్లపై ఆర్టీసీ బస్సు అన్నది కనిపించదు. అన్ని బస్సులను ప్రైవేటు సంస్థలే నిర్వహిస్తాయి. బస్సులు ఉండకపోతే ఇక ఉద్యోగ నియామకాలు అవసరం లేదు. అందుకే ఆర్టీసీలో 8 వేల ఖాళీ పోస్టులు ఉన్నా సరే జాబ్ క్యాలండర్లో వాటి గురించి ప్రభుత్వం ప్రస్తావించనే లేదు. ఇకపై రిటైరయ్యే ఉద్యోగుల పోస్టులను కూడా భర్తీ చేయరు. బస్సులు లేకపోతే ఇక ఆర్టీసీకి ఆస్తులతో పనేముందని ప్రభుత్వ పెద్దలు అప్పుడే సన్నాయి నొక్కులు నొక్కుతుండటం గమనార్హం. ఇప్పటికే రూ.6 వేల కోట్ల విలువైన 12 ఆర్టీసీ డిపోలను ప్రైవేటు సంస్థలకు కేటాయించారు. అదే రీతిలో రాష్ట్రంలో ఆర్టీసీ డిపోలు, బస్ స్టేషన్లను కూడా ప్రైవేటు సంస్థల పరం చేసేందుకు ఎంతో కాలం పట్టదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
బాబ్బాబు.. కోతలు కాదు.. అంతరాయాలనండి!
గాలివానలు, అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. విద్యుత్ వినియోగం పెరగడం వల్ల లోడ్ తట్టుకోలేక ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయి. కాబట్టే రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అంతేగాని విద్యుత్ కోతలు లేవు. - ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సబ్స్టేషన్లోని పవర్ ట్రాన్స్ఫార్మర్లో లోపం ఏర్పడటంతో గ్రిడ్పై అధిక లోడ్ పడి, దాని ప్రభావం కారణంగా ఏలూరు పట్టణం, పరిసరప్రాంతాల్లో రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలకు కలిగిన అసౌకర్యానికి విద్యుత్ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. -ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సాల్మన్రాజు ఇంట్లో ఉన్న విద్యుత్ ఉపకరణాలన్నీ ఒకేసారి వినియోగిస్తే ట్రాన్స్ఫార్మర్పై లోడ్ పెరిగి, అది కాలిపోయి రాత్రి అంతా కరెంటు రాని పరిస్థితి ఏర్పడుతుంది. కావున విద్యుత్ వినియోగం తగ్గించుకుని మాకు సహకరించండి. ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడినా కొంచెం ఓర్పు, సహనంతో ఉండాలని కోరుతున్నాం. - వినియోగదారులకు విద్యుత్ శాఖ చేసిన విజ్ఞప్తి సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులుగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న విద్యుత్ కోతలకు ఆ శాఖ మంత్రి, అధికారులు చెబుతున్న కారణాలివి. విద్యుత్ కోతలు లేకుండా సరఫరా అందించలేక ప్రకృతి మీద నెపం నెట్టి తప్పించుకునేందుకు చేస్తున్న ప్రకటనలివి. ఇలాంటి ప్రకటనలు విద్యుత్ శాఖ చరిత్రలో తొలిసారి కావడం విశేషం. ట్రాన్స్ఫార్మర్లు తట్టుకోలేవంటూ కథలు.. విద్యుత్ శాఖ మంత్రి, ఇంధన శాఖ అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. నిజంగానే ట్రాన్స్ఫార్మర్లు ప్రస్తుత ఉష్ణోగ్రతలను తట్టుకోలేవా అని విద్యుత్ రంగ నిపుణులను అడిగితే 315 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు ఉన్నా నిస్సందేహంగా తట్టుకుంటుందని తెలిపారు. ఈ ట్రాన్స్ఫార్మర్లో కూలింగ్ సిస్టం ఉంటుంది. అంటే రేడియేటర్లు, ఫ్యాన్లు, ఆయిల్ ద్వారా ట్రాన్స్ఫార్మర్ను చల్లబరిచే వ్యవస్థ అందులో ఉంటుంది. అంతేకాదు ఈ ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ ఉష్ణోగ్రత 95 డిగ్రీల వరకు, వైండింగ్ 120 డిగ్రీల వరకు వేడిని తట్టుకుంటాయి. మరి ఇంతటి సామర్థ్యం ఉన్న ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఎక్కువై కాలిపోవడం ఏమిటనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ లోడ్కు తగ్గట్టుగానే దాని పరిధిలో విద్యుత్ సర్వీసులు ఉంటాయి. మొత్తం సర్వీసులు వినియోగించే విద్యుత్ లోడ్కు తగ్గట్టే ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ఉంటుంది. అలాంటప్పుడు ఓవర్లోడ్ అయ్యే పరిస్థితి ఎందుకొస్తుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే కేవలం తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ ప్రభుత్వం చెబుతున్న సాకులని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అంచనాల్లోనే విఫలమై..అనధికార కోతలు రాష్ట్రంలో వేసవి గరిష్ట విద్యుత్ డిమాండ్ 280 మిలియన్ యూనిట్లు ఉండవచ్చని ఇంధన శాఖ వేసవి ప్రారంభానికి ముందే అంచనా వేసింది. కానీ ఇటీవల రోజువారీ విద్యుత్ డిమాండ్ 288 మిలియన్ యూనిట్ల వరకు వెళ్లింది. అంచనాల్లోనే విద్యుత్ శాఖ విఫలమైందని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. ఈ డిమాండ్కు సరిపడా విద్యుత్ను సరఫరా చేసే పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం లేదు. దీంతో ప్రజలకు నిరంతరం విద్యుత్ అందించలేకపోతున్నామనే విషయాన్ని కప్పిపుచ్చడానికి కొన్ని రోజులుగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని, విద్యుత్ డిమాండ్తో లోడ్ పెరిగిపోయిందని చెబుతూ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి 280 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా వేసినప్పుడే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలి. పెరిగింది కూడా కేవలం 8 మిలియన్ యూనిట్లే. అది కూడా ఒకటి, రెండు రోజులు మాత్రమే. మిగతా రోజుల్లో ఆ స్థాయిలో డిమాండ్ లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ (బుధవారం) 240 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. అంటే అంచనాకంటే చాలా తక్కువగానే వినియోగం ఉంది. అయినా కూడా విద్యుత్ సరఫరా చేయలేక కోతలు విధిస్తున్నారు. పట్టణాల్లోనే రోజుకు రెండు గంటలు కరెంటు తీసేస్తుండగా, గ్రామాల్లో వేళాపాళా లేకుండా అనధికా రికంగా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. రాత్రి సమయాల్లోను విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. అయినా మంత్రి మాత్రం అవి కోతలు కాదు.. అంతరాయాలు అంటూ పర్యాయపదాలు చెబుతూ కాలం గడపాలని చూస్తున్నారు. -
మరో డైవర్షన్ డ్రామా!
సాక్షి, అమరావతి: చంద్రబాబు తన శకుని మార్కు కుతంత్రాలకు మరోసారి బరితెగించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ రెండేళ్ల అవినీతి, అసమర్థ పాలనపై వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకతతో బెంబేలెత్తుతున్న ఆయన డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారు. ప్రభుత్వ రెండేళ్ల వైఫల్య, అవినీతి పాలనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా ఉద్యమానికి పిలుపునివ్వడంతో హడలిపోతున్నారు. అందుకే ఇప్పటికే సరైన ఆధారాలులేక మూలనపడేసిన అక్రమ కేసు బూజు దులిపారు. సిట్ దర్యాప్తు పేరిట కక్ష సాధింపు రాజకీయాలకు పదునుపెట్టారు. ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచార రాద్ధాంతానికి తెగబడుతున్నారు. తద్వారా.. ప్రభుత్వ అసమర్థ పాలన, అవినీతి బాగోతం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎంతకైనా దిగజారుతానని చంద్రబాబు మరోసారి నిరూపిస్తున్నారు. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్ ఆ కుట్రలకు వత్తాసు పలుకుతూ ఖాకీ ధర్మాన్ని విస్మరిస్తూ పచ్చదండు అవతారమెత్తింది. మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ దర్యాప్తు పేరిట రెడ్బుక్ కుట్ర రెండో అంకానికి తెరతీసిన తీరే ఇందుకు నిదర్శనం. ఏ1 సహా అందరికీ బెయిల్.. మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ తాజా హడావుడి కేవలం రాజకీయ కక్ష సాధింపునకేనని స్పష్టమవుతోంది. ఎందుకంటే.. ఈ కేసులో సిట్ ఆరోపణలన్నీ కూడా నిరాధారమని ఇప్పటికే స్పష్టమైంది. పైగా.. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డితోపాటు సిట్ అరెస్టుచేసిన అందరికీ న్యాయస్థానం ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, రిటైర్డ్ అధికారులు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలపై నమోదుచేసిన అభియోగాలకు సిట్ ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయింది. రాజకీయ కక్షతోనే వారిని అరెస్టుచేసినట్లు స్పష్టమైంది. దర్యాప్తు పేరిట సిట్ ఏడాదిపాటు చేసినదంతా కేవలం రెడ్బుక్ వేధింపులేనన్నది తేటతెల్లమైంది. ఇక ఈ అక్రమ కేసులో సిట్ ఇప్పటికే చార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. దాంతో సాంకేతికంగా దర్యాప్తు ముగిసినట్లేనని.. న్యాయస్థానంలో విచారణ ప్రక్రియ కొనసాగించాలని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ చట్ట నిబంధనలు, న్యాయ ప్రక్రియను బేఖాతరు చేస్తూ రాజకీయ కక్ష సాధింపే తమ లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తోంది. అందుకే మద్యం విధానంపై అక్రమ కేసులో హఠాత్తుగా మరోసారి దర్యాప్తు పేరిట తమ కుట్రలో రెండో అంకానికి తెరతీసింది. విచారణ అనంతరం సిట్ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న కేఎన్ఆర్ కేఎన్ఆర్పై నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం.. ఇక వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం కోసమే ఆ పార్టీ పొలిటికల్ అసిస్టెంట్–పీఏ కె. నాగేశ్వరరెడ్డి (కేఎన్ఆర్)ని ప్రభుత్వం వేధిస్తోంది. కేఎన్ఆర్కు భారీ ఆస్తులున్నట్లు, అవన్నీ గత ఐదేళ్లలోనే సంపాదించినట్లు సిట్ చేస్తున్న దుష్ప్రచారం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి ఆయన సీనియర్ జర్నలిస్ట్. 2003 లోనే ‘వార్త’ దినపత్రికలో ఎడిషన్ ఇన్చార్జ్గా పని చేశారు. ఆ సమయంలోనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఆ పార్టీకి పని చేస్తున్నారు. తన వ్యాపారాలు చూసుకుంటూనే పార్టీలో పొలిటికల్ అపాయింట్మెంట్లు చూస్తున్నారు. పార్టీకి నలుగురైదుగురు పీఏలు ఉన్నారు. అయితే కేఎన్ఆర్ ఒక్కరే పీఏ అన్నట్లు, మద్యం విధానంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు.. డిస్టిలరీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించినట్లు ఎల్లో మీడియా ద్వారా కట్టు కథలను ప్రచారంలోకి తెస్తున్నారు. ఈ క్రమంలో పాత విషయాలను పట్టుకుని నెలకు కేవలం రూ.10వేలు–రూ.15 వేలతో ఉద్యోగం చేసిన కేఎన్ఆర్ ఆస్తులు ఎలా కొనుగోలు చేశారని ఈనాడు పత్రిక రాయడం హాస్యాస్పదంగా ఉంది. తన వ్యాపారాల ద్వారా ఆయన చట్టబద్ధంగానే ఆస్తులు కొనుగోలు చేశారు. ఆ వాస్తవాలను వక్రీకరిస్తూ సిట్ అధికారులు ఎల్లో మీడియాకు లీకులు ఇవ్వడం.. కోతికి కొబ్బరికాయ దొరికినట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారంతో రాద్ధాంతం చేయడం ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. అసలు మద్యం దోపిడీ బాగోతం టీడీపీదే..సిట్ పేరుతో చంద్రబాబు చేస్తున్న రాద్ధాంతం చూస్తుంటే దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లుగా ఉంది. ఎందుకంటే మద్యం విధానం ముసుగులో భారీ దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే. 2014–19లో ఏకంగా రూ.25వేల కోట్ల దోపిడీకి పాల్పడినట్లు సీఐడీ ఆధారాలతో సహా నిగ్గుతేల్చింది. కేబినెట్ ఆమోదంలేకుండా రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్ ఫీజులను రద్దుచేసి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టింది చంద్రబాబే. టీడీపీ సిండికేట్కు 7,884 మద్యం దుకాణాలు ఏకపక్షంగా కేటాయించడంతోపాటు మరో 7,884 పరి్మట్ రూమ్లు, 48వేల బెల్ట్ దుకాణాలతో దోపిడీకి పాల్పడ్డారు. ఎంఆర్పీ కంటే 20శాతం అధిక ధరలకు మద్యం విక్రయించి మొత్తంగా రూ.25వేల కోట్లు కొల్లగొట్టారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉండగా వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే లైసెన్సులు మంజూరు చేసింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క డిస్టిలరీకి లైసెన్స్ జారీచేయనేలేదు. మద్యం దోపిడీ కేసులో ఏ–1గా చంద్రబాబుతోపాటు ఇతరులను నిందితులుగా చేరుస్తూ సీఐడీ చార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ కేసులో చంద్రబాబు బెయిల్పై ఉన్నారు. అయితే, 2024లో చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఆ కేసు దర్యాప్తును అటకెక్కించింది. అనంతరం అడ్డగోలుగా మూసివేసింది. ఇక 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరోసారి మద్యం దోపిడీకి చంద్రబాబు బరితెగించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలుచేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దుచేసేశారు. ఆ స్థానంలో ప్రైవేటు మద్యం దుకాణాలను ప్రవేశపెట్టి టీడీపీ సిండికేట్కు ఏకపక్షంగా కేటాయించారు. ఏకంగా 75వేల బెల్ట్ దుకాణాలు తెరచి ఊరూవాడా మద్యం ఏరులై పారిస్తున్నారు. ఎంఆర్పీ కంటే 20శాతం అధిక ధరలతో దోపిడీకి పాల్పడుతున్నారు. అంతేకాక.. నకిలీ మద్యం దందా ద్వారా కూడా భారీ దోపిడీకి తెగబడుతున్నారు. ఇలా మద్యం దోపిడీదారైన చంద్రబాబు కక్షపూరితంగా వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేస్తుండడం విడ్డూరంగా ఉంది. సోదాల పేరిట వేధింపులు..ఈ అక్రమ కేసులో సిట్ అధికారులు సోదాల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. ఓ వైపు కేఎన్ఆర్ను వరుసగా రెండోరోజు సిట్ కార్యాలయంలో విచారిస్తూనే మరోవైపు ఆయన నివాసంలో సోదాల పేరిట నిబంధనలకు విరుద్ధంగా హంగామా చేశారు. ఆయన ల్యాప్టాప్, ఇతర వ్యక్తిగత సామగ్రితోపాటు కొన్ని కాగితాలను స్వా«దీనం చేసుకున్నారు. విదేశాల్లో చదువుతున్న కేఎన్ఆర్ పెద్ద కుమార్తె ప్రస్తుతం విజయవాడలో ఉన్నారు. ఆమె పాస్పోర్ట్, మొబైల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు ఎంతగా అభ్యంతరం పెట్టినా పోలీసులు కనికరించలేదు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాశ్, న్యాయవాదులు గవాస్కర్, బసవారెడ్డి పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తంచేశారు. కేఎన్ఆర్ కుమార్తె పాస్పోర్ట్, ఫోన్ను ఎలా స్వాధీనం చేసుకుంటారని నిలదీయడంతో సిట్ అధికారులు వాటిని వెనక్కి ఇచ్చేశారు. మరోవైపు.. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్రెడ్డి నివాసంలో కూడా సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన్ని శుక్రవారం విచారణకు రావాలని నోటీసులు జారీచేశారు. కేఎన్ఆర్ను రాత్రి 9.30 వరకు విచారించిన అనంతరం విడిచిపెట్టారు. -
డీమెరిట్ డీఎస్సీ
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన మొదటి నోటిఫికేషన్ మెగా డీఎస్సీ–2025 డీమెరిట్ డీఎస్సీగా మారిపోయిందా? ఈ డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులకు ప్రభుత్వం మొండి చేయి చూపించనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సర్కారు తప్పులు, అధికారుల విచ్చలవిడితనం వెరసి ప్రతిభగల అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. అన్ని సర్టిఫికెట్లు సరిగా ఉన్నా సరే వివిధ సాకులతో వారిని అనర్హులుగా చేశారు. మెరిట్లో తర్వాత ఉన్నవారికి ఆ పోస్టును ఇచ్చేశారు. కనీసం అభ్యర్థులు చెప్పింది వినకపోగా, కనీస గడువూ ఇవ్వకుండా నచ్చినట్టు చేసుకుంటూ పోయారు. తీరా డీఎస్సీ అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు అన్నీ సక్రమమే అని ఆయా శాఖల నుంచి పత్రాలు తెచ్చుకున్నా.. ‘అంతా అయిపోయింద’ంటూ చేతులెత్తేవారు. దీంతో దాదాపు ఐదారేళ్ల కాలంపాటు డీఎస్సీ కోసమే కష్టపడి చదివి, పరీక్షల్లో మెరిట్ సాధించిన వారికి తీవ్ర అన్యాయమే జరిగింది. వాస్తవానికి ఇలాంటి సమయంలో నష్టపోయిన వారికి ప్రభుత్వం న్యాయంగా పోస్టులు సృష్టించి ఇవ్వాలి. కానీ ప్రభుత్వం మాత్రం మరో డీఎస్సీలో ప్రయత్నించండి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. గ్రీవెన్స్లోనూ న్యాయం జరగని వైనం మెగా డీఎస్సీలో అన్ని అర్హతలూ ఉండి పోస్టులు రాని అభ్యర్థుల కోసం జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో గ్రీవెన్స్ రెడ్రెస్ సెల్స్ ఏర్పాటు చేశారు. మొదటి స్థాయిలో న్యాయం జరగకపోతే, రెండో దశలో ఆర్జేడీ స్థాయిలో పరిష్కరించాలి. అక్కడా పరిష్కారం కాకపోతే రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాలి. మొదటి రెండు స్థాయిల్లో 15 రోజుల చొప్పున, మూడో స్థాయిలో నెల రోజుల్లోనూ పరిష్కారం చేయాలి. కానీ, కింది స్థాయిలో ఒక్కటీ పరిష్కరించిన దాఖలా లేదు. మెరిట్ లిస్టు, అభ్యర్థుల ఎంపిక అంతా రాష్ట్ర స్థాయిలో పూర్తిచేసి, కేవలం ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మాత్రమే జిల్లా అధికారులు చేశారు. దాంతో తమ పరిధి కాదని తమకు వచ్చిన ఫిర్యాదులను రాష్ట్ర కార్యాలయానికి పంపినట్టు అభ్యర్థులు చెబుతున్నారు. రాష్ట్ర స్థాయి పరిష్కార వేదికలో అభ్యర్థులకు అవమానాలే గాని న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. – అన్నమయ్య జిల్లాకు చెదిన ఓ అభ్యర్థి ఓసీ–ఈడబ్లు్యఎస్ కోటాలో ఎస్ఏ బయాలజీ పోస్టు రావాలి. తన కంటే మందున్న అభ్యర్థి గతంలో ‘బీసీ’ కోటాలో డీఎస్సీ పరీక్షలు రాశాడు. ఈసారి అతడు ఓసీ–ఈడబ్లు్యఎస్గా నమోదు చేసుకుని తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందాడు. బాధిత అభ్యర్థి ఆధారాలతో పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయంలోని గ్రీవెన్సెస్లో ఫిర్యాదు చేయగా ‘‘ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థి సర్టిఫికెట్లు తప్పుడువని తహసీల్దార్తో రద్దు చేయించి రా.. అప్పుడు నీ ఉద్యోగం గురించి ఆలోచిస్తా’’ అని ఓ అధికారి అవమానకరంగా మాట్లాడారని ఆవేదన చెందాడు. సూపర్ ‘నో’మరి..! సాధారణంగా ప్రభుత్వ చర్యలతో నష్టపోయిన ఉద్యోగార్థులకు వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఆ ప్రభుత్వంపైనే ఉంటుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి 148 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేసింది. ఇందులో 15,941 పోస్టులను తప్పుల తడకగా భర్తీ చేసి, మిగిలిన 406 పోస్టులను క్యారీ ఫార్వర్డ్ కింద మరో నోటిఫికేషన్కు బదిలీ చేశారు. ఇక్కడ అధికారులు నిబంధనలను ఇష్టానుసారంగా మార్చేయడంతో పాటు వేగంగా పని పూర్తిచేశామన్న రికార్డు కోసం తాపత్రయపడ్డారేగాని, వారి చర్యల ద్వారా అభ్యర్థులకు ఎంత తీవ్రమైన అన్యాయం జరిగిందో పట్టించుకోలేదు. నష్టపోయిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి తమ నిజాయతీని నిరూపించుకున్నారు. వెంటనే వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. కానీ అప్పటికే పోస్టుల భర్తీ పూర్తయిపోయిందని, ఆయా స్థానాల్లో మరొకరికి పోస్టింగ్ ఇచ్చేశామని చెప్పడం గమనార్హం. కోర్టు తీర్పు ప్రకారం వారికి పోస్టులు ఇవ్వాలి, అదుకోసం సూపర్న్యూమరీ పోస్టులు సృష్టించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఆ దిశగా ఇచ్చేందుకు చంద్రబాబు సర్కారు అంగీకరించడం లేదు. దీనివల్ల ప్రతిభ గల అభ్యర్థులు నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
ఆత్మస్తుతి – పరనింద
పార్టీ శ్రేణులకు భవిష్యత్తుపై భరోసా కల్పించాలన్నా, వారిని కార్యసాధన దిశగా ఉరక లెత్తించాలన్నా, ఉత్సాహపరచాలన్నా అధినేతకు ముందుగా కావాల్సింది ఆత్మవిశ్వాసం, తన కార్యాచరణపై స్పష్టత. అది రాజ్యమేలే పార్టీ అయితే ఇవి మాత్రమే సరిపోవు. ఆ పార్టీ ప్రభుత్వం అప్పటికే ప్రజల అభ్యున్నతికోసం చాలా చేసివుండాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గతంలోనూ, ఇప్పుడూ దేన్నీ సక్రమంగా చేసిన చరిత్ర లేదు. విశ్వసనీయత మొదటికే లేదు. అందుకే రెండురోజుల ‘హైబ్రిడ్’ మహానాడును ప్రారంభిస్తూ బుధవారం ఆయన చేసిన ప్రసంగం నిండా పరనింద, స్వోత్కర్ష దండిగా ఉన్నాయి. చేసిందేమీ లేదు గనుక... చెప్పుకోవడానికేమీ మిగల్లేదు మరి! గత ఎన్నికలకు ముందు భారీ వాణిజ్య ప్రకటనలతో, ఎస్ఎంఎస్లతో, ఊరూరా ఉపన్యాసాలతో జనాన్ని ఊదరగొట్టారు! సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ఊరించారు. సంతకాలతో బాండ్లు రాసిచ్చారు. తీరా అమలుదగ్గరకొచ్చేసరికి అలవాటు ప్రకారం దగా చేశారు. ఆడబిడ్డ నిధి పేరిట ఆడవాళ్లందరికీ నెలకు రూ. 1,500 చొప్పున ఇస్తామన్నారు. ఈ రెండేళ్లలో ఆ పద్దుకింద ఒక్కొక్కరికి రావాల్సిన మొత్తం రూ. 36,000. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 ఇస్తామన్న హామీ కింద ఇంతవరకూ ఒక్కొక్కరికి రావాల్సిన మొత్తం రూ. 72,000. ఈ రెండు పథకాలకూ గుండుసున్నా చుట్టగా... మిగిలినవి అరకొరగా అమలు చేస్తూ వంచిస్తున్నారు. యాభైయ్యేళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నెలకు రూ. 4,000 చొప్పున అందిస్తామని వాగ్దానమిచ్చి, వైఎస్ జగన్ హయాంలో ఉన్న పింఛన్దార్లు 66,34,372 మందిలో 6,23,079 మందికి ఎగనామం పెట్టారు. ఈ రెండేళ్లలో ఒక్కొక్కరికి బకాయిపడ్డ మొత్తం రూ. 96,000. మహిళల కోసం తీసుకొస్తామన్న ఉచిత బస్సు పథకాన్ని తాత్సారం చేయటమేకాక, 16 కేటగిరీ బస్సుల్లో కేవలం అయిదింటికే పరిమితం చేశారు. భవిష్యత్తులో ఇక ఎలక్ట్రిక్ బస్సులే ఉంటాయని చెబుతున్న నోటితోనే వాటిల్లో ఉచితం ఉండబోదని సెలవిస్తున్నారు. అంతేకాదు... ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తున్నారు. ‘తల్లికి వందనం’ తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి, ఆపై 20 లక్షల మందికి కోతపెట్టి అమలు ప్రారంభించారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కోరకం మొత్తం వేస్తూ మోసగిస్తున్నారు. ‘అన్నదాతా సుఖీభవ’ అంటూనే తొలి ఏడాది మొండిచేయి చూపారు. రెండోఏడాది 53.52 లక్షలమంది రైతుల్లో 7 లక్షలమందికి కోతపెట్టి అరకొరగా అమలుచేశారు. రెండేళ్లకూ రూ. 40,000 ఇవ్వాల్సి వుండగా, రూ. 14,000తో సరిపెట్టారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగం వగైరాలన్నీ ధ్వంసం చేశారు. జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల పర్యవసానంగా వస్తున్న సంస్థలను తమ ఖాతాలో వేసుకోవటం, ఉన్నవాటిని తరిమే యటం బాబు ‘పారిశ్రామిక విధానం’! ఇన్ని లొసుగులుండబట్టే మహానాడును ‘హైబ్రిడ్’ చేశారు. పశ్చిమాసియా యుద్ధంవల్ల పొదుపు పాటించదల్చుకుని ఈ మోడల్ తీసుకొచ్చామని పైకంటున్నా... కార్య కర్తలను ఒకచోట పోగేస్తే, తమ గంభీరోపన్యాసాలు విని ఊరుకోక క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేమిటో, జనం ఎలా ఛీకొడుతున్నారో ఏకరువుపెట్టే ప్రమాదం ఉందని గ్రహించటంవల్లే ఈ ఎత్తుగడ! కానీ తానొకటి తలిస్తే జరిగింది వేరొకటి. రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్ల నుంచి 7.20 లక్షలమంది వర్చువల్గా పాల్గొన్నారని టీడీపీ గప్పాలు కొట్టుకుంటుండగా చాలాచోట్ల ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చి ఆ పార్టీ వాలకమేమిటో బట్టబయలైంది. నియోజకవర్గానికి 7 నుంచి 10 కేంద్రాల్లో దీన్ని నిర్వహించటంవల్ల స్థానిక నేతలకు ఒక్కొక్కరికి దాదాపు రూ. 15 లక్షలు చేతిచమురు మాత్రం వదిలింది. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం కోటా మరో పెద్ద దగా. జగన్ హయాంలో ‘అమ్మ ఒడి’ మొదలుకొని ఉద్యోగాలవరకూ... పంచాయతీరాజ్ సంస్థలు మొదలుకొని నామినేషన్ పనుల వరకూ అన్నిటా మహిళలకు 50 శాతం కోటా ఇచ్చిన వైనం తండ్రీ కొడుకులు మరిచివుంటారు. నాయకుడికి విశ్వసనీయత ఉండాలి. గాలి మాటలతో, వెన్నుపోట్లతో, రెడ్బుక్ పాలనతో, హద్దులెరుగని దూషణలతో బాబు సాధించేదేమీ ఉండదు. పేలవంగా ముగిసిన వర్చువల్ మహానాడు దీన్నే చాటుతోంది. -
తరిమి తరిమి కొడతాం... టీడీపీ మహానాడులో తెలంగాణపై.. జీవన్ రెడ్డి మాస్ వార్నింగ్
-
మహానాడులో సోది వినలేక, బూతు రికార్డింగ్ డ్యాన్సులు
-
మళ్లీ అదే డైవర్షన్ కుట్ర
సాక్షి, అమరావతి: చంద్రబాబు తన మార్కు డైవర్షన్ రాజకీయాలకు మరోసారి తెరతీశారు. టీడీపీ కూటమి ప్రభుత్వ రెండేళ్ల అవినీతి, అసమర్థ పాలనపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పన్నాగం పన్నారు. అందుకు టీడీపీ వీరవిధేయ అధికారులతో ఏర్పాటు చేసిన సిట్ను మరోసారి అస్త్రంగా చేసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు విచారణకు సంబంధించి సిట్ ఒక్కసారిగా హడావుడి చేయడమే అందుకు నిదర్శనం. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డీజీపీ కార్యాలయం, సిట్ అధికారులు చకచకా కుట్ర కార్యాచరణ చేపట్టారు. కె.నాగేశ్వర్ రెడ్డి(కేఎన్ఆర్)ని సిట్ అధికారులు బుధవారం విచారించడం ఆ కుతంత్రంలో భాగమే. ఆయన్ను విజయవాడలోని సిట్ కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విచారించారు. పోరుబాటకు జడిసి డైవర్షన్ రాజకీయం టీడీపీ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనా వైఫల్యాలపై వైఎస్సార్సీపీ పోరుబాటకు సిద్ధపడుతోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ నిర్దేశించారు. ఈ సమావేశం నిర్వహించనున్నట్టు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. దాంతో బెంబేలెత్తిన ప్రభుత్వ పెద్దలు డైవర్షన్ కుట్రకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే కేఎన్ఆర్ను బుధవారమే విచారించాలని నిర్ణయించారు. తదనంతరం కూడా ఈ విచారణ పేరుతో వైఎస్సార్సీపీ నేతలను వేధించాలన్నదే ప్రభుత్వ పెద్దల పన్నాగమన్నది స్పష్టమవుతోంది. ఈ విచారణ ప్రక్రియను వక్రీకరిస్తూ.. ఎల్లో మీడియాకు లీకులు ఇస్తూ దు్రష్పచారానికి పాల్పడాలన్నదే ప్రభుత్వ పెద్దల లక్ష్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కుతంత్రాలను తిప్పికొడుతూ ఉద్యమ పథంలో సాగుతామని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. ఇదీ సిట్ పన్నాగం మద్యం విధానంపై అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి పోలీసు జులుం ప్రదర్శిస్తోంది. ఈ కేసులో విచారణ పేరుతో పలువురు అధికారులు, డిస్టిలరీల ప్రతినిధులను వేధించి వెంటాడింది. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వేధించింది. వారు చెప్పని విషయాలు చెప్పినట్టుగా వాంగ్మూలాలు నమోదు చేసింది. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, రిటైర్డ్ అధికారి కృష్ణమోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, రాజ్ కేసిరెడ్డి తదితరులను అక్రమంగా అరెస్టు చేసింది. అయినా సరే ఈ కేసులో ఎటువంటి ఆధారాలు చూపించలేక పోయింది. ఈ కేసులో అక్రమంగా అరెస్టు అయిన అందరికీ బెయిల్ మంజూరైంది. దాంతో ప్రభుత్వం కుట్ర పూరితంగానే అక్రమ కేసు నమోదు చేసిందన్నది స్పష్టమైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి ఈ అక్రమ కేసు విచారణను తెరపైకి తేవడం గమనార్హం. కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ కేసు విచారణ పేరుతో హడావుడి చేయాలని పన్నాగం పన్నిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
బరితెగించిన టీడీపీ నేతలు.. గుడి, బడి, ప్రభుత్వాఫీసుల్లో మహానాడు
బుచ్చెయ్యపేట/పెద్దపంజాణి/శ్రీరంగరాజపురం/కంచరపాలెం(విశాఖ)/సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ నేతలు అధికార మదంతో మమ్మల్ని ఎవరు అడుగుతారులే అనే బరితెగింపుతో పవిత్రమైన ఆలయాలు.. ప్రభుత్వ భవనా లని చూడకుండా ఎక్కడపడితే అక్కడ మహానాడు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేటలో ఏకాదశి రోజున భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా అడ్డంగా టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు కట్టేశారు. భక్తులు మండపం నుంచి గుడిలోకి వెళ్లకుండా అడ్డంగా కుర్చీలు వేసి, ఏకంగా ఆలయం తలుపులు మూసివేశారు. స్వామి విగ్రహానికి ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఉంచి, భారీ స్క్రీన్ ఏర్పాటుచేసి సమావేశాన్ని నిర్వహించారు. కొందరు టీడీపీ నేతలు మద్యం సేవించి హాజరైనట్లు సమాచారం. అలాగే, ఇదే జిల్లా దేవరాపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ యోగా భవనంలోనూ మహానాడు నిర్వహించారు. ఇక ప్రైవేట్ హాల్స్లో అయితే డబ్బులు కట్టాలన్న కక్కుర్తితో చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో ఓ ఎంపీడీఓ కార్యాలయంలో కానిచ్చేశారు. ఎంపీడీఓ బాలాజీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. మరోవైపు.. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం తయ్యూరు పాయకట్టు ఆరుమాకులపల్లి గ్రామంలోని శ్రీ ఆరుమానిగంగమ్మ ఆలయ ప్రాంగణంలోనూ మహానాడు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం నిండా జెండాలు, భారీ బ్యానర్లు, కటౌట్లు, ఏర్పాటుచేశారు. ఇది దేవాలయమా? లేక టీడీపీ కార్యాలయమా?’’ అంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇదే జిల్లా గుడిపాలలో టీటీడీ కల్యాణమండపంలో, తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం సింగనాలత్తూరు ప్రభుత్వ పాఠశాలలోనూ నిర్వహించారు.సచివాలయంలో మహానాడు.. ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతల అరెస్టువిశాఖ ఉత్తర నియోజకవర్గం 46వ వార్డు కస్తూరినగర్లోని సచివాలయంలో కూడా మహానాడు నిర్వహించారు. మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు కటుమూరి సతీష్, కో–ఆప్షన్ సభ్యుడు సేనాపతి అప్పారావు, మాజీ కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అయితే, వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్టుచేసి కంచరపాలెం పోలీస్స్టేషన్కు తరలించడంతో ఉద్రిక్తత నెలకొంది.బద్వేలు మహానాడులో రికార్డు డ్యాన్స్ బద్వేలులో రికార్డింగ్ డ్యాన్సులు..మరోవైపు.. వైఎస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు బోర్కొట్టి జారిపోతుండటంతో డీసీసీబీ ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డి అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటుచేశారు. ఇది చూసి పార్టీ సీనియర్ నాయకులు ముక్కున వేలేసుకున్నారు. పొదుపు పేరుతో మరింత దుబారామహానాడుకు తడిసిమోపెడు ఖర్చు చేయించిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వర్చువల్ మహానాడుకు చంద్రబాబు అనుసరించిన తీరు మాటల్లో పొదుపు.. చేతల్లో తీవ్ర దుబారా కనిపించింది. ఇంత ఖర్చుచేసినా ఈ కార్యక్రమం పూర్తిగా అట్టర్ఫ్లాప్ అయినట్లు పార్టీ నేతలు వాపోతున్నారు. వర్చువల్ సమావేశమే అయినా దీనికి సాధారణంగా అయ్యే ఖర్చుకంటే నాలుగు రెట్లు ఎక్కువ అవడంతో పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అయినా కార్యకర్తలు అక్కడకు రావడానికి ఉత్సాహం చూపించలేదు. ఈ మహానాడులో పొదుపు కంటే దుబారా ఎక్కువైంది. ఖర్చు తగ్గించడానికే ఆన్లైన్లో పెట్టామని చెబుతున్న చంద్రబాబు మాటలకు.. రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్లలో ఏర్పాటుచేసిన భారీ స్క్రీన్లు, ఇతర హంగులకు ఎక్కడా పొంతన కనిపించలేదు. వాస్తవానికి.. ఒకే వేదికపై మహానాడు నిర్వహిస్తే ఒక భారీ వేదిక, జర్మన్ హ్యాంగర్ టెంట్లు, సౌండ్ సిస్టమ్స్, భారీ భోజనాలు ఉండేవి. అక్కడ ఖర్చంతా ఇద్దరు, ముగ్గురు బడా నేతలపైనే పడేది. ప్రస్తుత వర్చువల్ మహానాడులో మంగళగిరి పార్టీ కార్యాలయంలో వేసిన ఒక స్టూడియో ఖర్చు మాత్రమే అధిష్టానానిది. మిగిలిన అసలు ఖర్చంతా జిల్లాల్లోని 1,875 క్లస్టర్లలోని నేతల మీదకు నెట్టేశారు. అసలు కంటే కొసరు ఖర్చు ఎక్కువైంది.. క్లస్టర్లు అంటే నియోజకవర్గానికి కనీసం 7–10 వరకూ ఉంటాయి. ఉదా.. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న 8 క్లస్టర్లలోనూ విడివిడిగా టెంట్లు, కురీ్చలు, సౌండ్ బాక్సులు, ప్రతీచోటా ఒక భారీ ఎల్ఈడీ స్క్రీన్, దానికి హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, స్థానికంగా తరలివచ్చే జనం కోసం విడివిడిగా భోజనాలన్నీ కలిపి తడిసిమోపెడైంది. ఒక్కో క్లస్టర్లో కనీసం రూ.10 లక్షల ఖర్చు.. మామూలుగా అయితే మహానాడు ఖర్చు మొత్తాన్ని పార్టీ నిధుల నుండి లేకపోతే పార్టీలోని బడా నేతలు భరించేవారు. కానీ, చంద్రబాబు డిజిటల్ డ్రామావల్ల యాప్ లింక్, ఆఫీస్ లైటింగ్, వేదిక ఖర్చు తప్ప ఆయనకు పెద్దగా ఖర్చు కాలేదు. 1,875 క్లస్టర్లలో మాత్రం విపరీతంగా ఖర్చయింది. సాధారణ మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుండి జనాలను బస్సులు, వాహనాలు, రైళ్లలో తరలించడంవల్ల రవాణా ఖర్చు పెరిగేదని.. దీన్ని తగ్గించేశామని చంద్రబాబు సెలవిచ్చారు. అయితే, ఈ క్లస్టర్ కేంద్రాలకు జనాలను తరలించడానికి స్థానిక నేతలు వందలాది ఆటోలు, ట్రాక్టర్లు, ప్రైవేట్ వాహనాలు వినియోగించారు. కనీసంగా ఒక్కో క్లస్టర్లో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఖర్చయినట్లు చెబుతున్నారు. ఇదంతా స్థానిక ఎమ్మెల్యే, నేతలపైనే పడింది. వారు తమ నియోజకవర్గంలోని పలు కార్యాలయాలు, వ్యాపారులపై పడి వసూలుచేసినట్లు తెలుస్తోంది. రవాణా, టెంట్లు, జనాల తరలింపు మామూలే.. ఇక రవాణా, టెంట్లు, జనాల తరలింపు వంటివన్నీ తగ్గించి ఖర్చును నివారించడం వర్చువల్ సమావేశాల ఉద్దేశం. కార్యకర్తలు, నేతలు ఎవరి ఇంట్లో వాళ్లు కూర్చుని మొబైల్స్లోనో, లాప్టాప్లలోనో చూసుకోవాలి. అలా కాకుండా మళ్లీ గ్రామాల్లో, మండలాల్లో టెంట్లు వేసి, మైకులు పెట్టి, వందల మందిని సమీకరించి, పెద్ద స్క్రీన్ల ముందు కూర్చోబెట్టడాన్ని ఏమనాలని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంటే తప్ప పొదుపు ఏమాత్రం కాదని స్పష్టంగా అర్ధమవుతోంది. బాబు సెల్ఫ్ డబ్బా కోసమే డిజిటల్ డ్రామా.. చంద్రబాబు తాను ఐటీ విజినరీనని చెప్పుకోవడానికి వర్చువల్ అనే పదం వాడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం జరిగేదంతా పాత విధానమే. జనాన్ని తరలించడం, అదే టెంట్లు, అదే బిర్యానీ ప్యాకెట్లు అదే హడావుడి. కార్యకర్తలను తీసుకెళ్లి థియేటర్లో సినిమా చూపించినట్లు ఎల్ఈడీ స్క్రీన్ల ముందు కూర్చోబెట్టారు. అయినా వారు వెళ్లిపోవడంతో ఆపడానికి నానాపాట్లు పడ్డారు. చివరికి బద్వేలు నియోజకవర్గంలో అయితే ఏకంగా రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి పరువు తీసుకున్నారు. -
కోర్టు చెబితే ఇచ్చేయాలా?
సాక్షి, అమరావతి: రేయింబవళ్లు కష్టపడి సాధించుకున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి పొమ్మంటే వారికి ఎలా ఉంటుంది? ఆ బాధ వర్ణనాతీతం! మళ్లీ నోటిఫికేషన్ నాటికి వయసు ఉంటుందో మీరిపోతుందో తెలియని పరిస్థితి. అలాంటిది మెగా డిఎస్సీ–2025లో కష్టపడి సాధించుకున్న ఉపాధ్యాయ ఉద్యోగాలను పలువురికి ఇచ్చేదిలేదు పొమ్మంది చంద్రబాబు ప్రభుత్వం. దాంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. కానీ ప్రభుత్వం మాత్రం అప్పటికే నియామకాలు జరిగి పోయాయని చెప్పడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నష్టపోయిన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని మరోసారి ఆదేశించగా, సర్కారు వాటినీ పెడచెవిన పెట్టింది. దాంతో అధికారులను ఇంప్లీడ్ చేస్తూ అభ్యర్థులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేశారు. ఇలా దాదాపు 20కి పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయంటే చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీని ఎంత పారదర్శకంగా, ఘనంగా ఎలా చేపట్టిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 148 రోజుల్లో మొత్తం ప్రక్రియ ముగించామని సర్కారు పెద్దలు గొప్పలు చెబుతున్నా, తీవ్రంగా నష్టపోయిన అభ్యర్థుల గురించి మాత్రం పట్టించుకోక పోవడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెగా డీఎస్సీ విధానాలపై దాఖలైన 200కు పైగా పిటిషన్లలో పలు కోర్టు ధిక్కరణ పిటిషన్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఎంపికప్రక్రియ పూర్తయిపోయిందని చెబుతున్న ప్రభుత్వం.. నష్టపోయిన వారికి కోర్టు ఆదేశాల మేరకు పోస్టులు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. ఆదిలోనే మెరిట్కు పాతర గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించారు. అభ్యర్థులు వారి వారి అర్హతలను బట్టి ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2,41,387 దరఖాస్తులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందే అర్హతలున్న వారివే. పరీక్షలు సైతం వేర్వేరుగా నిర్వహించారు. అర్హతలు, ప్రతిభగల అభ్యర్థులు ఎస్జీటీతో పాటు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టుల్లో రెండు కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందే అర్హత సాధించారు. వీటిల్లో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులు ప్రాధాన్యక్రమంలో ఉంటాయి. ఒక ఎస్జీటీ 20 ఏళ్లకు పైగా పని చేసి, అర్హత సంపాదిస్తే స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ)గా పదోన్నతి వస్తుంది. ఇక పీజీటీ అయ్యే అవకాశమే లేదు. ఈ క్రమంలో రెండు లేదా మూడు ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులు ఉన్నత ఉద్యోగం పొందాలనే కోరుకుంటారు. మెరిట్ ప్రకారం మూడు పోస్టులకు కాల్ లెటర్లు పంపాల్సి ఉన్నా, దరఖాస్తులో మొదటి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్ లెటర్లు పంపారు. దీంతో అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచ్చిన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇలా దాదాపు 4 వేల మంది ఉన్నత పోస్టును పొందే అవకాశం కోల్పోయారు. దాంతో కొందరు అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును అధికారులు పట్టించుకోలేదని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 11 మంది డీఎస్సీ అభ్యర్థులు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ (నం.4203/2025), కుల ధ్రువీకరణ పత్రం నకిలీదని తిరస్కరించిన ఘటనలో ఏఎస్సార్ జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ హైకోర్టులో వేసిన పిటిషన్ 3470/25 వివరాలు సర్కారు తీరుపై న్యాయస్థానం ఆగ్రహండీఎస్సీలో ఉన్నత ఉద్యోగాలు సాధించినా, ఆప్షన్ ఇవ్వలేదన్న కారణంతో 54 మందిని ఎస్జీటీలుగా పరిగణించారు. వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. దాంతో న్యాయస్థానం విద్యా శాఖ తీరును తప్పుబట్టింది. విద్య, వైద్యంలో మెరిట్ను కాదని, కింది వారికి అవకాశం ఇస్తే ఆ దేశం నాశనం అవుతుందని తీవ్రంగా ఆక్షేపించింది. వారు సాధించిన పోస్టులు వారికే ఇచ్చేయాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కానీ, కోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 15 నాటికి డీఎస్సీ ఎంపిక, పోస్టింగ్స్ ఇచ్చేసి ప్రక్రియ ముగించామని తెలిపింది. దీంతో కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని అభ్యర్థులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వ న్యాయవాది వారి స్థానాల్లో వేరే వారిని నియమించామని చెప్పడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. తమ మధ్యంతర ఉత్తర్వులను పట్టించుకోకుండా.. మీకు తోచిన సమాధానం చెప్పడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించింది. రెండు నెలల్లోగా వారి ఉద్యోగాలు వారికి ఇవ్వాలని జనవరిలోనే తీర్పునిచ్చింది. కానీ, ప్రభుత్వం మాత్రం హైకోర్టు తీర్పును ఇప్పటికీ పట్టించుకోలేదు. బాధితులు ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. డీఎస్సీ ప్రక్రియ ముగిసిపోయిందని, కొత్తగా ఎవరికీ ఉద్యోగాలు ఇచ్చేది లేదని అభ్యర్థులపై పాఠశాల విద్యాశాఖ బెదరింపు ధోరణి ప్రదర్శించినట్టు బాధితులు వాపోయారు.తప్పుపై తప్పులకు నిదర్శనాలెన్నెన్నో..⇒ 200 మందికి పైగా అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లలో మచ్చుకు కొన్ని ఇలా ఉన్నాయి.⇒ డీఎస్సీలో మెరిట్ సాధించినా పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 11 మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. కోర్టులో ఆ ఆరోపణలను ప్రభుత్వం రుజువు చేయలేక పోవడంతో వారికి పోస్టింగ్ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ తీర్పును ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారంతా మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ (నం.4203/2025) వేశారు. ఇందులో డీఎస్సీ నాటి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజును ప్రధాన ప్రతివాదిగా చేర్చారు.⇒ అనంతపురం జిల్లాకు చెందిన గొల్ల రెడ్డమ్మ (4261/25), బి.సరస్వతి (3585/25), వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన శ్రీకాంత్ రాయల్ (3130/ 25) స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు (స్పోర్ట్స్ కోటా) ఎంపికయ్యారు. అయితే వారి సర్టిఫికెట్లపై అనుమానం వ్యక్తం చేస్తూ పోస్టులు ఇచ్చేందుకు తిరస్కరించారు. దాంతో వారు కోర్టును ఆశ్రయించి తమ తప్పులేదని నిరూపించుకున్నారు.⇒ అనంతపురం జిల్లాకు చెందిన రవీంద్రకుమార్ (1350/25), చిత్తూరు జిల్లా నగరికి చెందిన ఎం.మోహన్ (1347/26) స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించినా మెరిట్ కం రోస్టర్ సరిగా అమలు చేయకపోవడంతో అవకాశం కోల్పోయారు. తమకు అన్యాయం జరిగిందని ఆధారాలతో కోర్టును ఆశ్రయించగా, వారికి పోస్టు ఇవ్వాలని ఆదేశించింది. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు.⇒ అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ (3470/25) ఉపాధ్యాయ ఉద్యోగం సాధించినా, కుల ధ్రువీకరణ పత్రం నకిలీదంటూ తిరస్కరించారు. దాంతో ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా, స్థానిక తహసీల్దార్ నేతృత్వంలో అధికారుల కమిటీని వేసి దుర్గాప్రసాద్ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ సరైనదేనని నిర్ధారించారు. కానీ, అతనికి పోస్టు ఇవ్వలేదు. ఇదే కోవలో తిరుపతి జిల్లాకు చెందిన ఎ.శిరీష (3060/25) ఉద్యోగాన్ని కూడా ఎస్సీ సర్టిఫికెట్ ఫేక్ అని తిరస్కరించారు. ఆమె కూడా తన సర్టిఫికెట్ సరైనదేనని నిరూపించుకున్నారు. కానీ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు.⇒ గుంటూరుకు చెందిన జి.రాజేశ్ దినకర్ (1335/26) ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ ‘ఫేక్’ అని ఎస్ఏ పోస్టు తిరస్కరించారు. దాంతో మరోసారి గుంటూరు వైద్యుల కమిటీ ముందు హాజరై సచ్చీలతను నిరూపించుకున్నారు. సదరం సర్టిఫికెట్ సరైనదేనని ధ్రువీకరించినా పోస్టు ఇవ్వలేదు. -
మెగా DSCపై చంద్రబాబు వీడియో అంబటి నెక్స్ట్ లెవెల్ ర్యాగింగ్
-
బయటపడ్డ పచ్చ కుట్ర కుతకుతలాడుతున్న బాబు
-
డీఎస్సీ ‘మెగా’ మోసం!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 తప్పిదాలను కప్పిపుచ్చి మభ్యపెట్టేందుకు చంద్రబాబు సర్కారు పడరాని పాట్లు పడుతోందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆధారాలతో సహా డీఎస్సీ అక్రమాలు బహిర్గతం కావడంతో ప్రభుత్వం బెంబేలెత్తుతోందన్నారు. ‘ఫస్ట్ ర్యాంకర్కు కాల్ లెటర్ పంపకుండా ఎందుకు ఆపారు? నవీన్ క్యాండిడేట్ ఐడీని ప్రభుత్వం బ్లాక్ చేయడం నిజం కాదా? ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఏకంగా ఫస్ట్ ర్యాంకు రావడం.. ఫస్ట్ ర్యాంకు వచ్చినా కూడా ఉద్యోగంలో చేరకపోవడం చరిత్రలో ఎక్కడైనా ఉందా? డీఎస్సీ–2025 మొదటి మెరిట్ లిస్టు ఎందుకు రద్దు చేశారు?’ అని ఒక ప్రకటనలో సూటిగా ప్రశ్నించారు. గతంలో డీఎస్సీ మెరిట్ లిస్టులు కలెక్టర్ కార్యాలయాల్లోనే వెరిఫై చేసేవారని, ఈదఫా మాత్రం సెలెక్ట్ అయిన వారికి నేరుగా మెసేజ్లు పంపడం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు. డీఎస్సీలో డొల్లతనంపై ‘సాక్షి’లో వరుసగా కథనాలు వెలువడటం.. మాజీ సీఎం వైఎస్ జగన్ దీన్ని ఎండగట్టడం.. సీబీఐ విచారణకు డిమాండ్ చేయడంతో ఉలిక్కిపడిన బాబు సర్కారు కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే అర్ధరాత్రి తూతూమంత్రంగా ఓ ప్రకటన జారీ చేసి చేతులు దులుపుకొనే యత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. డీఎస్సీ అక్రమాలను సర్వత్రా నిలదీస్తుంటే విద్యాశాఖ మంత్రి మాత్రం అంతా పారదర్శకమని తన ‘ఎక్స్’ ఖాతాలో బుకాయించడం విస్మయం కలిగిస్తోందన్నారు. మెరిట్ కలిగి ఉండి అన్యాయానికి గురైన అభ్యర్థులను బుజ్జగించేందుకు విద్యాశాఖ మంత్రి రాజకీయాలు చేయడం ఏమిటన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులను ఎలాంటి పరీక్ష లేకుండా భర్తీ చేసిన ప్రభుత్వం తాజాగా అదే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందాలంటే రాత పరీక్ష తప్పనిసరి అంటూ పాలసీ, జీవోలను సవరించడం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు.తప్పించుకునేందుకు ‘శాప్’ ఆపసోపాలు..ప్రభుత్వం వివరణ: శాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడాకోటా డీఎస్సీ పోస్టుల భర్తీలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలు అవాస్తవం, నిరాధారమైనవి.ఇదీ వాస్తవం: క్రీడా కోటా డీఎస్సీ పోస్టుల భర్తీలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పోస్టులు పొందారని, అనర్హులకు పోస్టుల దక్కాయని.. అర్హులైనప్పటికీ తమకు అన్యాయం జరిగిదంటూ ఎందరో అభ్యర్థులు ‘శాప్’కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా కోర్టులకు వెళ్లి తేల్చుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. సమాచార హక్కు–2005 ప్రకారం అర్హులైన అభ్యర్థులు కోరిన సమాచారాన్ని ‘శాప్’ ఇంత వరకు ఇవ్వకపోవడం దేనికి సంకేతం? ఏదైనా నోటిఫికేషన్ తర్వాత పోస్టు భర్తీ చేస్తే ఆ పోస్టుకు సంబంధించిన సమగ్ర వివరాలు, ఉద్యోగి ఏ అర్హతతో ఉద్యోగం పొందారో సమాచారం ఇవ్వాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలో స్పష్టం చేసింది. దీనిని శాప్ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? టీచర్ పోస్టులకు బేరాలు పెడుతూ నంబర్తో సహా ఫోన్ కాల్ రికార్డింగ్స్ బహిర్గతమైతే వాటిపై శాప్ విచారణ చేయడం మానేసి మౌనం దాల్చడం వెనుక మతలబు ఏమిటి?ప్రభుత్వం వివరణ: 3,600 మంది అభ్యర్థులు దాఖలు చేసుకున్న 5,326 దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రాష్ట్ర స్థాయి కమిటీకి పంపించి పోస్టులు భర్తీ చేసింది.ఇదీ వాస్తవం: స్క్రీనింగ్ కమిటీలో సభ్యులైన డీఎస్డీవోలను ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా తయారీ వరకు ఎందుకు కొనసాగించలేదు? ప్రాథమిక ఎంపిక జాబితాను బహిరంగంగా ఎందుకు ప్రదర్శించలేదు? ఒకవేళ ప్రదర్శిస్తే కచ్చితంగా అభ్యంతరాలు వచ్చేవి. కానీ శాప్లో ఒక్క అభ్యంతరం కూడా ఎందుకు నమోదు కాలేదు? అంటే, అసలు ప్రాథమిక జాబితా ప్రదర్శించకుండానే తుది జాబితా సిద్ధం చేసేశారు. చివరికి ఫలితాల రోజు అనర్హురాలైన విజయనగరానికి చెందిన ఓ క్రీడాకారిణికి ఉద్యోగం రావడం గమనించి అర్హులు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తే శాప్ వాటిని ఎందుకు పట్టించుకోలేదు? ఈ ఏడాది ఏప్రిల్ 24న సాక్షిలో ‘డీఎస్సీ డీల్స్’ కథనం వెలువడగానే సదరు క్రీడాకారిణిపై విచారణ చేస్తున్నట్లు శాప్ పేర్కొంది. ఇప్పటికీ నెల రోజులు దాటినా విచారణ ఎందుకు ముగించడం లేదు? అంటే ప్రభుత్వమే వాస్తవాలు బయటపడకుండా అడ్డుకుంటోంది కదా!తాను ఎస్సీఈఆర్టీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా 2016 నుంచి పనిచేసినట్టు కోర్టుకు తెలిపిన నవీన్ సర్కారు అబద్ధాల వివరణలపై అభ్యర్థుల మండిపాటు..డీఎస్సీ–2025లో కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్గా ప్రకటించిన పి.నవీన్ ఎస్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్పై కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. అతడికి డీఎస్సీలో ప్రశ్నలను ఆన్లైన్ చేసే బాధ్యతలు అప్పగించారు. డీఎస్సీ ఫలితాల అనంతరం అతడికి టాప్ ర్యాంకులు వచ్చాయని గుర్తించిన అధికారులు మొత్తం ఎంపిక ప్రక్రియనే మార్చేశారు. అబద్ధాల వివరణలతో ప్రభుత్వం వరుసగా కట్టు కథలు వినిపిస్తోందని టీచర్ అభ్యర్థులు మండిపడుతున్నారు. చంద్రబాబు సర్కారు తీరును నిలదీస్తూ పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. తమ ప్రశ్నలకు జవాబు చెప్పాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న పలు సందేహాలు, ప్రభుత్వ వివరణలు ఇలా ఉన్నాయి..!ప్రభుత్వం వివరణ: డీఎస్సీ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్ పి.నవీన్ 2016 నవంబర్ నుంచి ఎస్సీఈఆర్టీలో అవుట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తూ వ్యక్తిగత కారణాలతో 2025లో రాజీనామా సమర్పించాడు. అన్నింటికంటే ముఖ్యంగా మెరిట్ ప్రాతిపదికన అతడిని జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా సర్టిఫికెట్ వెరిఫికేషన్కు పిలిచినా వెరిఫికేషన్కు హాజరు కాలేదు. ఇదీ వాస్తవం: డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 26న కాల్ లెటర్లు విడుదల చేశారు. వీటిని ఆయా అభ్యర్థులు తమ డీఎస్సీ నంబర్ ఆధారంగా కంప్యూటర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆగస్టు 29 నుంచి ప్రారంభమైన సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. అయితే, నవీన్ తన క్యాండిడేట్ లాగిన్ ఐడీని అధికారులు బ్లాక్ చేశారంటూ హైకోర్టుకు ఆధారాలు సమర్పించాడు. అసలు కాల్ లెటర్ లేకుండా సర్టిఫికెట్ల పరిశీలనకు అనుమతిస్తారా?ప్రభుత్వం వివరణ: నవీన్ వ్యక్తిగత కారణాలతో 2025లో రాజీనామా సమర్పించాడు.ఇదీ వాస్తవం: నవీన్ 2025 ఏ నెలలో రాజీనామా చేశాడో చెప్పలేదు. తాను డీఎస్సీ ప్రక్రియ ముగిసే వరకు ఎస్సీఈఆర్టీలోనే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశానంటూ కోర్టుకు ఇచ్చిన పిటిషన్లో అతడు పేర్కొన్నాడు. మరి వ్యక్తిగత కారణాలతో ఎప్పుడు రాజీనామా చేశాడు?ప్రభుత్వం వివరణ : డీఎస్సీ రాసేందుకు నిర్ణీత విధానాల ప్రకారం ముందుగా శాఖకు సమాచారం ఇచ్చి సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే నవీన్ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, అనుమతి పొందకుండా పరీక్షలకు హాజరయ్యాడు. అందువల్ల అతడి పేరు తదుపరి ఎంపిక ప్రక్రియ రికార్డుల నుంచి తొలగించాం. ఇదీ వాస్తవం: అనుమతి పొందకుండా పరీక్షలకు హాజరైతే అతడి ఎంపిక ప్రక్రియను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ దాదాపు ఏడాదిన్నర కాలంపాటు సాగిన డీఎస్సీ ప్రక్రియలో ఈ విషయాన్ని ఎందుకు గుర్తించలేదు? గుర్తించి ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలా ఎక్కడా చేయలేదు. ఎంపిక ప్రక్రియలో నవీన్ను తొలగించి ఉంటే అతడి స్థానంలో మరో అభ్యర్థికి సోషల్ స్టడీస్లో మొదటి ర్యాంకు, జోన్–2 టీజీటీలో ఆరో ర్యాంకును మరో అభ్యర్థికి కేటాయించి ఉండాలి. ఇలా ఎందుకు చేయలేదు? ప్రభుత్వ తీరును తప్పుబడుతూ నవీన్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. అతడికి పోస్టు ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. మరి నవీన్ విద్యాశాఖ అనుమతి లేకుండా పరీక్ష రాశాడని, అందుకే అతడికి పోస్టు కేటాయింపును రద్దు చేశామని కోర్టుకు ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు?ఉర్దూ మీడియం పోస్టుల్లోనూ తప్పిదాలు..!ప్రభుత్వం వివరణ: అన్నమయ్య, కడప జిల్లాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ బయాలజీ (ఉర్దూ మీడియం) పోస్టుల భర్తీ పూర్తిగా మెరిట్, రోస్టర్ నిబంధనల ప్రకారమే జరిగింది. ఓపెన్ కాంపిటీషన్ (ఓసీ) రోస్టర్ పాయింట్ కింద అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థిని, ఓసీ–ఈడబ్ల్యుఎస్ కోటా కింద చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్ గల మెరిట్ అభ్యర్థిని నిబంధనల ప్రకారమే ఎంపిక చేశాం. ఇందులో ఎటువంటి నిబంధనల అతిక్రమణ జరగలేదు.ఇదీ వాస్తవం: అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన సయ్యద్ జమీల్ డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ (ఉర్దూ)లో 58.77 స్కోరు సాధించారు. ఓసీ–ఈడబ్ల్యుఎస్ కోటాలో ఆయనకు ఆ పోస్టు ఇవ్వాలి. కానీ ఆ పోస్టును ముస్లిం బీసీ(షేక్) వర్గానికి చెందిన అభ్యర్థికి ఇచ్చారు. ఎంపిక అయిన అభ్యర్థి 2008, 2012, 2014, 2018 డీఎస్సీల్లో ‘బీసీ’గా నమోదు చేసుకున్నాడు. 2025 నాటికి ‘ఓసీ–ఈడబ్ల్యుఎస్’గా నమోదు చేశాడు. గతంలో బీసీ కులం అని చూపించి 2025 డీఎస్సీలో ఓసీగా ఎలా మారిపోయాడు?ఇదేనా పారదర్శకత?డీఎస్సీ నియామకాలను అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. అదే నిజమైతే టెట్ మార్కుల సవరణకు పలు పర్యాయాలు ఎందుకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది? ఒకసారి మెరిట్ జాబితాను విడుదల చేశాక సవరణతో రెండోసారి జాబితా ఎందుకు ఇచ్చారు? అనంతరం వాటిని ఆన్లైన్ నుంచి తొలగించి నేరుగా ఎంపిక జాబితాలు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ఎంపికైనట్లు కొందరు అభ్యర్థులకు ఎస్ఎంఎస్లు పంపి, ఆ తర్వాత కాదని చెప్పడం నిజం కాదా? అమరావతిలో వేడుకలకు ఆహ్వానించి ఆ తర్వాత మీరసలు టీచర్ పోస్టులకే ఎంపిక కాలేదని చెప్పడంలో ఆంతర్యమేంటి? జూలై–2024 టెట్ను విజయవంతంగా పూర్తి చేసిన అధికారిని డీఎస్సీ కన్వీనర్గా నియమించామని చెబుతున్నారు. మరి ప్రారంభంలో ఆయనకే బాధ్యతలు ఎందుకు అప్పగించలేదు? అప్పటికే ఉన్న డీఎస్సీ కన్వీనర్ను ఎందుకు తొలగించారు?ప్రభుత్వం వివరణ: క్రీడా సంఘాలు, ఫెడరేషన్ల ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను ఇచ్చాం.ఇదీ వాస్తవం: స్క్రీనింగ్ కమిటీ ద్వారా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన అత్యంత రహస్యంగా సాగింది. ఇందులో ఎక్కడా క్రీడా సంఘం, ఫెడరేషన్కు సంబంధించిన వ్యక్తులు లేరు. శాప్ తయారు చేసిన తుది జాబితా లిస్టు ప్రకారం ఆయా క్రీడా సంఘాల నుంచి సమ్మతి లేఖలు తీసుకుని ‘మమ’ అనిపించింది. జాతీయ స్థాయిలో పోస్టుల భర్తీలో ఫెడరేషన్లకు చెందిన వ్యక్తులను దగ్గర పెట్టుకుని సర్టిఫికెట్ల ధ్రువీకరణ చేపట్టడం ఆనవాయితీ. క్రీడాకారుల టీమ్ ఫొటోలు, మెడల్స్ లాంటివి స్వయంగా పరిశీలించి ధ్రువీకరిస్తారు. మరి ఇక్కడ అలా ఎందుకు జరగలేదు? డిగ్రీ లేకున్నా ఇతర రాష్ట్రాల్లో డిగ్రీ చదివినట్లు ఫేక్ సర్టిఫికెట్ తీసుకొచ్చి అనర్హులు టీచర్ ఉద్యోగాలు పొందారు. ఆ డిగ్రీలకు సంబంధించి శాప్ ఇతర రాష్ట్రాల వర్సిటీలను ఎందుకు సంప్రదించలేదు?ప్రభుత్వం వివరణ: మార్గదర్శకాలకు అనుగుణంగానే స్పోర్ట్స్ కోటా సీట్లను భర్తీ చేశాం.ఇదీ వాస్తవం: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డీఎస్సీలో 421 పోస్టులను స్పోర్ట్స్ కోటాలో పరీక్ష లేకుండా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి తగ్గట్టుగా 97 శాతం పోస్టులు నింపేశారు. డీఎస్సీ ముగిసిన 8 నెలల తర్వాత క్రీడా పాలసీ, 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ హఠాత్తుగా ఎందుకు మారింది? ఈ డీఎస్సీలో రాత పరీక్షల అవసరం లేకుండా క్రీడల కోటాలో ఉద్యోగాలు ఇవ్వగా ఇప్పుడు మాత్రం ఆయా శాఖలు నిర్వహించే రాత పరీక్షల్లో కచ్చితంగా అర్హత సాధించాలని ఎందుకు సవరించారు? రాత పరీక్ష లేకుండా ఉద్యోగం ఇవ్వడం తప్పయితే.. 2025 డీఎస్సీ పూర్తిగా తప్పిదమే. అది సక్రమమే అయితే.. ఇప్పుడు రాత పరీక్షను తప్పనిసరి ఎందుకు చేశారు? కర్నూలు జిల్లాలో ఓపెన్ కేటగిరీ పోస్టును భర్తీ చేసిన తర్వాత మళ్లీ నాన్–లోకల్ పోస్టు ఎలా భర్తీ చేస్తారు? దీనిపై కోర్టుల్లో కేసులు వేస్తే శాప్ 2002 తర్వాత జరిగిన సవరణలను దాచిపెట్టి కేవలం రాష్ట్రపతి ఉత్తర్వులు–1975 అంశాలను మాత్రమే కోర్టుకు ఎందుకు నివేదించింది?జవాబు చెప్పలేక జగన్పై వ్యక్తిగత విమర్శలా?విద్యాశాఖ మంత్రి లోకేశ్ డీఎస్సీపై వాస్తవాలను అంగీకరించకుండా మాజీ సీఎం వైఎస్ జగన్పై వ్యక్తిగత దూషణలు, విమర్శలు చేస్తూ ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు పెట్టడాన్ని బొత్స తీవ్రంగా ఖండించారు. డీఎస్సీలో అర్హులకు అన్యాయం జరగడం ముమ్మాటికీ నిజమని.. దీనిపై ‘సాక్షి’ ప్రచురించిన కథనం తప్పు అని నిరూపించే ఒక్క ఆధారాన్ని కూడా లోకేశ్ చూపలేకపోయారని పేర్కొన్నారు. 16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామని, పది వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చామని గొప్పలు చెప్పుకున్న లోకేశ్ ఎక్కడా తప్పు జరగలేదని చెప్పే ధైర్యం చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. డీఎస్సీ–2025లో జరిగిన దారుణాలు ఆధారాలతో సహా కళ్లముందే కనిపిస్తున్నా దర్యాప్తు చేస్తామని ఒక్కమాట అనేందుకు లోకేశ్ సాహసించలేదన్నారు. మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు 200 కేసులు వేయించారని జగన్పై నిరాధార ఆరోపణలతో బురద చల్లారని మండిపడ్డారు. వాస్తవానికి డీఎస్సీలో తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లిన వారంతా ప్రతిభ కలిగిన టీచర్ అభ్యర్థులేనని, వారిలో పరీక్ష రాయని వారు ఒక్కరూ లేరని గుర్తు చేశారు. ‘వారికి పోస్టులు ఇవ్వాలని సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. అయితే కోర్టు తీర్పు కాపీ వచ్చేలోపే ప్రక్రియను హడావుడిగా ముగిస్తూ ప్రభుత్వం ఫలితాలు ప్రకటన, ఎంపిక ప్రక్రియ, పోస్టింగ్లు ఇచ్చేశారు. దీనిపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మెరిట్ అభ్యర్థులకు పోస్టులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడంతో పాటు విద్యాశాఖ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఇది నిజం కాదా? ఈ విషయం తెలిసి కూడా లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా ఎలా కొనసాగుతున్నారు? అర్హులకు ఎందుకు న్యాయం చేయలేదు? డీఎస్సీకి 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించారు. కూటమి ప్రభుత్వం ఆడిన అవినీతి క్రీడతో 3 లక్షల మందికి పైగా అభ్యర్థులకు పూడ్చలేని నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పి అభ్యర్థులకు న్యాయం చేయాలి’ అని బొత్స డిమాండ్ చేశారు. స్పోర్ట్సు డీఎస్సీలో జరిగిన స్కామ్పై ‘సాక్షి’లో కథనం వెలువడిన నెల రోజుల తర్వాత అబ్బే.. తప్పు జరగలేదంటూ ‘శాప్’ మంగళవారం ఓ ప్రకటన జారీ చేసి చేతులు దులుపుకోవటాన్ని బొత్స తప్పుబట్టారు.ఈ ప్రశ్నలకు జవాబేది చినబాబూ..1. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్సీఈఆర్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?2. ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు?3. కృష్ణా జిల్లాలో సోషల్ స్టడీస్లో టాపర్గా వచ్చిన ఎస్సీఈఆర్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి పి.నవీన్ ఎంపిక జాబితాలో తనకు పోస్టు లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది వాస్తవం కాదా?4. రాయలసీమ జిల్లాకు చెందిన ఓ క్రీడాకారిణి న్యాయంగా తనకు దక్కాల్సిన పోస్టు నాన్ృలోకల్ కోటాలో వేరే వ్యక్తికి కట్టబెట్టేశారని హైకోర్టును ఆశ్రయించింది నిజం కాదా?5. సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు?6. రూ.15 లక్షలకు ‘‘స్పోర్ట్స్ కోటా’’ పోస్టులు బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయి? వారు ఏయే క్రీడల్లో ప్రతిభ చూపారు? వారికి ఎలా పోస్టింగులు ఇచ్చారో మొత్తం వివరాలు బయటపెట్టగలరా?7. టెట్ కన్వీనర్గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీనర్ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్ను డీఎస్సీ కన్వీనర్గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏమిటి?8. మెగా డీఎస్సీ పేరుతో అమరావతిలో నిర్వహించిన నియామకపత్రాల ప్రదానోత్సవానికి కొందరు డీఎస్సీ ఉద్యోగార్థులను పిలిచి, తర్వాత వాళ్లు సెలెక్ట్ కాలేదని వాళ్ల జీవితాల్లో నిప్పులు పోసిన మాట వాస్తవం కాదా? -
మెగా డీఎస్సీ ఒక స్కామ్
సాక్షి, రాజమహేంద్రవరం: డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మెగా స్కామ్కు తెర తీసిందని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మంగళవారం మాట్లాడారు. డీఎస్సీ–2025పై అభ్యర్థుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్కు చిత్తశుద్ధి ఉంటే పదవికి రాజీనామా చేసి డీఎస్సీపై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు జిమ్మిక్కులు, స్కామ్లు చేయడంలో సిద్ధహస్తులని, ప్రజలను, నిరుద్యోగులను మోసం చేయడం అనేక సందర్భాల్లో చూశామని చెప్పారు.మాజీ సీఎం వైఎస్ జగన్ 6,500 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే నానా యాగీ చేసిన చంద్రబాబు, పవన్, లోకేశ్.. తాము అధికారంలోకొస్తే మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ అంటూ ప్రగల్భాలు పలికారన్నారు. మెగా డీఎస్సీ అంటూ దగా డీఎస్సీ నిర్వహించారని మండిపడ్డారు. నిరుద్యోగుల నోట్లో మన్ను కొటా్టరని, డీఎస్సీ అభ్యర్థులు పడిన కష్టాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. నవీన్ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి తనకు వచ్చిన ర్యాంకులపై కోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం మెరిట్ జాబితాను వెబ్సైట్ నుంచి తొలగించడం డీఎస్సీలో అవకతవకలకు నిదర్శనమన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 3.36 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ రాస్తే 16,430 మందికి మాత్రమే సెలెక్టెడ్ మెసేజ్లు పంపించడం, మెరిట్ జాబితాలు అందుబాటులో ఉంచకపోవడం దుర్మార్గమన్నారు. వెబ్సైట్లో మెరిట్ లిస్టులు మాయం చెయ్యడం, రోస్టర్ విధానం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ సక్రమంగా పాటించకపోవడంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని దుయ్యబట్టారు. చిత్తశుద్ధి ఉంటే మంత్రి లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో పోస్టులను వేలం పెట్టి మరీ రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు బేరాలు ఆడిన ఆడియోల టేపులు బహిర్గతం కావడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఆడియో టేపుల లీకేజ్పై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హమన్నారు. సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో ఆయనకు తెలియకుండానే డీఎస్సీలో ఇన్ని అక్రమాలు చోటు చేసుకుంటున్నాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించకపోతే యువజన విభాగం ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థుల తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
సుగాలి ప్రీతి కేసులో దోషులను పట్టుకోవడంలో బాబు సర్కారు విఫలం
సాక్షి, అమరావతి: సుగాలి ప్రీతి కేసులో చంద్రబాబు సర్కారు చూపిస్తున్న నిర్లక్ష్యం ఆమె తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నింపుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసులో బలమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో సీబీఐతో దర్యాప్తు చేయాల్సిందిపోయి.. తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని సీబీఐ వాళ్లు చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా? అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.‘ఇవాళ న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకు వారికి తోడుగా ఉంటానని చెప్పాను. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ తరఫున పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందిస్తాం అని భరోసా ఇచ్చాను’ అంటూ ‘ఎక్స్’లోని తన ఖాతాలో మంగళవారం వైఎస్ జగన్ పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. బాబు సర్కారు మౌనం ‘‘సుగాలి ప్రీతి కేసులో చంద్రబాబు ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం ఆమె తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నింపుతోంది. 2017లో అమాయకురాలైన, 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైతే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాం. అంతేకాదు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించాం. కానీ చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ కేసును పూర్తిగా పక్కనపెట్టేశారు. సీబీఐ తమకు సిబ్బంది, వనరుల కొరత ఉందని ఇప్పుడు చెబుతుంటే వారికి సహకారం అందించి కేసును కొలిక్కి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం పాటిస్తోంది. పెన్షన్ తీసేయడం బాధాకరం ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో తమ కుటుంబానికి వచ్చే పెన్షన్ను కూడా ఇప్పుడు నిలిపేశారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాదు, వారు అప్పట్లో మన ప్రభుత్వం వేసిన సిట్ రిపోర్టు, అప్పట్లో చేసిన సీడీఎఫ్డీ ల్యాబ్ రిపోర్టులు, డీఎన్ఏ ప్రొఫైల్లో ఉన్న వివరాలను సైతం చూపించారు. మరి ఇలాంటి బలమైన ఆధారాలున్న నేపథ్యంలో సీబీఐతో ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోయి, తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని సీబీఐ చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా? ఇవాళ(మంగళవారం) న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకు తోడుగా ఉంటానని చెప్పాను. ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ తరఫున పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందిస్తాం.’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
డీఎస్సీ స్కాంపై నోరెత్తరేం?
అధికారంలోవున్న ప్రతిసారీ పదో తరగతి మొదలుకొని ప్రభుత్వోద్యోగాల భర్తీ వరకూ జరిగే ఏ పరీక్షనూ ఎన్నడూ సక్రమంగా నిర్వహించటం చేతకాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి కూడా ఆ ‘ఘనత’ సొంతం చేసుకున్నారు. డీఎస్సీ నిర్వహణలో పూర్తిగా ఫెయిలైనా ఏమీ జరగనట్టు ప్రవర్తిస్తున్నారు. అధికారంలో కొచ్చాక తొలి సంతకం పెట్టి, నిరుడు ఆర్భాటంగా జరిపించిన డీఎస్సీ పాపాలపుట్ట బద్దలై నాలుగు రోజులవుతున్నా ఆయనగానీ, విద్యాశాఖను చూస్తున్న ఆయన కుమారుడు లోకేశ్గానీ ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోవటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. పేపర్లీక్ మొదలు కొని స్పోర్ట్స్ కోటా పోస్టులు అమ్ముకోవటంవరకూ ఆరోపణలు వచ్చిపడుతున్నా తండ్రీ కొడుకులు సంజా యిషీ ఇవ్వకపోవటం, చడీచప్పుడూ లేకుండా కొందరిని బాధ్యతల నుంచి తప్పించటం, ర్యాంకుల్ని పక్కనç ³డేయటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇదేమీ కుటుంబ వ్యవహారం కాదు... పార్టీ సంస్థాగత అంశం అంతకన్నా కాదు. జవాబు దారీతనాన్ని గుర్తెరిగి సంజాయిషీ చెప్పి తీరాల్సిన అతి ముఖ్యమైన విషయం.జీవితంలో ఏనాడైనా కష్టపడి చదివుంటే, నిజాయితీగా ఎదిగుంటే పరీక్షలంటే ఏమిటో, అభ్యర్థులుపడే ఇబ్బందులెలా ఉంటాయో తెలిసేది. దశాబ్దాలుగా అనుసరిస్తున్న నియమ నిబంధనలకు మంగళం పాడి, కాసులతో తూకంవేసి పోస్టులు భర్తీ చేశారని నిరుద్యోగులు ఆక్రోశిస్తున్నారు. డీఎస్సీ నిర్వహణలో, ఎంపికలో అనేక లోపాలున్నాయంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థులు ఆశ్రయిస్తే ప్రభుత్వ తీరుపై ధర్మాసనం నిరుడు అక్టోబర్లోనే ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకటికన్నా ఎక్కువ ఉద్యో గాలు పొందిన వారిని ఉన్నత అర్హతగల ఉద్యోగానికి ఎంపిక చేయాలనీ, ఇది రెండు నెలల్లో పూర్తి కావాలనీ నిరుడు ఆగస్టులో మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కానీ ఎనిమిది నెలలు గడుస్తున్నా అతీగతీ లేదు. ప్రచండమైన పోటీ, పరిమిత అవకాశాలుగల వర్తమానంలో పోటీ పరీక్షలపై లక్ష లాదిమంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకుంటున్నారు. స్వస్థలాలనుంచి దూరప్రాంతాల కెళ్లి కోచింగ్ పేరిట వేలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. తినీతినకా కష్టాలూ పడుతూ రాత్రింబగళ్లు చదువుకుంటున్నారు. ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. తమ పిల్లలకు ఎలాగైనా అవకాశం దక్కాలంటూ తల్లిదండ్రులు కనిపించని దేవుళ్లకు మొక్కుకుంటు న్నారు. పరీక్షలు బాగా రాశామనీ, అవకాశం వచ్చితీరుతుందనీ ఎదురుచూసే వారికి శరాఘాతంగా పోస్టులన్నీ అంగడి సరుకుగా మార్చేస్తే ఏమనాలి? పేరుకు ‘మెగా డీఎస్సీ’ అని ప్రచారం చేసుకున్నా ఈసారి కేవలం 16,347 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, కావాలని ఆలస్యంచేసి ఇచ్చిన ఈ కొత్త నోటిఫికేషన్ కనీవినీ ఎరుగని ‘మెగా’ద్భుతమంటూ ప్రచారం చేసుకున్నారు. తీరా నిర్వాకం ఇలా తగలబడింది. ఈసారి ఫలితాలు పారదర్శ కంగా లేవు. కేవలం సెలెక్టయినవారి జాబితాతో సరిపెట్టారు. ఎంపికైనవారు వేరే అవకాశాలొచ్చి వెళ్లినప్పుడు, ఒకటికి మించి ఉద్యోగావకాశాలొచ్చిన వారున్నప్పుడు తమకు అవకాశం దక్కుతుందని ఆశలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. ఎంపికైన వారికి ఫోన్లో ‘రారమ్మ’ని ఆహ్వానించటం, కొన్ని రోజులు గడిచాక రావొద్దని చెప్పడం ఒక ప్రహసనం. కొత్తగా వచ్చిన టీచర్లకు శిక్షణ శిబిరం నిర్వహిస్తూ, అందులో ఎంపిక కానివారికి చోటిచ్చి, అటుపై వారిని ‘టీచర్లు’గా ముద్రేసిన వైనం మరో చిత్రం. దేశం మొత్తం ‘నీట్’ పరీక్ష గురించి మాట్లాడుకుంటున్నది. కానీ ఈ డీఎస్సీ కుంభకోణం ముందు అది పిపీలకం. అక్కడ ప్రశ్నపత్రాలు లీకైతే... ఇక్కడ ప్రశ్నపత్రాలు మొదలుకొని పోస్టుల భర్తీ వరకూ అడుగడుగునా అవకతవకలే. ఫోన్లలో బేరసారాలూ, స్పోర్ట్స్ కోటా పోస్టుల అమ్మకాలు, మహిళా అభ్యర్థులతో అసభ్య చాటింగులు పాలకుల హైన్యాన్ని చాటుతున్నాయి. జగన్ పాలనలో గ్రామ సచివాలయం మొదలుకొని ఉన్నతో ద్యోగాలవరకూ... టెన్త్ మొదలుకొని పీజీ పరీక్షలవరకూ ఎలాంటి అక్రమాలకూ తావు లేకుండా సమర్థవంతంగా నిర్వహించినప్పుడు కూటమి సర్కారుకు ఏమైంది? లోకేశ్ను బర్తరఫ్ చేసి, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపితే అసలు దొంగలు బయటికొస్తారు. -
SIRపై YS జగన్ కీలక సమావేశం
-
కార్పొరేషన్ ఎన్నికలో ఓడిపోతామని చంద్రబాబుకు భయం
-
డీఎస్సీ పేపర్ లో బాబు స్కాం.
-
లోకేష్ కాదు లీకేష్.. మెగా DSCలో దగా
-
పొగాకు రైతు ధర్మాగ్రహం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు రీజియన్ పరిధిలో పొగాకు వేలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా మూడు మిలియన్ కేజీల ఉత్పత్తులూ ఇప్పటి వరకు కొనలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలే సరైన గిట్టుబాటు ధరలు లేక ఆవేదనలో ఉన్న రైతులు వేలం ప్రక్రియ ఆలస్యంతో మరింత నష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రైతులు ఎక్కడికక్కడ రోడ్డెక్కుతున్నారు. రోడ్లపై పొగాకు బేళ్లను పోసి తగలబెట్టి నిరసన తెలుపుతున్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరిస్తున్నారు. కర్ణాటక వేలం ముగియకపోవడం, అంతర్జాతీయంగా ఆర్డర్లు లేవనే సాకుతో వ్యాపారులు, పొగాకు కొనేందుకు ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు, కొండపి, టంగుటూరు, పొదిలి, కనిగిరి, వెల్లంపల్లి, ఒంగోలు 1 వేలం కేంద్రాల వద్ద రైతులు నిరసనలు తెలిపారు. రోడ్డుపై పొగాకు బేళ్లను వేసి తగలబెట్టారు. చంద్రబాబు పాలనపై కన్నెర్ర చేశారు. రెండు నెలలుగా ధరలు లేక నానా అగచాట్లు పడుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు ఇదే విధంగా ఉంటే బ్యారన్కు రూ.5 లక్షల వరకు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు.టీడీపీ నేత ఓవరాక్షన్ ఇదిలా ఉంటే రైతులకు మద్దతుగా వైఎస్సార్ సీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ సోమవారం కందుకూరులోని రెండో పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన సమయంలో టీడీపీ నేత, రైతు నాయకుడు తాటికొండ రమణయ్య ఓవరాక్షన్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేలం కేంద్రంలో బుర్రా రైతులతో మాట్లాడుతున్న సమయంలో బోర్డు అధికారులు అక్కడికి చేరుకుని ప్రస్తుత మార్కెట్ పరిస్థితి గురించి వివరించే యత్నం చేశారు.స్పందించిన బుర్రా గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే బోర్డు తరఫున ఏం చర్యలు తీసుకున్నారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో రమణయ్య ఇక్కడ బోర్డును నిందిస్తారేంటి అంటూ వ్యాపారులు, బోర్డుకు మద్దతుగా మాట్లాడుతూ రైతులను రెచ్చగొట్టే యత్నం చేశారు. వెంటనే స్పందించిన బుర్రా.. రమణయ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులకు అండగా నిలబడకుండా వ్యాపారులకు వంతపాడడంపై మండిపడ్డారు. దీంతో రైతులు కూడా రమణయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరలు పెంచేలా చర్యలు తీసుకోవాలని, వ్యాపారులు వేలంలో పాల్గొని పొగాకు కొనేలా చూడాలని బుర్రా మధుసూదన్ డిమాండ్ చేశారు. -
21,452 మందికి మొండిచేయి
‘లైట్స్.. కెమెరా.. యాక్షన్’ తరహాలో మత్స్యకార సాయం పంపిణీలో సీఎం చంద్రబాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మంటలేని స్టవ్పై గరిట తిప్పి చేపల కూర వండేసిన చంద్రబాబు.. దానిని మత్స్యకార మహిళలకు వడ్డించారు. తాను కూడా నేలపై కూర్చుని వారితోపాటే భోజనం చేశారు. దీనికి పచ్చమీడియా విస్తృత ప్రచారం కల్పించింది. చివరకు అదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని తేలిపోయింది. ఇదే విషయాన్ని మత్స్యకారులు కూడా చెబుతున్నారు. సోషల్ మీడియాలో అయితే దీనిపై మీమ్స్, సెటైర్లు పేలుతున్నాయి. నిజంగా అంతటి అభిమానం, ప్రేమ చంద్రబాబుకు తమపై ఉంటే ఈ రోజు ఇన్ని వేల మందికి వేట నిషేధ భృతికి ఎగనామం పెట్టి రోడ్డున పడేసేవారు కాదని మత్స్యకారులు వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘మత్స్యకార సేవలో..’ పథకం వెన్నుపోటు తోవలో నడిచింది. మాటల గారడీతో సీఎం చంద్రబాబు మత్స్యకారులను బురిడీ కొట్టించారు. సముద్రంపై చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే మత్స్యకార సాయంలో అడ్డగోలుగా కోతలు విధించిన చంద్రబాబు సర్కారు గంగపుత్రులకు అన్యాయం చేసింది. రాష్ట్రంలో 21,452 మంది మత్స్యకారులకు కొర్రీల మీద కొర్రీలు వేసి దాదాపు రూ.42.90 కోట్లకు పైగా ఎగ్గొట్టారు. దీనిపై మత్స్యకారులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. డబుల్ చేస్తానని డబ్బాకొట్టి.. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజులపాటు సముద్రంపై వేట నిషేధ సమయంలో జీవనాధారం కోల్పోయే మత్స్యకారులకు ప్రభుత్వం వేట నిషేధ భృతి అందిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఈ సాయాన్ని రూ.10 వేలకు పెంచి డబుల్ చేస్తామని చంద్రబాబు, పవన్కళ్యాణ్ హామీ ఇచ్చారు. చంద్రబాబు గద్దెనెక్కిన తొలి ఏడాది ఈ పథకానికి పూర్తిగా ఎగనామం పెట్టగా.. రెండో ఏడాది అరకొర సాయానికే పరిమితమైంది.ఈ ఏడాది ఆదినుంచీ వేట నిషేధ భృతికి అర్హుల సంఖ్యను కుదిస్తూ కోతలు పెట్టడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని మత్స్యకారులు మండిపడుతున్నారు. వేట నిషేధ భృతి పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 19న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంటలో చంద్రబాబు ఆర్భాటంగా చేశారు. 1,30,796 కుటుంబాల ఖాతాల్లో రూ.262 కోట్లు జమ చేసినట్టు చంద్రబాబు ఆ కార్యక్రమంలో ఘనంగా ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు దీనికి భిన్నం తీరాచూస్తే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత నెల 18న మత్స్యశాఖ ఆధ్వర్యంలో వేట నిషేధ లబ్ధి కోసం రిజి్రస్టేషన్ ఉన్న బోట్లపై ప్రభుత్వం లబ్ధిదారుల ఫొటో గుర్తింపు సర్వే చేపట్టింది. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, విశాఖ, అనకాపల్లి, బాపట్ల, తిరుపతి, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సర్వే అనంతరం 1,52,248 మంది లబ్ధిదారులను గుర్తించింది.వీరిలో విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చాయని, పింఛను, రైతు భరోసా తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఉన్నారనే సాకులతో 9,045 మందిని జాబితా నుంచి తొలగించింది. మరో 12,407 మంది మెకనైజ్డ్ బోట్ల(సముద్రంలో లోతైన జలాల్లోకి వేటకు వెళ్లే పెద్ద బోట్లు, ట్రాలర్లు) లబ్ధిదారులకు కూడా ఎగనామం పెట్టింది. ఇలా మొత్తంగా 21,452 మంది మత్స్యకారులను అనర్హులుగా తేల్చింది. రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 4,883 మందికి వేట నిషేధ భృతిని ఎగ్గొట్టేసింది. రెండో స్థానంలో కాకినాడ జిల్లాలో 2,692 మందికి కొర్రీలతో కోతపెట్టి రోడ్డున పడేసింది. ఇందుకు చూపించిన కారణం కూడా చాలా అన్యాయంగా ఉందని మత్స్యకార సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ డీజిల్ వినియోగించారని.. మెకనైజ్డ్ బోట్ల నిర్వహణ కోసం ప్రభుత్వం డీజిల్ రాయితీ లీటరుకు రూ.9 వంతున ఇస్తోంది. సముద్ర వేటకు వెళ్లే మెకనైజ్డ్ బోట్ల రాయితీ డీజిల్ వెయ్యి లీటర్ల కంటే తక్కువ వినియోగించారనే (సముద్ర వేటకు వెళ్లలేదని నిర్ధారణకు వచి్చ) సాకుతో వారి పేర్లను జాబితా నుంచి తొలగించింది. పోనీ వేట నిషేధ భృతి పొందేందుకు రాయితీ డీజిల్ వినియోగించాలనే విషయాన్ని ఎక్కడైనా చెప్పిందా అంటే అదీ లేదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఆర్థిక సాయం ఎగనామం పెట్టేందుకే ఈ నిబంధనను అర్ధాంతరంగా అమలు చేశారని నిప్పులు చెరుగుతున్నారు.సముద్ర వేట కోసం ఒక్కో బోటుపై 8 నుంచి 10 మంది సముద్రంపై వేటకు వెళుతుంటారు. అటువంటిది ఒక్క కాకినాడ జిల్లాలో 385 మెకనైజ్డ్ బోట్లు ఉంటే 27,070 మందిని అర్హులుగా గుర్తించి జాబితా కూడా తయారు చేశారు. తీరాచూస్తే.. సవాలక్ష కొర్రీలతో ఈ ఒక్క జిల్లాలోనే 2,692 మంది పొట్టగొట్టి నిషేధ భృతికి ఎగనామం పెట్టారు.వీరిలో అత్యధికంగా అన్యాయమై పోయింది కాకినాడ నగరం జగన్నాథపురం, ఏటిమొగ, దుమ్ములపేట తదితర ప్రాంతాల్లో 2,500 మంది కావడం గమనార్హం. వీరంతా కాకినాడ మత్స్యకార అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. 61 రోజుల పాటు ఉపాధి లేక అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తే ఇప్పుడు ఇలా కొర్రీల మీద కొర్రీలు వేసి సాయం ఇవ్వకుండా మొండిచేయి చూపించడంపై మత్స్యకారులు మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇన్చార్జి జేడీ ఎల్బీఎస్ వర్ధన్ వద్ద ప్రస్తావిస్తే మెకనైజ్డ్ బోట్లపై వేటకు వెళ్లే మత్స్యకారులకు సాయం జమకాని విషయాన్ని శాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళతామన్నారు. 3 మీటర్లు ఉన్నాయని ఇవ్వలేదు మాది కాకినాడ సమీపంలోని దుమ్ములపేట. ప్రభుత్వం మత్స్యకారుల సేవలో అని వేట నిషేధ భృతిని విడుదల చేసింది. నా పేరు లిస్టులో ఉన్నప్పటికీ నాకు మత్స్యకార భరోసా పడలేదు. ఇదేమని అడిగితే నా పేరిట మూడు కరెంటు మీటర్లు ఉన్నాయని తొలగించినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ.. నాకు ఒక్క విద్యుత్ మీటర్ కూడా లేదు. వేట నిషేధ భృతి ఇచ్చి ఆదుకోవాలి. – పేర్ల సత్తిబాబు, దుమ్ములపేట, కాకినాడ70 శాతం మందికి డబ్బులు పడలేదు మా మావయ్యకు బోటు ఉంది. దానిపైనే వేటకు వెళ్తుంటాం. గత ప్రభుత్వ హయాంలో ఏటా మత్స్యకార భరోసా కింద రూ.10 వేలు జమైంది. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది పైసా జమ కాలేదు. గతేడాది కూడా కొంతమందికి జమ కాలేదు. ఈ ఏడాదైతే ఏకంగా 70 శాతం మందికి డబ్బులు పడలేదు. నాకు కూడా పడలేదు. నిషేధ భృతి డబ్బులు జమ కాకపోతే ఎలా బతికేది? – వాసుపల్లి అప్పన్న, అన్నవరం, భీమిలి మండలం, విశాఖ జిల్లావేటకు వెళ్లినా భృతి ఇవ్వలేదు బోటు నంబర్ 546పై చేపల వేటకు వెళ్లాం. అర్హుల జాబితాలో నా పేరు కూడా ఉంది. ఈ నెల 19న వేట నిషేధ భృతి జమ చేస్తున్నామంటే ఆనందపడ్డాం. కానీ వారం రోజులైనా ఇప్పటివరకు మా ఖాతాలకు డబ్బులు పడలేదు. గతేడాది కూడా చాలా మందికి డబ్బులు పడలేదు. ఈ ఏడాదీ అదే పరిస్థితి నెలకొంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు వేట నిషేధ భృతి ఇవ్వాలి. – బడే ఎల్లాజి, కొండరాజుపాలెం, విజయనగరం జిల్లా -
గొంతెండుతోంది ‘బాబూ’.. నీరు.. బేజారు
సాక్షి ప్రతినిధి, కర్నూలు/ సాక్షి, నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పల్లె తాగునీటి ఎద్దడితో ఘోషిస్తోంది. మండుటెండల్లో గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నా చంద్రబాబు సర్కారు మొద్దునిద్ర వీడటం లేదు. వేసవిలో ఏ ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి తలెత్తుతుంది? పరిష్కార మార్గం ఏమిటి? ఎంత నిధులు అవసరం? అనే వివరాలతో ప్రణాళికలు రూపొందించి నిధుల కోసం ఏటా డిసెంబర్, జనవరిలోనే ప్రభుత్వానికి ఆర్డబ్ల్యూఎస్ (గ్రామీణ నీటిపారుదలశాఖ) అధికారులు ప్రతిపాదనలు పంపుతారు. వీటిని బుట్టదాఖలు చేసిన చంద్రబాబు సర్కారు మే చివరిలో కేవలం చిల్లర విదిల్చింది. ఈ ఏడాది నదుల్లో ప్రవాహం తగ్గడం, భూగర్భ జలాలు అడుగంటడంతో ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి తలెత్తింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా సమస్య నెలకొంది. కొన్ని చోట్ల వారం పది రోజులకు కూడా నీరు అందడం లేదు. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, శ్రీకాకుళంతో పాటు చాలా జిల్లాలో ప్రజలు రోడ్డెక్కి నీటి కోసం రాస్తారోకోలు నిర్వహించారంటే ఎంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయో స్పష్టమవుతోంది. పాతాళంలో జలాలు..అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటడం కొత్త కాకపోయినా ఈ ఏడాది తూర్పు గోదావరి లాంటి జిల్లాల్లో కూడా అడుగంటాయి. దీన్నిబట్టే రాష్ట్రంలో బోర్లు పరిస్థితి, తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో పుట్లూరు, కుందుర్పి, కళ్యాణదుర్గం, యాడికి మండలాల్లో భూగర్భ జలాలు 20 మీటర్లకు పడిపోయాయి. ఇక్కడ డేంజర్ జోన్లో ఉన్నట్లు గుర్తించారు. మరో 20 మండలాల్లో కూడా భూగర్భజలాలు ప్రమాదకరస్థాయిలో తగ్గాయి. కర్నూలు జిల్లాలో కోసిగి, ప్యాపిలి, దేవనకొండ, బేతంచర్ల, క్రిష్ణగిరి, పెద్దకడుబూరు, మంత్రాలయం, హాలహర్వి, నందికొట్కూరు, సంజామలలో ప్రమాదకర స్థాయిలో సగటున 100–150 మీటర్ల వరకూ తగ్గిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేటలో 40 అడుగులు మేర భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో గతంలో పోలిస్తే రక్షిత మంచినీటి పథకాలకు నీటి లభ్యత 50 శాతం తగ్గింది. ఫలితంగా వీటిపై ఆధారపడిన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది.అసలే ఎద్దడి.. ఆపై కలుషిత నీరుగుంటూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూలుతో పాటు చాలా పట్టణాల్లో మునిసిపాలిటీ పైపులైన్ల లీకేజీతో కలుషిత నీరు సరఫరా అవుతోంది. దీనికి తోడు మంచినీటి ఎద్దడి నెలకొంది. కలుషిత నీరు, నీటి ఎద్దడి వెరసి మునిసిపాలిటీ నీటిపై నమ్మకం లేక చాలామంది మినరల్ వాటర్ క్యాన్లు, ఇళ్లలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామాల్లో కూడా మినరల్ వాటర్ క్యాన్లు కొనుగోలు చేస్తున్నారు. మినరల్ వాటర్ ఆటో గ్రామానికి వస్తే బిందె రూ.10 చొప్పున కొంటున్నారు. తాగునీటి కోసం రోజూ రెండు బిందెలు చొప్పున నెలకు రూ.600 వరకు తాగునీటి కోసం ఒక్కో కుటుంబం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఉపాధి హామీ కూలీలు తమ మూడు రోజుల కూలీని తాగునీటి కోసం ధార పోయాల్సిన పరిస్థితి. తాగునీరు సంగతి పక్కనపెడితే వంటకు, స్నానానికి ఇతర అవసరాలకు కూడా నీరు దొరకని దారుణ పరిస్థితి తలెత్తింది.అచ్చెన్న ఇలాకాలో గిరిజనుల అవస్థ..శ్రీకాకుళం జిలాల్లో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న టెక్కలితో పాటు కంచిలి, ఆముదాలవలస, హిర, పాతపట్నంలోని చాలా గ్రామాల్లో మంచినీటి ఎద్దడి ఉంది. కంచిలి మండలం నువాగడలో గిరిజనులు నెల రోజులుగా తాగునీటి కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక్కడికి తాగునీటిని సరఫరా చేసే పథకాలు పాడయ్యాయి. ఉద్దానం నీటి పథకం ద్వారా జేజేఎం ట్యాప్ పాయింట్లకు నీటి సరఫరా కావడం లేదు. స్థానిక పంచాయతీ బోరు కూడా పని చేయకపోవడంతో గిరిజనులు దాహార్తితో అల్లాడుతున్నారు.– టెక్కలి మండల కేంద్రంలో తాగునీరు లేదు. దీంతో వైఎస్సార్సీపీ, ఇతర దాతలు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. – హిర మండలంలో పక్కనే వంశధార ఉన్నా తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడింది. చిన్నకోరాడ పంచాయతీలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. అలికాం–బత్తిలి రోడ్డుపై రాస్తారోకో చేశారు.– ఆముదాల వలస శివారు గ్రామాలు పార్వతీశ్వరునిపేట, జగ్గుశాస్త్రులపేట, తిమ్మాపురంలో వారానికి ఒక్కరోజే తాగునీరు అందుతోంది.– పాతపట్నం మడలం రంకిణీ గిరిజన గూడెంలో బోర్లు లేవు. ఇంటింటికీ తాగునీరు ఇస్తామని పైపులైన్లు వేసి వదిలేశారు.బోర్లు.. భోరు భోరు!– ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం మేజర్ పంచాయతీ జోహరాపురానికి బాపురం రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో వక్కిరేణిలోని బురద నీటినే గ్రామ ప్రజలు వినియోగిస్తున్నారు.– అమలాపురంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. గత ప్రభుత్వంలో రూ.20 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు మంజూరై పనులు మొదలైనా కూటమి ప్రభుత్వం వచ్చాక అటకెక్కించింది. అల్లవరం. ఉప్పగుప్తం, అమలాపురం రూరల్ మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. – కాట్రేనికోన శివారు ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. బాహ్యప్రపంచానికి దూరంగా సముద్రతీరంలో ఉన్న మగసానితిప్పకు గత ప్రభుత్వంలో పైపులైన్ వేసి నీరు సరఫరా చేశారు. ఇప్పుడు నిర్వహణ సరిగా లేకపోవడంతో నీరు అందడం లేదు. పల్లం, బలుసుతిప్ప, కొత్తపాలెం, మొల్లేటి మొగ, చిర్రయానం, నీళ్లరేవు, చాకలిపేట, గొల్లపేటలో నీటి కోసం జనాలు పడిగాపులు కాస్తున్నారు. కాట్రేనికోనలో 250 కుళాయి కనెక్షన్లు ఇవ్వాలి. కాంట్రాక్టర్కు బకాయిలు పెండింగ్ ఉండటంతో చేతులెత్తేశారు. జలజీవన్ మిషన్ నిధులతో పైపులైన్లు వేసి, ట్యాంకులు నిర్మించినా నిర్వహణ లేక నీళ్లు అందడం లేదు. – జగ్గంపేట నియోజకవర్గం గోకవరం, గండేపల్లి, కిర్లంపూడిలో తీవ్ర తాగునీటి సమస్య ఉంది. – కాకినాడ రూరల్ నియోజకవర్గం తూరంగితో పాటు శివారు ప్రాంతాలకు ట్యాంకర్లు ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. – పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండలం బురుజుల గ్రామస్తులు మినరల్ వాటర్ కొనుగోలు చేస్తున్నారు. ఇతర అవసరాలకు సుద్దవాగు నుంచి ఫ్లోరైడ్ నీటిని తెచ్చుకుంటున్నారు. – ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం బాపురంలో ఎస్ఎస్ ట్యాంకును శుభ్రం చేస్తూ సురేష్ అనే కాంట్రాక్టు కార్మికుడు ఈనెల 20న నీటి సంపులో పడి మృతిచెందాడు. సురేశ్ కుటుంబానికి న్యాయం చేయాలని, పెండింగ్లో ఉన్న వేతనాలను ఇవ్వాలని కార్మికులు విధులకు గైర్హాజరవుతున్నారు. దీంతో 26 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. – శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ, రొళ్ల, మడకశిర, అమరాపురం, హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు, రొద్దం, పరిగి, ముదిగుబ్బ, పుట్టపర్తి, ఎన్పీ కుంట మండలాల్లో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు పలుమార్లు రోడ్డెక్కారు. జిల్లా నుంచి మంత్రులు సత్యకుమార్, సవిత ఉన్నా తాగునీటి పరిష్కారానికి చొరవ చూపలేదు. – వినుకొండ నియోజకవర్గం ఉప్పలపాడు, ములకలూరు, తలర్లపల్లి, మూర్తింజాపురం, జంగాలపల్లి, రావులాపురం, ఉప్పరపాలెంతో పాటు పలు గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. వినుకొండలో నాలుగురోజులకు ఒకసారి తాగునీరు అందుతోంది. –వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలం పెన్నబద్వేల్ గ్రామంలో తాగునీటి సమస్యతో స్థానికులు అల్లాడుతున్నారు. ఇటీవల అధికారులు నిర్వహించిన వన్మంత్..వన్విలేజ్.. ఫోర్ విజిట్స్ కార్యక్రమాన్ని మహిళలు ఖాళీ బిందెలతో అడ్డుకున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాకే సభలు, సమావేశాలు చేపట్టాలని అధికారులను నిలదీశారు.– నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం సోమశిల, పడమటి కంభంపాడులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పైపులైన్ మరమ్మతులతో నీటిని విడుదల చేయకపోవడంతో స్థానికులు ఇక్కట్లు పడుతున్నారు. – రాయచోటి నియోజకవర్గం చక్రాయపేట, రెడ్డివారిపల్లె, ఎర్రగుడిగ్రామం బీఎన్ తాండా లో తీవ్ర నీటి సమస్య ఉంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సురభి హరినజవాడ, కల్లూరిపల్లె గ్రామం సిద్దావాండ్లపల్లె, కాట్లగుంటివారిపల్లెలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఎంపీ నిధులతో బోర్లు వేయించి సమస్య పరిష్కరించారు. –ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం నియోజకవర్గంలో 22 గ్రామాలు, కనిగిరి నియోజవర్గంలో 18 గ్రామాల్లో, గిద్దలూరు పట్టణంతో పాటు 10 గ్రామాల్లో, యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో 20 గ్రామాల్లో నీటి సమస్య ఉంది. – కనిగిరి మండంలో సాగర్ నీళ్లు 20 రోజులకు ఒకసారి వస్తుండడంతో రాత్రిపూట పడిగాపులు కాసి మహిళలు నీళ్లు పట్టుకుంటున్నారు.నాలుగు కి.మీ. వెళ్లాల్సిందే ...తాగునీటి కోసం నాలుగు కిలోమీటర్ల దూరంలోని గూళ్యం, లేదా మూడు కిలోమీటర్ల దూరంలోని బళ్లూరుకు వెళ్లి తెచ్చుకుంటున్నాం. గ్రామంలోని బోరు నీరు తాగేందుకు పనికిరాదు. సమీపంలోనే బాపురం రిజర్వాయర్ ఉన్నా మా గ్రామానికి నీటి సరఫరా కావడం లేదు. నిత్యం సైకిళ్లు, మోటారు సైకిళ్లపై వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నాం. పలుమార్లు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదు. – బి.గాదిలింగప్ప, ఎంపీటీసీ, సిద్దాపురం, హాలహర్వి మండలం, కర్నూలు జిల్లా పొలాల్లో నీళ్లే దిక్కు..ప్రజలు తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలువాల ఎస్ఎస్ ట్యాంకు ద్వారా గతంలో రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేశారు. వేసవిలో వారం పది రోజులకు ఒక సారి నీటిని విడుదల చేస్తే ఎలా? గ్రామంలోని బోరు నీటిని ఇతర అవసరాలకు వాడుకుంటు తాగునీటి కోసం సమీప పొలాల్లోని వ్యవసాయ బోర్లు, బావులపై ఆధారపడుతున్నాం. – తిమ్మగురుడు, గార్లదిన్నె, ఎమ్మిగనూరు మండలం, కర్నూలు జిల్లా⇒ కుళాయిలో బురదనీరు వస్తున్న ఈ దృశ్యం నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గుడిపాడు గ్రామంలో ఆదివారం కనిపించింది. తాగునీటి సంగతి దేవుడెరుగు.. ఇంటి అవసరాలకు కూడా ఈ నీరు పనికిరాదు. పంచాయతీ పైపులైన్లు దెబ్బ తినడంతో ఈ దుస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో నీటి సరఫరా ఎంత అధ్వానంగా ఎలా ఉందో చెప్పేందుకు ఇదో మచ్చు తునక!⇒ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూర్ మండలం కొనకండ్లలో 12 వేల మంది నివాసం ఉంటున్నారు. రోజూ 6 లక్షల లీటర్ల తాగునీరు అవసరం. కేవలం శ్రీసత్యసాయి వాటర్ స్కీం ద్వారా మాత్రమే నీరు అందుతోంది. ఈ ఉద్యోగులకు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో 20 రోజులు సమ్మె చేశారు. దీంతో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడి గ్రామస్తులు ఉరవకొండ–గుంతకల్లు ప్రధాన రహదారిపై రెండుసార్లు రాస్తారోకో చేశారు. చివరకు కలెక్టర్ జోక్యం చేసుకుని రెండు నెలల బకాయిలు ఇస్తామని చెప్పారు. అయినా నీటి సమస్య పరిష్కారం కాలేదు. ట్యాంకర్ల ద్వారా అరకొరగా సరఫరా జరుగుతోంది. స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దారుణ పరిస్థితి ఇది! ఇక్కడే కాదు.. ఈ నియోజకవర్గంలోని విడపనకల్లు, కూడేరు మండలాల్లో కూడా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది.⇒ కర్నూలు జిల్లాలో తాగునీటి ఎద్దడిని ముందుగానే అంచనా వేసిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు 141 గ్రామాల్లో బోర్ల మరమ్మతులు, బోర్ల హైరింగ్, ట్యాంకర్ల కోసం రూ.8.48 కోట్లు అవసరమని జనవరిలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వేసవి ముగుస్తున్నా ప్రభుత్వం చలించలేదు. చివరకు అధికారులు తీవ్ర ఒత్తిడి చేయడంతో ఈ నెల మూడో వారంలో కేవలం రూ.50 లక్షలు విదిలించింది. దీంతో జిల్లాలో వందల గ్రామాల్లో ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు.⇒ నందిగామ నియోజకవర్గం కంచికచర్లలో చాలా వీధులకు 20 రోజులకు ఒకసారి మాత్రమే నీరు అందిస్తున్నారు. వీరులపాడు మండలంలో 15 గ్రామాలకు వారానికి ఒకసారి కూడా తాగునీరు రావడం లేదు. నందిగామ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి! జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం భీమవరం, మక్కపేట, మంగోల్లు, మాచినేనిపాలెం, వత్సవాయి మోడల్ కాలనీ, కాకరవాయి గ్రామాలలో కూడా తీవ్ర మంచినీటి సమస్య ఉంది. చంద్రబాబు సర్కారుపై నమ్మకం లేక ప్రజలు డబ్బులు వెచ్చించి మంచినీటిని కొనుగోలు చేస్తున్నారు.⇒ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఓ రాజ్యసభ సభ్యుడి నిధులు, జడ్పీ నుంచి రూ.40 లక్షలు మంజూరు చేయించారు. సాంకేతిక, పాలన అనుమతులు కూడా వచ్చాయి. కానీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు ‘క్రెడిట్’ దక్కుతుందనే దుగ్ధతో టీడీపీ ఇన్చార్జ్ ఎరిక్షన్బాబు అడ్డుపడ్డారు. దీంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అగ్రిమెంట్ చేయలేకపోతున్నారు. కొలుకుల, తిరుమలగిరి, వెంకటాద్రిపాలెం, వాదంపల్లి, పెద్దారవీడు మండలంలోని చెట్లమిట్ట, మద్దెలకట్ట, త్రిపురాంతకం పాత అన్న సముద్రం గ్రామాల్లో డీప్ బోర్లు మంజూరయ్యాయి. గురిజేపల్లి, బోయపల్లి ఎస్సీ కాలనీ, ఆర్ ఉమ్మడివరానికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ చొరవ చూపి బోర్లు మంజూరు చేయించారు. అయినాకూడా టీడీపీ నేతలు ఈ బోర్లు వేయనివ్వడం లేదు. ఇక పుల్లలచెరువు మండలంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాలకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయిస్తున్నారు. -
మెగా డీఎస్సీనా? దగా డీఎస్సీనా?
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు సర్కార్ నిర్వహించిన డీఎస్సీ–2025 పరీక్షలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘ఇది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పూర్తిగా లోపించిందని ఆక్షేపించిన మాజీ సీఎం వైఎస్ జగన్, పేపర్ లీకులు, డేటా డిలీట్లు, మెరిట్ లిస్టుల మాయం వంటి ఘటనలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.తమ హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి, ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి, కొత్త నోటిఫికేషన్ను ప్రచారానికి వాడుకున్నారని విమర్శించారు. నారా లోకేశ్ని మంత్రి పదవి నుంచి తప్పించి ... మెగా డీఎస్సీని స్కాంపై సీబీఐ దర్యాప్తు కోరాలన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా సోమవారం సీఎం చంద్రబాబు సర్కార్ తీరును ఎండగడుతూ వైఎస్ జగన్ పోస్టు చేశారు. చంద్రబాబూ.. మీరు నిర్వహించింది మెగా ⇒ డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది? పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి? మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?. దీనికేమి సమాధానం చెబుతారు? మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘డార్క్ ఆపరేషన్’ను ఎందుకు దాచిపెడుతున్నారు?. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్సీఈఆర్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది? ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు? సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు? ⇒ రూ.15 లక్షలకు ‘‘స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టీఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి? ⇒ టెట్ కన్వీనర్గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీనర్ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్ను డీఎస్సీ కన్వీనర్గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏమిటి? మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి.. దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ ను పదవి నుంచి తప్పించి వెంటనే సీబీఐ దర్యాప్తు కోరాలి. చంద్రబాబూ..! మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయాలి. -
ఆకాశానికి ఇంధన రేట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వినియోగదారులపై మరోసారి ఇంధన పిడుగు పడింది. గడిచిన పది రోజుల్లో నాలుగుసార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంపుతో సామాన్య, రవాణా రంగం కుదేలవుతోంది. దాదాపు పెట్రోల్పై రూ.7.98, డీజిల్పై రూ.7.75 పెరగడంతో తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంధన రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. రోజులు వ్యవధిలోనే నిత్యం పెరుగుతూ బడుగు జీవుల జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. రాష్ట్రంలో రోజుకు 9 వేల కిలో లీటర్ల పెట్రోల్, 20 వేల కిలోలీటర్ల డీజిల్ వినియోగం కనిపిస్తోంది. ప్రస్తుతం పెరిగిన ఇంధన రేట్లతో సామాన్యులపై ఏడాదికి పెట్రోల్పై రూ.2,600 కోట్లు, డీజిల్పై రూ.5,400 కోట్లు వెరసి మొత్తం రూ.8వేల కోట్లు భారం మోపుతోంది. పది రోజుల్లో నాలుగు సార్లు పెంపు.. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన రేట్లు భారీగా పెరగ్గా.. అత్యధికంగా శ్రీసత్యసాయి జిల్లాలో లీటరు పెట్రోల్ రూ.118.39, డీజిల్ రూ.106.11 వరకు ఎగబాకింది. పదిరోజుల కిందట లీటరు పెట్రోల్ రూ.109.74, డీజిల్ రూ.97.47గా ఉంది. ఈ నెలలోనే వరుసగా 15, 19, 24, 25 తేదీల్లో రేట్లు పెంచడంతో దాదాపు డీజిల్, పెట్రోల్పై సగటున రూ.8(జిల్లాలను బట్టి రేట్లు మారతాయి) వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఫుల్ ట్యాంక్ నిల్.. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంధన రేట్లు పైపైకి ఎగబాకుతుంటే మరోవైపు వాహనాలకు ఫుల్ ట్యాంక్పై పరిమితులు విధిస్తుండడం కొసమెరుపు. రేట్లు పెంచినప్పుడు దానికి తగ్గట్టుగా ఇంధనం సరఫరా చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైనట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఒక లావాదేవీకి కేవలం 200 లీటర్లకు మాత్రమే పరిమితి కొనసాగుతోంది. ఇక్కడ వాణిజ్య వాహనాలు, సరుకు, ప్రజా రవాణా వాహనాలు సగటున 350–400 లీటర్ల కంటే ఎక్కువ ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో నడుస్తాయి. కానీ, ప్రభుత్వం 200 లీటర్ల లోపే కట్టడి చేస్తుండడంతో పదేపదే పెట్రోల్ బంకుల వద్ద సమయాన్ని వృథా చేసుకోవాల్సి వస్తోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీలర్లు నోటీసులా? 200 లీటర్లకు మించి ఇంధనాన్ని ఒకే లావాదేవీలో నింపితే డీలర్లకు ఆయిల్ కంపెనీలు ఆటోమేషన్ సిస్టమ్ ద్వారా నోటీసులు జారీ చేసి, విక్రయాలను నిలిపివేస్తుంటే ప్రభుత్వం వేడుక చూస్తోంది. ఫలితంగా డీలర్లతో పాటు పెట్రోల్ బంకుల్లో పని చేసే సిబ్బంది జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోంది. పైగా ఆస్పత్రులు, ఆక్వా, వ్యవసాయం, బోరువెల్స్ నిర్వహణలో జనరేటర్లు వినియోగించే వారికి అరకొర ఇంధనం అందిస్తే తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇంధన రంగంలో ఇన్ని సమస్యలు ఉన్నా.. చంద్రబాబు ప్రభుత్వం పరిష్కార మార్గాలు చూపకుండా.. ఇష్టారీతిన ఇంధన ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోంది. -
కూటమి ప్రభుత్వంపై కోర్టుకు వెళతాం.. అమరావతి రైతులు సంచలన నిర్ణయం
-
హక్కుల సాధనకు రాజకీయ, న్యాయ పోరాటం
తాడేపల్లి రూరల్: డిమాండ్లు పరిష్కరించకుండానే రాజధానికి భూములు సేకరించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తమ హక్కులను పూర్తిగా హరిస్తోందని భావిస్తున్న రైతులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు రాజకీయ, న్యాయ పోరాటాలు తప్పనిసరని భావిస్తున్నారు. రాజధాని ముఖద్వారమైన ఉండవల్లిలో రైతులందరూ ఆదివారం రాత్రి తాజాగా సమావేశమయ్యారు. అధికారులతో జరిగిన సమావేశాల్లో భరోసా లభించట్లేదని ఆవేదన వెలిబుచ్చారు. గ్రామ సభల్లో పాల్గొని తమ సమస్యలు విన్నవించుకుని అటు తర్వాత బాయ్కాట్ చేయాలని పలువురు రైతులు పిలుపునిచ్చారు. రైతులను బెదిరించడానికి కేసులు పెడతారని, ఆస్తులు ధ్వంసం చేస్తారని, అన్నింటికీ సంసిద్ధంగా ఉండాలని కూడా రైతులు నిర్ణయించుకున్నారు. ప్రముఖ వైద్యులు కన్నారావు నాయుడు, రైతు సంఘం నాయకులు ఈశ్వర్రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కళ్లం సంజీవరెడ్డి తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు.. తీవ్ర నిరసనకు సంసిద్ధం గ్రామసభ నిర్వహించేందుకు 15 రోజుల ముందే ప్రతి ఒక్క రైతుకు నోటీసు అందజేయాలి. 29వ తేదీ గ్రామసభ అని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరికీ అధికారికంగా నోటీస్ ఇవ్వలేదు. ఉండవల్లిలో 1,100 ఎకరాలు ఉంటే అందులో బడా బాబులు, వ్యాపార వేత్తలు 230 ఎకరాలు మాత్రమే ల్యాండ్ పూలింగ్కు భూములు ఇచ్చారు. 870 ఎకరాలు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఆ భూములకు భూసేకరణకు నోటీసులు ఇచ్చారు. అధికారులు ఉండవల్లిలో అంగుళం భూమి కూడా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. 870 ఎకరాల్లో సుమారు 1,500 మంది రైతులు ఉన్నారు. గ్రామ సభకు ప్రతి కుటుంబం నుంచి అందరూ వస్తే వేలాదిమంది అవుతారు. తద్వారా ప్రభుత్వానికి, అధికారులకు తీవ్ర నిరసన తెలియజేయాలి. విభజించి.. పాలించుచంద్రబాబు సర్కార్ వైఖరిపై ధ్వజం ఉండవల్లిలో వెయ్యిమంది రైతులకు దేవాలయ భూముల్లో ప్లాట్లు కేటాయిస్తామని కొంతమంది రైతులను మభ్యపెడుతున్నారు. అక్కడ ఉన్నది 200 ప్లాట్లు అయితే వెయ్యిమందికి ఎలా ఇస్తారో రైతులు ఆలోచించుకోవాలి. విభజించి పాలించాలనే సిద్ధాంతాన్ని రాజధాని రైతులకు వర్తింపజేయాలని ప్రభుత్వం, కొంతమంది నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిని మనం తిప్పి కొట్టాలి. ఉండవల్లిలో అధికారిక రిజి్రస్టేషన్ వ్యాల్యూ ప్రకారం చూసినా ఎకరం రూ.5 కోట్లకు క్రయ విక్రయాలు జరిగాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక గ్రామంలో ఎక్కువగా ఎంత మొత్తంలో రిజి్రస్టేషన్ జరిగితే దాని ప్రకారం అవార్డు ప్రకటించాల్సి ఉంది. ఈ లెక్కన ఒకవేళ ప్రభుత్వం బలవంతంగా భూసేకరణకు వెళినా, రైతులకు సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా న్యాయం జరగాలి. రాజధాని ప్రాంతంలోని ఒక గ్రామంలో రైతులకు 2018లో ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. ఆ రైతులకు మొత్తం రూ.9 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. భూములు ఇచ్చిన రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి ఇది అద్దం పడుతోంది. గూగుల్ మ్యాప్లో ప్లాట్లు చూపిస్తున్నారు ఇటీవల ఒక గ్రామంలో జరిగిన సభలో గూగుల్ మ్యాప్లో ప్లాట్లు చూపించారు. ఆ ప్లాట్లు ఎక్కడున్నాయో రైతులకు ఎలా తెలుస్తుంది? తమకు ప్లాట్లు కేటాయించడంలో, అభివృద్ధి చేయడంలో ఎటువంటి న్యాయం జరగలేదంటూ సీఆర్డీఏ అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ప్లాట్ల పత్రాలతో బ్యాంకు లోన్కు వెళితే బ్యాంకు అధికారులు తిరస్కరిస్తున్నారు. వ్యవసాయం లేక, ఇచ్చే అరకొర కౌలు చాలక, పిల్లల చదువులు, పెళ్లిళ్లు వాయిదాలు పడుతున్నాయి. ఇప్పటికే బడా సంస్థలకు భూములు కేటాయించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎందుకు ప్లాట్లు కేటాయించడం లేదని ప్రశి్నంచడంతో అధికారులు మధ్యలోనే సమావేశం ముగించి వెళ్లిపోయిన పరిస్థితులు నెలకొంటున్నాయి.కొన్ని గ్రామాల్లో సభలను వాయిదా వేస్తున్నారు. సీఆర్డీఏ కమిషనర్ ఉండవల్లి భూములు గతంలోనే చాలా విలువైనవి అంటూ మాట్లాడుతూనే ప్రతి అంగుళం భూమిని భూ సేకరణ కింద తీసుకుంటామని చెబుతున్నారు. అధికారులు నామమాత్రంగా సమావేశాలు నిర్వహించి మినిట్స్బుక్లో రాసుకుంటున్నారు తప్ప.. రైతులకు ఎటువంటి ప్రయోజనాలు లభించడం లేదు. ఈ సమావేశంలో మున్నంగి వీరశ్రీధర్రెడ్డి, మున్నంగి అంజిరెడ్డి, దండమూడి సాంబశివరావు, గోపాలం ప్రభాకరరావు, దంటు బాలాజీ, దాసరి నాగేశ్వరరావు, ఆళ్ళ వాసు, గాదె నాగరాజు, బుర్రముక్కు పద్మారెడ్డి, కోటేశ్వరరావు, అశోక్రెడ్డి, సందు చినబసవయ్య, సింగంశెట్టి మనోహర్, గోపాలం ప్రభాకర్, ఉండవల్లి అశ్వని, కొప్పోలు శంకరరావు, తమ్మా శ్రీనివాస్రెడ్డి, జొన్న శ్రీను, గోపాలం వాసు, మోదుగుల శ్రీను, జొన్న శివశంకర్, పాల కోటేశ్వరరావు, పెద్దిశెట్టి వీరాస్వామి, గుంటక నరేష్రెడ్డి తదితర రైతులు, నేతలు పాల్గొన్నారు. -
ఖేల్ ఖతం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ‘డీఎస్సీ’ క్రీడా కోటా పోస్టుల భర్తీలో అవకతవకలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు కట్టి మరీ అమ్మేసుకోవడం నిరుద్యోగ యువతలో అలజడి రేకెత్తిస్తోంది. ఏకంగా 421 పోస్టుల్లో 97 శాతం పోస్టులు భర్తీ చేయగా ఇందులో వంద పోస్టులూ నిజమైన అర్హులకు దక్కలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.సాక్షాత్తూ ముఖ్యనేత బంధువు, శాప్ పాలకవర్గంలోని ఓ కీలక వ్యక్తిని మాస్టర్మైండ్గా ముందు పెట్టి సాగించిన దందా సాక్ష్యాలతో సహా బయటకొచ్చే సరికి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. నిజమైన అర్హత కలిగిన క్రీడాకారులకు తీవ్ర అన్యాయం చేస్తూ ముడుపులు తీసుకుని క్రీడలంటే తెలియని వ్యక్తులకు పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేయడం దుర్మార్గ పాలనకు అద్దం పడుతోంది. దీనికితోడు డీఎస్సీ ముగిసిన తరువాత తాజాగా క్రీడా పాలసీని సవరించడం అనుమానాలకు తావిస్తోంది. సర్టీఫికెట్ చాలదు.. పరీక్ష రాయాల్సిందే! ప్రభుత్వ క్రీడా విధానం 2024–29 ప్రకారం.. 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ ద్వారా ప్రతిభగల క్రీడాకారులకు వారి సర్టీఫికెట్ల ఆధారంగా నేరుగా ప్రభుత్వ శాఖల్లో పోస్టింగ్ ఇవ్వాలని సర్కారు నిర్దేశించింది. దీని ప్రకారమే డీఎస్సీలో 421 పోస్టుల్లో 97శాతం పోస్టులను భర్తీ చేసింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ, ఇతర స్థాయిల్లో సాధించిన పతకాలు, సర్టిఫికెట్ల ఆధారంగా నియామకాలు పూర్తిచేసింది. దీనిని అనువుగా చేసుకునే ముఖ్యనేత బంధువు, మాస్టర్మైండ్ పోస్టుకో రేటు పెట్టి ముడుపులు దండుకున్నారు.అర్హులకు పోస్టులు దక్కకుండా చేశారు. ఇంత జరిగాక.. డీఎస్సీ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్రీడాపాలసీ 2024–29ను చంద్రబాబు సర్కారు సవరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు, 3శాతం హారిజంటల్ రిజర్వేషన్లో అభ్యర్థి కచ్చితంగా ఆయా శాఖల్లో పోస్టులకు నిర్వహించే రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే క్రీడా కోటాలో సర్టీఫికెట్లు పరిగణనలోకి తీసుకుని నియామకాలు చేపట్టనున్నట్టు సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. అంటే, ఇక్కడ ఒక పథకం ప్రకారం మెగా డీఎస్సీలో పోస్టులను విచ్చలవిడిగా అమ్మేసుకుని, ఆ తంతు ముగిసిపోయిన తర్వాత తీరిగ్గా క్రీడా పాలసీని సవరించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎవరికిచ్చిన అభయం కోసం!! ఇదిలా ఉంటే రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ క్రీడా కోటా పాలసీని సవరించిన సర్కారు శాప్లో గ్రేడ్–3 కోచ్ల నియామకానికి మాత్రం దీనిని వర్తింపజేయకపోవడం, ఇక్కడ పాత పద్ధతిలోనే సర్టీఫికెట్ల మెరిట్ ఆధారంగానే చేస్తుండటం గమనార్హం. డీఎస్సీ క్రీడా కోటాలో తనకు అన్యాయం జరిగిందని న్యాయపోరాటానికి సిద్ధమైన అనంతపురానికి చెందిన ఓ ఫెన్సింగ్ క్రీడాకారిణిని బెదిరించి నిలువరించిన శాప్,, శాశ్వత కోచ్ల నియామకంలో కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. దీనిని బట్టి డీఎస్సీలో మాస్టర్మైండ్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు శాప్ కోచ్ల నియామకానికి రాతపరీక్ష అర్హతలు పెట్టలేదని స్పష్టమవుతోంది.ఇలా వందల మంది పోస్టుల రాని క్రీడాకారులను మభ్యపెట్టినట్టు సమాచారం. ఇదిలా ఉంటే డీఎస్సీలో రెండేళ్లకోసారి, అసలు ఎప్పుడు జరుగుతుందో తెలియని నేషనల్ గేమ్స్ను ముందు వరుసలో పెట్టి సీనియర్ నేషనల్స్ ప్రాధాన్యాన్ని వెనక్కి నెట్టేసింది. నేషనల్స్లో పాల్గొన్నట్లు సర్టీఫికెట్లు తెచ్చుకున్న వారికి రూ.15 లక్షల చొప్పున పోస్టులు అమ్మేశారు. వాస్తవానికి నేషనల్ గేమ్స్ అనేవి ఒక్కోసారి ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందులో ఒక్కో క్రీడాంశంలో కేవలం టాప్–8 ఉండే రాష్ట్రాల జట్లు మాత్రమే పాల్గొంటాయి. ఏటా జరిగే సీనియర్ నేషనల్స్లో దేశం మొత్తం నుంచి ఆయా రాష్ట్రాల్లో వడపోసిన క్రీడాకారులు ప్రదర్శనకు వస్తారు. సీనియర్ నేషనల్స్లో నెగ్గుకురావడం చాలా కష్టం. అలాంటి సీనియర్ నేషనల్స్ను పక్కన పడేసి నేషనల్ గేమ్స్కు డీఎస్సీలో ప్రాధాన్యం ఇవ్వడం సర్కారు దుర్నితికి అద్దం పడుతోంది. క్రీడల విభజనతో మొత్తం గోల్మాల్దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో క్రీడలను కూటమి ప్రభుత్వం రెండు రకాలుగా వర్గీకరించింది. ఇందులో ఏపీలో ప్రాధాన్యంలో ఉన్న క్రీడలను తక్కువ కేటగిరీలోకి నెట్టేసింది. జీవోలో 65 క్రీడలను చేరిస్తే ఏ–కేటగిరీలో 36, బీ–కేటగిరీలో 29 క్రీడలను పెట్టింది. ఇది క్రీడా ప్రమాణాలకు విరుద్ధమని క్రీడా సంఘాల ప్రతినిధులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నా ప్రభుత్వంలో కదలిక రాలేదు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ క్రీడల విభజన లేదు. శాప్ గుర్తింపు లేని సంఘాలను ఏ– కేటగిరిలో ఉంచి, శాప్ గుర్తింపు ఉన్న కొన్ని సంఘాలను బీ కేటగిరిలోకి తేవడం కొసమెరుపు. ఉద్యోగాల భర్తీలో ఏ–కేటగిరి పూర్తయిన తరువాత బీ–కేటగిరి క్రీడలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించి ఆ ప్రకారం డీఎస్సీలో పోస్టులు ఇష్టారీతిన భర్తీ చేసేశారు.ఉదాహరణకు.. బీ–కేటగిరీలో ఉన్న క్రీడలో సదరు క్రీడాకారుడు జాతీయ స్థాయిలో పతకాలు సాధించినా.. ఏ–కేటగిరిలో ఉన్న క్రీడాకారుడు రాష్ట్ర స్థాయి ఆటల్లో పాల్గొన్న సర్టీఫికెట్తో వస్తే చాలు అతనికే ప్రాధాన్యం ఇచ్చి పోస్టులు భర్తీ చేశారు. దీనిపైనా హైకోర్టులో కేసులు కొనసాగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో గోల్ఫ్ కోర్టులు ఎక్కడా లేవు, గోల్ఫ్ ఆడే క్రీడాకారులూ లేరు, ఈ క్రీడను ఏ–కేటగిరిలో చేర్చి రాష్ట్రంలో యువత రాణించే సెపక్తక్రా, నెట్బాల్, క్యారమ్స్, ఆత్యా పాత్యా, బాడీ బిల్డింగ్, కరాటే, టెన్నిస్బాల్ క్రికెట్, సాఫ్ట్ టెన్నిస్, యోగాసన క్రీడలను బీ–కేటగిరిలో పెట్టి డీఎస్సీని అడ్డుపెట్టుకుని దోచేశారు. క్రీడా సర్టీఫికెట్లకు గతంలో ఉన్న 10 ఏళ్ల కాలపరిమితిని ఎత్తివేశారు. -
సర్కారు ‘మాస్టర్’ప్లాన్
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 పేరుతో భారీ స్కామ్కు చంద్రబాబు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వేసిందా? ప్రణాళిక ప్రకారమే నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులను నిలువునా ముంచేసిందా? అంటే డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ నుంచి ఉద్యోగాల భర్తీ వరకు జరిగిన పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తోంది. వాస్తవానికి డీఎస్సీ పరీక్ష పూర్తయిన తర్వాత మెరిట్ లిస్టులను జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)లకు అందించాలి. కానీ అంతా తామే చేస్తామని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయమే మొత్తం ప్రక్రియను చేతిలోకి తీసుకుంది. పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని, తమకు అన్యాయం జరుగుతోందని అభ్యర్థులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా అంతా సక్రమమేనంటూ బుకాయించింది.దరఖాస్తు ప్రక్రియ మొదలు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ వరకు అంతా తన చేతిలోనే పెట్టుకున్న ఉన్నతాధికారులు పరీక్ష నిర్వహణలో కీలకమైన విధుల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించడం విస్మయం కలిగిస్తోంది. వాస్తవానికి డీఎస్సీ పేపర్ తయారీని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) చూస్తుంది. ప్రశ్నల తయారీ, జవాబుపత్రాల వ్యాలిడేషన్ ఎంతో కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థల మధ్య చేపట్టాలి. కానీ ఈ మొత్తం ప్రక్రియను ఓ కాంట్రాక్టు ఉద్యోగి చేతిలో పెట్టడం గమనార్హం. అంతకు ముందే టెట్ కన్వీనర్ను తొలగించి ఆ బాధ్యతలను మరొకరికి అప్పగించడం కూడా సర్కారు పాత్రపై అనుమానాలకు బలం చేకూరుస్తోంది. టెట్ కన్వీనర్ను తొలగించి.. వాస్తవానికి ఏపీ టెట్ కన్వీనర్గా ఉండే అధికారే డీఎస్సీకి కూడా కన్వీనర్. టెట్ సెల్కు విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని ప్రభుత్వం టెట్ కన్వీనర్గా నియమించింది. అయితే, టెట్ పరీక్షలు ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే ఆయనను ఆ బాధ్యతల నుంచి ఉన్నఫళంగా తొలగించి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ను కన్వీనర్గా నియమించింది. దీంతో టెట్ నిర్వహణ, డీఎస్సీ పేపర్ తయారీలో ఒకే అధికారి కొనసాగారు. అనంతరం ఎస్సీఈరీ్టలో కేవలం కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి నవీన్కు కేవలం డీఎస్సీ ప్రశ్నలు తయారీతో పాటు వాటిని ఆన్లైన్ చేయడం చేసే బాధ్యతలు అప్పగించారు. అతను కూడా డీఎస్సీకి హాజరవుతున్నాడని తెలిసినా అధికారులు అదే విధుల్లో కొనసాగించడం కొసమెరుపు.అసలు రహస్యంగా జరగాల్సిన కీలక విధుల్లో కాంట్రాక్టు ఉద్యోగిని ఎలా నియమించారన్నది పెద్ద ప్రశ్న. ఫలితాలు విడుదల కాగానే కాంట్రాక్టు ఉద్యోగి నవీన్ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్గానూ, టీజీటీలో ఆరో ర్యాంకు సాధించడంతో లీకేజీ వ్యవహారం బయటపడింది. దీంతో పరువు పోతుందేమోనని భయపడిన అధికారులు అతడిని బెదిరించి విధుల నుంచి తొలగించినట్టు సమాచారం. దీంతో నవీన్ తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించడంతో విషయం బయటకు రాకుండా అతనిని తమదైన శైలిలో సముదాయించినట్టు విశ్వసనీయ సమాచారం.ఈ క్రమంలో భారీగా నగదు చేతులు మారాయన్న విమర్శలూ విద్యాభవన్లో చక్కర్లు కొడుతున్నాయి. లీకేజీ వ్యవహారాన్ని దాచేందుకు అధికారులు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. జిల్లా స్థాయిలో జరగాల్సిన ఎంపికల ప్రక్రియనూ తమ చేతుల్లోకి తీసుకున్నారు. జిల్లా సెలక్షన్ కమిటీలను కేవలం ఎంపికైన అభ్యర్థుల సర్టీఫికెట్ల పరిశీలనకే పరిమితం చేశారు. కాల్ లెటర్ల జారీలో ‘టెస్టింగ్’ డీఎస్సీ నియామకాల్లో తొలి నుంచీ అనేక అవకతవకలకు పాల్పడిన చంద్రబాబు ప్రభుత్వ కుట్రలో మరో కోణమిది. కాల్ లెటర్ల జారీలో ‘టెస్టింగ్’ల (ఎస్ఎంఎస్) పేరుతో ఉపాధ్యాయ ఉద్యోగార్థుల భవితవ్యంతో ఆడుకుంది. ఒకే కేటగిరీకి చెందిన వారిలో ముందు, వెనుక ఉన్నవారికి లెటర్లు పంపడం, మధ్యలో ఉన్నవారికి ఇవ్వకపోవడం గమనార్హం. దీంతోపాటు అభ్యర్థుల డీఎస్సీ మార్కులూ రోజుకో విధంగా మార్చేసింది, ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (ఈపీటీ) పాసైనట్టు ప్రకటించి, తర్వాత వెబ్సైట్ నుంచి డేటా తొలగించి, ‘నాట్ క్వాలిఫైడ్’ అని ప్రకటించింది.ప్రత్యేక విభాగంలోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)ల ఉద్యోగాలకూ ఎసరు పెట్టే ఎత్తుగడ వేసింది. ఈపీటీ అవసరం లేదని నోటిఫికేషన్లో ప్రకటించి అందుకు అనుగుణంగా హాల్టికెట్లు ఇచ్చి పరీక్ష నిర్వహించింది. తర్వాత ఈపీటీ పాసవలేదని కాల్ లెటర్లు నిలిపివేసింది. ‘మేము మెరిట్ లిస్టులో ఉన్నా కాల్ లెటర్లు రాలే’దంటూ వేలమంది అభ్యర్థులు జిల్లాల్లో కౌన్సెలింగ్ సెంటర్ల వద్ద ఆందోళన చేస్తే అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం రాజకీయ రంగు పులిమి తప్పులను కప్పిపుచ్చే యత్నం చేసింది. ప్రతిభకు అడుగడుగునా అన్యాయండీఎస్సీ నోటిఫికేషన్ దగ్గర నుంచి కాల్ లెటర్ల (ఎస్ఎంఎస్) జారీ, సర్టీఫికెట్ల పరిశీలన వరకు అభ్యర్థుల జీవితాలను పణంగా పెట్టే రీతిలోనే ప్రక్రియ నడిచింది. నోటిఫికేషన్లో పేర్కొన్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. 16,347 ఉపాధ్యాయు పోస్టులకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించారు. అభ్యర్థులకు ఆయా పరీక్షలను సర్కారు వేర్వేరుగా నిర్వహించింది. ఇందులో ప్రతిభ గల అభ్యర్థులు ఎస్జీటీతోపాటు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ మూడు పోస్టులు సాధించారు.మెరిట్ ప్రకారం మూడు పోస్టులకు కాల్ లెటర్లు పంపాల్సి ఉన్నా దరఖాస్తులో మొదట ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్ లెటర్లు పంపారు. దీంతో అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచి్చన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇలా దాదాపు 4 వేల మంది ఉన్నత అవకాశం కోల్పోయారు. డీఎస్సీ నిర్వహణలో తమదే పేటెంట్గా చెప్పుకుంటున్న టీడీపీ సర్కారు అడుగడుగునా అడ్డగోలుగా తప్పులు చేసి అభాసుపాలైంది. ప్రతిభావంతుల భవిష్యత్తును నాశనం చేసింది. హైకోర్టు ఆక్షేపించినా..!చంద్రబాబు ప్రభుత్వంలో డీఎస్సీ నిర్వహణలో లోపాలు ఉన్నాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తాము రెండు, మూడు పోస్టులకు ఎంపికైతే ఒక పోస్టుకే కాల్ లెటర్ పంపి.. తమ ఉన్నత ఉద్యోగ హక్కుకు భంగంకలిగించారని వందలాది మంది పిటిషన్లు వేయడంతో హైకోర్టు విచారణ చేపట్టింది. ఉన్నత ఉద్యోగం అభ్యర్థి హక్కు అని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందినవారికి పోస్టు ప్రిపరెన్సీ క్రమంలో కాకుండా ఉన్నత అర్హత గల ఉద్యోగం ఇవ్వాలని అక్టోబర్ 12నే మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.అయినా వాటిని పట్టించుకోకుండా అక్టోబర్ 15న ఎంపిక ప్రక్రియను సర్కారు పూర్తిచేసేసింది. దీంతో మరో సారి అభ్యర్థులు కోర్టుకెళ్లగా న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశి్నంచింది. ఇది దారుణమైన, దుర్మార్గమైన చర్యగా అభివరి్ణంచింది. 2 నెలల్లోగా వారికి ఉన్నత ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులిచ్చి ఏడునెలలైనా అభ్యర్థులకు న్యాయం జరగలేదు. -
రాజధానిలో మరో స్కామ్.. దేవుడికే శఠగోపం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో రోజుకో కుంభకోణం వెలుగు చూస్తోంది. చదరపు అడుగు నిర్మాణానికి ఏకంగా రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తూ.. నిపుణులు విస్తుపోయేలా చేస్తుండటమే కాకుండా ప్లాట్ల కేటాయింపులో జరిగిన మాయాజాలం రైతులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో దేవుడి భూములను అస్మదీయులకు కట్టబెట్టి దేవాలయ వ్యవస్థను కూడా చంద్రబాబు సర్కార్ వదలకుండా భ్రష్టు పట్టిస్తోందని స్పష్టమవుతోంది. రాజధాని ప్రధాన ప్రాంతం(సీడ్ కేపిటల్ ఏరియా)లోని వెలగపూడి వేణుగోపాలస్వామి మాన్యం సర్వే నెంబరు 271–ఏలోని 10.6 ఎకరాల భూమిని టీడీపీ నేత మోతుకూరి సుబ్బారావు, మోతుకూరి రాజ్యలక్ష్మి ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. సుబ్బారావు.. వంగవీటి మోహన రంగా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న విశాఖపట్నంకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడు. సదరు నేత ఆక్రమణలో ఉన్న ఆలయ భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీం కింద తీసుకుంటూ.. దానికిగానూ మోతుకూరి సుబ్బారావుకు సీఎం చంద్రబాబు నిర్మించుకుంటున్న ప్యాలెస్కు కూతవేటు దూరంలో 10,600 గజాల విస్తీర్ణంతో కూడిన 6 నివాస ప్లాట్లు కేటాయించారు. ఈ ప్రాంతంలోనే ఈ–6 రోడ్డుకు సమీపంలో 2,650 గజాల విస్తీర్ణంతో కూడిన రెండు వాణిజ్య ప్లాట్లను కేటాయించారు. తొలి ఏడాది ఎకరానికి రూ.30 వేలు.. ఆ తర్వాత ప్రతి ఏటా రూ.3 వేలు పెంచుకుంటూ 10.6 ఎకరాలకు పదేళ్లకు సంబంధించిన కౌలును కూడా ప్రభుత్వం ఆయనకు చెల్లించేసింది. దేవుడికి మాత్రం 2013 భూసేకరణ చట్టం ప్రకారం 10.6 ఎకరాలకు సంబంధించిన పరిహారాన్ని దేవదాయ శాఖకు చెల్లించాలని నిర్ణయించింది. అంటే.. దేవుడికి భూమికిగాను పరిహారంతో సరిపెట్టేసిన చంద్రబాబు సర్కార్.. ఆ భూమిని ఆక్రమించిన టీడీపీ నేతకు మాత్రం అత్యంత విలువైన ప్రాంతంలో నివాస, వాణిజ్య ప్లాట్లతోపాటు కౌలును కూడా చెల్లించడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో నివాస ప్లాటు గజం రూ.50 వేలు, వాణిజ్య ప్లాటు(250 గజాలు) రూ.2.70 కోట్లు పలుకుతోందని చంద్రబాబు ప్రభుత్వం 2024 సెప్టెంబర్లో ప్రపంచ బ్యాంకుకు నివేదిక ఇచ్చింది. ఈ లెక్కన మోతుకూరి సుబ్బారావుకు ఇచ్చిన ప్లాట్ల విలువ రూ.81.62 కోట్లు కావడం గమనార్హం. ఇదొక్కటే కాదు నెక్కళ్లులో శ్రీమళ్లేశ్వరస్వామి వారి ఆలయం, శ్రీవేణుగోపాలస్వామి వారి ఆలయాలకు చెందిన భూములతోపాటు రాజధాని గ్రామాల్లో 173.22 ఎకరాలను ఇదే రీతిలో వాటిని ఆక్రమించి, సాగుచేసుకుంటున్న వారికి లబ్ధి చేకూర్చింది. వాటిని భూ సమీకరణ కింద రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న సీఆర్డీఏ.. దేవాదాయ శాఖకు పరిహారంతో సరిపెట్టి.. ఆక్రమించుకున్న వారికి నివాస, వాణిజ్య ప్లాట్లు, ఏటా కౌలు చెల్లిస్తోంది. వెలగపూడిలో సీఎం చంద్రబాబు నిర్మిస్తున్న ప్యాలెస్కు కూతవేటు దూరంలో మోతుకూరి సుబ్బారావుకు కేటాయించిన 10,600 గజాల విస్తీర్ణంతో కూడిన ఆరు నివాస ప్లాట్లు సీఆర్డీఏ అథారిటీ తీర్మానం.. కబ్జాదారులకు ప్రయోజనం గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో 217 చదరపు కిలోమీటర్ల (53,749.49 ఎకరాలు) ప్రాంతాన్ని 2015లో ప్రభుత్వం రాజధానిగా ప్రకటించింది. అటవీ, ప్రభుత్వ భూమిపోనూ, మిగతా భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీం (భూ సమీకరణ పథకం) కింద సమీకరించాలని నిర్ణయించింది. 29 గ్రామాల్లో 1,017.09 ఎకరాల దేవాదాయ శాఖ భూమి ఉంది. ఇందులో 843.87 ఎకరాలను భూ సమీకరణ పథకం కింద తీసుకున్న సీఆర్డీఏ.. సంబంధిత ఆలయాలకు రాజధానిలో నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించి, ఏటా కౌలు చెల్లిస్తూ వస్తోంది. మిగతా 173.22 ఎకరాల భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వారిలో అధిక శాతం టీడీపీ నాయకులు, సానుభూతిపరులు కావడంతో అప్పటి చంద్రబాబు సర్కార్ వారికి ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. ఆక్రమించుకున్న వారి నుంచి ఆ భూమిని దేవాదాయ శాఖ స్వా«దీనం చేసుకోవడం కష్టంగా మారిందని, బలవంతంగా తీసుకుంటే వాటిని ఆక్రమించుకున్న వారి జీవనోపాధి దెబ్బ తింటుందని సన్నాయి నొక్కులు నొక్కింది. ఈ క్రమంలో 2016 సెప్టెంబర్ 20న జరిగిన సీఆర్డీఏ అథారిటీ 6వ సమావేశంలో.. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూమికిగాను సంబంధిత ఆలయానికి పరిహారం చెల్లించి, ఆ భూమిని ఆక్రమించుకుని, సాగు చేసుకుంటున్న వారికి నివాస, వాణిజ్య ప్లాట్లతోపాటు కౌలును కూడా చెల్లించాలని తీర్మానం చేసింది. దాన్ని అమలు చేస్తూ 2018 అక్టోబర్ 11న ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నంబర్ 330) జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కి.. దేవాలయ భూములపై దేవుడికి సేవ చేసేవారు, ఇనాముదార్లకు కేవలం అనుభవించే హక్కు మాత్రమే ఉంటుందని, వాటిపై ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవని, విక్రయించడానికి ఏమాత్రం వీల్లేదని.. దేవుడి భూములు దేవుడికే చెందుతాయని 1998లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. వింజమూరు రాజగోపాలాచారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య నడిచిన దేవాలయ భూమి వ్యాజ్యంలో.. దేవుడి భూమి దేవుడికే చెందుతుందని.. సేవ చేసే వారికి వాటిపై ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవని స్పష్టం చేస్తూ 2015లో హైకోర్టు సైతం తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో వైకుంఠపురం శ్రీవెంకటేశ్వరస్వామికి భజంత్రిగా సేవ చేసే వ్యక్తి.. సేవ చేసినందుకుగాను తాను సాగు చేసుకుంటున్న దేవాలయ భూమిని విక్రయించడంపై వ్యాజ్యం (డబ్ల్యూపీ 1718/2019) దాఖలైంది. దీనిపై విచారించిన హైకోర్టు.. 1998లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ఉటంకిస్తూ.. దేవుడి భూమిపై దేవుడికే సర్వాధికారాలు ఉంటాయని, సేవ చేసే వారికి, ఇతరులకు ఎలాంటి హక్కులు ఉండవని స్పష్టం చేసింది. కానీ.. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను తుంగలో తొక్కుతూ సీఆర్డీఏ అథారిటీ 6వ సమావేశంలో దేవుడి భూములను ఆక్రమించుకున్న వారికి ప్రయోజనం చేకూర్చుతూ నిర్ణయం తీసుకున్నారని భక్తులు, ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. నెక్కళ్లులోనూ ఇదే తరహా దందా ⇒ నెక్కళ్లులో శ్రీమళ్లేశ్వరస్వామి ఆలయానికి సర్వే నంబరు 59లో 11.45 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రూ.1,87,58,864.38 పరిహారం ఇవ్వాలని, అదే గ్రామంలో శ్రీవేణుగోపాలస్వామి ఆలయానికి సర్వే నంబరు 158లో ఉన్న 14.07 ఎకరాల భూమికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం రూ.2,30,51,285.75 పరిహారంగా ఇవ్వాలని సీఆర్డీఏ అధికారులు లెక్కగట్టారు. ⇒ ఈ రెండు ఆలయాలకు సంబంధించిన 25.52 ఎకరాల భూమికిగానూ మొత్తంగా రూ.4,18,10,150.14 పరిహారంగా సీఆర్డీఏ దేవదాయ శాఖకు చెల్లించింది. ఆ భూమిని ఆక్రమించుకుని, సాగు చేసుకుంటున్న వారికి మాత్రం రాజధానిలో నివాస, వాణిజ్య ప్లాట్లు, ఏటా కౌలును చెల్లిస్తూ సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. ⇒ శ్రీమల్లేశ్వరస్వామి ఆలయ భూమిని ఆక్రమించుకుని, సాగు చేసుకుంటున్న అబ్బూర రజిని, రామినేని రామారావు, పూజల పద్మ చౌడేశ్వరి, రామినేని మళ్లీశ్వరి, రామినేని బాబు, రామినేని పూర్ణచంద్రరావు, రావెల శ్రీనివాసరావు, రావెల రామచంద్రరావు, రావెల రాంబాబులకు సీఆర్డీఏ నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించింది. వారికి ఏటా కౌలు కూడా చెల్లిస్తోంది. ⇒ శ్రీవేణుగోపాలస్వామి ఆలయ భూమిని ఆక్రమించుకుని, సాగు చేసుకుంటున్న మాడపాటి సింహాద్రి, భట్టిప్రోలు షేక్ జమీల్, గుమ్మా శివలీల, చదలవాడ చలపతిరావు, గుర్రపూసల చిట్టెమ్మ, మేడూరి వీరరాజేశ్వేరమ్మ, గుమ్మా శ్రీనివాసరావు, గుమ్మా లక్ష్మినారాయణ, పొదిలి బోడయ్య, షేక్ ఏసోబు, చదలవాడ లక్ష్మీబాయమ్మ, చదలవాడ సుబ్బారావు, గుమ్మా వెంకటరావు, కూరుకూటి వెంకటనరసమ్మలకు నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించిన సీఆర్డీఏ.. వారికి ఏటా కౌలు కూడా చెల్లిస్తోంది. నిషేధం తొలగించి లబ్ధి చేకూర్చేలా అడుగులు! ⇒ ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో 4.67 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. వాటిని అస్మదీయులకు, టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం 2014–19 మధ్య, ఈ 23 నెలల కాలంలో ఇలాంటి పలు నిర్ణయాలు తీసుకుందని భక్తులు, ధార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ⇒ వాస్తవానికి ప్రభుత్వం దేవదాయ శాఖ భూముల క్రయవిక్రయాలు జరగకుండా.. వేరొకరు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి వీల్లేకుండా నిషేధిత జాబితాలో పెట్టింది. అయితే ప్రైవేట్ వ్యక్తుల భూముల సర్వే నంబర్లు మారి, దేవాలయాల భూముల్లో కలిపారంటూ లక్షన్నర ఎకరాల దేవాలయాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు చంద్రబాబు సర్కార్ కసరత్తు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఉండే దేవాలయాల భూములను 33 ఏళ్ల పాటు ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో 139) జారీ చేసింది. ⇒ కృష్ణా జిల్లా గొడుగుపేట దేవాలయానికి చెందిన భూమి విజయవాడలోని గొల్లపూడిలో ఉంటే.. ఆ భూమిని ఎగ్జిబిషన్ గ్రౌండ్ కోసం, గోల్ఫ్ కోర్టు కోసం కేటాయించారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు ఇందులో రాత్రికి రాత్రి మట్టిని తోలారు. దీనిపై భక్తులు సుప్రీంకోర్టు వరకు వెళ్లి స్టే తెచ్చుకోవాల్సి వచ్చింది. ⇒ కాకినాడ శ్రీభావనారాయణస్వామి ఆలయ భూములను క్రికెట్ స్టేడియం కోసం కేటాయిస్తూ ఆదేశాలిచ్చారు. ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉందన్న సాకుతో వైఎస్సార్ కడప జిల్లాలోని పుష్పగిరి మఠం పేరిట అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారం గ్రామ పరిధిలోని 259 సర్వే నంబరులో ఉన్న 6.89 ఎకరాల భూమిని అమ్మేయడానికి అనుమతి ఇస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవన్నీ కళ్లారా చూస్తున్న భక్తులు.. దేవుడి ఆస్తులను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే అస్మదీయులకు వాటిని కట్టబెడుతోందని మండిపడుతున్నారు. ఇలాగైతే ఆయా ఆలయాల నిర్వహణ, నిత్య కైంకర్యాలు, ఉత్సవాలకు ఇక్కట్లు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సీఆర్డీఏతో చేసుకున్న ఒప్పందంలో సాక్షి సంతకం చేసిన వట్టిగుంట వేణుగోపాలరెడ్డికి తనకు కేటాయించిన 600 గజాల వాణిజ్య ప్లాటును ఇచ్చిన మోతుకూరి సుబ్బారావు(ఆ ప్లాటును వేణుగోపాలరెడ్డికి విక్రయించారా లేదా ఇందులో మర్మమేమిటన్నది వారిద్దరికే ఎరుక) పేకాటలో చేయితిరిగిన మంత్రి ఒత్తిడితో..⇒ వెలగపూడిలో శ్రీవేణుగోపాలస్వామికి సర్వే నెంబరు 271–ఏలో 10.6 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని మోతుకూరి రాజ్యలక్ష్మి, మోతుకూరి సుబ్బారావు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారని భక్తులు చెబుతున్నారు. రాజధాని భూ సమీకరణ కింద నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు 9.1 ఫారమ్లో ఆ భూమి పట్టా భూమిగా.. మోతుకూరి రాజ్యలక్ష్మి, సుబ్బారావుకు చెందినదిగా సీఆర్డీఏ చూపింది. దీనిపై దేవదాయ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ భూమి దేవుడిదని రికార్డులు చూపడంతో సీఆర్డీఏ అధికారులు 9.5 ఫారమ్లో దాన్ని దేవాదాయ శాఖ భూమిగా మార్చారు. ⇒ కానీ.. ల్యాండ్ పూలింగ్ స్కీం కింద ఆ భూమిని తీసుకుంటూ జారీ చేసిన 9.22 ఫామ్లో మాత్రం.. ఆ భూమి దేవాదాయ శాఖతోపాటు మోతుకూరి రాజ్యలక్ష్మికి చెందినట్లుగా చూపడం గమనార్హం. దీనిపై కూడా దేవదాయ శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అçప్పట్లో ఆ భూమికి సంబంధించి.. ల్యాండ్ పూలింగ్ స్కీం కింద దాన్ని తీసుకుంటూ అటు మోతుకూరి సుబ్బారావుతోగానీ, ఇటు దేవదాయ శాఖతోగానీ సీఆర్డీఏ అభివృద్ధి ఒప్పందం చేసుకోలేదు.మోతుకూరి సుబ్బారావుతో సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందంలో సాక్షిగా సంతకం చేసిన వట్టిగుంట వేణుగోపాలరెడ్డి ⇒ 2024లో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక.. వంగవీటి మోహన రంగా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న విశాఖపట్నంకు చెందిన ఓ ఎమ్మెల్యే తన అనుచరుడైన మోతుకూరి సుబ్బారావుకు నివాస, వాణిజ్య ప్లాట్లు, కౌలు దక్కేలా చేయడానికి పావులు కదిపారు. ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. మోతుకూరి సుబ్బారావుకు ఉన్నత స్థాయిలో ఆశీస్సులు అందడంతో పేకాటలో చేయి తిరిగిన మంత్రి రంగంలోకి దిగారు. వేణుగోపాలస్వామి భూమికి సంబంధించి మోతుకూరి సుబ్బారావుతో ల్యాండ్ పూలింగ్ స్కీం ఒప్పందం చేసుకోవాలని సీఆర్డీఏ అధికారులపై ఆ మంత్రి ఒత్తిడి తెచ్చారు.⇒ దాంతో 2025 జూన్ 18న ఆ భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీం కింద తీసుకుంటూ మోతుకూరి సుబ్బారావుతో సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. అనంతరం నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించింది. కౌలును కూడా చెల్లించింది. ఇందుకుగాను పేకాటలో చేయి తిరిగిన మంత్రి వెయ్యి గజాల నివాస ప్లాటును నజరానాగా అందుకున్నారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. -
బాబు మాటలు.. APలో అగ్గి రాజేస్తున్న మనువాద రాజకీయం
-
నోటికాడి కూడు లాక్కున్నావ్.. దీనికి అనుభవిస్తావ్..
-
అర్హతల్లో అయోమయం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల నియామక నోటిఫికేషన్లు మూడు తప్పులు, ఆరు సవరణల చందంగా మారిపోయింది. శాస్త్రీయ పద్ధతులను అనుసరించకుండా తయారు చేసిన నోటిఫికేషన్లను దరఖాస్తులు ప్రారంభమయ్యే సమయం వరకు సవరించడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది. ప్రత్యేక విశ్వవిద్యాలయాలైన వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక వర్సిటీ(ఆర్జీయూకేటీ)ల్లో సరైన ప్రక్రియ లేకుండా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం విస్తుగొలుపుతోంది. ఫార్మసీ విభాగంలో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ తర్వాత అర్హతలను సవరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా వర్సిటీల్లో ఒక్కో విభాగానికి ఒక్కో నిష్పత్తి ప్రకారం ఇష్టారీతిన పోస్టులు కేటాయించడంతో రిజర్వేషన్ రోస్టర్ సైతం మారిపోతుండటం గమనార్హం. గంపగుత్తగా ఒక్కటే అర్హతా? వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నోటిఫికేషన్ చిత్రవిచిత్రంగా కనిపిస్తోంది. ఇక్కడ సబ్జెక్టుల వారీగా కాకుండా విభాగాల వారీగా గంపగుత్తగా పోస్టులు ప్రదర్శించడం కొసమెరుపు. ఉదాహరణకు గత 2023లో నోటిఫికేషన్లో వర్సిటీలోని బిల్డింగ్ టెక్నాలజీ విభాగంలో సివిల్, ఈఈఈ, ఫెసిలిటీస్ అండ్ సర్వీసు ప్లానింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ కింద ఏడు పోస్టులకు విడివిడి అర్హతలతో నోటిఫికేషన్ ఇచ్చారు. తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్లో బిల్డింగ్ టెక్నాలజీలో 5 పోస్టులను కుదించి, వాటిని ఏ విభాగానికి చెందినవో స్పష్టం చేయలేదు.పైగా బిల్డింగ్ టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్ అర్హతలను మాత్రమే సూచించడం గమనార్హం. అంటే, కేవలం ఆ విభాగాన్ని సివిల్ ఇంజినీరింగ్ అర్హత కలిగిన వారితో భర్తీ చేసేందుకు వీసీ కుట్రలు చేస్తున్నట్టు సమాచారం. యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, డిజైన్ టెక్నాలజీ, ఇంటీరియర్ డిజైన్, పెయింటింగ్, ఫొటోగ్రఫీ, ప్లానింగ్, స్కల్ప్చర్లోనూ ఇదే తంతు. వాస్తవానికి విడివిడి అర్హతలతో పోస్టులకు దరఖాస్తులను పిలిస్తే పరిశీలన కష్టం అవడంతో పాటు పోస్టుల భర్తీ కాకుండా ఉండిపోతే ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ఆగిపోతాయనే ఉద్దేశంతోనే ఒకే అర్హతతో గంపగుత్తగా పోస్టులు భర్తీ చేస్తున్నట్టు స్పష్టం అవుతోంది. పరిశ్రమ అనుభవం పీహెచ్డీతో సమానమా? ఫార్మసీ విభాగంలో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హతలను సైతం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సవరించారు. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి పీహెచ్డీ లేకున్నా 8ఏళ్లు పరిశ్రమ అనుభవం, ప్రథమ శ్రేణిలో మాస్టర్స్ డిగ్రీ ఉంటే చాలని, దీనిని ప్రత్యేక కమిటీ ధ్రువీకరిస్తే పీహెచ్డీతో సమానంగా పరిగణిస్తామని పేర్కొనడం గమనార్హం. పైగా గతంలో ఎక్కువ స్పెషలైజేషన్లకు అవకాశం కలి్పస్తే ఇప్పుడు కేవలం ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ మాత్రమే పేర్కొన్నారు.ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ప్రథమ శ్రేణిలో బీ–ఫార్మసీ, మాస్టర్స్ అర్హతను కాస్త.. కేవలం బేసిక్ బీ–ఫార్మా డిగ్రీకి పరిమితం చేసింది. మాస్టర్ డిగ్రీలో ప్రథమ శ్రేణి ఉండాలని పెట్టింది. ప్రైవేటు సంస్థల్లో బోధన, పరిశోధన, వృత్తిపర అనుభవాన్ని, జర్నల్స్లో పరిశోధన పత్రాలను అదనపు అనుభవంగా కోరుతోంది. అంటే, ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న తమ అనుకూల వ్యక్తులకు మేలు చేకూర్చేందుకు ఇలాంటి ఎత్తుగడ వేసినట్టు భోగట్టా. ఆర్జీయూకేటీలో అరకొర పోస్టులేల! ఆర్జీయూకేటీలో గతంలో 611 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు 311 పోస్టులకు పరిమితం చేసింది. 2017, 2018 నోటిఫికేషన్లపై సుప్రీం కోర్టులో కేసులు ఉండటంతో ఆ పోస్టులను మినహాయించి కొత్తగా వర్సిటీ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చినట్టు ప్రచారం చేస్తోంది. కానీ, ఆ రెండు నోటిఫికేషన్లలో ఆర్జీయూకేటీ ఎప్పుడూ పాల్గొనలేదు. కేవలం 2023లో అన్ని వర్సిటీలతో పాటు నోటిఫికేషన్లోకి వచ్చింది. 2013లో పాక్షికంగా చేపట్టిన 53 శాశ్వత పోస్టుల తర్వాత ఇప్పటి వరకు కొత్త నియామకాలు చేయలేదు.అలాంటిది ఈసారి పూర్తిస్థాయిలో పోస్టుల భర్తీ చేయాల్సిన ప్రభుత్వం కేవలం 104 అసిస్టెంట్, 104 లెక్చరర్ పోస్టులకు రెగ్యులర్, 103 పోస్టులను బ్యాక్లాగ్ నోటిఫికేషన్ ఇవ్వడం గమనార్హం. ఆర్జీయూకేటీలో రెగ్యులర్ పోస్టులకు విభాగాల వారీగా నోటిఫికేషన్ ఇస్తే బ్యాక్లాగ్లో మాత్రం రెండు, మూడు సబ్జెక్టులను కలిపి గ్రూప్గా విభజించడంతో రోస్టర్ గాడితప్పినట్టేనని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ నోటిఫికేషన్లోనూ 104 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉంటే వాటిల్లో కంప్యూటర్ సైన్స్లో 31, ఈఈఈలో 23 పోస్టుల మినహా మిగిలిన 11 విభాగాల్లో వేళ్లపై లెక్కపెట్టే పోస్టులున్నాయి. ఆర్జీయూకేటీ వంటి రెసిడెన్షియల్ వర్సిటీలో విద్యార్థుల బలవన్మరణాలను అరికట్టేందుకు, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు సైకాలజీ విభాగాన్ని తీసుకొస్తే అందులో ఒక్క పోస్టును కూడా భర్తీ చేయట్లేదు.అప్పుడే బేరసారాలు!ఆర్జీయూకేటీలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ఊసే లేకుండా పోయింది. ఇక్కడ, సీఎం సొంత సామాజిక వర్గానికి చెందిన కొందరు ఆర్జీయూకేటీ బోధకులు కుట్ర పన్ని రెగ్యులర్లో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ లేకుండా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నోటిఫికేషన్లో ఏకంగా 103 అసోసియేట్ ప్రొఫెసర్లకు నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు కేవలం బ్యాక్లాగ్లో 37 పోస్టులు కేటాయించి చేతులు దులుపుకొన్నారు. రెగ్యులర్, బ్యాక్లాగ్ రెండింటిలోనూ ఒక్క ప్రొఫెసర్ పోస్టు లేకపోవడం గమనార్హం.ఇక్కడ రిజిస్ట్రార్, సీనియర్ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో జరగాల్సిన పోస్టుల కేటాయింపు కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాలోని ఓ వ్యక్తి పరిపాలన విభాగంలో ఇన్చార్జి హోదాలో కొనసాగుతూ ఇష్టారీతిన పోస్టు కేటాయించినట్టు వినికిడి. పైగా ఇప్పటికే తమ అనుకూల వ్యక్తులకు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించేందుకు అభయం ఇస్తూ పోస్టులు ఎలాగైనా కట్టబెట్టేందుకు బేరసారాలు సాగిస్తున్నారు. పైగా ఇప్పుడే అసోసియేట్ పోస్టులు భర్తీ చేస్తే తమకు చాన్స్ ఉండదనే భయంతో వాటిని తొక్కిపెట్టి వర్సిటీలో కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం(సీఏఎస్) కింద అసిస్టెంట్ ప్రొఫెసర్ పదోన్నతులు పొందేందుకు మార్గం సుగమం చేసుకోవడం గమనార్హం. -
విద్యార్థి'కి' మిత్ర ద్రోహం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక కిట్ల పంపిణీలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇందుకు ఇరాన్–అమెరికా యుద్ధాన్ని సాకుగా చూపింది. జూన్ 12న బడులు తెరిచిన మొదటిరోజే వీటిని అందిస్తామని ప్రారంభంలో గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వకుండా తప్పించుకునేందుకు సాకులు వెదుకుతోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ముడిసరుకు ధరలు పెరిగాయని, ముఖ్యంగా గ్యాస్ కొరత, క్రూడ్ ఆయిల్ సంక్షోభం, ఫైబర్ వంటి ముడి పదార్థాల కొరత తీవ్రంగా ఉండడంతో క్రూడ్ ఆధారిత ముడి సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరిగాయని చెప్పింది. రవాణా వ్యవస్థలో ఆటంకాలు ఎదురుకావడంతో యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగులు, బూట్లు తదితర వస్తువుల తయారీపై ప్రభావం పడిందని చెబుతోంది. ఇలా కుంటి సాకులతో కేవలం రెండేళ్లకే విద్యార్థి మిత్ర అమల్లో సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ చేతులెత్తేశారు.జగన్ ప్రభుత్వం పుణ్యమాని ‘2024 జూన్’ హ్యాపీ2024 జూన్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగనన్న విద్యా కానుక కిట్ పేరును సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చింది. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వంలో ముందుగానే ఆర్డర్ పెట్టిన జగనన్న విద్యాకానుక కిట్లను కూటమి ప్రభుత్వం 2024 జూన్ నెలలోనే సకాలంలో పంపిణీ చేయగలిగింది. ఇది జగన్ ప్రభుత్వం క్రెడిట్ తప్ప, చంద్రబాబు ప్రభుత్వం గొప్పేమీ కాదు. 2025కు వచ్చేసరికి ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లకు కిట్లు సరఫరా చేయలేమని భీష్మించారు. దాంతో అధికారులు చొరవ తీసుకుని, సరఫరాదారులకు భరోసా ఇచ్చి కిట్లు తీసుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నిధుల చెల్లింపులో ఆలస్యం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2025–26 విద్యా సంవత్సరంలో జూన్ నెలలో ఇవ్వాల్సిన కిట్లు ఆగస్టు దాటినా పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోయారు. కమీషన్ల కహానీనే..అసలు కారణం 2026–27 విద్యా సంవత్సరానికి 1–10 తరగతుల వరకు 35 లక్షల మంది విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు కొనుగోలుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇంటర్మీడియట్ వరకు వస్తువులు కొనుగోలు, నాణ్యత పరిశీలన, మండల స్టాక్పాయింట్లకు చేరవేత వరకూ రూ.910 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే, రెండేళ్లకు తమకు రావాల్సిన రూ.1,372 కోట్ల బకాయిల మొత్తం చెల్లించకుండా బిడ్డింగ్లో పాల్గొనలేమని కంపెనీలు తేల్చి చెప్పాయి. దాంతో ప్రభుత్వం చేసేది లేక గత నెలలో బకాయిలు చెల్లించింది. అయితే, ఇందులో విద్యాశాఖలోని ఓ అత్యున్నతాధికారి 5.5 శాతం కమీషన్ వసూలు చేసినట్టు సమాచారం. దీంతో విసిగిపోయిన కాంట్రాక్టర్లు ఈ ఏడాది కిట్లు, వాటిలోని వస్తువులు ఇవ్వలేమని కరాఖండీగా చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. కానీ వాస్తవాలను దాచిపెట్టిన ప్రభుత్వం యుద్ధ వాతావరణం సాకుతో కిట్ల పంపిణీని ఎగ్గొట్టే యత్నం చేస్తోంది. తూచా తప్పకుండా జూన్ 12నే జగనన్న విద్యా కానుక పుస్తకాలు, యూనిఫారం కొనలేక తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందిని గమనించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాను సీఎం కాగానే బడి తెరిచిన మొదటిరోజే జగనన్న విద్యా కానుక కింద పుస్తకాలు, యూనిఫారం, బూట్లు, సాక్సులు, టైతో సహా ఉచితంగా అందించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఏటా జూన్ 12న బడులు తెరిచిన తొలిరోజే వీటిని అందించేలా కార్యాచరణ రూపొందించారు. జగనన్న విద్యా కానుక కిట్లో నాణ్యమైన పుస్తకాల బ్యాగ్, స్టిచింగ్ చార్జ్లీతో 3 జతల యూనిఫారాలు, ఒక బెల్ట్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్లు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, వర్క్బుక్లు ఇంగిŠల్ష్– తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ(ఆరోతరగతి), ఎలిమెంటరీ విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ అందించారు. ఇలా వైఎస్ జగన్ ప్రభుత్వంలో సగటున ఏటా 43 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు విద్యా కానుక అందుకున్నారు. కిట్ల సరఫరాలో స్వల్ప ఆలస్యం: సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావుకిట్ల పంపిణీలో ఎలాంటి జాప్యం జరగకుండా పాఠశాల పున: ప్రారంభం నాటికే అందజేయాలనే లక్ష్యంతో అన్ని రకాల ప్రణాళికలతో పకడ్బందీ చర్యలు చేపట్టామని, అయితే అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులతో కిట్ల సరఫరా మరో నెల ఆలస్యం అవుతుందని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గ్యాస్ కొరత, క్రూడ్ ఆయిల్ సంక్షోభం, ఫైబర్ వంటి ముడి పదార్థాల కొరత తీవ్రంగా ఏర్పడటంతో క్రూడ్ ఆధారిత ముడి సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరిగాయన్నారు. రవాణా వ్యవస్థలో ఆటంకాలు ఎదురుకావడంతో యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగులు, బూట్లు తదితర వస్తువుల తయారీపై ప్రభావం పడిందని, దీంతో సరఫరాదారులు కొంత గడువు కోరినట్లు వివరించారు. అయితే, చదువుకు ఇబ్బంది కలగకూడదనే లక్ష్యంతో జూన్ 12న బడులు తెరిచే నాటికే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ అందేలా చర్యలు చేపట్టామని వివరించారు. ‘మెగా పీటీఎం’ నాటికి మిగిలిన వస్తువుల పంపిణీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. -
నిండా అప్పులు.. ఆర్భాటపు తిప్పలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన దొరికిన చోటల్లా అప్పులు చేయడం.. ఆ మొత్తాలను హంగూ ఆర్భాటాలకు వెచ్చించడం తప్ప ఆస్తుల కల్పనకు ఖర్చు చేయడం లేదు. ఈ విషయాన్ని ప్రస్తుత ఆర్థిక ఏడాది (2026–27) తొలి నెల ఏప్రిల్ బడ్జెట్ కీలక సూచికలే వెల్లడించాయి. ఏ కుటుంబమైనా ఇల్లు కట్టుకోవడానికో.. ఏదైనా ఆస్తి సమకూర్చుకోవడానికో అప్పు చేస్తుంది. ఏదైనా ప్రభుత్వం అప్పుచేస్తే.. ప్రజలకు ఉపయోపడే ఆస్తి కోసం ఉపయోగిస్తుంది. అంటే ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికో లేదా తాగునీటి అవసరాలు తీర్చడానికో అప్పులు చేసి.. తద్వారా వాటిని ప్రజలకు సమకూరుస్తుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏప్రిల్ నెలలో బడ్జెట్ లోపల ఏకంగా రూ.10,901 కోట్లను అప్పు చేసింది. ఆ మొత్తంలో కేవలం రూ.533 కోట్లను మాత్రమే ఆస్తుల కల్పన (మూలధన వ్యయం) కోసం ఖర్చు చేసింది. అంటే మూలధన వ్యయం కోసం వెచ్చించింది ఏప్రిల్ నెలలో కేవలం 1.10 శాతమే. ఈ విషయాన్ని ఏప్రిల్ నెల బడ్జెట్ కీలక సూచికల్లో కాగ్ నివేదిక వెల్లడించింది. బడ్జెట్లో ప్రతిపాదించిన అప్పులో ఒక్క ఏప్రిల్ నెలలోనే ఏకంగా 14.37 శాతం మేర అప్పు చేసినట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. చేసిన అప్పులను ప్రజలకు ప్రభుత్వ రంగంలో ఆస్తుల కల్పనకు వ్యయం చేయడం లేదని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీకి సున్నా గ్రాంట్లే ఏప్రిల్ నెలలో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లను రాబట్టింది ఏమీ లేదని (సున్నా) కాగ్ నివేదిక స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వం భాగస్వామిగా ఉన్నప్పటికీ ఏప్రిల్ నెలలో పైసా కూడా గ్రాంట్ రాబట్టలేకపోయింది. బడ్జెట్లో ప్రతిపాదించిన పన్ను రాబడుల్లో ఏప్రిల్లో కేవలం 6.35 శాతమే వచ్చాయని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. మరోపక్క ఆర్థిక ఏడాది తొలి నెల ఏప్రిల్లోనే రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోయినట్టు కాగ్ గణాంకాలు పేర్కొన్నాయి. బడ్జెట్ ప్రతిపాదనల్లో రెవెన్యూ లోటును రూ.22,002 కోట్లకు పరిమితం చేస్తామని గొప్పగా పేర్కొనగా.. ఏప్రిల్ నెలలోనే రెవెన్యూ లోటు బడ్జెట్ ప్రతిపాదనల్లో 46.17 శాతం అంటే రూ.10,277 కోట్లకు చేరినట్టు గణాంకాలు స్పష్టం చేశాయి. బడ్జెట్ ప్రతిపాదనల ద్రవ్యలోటు ఏప్రిల్లోనే 14.37 శాతం చేరుకుంది. -
22ఏ భూములపై బాబు దొంగాట
సాక్షి, అమరావతి: చంపేయాలనే కసితో ఒక వ్యక్తిపై దాడి చేసి, ఆ తర్వాత ఏమీ తెలియనట్లు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి తానే బతికించానని చెప్పుకోవడాన్ని ఏమంటారు? రాష్ట్రంలో 22ఏ జాబితా భూముల విషయంలో ఇప్పుడు చంద్రబాబు సర్కారుది అచ్చు ఇదే తంతు. ఇన్నాళ్లూ ఈ భూములన్నింటినీ వివాదంలో పెట్టి.. ఇప్పుడు తానే విముక్తి కల్పిస్తున్నట్లు డబ్బా కొట్టుకుంటూ మరోమారు క్రెడిట్ చోరీకి బరితెగించారు. ఈ క్రమంలో భూముల వ్యవహారంలో చంద్రబాబుది అత్యంత నీచమైన రాజకీయ క్రీడ అని ఆ రంగానికి చెందిన నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే కక్షపూరితంగా 20 లక్షల ఎకరాలను 22ఏ జాబితాలో పెట్టి.. పేద, మధ్యతరగతి రైతుల ఉసురు పోసుకున్నారు. జగన్ హయాంలో అక్రమాలు జరిగాయనే నెపం వేసి రెండేళ్లు ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరక్కుండా వివాదంలో పెట్టారు. అనేక విచారణల తర్వాత అక్రమాలు లేవని తేలడంతో ఇప్పుడు ఆ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించడానికి ఆదేశాలు ఇచ్చారు. పైగా తానే ఆ భూములకు విముక్తి కల్పిస్తున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటుండటం విస్తుగొలుపుతోంది. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు 6 లక్షల ఎకరాలకుపైగా భూములను 22ఏ జాబితాలో పెట్టారు. నాలుగవసారి ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకోవడమే తప్ప ఆయన హయాంలో భూముల సమస్యలు పరిష్కారం కాకపోగా, ఇంకా ఎక్కువయ్యాయి. రాష్ట్రంలో 22ఏ భూముల వ్యవహారాన్ని అత్యంత క్లిష్టమైన సమస్యగా మార్చింది చంద్రబాబే. చుక్కల భూములు, షరతులుగల పట్టా భూములు, ఈనాం భూములే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. చివరికి పేద రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం హక్కులు కల్పించిన ఫ్రీహోల్డ్ భూములపైనా ఆయనది అదే తీరు. చుక్కల భూములను చిక్కుల్లో పెట్టింది బాబే 2016లో 4.10 లక్షల ఎకరాల చుక్కల భూములను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 22ఏ జాబితాలో పెట్టింది. అంతకు ముందు ఆ భూముల రికార్డులు పక్కాగా లేకపోయినా, అవి రైతుల అనుభవంలోనే ఉండడంతో రిజిస్ట్రేషన్లు జరిగేవి. వాటిని సక్రమం చేసే పేరుతో ఏకంగా లక్షల మంది రైతులను నట్టేట ముంచి రిజిస్ట్రేషన్లు జరక్కుండా చేశారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యపై ఫోకస్ పెట్టి.. 15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించారు. ఇందుకోసం 1.81 లక్షల సర్వే నంబర్లను పలుమార్లు రీ వెరిఫికేషన్ చేయించారు. దీంతో ఆ రైతులకు హక్కులు వచ్చాయి. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. 2024లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాగానే వాటిని 22ఏ(నిషేధిత) జాబితాలో పెట్టించారు.షరతుల పట్టా భూములకూ అన్యాయమేషరతులు గల పట్టా భూముల విషయంలోనూ చంద్రబాబుది అదే తీరు. రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల ఎకరాలుండగా, కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 33 వేల ఎకరాలను 2016లో ఆయన ప్రభుత్వం 22ఏ జాబితాలో పెట్టేసింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు జరుగుతున్న భూముల్ని ఒక్క ఆదేశంతో వివాదాస్పదం చేసేశారు. 2023లో వైఎస్ జగన్ వాటిని 22ఎ జాబితా నుంచి తొలగిస్తే, 2024 జూన్లో మళ్లీ వాటిని చంద్రబాబు 22ఏ జాబితాలో పెట్టించడంతో ఆ రైతులు నెత్తీనోరూ బాదుకున్నారు. ఇంతా చేసి ఇటీవలే తన హయాంలోనే ఆ రైతులకు మేలు చేస్తున్నట్లు చెప్పుకుంటూ ఆ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఈనాం భూముల విషయంలో సైతం అదే తీరు. గత జగన్ ప్రభుత్వం 1.39 లక్షల ఎకరాల సర్వీస్ ఈనాం రైతులకు కల్పించిన ఫ్రీ హోల్డ్ హక్కులను కేవలం రాజకీయ కక్షతో 22 నెలల పాటు 22ఏ జాబితాలో పెట్టారు. ఇప్పుడు అవే భూములకు తమ ప్రభుత్వం విముక్తి కల్పిస్తున్నట్లు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. 2024 ఆగస్టులో ఆ భూముల్ని నిర్దాక్షిణ్యంగా 22ఏ జాబితాలో పెట్టింది చంద్రబాబే.ఫ్రీ హోల్డ్ భూములపైనా అదే తంతురాష్ట్రంలో ఎన్నడూ లేని రీతిలో గత ప్రభుత్వం 20 సంవత్సరాలు దాటిన అసైన్డ్ భూములపై పేద రైతులకు యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్) కల్పించింది. 27.40 లక్షల ఎకరాలకు చెందిన 15.20 లక్షల మంది అసైన్డ్ రైతులకు సంపూర్ణంగా హక్కులు కల్పించడంతో వారు ప్రైవేటు భూముల తరహాలో తమ భూములకు హక్కుదారులయ్యారు. ఎన్నికలు జరిగే సమయానికి 13.59 లక్షల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములను గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ చేసి రైతులను యజమానులను చేసింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ భూములన్నింటినీ 22ఏ జాబితాలో పెట్టేశారు. అనేక వెరిఫికేషన్లు, విచారణలు చేసి అక్రమాలేవీ లేవని తేలడంతో వాటిని ఇప్పుడు తీరిగ్గా 22ఏ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించారు. అయితే చేసిన తప్పును ఒప్పుకోకుండా ఈ భూములకు హక్కులిచ్చింది తానేనని ప్రచారం చేసుకోవడంపై రైతులు మండిపడుతున్నారు. పేదలకు వారి భూములపై హక్కులు ఇవ్వకూడదనే రీతిలో రెండేళ్లపాటు ఆ భూములపై ఆంక్షలు విధించి, దాన్ని అక్రమంగా అభివర్ణించి.. ఇప్పుడు ప్లేటు ఫిరాయించడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. అసైన్డ్ ఇళ్ల స్థలాల పైనా అదే తీరు రాష్ట్రంలో అసైన్డ్ ఇళ్ల స్థలాల కేటాయింపు పూర్తయి పదేళ్లు దాటితే వాటిపై లబ్ధిదారులకు హక్కులు కల్పించాలని 2023లో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించి అమల్లోకి తెచ్చింది. 20 ఏళ్లు దాటిన అసైన్డ్ వ్యవసాయ భూములు, పదేళ్లు దాటిన అసైన్డ్ ఇళ్ల స్థలాలను పొందిన పేదలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు 2023లో అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. దాని ప్రకారమే 27 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు లభించగా.. వాటిలో 13.59 లక్షల ఎకరాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ఫ్రీ హోల్డ్ చేశారు. అదే సమయంలో పదేళ్లు దాటిన అసైన్డ్ ఇళ్ల స్థలాలనూ ఫ్రీ హోల్డ్ చేసేందుకు ఆదేశాలిచ్చారు. రిజిస్ట్రేషన్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, రిజిస్ట్రేషన్ల శాఖకు నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది. దీని ప్రకారం అనేక చోట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక.. మొత్తం ఫ్రీ హోల్డ్ భూములను అక్రమాలు జరిగాయన్న ఆరోపణతో మళ్లీ 22ఏ జాబితాలో పెట్టేసింది. ఇన్నాళ్లు నానా ఇబ్బందులు పెట్టి.. చివరికి అక్రమాలేవీ జరగలేదని తేలడంతో చేసేదేమీ లేక ఇప్పుడు తాజాగా ఆ చట్టాన్ని అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఫ్రీ హోల్డ్ అయిన వ్యవసాయ భూములు, పదేళ్లు దాటిన అసైన్డ్ ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేయాలని తాజాగా మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. ఇన్నాళ్లు రిజిస్ట్రేషన్ జరగకుండా అడ్డుకుని ఇప్పుడు ఆ ఘనత తనదేనని నిస్సిగ్గుగా చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లింది. -
కార్పొరేట్లకు బాబు మరో గిఫ్ట్
సాక్షి, అమరావతి: కార్పొరేట్ కంపెనీలు తీసుకునే రుణాలపై రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా తగ్గిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకవైపు అప్పుల్లో కూరుకుపోయిన తరుణంలో రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గిపోయే పరిస్థితి ఉన్నా ప్రభుత్వం కార్పొరేట్లకు లాభం చేకూర్చే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. భారీ పరిశ్రమలు, బడా కంపెనీలకు లాభం చేకూరేలా పారీ పస్సు చార్జీల డాక్యుమెంట్లపై రిజిస్ట్రేషన్ ఫీజుకు భారీ మినహాయింపులు ఇస్తూ శనివారం జీవో 304 జారీ చేసింది. ఇప్పటి వరకు బడా కంపెనీలు తాము తీసుకున్న రుణ మొత్తంపై 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉండేది. రుణం ఎంత ఎక్కువైతే.. ఫీజు కూడా అంత పెరిగేది. కానీ తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై గరిష్టంగా రూ.6 లక్షలు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ రాయితీ మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందని జీవోలో స్పష్టం చేసింది. దీంతో రూ.వందల కోట్లు, రూ.వేల కోట్ల రుణాలు తీసుకునే పెద్ద కంపెనీలు భారీగా లాభపడనున్నాయి. ఉదాహరణకు రూ.500 కోట్ల రుణంపై సాధారణంగా రూ.2.5 కోట్ల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటే.. ఇప్పుడు కేవలం రూ.6 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. అంటే ఒక్కో భారీ రుణ ఒప్పందంపైనే ప్రభుత్వం కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతుంది.రాష్ట్రంలో స్థిరాస్తుల మార్కెట్ విలువలను తరుచూ పెంచుతూ రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీల రూపంలో ప్రజలపై అదనపు భారం మోపుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. కార్పొరేట్ కంపెనీలకు మాత్రం మినహాయింపులు ఇవ్వడం గమనార్హం. చిన్న ఇల్లో, స్థలమో కొనుగోలు చేసే మధ్యతరగతి కుటుంబం రూ.లక్షల్లో రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లిస్తుండగా.. రూ.వేల కోట్ల రుణాలు తీసుకునే కార్పొరేట్ కంపెనీలకు మాత్రం సీలింగ్ పేరుతో ప్రత్యేక రాయితీలు ఇవ్వడం చంద్రబాబు సర్కారు తీరును స్పష్టం చేస్తోంది. -
మంటలు రేపుతున్న మనువాద కూటమి
దేశవ్యాప్తంగా విద్వేషపు నెగళ్లను ఎగదోస్తున్న మనువాద రాజకీయాల గురించిన చర్చ చాలా కాలంగా జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు జరగాల్సింది ఆంధ్రప్రదేశ్ సంఘ జీవనంలో అగ్గి రాజేస్తున్న నయా మనువాద రాజకీయం గురించి! ముంచుకొస్తున్న పెను ప్రమాదం గురించి ప్రజలను అప్రమత్తం చేయవలసిన అవసరం ఉన్నది. మనుధర్మశాస్త్రం ప్రతులను దాదాపు వందేళ్ల కిందనే అంబేడ్కర్ మహాశయుడు దహనం చేశాడని మనం చరిత్రలో చదువుకున్నాము. పుట్టుక ద్వారానే మనుషుల్లో గొప్పోళ్లూ, అల్పులూ అనే తేడాలుంటాయనే వర్ణ విభజన అది చేసింది కనుక అంబేడ్కర్ ఆ అధర్మ ‘ధర్మాన్ని’ దహనం చేశారు.పుట్టుక ఆధారంగా హెచ్చు తగ్గులుండే నిచ్చెన మెట్ల సామాజిక వ్యవస్థను మనుస్మృతి ప్రబోధించింది. పై మెట్టు పైనున్న వారికి గొప్ప బాధ్యతలు, కింది మెట్టుపైనున్న వారికి అల్పకార్యాలనూ అప్పగించింది. విద్యాగంధాన్ని కొందరికే పరిమితం చేసింది. అన్ని వర్గాల్లోని స్త్రీలపైనా అవమానకరమైన ఆంక్షలను విధించింది. స్త్రీలకు స్వతంత్రంగా ఆలోచించే అర్హత లేదని శాసించింది. ఇటువంటి అమానవీయ భావనలతో కూడిన మనుస్మృతిని రాజ్యాంగ రచనలో ఉపయోగించుకోవా లని అప్పట్లోనే డిమాండ్ చేసినవారూ లేకపోలేదు. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత ఆరెస్సెస్ అధికారిక పత్రిక ‘ఆర్గనైజర్’ దానిపై సంపాదకీయాన్ని రాసింది. ప్రాచీన భారతీయ న్యాయ సంప్రదాయాలను ముఖ్యంగా మను స్మృతిని రాజ్యాంగం విస్మరించడం పట్ల విచారాన్ని వ్యక్తం చేసింది. ఈ రకమైన అభ్యంతరాలను లెక్కచేయకుండా ప్రజా స్వామ్యం, పౌరహక్కులు, సర్వమానవ సమానత్వాలు పునాదు లుగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయినా సరే మారువేషాలతో ఏమార్చడానికి మనువాదం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నది. ఇప్పుడది మతం ముసుగేసుకొని ముందుకొస్తున్నది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్యన ముగ్గురు పిల్లల్ని కంటే ముప్ఫై వేలిస్తా, నలుగుర్ని కంటే నలభై వేలిస్తా అని చాటింపు వేస్తున్నారు. దీనిపై పౌర సమాజం తీవ్రంగా విమర్శలు గుప్పించింది. ఈ సహేతుకమైన విమర్శల్లో ఎక్కువ భాగం ఆర్థికపరమైనవి. మహిళా సాధికారత కోణంలో ముందుకొచ్చిన ఒక విమర్శ ఆలోచించదగ్గది. మహిళల్ని కేవలం పిల్లల్ని కనే యంత్రాలుగానే చంద్రబాబు పరిగణిస్తున్నారా అని కొందరు ప్రశ్నించారు. పనిచేసే వయసులో ఉన్న మహిళలు పదిహేనేళ్ల కాలాన్ని నలుగురు పిల్లల్ని కనడం వారిని పెంచడం కోసమే అంకితం చేయాలనడం ఎంతవరకు సమంజసం? మహిళా సాధికారత పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఒక పదేళ్లు వెనక్కి వెళితే మహిళల పట్ల బాబు వైఖరేమిటో స్పష్టం చేసే ఉదాహరణ మనకు దొరుకుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన చేసిన ఒక వ్యాఖ్య అప్పట్లో కలకలం సృష్టించింది. ‘‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’’ అని ఆయన మాట్లాడారు. ఆడపిల్లతో పోల్చితే మగ పిల్లాడిని కోరుకోవడమే సహజమన్న భావన ఆయన వ్యాఖ్యల్లో ధ్వనించింది. నాటి అభిప్రాయానికి కొనసాగింపుగానే నేడు పిల్లల్ని కని పెంచే యంత్రాలుగా మహిళల్ని పరిగణించడమని అర్థం చేసుకోవాలి. ఓట్ల కోసం మహిళలందరికీ ‘ఆడబిడ్డ నిధి’ పథకాన్ని అమలు చేస్తానని చెప్పి, గెలిచిన తర్వాత తూచ్ అనడం కూడా మహిళా చైతన్యం పట్ల ఆయనకున్న చిన్న చూపునకు నిదర్శనం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించినట్టు చేసి ఇప్పుడా సంస్థనే ప్రైవేట్ వాళ్లకు కట్టబెట్టే పనిలో ఉన్నారు.మహిళల విషయం మాత్రమే కాదు. దళితుల విషయంలోనూ, బలహీన వర్గాల ప్రజల విషయంలోనూ చంద్రబాబుదీ, ఆయన పార్టీదీ, కూటమిదీ అదే ధోరణి. ‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని బహిరంగంగానే నాడు ప్రశ్నించారు. నిచ్చెనమెట్ల హిందూ సమాజంలో చివరి మెట్టుమీద దళితులు ఉంటారనీ అలా ఉండాలనే మనువాద మనోగతం వల్లనే ఆయనావిధంగా మాట్లాడగలిగారు. ఆయన పార్టీ నేత లదీ, కూటమిలోని ఇతర నేతలదీ అదే అభిప్రాయం. దెందు లూరు ఎమ్మెల్యే అప్పట్లో ఒక బహిరంగ సభ వేదికపై నుంచే ‘మీరంతా దళితులు, మీకెందుకురా రాజకీయాలు, అవన్నీ మేం చూసుకుంటాం’’ అన్న మాటల్ని కూడా మరోసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు బీజేపీలో ఉన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ‘దళితులు శుభ్రంగా ఉండరు, స్నానం చేయ’రంటూ ఈసడించుకోవడాన్ని కూడా చూశాము.ఇప్పుడీ ధోరణి మరింత ప్రమాదకరమైన మలుపులు తీసుకుంటున్నది. సామాజిక అశాంతిని సృష్టించడానికి సన్నద్ధ మవుతున్నది. దళితులపై క్రైస్తవులనే ముద్రవేసి వారిని వేటాడే పనిలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్టంరాజు నిమగ్న మయ్యారు. టీడీపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీతో పాటు కూటమి పార్టీల నేతలనుద్దేశించి ఆయన మాట్లా డిన ఆడియోలు బయటకొచ్చాయి. ‘‘ఎన్నికల్లో పోటీ చేయాలను కుంటున్న దళితులను ఓ కంట కనిపెట్టండి. వాళ్లు చర్చికి వెళ్తు న్నారా, దేవాలయాలకు వెళ్తున్నారా తెలుసుకునేందుకు నిఘా పెట్టండి. వాళ్ల తల్లిదండ్రులు చనిపోతే అంత్యక్రియలు ఏ పద్ధతిలో జరిగాయో శ్మశానాల దగ్గరికి వెళ్లి తెలుసుకోండి. వారి వివాహాలు ఏ పద్ధతిలో జరిగాయో తెలుసుకోండి...’’ ఇలా సాగుతున్నాయి ఆయన ప్రబోధాలు.ఈ రకమైన నిఘా, వారి జీవితాల్లోకి తొంగిచూడటం, వారు స్వేచ్ఛగా జీవించే హక్కును హరించడం కిందకే వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కోటిమందికి పైగా ఉన్న దళితులను రెండో తరగతి పౌరులకింద జమకట్టే ధోరణిగా దీన్ని భావించవలసి ఉంటుంది. మొత్తం దళిత సమాజమే తీవ్రమైన అశాంతికి లోనయ్యే పరిస్థితిని కూటమి కల్పిస్తున్నది. రఘరామ కృష్ణంరాజు తన అభిప్రాయాలను బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఈ ధోరణికి మాట మాత్రంగానైనా అడ్డు చెప్పే ప్రయత్నం ఏ కూటమినేతా ఇంతవరకూ చేయలేదు. దళితులు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ లుగా ప్రయోజనం పొందుతున్నారనేది రఘురామకృష్ణంరాజు అభియోగం. అందుకు వీల్లేదని చింతాడ ఆనంద్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పును ఆయన ఉదహరిస్తున్నారు. చింతాడ ఆనంద్ కులపరంగా దళిత వర్గానికి చెందినవాడు. క్రైస్తవం స్వీకరించి పాస్టర్గా మారాడు. అగ్రకులానికి చెందిన వారు ఆయన్ను కులం పేరుతో దూషించి దౌర్జన్యం చేశారని అత్యాచార నిరోధకచట్టం కింద కేసు పెట్టాడు. ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను ఉటంకిస్తూ క్రైస్తవ మతంలోకి మారినందువలన అత్యాచార నిరోధక చట్టం ఆనంద్కు వర్తించదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది పూర్తిగా టెక్నికల్ తీర్పు. తన నివాస ప్రాంతంలో ఆనంద్ కులపరంగానే గుర్తింపు పొందుతున్నప్పటికీ, కులపరంగానే దూషణకు, దౌర్జ న్యానికి గురైనప్పటికీ, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆయన మతాన్నే సుప్రీంకోర్టు గమనంలోకి తీసుకున్నది. ఆయన సామాజిక గుర్తింపును నిరాకరించింది.ఈ తీర్పును ఆధారం చేసుకొనే దళితల వేట కోసం రఘు రామ టాస్క్ఫోర్స్ ప్రారంభమైంది. చర్చిలో ప్రార్థనలు చేసే వారందరినీ ఈ టాస్క్ఫోర్స్ క్రైస్తవుల జాబితాలో వేస్తుందన్న మాట! దళితులు అత్యధిక సంఖ్యలో చర్చికి వెళ్తున్న మాట వాస్తవమే. ఇందులో దాపరికం ఏమీలేదు. అందుకు కారణాన్ని కూడా వారు చెబుతున్నారు. హిందూ సమాజంలోని పెత్తందారీ శక్తులు దళితులకు ఆలయ ప్రవేశాన్ని నిరాకరించిన రోజుల్లో బ్రిటిష్ వాళ్లు పెట్టిన చర్చిలు వారికి స్వాగతం పలికాయి. ఆత్మ గౌరవం కోసం, ఆరాధన కోసం వారు అక్కడకు వెళ్లడం ప్రారంభించారు. అది సంప్రదాయంగా నేటికీ కొనసాగుతున్నది. అయినా హిందూ సమాజ స్రవంతిలో ఉన్నవాళ్లు చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తే చర్చికి లేని అభ్యంతరం హిందూత్వ టాస్క్ ఫోర్స్లకు ఎందుకు? హిందూ సమాజాంలో కొన్ని లక్షలమంది షిర్డీ సాయి మందిరాలకు వెళ్తారు. వాళ్ల మీద కూడా ఆంక్షలు పెట్టే ఆలోచన వుందా? సాయిబాబా హిందువు కాదు మరి!పెళ్లి, చావు వంటి సందర్భాల సంగతి కూడా అంతే! హిందూ పద్ధతిలో నిర్వహించడానికి ఆనాడు అయ్యవార్లు మా వాడలకు రాలేదు, ఆత్మగౌరవం కోసం ప్రత్యామ్నాయాన్ని ఆశ్రయించాము, అదే ఇప్పుడొక సంప్రదాయంగా స్థిరపడిందని దళితులు చెబుతున్నారు. హిందువుల్లో మంగళసూత్రధారణ జరిగితేనే, జీలకర్ర బెల్లం పెడితేనే పెళ్లి. లేకుంటే కాదా? ఐదారు దశాబ్దాల కింద ఆంధ్ర ప్రాంతంలో హేతువాద, కమ్యూనిస్టు ఉద్యమాలు బలంగా ఉన్న రోజుల్లో కొన్నివేల స్టేజీ పెళ్లిళ్లు జరి గాయి. వాటిలో మంగళసూత్రధారణ లేదు, బ్రాహ్మణ పండి తుడూ లేడు. ఇప్పుడా పెళ్లిళ్లన్నింటినీ రద్దు చేద్దామా? మరణా నంతరం జరిగే అంత్యక్రియల్లో హిందూ సమాజంగా గుర్తించే వాళ్లలోనే అనేక తేడాలున్నాయి. శవాన్ని పూడ్చి పెట్టినవాళ్లంతా క్రైస్తవులే అనే ముద్రను ఎట్లా వేస్తారు?చర్చికి వెళ్లే వాళ్లందరి మీదా క్రైస్తవ ముద్ర వేయడం ఒక అంశం. అంతకంటే ముఖ్యమైన విషయం క్రైస్తవ మతం స్వీకరించిన దళితుల ఎస్సీ హోదాను ఎందుకు కోల్పోవాలి అన్నది. రిజర్వేషన్ల విషయంపై స్పష్టత కోసం 1950లో జారీచేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో బౌద్ధంలోకి, సిక్కు మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా ఉంటుంది. కానీ, క్రైస్తవంలోకీ, ఇస్లామ్లోకీ మారిన వారికి ఈ హోదా రద్దవుతుందని ఉన్నది. దీని ఆధారంగానే ఆనంద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ మతాల్లో అంటరానితనం లేదు కనుక, అందులోకి మారిన వెంటనే వారి సామాజిక హోదా మాయమైపోతుందన్న అంచనాతో క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా ఇచ్చిన ఉత్తర్వులుగా వాటిని సామాజికవేత్తలు పరిగణిస్తున్నారు.మతం మారినా షెడ్యూల్డ్ తెగల వారికి ఈ ఉత్తర్వులు వర్తించవు. వారి ఎస్టీ హోదా కొనసాగుతుంది. అగ్రకులాల వారు ఎవరైనా క్రైస్తవం స్వీకరిస్తే, వారికి ఈడబ్లు్యఎస్ రిజర్వేషన్లకు అర్హత వుంటే ఆ సౌకర్యం నిక్షేపంగా కొనసాగుతుంది. దళితులపై మాత్రమే ఈ వివక్ష ఎందుకని ఆ వర్గాల వారితోపాటు పలువురు ఇతర మేధావులు కూడా ప్రశ్నిస్తు న్నారు. 2004లో ఏర్పడిన రంగనాథ్ మిశ్రా కమిషన్ క్రైస్తవ/ ఇస్లాం మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగించాలని చెప్పింది. ఆ కమిషన్ రిపోర్టు ఆమోదానికి నోచు కోలేదు. మతం మారిన దళితులను ఎస్సీలుగా గుర్తించాలని పలువురు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉన్నది.మతం మారినంత మాత్రాన పుట్టుకతో వచ్చే కులం పోదు అనేది ఒక వాస్తవికత. అంతరాలతో కూడిన హిందూ సమాజంలోనే అంతర్భాగంగా వారి జీవితం కొనసాగుతున్నది తప్ప, దాన్ని విడిచిపోయే పరిస్థితి ఉండదు. ఆ సమాజంలో చివరి మెట్టు మీద నిలబడినందున లభిస్తున్న అవమానాలను భరిస్తూ, అందాల్సిన అవకాశాలకు మాత్రం దళితులే ఎందుకు దూరం కావాలనే ప్రశ్న తలెత్తుతున్నది. దేశమంతటా ప్రకంపనలు సృష్టించిన కారంచేడు హత్యాకాండనే తీసుకుందాము. దళితులు మంచినీళ్లు తెచ్చుకునే చెరువులో అగ్రకులం వారు పశువుల్ని కడగడాన్ని ప్రశ్నించి ఎదురుతిరిగినందుకు ‘దళితులకు ఇంత ధైర్యమా’ అనే కావరంతో అగ్రకులం వాళ్లు దాడి చేశారు. తరిమి తరిమి వేటాడారు. ఎనిమిదిమంది చనిపోయారు.చనిపోయిన వారిలో అబ్రహం, మోషా, యేషువా, వందనం వంటి క్రైస్తవ పేర్లున్నాయి. పశువులు కడగడాన్ని ప్రశ్నించిన మహిళ పేరు సువార్త. వీరికి క్రైస్తవ పేర్లున్నాయి కాబట్టి వీరి సామాజిక హోదా మారినందున తాము దాడి చేయ లేమని కులోన్మాదులు వెనక్కు పోలేదు. దళితులుగానే పరిగణించి వేటాడారు. మతం మారినా దళితుల సామాజిక హోదా మారలేదు అనడానికి ఇటువంటి ఉదాహరణలు చాలా ఉంటాయి. ఈ అంశంపై ఇంకా సుప్రీం తుదితీర్పు రావలసే ఉంది. కేంద్రం నియమించిన బాలకృష్ణన్ కమిషన్ నివేదిక అందవలసే ఉన్నది. ఈలోగానే ఆనంద్ కేసులో వచ్చిన తీర్పును ఆయుధంగా చేసుకొని కోటిమందిని భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమానికి కూటమి శ్రీకారం చుట్టింది. ఈ అంశమే కాదు, తిరుమల లడ్డూ వివాదం దగ్గర్నుంచి కడపలోని టిప్పు సుల్తాన్ సర్కిల్ దాకా సాంఘిక విభజనను సృష్టించి మెజారిటీ ప్రజల మనసుల్లో విషబీజాలు నాటడానికి ఈ నయా మనువాద కూటమి ప్రమాదకర క్రీడకు తెరతీసింది. ఈరోజు (శనివారం) సైతం చంద్రబాబు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ హిందూ ధర్మంపై, దేవాలయాలపై దాడులు చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షాన్ని ఆడిపోసుకున్నారు. ఈ దాడులు ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఎవరు చేశారు... రుజువులేమిటి అన్న దానితో పనిలేదు. ఒకటికి వందసార్లు చెప్పాలి. జనం పుర్రెల్లోకి కిర్రెక్కించాలి. విభజించి పాలించాలి... ఇదే ఎజెండా!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
బాబుకు షాక్ ఇచ్చిన కాపులు.. చైతన్య యాత్రకు సిద్ధం
-
డల్లాస్ టెక్నాలజీస్ అంటే ఎంత ప్రేమో!
సాక్షి, అమరావతి: 2016లో ఆ సంస్థకు భూమి కేటాయించారు.. కార్యకలాపాలు ప్రారంభించడానికి నాలుగుసార్లు అదనపు సమయం ఇచ్చారు.. అయినా ఇంతవరకు ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించలేదు. కానీ, ఈ సంస్థకు ఇప్పుడు కారుచౌకగా, సెట్బ్యాక్ నిబంధనలను సడలిస్తూ మరీ అదనపు భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ‘వడ్డించే వాడు మనోడైతే..’ అన్నట్లుగా ప్రభుత్వంలో కీలక వ్యక్తికి చెందిన అనుచరుడి సంస్థ కావడంతో ఈ సంస్థకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఆ సంస్థే డల్లాస్ టెక్నాలజీస్ సెంటర్.ఇందులో డైరెక్టర్గా ఉన్న కిలారు సునీల్ రాష్ట్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న వ్యక్తికి అత్యంత సన్నిహితుడు కావడంతో నిబంధనలను సడలిస్తూ విశాఖ మధురవాడ హిల్నెంబర్–2లో కేటాయింపులు మీద కేటాయింపులు చకచకా జరిగిపోతున్నాయి. తొలిసారిగా 2016లో 7,774.90 చ.మీ. స్థలాన్ని పొందిన డల్లాస్ టెక్నాలజీస్.. ఇంతవరకు ఐటీ క్యాంపస్ నిర్మాణం పూర్తిచేయలేకపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు గడువు పొడిగిస్తూ వచ్చారు. ఇలాంటి కంపెనీకి ఇప్పుడు అదనంగా చ.మీ. రూ.10,000 చొప్పున మరో 2,270.88 చ.మీ. భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో అధికారులు విస్తుపోతున్నారు. పైగా.. సెట్బ్యాక్ నిబంధనలు కూడా సడలిస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ ఉత్తర్వులు జారీచేశారు. ఏపీఐఐసీ కాకుండా టీసీఎస్కు ‘కిలారు’ సెంటర్.. విశాఖలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుచేయడానికి ముందుకు రాగానే డల్లాస్ టెక్నాలజీ సెంటర్ను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవంబరు 30, 2024లో ఉత్తర్వులు జారీచేసింది. అప్పటికే ఏపీఐఐసీ మిలీనియం టవర్ పూర్తయి ఖాళీగా ఉన్నా దాన్ని కాదని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి చెందిన కార్యాలయాన్ని టీసీఎస్కు కేటాయించడంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో టీసీఎస్ వెనక్కి తగ్గడంతో ఏపీఐఐసీ మిలినీయం టవర్ను కేటాయించారు. అమెరికాలో ‘కిలారు’ అకృత్యాలు.. నిజానికి.. కిలారు సునీల్ అమెరికాలో 17 ఏళ్లలోపు చిన్నపిల్లలపై అత్యాచారం చేస్తూ అడ్డంగా దొరికిపోవడంతో టెక్సాస్ కోర్టు అతనికి నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.2.50 లక్షల (3,000 డాలర్లు) జరిమానా విధించింది. అక్కడి నుంచి స్వదేశానికి పారిపోయి వచ్చి న సునీల్ ప్రైమ్అజ్ పేరుతో ఐటీ సర్వీసుల రంగంలోకి ప్రవేశించారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే వ్యక్తికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందడమే కాకుండా నేరుగా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాల్లో అనేకసార్లు పాల్గొన్నారు.అయితే, 2015లో కిలారు సునీల్, జనార్థనరావు బొంపాడ, శ్రవణ్య నన్నపనేని, ప్రవీణ్ అట్లూరి, సునీత రుద్రరాజు, వీర్రాజు కాటంరెడ్డి భాగస్వాములుగా ఏర్పాటైన డల్లాస్ టెక్నాలజీ సెంటర్.. ఇలా ఏర్పాటైందో లేదో అలా 2016, సెపె్టంబరు 8న విశాఖపట్నం మధురవాడలోని హిల్ నెంబర్–2లో రూ.కోట్ల విలువైన భూమిని కేటాయించారు. ఇప్పుడు తాజాగా మరో0.56 ఎకరాలు అదనంగా కేటాయిస్తూ ప్రభుత్వం తన ఉదారతను చాటుకుంది. -
ఈ ప్రశ్నలకు బదులేదీ?
సాక్షి, అమరావతి : చంద్రబాబు కూటమి ప్రభుత్వం తీరుతో రాష్ట్రం ఓ వైపు అప్పుల ఊబిలో కూరుకుపోతుండగా, మరోవైపు కీలక రంగాలన్నీ తిరోగమనంలో పయనిస్తున్నాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలేవీ అమలు చేయకుండానే, చేసేశామని.. రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కో డప్పు కొట్టుకుంటోంది. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా, చంద్రబాబు తన స్కాముల కోసం రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ చెప్పిన మాటలు దొంగ మాటలని తేలాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ రంగాల వారీగా ఆధారాలు చూపిస్తూ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తూ నిలదీశారు.ఒక్కటంటే ఒక్క ప్రశ్నకు చంద్రబాబు కానీ, ఆయన మంత్రులు కానీ స్పష్టంగా సమాధానం ఇచ్చిన పాపాన పోలేదు. అడ్డగోలు వాదనతో దూషిస్తూ, దుర్భాషలాడుతూ ఎదురు దాడికి దిగారు. మొదటి నుంచీ రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు ఆద్యులెవరన్న ప్రశ్నకు సమాధానం లేదు. వైఎస్ రాజారెడ్డిని హత్య చేసిన వారికి హైదరాబాద్లో ఇదే టీడీపీ కార్యాలయంలో షెల్టర్ ఇచ్చిందెవరన్న ప్రశ్నపై నోరు విప్పితే ఒట్టు. రాజధానిలో చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా ఎందుకు వెచ్చిస్తున్నారో సమాధానం చెప్పలేదు. ఇంటీరియర్, తదితర సౌకర్యాలను కలిపితే చదరపు అడుగు రూ.30 వేలు దాటిపోవచ్చు. అయినా కమీషన్ల కోసం సమర్థింపే కనిపిస్తోంది తప్ప.. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నామనే భీతి ఇసుమంతైనా లేదు.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగులు సైతం ఇక్కట్లు పడుతున్నారు. పీఆర్సీ లేదు.. నాలుగు డీఏలు లేవు. దాదాపు రూ.35 వేల కోట్ల బకాయిలున్నాయి. వీటన్నింటిపై చంద్రబాబు కూటమి నుంచి సమాధానమేలేదు. కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) గణాంకాలు చూపి ప్రశ్నించినా స్పందనే ఉండదు. పైగా వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ డైవర్షన్ రాజకీయం చేయడం మాత్రమే కనిపిస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రజల్లో తీవ్ర చర్చే లేవనెత్తాయి. ఈ సందర్భంగా వాటిలో కొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి. బాబూ.. సమాధానం చెప్పండి⇒ రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చేస్తుండటం నిజం కాదా? ⇒ మీ స్కామ్ల కోసం చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా వెచ్చిస్తుండటం నిజం కాదా?⇒ స్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, లిఫ్ట్లు, ఏసీలు, ఎలక్ట్రికల్, ఫ్లంబింగ్, అద్దాల ఫిటింగ్, డిజైన్ తదితర పేర్లతో అదే కాంట్రాక్టర్లకు అన్ని పనులు అప్పగిస్తూ విచ్చలవిడిగా దోపిడీ చేస్తుండటం వాస్తవం కాదా? ⇒ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహా నగరాల్లో కూడా 5 స్టార్ సదుపాయాలతో కలిపి ఎస్ఎఫ్టీ నిర్మాణ వ్యయం రూ.4,500 దాటక పోవడం నిజం కాదా?⇒ దేశంలో హైవేల నిర్మాణానికి కిలోమీటరుకు సగటున రూ.24 కోట్లు ఖర్చవుతుందని కేంద్రం చెబుతుంటే.. అమరావతిలో మాత్రం కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి రూ.53 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నట్లు? ⇒ ఈ లెక్కన అమరావతి ఎలా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అవుతుంది? అలా అంటూనే రాజధాని కోసం రూ.47,387 కోట్ల అప్పులు చేయడం, బడ్జెట్ నుంచి మరో రూ.9,200 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చూపించడం నిజం కాదా? ఏడు బిల్డింగులకు రూ.14,092 కోట్లు ఖర్చు చేస్తుండటం నిజం కాదా?⇒ రాజధానిలో మీ (చంద్రబాబు) మనుషులు ఏబీఎన్ రాధాకృష్ణ, అశ్వినీదత్, బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్ వంటి వారితో పాటు మీ బినామీలకు రోడ్ల పక్కన, సామాన్య రైతులకు చెరువులు, వాగులు, కుంటల్లో ప్లాట్లు ఇవ్వడం నిజం కాదా?⇒ ఈ విషయాలపై నిలదీస్తే, ఇందుకు ప్రత్యామ్నాయంగా ‘మావిగన్’ను సూచిస్తే మీకు (చంద్రబాబు) బీపీ పెరిగి మీ మంత్రులతో బూతులు తిట్టిస్తుండటం వాస్తవం కాదా?⇒ కడపలో మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యకు గురైతే.. ఆ కేసును పూర్తిగా ట్విస్ట్ చేసి మా పార్టీపైనే బురద జల్లుతోందెవరు?⇒ మా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా? ఆ కేసులో దోషులను హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉంచి కాపాడలేదా?⇒ మా నాన్నను ‘నువ్వు అసెంబ్లీ సమావేశానికి ఎలా వస్తావో నేనూ చూస్తా’ అని మీరు (చంద్రబాబు) బెదిరించడం.. ఆ మాటలన్న 2ృ3 రోజులకు నాన్న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం నిజం కాదా? ⇒ మా చిన్నాన్న వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా?⇒ మా చిన్నాన్నను చంపిన వ్యక్తి ఈరోజు స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతుండటం నిజం కాదా? మీ (చంద్రబాబు) లాయర్ సిద్దార్థ లూథ్రానే దస్తగిరి తరఫున కూడా లాయర్గా వాదిస్తుండటం వాస్తవం కాదా? ⇒ చంద్రబాబు బావమరిది, ఆయన వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపా.. టపా.. అని ఇద్దరిని కాల్చిపడేయ లేదా? ⇒ ఆ తర్వాత సాక్షులు ఉండకూడదన్న ఆలోచనతో ఇంట్లోని వాచ్మెన్ను ఘటన జరిగిన కొద్ది రోజులకే బండరాయితో మోది చంపలేదా?⇒ ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ యాక్సిడెంట్లో చనిపోతే.. ఇంట్లో శవాన్ని పెట్టుకొని కేటీఆర్తో పొత్తుల కోసం మాట్లాడింది చంద్రబాబు కాదా? ⇒ సొంత మామను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, పార్టీని, చివరికి గుర్తును కూడా లాక్కొన్నదెవరు?⇒ వంగవీటి మోహన్ రంగా హత్యలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపుతుండటం నిజం కాదా?⇒ మల్లెల బాబ్జి ఎందుకు లాడ్జిలో శవంగా మారాడు? అక్కడ దొరికిన నోట్లో ఏముంది? ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయలేదు? ⇒ జర్నలిస్ట్ పింగళి దశరథరామ్ను చంపిందెవరు? ⇒ 2015లో పెట్రోల్పై 31 శాతం వ్యాట్, డీజిల్పై 22.5 శాతం వ్యాట్ విధించింది మీరు కాదా?⇒ మీ కాంట్రాక్టర్లకు రిటైల్ బంకుల్లో తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ ఇవ్వాలంటూ ఆయిల్ కంపెనీలకు లేఖలు రాసిందెవరు?⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవన్ సహా 143 హామీలు అమలు చేయకుండా మోసం చేసిందెవరు?⇒ అప్పుడు సంపద సృష్టిస్తానని చెప్పి.. ఇప్పుడు సంతానమే సంపద అంటున్నది మీరు కాదా?⇒ మహిళలను పిల్లలను పుట్టించే యంత్రాలుగా చూస్తూ, ముగ్గురిని కంటే రూ.30 వేలు.. నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తామని ఒత్తిడి చేస్తున్నదెవరు?⇒ 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛన్.. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, కొత్త పింఛన్లు ఎంత మందికి ఇచ్చారు?⇒ రైతులకు ఉచిత పంటల బీమా, క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ ఎగ్గొట్టిందెవరు? ఆర్బీకేలు నిర్వీర్యం చేసిందెవరు? ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర లేకున్నా పట్టించుకోనిదెవరు? ⇒ విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.9,728 కోట్లు ఇవ్వాలనడం నిజం కాదా? ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నదెవరు?⇒ రాష్ట్రంలో సోషల్ మీడియా సెన్సార్షిప్ కొనసాగుతుండటం నిజం కాదా? ⇒ మీకు (చంద్రబాబుకు) వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు పెట్టిస్తుండటం వాస్తవం కాదా? ⇒ రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ విక్రయాలు సాగుతుండటం నిజం కాదా? ⇒ ఓ వైపు పొదుపు చర్యలు అంటూ చంద్రబాబు, ఆయన కొడుకు, దత్తపుత్రుడులు వేర్వేరుగా ప్రైవేట్ చాపర్లో తిరుగుతుండటం నిజం కాదా? -
కార్డు మిష.. కోతలే లక్ష్యం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల అర్థాలు వేరు అంటూ ఉంటారు చాలామంది. చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అన్నది ఆయనగారి నైజమన్న విమర్శలూ లేకపోలేదు. ‘‘అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించాలి’’ అని ఆయన ఈ మధ్య తరచూ చెబుతూ వస్తున్నారు. దీంట్లో తప్పేముంది? అని ఎవరికైనా అనిపిస్తుంది కానీ.. ఆయనను ఫాలో అయ్యేవారికి, సీనియర్ అధికారులకు మాత్రం అందులోని మతలబు ఏమిటో స్పష్టంగా తెలుసు.అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించేందుకు ఫ్యామిలీ కార్డులు మంజూరు చేయాలని చంద్రబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించి ఫ్యామిలీ కార్డే ప్రామాణికంగా స్కీములు అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఇది పైపైకి బాగానే అనిపిస్తున్నా మీడియా కథనాలను పరిశీలిస్తే మాత్రం... లబ్ధిదారులకు కోతపెట్టే ప్రమాదాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. అర్హత అన్న పదంలోనూ రాజకీయం చేస్తున్నారన్నమాట. తమది పొలిటికల్ గవర్నెన్స్ అని రాజ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, వైసీపీకి ఓటు వేస్తారు అనుకున్నవారికి స్కీములలో కోత పెట్టే ఆలోచన చేస్తున్నారని జనసామాన్యం అనుకుంటోంది. ప్రభుత్వం పనితీరుపై అభిప్రాయ సేకరణ అంటూ చేస్తున్న సర్వేల ద్వారా ఈ ప్రయోగం జరుగుతోందని కొందరు అంటున్నారు.ప్రభుత్వ సరళి బాగోలేదన్న వారిని, సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా గుర్తించి వారిని బెదిరించడమో, లేక వారికి అందుతున్న స్కీములను కట్ చేయడమో చేసే పన్నాగం జరుగుతోందని కొంతమంది బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. రాజకీయ కోణం కాకుండా, బాగా సంపన్నులై ఉండి, ప్రభుత్వ స్కీమ్లను అన్యాయంగా తీసుకుంటుంటే వారిని తొలగించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కాని చెప్పేది ఒకటి, చేసేది మరొకటిగా ఉండే చంద్రబాబు ప్రభుత్వం విధానాల వల్ల ప్రజలలో అలజడి ఏర్పడుతోంది.చంద్రబాబు మాటల ప్రకారం... వ్యవసాయ భూమి ఉన్నా, మున్సిపాల్టీలో ఆస్తి కలిగి ఉన్నా, గ్రామాలలో రూ.200 కన్నా ఎక్కువ ఆస్తి పన్ను కడుతున్నా, ఏభై యూనిట్లకన్నా ఎక్కువ కరెంట్ వాడుతున్నా, పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నా, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నా, ప్రైవేటు ఉద్యోగిగా ఈపీఎఫ్ చెల్లిస్తున్నా..ఇలా పలు కండిషన్లు పెట్టి ఇవేవి ఉన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులే అని తేలుస్తారట. వాస్తవానికి ఈ షరతులు పేదల పొట్టకొట్టే అవకాశాలే ఎక్కువ.ఎన్టీఆర్ భరోసా కింద రూ.నాలుగు వేలు తీసుకుంటూ ఏ కుటుంబానికైనా మరో పథకం ఇవ్వరన్నమాట. ఇప్పటికే దీనికి సంబంధించి సర్వే చేశారట. దాని ప్రకారం ఆయా స్కీములకు ఏకంగా 94 శాతం మంది అనర్హులు అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 1.7 కోట్ల కుటుంబాలు ఉంటే, ఈ సర్వే ప్రకారం కేవలం 10.2 లక్షల కుటుంబాలే పేదవి. వీరికి మాత్రమే స్కీములు వస్తాయని చెప్పకపోయినా, అనర్హత పేరుతో ఎక్కువ మందికి పథకాలను రద్దు చేయవచ్చని భయపడుతున్నారు. ఏ కుటుంబానికి అయినా రూ. 48 వేలకు మించి ప్రయోజనం రాకుండా చూడాలన్నది వీరి ఉద్దేశం అని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో అర్థం అవుతున్నాయని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలు ఇష్టారాజ్యంగా బడా కాంట్రాక్టర్లకు పందేరం చేస్తున్న ప్రభుత్వం పేదల స్కీములపై ఇన్ని రకాల ఆంక్షలు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయా కుటుంబాలకు వివిద స్కీముల కింద అర్హత ఉంటే,అవన్ని ఇచ్చేవారు. తద్వారా కొన్ని కుటుంబాలకు ఏడాదికి లక్ష నుంచి లక్షన్నర వరకు లబ్ది పొందాయని అప్పట్లో వారే స్వయంగా చెప్పేవారు. పోనీ తన విధానం వేరని ఒక కుటుంబానికి ఒక పథకమే ఇస్తానని కాని, అర్హత ప్రమాణాలు నిర్ణయిస్తామని కాని ఎన్నికల సమయంలో చెప్పారా అంటే అదేమీ లేదు. ఆకాశమే హద్దుగా వాగ్ధానాలు చేశారు. ప్రజాగళం పేరుతో ఇచ్చిన మానిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీల గురించి ఏమి రాశారా అని పరిశీలిస్తే ఎక్కడా కండిషన్లు పెట్టలేదు. అర్హులకే ఈ స్కీములు ఇస్తామన్న మాట కూడా చెప్పలేదు. ఎన్నికల ప్రచార సభలలో కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికి స్కీముల ప్రయోజనాలు దక్కుతాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లు పదే, పదే చెప్పేవారు. ఉదాహరణకు ఆడబిడ్డ నిధి కింద 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ఉన్న మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని, ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటే మూడువేలు, ముగ్గురు ఉంటే 4500, నలుగురు ఉంటే ఆరు వేలు అంటూ వేలంపాట మాదిరి చంద్రబాబు పాడేవారు. ఇప్పుడేమో ఆ పథకాన్నే ఎగవేస్తున్నారు.అది ఇవ్వకపోగా ఇస్తున్న అరకొర స్కీములలో కోత పెట్టాలని ప్రయత్నాలు ఆరంభించారు. జగన్ ప్రభుత్వం కుటుంబంలోని ఒక విద్యార్ధికి పదిహేను వేలు ఇస్తుంటే, తాము అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్దికి రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. ఆ సందర్భంలో ఎక్కడా అర్హత ప్రస్తావనే తేలేదు. ఇప్పుడు వీటిని ఫ్యామిలీ కార్డు ఆధారంగా ఏమైనా తగ్గిస్తారేమో చూడాల్సి ఉంటుంది. బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ అని అన్నా, మూడువేల నిరుద్యోగ భృతి అని ప్రచారం చేసినా ఎక్కడా కండిషన్లు ఉంటాయని పేర్కొనలేదు. బహుశా ఎలాగూ వాటిని ఇచ్చేది లేదులే అని ముందుగానే అనుకుని మానిఫెస్టోలో పెట్టి ఉండాలి. వలంటీర్లకు జగన్ రూ.ఐదు వేలే ఇస్తున్నారని, తాము రూ.పది వేలు ఇస్తామని చెప్పి అసలు ఉద్యోగానికే ఎసరు పెట్టారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలాగే చేస్తుంటారు. 1996 ఎన్నికలకు ముందు, తాను ఎన్టీఆర్ కన్నా గట్టిగా మద్య నిషేధం అమలు చేస్తానని, రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం కొనసాగిస్తామని హామీలు ఇచ్చారు. ఎన్నికలు అయిపోయాక మాట మార్చి మద్య నిషేధం ఎత్తివేశారు. సబ్సిడీ బియ్యం రేటు పెంచారు. 2014 టర్మ్లో రైతుల రుణాలు ఎంత ఉంటే అంత మాఫీ చేస్తామని ఊరించారు. తీరా అధికారం వచ్చాక అరొకర చేసి ఆశకు కూడా హద్దు ఉండాలని ఎద్దేవా చేశారు. అదే విపక్షంలో ఉంటే మాత్రం తెలుగుదేశం ధోరణి మరో రకంగా ఉంటుంది. ఉదాహరణకు నేదురుమల్లి జనార్ధనరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అనర్హుల రేషన్ కార్డులు తొలగించే కార్యక్రమం చేపడితే నానా రచ్చ చేసిన టీడీపీ, జగన్ ప్రభుత్వంపై కూడా పలు అబద్దాలు సృష్టించి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ కార్డు పేరుతో సంక్షేమ స్కీముల లబ్దిదారుల కోత పెట్టడం ఆరంబిస్తే చంద్రబాబు ప్రభుత్వం తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అవుతుందేమో! - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అమరావతిలో బాబు లూటీ
సాక్షి, అమరావతి: అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ ఇంత వరకు చంద్రబాబు చెప్పిన మాటలన్నీ దొంగ మాటలని తేలిపోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ‘ఇప్పటికే అమరావతి పేరుతో రూ.47,387 కోట్లు అప్పు చేశారు. రాష్ట్ర ఖజానా నుంచి మరో రూ.9,200 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. అమరావతిలో స్కాముల కోసం ఎందుకయ్యా రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నావని ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ (రక్తపోటు) పెరుగుతోంది’ అంటూ మండిపడ్డారు. లక్ష ఎకరాల అమరావతిలో కేవలం రోడ్లు, నీళ్లు, కరెంటు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకే రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాదని తెలిసి కూడా, చంద్రబాబు తన స్కాముల కోసం రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఆచరణాత్మకంగా (మోస్ట్ ప్రాక్టికల్) మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు వరకు 110 కిలోమీటర్ల హైవేకు ఇరువైపుల రాజధాని కారిడార్గా పెట్టాలని మావిగన్ను ప్రతిపాదించామని స్పష్టం చేశారు. ‘అమరావతి అయితే సున్నా (జీరో) నుంచి మొదలు పెట్టాలి. అదే మావిగన్ అయితే మొదటి రోజు నుంచే ఫలితాలు వస్తాయని చెప్పాం. మేము ప్రతిపాదించిన మావిగన్కు ప్రజల్లో మద్దతు పెరిగే సరికి.. ప్రజలందరూ ఇదే కరెక్టని, చంద్రబాబు స్కాముల కోసం రాష్ట్రాన్ని ఇబ్బందులపాలు చేయడం ధర్మం కాదంటుంటే.. సమాధానం చెప్పలేక, తట్టుకోలేక ఆక్రోశంతో బీపీ పెరిగి నోటికొచి్చనట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు, ఆయన మంత్రులతో సహా అబద్ధాలాడుతూ, బూతులు తిట్టిస్తున్నారు. మీడియా ప్రతినిధులు ఎప్పుడైనా చంద్రబాబును మావిగన్పై స్పందన కోరండి.. గుండె ఆగిపోకపోతే అదృష్టం. వెంటనే మిమ్మల్ని తిట్టకపోతే.. మీపై బ్లాస్ట్ కాకపోతే చూడండి’ అని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. అమరావతిలోని కొత్త సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, రోడ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లు, అంచనా వ్యయం పెంపు, అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించడం.. తద్వారా చోటుచేసుకున్న భారీ స్కామ్లను సాక్ష్యాధారాలతో సహా వివరించారు. స్కాముల కోసం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్న సీఎం చంద్రబాబు తీరును కడిగి పారేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ‘ప్రజలు తమ బతుకు బండిని నడపడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ప్రజల బాగోగులను గాలికి వదిలేసి ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచి.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దారుణమైన అవినీతి, దోపిడీ మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. ప్రశ్నించే గొంతును పాశవికంగా అణగదొక్కుతూ రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల గొంతు వినిపించడానికి వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు. ఈ కాలంలో ప్రజలకు చేసిన మంచి ఏమిటో చెప్పుకునే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కనిపిస్తోంది. రెండేళ్లుగా బాబు పరిపాలనలో తీరు ఇదే. ప్రతిసారి ప్రజలను వెన్నుపోటు పొడుసూ్తనే ఉన్నారు. విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోంది. వీటిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏ విషయంలోనైనా గట్టిగా ప్రశ్నిస్తే టాపిక్ను డైవర్ట్ చేసేందుకు వైఎస్సార్సీపీ, నాపై (జగన్పై) అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. రెండేళ్లుగా ఇదే స్క్రిప్టు, స్క్రీన్ ప్లే, సినిమా చూస్తున్నాం. ఈ మధ్య చంద్రబాబుకు పదేపదే రక్తపోటు (బీపీ) పెరుగుతోంది. పొరపాటున చంద్రబాబు నిద్రలో ఉండగా మావిగన్ అంటే చాలు గుండె ఆగిపోవచ్చు. మావిగన్ అంటే చాలు బాబుకు అంతగా బీపీ పెరుగుతోంది. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అనేది దొంగ మాటేచంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. చంద్రబాబు రాష్ట్రానికి ఎన్నటికీ రాజధాని లేకుండా చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా ఉండేలా వ్యవహరిస్తున్నారు. లక్షల ఎకరాల్లో అమరావతి నిర్మాణం పేరిట కేవలం రోడ్లు, డ్రెయినేజీలు, నీళ్లు, కరెంటు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికే రూ.2లక్షల కోట్లు ఖర్చవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాదని తెలిసీ చంద్రబాబు స్కాముల కోసం మాత్రమే రాజధాని అని భ్రమ కల్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ ఇంత వరకు చంద్రబాబు చెప్పిన మాటలు దొంగ మాటలుగా తేలిపోయాయి. ఇప్పటికే అమరావతికి తెచ్చిన, తెస్తున్న (కమిట్) అప్పులు రూ.47,387 కోట్లు. రాష్ట్ర ఖజానా నుంచి మరో రూ.9,200 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చూపిస్తున్నారు. స్కాముల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారని ప్రశ్నిస్తే బాబుకు రక్తపోటు (బీపీ) వస్తోంది.మావిగన్ అంటే ఉలికిపాటు.. రక్తపోటురాష్ట్రానికి ఆచరణాత్మకంగా (మోస్ట్ ప్రాక్టికల్), ఏపీ పరిస్థితులను పూర్తిగా మనస్సులో పెట్టుకుని మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు వరకు 110 కిలోమీటర్ల హైవేకు ఇరువైపుల రాజధాని కారిడార్గా పెట్టాలని మావిగన్ను ప్రతిపాదించాం. మచిలీపట్నం–విజయవాడ 70 కిలో మీటర్లు, విజయవాడ–గుంటూరు మరో 40 కిలో మీటర్లు హైవే వెంట అద్భుత రాజధాని అవుతుంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే వైఎస్సార్సీపీ హయంలో నిర్మాణం తలపెట్టిన పోర్టు శరవేగంగా నడుస్తోంది. విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయం కనిపిస్తోంది. 3 రైల్వే స్టేషన్లు, 4 జాతీయ రహదారులు కలుస్తున్నాయి. 9 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 35–40 లక్షల జనాభా ఉంది. అదే అమరావతి అయితే.. అంతా సున్నా (జీరో) నుంచి మొదలు పెట్టాలని చెప్పాం. మేము ప్రతిపాదించిన మావిగన్కు ప్రజల్లో మద్దతు పెరిగే సరికి తట్టుకోలేక, ఆక్రోశంతో బీపీ పెరిగి చంద్రబాబు, ఆయన మంత్రులు నోటికొచి్చనట్టు మాట్లాడుతున్నారు. ఏడు బిల్డింగులకు రూ.14,092 కోట్లుసెక్రటేరియట్ బిల్డింగ్లకు మాత్రమే రూ.10,665 కోట్లు అవుతుందా? ఏమిటీ దోపిడీ అని ఎవరైనా ప్రశ్నిస్తే బాబుకు బీపీ పెరుగుతుంది. ఇవి కాకుండా కొత్త అసెంబ్లీ కోసం 11.21 లక్షల ఎస్ఎఫ్టీలో నిర్మాణానికి రూ.1,947 కోట్ల ఖర్చు తేల్చారు. అంటే ఎస్ఎఫ్టీ రూ.17,356 పడింది. కొత్త హైకోర్టుకు 20.32 లక్షల ఎస్ఎఫ్టీలో పాక్షికంగా రూ.1,480 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇది పూర్తయ్యే సరికి ఏ స్థాయికి రేట్లు పెరుగుతాయో తెలీదు. ఇలా 5 సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు కలిపి.. ఏడు బిల్డింగుల కోసం ఏకంగా రూ.14,092 కోట్లు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ దోపిడీ చేస్తున్నారు. కి.మీ. రోడ్డు నిర్మాణానికి రూ.53 కోట్లా?అమరావతిలో వేసే రోడ్లలోనూ చంద్రబాబు భారీ స్కాములు కనిపిస్తున్నాయి. దేశంలో హైవేల నిర్మాణానికి కిలో మీటరుకు సగటున రూ.24 కోట్లు ఖర్చవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పార్లమెంట్కు ఈ ఏడాది ఫిబ్రవరి 5న లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. కానీ, అమరావతిలో కిలోమీటరు రోడ్డు నిర్మాణ ఖర్చు రూ.53 కోట్లు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్కు కిలోమీటరుకు రూ.69 కోట్లు ఖర్చయితే.. చంద్రబాబు అమరావతిలోని సీడ్ యాక్సెస్ నుంచి వారధి వద్ద కలిపే ఫ్లై ఓవర్కు కిలోమీటర్కు రూ.189 కోట్లు ఖర్చు చూపిస్తున్నారు.⇒ చంద్రబాబు రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారు. ⇒ ఆచరణ సాధ్యం కాదని తెలిసినా, చంద్రబాబు తన స్కాముల కోసం రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ చెప్పిన మాటలు దొంగ మాటలని తేలాయి.⇒ ప్రజలంతా మావిగన్కు మద్దతు పలుకుతుంటే తట్టుకోలేక, ఆక్రోశంతో బీపీ పెరిగి చంద్రబాబు.. తన మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారు⇒ గతంలో ఇచ్చిన టెండర్లు రద్దు చేసి, అదే కాంట్రాక్టర్లకు టైలర్ మేడ్ రిగ్గింగ్ పద్ధతుల్లో తిరిగి టెండర్లు కట్టబెట్టారు. అంతటితో ఆగకుండా స్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, లిఫ్టులు, ఏసీలు, ఎలక్ట్రికల్, ఫ్లంబింగ్, అద్దాల ఫిటింగ్, డిజైన్ తదితర రకరకాల పేర్లతో అదే కాంట్రాక్టర్లకు అన్ని పనులు అప్పగిస్తూ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా వెచ్చిస్తున్నారు. ⇒ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహా నగరాల్లో కూడా 5 స్టార్ సదుపాయాలతో కలిపి ఎస్ఎఫ్టీ నిర్మాణ వ్యయం రూ.4,500 దాటట్లేదు.⇒ అమరావతిలో వేసే రోడ్లలోనూ చంద్రబాబు భారీ స్కాములు కనిపిస్తున్నాయి. దేశంలో హైవేల నిర్మాణానికి కిలో మీటరుకు సగటున రూ.24 కోట్లు ఖర్చవుతుందని కేంద్రం చెబుతోంది. కానీ, అమరావతిలో మాత్రం కిలోమీటరు రోడ్డు నిర్మాణ ఖర్చు రూ.53 కోట్లు. ⇒ రాజధానిలో చంద్రబాబు తన మనుషులు ఏబీఎన్ రాధాకృష్ణకు, అశ్వినీదత్కు, బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్ వంటి వారితో పాటు తన బినామీలకు రోడ్ల పక్కన విలువైన రిటర్న్బుల్ ప్లాట్లు ఇస్తున్నారు. సామాన్య రైతులకు మాత్రం చెరువులు, వాగులు, కుంటల్లో ప్లాట్లు చూపిస్తున్నారు. ఇంత కంటే అన్యాయం ఉంటుందా? -వైఎస్ జగన్ అమరావతిలో ప్లాట్ల స్కామ్చంద్రబాబు తన మనుషులకు, ఏబీఎన్ రాధాకృష్ణకు, అశ్వినీదత్కు, బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్ వంటి వారితో పాటు తన బినావీులకు అమరావతిలోని రోడ్ల పక్కన విలువైన రిటర్న్బుల్ ప్లాట్లు ఇస్తున్నారు. సామాన్య రైతులకు చెరువులు, వాగులు, కుంటల్లో ప్లాట్లు చూపిస్తున్నారు. ఇంత కంటే అన్యాయం ఉంటుందా? తొలి దశలో తీసుకున్న 50 వేల ఎకరాలకు దిక్కులేదని రైతులు అంటుంటే.. ఇవి సరిపోవని మరో 50 వేల ఎకరాలు కావాలంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ, రైతులు ధర్నాలు చేస్తున్నా లెక్క చేయకుండా బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. మేం బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రశ్నిస్తూ, ఆధారాలతో సహా స్కాములను బయట పెడుతుంటే చంద్రబాబుకు బీపీ పెరుగుతోంది. అబద్ధాలు ప్రచారం చేస్తూ, కుట్రలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వాళ్లే బిల్డప్ ఇచ్చి.. ఒక కథ అల్లుతారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు ఒక పెద్ద మాఫియా ముఠా. వీళ్లు ఏమనుకుంటే దానిపై ఒక అబద్ధాన్ని సృష్టించి.. దొంగ సాక్ష్యాలతో వీళ్ల అధికారులతోనే కేసులు పెట్టిస్తున్నారు.ఆ అవినీతిని చూసి ఎవరైనా నివ్వెరపోవాల్సిందేవెలగపూడి ప్రాంతంలో ఇప్పటికే దాదాపు రూ.1,200 కోట్లతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు అందుబాటులో ఉన్నాయి. వీటిని పక్కన పెట్టి మళ్లీ కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టులకు బిల్డింగులు నిర్మిస్తున్నారు. దీనికి శాశ్వత సెక్రటేరియట్ అని కొత్తగా నామకరణం చేసి నిర్మిస్తున్న 5 బిల్డింగుల్లో చంద్రబాబు చేస్తున్న దోపిడీ చూస్తే ప్రజలంతా నివ్వెరపోతారు. 2018లో ఇవే ఐదు టవర్ల కోసం 52,20,496 ఎస్ఎఫ్టీ (చదరపు అడుగు) బిల్డప్ ఏరియాతో నిర్మాణాలకు రూ.2,271 కోట్లతో టెండర్లు ఖరారు చేసి పనులు అప్పగించారు. ఈ లెక్కన ఒక ఎస్ఎఫ్టీకి సుమారుగా రూ.4,350 అవుతుంది. ఇది 2018 రేట్ల ప్రకారం చాలా ఎక్కువ. కానీ, ఇవే బిల్డింగులకు గతంలో ఇచ్చిన పనుల టెండర్లను రద్దు చేసి, కొత్తగా మళ్లీ టెండర్లు పిలిచారు. ఇక్కడా గతంలో ఉన్న కాంట్రాక్టర్లే వచ్చారు. అవే కంపెనీలకు, అవే పనులు దక్కాయి. ఒక టైలర్ మేడ్ రిగ్గింగ్ పద్ధతిలో టెండర్లు ఈ కంపెనీలకు వచ్చేలా చేశారు. దీనిపై ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది.⇒ ఐదు బిల్డింగులకు సంబంధించి కేవలం స్ట్రక్చర్ కోసమే రూ.4,354 కోట్లకు కాంట్రాక్టు ఖరారు చేశారు. ఈ భవనాల ఆవరణలోనే డ్రెయినేజీ, నీళ్లు ఇతర మౌలిక సదుపాయాల కోసం మరో రూ.1,053 కోట్లు.. లిఫ్టులు, ఏసీ, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం మరో రూ.2,316 కోట్లకు టెండర్లు ఇచ్చారు. ఇక్కడితో ఆగకుండా బిల్డింగ్లకు అదనంగా అద్దాలు వేసేందుకు (గ్లాస్ ఫిట్టింగ్) రూ.2,540 కోట్లకు జీవోలు ఇచ్చారు. ఇవన్నీ పాత కాంట్రాక్టర్లకే దక్కాయి. ఒక్కోపనికి ఒక్కో కాంట్రాక్టర్ కాదు. అన్నీ వాళ్లకే ఇచ్చారు. ⇒ ఈ ఐదు బిల్డింగులకు డిజైన్ కోసం మరో రూ.401 కోట్లతో కలిపి మొత్తం రూ.10,665 కోట్లు ఖర్చు అవుతుంది. 52,20,496 ఎస్ఎఫ్టీ నిర్మాణానికి ఒక ఎస్ఎఫ్టీకి రూ.20,427 చొప్పున వ్యయం చేస్తున్నారు. ఫర్నీచర్, ఇంటీరియర్ సమకూర్చే సరికి ఎస్ఎఫ్టీకి రూ.30–40 వేలు అవుతుందేమో. ఇక్కడ భవనాల నిర్మాణానికి ఇసుక ఫ్రీ. పైగా ప్రభుత్వం జీఎస్టీ, ఎంఈఆర్ఐటీ, డీఎంఎఫ్, ఎన్ఏసీ చార్జీలు రీయింబర్స్ చేస్తోంది. వీటి మినహాయింపుల విలువ రూ.681 కోట్లు. ఈ మాదిరిగా లూటీ జరుగుతోంది.⇒ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహా నగరాల్లో కూడా 5 స్టార్ సదుపాయాలతో కలిపి ఎస్ఎఫ్టీ నిర్మాణ వ్యయం రూ.4,500 దాటట్లేదు. తెలంగాణలో కేసీఆర్ 28 ఎకరాల్లో సచివాలయం నిర్మించారు. దాదాపు 10 లక్షల చదరపు అడుగుల్లో రూ.615 కోట్లతో కట్టారు. అలా చూసినా ఎస్ఎఫ్టీకి రూ.6 వేలు పడింది. ఇక్కడ ఎస్ఎఫ్టీ రూ.20,420.. హంగులతో కలిపితే రూ.30–40 వేలు అవుతుందంటే ఎవరికైనా కళ్లు చెదురుతాయి.అవునయ్యా.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్!చంద్రబాబు, లోకేశ్కు వైఎస్ జగన్ గట్టి కౌంటర్రాష్ట్రంలో ఓ వైపు పాలన అత్యంత దారుణంగా ఉంటే చంద్రబాబు మరోవైపు తన కొడుకుతో ‘బోత్ ఆర్ నాట్ ది సేమ్’ అంటూ బహిరంగ సభల్లో బాలకృష్ణ డైలాగ్లు కొట్టిస్తున్నాడు’ అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. వీటికి బదులుగా ఆయన ‘అవునయ్యా.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్’ అంటూ మీడియా సమావేశంలో గట్టిగా కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ ఏమన్నారంటే..⇒ ప్రజలకు ద్రోహం చేయడం.. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం.. ప్రజలను వాడుకుని వదిలేయడం మీ క్యారెక్టర్.. ఆరు నూరైనా ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. ⇒ పనులు చేసి చూపించడం మా స్టయిల్.. పబ్లిసిటీ, క్రెడిట్ చోరీ చేయడం మీ స్టయిల్.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. ⇒ విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజల చెంతకే పాలన, గృహ నిర్మాణం, మహిళా సాధికారత, మహిళా రక్షణ, దిశా వంటి విప్లవాత్మక కార్యక్రమాలు మా చరిత్ర.. వీటన్నింటిని నాశనం చేయడం మీ చరిత్ర.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్.. ⇒ ఐదేళ్ల పాలనలో పారదర్శకంగా బటన్ నొక్కడం.. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాలకు రూ.2.73 లక్షల కోట్లు పంపించడం మా చరిత్ర.. రెండేళ్లయ్యేసరికి మేం చేసిన అప్పులకంటే ఎక్కువగా రూ.3.40 లక్షల కోట్ల అప్పులు చేయడం, మా హయాంలో చేసిన పథకాలన్నీ రద్దుచేయడం, సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలు బుట్టదాఖలు చేయడం మీ చరిత్ర.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్.. తెలుసుకో. -
అబ్బా కొడుకులిద్దరికి కలిపి చెప్తున్నా.. జగన్ స్ట్రాంగ్ రిప్లై
-
ఏపీలో కొండెక్కిన ధరలు.. సామాన్యుడి బతుకు బరువెక్కే!
-
ప్రొఫెసర్ రామచంద్రయ్య సంచలనాత్మక ఇంటర్వ్యూ
-
జగన్ ఖాతాలోయి తన ఖాతాలో వేసుకుంటున్న చంద్రబాబు
-
ఏపీలో గ్యాస్ కటకట సిలిండర్ కోసం కష్టాలు
-
చంద్రబాబు చేపల కూర తయారీపై కేకే రాజు చేసిన ఫన్నీ వ్యాఖ్యలు
-
బాదుడే.. బాదుడు.. 'ధరలు కొండెక్కి.. బతుకు బరువెక్కి'!
డీజిల్ ధరల పెంపు నిత్యావసర సరుకులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో పెరిగిన పెట్రో ధరలు నిత్యావసరాల రూపంలో ప్రజల్ని భయకంపితుల్ని చేస్తున్నాయి. వంట నూనెల నుంచి బియ్యం, పప్పుల వరకు ఏ ధర చూసినా కొండెక్కి కూర్చున్నాయి. ఈ తరుణంలో ‘గుక్కెడు గంజీ కరువైపోయె.. బక్కటి ప్రాణం బరువైపోయె’ అన్నట్టుగా తయారైంది రాష్ట్ర ప్రజల పరిస్థితి.సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. సామాన్యుల నెత్తిన నిప్పుల కుంపటిగా మారాయి. వంట నూనెలు, బియ్యం, పప్పులు, కూరగాయల ధరలు రోజురోజుకు ఎగబాకుతుండటంతో బడుగు జీవుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. డీజిల్ ధరల పెంపు ప్రభావం నిత్యావసర ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. అదుపు చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం పత్తా లేకుండాపోయింది. కనీసం నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేసే దిశగా ఒక్కసారి కూడా అధికారులతో సమీక్ష చేసిన దాఖలాలు లేవు. డీజిల్ ధరల పెంపు కారణంగా అన్నిరకాల నిత్యావసరాల ధరలు 15నుంచి 40 శాతం మేర పెరిగాయి. వంట నూనె ధరలైతే లీటర్కు రూ.200 పైగా ఎగబాకాయి. కూరగాయల ధరలు ఏది చూసినా కిలో రూ.50–రూ.60 దాటిపోయాయి. పప్పుల ధరలు సైతం 20–30 శాతం మేర పెరిగాయి. ధరల బాదుడికి సామాన్య ప్రజానీకం కుదేలవుతుంటే.. గ్యాస్, పెట్రోల్ సంక్షోభం పేదల జీవనాన్ని మరింత దిగజార్చింది. చంద్రబాబు అధికార పీఠమెక్కిన తర్వాత గ్యాస్ ధరలను దాదాపు మూడుసార్లు పెంచడం పేదలకు పెనుభారంగా మారింది. రోజువారీ పనులు లేకపోవడంతో పేదల చేతిలో చిల్లిగవ్వ లేక, పెరిగిన ధరలకు నిత్యావసర సరుకులు కొనలేని దౌర్భాగ్య స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నూనె ధరలు సలసలా రాష్ట్రంలో వంట నూనె ధరలు సెగ పుట్టిస్తున్నాయి. పామాయిల్, సన్ఫ్లవర్, వేరుశనగ నూనె ధరలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. గతంలో ఉక్రెయిన్ యుద్ధ సమయంలో నూనె ధరలు పెరగ్గా.. తాజాగా డీజిల్ ధరల పెంపు ప్రభావంతో మరోసారి ఎగబాకాయి. పామాయిల్పై 60 శాతం, సన్ఫ్లవర్ ఆయిల్పై 70 శాతం, వేరుశనగ నూనెపై 70 శాతం ధరలు పెరిగాయి. వీటితో పాటు ఆవనూనె, సోయ, వనస్పతి రేట్లు కూడా పెరిగిపోయాయి. 2024 మేలో వేరుశనగ నూనె ధర రూ.168 ఉండగా.. ప్రస్తుతం రూ.210కు చేరింది. లీటరు పామాయిల్ రూ.89 ఉంటే.. ఇప్పుడు రూ.160 పలుకుతోంది. సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ రూ.112 ఉంటే.. ఇప్పుడు రూ.175–185 పలుకుతోంది. పప్పులు.. ధరల నిప్పులు పప్పుల ధరలు సైతం పోటీపడి పెరుగుతున్నాయి. జాతీయ సగటుతో పోల్చినా.. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పోల్చినా ఏపీలో పప్పుల ధరలు అధికంగా ఉంటున్నాయి. గత నెలతో పోలిస్తే వీటి ధరలు 15–30 శాతం పెరిగాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.148–155, గోధుమ పిండి రూ.71–90, మినప్పప్పు రూ.164–170కి పైగా ధరలు పలుకుతున్నాయి. పెసలు సైతం రూ.165–175, వేరుశనగ గుళ్లు రూ.188–200, శనగలు రూ.210కి తక్కువగా లేవు. పచి్చశనగపప్పు ఏకంగా కిలో రూ.280–300 పలుకుతోంది. గోధుమలు కిలో రూ.35–40, గోధుమ పిండి కిలో రూ.40–43, కూరలు, తాలింపుల్లో తప్పనిసరిగా వినియోగించే ఎండుమిర్చి రూ.390–420, పసుపు రూ.380, వెల్లుల్లి రూ.220–250, అల్లం రూ.115–150, కారం రూ.520 (ప్రీమియం), సాధారణం రూ.220పైగా ధరలు పలుకుతున్నాయి. టమాటా కిలో రూ.65 పలుకుతోంది. అరటి సైతం రైతుకు కిలోకు రూ.5 దక్కుతుంటే.. బయట మాత్రం డజను రూ.100 పైమాటే. చివరకు కరివేపాకు సైతం కేజీ రూ.200గా ఉంది. పచ్చిమిర్చి రూ.80, క్యాప్సికం రూ.80, కూరమామిడి రూ.100కు తక్కువ లేదు. ‘బియ్యం’ ధరదడ మొన్నటి వరకు స్థిరంగా కొనసాగిన బియ్యం ధరలు 15 రోజుల్లో పెరిగాయి. హోల్సేల్లో 26 కేజీల బస్తాపై రూ.50 పెరిగితే.. రిటైల్ మార్కెట్లో రూ.100 నుంచి రూ.120 మేర పెరిగాయి. కిలో రూ.45 నుంచి రూ.70 పలుకుతున్నాయి. 15 రోజుల క్రితం 26 కిలోల సాధారణ బ్రాండ్లకు చెందిన సన్న బియ్యం బస్తా రూ.1,300–1,400 ఉంటే ఇప్పుడు రూ.1,650 చేరింది. ప్రీమియం రకాలైతే 26 కిలోల బస్తా రూ.1,599 నుంచి రూ.1,810 వరకు పలుకుతున్నాయి. బాస్మతి బియ్యం సైతం కిలో రూ.150 పైమాటే. దావత్ బియ్యమైతే కిలో రూ.230–250 వరకు పలుకుతున్నాయి. వాస్తవానికి గడచిన నెలలోనే మిల్లర్లు, బియ్యం సిండికేట్ సన్నరకాల బియ్యంపై రేట్లు పెంచేశాయి. క్వింటాకు ఏకంగా రూ.400పైనే వడ్డించాయి. ఇలా ఇష్టానుసారం బియ్యం ధరలు పెంచేస్తుంటే నియంత్రించాల్సిన చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. రూ.10–15కు దొరికే కొత్తిమీర కట్ట ధర సైతం సైజును బట్టి రూ.25–30 పలుకుతోంది. మూడు కట్టలు రూ.10కు దొరికే ఆకు కూర ఏదైనా ఇప్పుడు రూ.25–30 తక్కువకు దొరకడం లేదు. గతంలో 200 పెడితే బ్యాగ్ నిండా వచ్చే కూరగాయలు ప్రస్తుతం రూ.500 పెట్టినా సంచి సగం రావడం లేదు.కొనలేకపోతున్నాం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో ఆ ప్రభావం నిత్యావసర సరుకులపై పడుతోంది. సామాన్యులు బయట బజార్లో ఏమీ కొనలేని పరిస్థితి ఏర్పడింది. ధరలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఆ దిశగా అడుగులు వేయాలని కోరుతున్నాం. – ఎస్.ఈశ్వరి, గృహిణి, కొండపల్లి, ఎన్టీఆర్ జిల్లా బతుకు దుర్భరమైంది 20 ఏళ్లుగా ఆటో నడుపుతున్నాను. ఉచిత బస్సువల్ల బేరాలు లేక ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాం. ఫ్రీ బస్సు లేనప్పుడు రోజుకు రూ.500 వచ్చేది. ఇప్పుడు రెండొందలు కూడా రావడం లేదు. తాజాగా డీజిల్ ధరలు పెంచడం వల్ల నిర్వహణ ఖర్చులతోపాటు నిత్యావసర సరుకుల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇలా అయితే ఎలా బతుకుతాం. – బందం రమేష్, ఆటోడ్రైవర్, దేవవరం, నక్కపల్లి మండలం, అనకాపల్లిఎలా బతకాలి! డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడంతో నిత్యావసర సరుకుల ధరలు పెంచేశారు. ఏం కొందామన్నా ధరలు మండిపోతున్నాయి. ప్రతీ వస్తువుపై రూ.5 పెంచేశారు. ఇదేంటని అడిగితే డీజిల్ ధరలు పెంచారంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు ఎలా బతకాలి. సామాన్యులకు దాపురించిన ఆ పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం. – జమ్రుత్బాషా, సీటీఎం మదనపల్లెపచ్చడి మెతుకులే దిక్కు సామాన్యులే కాకుండా మధ్యతరగతి జనం కూడా ఈ ధరల కారణంగా పచ్చడి మెతుకులకే పరిమితం కావాల్సి వస్తోంది. కందిపప్పు, వంటనూనె ధరలు కూడా అందుబాటులో లేవు. కూరగాయలతోపాటు అన్నిరకాల సరుకుల ధరలు పెరిగిపోయాయి. దీనంతటికీ కారణం ప్రభుత్వ వైఫల్యమే. – కుప్పిలి జానకమ్మ, గృహిణి, విద్యానగర్, పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా ఇంటిని నడపడం కష్టంగా మారింది ఈ ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇంటిని నడపడం కష్టంగా మారింది. కూరగాయలు, పప్పులు, నూనెలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో బతుకు భారంగా మారింది. ఒకప్పుడు నెలకు రూ.5 వేలు ఖర్చు పెడితే సరిపోయేది. ఇప్పుడు రూ.10 వేలయినా చాలడం లేదు. ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. – షేక్ హుసేన్బీ, గృహిణి, లింగాపురం ప్రభుత్వం చోద్యం చూస్తోంది ధరలకు కళ్లెం వేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఇంధన ధరల పెంపుతో నిత్యావసర సరుకులైన వంటనూనె, పప్పులు, కూరగాయలు, చికెన్ ఇలా ఒకటేమిటి అన్ని వస్తువుల ధరలు కట్టు తెగాయి. ఈ ధరల్ని తట్టుకోవడం మాలాంటి వారికి చాలా కష్టంతో కూడుకున్న పని. – జి.లక్ష్మీనారాయణ, వీధి వ్యాపారి, రేఖవానిపాలెం, విశాఖపట్నం -
పరిపాలన చేతకాకపోతే ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటుకు అప్పగించండి
-
ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు ఇక లేనట్లే
-
ఆంధ్రప్రదేశ్లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
-
19 వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినా.. దివ్యాంగులకు రిజర్వేషన్లు లేవు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆల్ యూనివర్సిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రతినిధులు కలిశారు. మంగవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో దివ్యాంగ్ వింగ్స్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎం.శ్రీనివాసరావు తదితరులు వైఎస్ జగన్ను కలిసి తమ సమస్యలను వివరించారు. రాష్ట్రంలోని 19 యూనివర్సిటీలలో 1,523 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ, దివ్యాంగులకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించలేదని వైఎస్ జగన్కు తెలిపారు.ఉన్నత విద్యనభ్యసించి పీహెచ్డీలు పూర్తి చేసిన తమలాంటి దివ్యాంగులు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల హక్కులు, సాధికారత కోసం భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వికలాంగుల హక్కుల చట్టం–2016ను చంద్రబాబు ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం తీరువల్ల దివ్యాంగులు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా తమకు తగిన అవకాశాలు ఇవ్వడం లేదని వాపోయారు. దివ్యాంగుల సమస్యలను వైఎస్ జగన్ సావధానంగా విన్నారు. వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను గుర్తుచేసి భవిష్యత్తులోనూ దివ్యాంగులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. -
ప్రైవేట్ సంస్థకు బాబు సర్కార్ దాసోహం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య రంగంలో ఉన్న వనరులను నిర్వీర్యం చేస్తూ చంద్రబాబు సర్కారు ప్రైవేట్ సంస్థలకు దాసోహం అవుతోంది. పీపీపీ ప్రాజెక్ట్ల పేరిట అస్మదీయులకు రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని దోచి పెట్టేందుకు బరితెగిస్తోంది. ఈ పరంపరలో 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ)లో వైద్య పరీక్షల పేరిట మెడాల్ తరహా కుంభకోణానికి తెరలేపుతోందనే విమర్శలు హోరెత్తుతున్నాయి. టీడీపీ డాక్టర్స్ సెల్లోని ఓ డాక్టర్కు చెందిన భవ్య అనే సంస్థకు రూ.3 వేల కోట్ల విలువైన 108 అంబులెన్స్లు, 104 ఎంఎంయూ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్సీ) నిర్వహణ కాంట్రాక్ట్ను గతేడాది కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే సంస్థకు ఎంఎంయూల ద్వారా రక్త పరీక్షల నిర్వహణ పేరిట ఏటా రూ.162.72 కోట్ల చొప్పున సమర్పించడానికి సోమవారం ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చేసింది. ఈ క్రమంలో 2014–19 మధ్య రాష్ట్ర వైద్య శాఖలో చోటు చేసుకున్న మెడాల్ స్కామ్ను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. మెడాల్ ద్వారా పీపీపీ విధానంలో రక్త పరీక్షలు చేపట్టి అప్పట్లో రూ.300 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారనే ఆరోపణలున్నాయి. ధిప్పుడు ఎంఎంయూల్లో రోగ నిర్ధారణ పరీక్షలు కూడా ఇదే రీతిలో దోపిడీకి తెర తీయడమేనని వైద్య వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఐదేళ్ల కాంట్రాక్ట్ కాల పరిమితితో గతేడాది భవ్య సంస్థ 104, 108 నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. మరో నాలుగేళ్ల పాటు ఆ సంస్థకు కాంట్రాక్ట్ పరిమితి ఉంది. ఈ లెక్కన పరిశీలిస్తే నాలుగేళ్లలో ఎంఎంయూల్లో వైద్య పరీక్షల పేరిట రూ.700 కోట్ల మేర నిధులు మళ్లించబోతున్నారు. ఒక్కొక్కరికి పరీక్షలకు రూ.288 రాష్ట్రంలో గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 104 ఎంఎంయూ వాహనాలు కొత్తగా 904 సమకూర్చారు. నాడు–నేడు కింద వైద్య రంగాన్ని బలోపేతం చేశారు. 10,032 విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రాథమిక వైద్యంతో పాటు, 14 రకాల పరీక్షలను అందుబాటులోకి తెచ్చారు. 105 రకాల మందులు అందుబాటులో ఉంచారు. ఏడాది పొడవునా బీపీ, షుగర్ బాధితులు, గర్భిణులు, వృద్ధులకు ఇక్కడ వైద్య సేవలు అందేవి. నెలలో రెండు పర్యాయాలు 104ల ద్వారా పీహెచ్సీ వైద్యులు విలేజ్ క్లినిక్లు సందర్శించి, రోజంతా గ్రామంలో ఉంటూ వైద్య సేవలు అందించేవారు. ఇందుకోసం అధునాతన ల్యాబ్ సౌకర్యంతో పీహెచ్సీలను తీర్చిదిద్దారు. మరోవైపు గ్రామాలకు నాలుగు, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే పీహెచ్సీలను బలోపేతం చేసి వాటిలోని ల్యాబ్లకు అత్యాధునిక పరికరాలను సమకూర్చారు. తద్వారా ప్రతి పీహెచ్సీలో 63 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి తెచ్చారు. ఇలా ప్రభుత్వ పరిధిలోనే రోగ నిర్ధారణకు ఎంతో పకడ్భందీ వ్యవస్థ ఉండగా, ఎంఎంయూల్లో వైద్య పరీక్షల పేరిట ప్రస్తుత చంద్రబాబు సర్కార్ పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఎంఎంయూల్లో వైద్య పరీక్షలు మెడాల్ తరహా స్కామ్కు దారితీస్తుందని టెండర్ల సమయంలోనే వైద్య శాఖ అధికారులు తటపటాయించినట్టు సమాచారం. ఈ భయంతోనే గతేడాది 104, 108 నిర్వహణ టెండర్లోనే వైద్య పరీక్షల కాంట్రాక్ట్ను కూడా ఖరారు చేసినప్పటికీ అమలును వాయిదా వేసినట్టు తెలిసింది. ప్రభుత్వ పెద్దలు అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తేవడంతో తాజాగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయిస్తున్నారు. ఫలితంగా ఒక్కో ఎంఎంయూలో ఒక్కొక్కరికి రూ.288 చొప్పున రోజుకు 20 మందికి పరీక్షలు నిర్వహిస్తారు. ఇలా నెలలో 520 మందికి పరీక్షల కోసం ప్రభుత్వం రూ.1.5 లక్షలు చెల్లించడానికి సిద్ధమైంది. ఇలా ఏడాదికి 904 ఎంఎంయూలకు రూ.162.72 కోట్ల చొప్పున కాంట్రాక్ట్ సంస్థకు ముట్టనుంది. 104 వాహనాల్లో వైద్య పరీక్షలు చేయడానికి అనుమతి ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులు ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యం ప్రభుత్వ రంగంలోనే అందుబాటులో ఉన్న ప్రివెంటివ్ కేర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ బాబు సర్కార్ ఇప్పుడు ప్రైవేట్ సంస్థకు నిధులు ధారబోయనుంది. ప్రజారోగ్యం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే అందుబాటులో ఉన్న వ్యవస్థలనే వాడుకోవచ్చని వైద్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విలేజ్ క్లినిక్స్లో బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత ఉన్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్వో) ఉన్నారు. వీరికి రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించడంలోనూ అనుభవం ఉంది. ఈ క్రమంలో 104 గ్రామానికి వచ్చిన రోజు వైద్యులు సూచించిన రోగుల నుంచి నమూనాలు సేకరించి పీహెచ్సీలకు తరలిస్తే ఉచితంగా 63 రకాల పరీక్షలు చేయడానికి వీలుంది. వాటి ఫలితాల ఆధారంగా పీహెచ్సీలోని వైద్యుడు సీహెచ్వోలకు వర్చువల్గా అవసరమైన మందులు సూచిస్తే.. సీహెచ్వో, ఏఎన్ఎం, ఆశాల ద్వారా నేరుగా రోగి ఇంటి వద్దకు డెలివరీ చేయవచ్చు. జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, గైనిక్ వంటి స్పెషలిస్ట్ కన్సల్టెషన్.. అవసరమైతే విలేజ్ క్లినిక్ నుంచే టెలీమెడిసిన్ ద్వారా వర్చువల్ కన్సల్టేషన్కు కూడా అవకాశం ఉంది. ఒకవేళ మెరుగైన వైద్యం అవసరమైతే గ్రామంలోని ఆరోగ్య సిబ్బంది ద్వారానే ప్రభుత్వాస్పత్రులు/ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రెఫర్ చేసే ఆస్కారం ఉంది. ఇంత పకడ్బందీ వనరులను కాదని 104లో పరీక్షల పేరిట ఏకంగా రూ.700 కోట్ల మేర ప్రజాధనం ఖర్చు చేయడానికే చంద్రబాబు ప్రభుత్వం మొగ్గు చూపుతోందంటే ఇందులో ‘మాకింత–మీకింత’ వ్యవహారం తప్ప మరోటి కాదని సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రతికూలతలను పట్టించుకోని సర్కారు⇒ 104 ఎంఎంయూలు నిత్యం పీహెచ్సీల నుంచి గ్రామాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో కదిలే వాహనాల్లో ల్యాబ్ను ఏర్పాటు చేసి నిర్వహించే పరీక్షల్లో కచ్చితత్వంపై వైద్య వర్గాల్లో అనేక అనుమానాలు ఉంటున్నాయి. ⇒ వాహనం నిరంతరం రోడ్లపై ప్రయాణించడం, గుంతల్లో పడటంతో మిషన్లలో ఉండే సెన్సార్లు, లెన్సులు, గ్లాస్ ట్యూబ్లు వాటి కచ్చితమైన స్థానాల నుంచి స్వల్పంగా కదలడానికి వీలుంటుంది. దీంతో మిషన్లు తప్పుడు రీడింగ్స్ చూపే అవకాశం లేకపోలేదు. ⇒ స్థిరమైన ల్యాబ్లలో సెంట్రలైజ్డ్ ఏసీ ద్వారా ల్యాబ్కు అవసరమైన ఉష్ణోగ్రతలను నిర్వహించడానికి వీలు ఉంటుంది. కదిలే వాహనాల్లో అది అసాధ్యమని తెలుస్తోంది. ⇒ రక్త పరీక్షలకు వాడే రసాయనాలు సున్నితంగా ఉంటాయి. వాహనం ఎండలో ప్రయాణిస్తున్నప్పుడు, ఏసీ ఆగిపోయినప్పుడు ల్యాబ్ లోపల వేడి వేగంగా పెరుగుతుంది. అలాంటప్పుడు ఈ రసాయనాల పనితీరు దెబ్బతిని, తప్పుడు ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ⇒ రోడ్లపై తిరిగే వాహనాల్లోకి దుమ్ము, ధూళి, పొగ ప్రవేశించే అవకాశం కూడా ఉంటుంది. వాహనంలోకి వచ్చే సూక్ష్మ దుమ్ము కణాలతో రిపోర్టులో తేడా రావచ్చు. -
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేసుకొని టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు కర్నూలు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈనెల 14వ తేదీన వైఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి కూటమి ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి టీజీ భరత్పై విమర్శలు చేశారని మంత్రి టీజీ భరత్.. త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, సిద్ధార్థ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఓ ఫార్మా కంపెనీ వద్ద మంత్రి భరత్ 45 కోట్ల రూపాయలు వసూలు చేశారని బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దాంతో తనపై, నారా లోకేష్ పై సిద్దార్థ్ రెడ్డి చేసిన ఆరోపణలకు స్పందించి కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో మంత్రి భరత్ ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. -
వైఎస్ జగన్ను కలిసిన ఆల్ యూనివర్శిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రతినిధులు
సాక్షి,తాడేపల్లి: ఆల్ యూనివర్శిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రతినిధులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్,లెక్చరర్ పోస్టుల భర్తీలో వికలాంగులకు మోసం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.తమలాంటి దివ్యాంగులకు చంద్రబాబు ప్రభుత్వం అవకాశాలు ఇవ్వటం లేదని వాపోయారు. తమకు రిజర్వేషన్ ఇవ్వకపోవటంతో ఉద్యోగ అవకాశాలకు దూరమయ్యాయని తెలిపారు. దివ్యాంగ హక్కుల చట్టాన్ని కూడా అమలు చేయటం లేదంటూ ఫిర్యాదు చేశారు.ఆల్ యూనివర్శిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రతినిధుల ఆవేదనపై వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. దివ్యాంగులకు అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ని కలిసిన వారిలో ఆల్ యూనివర్శిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం. కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎం. శ్రీనివాసరావు తదితరులున్నారు. -
మంత్రి కుటుంబం కంపెనీ కోసం.. మా గ్రామాలు నాశనం కావాలా?
ఆగిరిపల్లి: ‘మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సభ్యుల కంపెనీ కోసం మా గ్రామాలు నాశనం కావాలా...’ అని నాలుగు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం భూమిని చదును చేసే పనులను ఆ గ్రామాల ప్రజలు వచ్చి అడ్డుకున్నారు. దీంతో పొక్లెయిన్ డ్రైవర్ పనులు నిలిపివేసి వెళ్లిపోయాడు. మంత్రి కొలుసు పార్థసారథి కుమారుడికి చెందిన కంపెనీ నితిన్కృష్ణ కన్స్ట్రక్షన్స్ పేరిట ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 2/1లో 45.60 ఎకరాల విలువైన భూమిని కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కోసం చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది.ఆ భూమికి చుట్టుపక్కల ఉన్న తోటపల్లి, చిన్నాగిరిపల్లి గొల్లగూడెం, సర్నాలగూడెం, సింగన్నగూడెం గ్రామాల ప్రజలు బయోగ్యాస్ను ప్లాంట్ ఏర్పాటు చేయవద్దు అంటూ ఆందోళన చేయడంతో కొన్ని రోజులుగా అక్కడ ఎలాంటి పనులు చేపట్టలేదు. మళ్లీ మంత్రి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం కేటాయించిన కొండ వద్ద రెండు రోజులుగా భూమిని పొక్లెయిన్తో చదును చేస్తుండటంతో ఆ గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి అడ్డుకున్నారు. మా పొట్ట కొట్టి.. మంత్రికి భూమి కట్టబెడతారా? ఈ సందర్భంగా నాలుగు గ్రామాల ప్రజలు మాట్లాడుతూ చాలా ఏళ్లుగా తమ పూర్వీకుల నుంచి తోటపల్లి పరిధిలోని కొండ ప్రాంతంలో మేకలు, గొర్రెలు, గేదెలను మేపుకొని కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తమ జీవనోపాధిని దెబ్బతీసి మంత్రి కుటుంబ సభ్యులకు ఆ భూమి కేటాయిస్తే తాము ఎలా బతకాలంటూ నిలదీశారు. బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే వచ్చే విషవాయువులు, వ్యర్థాలతో చుట్టుపక్కల గ్రామాలు నాశనమైపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు.ఈ భూముల్లో పర్యావరణానికి హాని కలుగజేసే గ్రావెల్ తవ్వకాలు, కంపెనీలు ఏర్పాటు చేయకూడదని హైకోర్టు 2022లోనే తీర్పు ఇచ్చిందని తెలిపారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా మంత్రి కుటుంబ సభ్యులకు భూమిని ఎలా కేటాయించిందని ప్రశ్నించారు. అక్రమంగా కొండను తవ్వేసి ఎంతో విలువైన గ్రావెల్ను తరలించి కోట్ల రూపాయలు దండుకోవాలని చూస్తున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయని నాలుగు గ్రామాల ప్రజలు పేర్కొన్నారు. ఇక్కడి కొండను బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కోసం తవ్వేస్తే పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. బయోగ్యాస్ ప్లాంటు ఏర్పాటు చేయాలని చూస్తే ఎంతవరకు పోరాడడానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. -
కార్యాలయం కట్టుకోండి ‘తమ్ముడు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములను తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. లీజు పరిమితిని కూడా ఏకంగా 99 ఏళ్లకు పెంచి మరీ సీఎం చంద్రబాబు తన పార్టీ కార్యాలయాలకు భూములు ఇచ్చుకుంటున్నారు. తాజాగా సోమవారం విజయనగరం, ఒంగోలు, ఏలూరు, రాజమహేంద్రవరంలో టీడీపీ కార్యాలయాల కోసం విలువైన భూములను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుల పేరిట లీజుకు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు. కేవలం వెయ్యి రూపాయల నామమాత్రపు లీజుకి విలువైన భూములను చంద్రబాబు తన పార్టీకి ధారాదత్తం చేస్తున్నారు. గరిష్టంగా 99 ఏళ్ల వరకు లీజు గతంలో రాజకీయ పార్టీల కార్యాలయాల నిర్మాణాల కోసం ప్రభుత్వ భూములను 33 సంవత్సరాలకు మాత్రమే లీజుకు ఇచ్చే నిబంధన ఉంది. దానిని చంద్రబాబు పూర్తిగా మార్చేసి లీజు కాలపరిమితిని 66 ఏళ్లకు పెంచారు. అంతటితో ఆగకుండా ఆ పార్టీలు ఉనికిలో ఉన్నంతకాలం లీజు గడువును గరిష్టంగా 99 సంవత్సరాల వరకు పొడిగించుకునే వెసులుబాటు కల్పించారు. అంటే 99 ఏళ్లపాటు ఈ భూములు టీడీపీ హస్తగతం కానున్నాయి. లీజు వ్యవధిని 33 ఏళ్ల నుంచి 66 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనల కారణంగానే గతంలో కొన్ని కేటాయింపులను నిలిపివేశారు. గురువారం మంత్రివర్గంలో లీజుల గడువు పెంచుతూ ఆమోదించి, ఆ వెంటనే తాజా జీవోలను జారీ చేశారు. అనంతరం ఎకరాకు ఏడాదికి రూ.1,000 చొప్పున నామమాత్రపు లీజుకే టీడీపీ కార్యాలయాలకు భూములను కేటాయించారు. రాజమహేంద్రవరం, ఒంగోలు, విజయనగరంలో రెండేసి ఎకరాలు ⇒ రాజమహేంద్రవరం అర్బన్ మండలం పరిధిలోని సర్వే నంబర్ 316–2లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని తూర్పు గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడి పేరుతో పార్టీ కార్యాలయం భవనం కోసం కేటాయించారు. మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతి రాకముందే లీజుకు ఇచ్చేశారు. ⇒ విజయనగరంలోని కనపాక అయ్యన్నపేటలో సర్వే నంబర్ 94/2లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ కార్యాలయానికి కేటాయించారు. ఈ కేటాయింపు కోసం ఆ భూమి స్వభావాన్ని మార్చారు. ఆ భూమి రాళ్లగుట్టగా రికార్డుల్లో ఉండగా, దాన్ని అస్సెస్డ్ వేస్ట్ డ్రై (ఏడబ్ల్యూడీ)గా మార్చారు. అంతేకాకుండా, ఇదే భూమిపై గత ఏడాది మార్చిలో ఇచి్చన జీవోను సైతం రద్దు చేస్తూ కొత్త నిబంధనల ప్రకారం 66 ఏళ్ల లీజు ఖరారు చేశారు. ⇒ ఏలూరు నగరంలోని టీఎస్ నంబర్ 660/3లోని 1.61 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ కార్యాలయానికి కేటాయించారు. ప్రస్తుతం ఈ భూమి ఏపీ ఆగ్రోస్ పరిధిలో ఉండగా, దాన్ని టీడీపీకి దఖలుపరిచారు. ⇒ ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కొత్త మామిడిపాలెం గ్రామంలోని సర్వే నంబర్ 82/1బీ2బీలోని 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా టీడీపీ కార్యాలయానికి కేటాయించారు. దీన్ని కూడా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎన్వోసి, మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం లేకుండానే ఇచ్చేశారు. -
ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో సర్కారు ఇష్టారాజ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో చంద్రబాబు సర్కారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. జీవోలను తుంగలో తొక్కుతూ అశాస్త్రీయ పద్ధతులను అవలభిస్తోందనే విమర్శల్ని మూటగట్టుకుంటోంది. వర్సిటీల అధికారులు, సీనియర్ ఆచార్యుల సమక్షంలో చేపట్టాల్సిన ఎంపికను నాలుగు గోడల మధ్య బంధించడంతో నోటిఫికేషన్లో పారదర్శకతను ప్రశ్నార్థకంగా మార్చేసింది. ముఖ్యంగా న్యాయస్థానాల తీర్పులకు, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు స్క్రీనింగ్ (అర్హత) పరీక్ష పెట్టడం వివాదాలకు తావిస్తోంది.ఎన్నడూ లేనివిధంగా వింత సంస్కృతిని తీసుకొచ్చి బ్యాక్లాగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సైతం స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తుండటంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. 2023 నోటిఫికేషన్ను అర్థంతరంగా రద్దు చేసి.. కనీసం వయో పరిమితి పెంచకుండా 44 ఏళ్ల గరిష్ట వయోపరిమితి విధించడం తీవ్ర చర్చనీయాంశమైంది. సాధారణ డిగ్రీ అర్హతతో ఉండే స్కూల్ టీచర్ (డీఎస్సీ) పోస్టులకే జనరల్ కేటగిరీకి 45 ఏళ్లు, రిజర్వుడు కేటగిరీలకు 50 ఏళ్ల వయోపరిమితి ఇస్తున్నప్పుడు, వర్సిటీల్లో పోస్టులకు వయో పరిమితి విధించడం హాస్యాస్పదంగా మారింది. అర్హత పరీక్షా.. పోటీ పరీక్షా? ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నిర్వహించే స్క్రీనింగ్ టెస్టును పోటీ పరీక్షగా మార్చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఫ్యాకల్టీకి రాత పరీక్షలో నిర్దిష్ట మార్కులు సాధిస్తేనే.. వచ్చి న మార్కుల్లో 0.5 శాతం, ఇంటర్వ్యూల్లో సర్విసు ఆధారంగా (గరిష్టంగా పదేళ్లు) ఏడాదికి ఒక మార్కు చొప్పున వెయిటేజీ ప్రకటించింది. అయితే, చాలామంది కాంట్రాక్టు అధ్యాపకులు 20 ఏళ్లకు పైగా వర్సిటీల్లో సేవలందిస్తున్నారు. పీహెచ్డీలు, పరిశోధన పత్రాలు వంటి అకడమిక్స్తో పాటు తరగతి బోధనలో విశేష అనుభవం గడించారు.అలాంటి అనుభవజు్ఞలకు పోటీ పరీక్ష తరహాలో టెస్టులు పెట్టడాన్ని అభ్యర్థులు తప్పు పడుతున్నారు. దీనివల్ల సీనియర్లతో ప్రస్తుత తరం పోటీకి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. అర్హత పరీక్షలో 1:12 నిష్పత్తిలో మెరిట్ ఎలా తీస్తారని, పైగా మైనస్ మార్కుల విధానం ఏమిటని ప్రశి్నస్తున్నారు. ఇదే జరిగితే కేవలం స్క్రీనింగ్ టెస్టులో పైచేయి సాధించిన వారు రావచ్చు కానీ.. దశాబ్దాల బోధన అనుభవం, పరిశోధన పటిమను వర్సిటీల్లోకి తీసుకురాలేరని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. యూజీసీ సైతం వర్సిటీల్లో బోధన పోస్టులను కేవలం పీహెచ్డీ, పబ్లికేషన్లు, రీసెర్చితో పాటు అకడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్కు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేస్తుండటం గమనార్హం. యూజీసీ స్కేల్ ఇవ్వరు.. అసోసియేట్కు దరఖాస్తుకు చేయనివ్వరా? చంద్రబాబు సర్కారు విచిత్ర పోకడలతో విద్యావేత్తలు తలలు పట్టుకుంటున్నారు. వాస్తవానికి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల్ని భర్తీ చేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ స్కేలుతో కచ్చి తంగా పని చేసిన అనుభవం ఉండాలనే నిబంధన విధించింది. అయితే, రాష్ట్రంలోని వేలాది మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కేవలం రూ.35–40వేల మధ్య జీతాలతో బతుకీడుస్తున్నారు. ఇది యూజీసీ స్కేల్స్కు పూర్తి విరుద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎనిమిదేళ్ల బోధన, పీహెచ్డీ తర్వాత రెండేళ్ల బోధన అనుభవం గడించిన ఎందరో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు యూజీసీ స్కేల్లో పనిచేసి ఉండాలనే నిబంధన పెట్టడంతో ఆ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోగలరని నిలదీస్తున్నారు. ప్రభుత్వం పోస్టుల పేరుతో మాయ చేయడం తప్ప పారదర్శకంగా వ్యవహరించడం లేదని మండిపడుతున్నారు. ఒకే ప్రభుత్వంలో విరుద్ధ నిర్ణయాలు కేవలం ప్రచార ఆర్భాటంతో చంద్రబాబు సర్కారు వర్సిటీల నోటిఫికేషన్ను హడావుడిగా విడుదల చేసి అభాసుపాలవుతోంది. ముఖ్యంగా బ్యాక్లాగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు స్క్రీనింగ్ టెస్టు పెట్టడంతో పాటు ప్రత్యేకంగా మహిళా రిజర్వేషన్, ఎస్సీ క్లాసిఫికేషన్తో నోటిఫికేషన్ ఇవ్వడం ప్రభుత్వ పరస్పర విరుద్ధ నిర్ణయాలకు అద్దం పడుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ పోస్టులను మెరిట్ ఆధారంగా నింపాలని ప్రభుత్వ జీవోలు, ఏపీ సబార్డినేట్ రూల్స్ చెబుతుంటే.. దానికి విరుద్ధంగా స్క్రీనింగ్ టెస్టు పెట్టడం గమనార్హం. వాస్తవానికి జీవో నంబర్ 77 తర్వాత ప్రత్యేకంగా పోస్టుల్లో మహిళ అని కాకుండా మొత్తం పోస్టుల్లో 33శాతం పైగానే మహిళలతో నింపాలి.కానీ, అవి బ్యాక్ లాగ్ పోస్టులు కాబట్టి పాత పద్ధతినే అనుసరిస్తామని ఉన్నత విద్యాశాఖ చెబుతోంది. అలాగైతే 2024 తర్వాత వచ్చి న ఎస్సీ క్లాసిఫికేషన్ను బ్యాక్లాగ్ పోస్టులకు ఎలా వర్తింపజేస్తారని.. ఇది దళిత, గిరిజన వర్గాలకు అన్యాయం చేయడమేనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఇచ్చి న 1,523 పోస్టుల నోటిఫికేషన్లో 279 పోస్టులు బ్యాక్లాగ్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ) కాగా.. అందులో 65 పోస్టులకుపైగా మహిళా రిజర్వేషన్ కల్పించారు. ఒకవేళ ఆ పోస్టులో మహిళలు లేకుండా, నూతన ఎస్సీ క్లాసిఫికేషన్ అభ్యర్థులు రాకపోతే అలాంటి పోస్టులు ఎప్పటికీ భర్తీ కాకుండా నిలిచిపోయే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. -
ఇదీ.. సత్వా రియాలిటీ
సాక్షి, అమరావతి: ఐటీ కంపెనీల ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం అడ్డుగోలు భూదోపిడీకి అడ్డు అదుపులేకుండా పోతోంది. ఇప్పటికే బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు సత్వా, ఏఎన్ఎస్ఆర్లకు కారుచౌకగా భూములు కేటాయించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ కంపెనీల్లోకి దొడ్డిదారిన వేరే కంపెనీలను చేరుస్తూ ‘రియల్’ దందా కొనసాగిస్తోంది. విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్ నంబర్ 4లో సుమారు రూ.1,500 కోట్ల విలువైన 30 ఎకరాల భూమిని కేవలం రూ.45 కోట్లకే కొట్టేసిన సత్వా చివరికి ఆ మొత్తం కూడా సకాలంలో చెల్లించలేదు. గతంలో రూ.45 కోట్లు చెల్లించడానికి సత్వా రెండునెలల అనమతి కోరితే వెంటనే ఆమోదం తెలిపిన ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రాజెక్టులో మరో రియల్ ఎస్టేట్ సంస్థను చేరిస్తే దానికి కూడా ఆమోదం తెలపడం గమనార్హం.ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 కింద ప్రోత్సాహకాలు కొట్టేసిన సత్వా ఇప్పుడు ఐటీ క్యాంపస్ నిర్మాణం, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విడదీస్తూ వేర్వేరు కంపెనీలకు అప్పగిస్తే దానికి కూడా ప్రభుత్వం తలొగ్గడంపై అధికారులు నివ్వెరపోతున్నారు. 30 ఎకరాల విక్రయ ఒప్పందంలో సగం భూమిని హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైన ఓర్వెల్ హారిజాన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట, మిగిలిన సగం సత్వా పేరిట బదిలీ చేయాలంటూ సత్వా చేసిన ప్రతిపాదనకు చంద్రబాబు సర్కారు ఆమోదం తెలుపుతూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కేవలం రూ.10వేల చెల్లింపు మూలధనంతో హైదరాబాద్ కేంద్రంగా గత ఏడాది జనవరి 21న ఏర్పాటైన ఓర్వెల్ హారిజాన్కు ఇప్పుడు విశాఖలో ఏకంగా రూ.750 కోట్ల విలువైన భూములు కేటాయించడం ప్రభుత్వ అడ్డగోలు దోపిడీకి మరో నిదర్శనం.ఓర్వెల్ కంపెనీలో కవీంద్రకుమార్ మిశ్రా, సుమంతకుమార్ బసు డైరెక్టర్లుగా ఉన్నారు. ఐటీ పార్కుల నిర్మాణంలో ఇంతవరకు ఎటువంటి అనుభవం లేని ఈ కంపెనీకి ఇలా దొడ్డిదారిన భూ కేటాయింపులు చేయడంపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఐటీ క్యాంపస్లను ఓర్వెల్ హారిజాన్ నిర్మిస్తే, నివా స సముదాయాలు నిర్మించి తాము అమ్ముకుంటా మని సత్వా చేసిన ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశం ఆ మోదం తెలపడంతో.. ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. అదేబాటలో ఏఎస్ఎన్ఆర్ కేవలం 99 పైసలకే విశాఖలో 10.29 ఎకరాలు కొ ట్టేసిన బెంగళూరుకు చెందిన ఏఎస్ఎన్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్కు కూడా సత్వాకు ఇచ్చినట్లే చంద్రబాబు ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. కేటాయించిన భూమిలో ప్రాజెక్టు అమలు చేయడానికి గడువు కోరడమే కాకుండా ఇందులో సహ డెవలపర్ కింద వేరేవాళ్లను తీసుకోవడానికి, నిర్మించిన కార్యాలయాలను ఉపలీజులకు ఇవ్వడానికి ప్రతిపాదించిన ఏఎస్ఎన్ఆర్ గ్లోబల్కు ఓకే చెప్పింది. ఇందుకు అనుమతిస్తూ మరో ఉత్తర్వును జారీచేసింది. రూ.863 కోట్లతో శ్రీసిటీలో అమెరికాకు చెందిన ఎయిర్ కండీషనింగ్, రిఫ్రిజరేషన్ ఉత్పత్తుల సంస్థ కారియర్కు పెట్టుబడిలో 40 శాతం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, ఐదేళ్లపాటు 100 శాతం ఎలక్ట్రిక ల్ సబ్సిడీ డ్యూటీ మినహాయింపు, వాటి టైలర్ మే డ్ రాయితీలను ప్రకటిస్తూ మరో ఉత్తర్వును జారీచేసింది. -
‘సన్రే’కు జీ హుజూర్ !
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు ప్రభుత్వ భూములను తమకు కావాల్సిన వారికి ఇష్టారీతిన దోచిపెడుతోంది. అయాచిత లబ్ధిచేకూర్చడానికి బరితెగిస్తోంది. అంతా విస్తుపోయే కారణాలు చూపుతూ విలువైన భూములను కారు చౌకగా కట్టబెడుతోంది. తాజాగా అలాంటి భూపందేరం జీవో సాక్షిగా బయటపడింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం కంచేరు గ్రామ పరిధిలో ‘అవని’ బ్రాండ్ పేరుతో 5 స్టార్ హోటల్ నిర్మించేందుకు ‘సన్రే గ్రీన్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్’కు అత్యంత విలువైన భూమిని ధారాదత్తం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.36 కోట్ల నుంచి రూ.54 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.3.5 కోట్లకు కట్టబెట్టడానికి సిద్ధమైంది. నిబంధనలను తుంగలో తొక్కి అవుట్రైట్ సేల్కు భూమిని విక్రయిస్తోంది. పైగా ఆ భూమి పెట్టుబడిదారుల స్థలాల మధ్యలో ఉండడంతో పాటు వేరొకరికి ఇవ్వలేని పరిస్థితుల్లో వారికే అమ్మేస్తున్నట్టు జీవోలో పేర్కొనడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాసన వ్యవస్థలో కీలక వ్యక్తి సన్నిహిత సంస్థ కావడంతోనే.. శాసన వ్యవస్థలో కీలక వ్యక్తి సన్నిహిత సంస్థ కావ డంతోనే సన్రేకు విలువైన భూమిని కట్టబెట్టిందన్న చర్చనడుస్తోంది. నర్నీపట్నంలోని టీడీపీ కీలక నేత, గతంలో సభ్యుడిగా ఉన్న సన్రే గ్రీన్ స్పేస్ కంపెనీకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. వాస్తవానికి కొన్నేళ్ల ముందు సదరు టీడీపీ కీలక నేత దంపతులు ఆ సంస్థలో ప్రత్యక్ష భాగస్వాములుగా కొనసాగారు. ప్రస్తుతం స్లీపింగ్ పార్టనర్గా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఎకరం రూ.15 కోట్లపైనే..అయినా రూ.కోటికే భోగాపురంలో ప్రస్తుతం ఏరియాను బట్టి బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.10 నుంచి రూ.15కోట్లకుపైగా పలుకుతోంది. అలాంటి ఖరీదైన ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని కారు చౌకగా ఎకరం రూ.కోటికే కట్టబెడుతుండడం విస్తుగొలుపుతోంది. దాదాపు రూ.36–54 కోట్లకుపైగా విలువైన భూమిని రూ.3.5 కోట్లకే ముట్టజెపుతోంది. విమానాశ్రయం పూర్తయితే ఆ భూమి బంగారమే.. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించిన భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే అదే భూమి విలువ రూ.150 నుంచి రూ.200 కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. టూరిజం పేరిట అత్యంత ఖరీదైన ప్రాంతాలను ఎంపిక చేసుకుని టీడీపీ, కూటమి నేతలు, వారి అనుచరులకు ప్రభుత్వం పర్యాటక భూములను అప్పగిస్తోందని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిర్దిష్ట విధానాలను తుంగలోకి తొక్కి తమ వారికి భూములు అప్పగించడానికి నిర్దిష్ట విధానాలను సైతం చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. ప్రభుత్వ ఆస్తులను కాజేసే కుట్రతో లీజు గడువును భారీగా పొడిగించడంతో పాటు కొత్తగా ‘ఫ్రీ హోల్డ్’ పేరుతో సబ్రిజిస్ట్రార్ ఆఫీసు రేటు ప్రకారం భూమి విలువ కట్టి కారుచౌకగా రియల్ఎస్టేట్ సంస్థలకు అమ్మేస్తోంది. ఇటీవల తిరుపతిలో ‘తిరుపతి వన్ ప్రాజెక్టు’, అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కంపెనీకి భూ సంతర్పణ చేసింది. 5 స్టార్ హోటల్ నిర్మాణం పేరిట సన్రే గ్రీన్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ రూ.117.66 కోట్ల పెట్టుబడితో కంచేరులో 5స్టార్ హోటల్ నిర్మించడానికి 3.61 ఎకరాల ప్రభుత్వ భూమిని కోరింది. ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్ సదరు సంస్థల సొంత భూముల మధ్యలో ప్రభుత్వ భూమి ఇరుక్కుపోయిందనే కారణంతో కారు చౌకగా అమ్మేస్తోంది. విచిత్రం ఏమంటే ప్రభుత్వ భూమి 3.61 ఎకరాలు అయితే.. పెట్టుబడిదారులు మాత్రం అక్కడ 3.10 ఎకరాలే ఉందనడం కొసమెరుపు.ఈ వ్యవహారంలో భూమితో పాటు ప్రైవేటు సంస్థకు అయాచిత లబ్ధి చేకూరుస్తోంది. మూలధన పెట్టుబడిలో రూ.10 కోట్లు రీయింబర్స్ చేయడంతో పాటు పదేళ్లు 100 శాతం ఎస్జీఎస్టీ, ఇతర ప్రోత్సాహకాల కింద దాదాపు రూ.40 కోట్లకుపైగా దోచిపెడుతుంది. ఇక్కడ భూ బదలాయింపుల్లో ‘నోవేషన్ క్లాజ్’ను సైతం ఎత్తేశారు. ఈ క్లాజ్ ఉంటే భూమి బదలాయింపులు చేసిన ప్రతిసారీ ప్రభుత్వ అనుమతి కచ్చితంగా పొందాలి. అప్పటి రేట్ల ప్రకారం ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అలాంటి అవకాశం లేకుండా ప్రభుత్వం భారీ నజరానా ఇచ్చింది. -
‘అధిక సంతాన’ వ్యామోహం!
చెప్పడానికేం లేనప్పుడూ, సంజాయిషీ ఇవ్వడానికి మాటలు దొరకనప్పుడూ ఏదో ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చి ప్రజలను గందరగోళపరచడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అలవాటైన విద్య. తిరుమల లడ్డూ మొదలుకొని అనేకానేక అంశాలపై సృష్టించిన వివాదాలు నీరుగారి, తన కుట్రలు బయటపడ్డాక ఇక సూపర్ సిక్స్ హామీల గురించీ, ఇతరత్రా వాగ్దానాల గురించీ ఏదో ఒకటి చెప్పకతప్పని స్థితి ఎదురైంది. అందుకే ఎక్కువమంది పిల్లల్ని కనండంటూ ఆయన ఊదరగొడుతున్నారు. దాన్నెవరూ పట్టించుకున్న దాఖలా లేకపోవటంతో తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్న పేటలో అధిక సంతానం ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ఏమేం చేయబోతున్నదో ఏకరువు పెట్టారు. మూడో బిడ్డను కంటే రూ. 30,000, నాలుగో బిడ్డను కంటే రూ. 40,000 ఇస్తామని ప్రకటించారు. ఈ సొమ్మును పురిటి మంచం దగ్గరకే తీసుకొచ్చి ముట్టజెబుతారట! దీన్ని ప్రకటించేముందు ఎన్నికల హామీల అతీ గతీ ఏమైందో నిజాయితీగా చెబితే బాగుండేది. కనీసం చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంత మందికీ ఏడాదికి రూ. 15,000 చొప్పున ఇస్తానన్న ‘తల్లికి వందనం’ ఏమైందో... కుటుంబంలో ఎందరు మహిళలుంటే అందరికీ నెలకు రూ. 1,500 చొప్పున అందిస్తానన్న ‘ఆడబిడ్డ నిధి’ ఎటుపోయిందో...‘కల్యాణ లక్ష్మి’ ఎంత ఘనంగా అమలవుతున్నదో బాబు చెప్పాల్సింది. గత వాగ్దానాలకే దిక్కూ మొక్కూలేని తరుణంలో కొత్త రాగం మొదలెట్టారు. వాస్తవానికి ‘అధిక సంతానం’ ఆలోచన బాబు పుర్రెకు పుట్టిన బుద్ధికాదు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందనీ, అందువల్ల దక్షిణాది నష్టపోతుందనీ తెలిశాక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్తో సహా అనేకులు ఆందోళనపడి, అధిక సంతానాన్ని కనమంటూ బహిరంగ సభల్లో చెప్పడం మొదలెట్టారు. కానీ అంతటితో ఆగితే వారికీ, బాబుకూ తేడా ఏముంటుంది? అందుకే ఈ నజరానాలు! నిజానికి కేంద్రంలో ఎన్డీయే సర్కారు తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన ప్రస్తుత స్థితిలో నియోజకవర్గాల పునర్విభజనకు ఎంచుకున్న ప్రాతిపదిక విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించవచ్చు. కానీ అలాంటి దుస్సాహసం చేస్తే కొంప కొల్లేరవుతుందని భయపడ్డారు. అలాగని లోలోన రగులుతున్న అసంతృప్తిని దాచుకోలేకపోతున్నారు. ఈలోగా గతంలో ఇచ్చిన విచ్చలవిడి హామీలు శాపాలై వెంటాడుతున్నాయి. వీటినుంచి తప్పించుకోవాలంటే ‘అధిక సంతానమే’ ఏకైక మార్గమని బాబుకు తోచినట్టుంది. గండం గడిచేందుకు అవసరార్థం ఏదో ఒకటి మాట్లాడటం మొదటినుంచీ ఆయనకు అలవాటే. 2024 ఎన్నికల్లో మరోసారి ఓటమి తప్పదని గ్రహించాక ఆదరా బాదరాగా ఎన్డీయే పంచన చేరారు. అప్పటికీ విజయంపై గ్యారెంటీ లేకపోవటంతో ఎన్నికల సంఘం(ఈసీ) ప్రాపకంతో కావాల్సినవన్నీ చేసుకున్నారు. మరోపక్క మోసపూరిత హామీలతో మోతెక్కించారు. ఇక పోలింగ్ రోజున ఈవీఎంల ప్రహసనం, దొంగ ఓట్ల జాతర సరేసరి. ఎన్ని చేసినా...ఇచ్చిన వాగ్దానాల మాటేమిటన్న ప్రశ్న ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అందుకే ఈ అధిక సంతానం ప్రచారం!ఇటీవల కాగ్ విడుదల చేసిన తాత్కాలిక లెక్కలు ఏపీ సర్కారు నిర్వాకాన్ని రోడ్డుకీడ్చాయి. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని అభివృద్ధంటూ బాబు చెప్పినవన్నీ ఉత్త డొల్ల మాటలని తేల్చిచెప్పాయి. 10.75 శాతం వృద్ధి రేటు అంటూ బాబు చెప్పిందే నిజమైతే పన్ను రాబడులు 3.22 శాతం పడిపోవటమేమిటి? సంపద సృష్టి మాట దేవుడెరుగు... ఉన్న సంపదంతా ఊడ్చుకుపోతోందని కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా ఏ భరోసాతో పిల్లల్ని కంటారు? ఈ సంక్షోభకాలంలో సర్కారు ఒక్క దఫా ఇచ్చే డబ్బు ఏమూలకు సరిపోతుంది? ఎన్నాళ్లొస్తుంది? ఈ విషయంలో ప్రముఖ పిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్ సూటిగా నిలదీస్తే ఇంతవరకూ జవాబు లేదు. కనీసం పిల్లల సంక్షేమానికీ, వారి ఆరోగ్యరక్షణకూ, పౌష్టికాహారానికీ, విద్యకూ, మొత్తంగా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకూ సంబంధించిన పథకాలు ప్రకటిస్తే వేరుగా ఉండేది. సందుసందునా బెల్ట్ షాపులతో మద్యం ఏరులై పారుతున్న రాష్ట్రంలో కుటుంబాలు ఏ భరోసాతో పిల్లల్ని కనాలి? అరకొర ఆదాయంతో సగటు ఇల్లాళ్లు కంటతడి పెడుతుంటే ఎందుకీ మతిలేని మాటలు?! -
పెట్రో బాదుడుపై పోరుబాట
-
నీకు చేతకాకపోతే నోరు మూసుకో.. బాబుపై సిపిఐ నారాయణ ఫైర్
-
ఈ-బస్సుల విధానం ముసుగులో చంద్రబాబు కుతంత్రం.. ఆర్టీసీ.. ప్రై ' వేటు
-
పనికిమాలిన సన్నాసులు.. కూటమి ప్రభుత్వం పై జోగి రమేష్ ఫైర్
-
నాడు కోతలు నేడు వాతలు.. పెట్రోల్ ధరలపై బాబు మౌనం..
-
ఆంధ్రప్రదేశ్లో దోపిడీ విజన్, స్కామ్కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
-
దోపిడీ విజన్.. స్కామ్కు డిజైన్
సాక్షి, అమరావతి: దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) విజన్తో చంద్రబాబు సర్కారు కుంభకోణాలకు డిజైన్ చేస్తుందనడానికి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయమే నిదర్శనమని మేధావులు, ఆర్థిక నిపుణులు, ప్రజా సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. 2015లో గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధికి భూ సమీకరణ చేసిన ఇదే చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఆ విమానాశ్రయానికి బొంద పెడుతూ తాడికొండ మండలం రావెల వద్ద 4,618 ఎకరాల్లో అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడానికి వడివడిగా అడుగులు ముందుకు వేస్తుండటం తెలిసిందే. అప్పట్లో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి అవసరమైన 687 ఎకరాలను భూ సమీకరణ కింద తీసుకుని.. రాజధానిలో నివాస, వాణిజ్య ప్లాట్లతోపాటు కౌలు ఇస్తామన్న సమాచారాన్ని అస్మదీయులకు చేరవేసింది. దాంతో సీఎం చంద్రబాబుకు సన్నిహితులైన బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్, ఆలూరు బుజ్జిబాబు, ఆలూరు శ్రీనివాసరావు వంటి వారు తక్కువ ధరలకే గన్నవరం మండలం కీసరపల్లి, చిన్నఅవుటుపల్లి, బుద్ధవరం, అల్లాపురం, అజ్జంపూడి గ్రామాల్లో విమానాశ్రయం విస్తరణకు అవసరమైన భూములను కొనుగోలు చేశారని రైతులు చెబుతున్నారు. అవే భూములను భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) కింద గన్నవరం ఎయిర్పోర్టు అభివృద్ధికి అప్పగించి.. రాజ«ధానిలో అత్యంత ప్రధానమైన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లను వారు దక్కించుకున్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి కీసరపల్లిలో 39.15 ఎకరాల భూమిని సీఎం చంద్రబాబు సన్నిహితుడు, సినిమా నిర్మాత చలసాని అశ్వనీదత్ భూ సమీకరణ కింద ఇచ్చి.. రాజధానిలో వెస్ట్రన్ బైపాస్కు సమీపంలో మూడు రోడ్ల కూడలిలో 17,580 గజాల వాణిజ్య ప్లాటు, దానికి సమీపంలోనే వెయ్యి గజాల చొప్పున 38 నివాస ప్లాట్లు, 150 గజాల మరొక నివాస ప్లాటును దక్కించుకున్నారు. అశ్వనీదత్ 17,580 గజాల వాణిజ్య ప్లాటును యూనియన్ బ్యాంకులో తనఖా పెట్టి రూ.85 కోట్లు అప్పు తీసుకోవడం గమనార్హం. తమకు మాత్రం తమ భూములను తనఖా పెట్టి అప్పు తీసుకోవడానికి సర్కార్ మోకాలడ్డిందంటూ రాజధాని రైతులు మండిపడుతున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన తమకు చెరువులు, ముంపు ప్రాంతాలు, శ్మశానాల పక్కన ప్లాట్లను లాటరీ పేరుతో అంటగట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గన్నవరం భూ సమీకరణలో మరో ఇన్సైడర్ ట్రేడింగ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయంగా అభివృద్ధి చేయడం కోసం కొత్త రన్ వే, కొత్త టెర్మినల్, ఫ్లై ఓవర్లు, మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టేందుకు రూ.4 వేల కోట్ల వ్యయంతో 2015లో కేంద్రం సిద్ధమైంది. అందుకు అవసరమైన 687 ఎకరాలను తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ భూమిని భూ సమీకరణ కింద సమీకరించాలని అప్పటి చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. పట్టా భూమైతే ఎకరానికి.. మెట్ట, జరీబుతో సంబంధం లేకుండా వెయ్యి గజాల నివాస ప్లాటు, 450 గజాల వాణిజ్య ప్లాటుతోపాటు ఏడాదికి రూ.50 వేలు చొప్పున.. ప్రతి ఏటా రూ.5 వేలు పెంచుతూ పదేళ్లపాటు కౌలు ఇస్తామని నిర్ణయించింది. ఇదే విషయాన్ని అస్మదీయులకు ఉప్పందించింది. అదే రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కింద భూమి ఇస్తే.. పట్టా భూమైతే అదీ జరీబు అయితేనే ఆ మేరకు ప్రయోజనం కలుగుతుంది. అదే మెట్ట భూమైతే ఎకరానికి వెయ్యి గజాల నివాస ప్లాటు, 250 గజాల వాణిజ్య ప్లాటు, ఏడాదికి రూ.30 వేల చొప్పున కౌలు ఇస్తారు. రాజధానిలో కంటే గన్నవరం విమానాశ్రయానికి భూ సమీకరణ కింద భూమి ఇస్తేనే అధిక ప్రయోజనం చేకూరుతుంది. దాంతో గన్నవరం విమానాశ్రయం విస్తరణకు సమీకరించే 687 ఎకరాల్లో (గన్నవరం మండలం కీసరపల్లి, చిన్నఅవుటుపల్లి, అల్లాపురం, బుద్ధవరం, అజ్జంపూడి గ్రామాల్లో) పచ్చ గద్దలు వాలాయి. తమతో తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేస్తూ తొలుత అగ్రిమెంటు చేసుకుని, భూ సమీకరణ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుని.. వాటిని ప్రభుత్వానికి అప్పగించారని రైతులు వాపోతున్నారు. సీఎం సన్నిహితుల్లో కొందరు ఇలా..⇒ సీఎం చంద్రబాబుకు బలుసు శ్రీనివాసరావు అత్యంత సన్నిహితుడు. రాజధానిలో భారీ ఎత్తున కాంట్రాక్టు పనులు దక్కించుకున్నారు. ఈయన కీసరపల్లిలో సర్వే నెంబరు 280/4లో 1.80, 282/7లో 0.11, 282/8లో 0.84, 252/1ఏలో 1.42, బుద్ధవరంలో సర్వే నెంబరు 463/14లో 0.68, 463/12లో 0.45, 463/16లో 0.52, 463/15లో 0.39, 463/13లో 0.48 ఎకరాలు మొత్తం 6.69 ఎకరాలు కొనుగోలు చేసి విమానాశ్రయానికి ల్యాండ్ పూలింగ్ కింద అప్పగించారు. ⇒ రాజధాని ప్రాంతంలో మందడం గ్రామానికి చెందిన బెజవాడ రమేష్ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు. ఆయన, తండ్రితో కలిసి గన్నవరం మండలం కీసరపల్లిలో సర్వే నంబర్ 252/1బీలో 1.91 ఎకరాలు, 251/2లో 1.50, బుద్ధవరంలో 477/7లో 0.44, 477/12లో 0.89, 452/4ఏలో 0.76, 225/2లో 2.94, 250/26లో 2.53, 426/1లో 4.12 ఎకరాలు (బెజవాడ రమేష్ తండ్రి బెజవాడ సాంబశివరావు), 484/5లో 0.63, 484/4/బీ2లో 0.33, 476/3సీలో 0.35, 476/2సీలో 0.25, 476/3సీలో 1.15, 511/7లో 1.04, 460/1ఏ/2లో 0.64, 452/4సీలో 2.91, 479/4లో 1.29, 491/3బీలో ఎకరం, అల్లాపురంలో సర్వే నంబరు 8/3ఏలో 0.50, 8/3సీలో 0.50, 8/3డీలో 0.50, చిన్నఅవుటుపల్లిలో సర్వే నంబర్ 43/4/బీ2లో 0.32, అజ్జంపూడిలో సర్వే నంబరు 155/1లో 0.27, 40/3లో ఎకరం, 56/2లో 0.24, 56/3బీలో 0.17 వెరసి 28.18 ఎకరాలు కొనుగోలు చేసి గన్నవరం విమానాశ్రయానికి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు.⇒ రాజధానిలో మందడం గ్రామానికి చెందిన ఆలూరు బుజ్జిబాబు, ఆయన సోదరుడు ఆలూరు శ్రీనివాసరావులతో సీఎం చంద్రబాబుకు సాన్నిహిత్యం ఉంది. వీరు గన్నవరం మండలం కీసరపల్లిలో సర్వే నంబరు 251/1బీలో 1.91 ఎకరాలు, అజ్జంపూడిలో సర్వే నంబరు 142/2లో 0.93, 150/1లో 0.18, బుద్ధవరంలో సర్వే నంబరు 484/5లో 0.63, 516/4లో 1.21, చిన్నఅవుటుపల్లిలో సర్వే నంబరు 40/3లో ఎకరం.. వెరసి 5.86 ఎకరాలను ఆలూరు బుజ్జిబాబు.. గన్నవరం మండలం బుద్ధవరంలో సర్వే నెంబరు 426/2ఏ/1లో 3.96 ఎకరాలు, 426/1ఏలో 2.26, 516/4లో 1.21, 426/2ఏ/1లో 3.81.. వెరసి 11.24 ఎకరాలను కొనుగోలు చేసి గన్నవరం విమానాశ్రయానికి ల్యాండ్ పూలింగ్ కింద అప్పగించారు. ⇒ గన్నవరం మండలం కీసరపల్లిలో చలసాని అశ్వనీదత్కు 39.15 ఎకరాల భూమి ఉంది. అశ్వనీదత్ భార్య వినయకుమారి సర్వే నంబరు 250/3లో 4, 250/5లో 4, 205/8లో 6.15, 250/6ఏలో ఎకరం, 250/7లో 4, 250/6బీలో ఎకరం.. మొత్తం 20.15 ఎకరాలు.. చలసాని అశ్వనీదత్ సర్వే నంబరు 250/3లో 5, 250/4లో 4, 250/9లో 10.. మొత్తం 19 ఎకరాలు వెరసి రూ.39.15 ఎకరాలు భూమిని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూ సమీకరణ కింద ఇచ్చారు.లాటరీలో వీళ్లకే జాక్పాట్!గన్నవరం విమానాశ్రయం అభివృద్ధికి వీరంతా సమీకరణ కింద భూములు ఇచ్చినందుకు రాజధాని ప్రాంతంలో వారికి నివాస, వాణిజ్య ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించామని సీఆర్డీఏ చెబుతోంది. కానీ.. ప్రధాన ప్రాంతంలో రహదారులకు సమీపంలోనే చలసాని అశ్వనీదత్, బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్ తదిరుతలకు ప్లాట్లు ఎలా తగిలాయని, తమకు అలా ఎందుకు తగలలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.సినీ నిర్మాత అశ్వనీదత్కు రాజధానిలోని వెస్ట్రన్ బైపాస్ సమీపంలో మూడు రోడ్ల కూడలిలో కేటాయించిన 17,580 గజాల వాణిజ్య ప్లాటు ⇒ చలసాని అశ్వనీదత్, ఆయన భార్య భూ సమీకరణ కింద ఇచ్చిన 39.15 ఎకరాలకుగాను రాజధానిలో వెస్ట్రన్ బైపాస్కు పక్కనే.. డైమండ్ సర్కిల్కు అతి సమీపంలో ఉత్తరాన 15.6, తూర్పున 25, పశ్చిమాన 17 మీటర్ల రోడ్డు అంటే మూడు రోడ్ల కూడలిలో 17,580 గజాల విస్తీర్ణం కలిగిన వాణిజ్య ప్లాటు దక్కడం గమనార్హం. ఇక ఆ ప్లాటుకు అత్యంత సమీపంలోనే వెయ్యి గజాల విస్తీర్ణంతో కూడిన 38 ప్లాట్లు.. 150 గజాల విస్తీర్ణంతో కూడిన మరో నివాస ప్లాటు పక్కపక్కనే అశ్వనీదత్ కుటుంబానికి దక్కడం తమను విస్మయానికి గురిచేసిందని రాజధాని రైతులు వాపోతున్నారు.⇒ బలుసు శ్రీనివాసరావు గన్నవరం ఎయిర్పోర్టుకు భూ సమీకరణ కింద ఇచ్చిన భూమికి గాను.. రాజధానిలో అమృత యూనివర్సిటికీ సమీపంలో తూర్పున 50 మీటర్ల రోడ్డు, పశ్చిమాన 17 మీటర్ల రోడ్డుతో కూడిన 3,660 గజాల వాణిజ్య ప్లాటును లాటరీ ద్వారా సీఆర్డీఏ కేటాయించడం గమనార్హం. ఈ ప్లాటుకు సమీపంలోనే 25 మీటర్ల రోడ్డు పక్కనే 14,640 గజాల విస్తీర్ణంతో కూడిన నివాస ప్లాటును బలుసు దక్కించుకున్నారు.సీఎం చంద్రబాబు సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావుకు రాజధానిలో అమృత యూనివర్సిటీకి ఎదురుగా 50 మీటర్ల రహదారి పక్కనే కేటాయించిన 3,660 గజాల వాణిజ్య ప్లాటు ⇒ బెజవాడ రమేష్కు రాజధానిలో.. వెస్ట్రన్ బైపాస్ సమీపంలో అశ్వనీదత్కు చెందిన 17,580 గజాల వాణిజ్య ప్లాటుకు సమీపంలోనే తూర్పున 17 మీటర్లు, దక్షిణాన 25 మీటర్ల రోడ్డుతో కూడిన 5,940 గజాల విస్తీర్ణం కలిగిన వాణిజ్య ప్లాటును కేటాయించారు. దాని పక్కనే ఆలూరు బుజ్జికి 1,350 గజాల ప్లాటును ఇచ్చారు. వాటి సమీపంలోనే మిగతా వాణిజ్య ప్లాట్లు, నివాస ప్లాట్లను వారికి లాటరీ ద్వారా కేటాయించడం గమనార్హం.సీఎం చంద్రబాబు సన్నిహితుడైన బెజవాడ రమేష్కు అశ్వనీ దత్కు కేటాయించిన వాణిజ్య ప్లాటు సమీపంలోనే 5,940 గజాలతో కూడిన రెండు ప్లాట్లను కేటాయించిన సీఆర్డీఏ ఆ భూముల విలువ రూ.5,338 కోట్లు.. అభివృద్ధి పనులకు రూ.4 వేల కోట్లు రాజధానిలో కేటాయించిన నివాస ప్లాట్ గజం రూ.50 వేల చొప్పున ఎకరానికి వచ్చే వెయ్యి గజాలకు రూ.5 కోట్లు.. వాణిజ్య ప్లాట్ ధర రూ.2.70 కోట్లు పలుకుతుందని 2024 సెప్టెంబర్లో సీఆర్డీఏ వేసిన అంచనాల ఆధారంగా ప్రపంచ బ్యాంకుకు చంద్రబాబు సర్కార్ నివేదిక ఇచ్చింది. ఈ లెక్కన గన్నవరం విమానాశ్రయం కోసం తీసుకున్న 687 ఎకరాలకుగాను రాజధానిలో కేటాయించిన నివాస, వాణిజ్య ప్లాట్ల విలువ రూ.5,298 కోట్లు. ఎకరానికి పదేళ్లకు కౌలు రూ. 7.25 లక్షల చొప్పున 687 ఎకరాలకు రూ.49.80 కోట్లు. ఈ లెక్కన గన్నవరం ఎయిర్పోర్ట్ కోసం తీసుకున్న భూమి విలువ రూ.5,347.80 కోట్లన్నమాట.ఈ ఎయిపోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయడానికి కేంద్రం రూ.4 వేల కోట్లు వ్యయం చేసింది. అంటే.. ఈ ఎయిర్పోర్ట్ కోసం రూ.9,338.80 కోట్ల మేర ఖర్చు చేసినట్లు స్పష్టమవుతోంది. 2024 వరకు గన్నవరం విమానాశ్రయాన్ని రాజ«దానిలో అంతర్భాగంగానే ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఇది రాజధాని ప్రాంతానికి 35 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ నేపథ్యంలో రాజధానికి మరో విమానాశ్రయం అవసరం ఎంతమాత్రం లేదని మేధావులు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రాజధానిలో నివాస ప్లాటు గజం రూ.50,000.. వాణిజ్య ప్లాటు రూ.2.70 కోట్లు పలుకుతుందని 2024 సెప్టెంబర్లో సీఆర్డీఏ వేసిన అంచనా ఆధారంగా ప్రపంచ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ‘డబ్బుల్’ ధమాకాకు స్కెచ్⇒ రాజధాని నిర్మాణం కోసం ఉమ్మడి గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడికొండ, మంగళగరి మండలాల పరిధిలోని 29 గ్రామాలలో ప్రభుత్వం 2015లో 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించింది. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూమి కలిపి 53,748 ఎకరాల్లో (217 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టినట్లు ప్రకటించింది.⇒ ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అత్యద్భుతమైన రాజధాని నిర్మిస్తామంటూ అప్పట్లో సీఎం చంద్రబాబు గొప్పగా ప్రకటించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణం, రహదారులు.. మురుగు నీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు.. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చినా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతుందని, దాన్ని అమ్మగా వచ్చే నిధులతో అమరావతి తనను తానే నిర్మించుకుంటుందని సీఎం చంద్రబాబు అనేకసార్లు సెలవిచ్చారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూ గొప్పలు చెప్పారు.⇒ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత 29 గ్రామాలకే రాజధాని పరిమితమైతే చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందంటూ చంద్రబాబు కుండబద్ధలు కొట్టారు. ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే రాజధానిలో భూముల ధరలు పెరుగుతాయని చెప్పుకొచ్చారు. అయితే ఆ ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్కు భూములు లేవని చెప్పడంతో రైతులు విస్తుపోతున్నారు.⇒ వాటి కోసం 11 గ్రామాల్లో 44,676.74 ఎకరాల సమీకరణకు లీకులు ఇచ్చారు. రాజధాని రైతుల్లో ఆగ్రహాన్ని పసిగట్టి.. దాన్ని చల్లార్చేందుకు మలి విడతలో 20,484 ఎకరాలకు సమీకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదే సమయంలో తాడికొండ మండలం రావెల వద్ద 4,618 ఎకరాల్లో రూ.3,409 కోట్ల వ్యయంతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఆ భూమిని సేకరించాలా? సమీకరించాలా అన్నది నిర్ణయిస్తామని ప్రభుత్వం చెబుతోంది.⇒ ఇప్పటికే రాజధానికి సమీకరించిన 53 వేల ఎకరాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర కనీస మౌలిక సదుపాయాల కల్పనకే రూ.1.50 లక్షల కోట్లు అవసరం. తాజాగా సమీకరిస్తున్న 20,484 ఎకరాలతోపాటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సమీకరించే భూమిని కలుపుకుంటే ఆ సౌకర్యాల కోసం మరో రూ.1.50 లక్షల కోట్లు అవసరమని నిపుణులు చెబుతున్నారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి ఆ వ్యయం రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని అధికారుల అంచనా. ఆ రూ.3 లక్షల కోట్లను అప్పుగా తేవాల్సిందే.⇒ ఈ అప్పును వడ్డీతో కలిపి చెల్లించడానికి ఇంకెన్ని రూ.లక్షల కోట్లు అవసరమవుతాయో అంచనా వేసుకోవచ్చని, ఇలాగైతే రాజధాని రాష్ట్రానికి గుదిబండగా మారడం ఖాయమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాజధానిలో భూముల ధరలు పెంచుకోవడం.. ఎయిర్పోర్టు పనులను అస్మదీయునికి అప్పగించి కమీషన్లు దండుకోవడం కోసం చంద్రబాబు సర్కారు గన్నవరం ఎయిర్పోర్టుకు మంగళం పాడటంతో పాటు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
దేశద్రోహం.. మనోళ్లే వదిలేద్దాం!
‘మనోళ్లు’ అయితే దేశ ద్రోహానికి పాల్పడినా సరే సమ్మతిస్తాం అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎంతగా అంటే మావోయిస్టులకు టెలీ కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం, నగదు సరఫరా చేసిన ఓ అస్మదీయ కాంట్రాక్టరుకు వత్తాసు పలుకుతూ, ఆ కేసును నీరుగార్చిన ఐపీఎస్ అధికారికి అండగా నిలుస్తోంది. టీడీపీకి ఎన్నికల నిధులు సమకూర్చే బడాబాబు.. టీడీపీకి వీర విధేయుడైన ఆ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం రాయలసీమలో రెడ్బుక్ అరాచకాలకు అండగా నిలుస్తున్నారు. సాక్షి, అమరావతి : ‘మనోళ్లు’ అయితే దేశ ద్రోహానికి పాల్పడినా సరే సమ్మతిస్తాం.. సమగ్ర విచారణ లేకుండా కనికట్టు చేస్తాం.. అని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. ఎంతగా అంటే మావోయిస్టులకు టెలీ కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం, నగదు సరఫరా చేసిన అస్మదీయ కాంట్రాక్టరుకు వత్తాసు పలుకుతోంది. ఆ కేసును నీరుగార్చిన ఐపీఎస్ అధికారికి అండగా నిలుస్తోంది. ఆ మావోయిస్టులే గిరిజన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలతోపాటు కొందరు పోలీసులను హతమార్చారని తెలిసినా సరే ఉద్దేశ పూర్వకంగా ఉదాసీన వైఖరి అవలంబిస్తోంది.ఎందుకంటే ఆయన అధికార టీడీపీకి ఎన్నికల నిధులు సమకూర్చే బడాబాబు.. టీడీపీకి వీర విధేయుడైనా ఆ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం రాయలసీమలో రెడ్బుక్ అరాచకాలకు అండగా నిలుస్తున్నారు. ఆ వ్యవహారంపై సమగ్ర విచారణ లేకుండా విషయాన్ని కప్పిపుచ్చేందుకే ప్రాధాన్యమిస్తోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయకుండా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీని ప్రభుత్వ పెద్దలు, పోలీసు పెద్దలు కట్టడి చేస్తున్నారు. పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారం కథ కమామిషు ఇలా ఉంది. ఏవోబీలో మావోయిస్టులకు కీలక పరికరాలు, నిధులు 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీకి అనుకూల బడా కాంట్రాక్టు సంస్థకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కాంట్రాక్టు పనులు కట్టబెట్టారు. ఆ సంస్థ ప్రధానంగా అరకు, పాడేరు నియోజకవర్గాల పరిధిలో కాంట్రాక్టు పనులు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ యజమానికి మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. భయంతోనో, ఇతరత్రా కారణాలతోనో ఆయన మావోయిస్టులకు భారీగా నిధులు సమకూర్చడం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) వర్గాలు గుర్తించాయి.ఎస్ఐబీ వర్గాలు ఇచ్చిన సమాచారంతో 2016లో అరకు వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఆ కాంట్రాక్టు సంస్థకు చెందిన వాహనాల్లో భారీగా టెలీ కమ్యూనికేషన్ పరికరాలు (నిఘా పరికరాలు), బంగారం, నగదు, ఇతర సామగ్రిని అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. మావోయిస్టు పార్టీ ఏవోబీ కార్యదర్శిగా ఉన్న గాజర్ల రవి బృందానికి వాటిని సరఫరా చేయడానికి తీసుకువెళుతున్నట్టు విచారణలో వెల్లడైంది.ఎన్నో ఏళ్లుగా ఆ కాంట్రాక్టు్ట సంస్థ మావోయిస్టులకు భారీగా నగదు, ఇతర పరికరాలు సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. అప్పటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి, ఆ కాంట్రాక్టు సంస్థ మేనేజర్ను అరెస్టు చేశారు. దేశ ద్రోహ నేరంగా యూఏపీఏ (అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) చట్టం, టెలీగ్రాఫ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. దాంతో పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి మావోయిస్టులకు ఎన్నేళ్లుగా ఆర్థిక సహయం అందిస్తోంది.. మావోయిస్టులను ఏఏ ప్రాంతాల్లో కలుస్తున్నది.. ఈవ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులెవరనేది గుర్తిస్తారని అంతా భావించారు. కుట్రతో కేసును నీరుగార్చిన అధికారి ⇒ సరిగ్గా అప్పుడే అప్పటి ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా పోలీసు అధికారి రంగ ప్రవేశం చేశారు. టీడీపీకి వీర విధేయుడిగా గుర్తింపు పొందిన ఆయన అవినీతి గురించి అప్పటికే కథలు కథలుగా చెప్పుకునేవారు. ఆ కేసులో బడా కాంట్రాక్టు సంస్థ యజమానితో ఆయన కుమ్మక్కు అయ్యారు. అందుకు భారీగా ముడుపులు ముట్టినట్టు సమాచారం. అందుకే దేశ ద్రోహం వంటి తీవ్రమైన నేరానికి పాల్పడినా సరే, బరితెగించి పక్కాగా కేసును నీరుగార్చేందుకు కథ నడిపారు. ⇒ నిబంధనల ప్రకారం సంఘటన స్థలంలో అరెస్టు అయిన కాంట్రాక్టు సంస్థ మేనేజర్నే కాకుండా నిధులు అందించిన కాంట్రాక్టు సంస్థ యజమానిని నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేయాలి. ఎందుకంటే యజమాని ఇచ్చిన నిధులు, పరికరాలనే మేనేజర్ మావోయిస్టులకు చేరవేసేందుకు తీసుకువెళుతున్నారు. కానీ ఆ ఐపీఎస్ అధికారి మాత్రం కేవలం మేనేజర్పైనే కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. కాంట్రాక్టు సంస్థ యజమానిని కనీసం పిలిచి విచారించనూ లేదు. ⇒ యూఏపీఏ కేసులను డీఎస్పీ స్థాయి అధికారి విచారించాలి. చార్జ్షిట్ దాఖలు చేయాలి. కానీ ఐపీఎస్ అధికారి ఉద్దేశ పూర్వకంగానే ఈ కేసులో తాను చెప్పింది చెప్పినట్టు చేసే ఓ సీఐకి విచారణ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఆయనతో చార్జ్షిట్ దాఖలు చేయించారు. ⇒ యూఏపీఏ కేసులను జిల్లా కేంద్రంలోని మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం విచారించాలి. కానీ ఐపీఎస్ అధికారి ఆ కేసును అరకు న్యాయస్థానంలో విచారణకు పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా కూడా పోలీసు అధికారులు నిందితులకు అనుకూలంగా వ్యవహరించారు. ⇒ఈ నేపథ్యంలో దేశ ద్రోహం వంటి తీవ్రమైన నేరం కేసులో కూడా నిందితులను న్యాయస్థానం విడిచిపెట్టింది. పైగా అరకు న్యాయస్థానం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జిల్లా న్యాయస్థానంలో పిటిషన్ కూడా వేయకపోవడం గమనార్హం. ఆ బడా కాంట్రాక్టర్ తమకు అస్మదీయుడు కావడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు కూడా చూసీ చూడనట్టు వదిలేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సమగ్ర విచారణకు ఆదేశం ⇒ 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ కేసు విషయం బయటపడింది. ఆ కాంట్రాక్టు సంస్థ సమకూర్చిన నిధులతోనే 2018లో మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి బృందం అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సోమేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేశారని కూడా గుర్తించింది. ఎంతో మంది పోలీసులను హతమార్చడానికి కూడా ఆ నిధులనే వాడుకున్నారని వెల్లడైంది. దేశ ద్రోహానికి పాల్పడిన కేసులో నిందితులకు పోలీసులు అండగా నిలవడం ఏమిటని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ⇒ ఫలితంగా కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లా ఎస్పీ ఈ కేసును సమగ్రంగా విచారించాలని విశాఖపట్నంలోని ఏడీజే న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల మేరకు డీఎస్పీ స్థాయి అధికారి విచారించాలని, కాంట్రాక్టు సంస్థ యజమానిని నిందితుడిగా చేర్చాలని, ఈ కేసును సమగ్రంగా విచారించాలని పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ కేసును సమగ్రంగా విచారించాలని ఆదేశించింది. ⇒ దాంతో బడా కాంట్రాక్టరు, ఐపీఎస్ అధికారి (ఆయన అప్పటికి అమరావతికి బదిలీ అయ్యారు) బెంబేలెత్తారు. కేసు సమగ్రంగా విచారిస్తే ఇద్దరి బాగోతం బయట పడుతుందని ఆందోళన చెందారు. అందుకే విశాఖపట్నం జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే మళ్లీ పాత కథే⇒ హైకోర్టులో కేసు విచారణలో ఉండగానే రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దాంతో పోలీసు శాఖ ప్రాధాన్యతలు మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే బడా కాంట్రాక్టర్, అవినీతి ఐపీఎస్ అధికారి ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. ఆ బడా కాంట్రాక్టర్ టీడీపీకి ఎన్నికల నిధులు సమకూర్చారు. ఇక ఆ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం రాయలసీమలో రెడ్బుక్ అరాచకాలకు అండగా నిలుస్తూ బరితెగించి ‘అవినీతి అనకొండ’గా చెలరేగిపోతున్నారు.⇒ ఈ కేసును సమగ్రంగా విచారిస్తే వారిద్దరి బాగోతం బయట పడుతుందని ప్రభుత్వ పెద్దలు భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును సమగ్రంగా విచారించాలని విశాఖపట్నం జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో తోసిపుచ్చింది. కాగా, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని పోలీసు శాఖలో కొందరు సూచించారు. ⇒ హైకోర్టు తీర్పు వెలువడిన 90 రోజుల్లో ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయాలి. లేకపోతే ఆ కేసులో ఒక్కరికి కూడా శిక్ష పడకుండానే శాశ్వతంగా మూసి వేసినట్టు అవుతుంది.. జాతీయ స్థాయిలో ఏపీ పోలీసు శాఖకు తీరని మచ్చగా మిగిలిపోతుంది.. మావోయిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు, ఇతర కుటుంబాలను అవమానించినట్టు అవుతుందని వారు స్పష్టం చేశారు. అయినా సరే ప్రభుత్వ పెద్దలు, డీజీపీ కార్యాలయం మాత్రం సుముఖంగా స్పందించలేదని తెలుస్తోంది.⇒ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసేందుకు ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఉలుకూ పలుకూ లేకుండా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశ పూర్వకంగా 90 రోజుల గడువు ముగిసేలా చేయాలన్నదే ప్రభుత్వ పెద్దలు, డీజీపీ కార్యాలయం, ఏఎస్ఆర్ జిల్లా పోలీసుల ఉద్దేశమన్నది స్పష్టమవుతోంది. కేవలం అస్మదీయ కాంట్రాక్టర్, రెడ్బుక్ వేధింపులకు అండగా నిలుస్తున్న అవినీతి ఐపీఎస్ అధికారి కోసం ఏకంగా దేశద్రోహం కేసునే అడ్డగోలుగా మూసి వేసేందుకు బరితెగించడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. -
రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలుతోంది
నూజివీడు: రైతు బాధలను పట్టించుకోని రైతు వ్యతిరేక ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యమేలుతోందని.. మామిడి, మొక్కజొన్న రైతులను గాలికి వదిలేశారని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. ఏలూరు జిల్లా నూజివీడులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో మామిడి, మొక్కజొన్న రైతుల సమస్యలపై ఆదివారం సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పేర్ని నాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయని దుర్మార్గ ప్రభుత్వం ఉండటం రైతుల దౌర్భాగ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్కు రూ.2,400ల మద్దతు ధర ప్రకటిస్తే దళారులు కేవలం రూ.1,700లకే కొనుగోలు చేస్తున్నారని.. ఫలితంగా రైతులు రూ.700 నష్టపోతున్నారని చెప్పారు. రైతుల బాధలు, వారు సాగుచేసే పంటల గురించి తెలియని మంత్రి ఈ రాష్ట్రానికి వ్యవసాయ మంత్రిగా ఉన్నాడని.. పైగా, పంటలే సాగుచేయని సింగపూర్ దేశానికి వెళ్లి శిక్షణపొంది వచ్చారని ఎద్దేవా చేశారు. పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే.. మామిడికి రాజకీయ ‘మంగు’.. ప్రసిద్ధి చెందిన నూజివీడు మామిడికి గడ్డుకాలం రావడం ప్రభుత్వ వైఫల్యమే. ఇక్కడి మామిడికి రాజకీయ మంగు పట్టింది. ఇంకా మూడేళ్లు దీనిని భరించక తప్పదు. గతేడాది చిత్తూరులో మామిడి రైతులకు కిలోకు రూ.4లు ఇచ్చినప్పుడు నూజివీడు రైతులకు ఎందుకివ్వలేదు? మామిడి, మొక్కజొన్న రైతులకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ నాయకులు మంత్రిని ఎందుకు నిలదీయడంలేదు? ఇక్కడి మంత్రి ఒళ్లంతా ఆముదం పూసుకుంటున్నాడు. వైఎస్ జగన్ను తిట్టడానికి ఉన్న ఆసక్తి నియోజకవర్గ రైతులకు మేలు చేద్దామనిలేదు.మన దేశం నుంచి యూరప్ దేశాలకు వెళ్లే పల్ప్పై ఆ దేశాలు షుగర్ సెస్ వేస్తుండగా.. దానిని తొలగించేలా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చిత్తూరు జిల్లాలోని ఫ్యాక్టరీల యజమానులు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదు. దీనివల్ల మామిడిని కొనుగోలు చేయడానికి ఫ్యాక్టరీలు ముందుకు రావడంలేదు. రైతులను పట్టించుకోని వ్యవసాయ మంత్రి ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేయడం ఎందుకు? అలాగే, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? ఈ నియోజకవర్గానికి చెందిన మంత్రికి ఏమాత్రం సత్తా ఉన్నా రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి. రాబోయేది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే. రైతులకు మంచి రోజులు వస్తాయి. మామిడి చెట్లను ఎవరూ నరకొద్దు.దోచుకోవడం, దాచుకోవడమే సర్కారు పని: జోగి రమేష్మాజీమంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడమే అజెండాగా ప్రభుత్వం పనిచేస్తోందని, రైతుల బాధలు పట్టించుకునే స్థితిలో ప్రభుత్వంలేదని మండిపడ్డారు. మామిడి, మొక్కజొన్న, ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. రైతులను, మహిళలను, విద్యార్థులను ఆదుకోలేని అసమర్థ ప్రభుత్వం ఉండటం ప్రజల దురదృష్టకరమని విమర్శించారు.మేకా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. నూజివీడు మామిడి కనుమరుగయ్యేలా ఉందని, ప్రభుత్వాలు పట్టించుకుని మామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మొక్కజొన్న రైతులకూ చేయూతనివ్వాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు, జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
-
జంకుబొంకు లే‘కొండ’!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటికే విశాఖలోని కొండలకు గుండు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని.. అధికారపార్టీ నేతలూ ఓ సంస్థకు కూతవేటు దూరంలో కొండల కబ్జాకు కుట్రపన్నుతున్నారు. పెద్ద కొండలపై గద్దల్లా వాలేందుకు జంకుబొంకు లేకుండా సిద్ధమవుతున్నారు. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండల పరిధిలోని శొంఠ్యాం గ్రామ పరిధిలో సర్వే నంబరు 346, 347లల్లో 469.9 ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండలను పెద్ద కొండలుగా స్థానికులు పిలుస్తుంటారు. ఇవి పచ్చని చెట్లతో విస్తరించి ఉండడంతో అనేక అడవి జంతువులకు స్థావరంగా ఉన్నాయి. రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్న ఈ కొండలపై అధికారపార్టీ నేతల కన్నుపడింది. దీంతో ఒక కార్పొరేషన్ చైర్మన్తో పాటు ఎమ్మెల్యే పీఏలు ఇద్దరు, రెవెన్యూ అధికారులు ఓ ముఠాగా ఏర్పడ్డారు. కొండలను కేకుల్లా కట్చేసుకుని చేజిక్కించుకునేందుకు ఇప్పటికే డ్రోన్లతో ప్రైవేటు సర్వే చేశారు. మొత్తం 469.9 ఎకరాల్లో 150 ఎకరాల భూమికి కొద్ది మంది రైతుల సాగులో ఉన్నట్టుగా బినామీల పేర్లతో దొంగ పట్టాలు సృష్టించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు స్థానిక రెవెన్యూ యంత్రాంగం సహకరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో అక్రమార్కులు ఎవరి పేరుతో ఎంత భూమి తీసుకోవాలనే లెక్కలు వేసుకున్నారు. బినామీ పేర్లతో తలా 20 ఎకరాల చొప్పున కాజేతకు కుట్రపన్నుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే కొండల్లో రాళ్లు కూడా పాతినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఎకరా భూమి ధర రూ.3 కోట్ల మేర పలుకుతుంది. అంటే మొత్తం 150 ఎకరాల భూమి విలుఉవ సుమారు రూ.450 కోట్లకుపైగా విలువ చేస్తుందన్నమాట. ఈ వ్యవహారంలో స్థానిక కూటమి నేతలకు కూడా ఐదు నుంచి పది ఎకరాల చొప్పున వాటా ఇస్తున్నట్టు సమాచారం. ఇక రెవెన్యూ అధికారులకు కూడా వారి వాటాగా వారికి 10 ఎకరాలు చొప్పున పంచుకున్నట్టు తెలుస్తోంది. భూ సమీకరణ పేరుతో లబ్ధి పొందేందుకే!వాస్తవానికి ఈ కొండ దిగువన ఇప్పటికే విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించింది. అక్కడ సాగులో ఉన్న రైతులకు నిబంధనల మేరకు ఎకరాకు 900 గజాల చొప్పున లే–అవుట్ వేసి మరీ అప్పగించింది. ఈ లే–అవుట్కు ఆనుకునే ఈ పెద్ద కొండలు ఉన్నాయి. ఈ కొండలను కూడా త్వరలో వీఎంఆర్డీఏ ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటుందనే ప్రచారం ఉంది. ఇందుకోసం త్వరలో గ్రామ సభను నిర్వహించే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమాచారం ముందస్తుగానే తెలుసుకున్న సదరు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే ఇద్దరు పీఏలు, రెవెన్యూ యంత్రాంగం ఈ కబ్జా కుంతంత్రానికి తెరలేపారు. తమ బినామీల పేర్లను జాబితాలో చూపెట్టి.. సాగులో ఉన్నట్టు తప్పుడు రికార్డులను సృష్టించి ల్యాండ్ పూలింగ్లో ఎకరాకు 900 గజాల స్థలాన్ని కాజేసేందుకు ఈ తతంగమంతా నడిపిస్తున్నట్టు అర్థమవుతోంది. తద్వారా సదరు కార్పొరేషన్ చైర్మన్, ఇద్దరు పీఏలతో పాటు రెవెన్యూ అధికారులు కాస్తా తమ బినామీ పేర్లతో ఏకంగా తలా 18 వేల గజాల స్థలాన్ని వీఎంఆర్డీఏ నుంచి తీసుకుని.. అనంతరం బినామీల నుంచి కొన్నట్టు చూపి తమపరం చేసుకునేందుకు పన్నాగం పన్నినట్టు స్పష్టమవుతోంది. -
ఆర్టీసీ.. ప్రై‘వేటు’!
సాక్షి, అమరావతి: ప్రగతి రథ చక్రం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ను ప్రైవేటుపరం చేసే కుట్రలకు చంద్రబాబు ప్రభుత్వం పదును పెడుతోందని తేటతెల్లమైంది. విద్యుత్ బస్సుల ముసుగులో తన కుతంత్రాన్ని మరింత వేగవంతం చేసింది. దాదాపు 50 వేల మంది ఉద్యోగులతో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఆర్టీసీని దొంగదెబ్బ తీస్తోంది. మొదటగా 12 డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. మరోవైపు ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తుండటం పట్ల ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేశారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ముసుగు తొలగించి తమ పన్నాగాన్ని బహిర్గతం చేసింది. ఈ క్రమంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పదని ఆ సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణ అసలు విషయం చల్లగా వినిపించారు. తద్వారా ఆర్టీసీ ప్రైవేటీకరణ తథ్యం అని కూటమి ప్రభుత్వం కుండబద్దలు కొట్టేసింది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ఆయువు తీసేందుకు పావులు కదపడం మొదలు పెట్టింది. వంద శాతం విద్యుత్ బస్సుల (ఈ–బస్సులు) విధానం ముసుగులో పక్కా పన్నాగం పన్నింది. కానీ ఈ–బస్సులను ఆర్టీసీ నిర్వహించవచ్చన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని తిరస్కరించింది. కార్పొరేట్ సంస్థల ద్వారానే ఈ–బస్సులు ప్రవేశ పెట్టాల్సిందేనని తేల్చి చెప్పింది. ఉద్యోగుల సంఖ్యలో కోత విధించవచ్చని కూడా ప్రకటించింది. గత ఏడాది నవంబరులో సీఎం చంద్రబాబు సమక్షంలోనే నిర్వహించిన సమీక్షలో ఆ మేరకు ఆర్టీసీ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది. ఈ–బస్సుల్లో పూర్తిగా ప్రైవేట్ ఉద్యోగులేఆర్టీసీలో ప్రస్తుతం 11,116 బస్సులు ఉన్నాయి. 2029 నాటికి ఆర్టీసీలో వంద శాతం ఈ–బస్సులే ఉండాలనే విధానానికి ప్రభుత్వం 2024 నవంబర్లో ఆమోదించింది. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న 100 ఈ–బస్సుల్లో పూర్తిగా ప్రైవేటు ఉద్యోగులే ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు స్థానం లేదు. ఈ నేపథ్యంలో 2029 నాటికి వంద శాతం ఈ–బస్సులను ప్రవేశ పెడతామని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. అంటే ఈ–బస్సుల ముసుగులో పూర్తిగా ఆర్టీసీని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలన్నది ప్రభుత్వ పన్నాగమన్నది సుస్పష్టమవుతోంది. ఆర్టీసీ వేలుతోనే ఆ సంస్థ కన్ను పొడిచే పన్నాగాన్ని చంద్రబాబు సర్కారు అమలు చేస్తోంది. ఆర్టీసీని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ఆ సంస్థ ఉన్నతాధికారుల ద్వారానే నివేదిక ఇప్పించుకోవడం గమనార్హం. 50 శాతం ఈ–బస్సులను ప్రవేశ పెట్టేందుకే అవసమైన వ్యయాన్ని భరించలేమని ఆర్టీసీ ఉన్నతాధికారులే నివేదిక ఇచ్చేలా కుట్ర పన్నింది. అనంతరం ఆ నివేదికను చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమోదించారు. ఆ నివేదిక ప్రకారం 50 శాతం ఈ–బస్సులకు అవసరమైన రూ.8,243 కోట్ల మూల ధన వ్యయంతోపాటు ప్రతి నెల రూ.336 కోట్ల నిర్వహణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించలేదని తేల్చి చెప్పేశారు. కాబట్టి విద్యుత్ బస్సులను ప్రైవేటు సంస్థల ద్వారానే నిర్వహించాలని నిర్ణయించారు. 50 శాతం బస్సులే నిర్వహించలేమని తేల్చి చెప్పిన ప్రభుత్వం.. మరోవైపు ఆర్టీసీలో 2029 నాటికి వంద శాతం ఈ–బస్సులు ప్రవేశపెడతామని ప్రకటించింది. అంటే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటుపరం చేస్తామని తేల్చి చెప్పింది. రూ.6 వేల కోట్ల ఆస్తులు ప్రైవేటుకు..ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో 12 డిపోల భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ స్టేషన్లు, డిపోల రూపంలో ఉన్న విలువైన భూములే ఆర్టీసీకి వెన్నుముక. ఆ వెన్నెముకకు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచింది. విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురంలో అత్యంత విలువైన ప్రదేశాల్లో ఉన్న డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. ఒక్కో డిపో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అంటే 12 డిపోల విస్తీర్ణం దాదాపు 120 ఎకరాలు. ఆయా ప్రాంతాల్లో ఎకరా భూమి మార్కెట్ విలువ రూ.25 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఉంది. సగటున ఎకరా భూమి విలువ రూ.50 కోట్లు లెక్కన వేసుకున్నా, ఆ 12 డిపోల మార్కెట్ విలువ ఏకంగా రూ.6 వేల కోట్లు! పక్కా కుతంత్రంతో ఆర్టీసీ నిర్వీర్యం⇒ ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా కుతంత్రంతో పావులు కదుపుతోంది. అందుకోసం ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తోంది. ‘ప్రధానమంత్రి ఈ–బస్ సేవా’ పథకం కింద ప్రవేశపెట్టే ఈ–బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్ను ప్రభుత్వం తిరస్కరించింది. ప్రైవేటు కార్పొరేట్ సంస్థల ద్వారానే ప్రవేశపెడతామని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఆర్టీసీ కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయడం లేదు. ⇒ గత ఆరు నెలల్లోనే కాలం చెల్లిన 264 బస్సులను ఇటీవల సర్వీసుల నుంచి తొలగించారు. కానీ వాటి స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టనే లేదు. మరో 2 వేల బస్సులు 15 ఏళ్ల కాల పరిమితి దాటిపోయాయి. ఆ డొక్కు బస్సులనే కొనసాగిస్తోంది. సగటున రోజుకు ఒక బస్సును సర్వీసు నుంచి తొలగిస్తోంది. కానీ కొత్తగా కొనుగోలు చేసే ఉద్దేశమే లేదని స్పష్టం చేస్తోంది. తద్వారా ఆర్టీసీలో డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించి, ప్రైవేటు సంస్థల ద్వారా ఈ–బస్సులను ప్రవేశపెట్టాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేస్తోంది. ⇒ ఆర్టీసీలో కొత్త ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే విస్మరిస్తోంది. ఏడాదిలో 617 మంది డ్రైవర్లు, 821 మంది కండక్టర్లు రిటైరయ్యారు. అంటే 1,438 పోస్టులు ఖాళీ అయ్యాయి. మొత్తం ఆర్టీసీలో దాదాపు 8 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినా సరే ఆ పోస్టులను భర్తీ చేసే ఉద్దేశమేలేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అందుకే జాబ్ కాలండర్లో ఆర్టీసీలో ఉద్యోగాల ఊసే ఎత్త లేదు. ⇒ 2029 నాటికి ఆర్టీసీలో 50 శాతం పోస్టులు ఖాళీ అవుతాయి. దాంతో ఆర్టీసీని మూసివేయవచ్చన్నది బాబు ప్రభుత్వ కుతంత్రంగా ఉందని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆర్టీసీని ప్రైవేటుకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం బరితెగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్టీసీకి స్వర్ణ యుగంఆర్టీసీ అభివృద్ధి, ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనకపోయినా.. వైఎస్ జగన్ ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక కలను సాకారం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. విలీనం వద్దు అని ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చినా సరే, వైఎస్ జగన్ మాత్రం 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అమలులోకి వచ్చింది. ఫలితంగా ఉద్యోగులకు ప్రతి నెలా జీతాల కోసం ప్రభుత్వం రూ.360 కోట్లు కేటాయించేలా ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఆర్టీసీ ఆర్థిక కష్టాలు తీరాయి. దశాబ్దాలుగా ఆర్టీసీ ఉద్యోగుల జీతాల కోసం ఆర్టీసీ ప్రతి నెలా బ్యాంకుల నుంచి అప్పులు చేస్తూ వచ్చింది. ఆ ఆర్థిక ఇబ్బందులను వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. 2020లో ఆర్టీసీకి ఉన్న రూ.8 వేల కోట్ల అప్పుల్లో 2024 నాటికి రూ.5 వేల కోట్లు అప్పు చెల్లించింది. 220 కొత్త బస్సులు కొనుగోలు చేసింది. మరో 1,500 బస్సులను రీ–మోడలింగ్ చేసింది. దాంతో ఆర్టీసీ ప్రగతి బాట పట్టింది. ఉద్యోగుల అలవెన్సులను ప్రతి నెలా జీతాలతో పాటు చెల్లించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విధంగా అటు ఆర్టీసీ అభివృద్ధి, ఇటు ఉద్యోగుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యదిక ప్రాధాన్యం ఇచ్చిందని, అది ఆర్టీసీకి స్వర్ణ యుగమని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేసుకుంటున్నారు. -
మెదళ్లలోకి విషపు విత్తులు!
రక్షణరంగ పరికరాల దిగుమతుల్లో నంబర్ వన్ అనే అపఖ్యాతిని వదిలించుకొని స్వావలంబన వైపు పయనించవలసిన పరిస్థితి భారత్కు ఏర్పడింది. ఆత్మ నిర్భర భారత్ ప్రణాళిక కింద ఇందుకోసం భారత ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ కంపెనీలను రంగంలోకి దించింది. ఎడాపెడా 718 పారిశ్రామిక లైసెన్స్లను వారికి జారీ చేసింది. భారత పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ చొరవ తీసుకొని 14 రాష్ట్రాల్లో అరవైకి పైగా భారీ ప్రాజెక్టులు ప్రారంభమయ్యేందుకు ఏర్పాట్లు చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా రక్షణ ప్రాజెక్టుల కోసం కేంద్రం సరళీకరించింది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీఎత్తున రెండు డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేసింది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు మరో ఆరు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను రక్షణరంగ పెట్టుబడుల కోసం ఎంపిక చేసింది. వాటిలో ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి – కర్నూలు ప్రాంతం కూడా ఒకటి!పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఏఎమ్సీఏ) ప్రాజెక్టుకు నిన్న (శుక్రవారం) కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి మాట్లాడుతూ త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాలనూ, సాంకేతికతనూ ఆంధ్రప్రదేశ్ నుంచే తయారు చేయబోతున్నట్టు ప్రకటించారని ‘ఈనాడు’ రాసింది. అతిథిగా వచ్చారు కనుక ముఖప్రీతికోసం ఆమాత్రం మాట్లాడి ఉండొచ్చు కూడా! రక్షణ పరికరాల ఉత్పత్తుల కోసం కుదుర్చుకున్న ఎమ్ఓయూల్లో సింహభాగాన్ని తన సొంత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్కే మళ్లించుకున్నామని ఆయన ఇక్కడ చెప్పలేరు కదా? పనిలో పనిగా తమ ఎన్డీయే కూటమిలో రెండో పెద్దపార్టీగా ఉన్న టీడీపీ అధినేతపై కూడా సభా మర్యాదను పాటిస్తూ కొన్ని పొగడ్తలు కురిపించారు.రక్షణమంత్రే స్వయంగా వీరతాడు వేస్తే చంద్రబాబు రెచ్చిపోకుండా ఉంటారా? అదే ఊపులో మాట్లాడుతూ ఇరవై మూడు నెలల్లో ఇరవై మూడు లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాననీ, ఇరవై మూడు లక్షల ఉద్యోగాలు వీటివల్ల లభిస్తాయనీ పునరుద్ఘాటించారు. గడిచిన కొద్ది రోజులుగా ఆయన ఇదే పాటను ప్రతిచోట పదేపదే పాడుతున్నారు. ఈమధ్యనే ఒక జాతీయ ఛానల్లో మాట్లాడుతూ తాను కల్పించిన ఉద్యోగాల సంఖ్యను కూడా 23 లక్షల కోట్లుగా చెప్పుకున్నారు. ఆ యాంకర్కు పాపం మూర్ఛ వచ్చినంత పనైంది. కానీ, యాంకర్ ఇబ్బందిని గమనించే స్థితిలో బాబుగారు లేరు. ఆయన పాడాలనుకున్న పాటను పూర్తిగా పాడేశారు. పుట్టపర్తి సభలో చంద్రబాబు వదిలేసిన భాగాన్ని యువనేత లోకేశ్బాబు పూర్తి చేశారు.పుట్టపర్తికి వచ్చి పంచ్ డైలాగ్ కొట్టకుండా నేను వెళ్లలేనని లోకేశ్ వెల్లడించారు. పంచ్ డైలాగ్లపై పేటెంట్ హక్కు సినిమాల్లో మామయ్యదీ, రాజకీయాల్లో తనదీ అనే నమ్మకం కావచ్చు. ఇంతకీ ఆ పంచ్ డైలాగ్ ఏమిటంటే, ‘‘వైసీపీది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్. మనది ఫైటర్జెట్ బ్యాక్గ్రౌండ్. బోత్ ఆర్ నాట్ సేమ్. అర్థమైందా రాజా’’. ఇందులో ఉన్న పంచ్ ఏమిటని వెతకాల్సిన అవసరం మనకు లేదు. ఎవరి ఆత్మతృప్తి వారిది. తాను మునిగింది గంగ... తాను వలచింది రంభ... తాను విసిరింది పంచ్... అంతే! ఈ సభలో ఆత్మస్తుతి భాగాన్ని చంద్రబాబు తీసుకుంటే, పరనింద భాగాన్ని చినబాబు తీసుకున్నారు. ఆ మరుసటి రోజు శనివారం నాడు శ్రీకాకుళంలో జరిగిన స్వచ్ఛాంధ్ర సభలో ఈ రెండు భాగాలనూ చంద్రబాబే స్వీకరించారు. ఆయన చెప్పిన ప్రకారం 2019–24 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పోగైందట! అందులో పావు భాగాన్ని ఎత్తేసరికి 23 నెలల కాలం గడిచిపోయిందట! ఈ లెక్కన మిగిలిన మూడేళ్లలో మిగిలిన చెత్తను ఎత్తే కార్యక్రమమే సరిపోతుంది. ఇంకో ఐదేళ్ల్లకు గెలిపిస్తే సంపద సృష్టికార్యం అప్పుడు మొదలవుతుంది కాబోలు!ఈ ఆత్మస్తుతి, పరనింద అనే రెండంచెల తెలుగుదేశం విధానం కేవలం యథాలాప రాజకీయ విన్యాసం మాత్రమే కాదు. ఇది వ్యూహాత్మకంగా, ఆలోచించి రూపొందించిన ఒక రకమైన కుతర్కం. ఈ కుతర్కాన్ని వ్యాప్తం చేయడంకోసం ఆ పార్టీ ప్రత్యేకమైన పదజాలాన్ని కూడా రూపొందించింది. ఈ పదజాలంతో తనను బ్రాండింగ్ చేసుకోవడంతోపాటు విపక్ష వైసీపీని కూడా బ్రాండింగ్ చేసే ప్రయత్నాన్ని ముమ్మరంగా చేస్తున్నది. యెల్లో మీడియాగా అపకీర్తి మూటగట్టుకున్న సంప్ర దాయ మీడియాతోపాటు వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన యూ–ట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా సైన్యం టీడీపీ బ్రాండింగ్ బాజాను ముందుకు తీసుకొనిపోవడానికి ఓవర్ టైమ్ పనిచేస్తున్నాయి. ఈ బ్రాండింగ్ భజంత్రీల జుగల్బందీ లెక్క ప్రకారం తెలుగుదేశం అంటే అభివృద్ధి. వైసీపీ అంటే విధ్వంసం. ఎలా అని ప్రశ్నించడం అమాయకత్వం. తర్కానికి నిలబడుతుందా అనే మీమాంసతో కూడా పనిలేదు. ఈ పద జాలాన్ని ఒక ప్రభంజనంలా ప్రచారంలో పెట్టి జనం మెదళ్లలోకి ఎక్కించడమే వారి ఉద్యమం.ఇవాళ్టి శ్రీకాకుళం సభలో కూడా చంద్రబాబు అదే పని చేశారు. వైసీపీ అంటే గొడ్డలి పార్టీ అని మరోసారి చెప్పారు. 2024లో నరకాసుర పాలన అంతమైన తర్వాత మీరంతా దీపావళి పండుగ చేసుకున్నారా లేదా అని ఒకటికి రెండుసార్లు అడిగి మరీ చేతులు ఎత్తించుకున్నారు. టీడీపీ చేస్తున్న ఈ విష ప్రచారాన్ని డిగ్రీలు మెడలో వేసుకున్న పలువురు అజ్ఞానులు సైతం నమ్మడం అనేది వర్తమాన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక విషాదం. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమైపోతుందన్న సామెత ఉండనే ఉన్నది కదా! ప్రచార హోరులో కొట్టుకొని పోకుండా ఏరకంగా మీరు అభివృద్ధికి రోల్ మోడలో సెలవీయండని చంద్రబాబును, ఆయన పార్టీని ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది. వాస్తవ గణాంకాలను తులనాత్మకంగా అధ్యయనం చేయవలసిన అగత్యం ఏర్పడింది.1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన నాటినుంచే ‘నిజమైన’ అభివృద్ధి దేశంలో పట్టాలెక్కిందని మన పెట్టుబడి దారీ ఆర్థికవేత్తలు, మన మేధావులు చెబుతున్నారు. అప్పటి నుంచే లెక్కలోకి తీసుకుంటే ఈ 35 సంవత్సరాల కాలంలో ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్లో 16 సంవత్సరాలపాటు చంద్రబాబే అధికారంలో ఉన్నారు. ఇప్పుడూ ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం కూడా అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉన్నది. అడవులతో నిండిన మధ్య భారత్, కొండలకు నెలవైన ఈశాన్య భారత్, హిమశ్రేణుల ఉత్తర భారత్ ప్రాంతాలు కూడా అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ను వెక్కిరిస్తున్నాయి. జీఎస్డీపీ తలసరి ఆదాయంలో ఈ రాష్ట్రానిది 18వ స్థానం. మానవాభివృద్ధి సూచికల్లో 26వ స్థానం (28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో). నిరుద్యోగిత రేటులో జాతీయ సగటును ఆంధ్రప్రదేశ్ తలదన్నింది. కేంద్ర ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారం దేశంలో సగటు నిరుద్యోగిత శాతం 5.2. కాగా, ఆంధ్రప్రదేశ్లో అది 8.2 శాతం. ప్రజల సగటు ఆయుర్దాయంలో ఈ రాష్ట్రం 13వ స్థానంలో ఉన్నది. చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చిన ఈ ఇరవై మూడు మాసాల్లో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని జీఎస్టీ వసూళ్ల లెక్కలే తేటతెల్లం చేస్తున్నాయి. అప్పులు చేయడంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టిందనీ, అప్పుకోసం ప్రతి మంగళవారం దేహీ అని యాచించకపోతే పూట గడవని స్థితిలోకి రాష్ట్రం దిగజారిందనీ కూడా అధికారిక గణాంకాలే కుండబద్దలు కొడుతున్నాయి.వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన విధ్వంస పాలన ఎట్లా అయింది? ఈ ఆరోపణకు ఉన్న ఆధారాలేమిటి? పేదా–ధనిక వివక్ష లేకుండా, కులమతాల తేడా చూడకుండా ఈ నేలమీద పుట్టిన ప్రతి బిడ్డకూ నాణ్యమైన విద్య లభించాలని జగన్ మోహన్రెడ్డి ఒక బృహత్తర కార్యక్రమాన్ని తలకెత్తుకున్న మాట వాస్తవం కాదా? నాడు – నేడు పేరుతో 35 వేల పాఠశాలలకు పునర్వికాసాన్ని సంకల్పించి, అందులో సగానికి పైగా పూర్తిచేసి, పిల్లలకు మంచి యూనిఫామ్ను కూడా ప్రభుత్వమే సమకూర్చి, పోషకాహారాన్ని అందివ్వలేదా? డ్రాపవుట్లు ఉండకూడదన్న ఉద్దేశంతో ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రవేశపెట్టి, ఇంగ్లిషు మీడియంలో బోధనను ప్రారంభించి, సీబీఎస్ఈ సిలబస్ పాఠాలు చెప్పించలేదా! ఎనిమిదో తరగతి, తొమ్మిదో తరగతి విద్యా ర్థులకు ట్యాబ్లను అందజేసి, డిజిటల్ బోధనకు అంకురార్పణ చేసింది జగన్ సర్కార్ కాదా? అంతర్జాతీయ స్థాయి ఐబి సిలబస్ను సైతం సర్కార్ బడి పిల్లలకు సమకూర్చేందుకు సన్నాహాలు చేసింది జగన్మోహన్రెడ్డి కాదా?టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఈ యజ్ఞం భగ్నమైందని ఆంధ్రప్రదేశ్లోని ఏ గ్రామ చావడిలో నిలబడి అడిగినా చెబుతారు. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలంటే చందాలు వసూలు చేయాలని ఈమధ్యనే ముఖ్యమంత్రి సెలవిచ్చారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని కూడా గతంలోనే ఆయన చెప్పిన మాటను కూడా గుర్తు చేసుకోవాలి. సర్కార్ బడి చదువులను చారిటీ పద్దు కిందకు మార్చడమంటే పేద పిల్లలను నాణ్యమైన చదువుకు దూరం చేయడమే. పేదరికం నుంచి ఆ కుటుంబాల విముక్త మార్గాన్ని మూసివేయడమే! చదువే ప్రపంచాన్ని మార్చే పదునైన ఆయుధమని అంబేడ్కర్, పూలే, నారాయణ గురు వంటి వేగుచుక్కలే కాదు, మండేలా వంటి ఆఫ్రికన్ సూరీడు కూడా అదే మాట చెప్పారు.చంద్రబాబు ఫిలాసఫీ ప్రకారం నాణ్యమైన విద్య ప్రైవేట్ స్కూళ్లలో చదువు కొనుగోలు చేసే పిల్లలకే దక్కాలి. సర్కార్ బడుల గడప దాటలేని పేద పిల్లలు చీప్ లేబర్గా మార్కెట్లో నిలబడిపోవాలి. పేదరిక నిర్మూలనపై కూడా చంద్రబాబు ఆలోచనలు వక్రమార్గంలోనే ప్రయాణిస్తున్నాయి. సంపన్నులైన వారు కొన్ని పేద కుటుంబాలను చేరదీసి వారిని ఆదుకోవాలట! పేదరికం నుంచి విముక్తి పొందడం రాజ్యాంగబద్ధమైన హక్కనీ, అది ప్రభుత్వాల ప్రాధమిక బాధ్యతనీ ఆయన గుర్తించడం లేదు. మరోసారి నెల్సన్ మండేలాను గుర్తు చేసుకుందాము. ‘‘పేదరిక నిర్మూలన అనేది చారిటీ కాదు, అదొక ప్రాథమిక న్యాయం. పేదరికం సహజంగా ఏర్పడేది కాదు, రుద్దబడేది. బానిస సంకెళ్లను తెంచుకోవడానికి జరిగిన పోరాటాలు ఎంత పవిత్రమో, పేదరిక విముక్త పోరాటాలు కూడా అంతే పవిత్ర’’ మని మండేలా చెప్పారు. ప్రాథమిక విద్యే కాదు, ఉన్నత విద్య విషయంలోనూ జగన్ చేపట్టిన సహజ న్యాయ సూత్రాలను చంద్రబాబు తలకిందులు చేశారు. పేదలందరికీ చదువు, వైద్యం సులభంగా అందడం కోసం ఆయన ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం వెంపర్లాడుతున్నది. విద్యారంగం, వైద్యరంగం మాత్రమే కాదు, ప్రతి రంగంలో ఈ ఇద్దరు నేతలు అవలంబించిన విధానాలు ఇదే పద్ధతిలో కొనసాగాయి. సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయం జగన్ విధానాలకు చోదక శక్తులైతే, ప్రైవేటుకు పెద్దపీట, ప్రచార పటాటోపం చంద్రబాబు పాలనను నడిపి స్తున్నాయి. ఈ విధానాల ఫలితంగా లక్షలాది జీవితాలు సాధికా రతకు, ఆత్మగౌరవానికి దూరమవుతున్నాయి. గిట్టుబాటు ధరల్లేక, గింజలు కొనే నాథుడు లేక లక్షలాదిమంది రైతన్నలు అలో లక్ష్మణా అని అలమటిస్తున్నారు. ఇది కదా సామాజిక విధ్వంసం అంటే? దీన్నే కదా విధ్వంస పాలన అనాలి?వైసీపీ గొడ్డలి పార్టీ ఎలా అయింది? టీడీపీ కార్యాలయాల మీద శాంతి కపోతాలు ఎప్పటినుంచి ఎగురుతున్నాయి? జగన్ పాలనతో పోలిస్తే శాంతిభద్రతల పరిస్థితి ఇప్పుడు భేషుగ్గా ఉందని ఏ లెక్కలు తేల్చాయి? హత్యలు ఆగిపోయాయా? అత్యాచారాలు ఆసలే లేవా? అపహరణలు ఆగిపోయాయా? గంజాయి ఈ రాష్ట్రం సరిహద్దుల్లోకే రావడం లేదా? విచ్చల విడిగా మద్యం దొరికే అవకాశమే లేక పల్లెలు పట్టణాలన్నీ ప్రశాంతంగా నిద్రిస్తున్నాయా? కుల మత భేదాలూ కలహాలు లేకుండా ఆకివీడు నుంచి కడప దాకా అన్ని వర్గాల ప్రజలు భుజాల మీద చేతులు వేసుకొని భాయిభాయి అంటూ సంచరించే విధంగా ప్రభుత్వ పెద్దలు ప్రోత్సహిస్తున్నారా? ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను, గణాంకాలను చూపకుండా, కేవలం పదజాలపు మాయాజాలంతో జనం మెదళ్లలో విషపు విత్తులు నాటితే, ప్రజలను విభజించి పాలించాలనుకుంటే అది రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా ఎల్లకాలం సాగదు. చరిత్ర మిమ్మల్ని ప్రజా కంటకులుగా అభిశంసిస్తుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
పిల్లల భవిష్యత్తును అంధకారంలో పడేసిన కూటమి ప్రభుత్వం
-
కూటమి సర్కార్ బిగ్ డెసిషన్.. త్వరలో గన్నవరం ఎయిర్ పోర్ట్ మూసివేత...?
-
కొండకి గుండు.. ఏపీ మ్యాప్ నుంచి విశాఖను లేపేసే కుట్ర
-
గన్నవరం ఎయిర్ పోర్టుకు సర్కారు ఉరి
సాక్షి, అమరావతి: ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ అనవసర వ్యయాలు తగ్గించుకుని పొదుపు పాటించండని పిలుపునిస్తుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ దుబారాలో తనను మించిన వారు లేరని నిరూపిస్తున్నారు. ఈ క్రమంలో తన ప్రచార కండూతి కోసం రాజధానిలో విమానాశ్రయం పేరుతో రూ.7,500 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయడానికి వెనుకాడటం లేదు.నిన్నటి వరకు గన్నవరం రాజధానిలో భాగమంటూ ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కోసం రూ.4,000 కోట్లకు పైగా వ్యయం చేసి, ఇప్పడు టెర్మింనల్ పనుల టెండర్లను రద్దు చేసి ఎక్కడి పనులను అక్కడే ఆపేశారు. భూ సేకరణ, ఫ్లై ఓవర్లు, కొత్త రన్వే, కొత్త టెర్మింనల్ ఇలా రూ.నాలుగు వేల కోట్ల ఖర్చును గంగపాలు చేయడానికి సిద్ధమైపోయారు. ఈ క్రమంలో అమరావతిలో 4,618 ఎకరాల్లో రూ.3,409 కోట్ల పెట్టుబడితో కొత్త విమానాశ్రయం కట్టడానికి సిద్ధపడుతుండటంపై రాష్ట్ర ప్రజలు భగ్గుమంటున్నారు. ఇప్పటిదాక విజయవాడ, గన్నవరం రాజధాని అమరావతి పరిధిలోకే వస్తాయంటూ ప్రచారం చేసిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది. గన్నవరం విమానాశ్రయం అమరావతికి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి–16కు ఆనుకొని అందరికీ అందుబాటులో ఉంది. పైగా పశ్చిమ బైపాస్ ద్వారా 30 నిమిషాల్లోనే రాజధానికి చేరుకునే వీలుంది. ఇవన్నీ లెక్కలు వేసుకునే అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు ఏకంగా 700 ఎకరాలు సేకరించారు.భూ సేకరణ సమయంలో గన్నవరం కూడా రాజధాని పరిధిలోకే వస్తుందని హామీ ఇవ్వడమే కాకుండా, విమానాశ్రయం విస్తరణకు భూమి ఇచి్చన రైతులకు రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించారు. ఇప్పుడు ఈ విమానాశ్రయాన్ని అమరావతికి తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తు అవసరాలకు మరింత విస్తరించాల్సింది పోయి దీన్ని మూసి వేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. 1,670 ఎకరాల్లో హీత్రూ విమానాశ్రయం దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుత జనాభా 3.4 కోట్లు. ఢిల్లీలో ఉన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ 1,500 ఎకరాల లోపే. దేశ ఆర్ధిక రాజధాని ముంబై జనాభా 1.25 కోట్లు. అక్కడి ఛత్రపతి శివాజీ విమానాశ్రయం ఉన్నది 1,850 ఎకరాల్లోనే. హైదరాబాద్ జనాభా 1.10 కోట్లు. శంషాబాద్ రాజీవ్గాంధీ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు కేటాయించినా, ఇప్పటి వరకు వినియోగించుకున్నది 2 వేల ఎకరాలు మాత్రమే. అంతర్జాతీయంగా అత్యంత రద్దీగా పేరు పొందిన లండన్ హీత్రూ విమానాశ్రయం 1,670 ఎకరాల్లోనే ఉంది. ఆ విమానాశ్రయం నుంచి ఏటా 84 దేశాలకు చెందిన 214 ప్రాంతాలకు 8 కోట్ల మందికిపైగా ప్రయాణిస్తారు.అయితే మూడు లక్షల జనాభా కూడా లేని అమరావతి రాజధానిలో అంతర్జాతీయ ఎయిర్పోర్టు కోసం దాదాపు 5 వేల ఎకరాలు ఎందుకని తెలుగుదేశం పార్టీ నాయకులే విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతి తొలి దశ పూర్తి కావడానికే 30 ఏళ్లకు పైగా సమయం పడుతుందని ప్రపంచ బ్యాంకు నివేదికలు చెబుతున్నాయని, అక్కడ ఇప్పుడు ఇంత భారీ విస్తీర్ణంలో, భారీ ఖర్చుతో కొత్త విమానాశ్రయం అవసరం ఏముందని ప్రశి్నస్తున్నారు. ఇది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేపట్టిన ప్రాజెక్టు తప్ప మరొకటి కాదని, అమరావతి విమానాశ్రయం ఆలోచన ఉపసంహరించుకొని గన్నవరం విమానాశ్రయాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాభవం కోల్పోనున్న విజయవాడ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పిచ్చి కారణంగా విజయవాడ నగరం ప్రాభవాన్ని కోల్పోయే పరిస్థితి వచి్చందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ తర్వాత రాష్ట్రానికి ప్రధాన నగరంగా వెలుగొందుతున్న విజయవాడ ఇకపై అనామకంగా మిగిలిపోయేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. దేశంలో ప్రధాన బస్టాండ్లలో ఒకటిగా ఉన్న విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒకటైన విజయవాడ రైల్వే స్టేషన్ను కూడా అమరావతికి తరలించి విజయవాడను రాజధానితో అనుబంధం లేకుండా చేస్తున్నారంటూ మేధావులు వాపోతున్నారు.ఏదైనా ప్రైవేట్ సంస్థ కొత్తగా ఎయిర్పోర్టు నిర్మింస్తే సమీపంలో మరో ఎయిర్పోర్టు ఉండకూడదని ప్రభుత్వాలతో కన్సెషన్ ఒప్పందాలు చేసుకుంటాయి. 150 కిలోమీటర్ల దూరంలో అప్పటికే ఎయిర్పోర్టులు ఉంటే వాటిని మూసివేయాలి. దీని ప్రకారం అమరావతిలో కొత్త ఎయిర్పోర్టు వస్తే 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ను మూసి వేయాల్సి ఉంటుంది.కేంద్ర ప్రభుత్వం కూడా పక్కపక్కనే రెండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులకు అనుమతి ఇవ్వదని అధికారులు చెబుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు వచి్చన తర్వాత బేగంపేట ఎయిర్పోర్టు మూత పడినట్లే, అమరావతి ఎయిర్పోర్ట్ వస్తే గన్నవరం విమానాశ్రయం కూడా మూసి వేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అయినా అంత పెద్ద లండన్లోనే ఒకే విమానాశ్రయం ఉండగా, గన్నవరం సమీపంలోని అమరావతిలో మళ్లీ కొత్తగా విమానాశ్రయం నిర్మాణానికి పూనుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పొదుపు చర్యలు అంటే ఇవేనా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మండిపడుతున్నారు. -
పెట్రో ధర పెంపుపై భగ్గుమన్న జనం
సాక్షి, అమరావతి: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై జనం ఒక్కసారిగా భగ్గుమన్నారు. శుక్రవారం ధరల పెంపును నిరసిస్తూ పలు చోట్ల అప్పటికప్పుడు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. సీపీఎం, సీపీఐలు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునివ్వడంతో అనేక ప్రాంతాల్లో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలతోపాటు పలు జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద ధర్నాలు చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ (వీఏటీ) తగ్గించి సామాన్యులకు ఊరట ఇవ్వాలని, ధరల పెరుగుదల వల్ల పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు.విజయవాడ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకు వద్ద ధర్నా చేశారు. ఫ్లాట్ రిక్షాకు బైక్ను తాళ్లతో కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. దీంతో విజయవాడ–బందరు ప్రధాన రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రవాణా రంగం కుదేలవుతుందని, నిత్యావసర సరకుల ధరలు పెరుగుతాయని, ప్రజలు, రైతాంగంపై భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెట్రో ధరలు పెంచడం ప్రజలకు నమ్మకద్రోహం చేయడమేనని మండిపడ్డారు.కృష్ణా జిల్లాలో రైతుల నిరసనఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరుగుతాయని, ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా నాగయలంకలో వారు నిరసనకు దిగారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో సీపీఐ శ్రేణులు రోడ్డుపై ఖాళీ గ్యాస్ సిలెండర్లు పెట్టి, తాళ్లతో ఆటోను లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వైఎస్సార్ సర్కిల్ నుండి తిలక్ రోడ్డులోని పెట్రోల్ బంక్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏలూరులోను వామపక్ష పార్టీలు పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ధర్నాలు చేశాయి. కడపలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కాకినాడలో ఆటోకు తాళ్లు కట్టి లాగుతూ సీపీఐ శ్రేణులు నిరసన తెలిపాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో లారీకి తాళ్లు కట్టి లాగి నిరసన తెలిపారు. నమ్మించి మోసం చేశారు..పెట్రోల్, డీజిల్పై రూ.3కు పైగా పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం వేయడం తగదని, పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే వంట గ్యాస్ ధర పెంపుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్లు మూతపడి ఉపాధి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు.ఇప్పుడు చమురు ధరలు పెంచడం వల్ల రవాణా రంగంపై పెనుభారం పడనుందని, నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేజీ బేసిన్లో రాష్ట్రానికి 50 శాతం వాటా ఇచ్చేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్ ధరలను పెంచడం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. ఈ మేరకు నేతలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. -
ఏపీలోనే అధిక బాదుడు
నాడుఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, ఇక్కడే ఫుల్ ట్యాంక్ చేసుకుని వెళ్లండంటూ పొరుగు రాష్ట్రాల్లో బోర్డులు పెట్టారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే వాటి ధర ఎక్కువ. ఫలితంగా నిత్యావసరాల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్పై రాష్ట్రం వేసే పన్నే ఇందుకు కారణం. ప్రభుత్వం తొలుత ఆ పన్ను తగ్గిస్తే ధరలన్నీ తగ్గుతాయి. టీడీపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్పై వేసిన పన్నును తగ్గిస్తాం. తద్వారా రాష్ట్రంలో అన్ని ధరలు తగ్గుతాయి. – ఎన్నికలకు ముందు చంద్రబాబునేడుప్రపంచ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రజలంతా పొదుపు పాటించేలా అవగాహన కల్పించాలి. పెట్రోల్, డీజిల్ ఆదా చేయాలి. తక్కువ దూరాలకు సైకిళ్లను వినియోగించాలి. కార్ పూలింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలి. ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి. వారంలో ఒకరోజు నో వెహికల్ డే గా పాటించాలి. – గురువారం కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబుసాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంధన రేట్లు భగ్గుమంటున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఠారెత్తిస్తున్నాయి. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతున్నాయి. శుక్రవారం నుంచి ఏపీలో లీటరు పెట్రోల్పై రూ.3.29, డీజిల్పై రూ.3.14 పెరిగింది. అత్యధికంగా పల్నాడులో లీటరు పెట్రోల్ రూ.113.62, డీజిల్ రూ.101.24కు ఎగబాకింది. ఫలితంగా రవాణా రంగంతో పాటు ఆహార, నిత్యావసరాల ధరలపై తీవ్ర ప్రభావం పడనుంది. వాస్తవానికి ఏపీలో రోజుకు 9 వేల కిలో లీటర్ల పెట్రోల్, 15–20వేల కిలో లీటర్ల డీజిల్ వినియోగం ఉంది.తాజాగా ధరల పెరుగుదలతో రోజు పెట్రోల్పై రూ.3.29 కోట్లు, డీజిల్పై రూ.6 కోట్లకుపైగా ఆర్థిక భారం పడుతుంది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కేరళంతో పోల్చుకుంటే రూ.3, తమిళనాడుతో పోల్చితే ఏకంగా రూ.10, కర్ణాటకతో చూసినా రూ.7 వరకు వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగింది. గృహ వినియోగ సిలిండర్ రూ.950–980 ఉంటోంది. కమర్షియల్ గ్యాస్ రూ.3,300కుపైగా చేరింది. నెలల వ్యవధిలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు పైపైకి ఎగబాకడంతో సామాన్య ప్రజలు విలవిల్లాడుతున్నారు. పెరిగిన భారం ప్రభుత్వం భరించకుండా ఇంధనం పొదుపు చేయాలంటూ ఉచిత సలహాలు ఇస్తుండటం పట్ల మండిపడుతున్నారు.రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, అధికారంలోకి రాగానే వాటిపై రాష్ట్రం విధిస్తున్న వ్యాట్, తదితర పన్నులు తొలగిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ విషయం గురించి మాట మాత్రంగా కూడా ప్రస్తావించడం లేదు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని నెటిజన్లు ఉతికారేస్తున్నారు. వెంటనే పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించి సామాన్యులకు ఆర్థిక ఊరట కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వంట నూనెలు సహా నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇంకోవైపు ప్రభుత్వం రేషన్లో ఇచ్చే సబ్సిడీ కందిపప్పు, గోధుమ పిండి, చిరుధాన్యాల పంపిణీకి మంగళం పాడేసింది. రైతులకు ధాన్యం మద్దతు ధర దక్కకపోగా, బహిరంగ మార్కెట్లో బియ్యం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. -
దేవుడి దగ్గరకు వెళ్లి మనం గుండు కొట్టుకుంటే - వీళ్ళు మాత్రం దేవుడికే గుండు కొట్టేస్తున్నారు
-
ప్రాంతాలు పూర్తిగా నష్టపోతాయి బాబు ఎందుకు అడ్డుకోవడం లేదు?
-
సంఘం డైరీ ఒక కిక్కు... బోడి మంత్రి పదవి లో ఏముందని...
-
భూసేకరణ పేరుతో 50 వేల ఎకరాలపై కన్నేసిన బాబు..
-
ఏపీలో ఆగని చంద్రబాబు దుబారా ఖర్చు
-
భూ సమస్యలపై ‘రెవెన్యూ’ రాబందులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మా భూమి రెవెన్యూ రికార్డులో ఇబ్బందులున్నాయి. నాకు ఎప్పుడో పట్టా ఇచ్చారు. అయితే ఆన్లైన్లో ప్రభుత్వ భూమి అని ఉంది. పరిష్కరించండి.. అంటూ విశాఖ మధురవాడకు చెందిన ఒక వ్యక్తి విశాఖ కలెక్టరేట్లో అర్జీ ఇచ్చారు. తర్వాత కొన్ని రోజులకు ఫలానా మంత్రి పేషీ నుంచి అంటూ అతడికి ఫోన్ వచ్చింది. ఆ తర్వాత ఓ మంత్రి సోదరుడు, ఓఎస్డీ అంటూ కొందరు ఫోన్చేసి ఏకంగా అతడి ఇంటికి వెళ్లారు. మీ భూమి సమస్యలను మేం పరిష్కరిస్తాం.. సగం ధరకే మాకివ్వండి.. అంటూ బేరసారాలాడారు. తనకు ఈ సమస్య ఉందని ఏకంగా అమరావతిలోని మంత్రికి ఎలా తెలిసిందో అర్థంగాక ఆ వ్యక్తి ఆశ్చర్యపోయారు. ఆనందపురం, సబ్బవరం, భీమిలిలో డీ–పట్టాలు ఉన్న పలువురు రైతులతోను ఇదే తరహాలో ఓ మంత్రి సోదరుడు, పీఏ అంటూ చర్చలు జరుపుతున్నారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం త్వరలో రెగ్యులరైజ్ చేస్తుందని, మీ భూములను మేం చూసుకుంటామంటూ బేరసారాలు ఆడుతున్నారు. అడ్డకు పావుసేరు ధరకే బేరసారాలను కొనసాగిస్తున్నట్టు సమాచారం. లేదంటే భూసమీకరణ కింద మీ భూములు తీసుకుంటారంటూ బెదిరింపులకు దిగుతున్నారు.ఇవే కాదు ఉమ్మడి విశాఖ జిల్లాలో భూమి ధరలు బాగా ఉన్న ప్రాంతాల్లో మంత్రి సోదరుడు, ఓఎస్డీ, పీఏలు రంగంలోకి దిగుతున్నారు. ప్రధానంగా మధురవాడ, ఆనందపురం, సబ్బవరం, భోగాపురం, అచ్యుతాపురం ప్రాంతాల్లోని విలువైన భూముల విషయంలో తలదూరుస్తున్నట్లు తెలుస్తోంది. విలువైన భూమికి సంబంధించి ఎవరైనా తమకు సమస్య ఉందంటూ ఫిర్యాదు ఇచ్చిన వెంటనే సదరు మంత్రి అనుచరగణం వాలిపోతోంది. నేరుగా ఫిర్యాదులో పేర్కొన్న నంబరుకు ఫోన్చేసి ‘మీ సమస్య మాకు తెలుసు. మేం విశాఖకు వచ్చి మీతో మాట్లాడతాం’ అంటూ మంత్రి పీఏ పేరుతో కాల్స్ చేస్తున్నారు. ఇక డీ–పట్టా భూముల విషయంలోను మీ భూమి భూసేకరణలో పోతుందంటూ భయాందోళనకు గురిచేసి, తక్కువ ధరకే తమ పేరులతో ఒప్పందం రాయించేసుకుంటున్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఒక అధికారి ఈ వ్యవహారంలో మొన్నటివరకు వారికి సహకరించారు. ఫిర్యాదు కాపీ ఎలా వెళుతోంది?వాస్తవానికి కలెక్టరేట్లోనో, తహశీల్దారు కార్యాలయంలోనే సోమవారం బాధితులు ఫిర్యాదు చేసిన తర్వాత.. ఫోన్ నంబర్లతో సహా ఆ వివరాలు మంత్రి పేషీకి వెంటనే చేరిపోతున్నాయి. ఈ వ్యవహారంలో ఉద్యోగ విరమణ చేసిన ఓ అధికారితో పాటు స్థానిక రెవెన్యూ యంత్రాంగం సహకరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఆ రిటైర్డ్ అధికారికి స్థానిక రెవెన్యూ అధికారులతో ఉన్న సంబంధాలతోనే మంత్రి పేషీకి సమాచారం చేరుతున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద భూముల విషయాలతో పాటు ఏయే పనులు అవుతాయనేది కూడా స్థానిక రెవెన్యూ అధికారుల ద్వారా సమాచారం ఉండటంతో పక్కాగా మంత్రి అనుచరులు రంగంలోకి దిగి భూదందాలు సాగిస్తున్నట్టు అర్థమవుతోంది.ఓఎస్డీదే పైచేయి వాస్తవానికి ఆ రిటైర్డ్ అధికారిని భూలావాదేవీల వ్యవహారాలు పరిశీలించేందుకు మంత్రి ప్రత్యేకంగా నియమించుకున్నారు. అధికారికంగా నియామకపత్రం లేకుండానే ఆ రిటైర్డ్ అధికారి గత మూడునెలలు సేవలందించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడ వివాదాస్పద భూములున్నాయి? ఏయే అంశాల్లో రికార్డులను మార్చి వ్యవహారం నడిపించవచ్చనే విషయాలపై మంత్రికి సలహాలిచ్చినట్లు తెలిసింది. ఈ వ్యవహారాల విషయంలో మంత్రి ఓఎస్డీకి, ఆ రిటైర్డ్ అధికారికి మధ్య విభేదాలు వచ్చినట్టు సమాచారం. వారం రోజుల కిందట ఆ ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగిన నేపథ్యంలో.. రిటైర్డ్ అధికారిని ఇంటికి సాగనంపారు. రిటైర్డ్ అధికారి ఇచ్చిన సలహాలు, సూచనలతోనే విశాఖలోని భారీ విలువ చేసే భూముల వ్యవహారంలో మంత్రి తమ్ముడు, ఓఎస్డీ, పీఏలు భారీగా దందాలు కొనసాగించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మంత్రి చెబితేనే చేస్తా..!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో పేదల ఇంటి నిర్మాణ బిల్లులు మంజూరులోనూ కమీషన్ల కోసం పాకులాడుతున్నారు. ఇందుకు గృహ నిర్మాణ శాఖలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.180 కోట్లు రాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో ఉన్నా.. కమీషన్ల కోసం ఒక అమాత్యుడు బిల్లులు ప్రాసెస్ చేయకుండా అడ్డుపడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సంస్థ ఫైనాన్స్ విభాగంలోని ఒక కీలక అధికారిణి.. మంత్రి చెబితేనే బిల్లులు ప్రాసెస్ చేస్తానని భీష్మించుకుని కూర్చోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.ప్రస్తుతం క్షేత్ర స్థాయి నుంచి గృహనిర్మాణ సంస్థ వరకు వివిధ దశల్లో రూ.30 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నట్టు సమాచారం. వీటిలో రూ.20 కోట్లకుపైనే ఆప్షన్–3 ఇళ్ల బిల్లులున్నట్లు తెలుస్తోంది. రూ.180 కోట్లు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు మంజూరు చేయడం లేదు. దీనికి ప్రధాన కారణం అమాత్యుడి ఆదేశాలేనన్న విమర్శలున్నాయి. కమీషన్ల కోసం ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణ ఏజెన్సీల నిర్వాహకులను తన దగ్గరకు వచ్చేలా చేసుకోవడం కోసం బిల్లులు చెల్లించవద్దని అమాత్యుడు హుకుం జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ‘రూ.180 కోట్ల నిధులు అమాత్యుడు కేంద్రానికి తిరిగి ఇచ్చేయమన్నారు.ఎవరు చెప్పినా నేను బిల్లులు ప్రాసెస్ చేయను. పెండింగ్ బిల్లులు ప్రాసెస్ చేయాలంటే నాకు అమాత్యుడి నుంచి ఆదేశాలు రావాలి’ అని సదరు అధికారిణి తేల్చి చెబుతున్నారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. సిఫార్సులు లేకుండా పారదర్శకంగా సాగాల్సిన బిల్లుల చెల్లింపులను చంద్రబాబు సర్కార్ ఏర్పాటయ్యాక గందరగోళం చేసేశారు. తనను కలిసిన ఆప్షన్–3 ఏజెన్సీలకు ప్రాధాన్యత క్రమంలో బిల్లులు ఇవ్వాలంటూ అధికారులను ఆదేశిస్తూ అమాత్యుడు ఆదేశాలు ఇచ్చిన లేఖలు గతంలో వెలుగుచూశాయి. ఉన్నతాధికారులు పూచికపుల్లతో సమానంకేంద్రం గృహనిర్మాణ పథకాన్ని సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ) విధానం నుంచి స్పర్‡్షలోకి మారుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రం దగ్గర ఉన్న రూ.180 కోట్ల నిధులు కేంద్రానికి ఇచ్చేస్తే పేదల ఇళ్ల నిర్మాణాలపై ప్రభావం పడుతుంది. వాస్తవానికి రూ.180 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో రిజర్వ్ చేసి ఇళ్ల నిర్మాణ దశల ఆధారంగా బిల్లులు మంజూరు చేసే అవకాశం ఉంది. ఇలా చేస్తే పేదలకు మేలు జరుగుతుంది. ఈ అవకాశాన్ని కాదని చంద్రబాబు సర్కార్ రూ.180 కోట్లు కేంద్రానికి తిరిగి ఇచ్చేయడానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. దీంతో నిధులు వెనక్కిచ్చే వరకు పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ చెల్లిద్దామని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని సైతం ఫైనాన్స్ విభాగం అధికారిణి బేఖాతరు చేస్తున్నారు. అమాత్యుడి అండతో ఉన్నతాధికారులను సైతం పూచికపుల్లతో సమానంగా తీసి పారేస్తుండటం ఇప్పుడు గృహనిర్మాణ శాఖ వర్గాల్లో కలకలం రేపుతోంది. -
అప్పన్న కొండకు గుండు!
ఈ ఫొటోలో కనిపించేది సింహాచలం కొండ. సింహాద్రి అప్పన్న దేవస్థానానికి చెందిన ఈ కొండను డేటా సెంటర్ పేరుతో భారీ యంత్రాలతో ఇష్టారాజ్యంగా తవ్వే స్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ కొండ కనుమరుగు కానుంది. నరసింహస్వామి కొలువైన కొండకు చంద్రబాబు ప్రభుత్వం ఎసరు పెట్టడం తీవ్ర అపచారమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొండ నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ‘చప్టా’ కూడా మూసుకుపోవడంతో ముడసర్లోవకూ నీటి ఎద్దడి ఏర్పడనుంది.భీమిలిలోని పావురాల కొండపై క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి బౌద్ధం ఆనవాళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రైవేట్ రిసార్టుకు భూమి కేటాయించడంతో భారీ యంత్రాలతో కొండలన్నీ పిండి పిండి చేస్తున్నారు. దీంతో బౌద్దం ఆనవాళ్లు కానరాకుండా పోవడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అప్పన్న కొండపై అపచారం..! నరసింహస్వామి కొలువుదీరిన క్షేత్రానికే ఎసరు..! అందమైన విశాఖ నగరంలో కొండలన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం పిండి చేస్తోంది. భారీ యంత్రాలతో పెద్ద పెద్ద కొండలను సైతం తవ్వుతూ నేలమట్టం చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఎర్రమట్టి దిబ్బలకు ఎసరు పెట్టగా.. ఇప్పుడు ఆర్కే బీచ్ నుంచి భీమిలి వెళ్లే రోడ్డు వెంట ఉన్న కొండలతో పాటు సింహాచలం కొండలనూ వదలడం లేదు. ప్రైవేట్ రిసార్టులు, డేటా సెంటర్ పేరుతో కొండలన్నీ నుజ్జు నుజ్జు చేస్తున్నారు. మరికొద్ది నెలల్లో కొండలన్నీ నేలమట్టమై ప్రైవేటు రిసార్టులు దర్శనమివ్వనున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా విపత్తుల నుంచి విశాఖను కాపాడుతున్న కొండలన్నీ కనుమరుగు కానున్నాయి. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముడసర్లోవకు నీటి ముప్పు...!సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూమిని (సింహాచలం కొండ) డేటా సెంటర్ పేరుతో ప్రభుత్వం లాక్కుంది. ఇప్పుడు ఈ కొండపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నాయి. హనుమంతవాక నుంచి గోపాలపట్నం వరకు విస్తరించి ఉన్న ఈ కొండపైనే నరసింహస్వామి కొలువై ఉన్నారు. అప్పన్న కొలువై ఉన్న కొండను తవ్వేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఇది తీవ్ర అపచారమని హెచ్చరిస్తున్నారు. దీన్ని లెక్క చేయకుండా తవ్వకాలు భారీ స్థాయిలో సాగిస్తున్నారు. సింహాచలం కొండ నుంచి వర్షపు నీరు నేరుగా ముడసర్లోవలోకి వస్తుంది. కొండ నుంచి వచ్చే నీరు ముడసర్లోవలోకి చేరేందుకు వీలుగా ప్రత్యేకంగా మూడు ప్రాంతాల్లో సపటలను ఏర్పాటు చేశారు. మధ్యలో ఉన్న బీఆర్టీఎస్ రోడ్డు కింద నీరు వెళ్లేందుకు వీలుగా వీటి నిర్మాణం జరిగింది. భీమిలిలోని పావురాల కొండను తవ్వేస్తున్నారిలా.. తాజాగా జరుగుతున్న తవ్వకాలతో ఈ నీటి ప్రవాహం నిలిచిపోనుంది. ముడసర్లోవరకు ప్రవాహం ఆగిపోతే చుట్టుపక్కల ఉన్న నివాసిత కాలనీలకు కూడా నీటి గండం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లూ వేసవి కాలంలో పీక్ సీజన్లోనూ ఈ కాలనీలకు నీటి ఎద్దడి సమస్య లేదు. కేవలం 60–70 అడుగుల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొండను పూర్తిగా తవ్వేస్తుండటంతో ముడసర్లోవలోకి నీరు వెళ్లే అవకాశం లేదు. ఫలితంగా ముడసర్లోవ పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఇక్కడ ఏర్పాటు చేసిన 2.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్లకు కూడా సమస్యలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రైవేట్ రిసార్టుల కోసం పావురాల కొండ...!బీచ్ రోడ్డులో భీమిలికి వెళ్లే మార్గంలో కొత్తవలస వద్ద క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి బౌద్ధం ఆనవాళ్లు ఉన్న పావురాల కొండ ఉంది. ఇది ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాచీన బౌద్ధ నిధిగా వ్యవహరిస్తుంటారు. ఈ కొండను ఇప్పుడు ప్రైవేట్ రిసార్టుల కోసం కేటాయించారు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటి బౌద్ధ నిధి ఆనవాళ్లను చంద్రబాబు ప్రభుత్వం భారీ యంత్రాలతో తొలిచే యత్నం చేస్తోంది. పావురాల కొండ ఉన్న కొత్తవలస రెవెన్యూ పరిధిలో 15 ఎకరాలను ప్రైవేటు రిసార్టు కోసం ధారాదత్తం చేశారు. ఈ మేరకు 2025 అక్టోబరులో చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నెం 39) జారీ చేసింది. 66 ఏళ్ల లీజుతో పాటు మరో 33 ఏళ్లు పొడిగించే వెసులుబాటుతో మొత్తం 99 ఏళ్లకు మైరా బే వ్యూ రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ సంస్థకు కట్టబెట్టింది. దీని కోసం పావురాల కొండను అడ్డంగా తవ్వేస్తున్నారు. ప్రైవేటు రిసార్టుల కోసం పావురాలకొండలోని 15 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీ పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు ప్రభుత్వం ప్రాచీన బౌద్ధమత ఆనవాళ్లు లేకుండా చేస్తోంది. అంతేకాదు.. పక్కనే మిగతా కొండలను కూడా 99 ఏళ్ల పాటు లీజుకు కట్టబెట్టి పిండి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒకవైపు ఇప్పటికే ఎండాడలో రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తమ బంధువైన గీతం యజమాని, విశాఖ ఎంపీ భరత్కు అప్పగించేందుకు సిద్ధమైన ప్రభుత్వ పెద్దలు మరోవైపు కొండలన్నింటినీ ప్రైవేట్ రిసార్టుల కోసం తమ అనుయాయులకు కట్టబెడుతున్నారు. -
‘మందు’ మార్బలానికే!
సాక్షి, అమరావతి : టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీ స్పీడ్ పెంచాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం టీడీపీ మద్యం సిండికేట్ నిర్వహిస్తున్న మొత్తం 3,736 మద్యం దుకాణాల లైసెన్సులను ఏకపక్షంగా రెండేళ్లపాటు పొడిగించేందుకు ఎత్తుగడ వేసింది. తాజాగా నోటిఫికేషన్ జారీ చేసి పారదర్శకంగా లైసెన్సులు కేటాయించే ప్రక్రియను పక్కనపెట్టాలన్నది ప్రభుత్వ పెద్దల ఉద్దేశం. అందుకోసం ముఖ్య నేత ఆదేశాలతోనే ఎక్సైజ్ శాఖ సన్నద్ధమవుతోంది. సిండికేట్కే మరో రెండేళ్లపాటు రెన్యూవల్...! 2024 నుంచి చేస్తున్న మద్యం దోపిడీని కొనసాగించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అందుకే ప్రస్తుతం టీడీపీ సిండికేట్ గుప్పిట్లో ఉన్న రాష్ట్రంలోని మొత్తం 3,736 మద్యం దుకాణాల లైసెన్సులను రెన్యూవల్ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం మద్యం దుకాణాలకు అనుమతించిన రెండేళ్ల లైసెన్సు గడువు ఈ ఏడాది అక్టోబరు మొదటివారంతో ముగుస్తోంది. సెపె్టంబరులో నోటిఫికేషన్ జారీ చేసి తాజాగా లైసెన్సులు కేటాయించాలి. ఆసక్తి ఉన్నవారు అందరూ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించాలి. ఈ పారదర్శక విధానాన్ని విస్మరించి ఏకపక్షంగా టీడీపీ సిండికేట్కు లైసెన్సులు కేటాయించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు ప్రభుత్వ ముఖ్యనేత స్థాయిలోనే సూత్రపాయంగా నిర్ణయించారు.ఎందుకంటే రాష్ట్రంలో మద్యం దుకాణాలన్నీ టీడీపీ కూటమి సిండికేట్ గుప్పిట్లోనే ఉన్నాయి. అందుకే ఆ సిండికేట్కే మరో రెండేళ్లపాటు ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయించాలని భావిస్తున్నారు. అందుకు ప్రతిపాదనలను రూపొందించాలని సూచించారు. కాగా 2024లో లైసెన్సుల కోసం దరఖాస్తుల ఫీజు రూపంలోనే ప్రభుత్వానికి రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చింది. లైసెన్సు ఫీజు రూపంలో వచ్చిన ఆదాయానికి ఇది అదనం. ప్రస్తుతం మద్యం దుకాణాల లైసెన్సులను రెన్యూవల్ చేస్తే.. లైసెన్సు ఫీజు వస్తుంది. కానీ 2024లో దరఖాస్తు ఫీజుల రూపంలో వచ్చిన రూ.1,800 కోట్లను కూడా సర్దుబాటు చేసేందుకు అవకాశం ఉందా అన్న విషయాన్ని పరిశీలించాలని ఎక్సైజ్ శాఖకు సూచించారు. దీనిపై తుది నిర్ణయం తీసుకుని టీడీపీ మద్యం సిండికేట్కే మరో రెండేళ్లపాటు లైసెన్సులు ఏకపక్షంగా పొడిగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. గతంలోనూ లాటరీ ముసుగులో టీడీపీ సిండికేట్కు...2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం విధానం ముసుగులో దోపిడీకి తెరతీసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ఆ స్థానంలో మొత్తం 3,736 ప్రైవేటు మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపునకు 2024 అక్టోబరులో నోటిఫికేషన్ జారీ చేసింది. లాటరీ విధానం ముసుగులో టీడీపీ సిండికేట్కు ఏకపక్షంగా లైసెన్సులు కట్టబెట్టింది. సిండికేట్ సభ్యులకు కాకుండా ఇతరులు ఎవరూ లైసెన్సుల కోసం దరఖాస్తు చేయకుండా పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో బెదిరించారు.ఇక ఆ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఏకంగా 75వేల బెల్ట్ దుకాణాలను నిర్వహిస్తూ మద్యం ఏరులై పారిస్తున్నారు. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలకు విక్రయిస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. 2014–19లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వ హాయాంలో మద్యం దోపిడీ విధానం ముసుగులో రూ.25వేల కోట్ల దోపిడీ పాల్పడిన టీడీపీ సిండికేట్... ప్రస్తుతం 2024–29 కూటమి ప్రభుత్వ హయాంలో అంతకు రెట్టింపు దోపిడీకి గురి పెట్టింది. అందుకోసమే టీడీపీ సిండికేట్కే మద్యం దుకాణాల లైసెన్సులను మరో రెండేళ్లపాటు పొడిగించాలని భావిస్తోంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ మద్యం పాలసీ ముసుగులో మంత్రి మండలిలో ఆమోదించి ఈ దోపిడీ విధానానికి రాజముద్ర ముద్ర వేయాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. అదీ సంగతి. -
రామోజీ చనిపోతే కేసులు ఎత్తేయాలా?
-
ఫీజు రీయింబర్స్ మెంట్ జమపై కూటమి సర్కార్ నో క్లారిటీ..
-
సంక్షేమం.. ఇక సంక్షోభమే
-
ఆరు నూరైనా భూములిచ్చేదే లేదు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాజధాని పేరుతో సాగిస్తున్న భూ దందాకు సహకరించే ప్రసక్తి లేదని అమరావతి ప్రాంత రైతులు తేల్చి చెబుతున్నారు. రాజధాని కోసం అవసరమైనంత భూమిని తొలి దశలోనే సమీకరణ కింద తీసుకున్నప్పటికీ, మళ్లీ రెండో దశలో బలవంతపు సమీకరణకు పూనుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సమీకరణకు ఒప్పుకోకపోతే భూసేకరణ చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తుండటంపై మండిపడుతున్నారు. అసలు మొదటి దశలో ఇచ్చిన భూమి ఎందుకు సరిపోదని నిలదీస్తున్నారు. విజయవాడ నగరానికి ఆనుకుని ఉండే ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాల్లో భూముల ధరలు మొదటి నుంచి ఎక్కువే. 2014కు ముందే అక్కడ ఎకరం రూ.2–3 కోట్లు పలికేది. అదే సమయంలో ఇదే రాజధాని ప్రాంతంలోని మరికొన్ని గ్రామాల్లో ఎకరం ధర రూ.లక్షల్లోనే ఉండేది. ప్రభుత్వ భూములు తీసుకోవడానికి అన్ని చోట్లా ఒకే ప్యాకేజి ప్రకటించడం అత్యధిక శాతం రైతులకు నచ్చలేదు. అయితే కొండవీటి వాగు వరద నివారణ, సీడ్ యాక్సిస్ రోడ్డు వంటి వాటికి రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. రాజధాని వస్తుందని నమ్మి సమీకరణకు భూములు ఇచ్చేశారు. ఆ సమయంలో అవసరమైన మేరకే భూములు తీసుకుంటామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి బఫర్జోన్ ఏర్పాటు పేరుతో మిగిలిన భూములు కూడా తీసుకోవడానికి రైతులకు నోటీసులు ఇస్తోంది. పూలింగ్కు ఇవ్వని భూముల్లో కూడా లేఅవుట్లు వేశారు. ఇప్పుడు వాటిని భూసేకరణ కింద పెట్టారు. గ్రామస్తులకు కనీస సమాచారం ఇవ్వకుండానే, వారిని సంప్రదించకుండానే నోటీసులు ఇస్తున్నారు. రైతుల గోడు వినడానికి సీఆర్డీఏ కమిషనర్, మంత్రి నారాయణ ఏమాత్రం ఇష్టపడటం లేదు. రైతులు కూటమి పార్టీల నేతలతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అపాయింట్మెంట్ కోసం విఫలయత్నం చేశారు. ఈ ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు వస్తున్నాయి.. ఎంత భూమి అవసరం.. ఏ రైతుకు ఎంత భూమి పోతుందన్న వివరాలు ఇవ్వకుండానే బలవంతంగా భూములు లాక్కొవడానికి ప్రభుత్వం ప్రయతి్నస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. భూసేకరణకు సంబంధించి ఆంగ్ల దినపత్రికలకు, సర్క్యులేషన్ లేని పత్రికలకు ప్రకటనలు ఇవ్వడంతో అధికారులు నోటీసులు ఇచ్చేవరకు ఎవరికీ సమాచారం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు అవసరానికి మించి ప్రభుత్వానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తమ వైఖరిని స్పష్టం చేస్తున్నారు. మాకు ఎప్పుడు లబ్ధి కలుగుతుంది? నాకు ఎకరం 40 సెంట్లు ఉంది. ఆ మొత్తం భూమి సేకరణ కోసం నోటీసులు ఇచ్చారు. నాకు రెండేళ్ల కిందట బైపాస్ ఆపరేషన్ జరిగింది. రోజు విడిచి రోజు డయాలసిస్ చేయించుకోవాలి. గతంలో పూలింగ్ సమయంలో విద్య, వైద్యం బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ తీరు వల్ల మాకు ఎప్పటికి లబ్ధి కలుగుతుంది? మేం భూములు ఇస్తే ఎక్కడికి వెళ్లి వైద్యం చేయించుకోవాలి? మేం రాజధానికి వ్యతిరేకం కాదు. మా బ్రతుకులు పణంగా పెట్టి భూములు ఇవ్వలేమని చెబుతున్నాం. – పద్మారెడ్డి, రైతు, ఉండవల్లిఇది చాలా అన్యాయం ప్రభుత్వం చెబుతున్న రాజధానిలో ప్రస్తుతం ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర ఉంది. విజయవాడకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ధర ఉంది. పైగా కమర్షియల్ ఏరియా కావడం వల్ల వ్యాపారాలు బాగుంటాయి. అందువల్ల ప్రభుత్వం ఇచ్చే ప్లాట్ల వల్ల రైతులకు నష్టం వస్తుంది. విజయవాడకు పక్కనే ఉన్న మాకూ ఒకే పద్ధతి, ఎక్కడో దూరంగా ఉన్న వారికి కూడా అదే పద్ధతా? ఈ విషయమై గతంలో మేము కోర్టులో వేసినప్పుడు స్టే వచ్చింది. తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబునాయుడు వచ్చిన తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూమి ఇవ్వండని మొదలుపెట్టి ఇప్పుడు అన్ని భూములు కావాలంటున్నారు. మాతో మాట్లాడకుండానే మాకు నోటీసులు ఇస్తుండటంపై అందరం సమావేశమయ్యాం. రైతు కుటుంబం నుంచి వచ్చానని చెప్పే చంద్రబాబునాయుడు ఏటా మూడు పంటలు పండే పొలాలను అవసరానికి మించి తీసుకోవడం అన్యాయం. – ఈశ్వరరెడ్డి, రాజధాని రైతు సంఘం అధ్యక్షుడుప్రాణం పోయినా భూమి ఇవ్వం మాది ఉండవల్లి. 248 సర్వే నెంబర్లో మా కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఉంది. ఇది చంద్రబాబు నాయుడు నివాసానికి తూర్పు పక్కన ఎదురుగా ఉన్న భూమి. దీన్ని 1960లో మా తాత కొనుక్కున్నాడు. అప్పటి నుంచి మేము సాగు చేస్తున్నాం. ఇప్పుడు ఈ భూమి తీసుకుంటామంటున్నారు. బదులుగా మాకు వర్షం పడితే నాలుగు అడుగులు నీళ్లు నిలిచే మాలపల్లి చర్చి వద్ద ప్లాటు ఇస్తామంటున్నారు. బంగారం లాంటి మా భూమిని తీసుకుని ఎక్కడో గుంటలో ఇస్తామంటే ఎలా? రేపు నేను భూమి ఇచ్చినా నాకు ప్లాట్ ఎప్పుడు ఇస్తారో తెలీదు. ఇప్పటిదాకా ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లలో ఏ ఒక్క రైతు అయినా ఇల్లు కట్టుకున్నాడా? కమర్షియల్ ప్లాట్స్ అంటున్నారు. అక్కడ జనం ఉంటే కదా మా వ్యాపారాలు సాగడానికి? మా బతుకుల్ని కొట్టబాకండి. రాజధాని రాకముందే ఈ ప్రాంతం అంతా రెసిడెన్షియల్ జోన్లో ఉంది. మేం రాజధానికి వ్యతిరేకం కాదు. అయితే ప్రాణాలు పోయినా మా భూములు ఇవ్వం. – రఘునాథ్, రైతు, ఉండవల్లిఇలాగైతే నా అప్పు తీరేదెలా? ఉండవల్లిలో నాకు ఎకరం భూమి ఉంది. ఆ భూమిలో నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డు కోసం నా భూమిని తీసుకుని ప్లాట్ ఇస్తామంటున్నారు. ఎక్కడ ఇస్తారో మాత్రం చెప్పడం లేదు. ఇప్పటి వరకు రైతులకు ఇచ్చిన ప్లాట్లు ఏవీ డెవలప్ కాలేదు. గతంలో గజం రూ.70 వేల నుంచి 80 వేలకు వెళ్లింది. ఇప్పుడు మళ్లీ రూ.20 వేలకు పడిపోయింది. ఇప్పుడు అది కూడా కొనేవారు లేరు. రోడ్డుకు ఎంత కావాలో అంత ఇస్తామని.. మిగిలిన భూమి అమ్ముకోవడానికి అనుమతి అడిగితే స్పందించడం లేదు. మా అమ్మాయికి ఎనిమిదేళ్ల క్రితం అప్పు చేసి పెళ్లి చేశా. ఆ అప్పు ఇంత వరకూ తీరలేదు. ఇప్పుడు పొలం అమ్ముకోవడానికి కూడా లేకుండా పోయింది. – బుర్రా శ్రీనివాసరావు, రైతు, ఉండవల్లికోర్టును ఆశ్రయిస్తాం మావి విలువగల భూములు. చిన్న సన్నకారు రైతులం అని చెప్పాం. రాజధానికి సహకరించాలన్న ఉద్దేశంతో రోడ్లకు, వాగుకు సహకారం అందించాం. ఇంతటితో ఆగాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మిగతా భూమిని వదిలేస్తే మేమే అభివృద్ధి చేసుకుంటాం. ఇంకో పది సంవత్సరాల తర్వాత అయినా మా భూములను ల్యాండ్ పూలింగ్కు ఇవ్వలేం. ఎందుకంటే మీరు ఇచ్చే గజాలు మాకు చాలవు. మాకు ఇక్కడ ఏ ప్రాజెక్టులూ లేవు. మా గోడు వినిపించుకోకుండా భూసేకరణకు పూనుకుంటే కోర్టును ఆశ్రయిస్తాం. – నరేష్రెడ్డి, రైతు,ఉండవల్లి -
సంక్షేమం.. ఇక సంక్షోభమే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు సంక్షేమంలో భారీగా కోతలు విధించడానికి ఫ్యామిలీ ప్రయోజనం (బెనిఫిట్) కార్డును అస్త్రంగా ప్రయోగిస్తోంది. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకాన్ని నిలువునా మోసం చేసిందే కాక, ఇప్పుడు అర్హులైన లబ్ధిదారులను అనర్హుల పేరుతో జాబితాల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ పథకాలకు కొత్త నిబంధనలను రూపొందించింది. అంతే కాకుండా పథకాల ద్వారా లబ్ధి కలిగే ప్రయోజనాలకు సీలింగ్ విధించింది. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించే సాకుతో పథకాలకు ఎగనామం పెట్టేందుకు కుటుంబాల విభజనకు స్వస్తి పలకనుంది. సూపర్ సిక్స్తో పాటు వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలన్నీ మరింత మెరుగ్గా అమలు చేస్తామని ఎన్నికలప్పుడు ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేశారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాల లబ్ధిదారులను సైతం అనర్హులుగా తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు జారీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఫ్యామిలీ బెనిఫిట్ నిర్వహణ వ్యవస్థ బిల్లుకు రూపకల్పన చేసి చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రంలోని 1.70 కోట్ల కుటుంబాల డేటా (సమాచారం) ఆధారంగా సంక్షేమ పథకాలకు అర్హులెవరు.. అనర్హులెవరు.. అనే వడపోత కార్యక్రమాన్ని పూర్తి చేసింది. తద్వారా రాష్ట్రంలో కేవలం 10.2 లక్షల కుటుంబాలు మాత్రమే అర్హమైనవిగా గుర్తించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 7.4 లక్షల కుటుంబాలుండగా, మిగతా కుటుంబాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నవిగా తేల్చారు. ఈ 10.2 లక్షల కుటుంబాల నుంచి కూడా అత్యంత పేద కుటుంబాల జాబితాను తయారు చేయనున్నారు. ఇందుకు కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ద్వారా క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టనున్నారు. అంటే తొలి దశలోనే 94 శాతం కుటుంబాలకు అర్హతే లేదని నిర్ధారించారు. ప్రస్తుత లబ్ధిదారుల ఏరివేతప్రస్తుతం అనర్హులు చాలా మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్తో పాటు వివిధ రకాల ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా కొత్త నిబంధనల మేరకు ప్రస్తుత లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి వారి పేర్లను తొలగించనుంది. వివిధ ప్రభుత్వ పథకాల నుంచి ఏడాదికి 48 వేల రూపాయలకన్నా ఎక్కువ ప్రయోజనం పొందకుండా సీలింగ్ విధించాలని నిర్ణయించింది. అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా ఏడాదికి 48 వేల రూపాయలు ప్రయోజనం పొందితే ఇక ఆ కుటుంబానికి మరే ఇతర పథకాల ప్రయోజనాలను అందించరు. అంటే పెన్షన్ వస్తే మిగతా ఏ పథకాలు ఆ కుటుంబానికి వర్తింప చేయరు.రాష్ట్రంలోని 1.7 కోట్ల కుటుంబాల్లో అర్హత కలిగిన కుటుంబాలు 10.2 లక్షలే అని స్పష్టం చేస్తున్న ప్రభుత్వ డాక్యుమెంట్.. ఈ డాక్యుమెంట్లో ఉన్న అంశాల్లో ఏ ఒక్కటి వర్తించినా వారు ప్రభుత్వ పథకాలకు అర్హులు కాదని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వ ప్రజెంటేషన్ డేటా అనుసంధానం పూర్తివిద్యుత్ వినియోగం ఆధారంగా అనర్హత వేటు వేసేందుకు ఇప్పటికే నివాసి ఆధార్ నెంబర్తో విద్యుత్ మీటర్ కనెక్షన్ నంబర్ను అనుసంధానించడాన్ని డిస్కమ్స్ నూటికి నూరు శాతం పూర్తి చేశాయి. పట్టణాల్లో దాదాపు 40 లక్షల పట్టణ ఆస్తి రికార్డుల్లో యజమాని ఆధార్తో ఆస్తి ఐడీ అనుసంధానాన్ని ధ్రువీకరించడానికి క్షేత్రస్థాయి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఏకీకృత కుటుంబ సర్వే పూర్తయ్యింది. పౌరుల జనాభా వివరాలకు సంబంధించిన వ్యత్యాసాలను ధ్రువీకరించడం కూడా పూర్తయింది. మొత్తంగా చంద్రబాబు ప్రభుత్వం వివిధ పథకాల కోసం అనర్హుల ఏరివేతకు 15 అంశాలను ప్రామాణికంగా ఎంపిక చేసింది. ఈ 15 అంశాల్లో ఏ ఒక్కటి ఉన్నా అర్హుల జాబితా నుంచి ఆ కుటుంబాలను తొలగిస్తారు. మంత్రుల కమిటీ సిఫారసులివీ..⇒ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు, రాష్ట్ర పథకాల కోసం ‘కుటుంబం’ నిర్వచనం సిఫార్సు.⇒ కుటుంబాలు పొందగలిగే మొత్తం ప్రయోజనాలపై గరిష్ట పరిమితి కోసం ఒక విధానం సిఫార్సు (సమర్థవంతంగా ప్రభుత్వ నిధుల వినియోగాన్ని నిర్ధారించడం)⇒ పథకాల కోసం సవరించిన ఆర్థిక అర్హత ప్రమాణాల సిఫార్సు. (అర్హత లేని లబ్ధిదారులను మినహాయించి, అవసరమైన లబ్ధిదారులను చేర్చడం. ఉదా: ఎన్టీఆర్ భరోసా పెన్షన్). ⇒ కుటుంబ డేటాబేస్, కుటుంబ కార్డు వినియోగాన్ని అధికారికం చేయడానికి ఫ్యామిలీ బెనిఫిట్ నిర్వహణ వ్యవస్థ బిల్లు రూపకల్పన (డేటాబేస్ను నియంత్రించడానికి, ప్రతిపాదిత కుటుంబ కార్డు వినియోగానికి అథారిటీని నియమించడం).⇒ ప్రయోజన పథకాల రూపకల్పనలో సంస్కరణల సిఫార్సు. (పెద్ద కుటుంబాలను ప్రోత్సహించడానికి, డేటాబేస్లో కృత్రిమ కుటుంబ విభజనను నివారించడం).⇒ ఫ్యామిలీ కార్డ్ను అమలు చేయడానికి ‘కుటుంబం’కు అధికారిక నిర్వచనం, ఫ్యామిలీ డేటాబేస్ అండ్ కార్డ్కు చట్టపరమైన మద్దతు. -
ఫెయిలైతే టీచర్ల బాధ్యత.. పాసైతే ప్రిన్సిపాల్స్ ఘనత..
సాక్షి, అమరావతి: విద్యార్థులకు మార్కులు తగ్గితే టీచర్లకు షోకాజ్ నోటీసులు.. అదే ఉత్తీర్ణత శాతం పెరిగితే ప్రిన్సిపాల్స్కు సత్కారాలు.. చంద్రబాబు సర్కారుకు ఇదేం ద్వంద్వనీతి అంటూ బీసీ గురుకులాల ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమశాఖ పరి«ధిలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల్లో ఉత్తీర్ణతలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతోపాటు ప్రిన్సిపాల్స్ను మంగళవారం విజయవాడలో సత్కరించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి సత్కరించడం వరకు సరే.. ప్రిన్సిపాల్స్ను, జిల్లా బీసీ సంక్షేమ అధికారులను జ్ఞాపికలతో అభినందించడాన్ని బీసీ గురుకుల టీచర్లు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో పదోతరగతి, ఇంటర్ పరీక్షలకు ముందు ప్రభుత్వం చేసిన హడావుడిని వారు గుర్తుచేస్తున్నారు.బీసీ గురుకులాల్లో విద్యార్థులకు మార్కులు తగ్గితే సంబంధిత టీచర్లకు షోకాజ్ నోటీçసులు ఇస్తామని, ఉత్తీర్ణత శాతం తగ్గితే విధుల నుంచి తొలగిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత నుంచి గురుకులాల కార్యదర్శి మాధవీలత వరకు సమీక్ష సమావేశాల్లో హెచ్చరించారు. పరీక్ష ఫలితాలు వచ్చాక ఉత్తీర్ణత తక్కువ నమోదైన గురుకులాల్లో సంబంధిత సబ్జెక్ట్ టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. తక్కువ ఉత్తీర్ణత ఉన్న గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీలను విధుల నుంచి తొలగించాలని అధికారులు ఆదేశించారు. ఉత్తీర్ణత బాగున్న గురుకులాల్లో మాత్రం సంబంధిత టీచర్లను గుర్తించి అభినందించకపోగా.. ఆ మొత్తం ఘనత ప్రిన్సిపాల్స్దే అన్నట్లు వారిని సత్కరించడాన్ని టీచర్లు తప్పుబడుతున్నారు.రాష్ట్రంలోని 105 బీసీ గురుకులాలకుగాను 32 గురుకులాల్లో మాత్రమే నూరుశాతం ఉత్తీర్ణత వచ్చింది. ఆ 32 గురుకులాల ప్రిన్సిపాల్స్ను పిలిచి అభినందించిన కార్యక్రమానికి తమను కూడా పిలిచి తమ కృషిని గుర్తించి ఉంటే బాగుండేదని టీచర్లు పేర్కొంటున్నారు. విద్యార్థులకు మార్కులు తగ్గినా, ఉత్తీర్ణత లేకపోయినా టీచర్ బాధ్యుడని, మంచి ఫలితాలు సాధిస్తే ప్రిన్సిపాల్ ఘనత అని ప్రభుత్వం ద్వంద్వనీతిని ప్రదర్శించడం సరికాదని గురుకులాల్లో పనిచేసే రెగ్యులర్, కాంట్రాక్ట్, గెస్ట్ ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. -
భగ్గుమన్న ఆక్వా రైతులు
సాక్షి, అమరావతి/పాలకొల్లు సెంట్రల్/ఒంగోలు సబర్బన్: ఆక్వా ఫీడ్ కంపెనీలు భారీగా ధరలను పెంచడంపై ఆక్వా రైతులు భగ్గుమన్నారు. ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమైన ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఆందోళనలకు దిగారు. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన గళం విప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో మేత బస్తాలకు నిప్పుపెట్టారు. ధరల పెంపు అమల్లోకి వచ్చాక అడ్డుకుంటామన్న ప్రభుత్వ ప్రకటనపై మండిపడ్డారు. ప్రభుత్వానికి తెలియకుండా కంపెనీలు ఏకపక్షంగా ఫీడ్ ధరలు ఏ విధంగా పెంచుతాయని నిలదీశారు. మేత బస్తాలకు నిప్పుపెట్టి.. ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) అనుమతి లేకుండానే ఫీడ్ కంపెనీలు మేత ధరలను టన్నుకు రూ.8,420 నుంచి రూ,10,530 వరకు పెంచడాన్ని నిరసించారు. మూడు నెలల వ్యవధిలో రెండుసార్లు ఫీడ్ ధరలు పెంచిన కంపెనీల ఏకపక్ష ధోరణిపై కన్నెర్రజేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. పెంచిన ఫీడ్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవడంతో పాటు కనీస గిట్టుబాటు ధరలు కల్పించకపోతే సాగు సమ్మెకు దిగుతామని నరసాపురం, ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాలకు చెందిన రైతులు అల్టిమేటం ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. మేత బస్తాలకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా మత్స్యశాఖ కార్యాలయం ఎదుట రొయ్య రైతులు ధర్నా చేశారు. ఫీడ్ కంపెనీలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీడ్ తయారీలో వాడే ముడి పదార్థాల ధరలు పెరగలేదని.. సోయా మీల్ ధర కిలోకు రూ.100 నుంచి రూ.35కు తగ్గాయని చెప్పారు. వేట నిషేధ వేళలో ఏటా పెరిగే ఫిష్మీల్ ధరలను సాకుగా చూపి ధరలు పెంచడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఫీడ్ కంపెనీలన్నీ టీడీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయని, ప్రభుత్వానికి చెప్పకుండా, పెద్దల అనుమతి లేకుండా ఏ విధంగా ఫీడ్ ధరలు పెంచుతాయని సంఘం నేతలు ప్రశ్చించారు. తక్షణం పెంచిన ఫీడ్ ధరలను ఉపసంహరించుకోవాలని, అప్సడా అనుమతి లేకుండా ధరలు పెంచిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఇలాగైతే క్రాప్ హాలిడే ప్రకటిస్తాం ఆక్వా ఫీడ్ ధరలను కంపెనీలు ఏకపక్షంగా పెంచడాన్ని నిరసిస్తూ ఆగస్టు 1 నుంచి సెపె్టంబర్ 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా క్రాప్ హాలిడే ప్రకటించాలని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం నిర్ణయించింది. మంగళవారం పాలకొల్లులో నిర్వహించిన అత్యవసర సమావేశంలో సంఘాధ్యక్షుడు గొట్టుముక్కల గాం«దీభగవాన్రాజు మాట్లాడుతూ.. వనామీ రొయ్య ఫీడ్పై కేజీకి రూ.8, టైగర్ రొయ్య ఫీడ్పై రూ.10 పెంచడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ముడిసరుకు ధరలు తగ్గినప్పుడు ధరలు తగ్గించని కంపెనీలకు, ఇప్పుడు పెంచాలనే ఆతృత ఎందుకని ప్రశ్చించారు. ప్రభుత్వం కూడా రైతుల కంటే కంపెనీలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోందని విమర్శించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు కంపెనీలతోపాటు ప్రభుత్వంతోనూ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తొలుత ధరలు పెంచిన కంపెనీలను బహిష్కరించాలని, ఫ్యాక్టరీల వద్ద ధర్నాలు చేపట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. బుధవారం రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆక్వా సంఘం కార్యదర్శి బోణం చినబాబు, రంగయ్య నాయుడు, జాన్రాజు పాల్గొన్నారు. నేడు ఆక్వా రైతులు, ఫీడ్ కంపెనీలతో భేటీ ఆక్వా రైతుల ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు స్పందించారు. ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సాగు వ్యయాలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులపై ధరల పెంపు మరింత భారంగా మారుతుందన్నారు. అప్సడా చట్టం ప్రకారం రైతు సంఘాలతో చర్చించిన తర్వాత మాత్రమే ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా పెంచేశాయని ఆరోపించారు. పెంచిన ధరల అమలును తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్ను ఆదేశించారు. ఈ అంశంపై రైతు సంఘాలు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులతో బుధవారం సమావేశమై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మేత ధరల పెంపును అడ్డుకోవాలి మేత ధరల పెంపును అడ్డుకోవాలని ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. టైగర్ రొయ్యల మేతపై టన్నుకు రూ.10,530, వెనామీ రొయ్యల మేత ధర రూ.8,420 చొప్పున పెంచడంతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుందన్నారు. ఇప్పటికే వైరస్లతో దిగుబడులు రాక, కౌంట్ ధరలు పతనమై అల్లాడుతున్న ఆక్వా రైతులకు ఈ ధరల పెంపు అశనిపాతంగా మారిందన్నారు. తక్షణమే అప్సడా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మేత ధరలను పూర్తిస్థాయిలో ఉపసంహరింపజేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఆక్వా రైతులతో సంప్రదించకుండా మేత ధరలు పెంచడాన్ని ఏపీæ కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు బి.బలరామ్, కార్యదర్శి ఎం.హరిబాబు తప్పుబట్టారు. మూడు నెలల్లో రెండోసారి ధరలు పెంచడం సరికాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండేళ్లుగా రొయ్య రైతులు గిట్టుబాటు ధరలేక తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. పెంచిన ఫీడ్ ధరలతో పాటు ఫిబ్రవరిలో పెంచిన ధరలను కూడా పూర్తిగా ఉపసంహరింప చేయాలని డిమాండ్ చేశారు. ఏకపక్షంగా ధరలు పెంచిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఆక్వా మేత ధరల వెనుక భారీ కుంభకోణం
సాక్షి, అమరావతి: ఆక్వారంగ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మేత ధరలు పెంచడం దారుణమని మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, కాకాణి గోవర్ధన్రెడ్డి, సీదిరి అప్పలరాజు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా ఫీడ్ ధరలను టన్నుకు రూ.10,530 వరకు పెంచడంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారన్నారు. ఏకపక్షంగా ధరల పెంపు వెనుక భారీ కుంభకోణం ఉందని స్పష్టం చేశారు. ధరల పెంపును అడ్డుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని, అప్సడా చట్టానికి విరుద్ధంగా ధరలు పెంచుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా ముడుపులు అందుకుంటూ.. ‘ఫీడ్ కంపెనీలతో ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయ్యారు. ఆక్వా రైతులను దోచుకుతింటున్నారు. ప్రతినెలా టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఫీడ్ కంపెనీల నుంచి ముడుపులు అందుతున్నాయి. అందుకే ధరలను ఏకపక్షంగా పెంచినా అడ్డుకోలేదు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు తగ్గించినా ధరలను ఆ మేరకు తగ్గించలేదు. కూటమి ప్రభుత్వం వచి్చన తర్వాత ఆక్వా ఫీడ్ ధరలను ఏకపక్షంగా పెంచారు. ముడిసరుకుల ధరలు తగ్గినా మేత ధరలు తగ్గించలేదు. ఆక్వా ఫీడ్ కంపెనీల మాఫియాకు ప్రభుత్వ పెద్దలు దన్నుగా నిలుస్తున్నారు. ప్రతినెలా టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముడుపులు అందుతున్నాయి. ఆక్వా రైతుల కష్టం టీడీపీ దోపిడీ పాలవుతోంది. ప్రభుత్వానికి తెలియకుండా ధరలు పెంచుతారా? వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఆక్వా రైతుల ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆక్వా సిండికేట్ ముడుపుల్లో మంత్రి అచ్చెన్నాయుడు వాటా ఎంతో చెప్పాలి. ఇప్పటికే కరెంట్ లేక, డీజిల్ ఇవ్వక ఆక్వా రైతులు కుదేలయ్యారు. వారిపై ఫీడ్ ధరల పెంపు మరో పిడుగుపాటుగా పరిణమించింది. ధరలను తక్షణం తగ్గించకపోతే ఆక్వా రైతుల తరఫున ఉద్యమిస్తాం’ అని కన్నబాబు, కాకాణి, అప్పలరాజు హెచ్చరించారు. -
మహా న్యూస్కు భారీ నజరానా ఆ వీడియోల కోసం 56.64 లక్షలు..
-
ఆక్వా గొంతు నులి‘మేత’
సాక్షి, అమరావతి: టీడీపీ ‘మేత’ వన్నె పులులు ‘రొయ్య’ రైతులను దోచుకునేందుకు తెగబడ్డాయి. మీకింత మాకింత అనే ధోరణిలో ధరల పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచుకుంటున్నాయి. ఆక్వా గొంతు నులిమేస్తున్నాయి. ఆక్వా రంగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫీడ్ ధరలను టన్నుకు రూ.10,530 వరకు పెంచడంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఫీడ్ ధరల పెంపును అడ్డుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని మండిపడుతున్నారు. తక్షణమే పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలని, అప్సడా చట్టానికి విరుద్ధంగా ధరలు పెంచుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పెత్తనమంతా..‘టీడీపీ’ ఫీడ్ కంపెనీలదే రొయ్యల సాగులో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉంది. రాష్ట్రంలో ఏటా 10 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతుండగా, వెనామి రొయ్యల ఉత్పత్తికి టన్నుకు టన్నున్నర, టైగర్ రొయ్యలకు రెండున్నర చొప్పున సగటున ఏటా 15 లక్షల టన్నుల మేత వినియోగిస్తారు. ఈ లెక్కన ఏటా రూ.15వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. దీంట్లో 50 శాతానికి పైగా వాటా అవంతి ఫీడ్స్దే. ఆ తర్వాత 20 శాతం దేవీ ఫీడ్స్ది కాగా, మిగిలిన వాటా బీఎంఆర్ (టీడీపీ ఎంపీ బీద మస్తాన్రావు), సంధ్య, సీపీ, ఫెడోరో, ఫాల్కన్ వంటి ఇతర సంస్థలది. వీటిలో మెజార్టీ తయారీ సంస్థలన్నీ అధికార టీడీపీ నేతలకు చెందినవే. ఈ కారణంగా వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. పైగా మంత్రులతోపాటు ప్రభుత్వంలోని కీలక నేతలకు నెలవారీగా వాటాల మూటలు వెళ్తుండడంతో ప్రభుత్వంలో ఏ ఒక్కరూ నోరుమెదపలేని దుస్థితి నెలకొందని సమాచారం. రైతులతో చర్చించకుండానే ధరల పెంపు.. వాస్తవంగా వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ(అప్సడా) చట్టం ప్రకారం ఫీడ్, సీడ్ కంపెనీలే కాదు.. ఆక్వారంగంలో ఉన్నవారెవరైనా సరే ధరలు పెంచాలంటే అప్సడా అనుమతి తీసుకోవాలి. ధరల పెంపు అనివార్యమైనప్పుడు తొలుత అప్సడా స్టేక్ హోల్డర్స్ (ఆక్వా రైతులు, సంఘాల నేతలు)తో సమావేశమై, వారి అంగీకారంతోనే పెంచాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి అప్సడా చట్టాన్ని నిరీ్వర్యం చేసింది. దీంతో కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచేస్తున్నాయి. ఫీడ్ తయారీలో వాడే ముడి సరుకులపై దిగుమతి సుంకాన్ని గతేడాది కేంద్రం 30 శాతం నుంచి 5–15 శాతానికి తగ్గించగా, కొన్ని ఉత్పత్తులకు పూర్తిగా మినహాయించింది. ఈ లెక్కన ఫీడ్ ధరలు టన్నుకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు తగ్గించాలి. కానీ ఆ దిశగా కంపెనీలు ఆలోచన చేసిన పాపాన పోలేదు. ధరలు తగ్గించేలా ప్రభుత్వం ఒత్తిడి చేసిన దాఖలాలు లేవు. నాడు కంటి తుడుపు చర్యగా టన్నుకు ఎమ్మారీ్పపై రూ.4వేలు తగ్గించిన కంపెనీలు ఈ ఏడాది ఫిబ్రవరిలో చెప్పా పెట్టకుండా టన్నుకు మళ్లీ రూ.4వేల చొప్పున పెంచేశాయి. తాజాగా ముడిసరుకుల ధరలు పెరిగాయనే సాకుతో వెనామీ ఫీడ్పై రూ.12వేలు, టైగర్ ఫీడ్పై రూ.14వేలు పెంపునకు అనుమతినివ్వాలంటూ గతనెల 30న మత్స్యశాఖ కమిషనర్కు రొయ్య మేత తయారీ దారుల సంఘం లేఖ రాసింది. స్టేక్ హోల్డర్లతో సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకుందామని కమిషనర్ బదులిచ్చారు. కానీ స్టేక్ హోల్డర్లతో సమావేశం, చర్చలు జరపకుండానే ఏకపక్షంగా ధరలు పెంచాయి. మేత వ్యాపారంలో 50 శాతం వాటా కలిగిన అవంతి ఫీడ్స్ టన్నుకు వెనమి ఫీడ్పై రూ.8,420, టైగర్ ఫీడ్ పై రూ. 10,530 పెంచగా.. మిగిలిన కంపెనీలు వెనమి ఫీడ్పై రూ.8 వేలు, టైగర్ ఫీడ్పై రూ.10 వేలు చొప్పున పెంచాయి. పెట్టుబడిలో సగానికిపైగా మేతకే.. రాష్ట్రంలో 4.68 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా లీజు ధరలను బట్టి టన్ను ఉత్పత్తికి వెనామీ రొయ్యలకు రూ.2.60 లక్షలు, టైగర్ రొయ్యలకు రూ.3.50 లక్షలు, చేపలకు రూ.1.10 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. రొయ్యల సాగులో రూ.1.50 లక్షలు, చేపల సాగులో రూ.75 వేల వరకు మేతకే రైతులు ఖర్చు చేస్తుంటారు. 2023లో రొయ్యల మేత ధర టన్ను రూ.72వేలు ఉండగా, ప్రస్తుతం రూ.లక్షకు పైగా ఉంది. తాజా పెంపుతో మేతధ రలు పన్నులతో కలిపి రూ.1.15లక్షలకుపైగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఉత్పత్తి వ్యయం కాస్తా వెనామీ రొయ్యలపై రూ.2.75 లక్షలకు, టైగర్ రొయ్యలపై రూ.3.75 లక్షలకు చేరుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం 2019–24 మధ్యలో కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను మూడుసార్లు వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టింది. అలాగే ఇప్పుడు చంద్రబాబు సర్కారూ ధరల తగ్గింపునకు కృషి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సిండికేట్గా మారి దోచేస్తున్నారు. ఏపీ అప్సడా చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచడానికి లేదు. కంపెనీలన్నీ సిండికేట్గా మారి ధరలు ఒక్కసారిగా పెంచాయి. తక్షణమే ఈ పెంచిన ధరలను తగ్గించాలి. –దుగ్గినేని గోపినాథ్, అధ్యక్షుడు, రొయ్య రైతుల సంఘం ప్రకాశం జిల్లా కంపెనీలు ఏకపక్ష ధోరణి తగదు ఫీడ్ తయారీ కంపెనీలకు ఏటా లాభాలు పెరుగుతూనే ఉన్నాయి. ఏటా పెట్టుబడి ధరలు పెరుగుతున్నాయే తప్ప రైతులకు ఆదాయం మాత్రం పెరగడం లేదు. కేంద్రం ద్వారా వివిధ రకాల రాయితీలు పొందుతున్న కంపెనీలు ఇష్టమొచ్చినట్టుగా ఫీడ్ ధరలు పెంచేస్తూ రైతులను దోచుకుంటున్నాయి. ఇది తగదు. – టి.నాగభూషణం, అధ్యక్షుడు, కోనసీమ రొయ్య రైతుల సంఘం -
పొగాకు రైతు పోరుబాట
మద్దిపాడు: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల పరిధిలోని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రంలో నోబిడ్ల వంకతో 70 శాతం పొగాకు బేళ్లను వెనక్కి పంపిస్తుండడంతో రైతులు ఆగ్రహంతో సోమవారం వేలం నిలిపేశారు. చండ్రపాడు, గాడిపర్తివారిపాలెం గ్రామాలకు చెందిన దాదాపు 350 మందికి పై గా రైతులు పొగాకును వేలం కేంద్రానికి తీసుకురా గా అధిక శాతం బేళ్లను తిరస్కరించారు. విషయం తెలిసి రైతు సంఘం నాయకులు కొనుగోలు కేంద్రా న్ని సందర్శించారు.జిల్లా రైతు సంఘం ప్రధాన కా ర్యదర్శి జజ్జర జయంత్ బాబు మాట్లాడుతూ చంద్ర బాబు ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి పొగాకు రైతులకు తిప్పలు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు బ్యారెన్కు రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని మండిపడ్డారు. ఈనెల 18వ తేదీన పొగాకు రైతుల సమస్యలపై ఒంగోలులో సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. -
‘శ్రీవాణి’ సొమ్ములు పచ్చముఠాల పాలు!
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి సొమ్ముతో అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది. శ్రీవాణి ట్రస్టుకు చెందిన దాదాపు రూ.750 కోట్ల నిధులతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించ తలపెట్టిన 5,000 ఆలయాలు, భజన మందిరాల పనులను టెండర్తో సంబంధం లేకుండా టీడీపీ నేతలకు పంచి పెట్టాలని నిర్ణయించారు. ఈమేరకు ఏప్రిల్ 16న దేవదాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఐదు వేల ఆలయాలు, భజన మందిరాల నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం రూ.5 లక్షలకు పైబడిన ప్రతి పనిని టెండరు విధానంలో చేపట్టాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం నెల రోజుల క్రితమే ముగిసిన నేపథ్యంలో పంచాయతీల్లో ప్రత్యేక అధికార పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టడమంటే అధికార యంత్రాంగాన్ని ప్రేక్షక పాత్రకు పరిమితం చేయడమేనని దేవదాయ శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గత ప్రభుత్వం ఆమోదించిన ఆలయాల నిర్మాణాలను రద్దు చేసి.. శ్రీవాణి ట్రస్టు నిధులతో మత్య్సకార, బలహీన వర్గాల కాలనీల్లో పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 4,111 ఆలయాల నిర్మాణాలకు పారదర్శకంగా టెండర్లు పిలిచి అనుమతులు మంజూరు చేయగా 622 గుడుల నిర్మాణం అప్పట్లోనే పూర్తయింది. 1,765 ఆలయాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి మిగిలిన 1,724 ఆలయాల పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. నిర్మాణాలు మొదలు కాని అన్ని ఆలయాల అనుమతులు రద్దు చేయాలని 2024 ఆగస్టు 27న దేవదాయశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈమేరకు 2024 సెపె్టంబరులో దేవదాయ శాఖ అన్ని జిల్లాలకు సమాచారం ఇచ్చింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత శ్రీవాణి నిధులతో ఆలయాల నిర్మాణానికి టీటీడీ పాలక మండలి బోర్డు ఇటీవల ఆమోదం తెలుపగా టెండర్ల విధానంలో కాకుండా అధికార పార్టీ నేతలకు కట్టబెట్టాలన్న నిర్ణయంపై దేవదాయ శాఖ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆలయాల నిర్మాణాలకు సంబంధించి ఒక్కో గుడికి వేర్వేరుగా టెండర్లు పిలిచి పూర్తి పారదర్శకంగా అర్హులకు పనులను అప్పగించిందని గుర్తు చేస్తున్నారు.చందాలు పక్కదారి పట్టే ప్రమాదం.. ఆలయాల నిర్మాణ పనులకు స్థానిక అధికార పార్టీ నేతలకు అప్పగించడం అక్రమాలకు దారి తీస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి పెద్ద మొత్తంలో చందాలు ఇచ్చేందుకు భక్తులు, స్థానికులు ముందుకు వస్తుంటారు. అధికార పార్టీ నేతల పర్యవేక్షణలో పనులు చేపడితే చందాలు పక్కదారి పట్టే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతోంది. -
ఎమ్మెల్యే బూచేపల్లిపై రెడ్బుక్ కుట్రలు
సాక్షి టాస్క్ ఫోర్స్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బందులు పెట్టేలా చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. వైఎస్సార్సీపీ దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డికి చెందిన గ్రానైట్ క్వారీలపై మైన్స్ అధికారులతో ఆకస్మిక దాడులకు పూనుకుంది. సోమవారం మైన్స్ డీడీ రాజశేఖర్ ఆధ్వర్యంలో అధికారులు రెండు బృందాలుగా చీమకుర్తి మండలం రామతీర్థం పరిధిలో ఉన్న సూర్య గ్రానైట్స్ క్వారీల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హైటెక్ సర్వే కెమెరాలను తీసుకొచ్చి క్వారీల్లోని నలుమూలల కొలతలు సేకరించారు.అమ్మకాలు ఎంత? ఉత్పత్తి ఎంత? అంటూ అక్కడి కార్యాలయంలోని రికార్డుల్లో వివరాలను మైన్స్ అధికారులు సేకరించారు. రామతీర్థం కేంద్రంగా వైఎస్సార్సీపీతో పాటు టీడీపీకి చెందిన వారికి, ఆ పార్టీ సానుభూతిపరులుగా ఉన్న పలువురికి గ్రానైట్ క్వారీలున్నాయి. చీమకుర్తి పరిసరాల్లో ఉన్న వందలాది క్వారీల వైపు ఏనాడూ తొంగి చూడని మైన్స్ అధికారులు కేవలం బూచేపల్లికి చెందిన సూర్య గ్రానైట్స్పై మాత్రమే దాడులు నిర్వహించటం వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని వైఎస్సార్సీపీ వర్గాలు మండిపడుతున్నాయి. 2014–19లో కూడా అప్పటి అధికార టీడీపీకి అనుకూలంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డిని మలచుకునేందుకు ఎన్నో ఒత్తిళ్లు చేశారు. సూర్య గ్రానైట్ క్వారీని రెండేళ్లు మూసేసి ఆర్థికంగా దెబ్బతీశారు. -
సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప నీకు ఇంకేం వచ్చు? చేతకాని పాలనా.. అసమర్థుని పాలనా..
-
రైతులకేమో చెరువుల్లో ఇస్తూ.. సన్నిహితులకేమో మంచి ప్లాట్లా?
-
సమీకరణకు భూములివ్వం
తాడేపల్లి రూరల్ : చంద్రబాబు ప్రభుత్వం తమకు తీరని ద్రోహం చేస్తోందని రాజధాని ప్రాంత రైతులు మండిపడ్డారు. రెండో విడత భూ సమీకరణ కోసం రైతుల మధ్య చిచ్చు పెడుతోందని, వర్గాలుగా విడదీసి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరితో తొలుత భూములు తీసుకుని, అందరూ ఇవ్వాల్సిందేనని దౌర్జన్యం చేస్తోందని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీరు ఎంత మాత్రం సబబు కాదని, అందుకే తామంతా ఒకతాటిపైకి వచ్చి భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో అందరం కలిసికట్టుగా భూసమీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.ప్రభుత్వం బలవంతపు భూ సమీకరణ చేస్తున్న క్రమంలో ఆదివారం రాజధాని ప్రాంత రైతులు ఉండవల్లిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు ఈశ్వరరెడ్డి, జొన్నా శ్రీనివాసరావు, గంటు బాలాజీ, పెద్దిశెట్టి వీరస్వామి, శ్రీనివాసరావు, అంజిరెడ్డి, శ్రీధర్రెడ్డి, నాగరాజు, శివకోటేశ్వరరావు, అశోక్రెడ్డి తదితరులు మాట్లాడారు. ‘మా తాత ముత్తాతల నుంచి ఈ భూములను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వం రైతులను వర్గాల వారీగా విడదీసి, తన స్వార్థ ప్రయోజనాల కోసం మన మధ్య విభేదాలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రైతు రైతే. రైతుకు నష్టం జరిగే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తే పోరాటం చేసి సాధించుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇదే ప్రాంతంలో 2015–2019 మధ్య రైతులకు ఇబ్బందులు ఎదురైనప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించి విజయం సాధించాం’ అన్నారు. అవసరానికి మించి భూమి ఎందుకు?మరోసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం అవసరాలకు మించి భూమిని రైతుల దగ్గర నుండి తీసుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేసిందని రైతులు తెలిపారు. ఇందులో భాగంగా విడతల వారీగా భూ సమీకరణకు నోటీసులు ఇస్తోందన్నారు. అన్ని ప్రాంతాల్లో ఒకేసారి ఈ ప్రక్రియ ప్రారంభిస్తే ఇబ్బంది అని, విడతల వారీగా ఈ ప్రక్రియ చేపట్టిందన్నారు. ‘రాజధానికి రైతులు ఎవరూ వ్యతిరేకం కాదు. అవసరమైన మేర భూములు తీసుకుంటే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. రాజకీయ నాయకులు కాంట్రాక్టర్ల పేరుతో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. వారు దోపిడీ చేసిన దాంట్లో పాతిక వంతు ఖర్చు పెట్టినా ప్రభుత్వ అవసరాలను అవసరమైన భూమిని రైతుల దగ్గర నుండి నేరుగా కొనుగోలు చేయొచ్చు.కనీసం సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆ ప్రయత్నాలు చేయలేదు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలోనూ వైఫల్యం చెందింది. ఇలాంటప్పుడు రైతులు ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలో ఆలోచించాలి. ఇప్పటికే ఈ ప్రాంతంలో పలువురు రైతులు తమ భూములను వారి ఆడపిల్లకు కట్నాలుగా ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీరుతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకోసమైనా మనం స్పందించాలి. ఈ నెల 20వ తేదీన ఉండవల్లిలో నిర్వహించే సభకు ప్రతి ఒక్కరు హాజరై భూ సమీకరణకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను చెప్పాలి. ఆ తర్వాత ఆ అభిప్రాయాలను అర్జీల రూపంలో అధికారులకు, ప్రభుత్వానికి అందజేద్దాం’ అని రైతులు తీర్మానించారు. తమ పోరాటానికి సీపీఎం, వైఎస్సార్సీపీ, ఇతర పార్టీల మద్దతు కోరుతూ ముందుకు వెళదామని రైతులు నిర్ణయించారు. -
సీఎం సన్నిహితులకేనా జాక్పాట్?
సాక్షి, అమరావతి: రాజధానికి భూ సమీకరణ కింద భూమి ఇచ్చిన తనకు అభివృద్ధి చేసిన నివాస స్థలం (రెసిడెన్షియల్ ప్లాటు), వాణిజ్య స్థలం (కమర్షియల్ ప్లాటు) ఇస్తామని చెప్పి.. చెరువులో పల్లపు ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్లాటు ఇచ్చారని.. మరో చోట తనకు ప్లాటు కేటాయించాలని పదే పదే కోరుతున్నా సీఆర్డీఏ స్పందించడం లేదని 2025 డిసెంబర్ 26న మందడంలో నిర్వహించిన సమావేశంలో దొండపాటి రామారావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ కుప్పకూలి కన్నుమూశారు. రాజధానికి భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన అనేక మంది రైతులు ఇలానే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ.. సీఎం చంద్రబాబు కోటరీలోని ముఖ్యులకు, టీడీపీ ప్రజా ప్రతినిధుల సన్నిహితులకు రోడ్ల పక్కనే అత్యంత ప్రధానమైన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయిస్తున్నారంటూ రాజధాని రైతులు మండిపడుతున్నారు. ఇందుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుమారుడు వేమూరి ఆదిత్య, కూతురు వేమూరి అనూషకు వెస్ట్ బైపాస్ పక్కనే నివాస, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎదురుగా ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో వాణిజ్య ప్లాట్లు కేటాయించడాన్ని ఎత్తిచూపుతున్నారు. లాటరీలో రాధాకృష్ణ కుమారుడు, కుమార్తెకే జాక్పాట్ తగిలిందా.. మాకు తగలదా.. అంటూ ప్రశ్నిస్తున్నారు. రాజధాని కోసం భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు పదేళ్లపాటు కౌలుతోపాటు.. అభివృద్ధి చేసిన లే అవుట్లలో ఎకరానికి జరీబు భూమైతే 1,000 గజాల నివాస, 450 గజాల వాణిజ్య ప్లాటు.. మెట్ట భూమైతే 1,000 గజాల నివాస, 250 గజాల వాణిజ్య ప్లాటు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ కింద లే అవుట్లలో సీఆర్డీఏ అధికారులు లాటరీ ద్వారా రైతులకు ప్లాట్లను కేటాయించి, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. బెజవాడ రమేషా.. మజాకా! తుళ్లూరు మండలం మందడంకు చెందిన బెజవాడ రమేష్ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు. మందడంలో సర్వే నెంబరు 496/4, 387/2, 143, 22/2, 40, 21/1, 88, 2బీ/4, 139/ఏ, 512/2, 3బీ–0, 6బీ, 455/1ఏ, 131/1, 272బీ, 54బీ/4, 59/ఏ, 57/బీ, 73/2, 29/1, 59/బీ, 136, 135/2, 33/4లలో బెజవాడ రమేష్, బెజవాడ సుప్రియ, బెజవాడ మధు, బెజవాడ బ్రాహ్మణి, బెజవాడ సాంబశివరావుల కుటుంబం 31.245 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకు ఇచ్చింది. ఇందుకుగానూ ఏటా వారి కుటుంబ సభ్యులకు సీఆర్డీఏ కౌలు చెల్లిస్తోంది. కోర్ క్యాపిటల్ ఏరియా(ప్ర«దాన రాజధాని ప్రాంతం)లో సచివాలయానికి ఎదురుగా నాలుగు రోడ్ల జంక్షన్ (కూడలి)లో బెజవాడ రమేష్, మధులకు లాటరీ ద్వారా 2,500 గజాల వాణిజ్య ప్లాటును సీఆర్డీఏ కేటాయించింది. ప్రస్తుతం దాంట్లో బీఎస్సార్ ప్రాపర్టీస్ పేరుతో భవనం నిర్మించారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీస్ అథారిటీకి అద్దెకు ఇచ్చారు.బెజవాడ రమేష్, మధుకు కేటాయించిన 2500 గజాల వాణిజ్య ప్లాట్లు బిట్స్ పిలానీ విద్యా సంస్థకు కేటాయించిన భూమికి సమీపంలో రోడ్డు పక్కనే 13,500 గజాల ఇంటి స్థలం బెజవాడ రమేష్ కుటుంబ సభ్యులకు లాటరీ ద్వారా సీఆర్డీఏ కేటాయించింది. సచివాలయానికి కూతవేటు దూరంలో 25 మీటర్లు, 17 మీటర్ల రెండు రోడ్ల కూడలిలలో 4,500 గజాల నివాస ప్లాటును బెజవాడ రమేష్కు లాటరీ ద్వారా ఇచ్చింది. ఎన్–6 ప్రధాన రహదారికి ఆనుకుని 5,940 గజాల చొప్పున పక్కపక్కనే రెండు వాణిజ్య ప్లాట్లను, సచివాలయం పక్కనే రెండు రోడ్ల కూడలిలో 4,860 గజాల పరిమాణం కలిగిన నివాస ప్లాటును, సచివాలయం పక్కనే ప్రధాన రహదారికి ఆనుకుని 2,400 గజాల నివాస ప్లాటును బెజవాడ రమేష్ కుటుంబానికి కేటాయించింది. బెజవాడ రమేష్ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టే లాటరీలో ఇలా జాక్పాట్ తగిలిందని.. అదే తమకు ఎందుకు తగలలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.కీలక ప్రాంతాల్లో రాధాకృష్ణ కొడుకు, కూతురుకు ఆరు ప్లాట్లు రాధాకృష్ణ కుమారుడు, కుమార్తెలు మంగళగిరి మండలం కురగల్లు రెవెన్యూ గ్రామం పరిధిలోని నీరుకొండలో సర్వే నెంబరు 71, 72, 73లో 5.39 ఎకరాలు కొనుగోలు చేసి.. 2016 అక్టోబర్ 30న రిజి్రస్టేషన్ చేయించుకుని.. భూ సమీకరణ కింద సీఆర్డీఏకు అప్పగించారు. ఇందుకుగాను ఇతర రైతులలానే వారికి సీఆర్డీఏ ఏటా కౌలు చెల్లిస్తోంది. రాధాకృష్ణ కొడుకు ఆదిత్యకు వెస్ట్ బైపాస్కు పక్కనే 1,500 గజాలు, 1,000 గజాలు ఉన్న రెండు నివాస ప్లాట్లు.. కూతురు అనూషకూ అక్కడే 1,500 గజాలు, 1,000 గజాలు ఉన్న రెండు నివాస ప్లాట్లు దక్కాయి. ఇక ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో ఇద్దరికీ 660 గజాల చొప్పున వాణిజ్య ప్లాట్లు వచ్చాయి. ఈ ఆరు ప్లాట్లు లాటరీ ద్వారానే వారికి దక్కడం గమనార్హం. కోరుకున్న చోట ధనేకులకు ప్లాట్లుధనేకుల సుబ్బారావు తుళ్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. సుబ్బారావు కుటుంబ సభ్యులు కొండమరాజుపాలెంలో సర్వే నెంబరు 66/1ఏలో 0.47, నేలపాడులో సర్వే నెంబరు 95/ఏలో 0.50, 9/ఏలో 0.86, 93/1సీలో ఎకరం, 66/2లో 0.53, 93/1ఏలో 5.53, 93/1బీ 0.60, 98లో 0.10 వెరసి 9.59 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకు ఇచ్చారు. ఈయన కుటుంబ సభ్యులు కూడా భారీగానే భూములు ఇచ్చారు. ఇందుకుగాను వారికి సీఆర్డీఏ కౌలు చెల్లిస్తోంది. అయితే అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించడంలో మాయాజాలం చోటుచేసుకుంది. «కొత్తగా నిర్మింస్తున్న శాశ్వత హైకోర్టుకు అత్యంత సమీపంలో డైమండ్ సర్కిల్ దగ్గర ఎన్10 రోడ్డు పక్కనే 24,500 గజాల నివాస ప్లాటు, ఈ ప్లాటు పక్కనే 11,820 గజాల నివాస ప్లాటు, సీఎం చంద్రబాబు కొత్తగా నిర్మింస్తున్న ప్యాలెస్కు సమీపంలో ఎన్11 ప్రధాన రహదారికి ఆనుకుని 2,520 గజాల వాణిజ్య ప్లాటును, హైకోర్టుకు కూతవేటు దూరంలో ఎన్9 రోడ్డు పక్కనే 8,820 గజాల మరో వాణిజ్య ప్లాటును ధనేకుల సుబ్బారావు కుటుంబ సభ్యులకు సీఆర్డీఏ లాటరీ ద్వారా కేటాయించింది. ఇదిగో ప్లాట్ల మాయాజాలం! రైతుల్లో ఆగ్రహం ఉమ్మడి గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో 53,748 ఎకరాల(217 చదరపు కిలోమీటర్లు)ను రాజధాని ప్రాంతంగా 2015లో చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. ఇందులో 34,823.12 ఎకరాలను 29,442 మంది రైతుల నుంచి భూ సమీకరణ కింద సమీకరించింది. వారికి అభివృద్ధి చేసిన లేఅవుట్లలో నివాస, వాణిజ్య ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయిస్తోంది. రోడ్లకు పక్కన, సమీపంలో.. నాలుగు రోడ్ల కూడలి.. ప్రధాన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు సీఎం చంద్రబాబు సన్నిహితులు, టీడీపీ ప్రజా ప్రతినిధుల మద్దతు ఉన్న వారికే దక్కుతున్నాయని.. తమకు పల్లపు ప్రాంతం, చెరువులు, వాగుల్లో వస్తున్నాయంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొడుకు, కూతురుతోపాటు బెజవాడ రమేష్, ధనేకుల సుబ్బారావు వంటి సీఎం చంద్రబాబుకు సన్నిహితులైన టీడీపీ నేతల కుటుంబ సభ్యులకు అత్యంత ప్రధానమైన ప్రాంతాల్లో వేలంలో దక్కిన ప్లాట్లను వారు ఎత్తిచూపుతున్నారు. -
ప్రజారోగ్యంపై బాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యంపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులతో పరుగులు పెట్టిన వైద్య శాఖను ప్రస్తుతం ఐఏఎస్ల కొరత వేధిస్తోంది. ఇప్పుడీ శాఖను కేవలం నలుగురు ఐఏఎస్లతోనే పరిమితం చేశారు. నలుగురిలో ఒకరైన జాయింట్ సెక్రటరీ రోణంకి గోపాలకృష్ణ సోమవారం నుంచి జూన్ 6 వరకు లాల్బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో శిక్షణకు వెళ్తున్నారు. దీంతో ఆయన నిర్వర్తిస్తున్న ఆయుష్ కమిషనర్, ఏపీ శ్యాక్స్ పీడీ బాధ్యతలను ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వీరపాండియన్కు ఎఫ్ఏసీ ఇస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.ఇప్పటికే ఆరోగ్య శాఖ కమిషనర్, ఐపీఎం కమిషనర్, డైరెక్టర్, ఎన్హెచ్ఎం డైరెక్టర్ బాధ్యతలను వీరపాండియన్ నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు అదనంగా మరో రెండు శాఖలను కేటాయించారు. మరోవైపు ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ, ఆరోగ్యశ్రీ, ఔషధ నియంత్రణ డీజీ స్థానాల్లో పూర్తి స్థాయి అధికారులు లేరు. గత కొద్ది నెలలుగా ఇన్చార్జులే దిక్కయ్యారు. ఉన్న కొందరు ఐఏఎస్లకే రెండు, మూడు విభాగాల బాధ్యతలు ఇవ్వడంతో పర్యవేక్షణ లోపించి గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. -
2025–26 బాబు సర్కార్ బడ్జెట్ను కడిగేసిన కాగ్
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేయడంలో చూపించే ఉత్సాహం.. ఆస్తుల కల్పనలో, రాష్ట్రాభివృద్ధిలో చూపించడం లేదు. 2025–26 బడ్జెట్కు సంబంధించి కాగ్ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా ఇలాంటి రాష్ట్ర ఆర్థిక ప్రతికూల ముఖచిత్రాన్నే కాగ్ గణాంకాలు చూపించాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అమలు సూచికలపై కాగ్ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలను మించి రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు పెరిగిపోయాయి. బడ్జెట్ అంచనాల మేరకు ఆస్తుల కల్పన వ్యయం భారీగా తగ్గిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేయడంపై చూపిస్తున్న శ్రద్ధ రెవెన్యూ రాబడులు పెంచడం ద్వారా సంపద సృష్టిపై చూపెట్టడం లేదు. అమ్మకం పన్నుతో పాటు ఇతర పన్నులు, డ్యూటీలు రాబడుల్లో తిరోగమనంలో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో నిధులు రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది.


