అంబటిని పరామర్శిస్తున్న ముద్రగడ పద్మనాభం, తమ్మినేని సీతారాం, మేరుగ, చిత్రంలో నూరిఫాతిమా, మురళీకృష్ణ, బాలవజ్రబాబు
మేము బానిసలం కాదు మాజీ మంత్రుల నివాసాలపై దాడులు అత్యంత దారుణం
చంద్రబాబు సర్కారుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆగ్రహం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్)/ఇబ్రహీంపట్నం: కాపుల వల్లే రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు వారిపైనే దాడులు చేయిస్తూ అవమానాలు, వేధింపులకు గురిచేస్తున్నారని కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులంతా బానిసలుగా బతకాలని చంద్రబాబు కోరుకుంటున్నారని, అది జరగదని మండిపడ్డారు. సోమవారం ఆయన గుంటూరు సిద్ధార్థనగర్లోని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జునతో కలిసి వచ్చారు. అంబటిని పరామర్శించారు.
ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముద్రగడ మాట్లాడుతూ గతంలో తనపైనా, తన కుటుంబంపైనా దాడి చేయించారని, ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబంపైనా దాడి చేయించారని చంద్రబాబుపై మండిపడ్డారు. ‘అయ్యా చంద్రబాబు నీకు, మీ సతీమణి, మీ కుమారుడు, కోడలికి అవమానం జరిగితే మీ ఫీలింగ్స్ ఏమిటి?’ అని ముద్రగడ ప్రశ్నించారు. మాజీ మంత్రుల నివాసాలపై దాడులు చేయించటం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు అబద్ధాలు వల్లించడం హాస్యాస్పదమన్నారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ అరెస్టులు, అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నేతలు భయపడరని స్పష్టం చేశారు.
ఇప్పటికైనా అబద్ధాలు ఆపి దేవదేవుడికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను సోమవారం ముద్రగడ పద్మనాభం పరామర్శించారు. దాడి జరిగిన తీరును జోగి రమేష్ ఆయనకు వివరించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కూడా జోగి రమే‹Ùను పరామర్శించారు.
కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నగర గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్సీపీ భీమవరం నియోజకవర్గం ఇన్చార్జ్, ఉమ్మడి గోదావరి జిల్లాల కాపు సంఘం అధ్యక్షుడు చిలిమిలి వెంకటరాయుడు, పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి తోట రామకృష్ణ పాల్గొన్నారు.


