పాట్నా: ప్రస్తుతం బిహార్లో పని చేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని పాట్నా కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఎలాంటి ఎఫ్ఐఆర్, కేస్ డైరీ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు రక్షణ ఉన్నప్పటికీ సునీల్ నాయక్ను బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని నిలదీసింది.
పాట్నా హైకోర్టు చెప్పినప్పటికీ ఏపీ పోలీసులు రావడమేంటని ప్రశ్నించింది. 30 రోజుల వరకూ సునీల్ నాయక్ను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా రఘురామకృష్ణరాజు కేసు విషయానికి సంబంధించి సునీల్ నాయక్ను ట్రాన్సిట్ రిమాండ్ను పాట్నా సివిల్ కోర్టు తిరస్కరించింది.
ఏపీ పోలీసులపై బిహార్ లాయర్ల ఆగ్రహం
ఇలా బలవంతపు అరెస్టును బిహార్ లాయర్లు తీవ్రంగా ఖండించారు. ఏపీ పోలీసులు గోడదూకి మరీ అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బిహార్ పోలీసులు సైతం.. ఏపీ పోలీసుల తీరును తప్పుబట్టారు. ఏపీలో రెడ్బుక్ పాలన అంటే ఇదేనా అని బిహార్ పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సునీల్ నాయక్ గతంలో ఆంధ్రప్రదేశ్లో డిప్యూటేషన్లో పని చేశారు. ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు కేసు విషయంలో ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా సునీల్ నాయక్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సునీల్ నాయక్ నివాసానికి వెళ్లి అరెస్ట్ చేశారు. దీన్ని బిహార్ డీజీపీ కూడా తీవ్రంగా ఖండించారు. గోడదూకి వచ్చి తమ అధికారిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. ప్రధానంగా సిట్ చీఫ్ దామోదర వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది.


