కొన్ని ఘటనలు చాలా సిల్లీగా ఉంటాయి. మనుషులు కూడా..చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చూడటం వల్లనో అపార్థం చేసుకోవడం వల్లనో.. క్షణాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడి..చంపుకునేంత వరకు వెళ్లిపోతోంది పరిస్థితి. ఇక్కడ కూడా అచ్చం అలానే చోటుచేసుకుంది. అప్పటి వరకు పెళ్లి సందడితో సరదాగా ఆహ్లాదంగా ఉన్న వాతావరణం జస్ట్ ఓ కుక్క కారణంగా ఘర్షణ వాతావరణంగా మారి ఏకంగా పెళ్లే ఆపేసేందుకు దారితీసింది.
అసలేం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలో జరిగిన వివాహ వేడుక కుక్క కారణంగా హింసాత్మక ఘర్షణకు దారితీసింది. దివంగత సునీల్ కుమార్ , సరోజ్ గుప్తాల కుమార్తె తాన్య కేషర్వాణి, దివంగత రాకేష్ చందా, బాబ్లీదేవి కుమారుడు సుమిత్లు ఇంటి నుంచి పారిపోయి మరి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకుని ఈ నెల ఫిబ్రవరి 18న ఫతేపూర్ అధికారిక వేడుక నిర్వహించాలని నిర్ణయించారు.
పెళ్లి తంతులో భాగంగా బంధువులు, శ్రేయోభిలాషులు నడుమ తెల్లవారుజామున 4 గంటలకు ఆభరణాలు సమర్పించే ఆచారం సాగుతోంది. ఆ సమయంలో వధువు కుటుంబం పెంపుడు కుక్క దూకుడుగా మొరగడం ప్రారంభించింది. విసుగుతో వరుడు కుటుంబానికి చెందిన యువకుడు ఆ కుక్కను కొట్టడంతో మొదలైన గొడవ..చూస్తుండగానే క్షణాల్లో ఘర్షణకు దారితీసింది. ఈ ఉద్రిక్త ఘటనలో మహిళలతో సహా సుమారు ఎనిమిది మంది దాక తీవ్రంగా గాయపడ్డారు.
వధువు తరుఫు కుటుంబంలో ముగ్గురి తలలకు తీవ్ర గాయలయ్యినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇరు కుటుంబాలు పోలీస్టేషన్కు చేరుకున్నాయి. అక్కడ వివాహాం అధికారికంగా రద్దు చేశారు. ట్విస్ట్ ఏంటంటే వధువు తాన్య దీన్ని నిరాకరించింది. తమ పెళ్లి ఎప్పుడో జనవరిలో అయిపోయిందని, ఇది అధికారికంగా నిర్వహించిన తంతు అని స్పష్టం చేసింది. ఆమె తన అత్తమామల ఇంటికి వెళ్లి అక్కడ తన భర్తతో కలసి ఉన్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి మరి వివరణ ఇవ్వడం విశేషం.
(చదవండి: కూతురు గ్రాడ్యుయేషన్ డే..ఆ తల్లి ఏం చేసిందంటే..!)


