చెన్నై: తమిళనాడులో కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో 70 లక్షల ఓట్లను తొలిగించగా 27.53 లక్షల కొత్త ఓట్లను తుది జాబితాలో చేర్చినట్లు తెలిపింది. ఈ ఏడాదిలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం SIR చేపట్టింది.
అయితే ఎస్ఐఆర్ పూర్తైన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం తుది ఓటరు జాబితాను ఈ రోజు (సోమవారం) ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ నేతృత్వంలోని అధికార వర్గాలు సర్వం సిద్ధం చేశాయి. కాగా రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియక డిసెంబరు రెండో వారం వరకు సాగింది. ఇందులో 97 లక్షల మంది పేర్లను జాబితా నుంచి తొలగించడం చర్చకు దారి తీసింది. దీంతో ఈ జాబితాలో పేర్లు గల్లంతైన వారికి మరో అవకాశం కల్పించారు. జనవరి నెలాఖరు వరకు తొలుత, ఆతర్వాత సుప్రీం కోర్టు ఆదేశాలతో మరో పది రోజులు ఈ ప్రక్రియ గడవు పొడిగించారు.
ఈ కారణంగా ముందుగా నిర్ణయించిన మేరకు ఈనెల 16వ తేదీన జాబితాను విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది. సుమారు 35 లక్షల మేర కొత్త దరఖాస్తులు రావడంతో వీటన్నింటినీ పరిశీలించేందుకు మరికొంత సమయం తీసుకోవాల్సిన అవశ్యం ఎన్నికల కమిషన్కు ఏర్పడింది. ఆదివారంతో ఓటరు జాబితా పనులు ముగించారు. ఈ నేపథ్యంలో తుది ఓటరు జాబితాను ఎన్నికల ప్రధానాధికారి విడుదల చేశారు.


