సాక్షి, ఢిల్లీ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఐఆర్ ప్రక్రియను దేశ వ్యాప్తంగా చేపట్టేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా.. 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈసీ లేఖ రాసింది.
వివరాల ప్రకారం.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)కి సంబంధించిన సన్నాహకాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈసీ సూచించింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు ఎన్నికల సంఘం లేఖ రాసింది.
ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టాలని గతేడాది జూన్లో నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే బీహార్లో ‘సర్’ పూర్తి కాగా.. ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అస్సాంలో మాత్రం ఎస్ఐఆర్కు బదులు ‘ప్రత్యేక సవరణ’ పేరుతో ఓటరు జాబితా సవరణను పూర్తి చేశారు. కాగా, ఏప్రిల్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.


