breaking news
Special Intensive Revision (SIR)
-
‘సర్’ ఇంటింటి సర్వే ఇక మూడు రోజులే
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ఇంటింటి సర్వే మరో మూడు రోజుల్లో ముగియనుందని, జూన్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి సర్ మ్యాపింగ్ యాప్ పని చేయడం ఆగిపోతుందని, గడువు పెంచే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. జూలై 11 సాయంత్రం నాలుగు గంటల వరకు మొత్తం 4,16,27,694 మంది ఓటర్లకు గాను 3,61,23,312 ఓటర్ల వివరాలు డిజిటలైజ్డ్ అయ్యాయని, మిగిలిన మూడు రోజుల్లో 55,04,382 ఓటర్ల వివరాలను డిజిటలైజ్డ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు డిజిటలైజ్డ్ అయిన ఓటర్లలో సుమారు 10 శాతం మంది ఓటర్లలో మరణించిన వాళ్లు, ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్న వారు, దొరకని ఓటర్లు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జూలై 21న విడుదల చేసే ముసాయిదా ఓటర్ల జాబితాతోపాటు మరణించిన, డూప్లికేట్, దొరకని ఓటర్ల వివరాల జాబితా కూడా పోలింగ్ కేంద్రాలు, సచివాలయాల వద్ద ప్రదర్శించనున్నట్లు తెలిపారు. జాబితాలో పేరులేని వారు 2002 ఓటర్ల జాబితా వివరాలను తీసుకొని ఫారం–6 ద్వారా బీఎల్వోతో ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. 2002 జాబితాలో పేరు లేని వారు గుర్తించిన 11 ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి జత చేయడం ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. 21న జాబితాలో పేర్లు లేని వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఆగస్టు 20 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రకటనతో రాష్ట్రంలో సర్ ప్రక్రియ ముగుస్తుందని, ఆ తర్వాత ఎప్పటిలాగే కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ యధావిధిగా కొనసాగుతుందన్నారు. -
సర్.. హైజాక్!
సాక్షి, అమరావతి : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో అధికార తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. మరో నాలుగు రోజుల్లో ఇంటింటి సర్వే ముగియనుండటంతో ఎదుటి పార్టీ ఓట్లను తొలగించేలా అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తోంది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర నుంచి మున్సిపల్ ఆఫీసుల వరకు ఎక్కడ పడితే అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేరుగా కార్యాలయాల్లో కూర్చొని మరీ ఎన్యూమరేషన్ ఫారంలను బీఎల్వోల నుంచి బలవంతంగా తీసుకుంటున్నారు. ఇలా తీసుకున్న ఎన్యూమరేషన్ ఫారాలను మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేసుకొని తిరిగి ఇస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వీడియోల సాక్షిగా ఈ దురాగతాలు బయట పడుతున్నా ఎన్నికల సంఘం అధికారులు కళ్లకు గంతలు కట్టుకొని కూర్చున్నారు. అధికార పార్టీ దుర్వినియోగంపై వైఎస్సార్సీపీ ప్రతినిధులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ను కలిసి వినతి పత్రాలు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోతోంది. భీమిలిలో తెలుగుదేశం కార్యకర్తలే ఓటర్లువిశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తెలుగుదేశం కార్యకర్తలు నేరుగా సచివాలయంలో దర్జాగా కూర్చొని మరీ ఫారాలు పూర్తి చేస్తున్నారు. బీఎల్వోల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకొని తెలుగుదేశం కార్యకర్తలే ఓటర్లుగా సంతకాలు చేసి ఇచ్చేస్తున్నారు. ఓటర్ల నుంచి సేకరించిన రెండు సెట్ల ఎన్యూమరేషన్ ఫారాలలో ఒక సెట్ను బీఎల్వోలు ఓటర్లకు ఇవ్వకుండా టీడీపీ నాయకులకు అందిస్తున్నారు. ఈ ఫారాలను తెలుగుదేశం కార్యకర్తలు మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేసుకుంటున్నారు. కొన్ని సచివాలయాల్లో అయితే తెలుగుదేశం కార్యకర్తలే బీఎల్వో విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటనలకు సంబంధించి అనేక వీడియోలు వెలుగు చూసినా ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి చర్యలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు.బీజేపీనే తప్పు పడుతోందిరాష్ట్రంలో జరుగుతున్న ‘సర్’ ప్రక్రియను కూటమి పార్టీలే తప్పు పడుతున్నాయి. రాష్ట్రంలో సర్ ప్రక్రియ లోపభూయిష్టంగా జరుగుతోందని బీజేపీ రాష్ట్ర శాఖ ఆరోపించడమే కాకుండా నేరుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ను కలిసి ఫిర్యాదు చేసింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, బీజేపీ నేతలు అడ్డూరి శ్రీ రాం, శరణాల మాలతీ రాణి, హేమంత్ కుమార్, యాదవ్ తదితరులు సీఈవోను కలిశారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పలువురు బీఎల్వోలు ఇంకా ఓటర్లను ప్రత్యక్షంగా కలవలేదని, దీంతో అర్హులైన పలువురు ఓటర్లు ఈ ప్రక్రియకు దూరమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్ ప్రక్రియలో లోపాలను వెంటనే సరిదిద్ది అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. తూర్పు గోదావరి జిల్లా బీజేపీకి చెందిన నేత సర్ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించడాన్ని తప్పుపట్టారు.న్యాయ సలహా తీసుకుంటున్నాం : వివేక్ యాదవ్రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియలో కొంత మంది అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే పలు ఫిర్యాదులను స్టాండింగ్ కమిటీకి స్క్రూట్నీ కోసం పంపామని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన కొంత మంది అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. తంబళ్లపల్లిలో బెదిరింపులుఅన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో తెలుగుదేశం పార్టీ ఆగడాలు శృతిమించాయి. కనీసం మహిళా ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయం చూడకుండా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలని మహిళా బీఎల్వోను బెదిరించారు. ఇలా ఆమె నుంచి తీసుకున్న ఫారాలను మై టీడీపీ యాప్లో నమోదు చేసుకుంటున్నారు. ఈ సంఘటన వెలుగు చూసి నాలుగు రోజులైనా సంబంధిత వ్యక్తులపై ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ‘సర్’ పక్కదారి పట్టిందనడానికి నిదర్శనంగా నిలిచింది. నేరుగా మంత్రి నారాయణే..టీడీపీ బీఎల్ఏలతో మంత్రి నారాయణ టెలీ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకున్న సమావేశంలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిన మై టీడీపీ యాప్ బాగుందని, దీన్ని వినియోగించుకోవాలని సూచించడంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. అయినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నరసరావుపేటలో అధికార టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ ఓట్లను తొలగించేలా బీఎల్ఓలపై ఒత్తిడి తెస్తున్నారంటూ టీడీపీ బీఎల్ఏపై ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోగా, రాజీ చేసుకోవాలని అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కళ్లు మూసుకొని అధికార పార్టీకి ఏ విధంగా కొమ్ముకాస్తోందో చెప్పడానికి ఈ సంఘటనలు చాలని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. -
అత్యంత లోపభూయిష్టంగా సర్ ప్రక్రియ: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో మరో మూడు రోజుల్లో ప్రత్యేక ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ముగుస్తున్నా.. ఇంకా పలు చోట్ల లోపాలు బయట పడుతున్నాయని, మరీ ముఖ్యంగా మై టీడీపీ యాప్లో నమోదు చేసిన తర్వాతే సర్లో వివరాలు డిజిటలైజేషన్ చేస్తున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. అధికార టీడీపీ సర్ ప్రక్రియను కూడా తమ రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నా.. తాము పదే పదే ఫిర్యాదులు చేస్తున్నా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆక్షేపించారు.ఇప్పటికైనా ఈసీ రాజ్యాంగ బద్దంగా సర్ కార్యక్రమాన్ని నిర్వహించాలని, లోపాల్ని వెంటనే సరిద్దడంతో పాటు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం గడువు పొడిగించాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్లో లేళ్ల అప్పిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:లోపభూయిష్టంగా సర్ ప్రక్రియ:రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్) ప్రక్రియ గత నెల 15న ప్రారంభమై ఈనెల 14వ తేదీతో ముగుస్తోంది. ఈ ప్రక్రియ అంతా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీకి సంబంధించి కానీ, ఫారాలు తీసుకోవడంలో కానీ, ఫారాలు పూర్తి చేయడంలో కానీ ఎక్కడ చూసినా కూడా పూర్తి లోపభూయిష్టంగా మారింది. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండాలి, దొంగ ఓట్లు తొలగించాలని.. డూప్లికేట్ ఓట్లను తొలగించాలని ఎవరైనా కోరుకుంటారు.అలాగే వైఎస్సార్సీపీ కూడా రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండాలనే ఆలోచనతో అందులో పాలుపంచుకుంటోంది. కానీ, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా కూడా రాజకీయ లబ్ది పొందాలి. రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలని, ఇతర పార్టీల ఓట్లు తొలగించాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ సక్రమంగా జరగకపోయినా కూడా 99 శాతం పైచిలుకు పూర్తయినట్లు అధికారులు ఈసీకి లెక్కలు ఇస్తున్నారు. అసలు ఏమిటీ దౌర్భాగ్యం అని అడుగుతున్నాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించరా? ప్రజాస్వామ్య విలువలను కాపాడే పరిస్థితి లేదా? ఏ కార్యక్రమాన్ని అయినా కూడా తమకు, తమ పార్టీకి ఉపయోగపడే విధంగా తీసుకుపోవడమేనా? ఇదేనా టీడీపీ, చంద్రబాబు మార్క్ వైఖరి?మై టీడీపీ యాప్ లో నమోదు తర్వాతే ’సర్’ లోకి:ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేసిన తర్వాత సహజంగా బీఎల్వోలుగా నియమించిన వారో, లేకపోతే ఏఈఆర్వోలుగా ఉన్నవారో డిజిటలైజేషన్ ప్రక్రియ చేపడతారు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా ఇదే విధానం అమలు చేస్తారు. కానీ ఈ రాష్ట్రంలో డిజిటలైజేషన్ కు ముందే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటర్ల ఫారాలని టీడీపీ నాయకులు వాళ్ళ ’మై టీడీపీ’ యాప్లో నమోదు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాటిని ప్రభుత్వ కార్యాలయాలకు పంపిస్తున్నారు.ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి పరిస్ధితి ఉందా? ఎప్పుడైతే టీడీపీ కార్యాలయాల్ని, ఎమ్మెల్యేల కార్యాలయాలని వేదికగా చూసుకొని మై టీడీపీ యాప్ లో నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టారో అప్పుడే వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. ఓటరుకు ఉన్న గోప్యత టీడీపీ యాప్ లోకి వెళ్తుందని ఫిర్యాదు చేశాం. ఇవాళ ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటర్ల జాబితా ఉంటుందో లేదో అనుమానాలు ఉన్నాయి, కానీ టీడీపీ ఆఫీసుల్లో మాత్రం ఈ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలు మొత్తం కూడా దర్శనమిస్తున్నాయి. ప్రతి చోటా అధికారులు బెదిరించే కార్యక్రమం, భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు.ఇవీ అక్రమాలకు నిదర్శనాలు:తంబళ్లపల్లెలో మాజీ ఎమ్మెల్యే పీఏ నాగార్జున ఇలాగే బెదిరిస్తున్న ఆడియో వింటే క్షేత్రస్ధాయిలో పరిస్ధితి అర్థమవుతుంది. ఇదే కాదు జూన్ 22న నెల్లూరులో అక్కడ ఈఆర్ఓ గా ఉన్న మున్సిపల్ కమిషనర్ బీఎల్వోలతో సమావేశం పెట్టి, మంత్రి నారాయణను, మేయర్, డిప్యూటీ మేయర్ ను భాగస్వాముల్ని చేశారు. దీనిపై ఆ తర్వాత రోజే అంటే జూన్ 23న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేశాం. అయినా చర్యలు లేవు.మరో రోజు నెల్లూరు కమిషనర్ మళ్లీ తిరిగి మంత్రి నారాయణ టీడీపీకి చెందిన బీఎల్వోలతో సమావేశం పెట్టుకుంటే అందులో ఆయన కూడా జాయిన్ అయి మై టిడిపి యాప్ తప్పనిసరిగా వాడుకోవాలని చెప్పారు. మళ్లీ ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసినా స్పందించలేదు. జూలై 2న నరసరావుపేట 118 పోలింగ్ స్టేషన్ లో ఉన్న బీఎల్వోని అక్కడ ఉన్న టీడీపీకి సంబంధించిన బీఎల్వో బెదిరిస్తే ఆయన పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు.టీడీపీ డ్యాష్ బోర్డులో సర్ వివరాలు:అసలు దురదృష్టం ఏమిటంటే ఒక బీఎల్వోని టీడీపీకి సంబంధించినటు వంటి బీఎల్ఏ బెదిరిస్తే బీఎల్వోకి మద్దతుగా నిలబడాల్సిన అధికారులు ఒత్తిడి తెచ్చి కేసు వెనక్కి తీసుకోమన్నారు. రేపల్లెలోని చెరుకుపల్లి మండలంలోని రాంబోట్లవారిపాలెంలో సేమ్ ఇదే పరిస్ధితి. పూర్తి చేసిన ఎన్యుమరేషన్ ఫారాలన్నీ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్లి ఇవ్వాలి, వాళ్ళు మై టీడీపీ యాప్లో నమోదు చేసుకున్న తర్వాత అవి తిరిగి అక్కడి నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పరిస్థితి. అలాగే ఆత్మకూరు నియోజకవర్గం సంఘం మండలం కొరిమేర్ల సచివాలయంలో సాక్షాత్తు వీఆర్వో సమక్షంలో ఇద్దరు టీడీపీ వ్యక్తులు మొత్తం ఫారాలన్నీ మై టీడీపీ యాప్లో నమోదు చేసుకునే కార్యక్రమం చేపట్టారు.ఈ అరాచకం ప్రతీ నియోజకవర్గంలోనూ కొనసాగుతోంది. ప్రతి చోటా టీడీపీ యాప్లో నమోదు చేసిన తర్వాతే ప్రభుత్వ కార్యాలయాలకు వెళుతున్నటువంటి పరిస్థితులు. టీడీపీ నాయకులు ఒక డాష్ బోర్డ్ పెట్టుకుని, అందులో మొత్తం 175 నియోజకవర్గాల ఓటర్ల వివరాలు అప్లోడ్ చేస్తున్నారు. ఇక ఎన్నికల కమిషన్ ఎందుకు, శుభ్రంగా టీడీపీ ఆఫీసులో పెట్టుకుంటే మేము కూడా అక్కడికి వచ్చే మా ఓట్లు కూడా నమోదు చేయించుకుంటాం.ఇదేమైనా మీ ప్రైవేట్ కార్యక్రమమా, లేకపోతే ప్రభుత్వ కార్యక్రమమా ? ఇది రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన కార్యక్రమం, నిష్పక్షపాతంగా జరగాల్సిన కార్యక్రమం, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఇవ్వాల్సిన కార్యక్రమం కాదా? దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో కూడా రాజకీయ లబ్ధి పొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. అలా ఓ దుష్ట సాంప్రదాయానికి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.అందుకే ఎన్నికల ప్రధానాధికారిని ప్రత్యేకంగా కోరుతున్నాం. మీకున్న విశేష అధికారాలను బయటికి తీయాలి. ఇంత కీలకమైన కార్యక్రమానికి సంబంధించి మీరు కళ్లు ఉండి చూడలేని విధంగా, చెవులు ఉండి వినలేని విధంగా, నోరు ఉండి మాట్లాడలేని విధంగా ఉంటే, ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతాయి. దీన్ని కూడా నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వం వెనుకాడని పరిస్థితుల్లో ముందుకు సాగుతోంది.ఇప్పటికైనా ఈసీ జోక్యం చేసుకోవాలి:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా కాదు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పౌరుడిగా ఒక ఓటర్ గా ఎక్కడెక్కడైతే డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే దొంగోట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే చనిపోయిన వాళ్ళు సైతం కూడా ఇప్పుడు ఈ ఓటర్ లిస్ట్ లో బతికి ఉన్నారో, అవన్నీ కూడా తీసేయాలి. గ్రామ పంచాయతీ ఆఫీసులకు వెళ్తే, మున్సిపాలిటీకి వెళితే చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఉంటుందే.. అది ఎవరైనా అడగాల్సిన అవసరం ఉందా, ఆ లిస్టులు తీసుకొని డైరెక్ట్ గా తీసివేసే పరిస్థితులు ఉంటాయి. మరో మూడు రోజుల్లో ఈ సర్ ప్రక్రియ పూర్తవుతోంది. తగిన సమయం కూడా లేదు.ఇన్ని లోపాలతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని కనీసం మరో నెల రోజులు పొడిగించాలని వైఎస్సార్సీపీ కోరుతోంది. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఓట్లు ఉండేలా తీసుకోవాలని మరోసారి ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వినతిపత్రం ఇస్తాం. సహజంగా వీకెండ్స్ లోనే ఉద్యోగాలు చేసేవాళ్ళు, బయట ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళ స్వగ్రామాలకి వస్తుంటే, బీఎల్వోలు మాత్రం టీడీపీ వాళ్లకు ఇచ్చాం, టీడీపీ ఆఫీసులో తీసుకోమని చెప్తున్నారు.అందుకే ఎన్నికల కమిషన్ ఈ లోపాలను సరిదిద్దే కార్యక్రమాన్ని తక్షణం చేపట్టలి. అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ రాష్ట్రంలో ఓటు ఉండాలి. హైదరాబాద్లో ఒకచోట, బెంగళూరులో ఒకచోట, లేకపోతే గ్రామాల్లో ఒకచోట, టౌన్ లో ఒకచోట ఓట్లు ఉండటం సరికాదు. ఇలా ఒకే ఓటరుకు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓట్లపైనా ఈ నెల 14 తర్వాత ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేయబోతున్నట్లు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. -
‘రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (CEO) సుదర్శన్రెడ్డి తెలిపారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 98 శాతం ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ జరిగిందని.. ఈనెల 24వ తేదీ వరకు పత్రాల డిజిటల్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎన్యూమరేషన్ ఫామ్స్ రాకపోతే ఆగష్టులో ఫామ్ 6, 8 ఇస్తారని.. నింపి ఇవ్వాలన్నారు.‘సర్’ ప్రక్రియ ముగిసిన తర్వాత కొత్త ఓటర్ నమోదు కార్యక్రమం ఉంటుంది. కొత్త ఓటర్ నమోదు చేసుకుంటే నెల రోజుల్లో ఈసీఐ ఇస్తుంది. ఓటు ఉండి.. ఎన్యూమరేషన్ ఫామ్ రాకపోతే బీఎల్వోను సంప్రదించాలి. తెలంగాణలో తప్పుడు వివరాలు ఉన్న ఓటర్లు అనామాలీస్ 89 లక్షలు ఈసీఐ గుర్తించింది. త్వరలో అక్షర దోషాలు ఉన్న అనామాలీస్ ఓటర్లకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇస్తుంది’’ అని సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు.రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ప్రతీ ఒక్కరికీ ముఖ్యమైనది. ఓటర్ సవరణ నిరంతరం జరిగే ప్రక్రియ. ఎన్నికలకు ముందు జరిగే స్పెషల్ సమ్మరి రివిజన్ జరిగేది. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. ఓటర్ ప్రక్షాళన చేయాలని ఈసీఐ నిర్ణయం తీసుకుంది. ‘సర్ ప్రక్రియ రెండు భాగాలుగా జరుగుతుంది. ‘సర్’ ప్రక్రియ పూర్తయ్యాక రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు శిక్ష పడుతుంది. డీఎస్ఏ సాఫ్ట్వేర్ ద్వారా దేశ వ్యాప్తంగా రెండు ఓట్లపై ప్రక్షాళన చేస్తారు. 2002 డేటా లేకపోతే ఆ ఓటర్లకు నోటీసులు ఇచ్చి ప్రత్యేక సర్వే జరుగుతుంది. ఏజెన్సీ ఏరియాల్లో 59 శాతం ఫామ్స్ నింపి తిరిగి ఇచ్చారు. ఓల్డ్ సిటీలోని 7 నియోజకవర్గంలో ఫామ్స్ అందాయి. డిజిటలైజేషన్ జరుగుతుంది. ఓటు లేకపోతే సంక్షేమ పథకాలు ఇస్తారా? లేదా? ప్రభుత్వం నిర్ణయం’’ అని సుదర్శన్రెడ్డి చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్‘సర్’ 2026 పురోగతిపై కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ అధ్యక్షతన సమీక్ష జరిగింది. తెలంగాణ నుంచి పాల్గొన్న సీఈవో సుదర్శన్ రెడ్డి, డీఈవోలు, ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు హాజరయ్యారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటైజేషన్ వేగవంతం చేయాలని కేంద్రం ఈసీఐ ఆదేశించింది. హైదరాబాద్లో డిజిటైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చింది.రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో డిజిటైజేషన్పై ప్రత్యేక ఫోకస్ పెట్టాలన్న కేంద్ర ఎన్నికల సంఘం.. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ ప్రక్రియ వేగవంతం చేయాలని పేర్కొంది. రోజువారీ డిజిటైజేషన్ లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. బెస్ట్ ప్రాక్టీసెస్ను ఇతర జిల్లాలు అమలు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ లక్ష్యాలను నిశితంగా పర్యవేక్షించాలని తెలంగాణ సీఈవోను ఆదేశించింది. -
ఇదేమి.. 'సర్'దర్ద్!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 సామాన్యులకు పజిల్గా మారింది. రాష్ట్రంలో 99.46 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్రెడ్డి కార్యాలయం ప్రకటించగా ఇంకా తమకు ఫారాలు అందలేదని చాలా మంది ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని ఎలా నింపాలో తెలియక తికమక పడుతున్నారు. ఫారాలను నింపడంపై ఓటర్లకు అవగాహన కల్పించాల్సిన బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) యూట్యూబ్లో చూసి నింపుకోవాలని సెలవిస్తున్నారు. వెరసి ‘సర్’కార్యక్రమం ఓటర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. కాగితాలపైనే 100% ఫారాల పంపిణీ! ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నల్లగొండ, జనగామ జిల్లాల్లో ఏకంగా 100 శాతం ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినట్లు చెబుతున్నప్పటికీ ఆయా జిల్లాల్లో చాలా మంది ఓటర్లు తమకు ఇంకా ఫారాలు అందలేదని చెబుతున్నారు. ఇళ్లు మారిన ఓటర్లలో చాలా మంది పాత ఇళ్లకు చెందిన ప్రాంతాల్లోని బీఎల్ఓల వద్దకు వెళ్లి ఫారాలు తీసుకోవడానికి ఆసక్తి చూపట్లేదు. అలాగే కొన్ని కుటుంబాల్లో కొందరికే ఫారాలు అందాయి. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి, ఇతర పట్టణ ప్రాంత జిల్లాల్లో కొందరు బీఎల్ఓల వద్దే సగానికిపైగా ఫారాలు పంపిణీ కాకుండానే మిగిలిపోయాయి. పంపిణీ కాని ఫారాలను ఓటర్ల గైర్హాజరు, వలసలు, మరణించిన (అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్/ఏఎస్డీ) ఓటర్లవని పేర్కొంటూ వాటిని సైతం లెక్కల్లో చూపడంతోనే సగటున 99 శాతానికిపైగా ఫారాల పంపిణీ పూర్తయినట్లు తెలుస్తోంది. అవగాహన లేక..వివరాలు లేక.. ఫారం నింపలేక... ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు 2002 ‘సర్’ఓటర్ల జాబితాలో ఓటరు పేరు ఉంటే ఆ వివరాలను ఎడమ వైపు కాలమ్లో రాయాల్సి ఉండగా ముందు (ఎడమ) కాలమ్లో బంధువుగా పేర్కొన్న వ్యక్తి పేరు గత సర్ జాబితాలో ఉంటే ఆ వివరాలను కుడివైపు కాలమ్లో రాయాల్సి ఉంది. ఇందుకోసం 2002 జాబితాలో తమ పేరు, బంధువుల పేర్లను వెతకాల్సి ఉంటుంది. దీనిపై అవగాహన లేని ఓటర్లు ఈ కాలమ్స్లో ప్రస్తుత జాబితాలోని తమ వివరాలు రాస్తున్నారు. వాస్తవానికి 2002 జాబితాలో ఓటరు పేరు, బంధువు పేరు ఎలా ఉంటే అలా యథాతథంగా రాయాలి. 2002 జాబితాలో లేకుంటే ఖాళీగా వదిలేయాలి. అలాగే ఫారం మూడో విభాగంలో ఓటరు పుట్టిన తేదీ/ఆధార్(ఐచ్ఛికం)/మొబైల్ నంబర్/తండ్రి/తల్లి/భాగస్వామి వివరాలను రాయాల్సి ఉంది. 2002 జాబితా, ప్రస్తుత ఓటర్ల జాబితాల్లో దాదాపుగా అందరు ఓటర్ల పేర్లు, బంధువుల పేర్లు, వయసు, బంధుత్వం వివరాల్లో వ్యత్యాసాలున్నాయి. ఒక జాబితాతో పోలిస్తే మరో జాబితాలో కొందరి పేర్లు, బంధువుల పేర్లు పూర్తిగా మారిపోయాయి. బంధుత్వం వద్ద తండ్రికి బదులు భర్త అని, భర్తకి బదులు తండ్రి/భార్య అని తప్పుగా వచ్చింది. దీంతో మూడో విభాగంలో ప్రస్తుత ఓటర్ల జాబితా ప్రకారం వివరాలు రాయాలా లేక సరైన వివరాలు రాయాలా అనే అంశంపై ఓటర్లలో గందరగోళం నెలకొంది. దీంతో తప్పులు రాసి మళ్లీ సరిదిద్దే ప్రయత్నంలో చాలా మంది ఫారాన్ని గజిబిజి చేస్తున్నారు. పాతబస్తీలోని కొన్ని జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు ఒక్కో ఫారం నింపడానికి రూ. 100 చొప్పున వసూలు చేస్తున్నారు. రోజుల తరబడి వెతికినా దొరకని 2002 జాబితాలో ఓటు ఇళ్లు మారిన పట్టణ ప్రాంత ఓటర్లు 2002 జాబితాలో తమ పేర్లను వెతకడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసీఐ పోర్టల్ (https://voters.eci.gov.in/searchIn SIR) లో 2002 జాబితాలో ఓటర్ల పేర్లు వెతకడానికి పీడీఎఫ్, సెర్చ్ విత్ ఓటర్స్ డిటైల్స్ అనే రెండు ఆప్షన్లు ఇచ్చారు. పాత నియోజకవర్గం పేరు, నాటి పోలింగ్ కేంద్రం నంబర్ తెలిసి ఉంటేనే పీడీఎఫ్ జాబితాలో నేరుగా వెతకడానికి వీలవుతోంది. ఈ వివరాలు తెలియకపోతే సెర్చ్ విత్ ఓటర్స్ డిటైల్స్ ఆప్షన్లోకి వెళ్లి ఓటరు పేరు, బంధువు పేరును కీవర్డ్స్గా ఇచ్చి సెర్చ్ చేయాలి. ఇలా సెర్చ్ చేస్తే తమ పేర్లు మినహా సారుప్యత కలిగిన ఇతర ఓటర్ల పేర్లు డిస్ప్లే అవుతున్నాయని ఓటర్లు పేర్కొంటున్నారు. సెర్చ్లో 200 మందికి మించి పేర్లు చూపకుండా సాఫ్ట్వేర్లో పరిమితులు విధించడంతో 2002 జాబితాలో పేర్లు వెతకడం చాలా మందికి అసాధ్యంగా మారింది. దీంతో ఆయా ఓటర్లు ఫారాలు నింపకుండా ఖాళీగా ఇచ్చేస్తున్నారు. ఫలితంగా వారంతా నోటీసులు అందుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఖాళీ ఫారం తిరిగిచ్చేశా.. నా పేరు 2002 ఓటర్ల జాబితాలో లేదు. తల్లిదండ్రులు చనిపోవడంతో వారి వివరాలు లేవు. ఫారం నింపాలని బీఎల్ఓను అడిగితే ఏదో ఒక ఆధారం కావాలని అన్నారు. తండాలో చదువుకున్న వారి వద్దకు వెళ్తే వివరాల్లేకుండా ఫారం నింపడం సాధ్యం కాదన్నారు. అందుకే మీకు నచ్చినట్టు నింపుకోండని బీఎల్ఓకు ఫారం ఇచ్చేశా. – మాలోతు బాలమ్మ, గార్ల మండలం మర్రిగూడెం పంచాయతీ తిర్లాపురం తండా, మహబూబాబాద్ జిల్లా నాకు ఫారం ఇవ్వలేదు నేను వెల్డర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఇంట్లో నలుగురం ఉన్నాం. ముగ్గురికే ఫారాలు ఇచ్చారు. నాది ఇవ్వలేదు. రోజూ అధికారులను అడిగినా దొరకట్లేదు అంటున్నారు. దీంతో వారిని అడగడం మానేశా. – తిరునగిరి మహేశ్, వీవర్స్ కాలనీ, జనగామ (100% పంపిణీ పూర్తైన జిల్లా) ఫారాలు ఎలా నింపాలో తెల్వట్లే... మా ఇంట్లోని నలుగురు ఓటర్లకు బీఎల్వో ఫారాలను ఇచ్చారు. కానీ మాకు చదువురాకపోవడంతో ఎలా నింపాలో తెలియలేదు. హైదరాబాద్లో ఉన్న కొడుకు, కోడలి సూచనతో తెలిసిన వారిని అడిగాం. వారు సైతం తెలియదనడంతో ఫారాలను ఇంట్లోనే పెట్టుకున్నాం. 2002లో ఓటు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు. –వాంకుడోత్ దేవోజి, భూక్యారాం తండా, మహబూబాబాద్ జిల్లా -
మన ఓట్లను కాపాడుకోవడం అత్యంత కీలకం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఎస్ఐఆర్ ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కీలక నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో నిర్వహించిన ఈ టెలి కాన్ఫరెన్స్లో ఎస్ఐఆర్ ప్రక్రియ, బీఎల్ఏల బాధ్యతలు, ఓటర్ల అవగాహన, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాల అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.ఈ నెల 14వ తేదీతో ఇంటింటి సర్వే ముగియనున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ముఖ్యంగా అర్బన్ ఏరియాలలో ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ పూర్తి స్థాయిలో జరగలేదని సమాచారం వస్తోందని, రూరల్ ఏరియాలలో కూడా ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ సరిగా జరగని చోట్ల ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి బూత్లో బీఎల్ఏలు చురుగ్గా పనిచేసి, ప్రతి ఓటర్కు ఫారం అందిందా లేదా అన్నది కచ్చితంగా పరిశీలించాలని స్పష్టం చేశారు.కొన్ని చోట్ల టీడీపీ నాయకులు అధికారులపై ప్రభావం చూపించి తమకు అనుకూలంగా వ్యవహరించేలా ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారం ఉందని, అలాంటి ప్రయత్నాలను పార్టీ నాయకులు, బీఎల్ఏలు అప్రమత్తంగా గమనించాలని సూచించారు. వైఎస్సార్సీపీ ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియకు మరో నెల గడువు పొడిగించాలని కోరిందని, అయితే ఇప్పటి వరకు దీనిపై సమాధానం రాలేదని తెలిపారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో కూడా జాప్యం జరుగుతోందని, ఈ అంశాలన్నింటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.ఓటరు జాబితాల్లో మన ఓట్లు తొలగించకుండా కాపాడుకోవడం, అదే సమయంలో దొంగ ఓట్లు ఉంటే వాటిని గుర్తించి తొలగించేలా చూడడం బీఎల్ఏల ప్రధాన బాధ్యత అని సజ్జల అన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు చాలా సందర్భాల్లో 5 వేల నుంచి 10 వేల ఓట్ల తేడాతో నిర్ణయించబడతాయని, అందువల్ల ప్రతి ఓటు విలువైనదని గుర్తుచేశారు. మన ఓట్లను తొలగించేందుకు రకరకాల కుట్రలు జరిగే అవకాశం ఉందని.. ముఖ్యంగా మునిసిపాలిటీలు, అర్బన్ ఏరియాలలో ఓట్లు అత్యంత కీలకమని ఆయన అన్నారు.అర్బన్ ప్రాంతాల్లో బీఎల్ఏలకు అవసరమైన అదనపు సపోర్టింగ్ టీమ్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఇప్పటికే పార్టీ కంట్రోల్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయని, ఎక్కడైనా ఎన్యూమరేషన్ ఫామ్స్ అందకపోతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు పార్టీ కంట్రోల్ రూమ్స్కు కూడా తెలియజేయాలని చెప్పారు. ఈ విషయంలో మీడియాను కూడా విస్తృతంగా వినియోగించుకోవాలని, ఫామ్స్ అందని ప్రాంతాల సమస్యను వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రతిరోజూ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, తన నియోజకవర్గంలోని ప్రతి బూత్ స్థాయి పరిస్థితిపై స్టేటస్ అప్డేట్ తీసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించారు. బీఎల్ఏకు ప్రతి రోజూ కీలకమని, ఈ తుది దశలో ఒక్కరోజు కూడా నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. జిల్లా అధ్యక్షులు, టాస్క్ఫోర్స్ సభ్యులు, పార్లమెంట్ పరిశీలకులు, అసెంబ్లీ పరిశీలకులు, సీనియర్ నాయకులతో సమన్వయం చేసుకుని ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలని చెప్పారు.బీఎల్ఏలు ఓటర్లకు ఎస్ఐఆర్పై పూర్తి అవగాహన కల్పించడంతో పాటు బీఎల్వోలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్పైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కడైనా ఓటర్లకు ఇబ్బంది కలిగేలా మార్పులు జరిగితే వెంటనే గుర్తించి చర్యలు తీసుకునేలా చూడాలని సూచించారు.ఈ టెలి కాన్ఫరెన్స్లో రెండో అంశంగా రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరాన్ని సజ్జల వివరించారు. ప్రతి నియోజకవర్గంలో మీడియాను విస్తృతంగా వినియోగించుకుని వైఎస్సార్సీపీ వాయిస్ ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి తీవ్రంగా దిగజారిపోయిందని, సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతూ, రకరకాల కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే సహించలేని స్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉందని, ఆ ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.సాయికృష్ణ, క్రాంతికుమార్ కుటుంబాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన తర్వాతే ప్రభుత్వంలో కొంత చలనం వచ్చిందన్న సజ్జల.. బాధిత కుటుంబాలకు అండగా నిలవడం వైఎస్సార్సీపీ బాధ్యతగా తీసుకుంటోందని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.రైతుల సమస్యలపై పార్టీ చేపడుతున్న ఆందోళనలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలపై కలిసి వచ్చే పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకుని పోరాటాలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని పోర్టులు, హార్బర్లను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలపైనా ప్రజల పక్షాన బలమైన పోరాటం చేయాలని అన్నారు.పార్టీలోని అన్ని విభాగాలు సమన్వయంతో ముందుకు సాగాలని, ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో చివరి రోజు వరకు అప్రమత్తంగా ఉండటంతో పాటు, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీగా వైఎస్సార్సీపీ ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. -
నేటి నుంచి సర్పై ప్రత్యేక శిబిరం
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్ )పై ఈ నెల 6 నుంచి 8 వరకు సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరాన్ని 6న ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ప్రారంభిస్తారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తదితరులు పాల్గొననున్నారు.ఈ ప్రత్యేక క్యాంపులో ఎన్యుమరేషన్ ఫారాలు ఆన్లైన్లో సమర్పించడం, కొత్త ఓటర్లు నమోదు, ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారి పేర్లు తొలగింపు, చిరునామా మార్పు తదితర అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తారు. ఉద్యోగులు 2002 నాటి ఓటరు జాబితాలోని వివరాలు, తాజా ఫొటో, ప్రస్తుత ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు), ఆధార్ కార్డు, రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్ వివరాలతో హాజరు కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. -
55 శాతం డిజిటలైజేషన్ పూర్తి
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగం పుంజుకుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం, ఆదివారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్తో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ 55 శాతానికి చేరిందని వెల్లడించారు. మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు 2.28 కోట్ల మంది వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినట్లు తెలిపారు. గడిచిన 24 గంటల్లోనే 28,30,263 మంది ఓటర్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినట్లు వివరించారు. జూలై 2న 37.66 శాతంగా ఉన్న డిజిటలైజేషన్.. మూడు రోజుల్లోనే 54.96 శాతానికి చేరుకుందని ఆయన వివరించారు. వెనుకబడిన బీఎల్వోలు సస్పెండ్ ప్రస్తుతం డిజిటలైజేషన్లో కృష్ణా జిల్లా 69.26 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఏలూరు(68.41 శాతం), చిత్తూరు(63.71శాతం), శ్రీకాకుళం(63.65 శాతం) ఉన్నాయని వివేక్ యాదవ్ తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్లైన్లో తక్కువగా నమోదు చేసిన జిల్లాలు, నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వెల్లడించారు.ప్రస్తుతం డిజిటలైజేషన్లో 50 శాతం కంటే తక్కువగా ఉన్న అల్లూరి సీతారామరాజు (43.65 శాతం), విశాఖపట్నం(47.80 శాతం), వైఎస్సార్ కడప(49.19 శాతం), అనంతపురం(49.63 శాతం) జిల్లాలతోపాటు ఎనీ్టఆర్(50.09 శాతం), కర్నూలు (50.29 శాతం), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (50.54 శాతం) జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. ఈ జిల్లాల్లో తక్కువ డిజిటలైజేషన్ జరిగిన ప్రాంతాలను గుర్తించి అక్కడ అదనపు సిబ్బందిని, పరిశీలకులను పంపినట్లు తెలిపారు. మరోవైపు 15శాతం కన్నా తక్కువగా డిజిటలైజేషన్ చేసిన పలువురు బీఎల్వోలను అధికారులు సస్పెండ్ చేశారు. -
ఫారాలెక్కడ ‘సర్’
ఓటు వివరాలు కావాలంటే టీడీపీ బీఎల్ఏను కలవాలని మా బీఎల్వో చెబుతున్నాడు. మా ఇంటికి ఇంత వరకు బీఎల్వోనే రాలేదు. ఎన్యూమరేషన్ ఫామ్ కూడా టీడీపీ బీఎల్ఏ దగ్గరే తీసుకున్నా. ఎలా పూర్తిచేయాలో తెలియక ఎన్యూమరేషన్ ఫారం తిరిగి ఇవ్వలేదు. ఓటర్ల జాబితాలన్నీ తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరే ఉన్నాయి. – ఎ.కృష్ణ, బొల్లవరం, కల్లూరు మండలం, కర్నూలుసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగుతోంది. ‘మాకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇంకా అందలేదు మహాప్రబో అని ఓటర్లు గగ్గోలు పెడుతుంటే.. అధికారులు మాత్రం అంకెల్లో వందశాతాలు చూపిస్తూ సంబరపడుతున్నారు. ఫారాల పంపిణీ మొదలు డిజిటలైజేషన్ వరకు అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరుగుతున్నాయి. చాలామంది బీఎల్వోలు టీడీపీ నాయకులకు ఈ ఫారాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. టీడీపీ నాయకుల ఇళ్లు, టీడీపీ కార్యాలయాలే బీఎల్వోల కార్యక్షేత్రాలుగా మారిపోయాయి. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులైన ఓటర్లలో ఎవరికి ఫారాలు ఇవ్వాలి? ఎవరిని మినహాయించాలనేది టీడీపీ నాయకులే బీఎల్వోలకు నిర్దేశిస్తున్నారు. ఎందుకంటే చాలాచోట్ల వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలే అందలేదు. ఫారాలు ఇప్పించాలంటూ ఎమ్మార్వో కార్యాలయాల వద్ద ఆందోళనలు జరుగుతున్నాయి. నిజమైన ఓటర్లకు ఓట్లు లేకుండా చేయాలన్న కుట్రతో పాటు పనిలో పనిగా దొంగఓట్లు చేర్పించే దుర్మార్గానికి కూడా అక్కడక్కడా పసుపు చొక్కా నాయకులు పూనుకుంటున్నారు. ఓటర్లకు రెండు ఫారాలు ఇచ్చి పూర్తి చేసిన ఫారం తీసుకుని ఎక్నాలెడ్జ్మెంట్ ఫారం వారికే తిరిగి ఇవ్వాలన్న పద్ధతిని బీఎల్వోలు ఎక్కడా పాటించడం లేదు. నిరక్షరాస్యులైన ఓటర్లకు వివరాలు నింపడంలో సాయపడాల్సిన బీఎల్ఓలు చాలామంది ఆ పనిని గాలికి వదిలేశారు. దాంతో చాలాచోట్ల ఓటర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడువు సమీపిస్తున్నా ఇంకా ఫారాలు అందలేదు.. అందిన ఫారాల డిజిటలైజేషన్ సగం కూడా జరగలేదు.. ఈ నేపథ్యంలో సర్ గడువు పొడిగించాలని, అవకతవకలన్నీ సరిచేయాలని ఓటర్లు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామికవాదులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సర్ జరుగుతున్న తీరిలా ఉంది... దొంగ ఓట్లు చేర్చే కుట్ర శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల కనుసన్నల్లో బీఎల్వోలు పనిచేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దొంగ ఓట్ల నమోదులో పచ్చ నేతలకు వీరు సహకరిస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలం కమ్మవారిపాళెం పంచాయతీ మజరా విజయనగరంలో ఎక్కువ మంది వలస వెళ్లారు. దీంతో ఇక్కడ కేవలం 15 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో నలుగురు మృతి చెందడంతో ఈ సంఖ్య 11కు చేరింది. అయితే టీడీపీ నేతలతో స్థానిక బీఎల్వో కుమ్మక్కై అక్కడ 76 ఓట్లున్నట్లుగా చూపుతున్నారు. దొంగఓట్లు చేర్చే కుట్ర జరుగుతుండటంతో వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకున్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్పొరేషన్ ఉద్యోగులను అధికార పార్టీ నేతల కార్యాలయంలోనే కూర్చోబెట్టి ఓటర్ల చేర్పులు చేయిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీ నాయకుడి ఇల్లే బీఎల్వో కార్యాలయం కర్నూలు జిల్లాలో బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు అందించడం లేదు. ఎక్కడో ఒకచోట కూర్చుంటున్నారు. వారిని వెతికి పట్టుకోవడానికి ఓటర్లు నానా తిప్పలు పడుతున్నారు. ఆదోనిలో టీడీపీ నాయకుడి ఇల్లే బీఎల్వో కార్యాలయం. ఎవరైనా సరే అక్కడికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం తెచ్చుకోవలసిందే. కర్నూలులోనూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే బీఎల్వోలు కూర్చుంటున్నారు. జిల్లాలో వలస వెళ్లిన కూలీల ఫారాలన్నీ అందుబాటులో లేకుండా చేశారు. ఓటరు జాబితా నుంచి వారిని తొలగించడానికి సర్వం సిద్ధం చేశారు. ‘సర్’ ప్రక్రియలో పసుపు యానిమేటర్లు అనంతపురం జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో, డిజిటలైజేషన్ ప్రక్రియలో వెలుగు యానిమేటర్లు కనిపిస్తున్నారు. అధికార పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఓ అధికారి ఆదేశాలతోనే యానిమేటర్లు ఈ పనిలోకి వచ్చారని అంటున్నారు. ప్రస్తుతం వెలుగు యానిమేటర్లందరూ అధికార పార్టీకి చెందిన వారేనన్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రక్రియ సజావుగా జరుగుతుందా.. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ జరుగుతుందా లేక ప్రతిపక్షాలకు చెందిన ఫారాలు గల్లంతవుతాయా అన్నా అనుమానాలున్నాయి. ఎన్యూమరేషన్ జిరాక్స్లు ఎందుకు ‘తమ్ముడూ’? కళ్యాణదుర్గంలోని 70, 71 పోలింగ్ కేంద్రాల వద్ద ఓ టీడీపీ కార్యకర్త ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాల జిరాక్స్లు తీసుకుంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పట్టుబడ్డాడు. తాను బీఎల్వోనని, గతంలో ఇక్కడి బీఎల్వో సరిగా పనిచేయకపోవడంతో తనను నియమించారని చెప్పి తప్పించుకోబోయాడు. గట్టిగా నిలదీయడంతో ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలన్నీ తీసుకురావలసిందిగా స్థానిక టీడీపీ నేత డిష్ మురళి చెప్పాడని బయటపెట్టాడు. అంటే ఆ ఫారాలన్నీ పరిశీలించి ఏవేవి తీసేయాలో చెప్పేందుకు టీడీపీ నాయకులు పన్నిన కుట్రన్న మాట. బీఎల్వోలను పిలిపించేలోపు ఆ కార్యకర్త అక్కడి నుంచి పరారయ్యాడు. అతడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని రాకెట్ల గ్రామానికి చెందినవాడని తెలిసింది. ఇంట్లో అందరికీ ఫారాలు ఇవ్వరా? శ్రీకాకుళం జిల్లాలో 98 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిపోయిందని అధికారులు చెబుతున్నారు. కానీ శ్రీకాకుళం నగరంలోని చాలా ఏరియాల్లోకి అసలు బీఎల్వోలు అడుగేపెట్టలేదు. జిల్లాలో చాలాచోట్ల ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఒక ఇంటిలో ఐదుగురు ఓటర్లుంటే ముగ్గురికే ఫారాలు ఇచ్చారు. మిగిలిన ఇద్దరికీ మళ్లీ తెచ్చి ఇస్తామని చెప్పి మాయమయ్యారు. చాలాచోట్ల అక్నాలెడ్జ్మెంట్లా ఉంచాల్సిన ఫారాన్ని కూడా బీఎల్వోలు తీసుకెళ్లిపోతున్నారు. రెండు ఫారాలు వాళ్లే తీసుకుపోతే మనకు ఇక ఆధారమేమి ఉంటుందని కొందరు ఓటర్లు చర్చించుకుంటున్నారు. తిరుపతి నగరంలోని 36వ డివిజన్లో ఒక ఇంట్లో 8మంది ఓటర్లు ఉంటే ముగ్గురికి, చెన్నారెడ్డి కాలనీలో ముగ్గురు ఉంటే ఇద్దరికే ఫారాలు ఇచ్చి మిగిలిన వారిని వదిలేశారు. సర్వం గందరగోళం.. సర్.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సర్ ప్రక్రియ సర్వం గందరగోళంగా తయారయ్యింది. శని, ఆదివారాలలో బీఎల్వోలు బూత్లలో అందుబాటులో ఉంటారని అధికారులు ప్రకటించినా ఎక్కడా బీఎల్వోలు కనిపించలేదు. చాలా చోట్ల బూత్లకు తాళాలేసి ఉన్నాయి. తెరిచి ఉన్న బూత్లలో సిబ్బంది ఎవరూ లేరు. ⇒ తూర్పుగోదావరి జిల్లాలో సామాన్య ఓటర్లకు అవగాహన లేకపోవడంతో ఎన్యూమరేషన్ ఫారాల్లో వివరాలు నమోదు చేయలేకపోతున్నారు. ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో ఓటర్లకు బీఎల్వోలు సహకరించడం లేదు. రాజమండ్రి నగరంలో నేటికీ 25 శాతం కంటే తక్కువగా డిజిటలైజేషన్ జరిగింది. ⇒ వైఎస్సార్ కడప జిల్లాలో ఎన్యూమరేషన్ పత్రాలు పూరించడం తెలియక ఓటర్లు తికమక పడుతున్నారు. సర్వర్లు మొరాయించడం వంటి కారణాల వల్ల డిజిటైజేషన్ ప్రక్రియ ఈనెల 14వ తేది నాటికి పూర్తి కాదని, గడువు పొడిగించాలని పలువురు కోరుతున్నారు. ⇒ ఉమ్మడి విశాఖ జిల్లాలో బీఎల్వోలు అందుబాటులో లేకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం, ఆదివారం స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించలేదు. విశాఖ తూర్పు, ఉత్తర, గాజువాక, చోడవరం, పాయకరావుపేట, అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి నియోజకవర్గాల్లో బీఎల్వోల కోసం ప్రజలు ఎదురు చూపులు చూడాల్సి వచ్చింది. అల్లూరి జిల్లాలోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లోనూ ఎన్యూమరేషన్ ఫారాలు అందరికీ అందలేదు ⇒ చిత్తూరు నగరంలోని 32వార్డు సచివాలయంలో పనిచేసే బీఎల్వోలు, ఓటర్లపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నంద్యాల విశ్వనగర్ టీడీపీ కార్యాలయంలో సర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బీఎల్వో, అధికారులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులే టార్గెట్⇒ పల్నాడు జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ పలు అనుమానాలకు తావిస్తోంది. చాలామంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం లేదు. నూజెండ్ల మండలం వి అప్పాపురం గ్రామంలో బూత్ నంబర్లు 286, 287 పరిధిలో 22 మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వలేదు. దీనిపై వైఎస్సార్సీపీ బీఎల్ఏలు నూజెండ్ల మండల ఎంఆర్ఓకు సమస్యను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. చాలాచోట్ల బీఎల్వోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎన్యూమరేషన్ పత్రాలను అధికార పార్టీ నేతలకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. ఇళ్లకు వెళ్లకుండా స్థానిక రాజకీయ నాయకుల ఇళ్ల వద్ద కూర్చుని ఫారాలు పూర్తి చేస్తున్నారు. ⇒ బాపట్ల జిల్లాలోనూ చాలాచోట్ల వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. మార్టూరులోని 21, 22, 23 వార్డులలో అధిక శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. అందులో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లను బీఎల్వోలు మినహాయించారు. కానీ ‘సాక్షి’లో కథనం రావడంతో బీఎల్వోలు హడావిడిగా శని, ఆదివారాల్లో ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. అలాగే పర్చూరు, చీరాల నియోజకవర్గాలలోనూ వందలాదిమంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులు తమకు ఫారాలు అందలేదని చెబుతున్నారు. వేమూరు నియోజకవర్గంలోనూ ఫారాల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ఇంట్లో అందరికీ ఫారాలు ఇవ్వడం లేదు. కొంతమందికి ఇచ్చి మిగిలినవారికి మళ్లీ తెస్తామని బీఎల్వోలు చెబుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కలెక్టర్ మాత్రం జిల్లాలో 100 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిపోయిందని చెబుతున్నారు.నంద్యాల 6వ వార్డులో టీడీపీ నాయకుడితో కలిసి ఓటర్ల జాబితాను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారులు ⇒ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు మండలం శ్రీరామవరం 80వ బూత్లో వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. దీంతో వారు దెందులూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక గ్రామంలో 800మంది వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించలేదు. అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో బీఎల్వోలు పనిచేస్తుండటంపై ఫారాలు అందనివారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ సరిగా జరగడం లేదు. చాలాచోట్ల అధికార టీడీపీ నేతలతో కుమ్మక్కై ఫారాలను వారి చేతికి అప్పగించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. నగరి మున్సిపాలిటీ 10వ వార్డులో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించాలని టీడీపీ నాయకులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. జీడీ నెల్లూరు పరిధిలోని గంగమాంబపురంలో ఫారాలన్నీ టీడీపీ నేతలకు బీఎల్వోలు అప్పగించగా, వారు తమకు అనుకూలమైన ఓటర్ల వివరాలను మాత్రమే ఆన్లైన్ చేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ⇒ గుంటూరు జిల్లాలో గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 1వ వార్డు 92 బూత్లో సల్మా భాను అనే బీఎల్వో 600కి పైగా ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా బూత్ల్లో పర్యటిస్తుండగా ఈ విషయం బయటపడింది. దీనిపై నిలదీస్తే ఆ బీఎల్వో దురుసుగా సమాధానం చెప్పారు. ఓట్ల తొలగింపుపై నూజండ్ల తహసీల్దార్ రమేష్కుమార్కు వినతిపత్రం అందిస్తున్న వైఎస్సార్సీపీ నేతలు ఫారాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగలేకపోతున్నాం ఫారాలివ్వడానికి బీఎల్వోలు ఎవరూ ఇళ్లకు రావడం లేదు. సచివాలయాల చుట్టూ తిరగలేకపోతున్నాం. ఫోన్ చేస్తే సచివాలయానికో, మరో ప్రాంతానికో రమ్మని చెబుతారు. వెళ్లినా అక్కడ ఉండడం లేదు. రోజువారీ పనులు వదులుకుని ఆఫీసుల చుట్టూ తిరగటం మా వల్ల కావడం లేదు. మేం ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరగాలో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా మా ప్రాంతానికి వచ్చి ఫారాలు అందజేయాలని కోరుతున్నాం. – బాబు, పాలసముద్రం మండలం, చిత్తూరు జిల్లావృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందిపడుతున్నారు సర్ ప్రక్రియలో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ, స్వీకరణ చేయాలి. అయితే మా పంచాయతీలో బీఎల్వోలు ఇళ్లకు రావడం లేదు. సచివాలయానికి రావాలని ఓటర్లకు చెబుతున్నారు. దీంతో సచివాలయానికి వెళ్లలేక, వ్యయప్రయాసలకోర్చి అక్కడవరకూ వెళ్లినా అక్కడ ఎదురు చూడలేక చాలామంది వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు. – జమాల్, మాజీ సర్పంచ్, సింగవరం పంచాయతీ, అనంతపురం జిల్లాఐదుసార్లు ఓటు వేశాను.. ఇప్పుడు ఓటు లేదంటున్నారు మేం కనిగిరి బీసీ కాలనీలో ఉంటున్నాం. మా ఇంట్లో 9 మంది ఓటర్లం ఉన్నాం. మా స్వగ్రామం మార్కాపురం మండలం మేకలవారిపల్లి గ్రామం. నేను సుమారు 35 ఏళ్ల క్రితం కనిగిరికి వచ్చాను. కనిగిరి నియోజకవర్గంలో ఇప్పటికి ఐదుసార్లు ఓటు వేశాం. భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటరు గుర్తింపు కార్డును రెండుసార్లు పొందాను. అన్ని ఆధారాలతో ఎన్యూమరేషన్ ఫారం తీసుకుని వెళ్లి బీఎల్వో ఆంజనేయులును కలిశాను. 2002 జాబితాలో నీ పేరు కనిపించడం లేదు. మీ నాన్న, మీ బంధువుల ఆధారాలు తీసుకుని రా.. లేదంటే.. నీ ఓటు ఫారంను రిజక్ట్ చేస్తాను అని బీఎల్వో చెప్తున్నాడు. మీ నాన్న ఓటు వివరాలు, బూత్ నంబర్ కని్పంచలేదని బీఎల్వో దబాయిస్తున్నాడు. ఎన్నికల అధికారులు నాకు న్యాయం చేయాలి. – చల్లా ఏడుకొండలు, కనిగిరి, మార్కాపురం జిల్లాఓటరు లిస్టులో పేరు లేదంటున్నారు నాకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చారు. కానీ ఇçప్పుడు బీఎల్వో ఓటరు లిస్టులో నా పేరు లేదంటున్నారు. ఎన్నో ఏళ్లుగా వేస్తున్న ఓటు లేదంటే ఎలా? ఫారం పూర్తిచేసి ఇచ్చినా డిజిటలైజేషన్ కాలేదు. పక్క గ్రామంలో కూడా ఓటరు లిస్టులో పేరు కోసం వెతికించా. అక్కడా కనిపించలేదంటున్నారు. ఊరూరా తిరిగే ఓపిక లేదు. ఒంటరి వృద్ధురాలిని. నా ఓటు తీసేయడానికే లిస్టులో లేదంటున్నారా? అసలు నా ఓటు ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? – కురబ రమణమ్మ, చేనేతనగర్, కురబలకోట మండలం, అన్నమయ్య జిల్లాఫారం నింపడానికి బీఎల్వో సాయం చేయడం లేదు ఎన్యూమరేషన్ ఫారంలో వివరాలు ఎలా నింపాలో అర్థం కావడం లేదు. బీఎల్వోలు ఎవరూ సాయం చేయడం లేదు. తండ్రి పేరుతో పాటు తాత, నాన్నమ్మ, అమ్మమ్మ పేర్లు, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఓటరు గుర్తింపు కార్డు నంబర్లు అడుగుతున్నారు. నేను పెద్దగా చదువుకోకపోవడంతో ఆ వివరాలు ఎలా నింపాలో అర్థంగాక నింపడం లేదు. 2002 ఓటరు జాబితా వివరాలు నింపాలంటే ఆ లిస్ట్ ఎక్కుడుందో తెలియడం లేదు. – భీమన వీరబాబు, క్వారీ మార్కెట్, బూత్ నంబర్ 30, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లాఫారాలు ఇవ్వకుండా ఆన్లైన్ చేసేశామంటున్నారు సర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఓటర్కు రెండు ఫారాలు ఇచ్చి వాటిని నింపిన తర్వాత ఒకటి ఓటర్ దగ్గర ఉంచి ఇంకొకటి బీఎల్వో తీసుకొని ఆన్లైన్ చేయాలి. అప్పుడే ఆ ఓటర్ ఎన్యూమరేషన్లో పాల్గొన్నట్లు అవుతుంది. రేపు ఓటు గల్లంతైతే ఓటరు అడగడానికి వీలు కలుగుతుంది. ఓటరు దగ్గర ఫారం లేకపోతే తన ఓటు గురించి అడిగే హక్కు ఎలా ఉంటుంది? మైలవరం నియోజకవర్గంలో చాలా బూత్లలో ఓటర్లకు ఫారాలు ఇవ్వకుండా వివరాలు తీసుకొని ఆన్లైన్ చేసేశామని చెబుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఉన్నతాధికారులు స్పందించి ప్రతి ఓటరుకు ఫారాలు అందేలా చూడాలి. – వేములకొండ విష్ణు, జి.కొండూరు, ఎన్టీఆర్ జిల్లా -
మా పార్టీకి ఓటు వేస్తామంటేనే..మీ పేరు ఆన్లైన్లో నమోదు
చిల్లకూరు: ‘మా పార్టీకి ఓటు వేస్తామంటేనే మీ దరఖాస్తు ఆన్లైన్లో నమోదు చేయిస్తాం. లేదంటే మీ ఓటు గల్లంతే..’ అంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తొణుకుమాల గ్రామంలో టీడీపీ నాయకులు ఓటర్లను బెదిరిస్తున్నారు. తొణుకుమాల గ్రామంలోని 135వ పోలింగ్ కేంద్రం వద్ద శనివారం బీఎల్వో చంద్రశేఖర్ ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకుని ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నారు. బీఎల్వో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో బయటకు వెళ్లగా, గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వచ్చి తమకు అనుకూలంగా ఉండే వారి ఫారాలను ఆన్లైన్లో నమోదు చేయాలని బీఎల్వోకు సహకారం అందిస్తున్న సచివాలయ ఉద్యోగిపై ఒత్తిడి తెచ్చారు.అదే సమయంలో ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకువచ్చిన గ్రామస్తులను ఉద్దేశించి ‘టీడీపీకి ఓటు వేస్తామంటేనే మీ ఫారాలు ఆన్లైన్లో నమోదు చేయిస్తాం’ అని బెదిరించారు. వారిని వ్యతిరేకిస్తే ఓటు లేకుండా చేస్తారని భయపడిన కొందరు అంగీకరించడంతో తాము చెప్పినవారికి పూర్తయిన తర్వాత లైనులో ఉన్నవారికి ఆన్లైన్లో నమోదు చేయాలని సచివాలయ ఉద్యోగికి టీడీపీ నాయకులు చెప్పారు. ఈ వ్యవహారాన్ని గమనించిన వైఎస్సార్సీపీ బీఎల్ఏ వచ్చి టీడీపీ నాయకులను అడ్డుకునేందుకు యత్నించగా, అతనిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. అనంతరం బీఎల్ వో వచ్చి పరిస్థితిని గమనించి వెంటనే గూడూరు ఆర్డీవో అరుణకుమారికి ఫోన్లో ఫిర్యాదు చేశారు. -
ఊళ్లకు 'ఫారం' ఫీవర్!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఓ కొలిక్కి వస్తున్నప్పటికీ ఈ ఫారాలను నింపడం ఎలాగో తెలియక ఓటర్లు తికమక పడుతున్నారు. ఫారంలోని రెండు భాగాల్లో తమ వివరాలను ఎక్కడ నింపాలో చాలా మందికి తెలియడం లేదు. 2002 నాటి ఓటర్ల జాబితాలో పేరున్న వారు ఫారంలో ఎటువైపు వివరాలు నింపాలి.. 2002 జాబితాలో పేరు లేని వారు ఫారంలో వివరాలు ఎక్కడ నింపాలనే దానిపై గందరగోళం నెలకొనడంతో బీఎల్ఓలకు ఫోన్లు చేసి తెలుసుకుంటున్నారు. అలాగే కొన్నిచోట్ల వివిధ పార్టీల బీఎల్ఏల సహాయం తీసుకుంటున్నారు. ఓటర్ల జాబితాలో పేరున్నప్పటికీ కొన్ని చోట్ల వారు స్థానికంగా లేకపోవడం, ఫోన్ నంబర్, చిరునామా తెలియకపోవడంతో బీఎల్ఓలు అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా శనివారం నాటికి 2.88 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గ్రామీణ ఓటర్లు వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడంతో ఫారాల పంపిణీ పూర్తి కావడం లేదు. పట్టణ ప్రాంతాల్లో చిరునామాలు దొరక్క ఫారాల పంపిణీలో కొంత జాప్యం జరుగుతోంది. మరోవైపు బీఎల్ఓలకు ఇప్పటికే రెండుసార్లు శిక్షణ ఇచ్చిన ఎన్నికల సంఘం.. ఇప్పుడు ఓటర్లు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓ యాప్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను ఎలా నిర్వహించాలనే అంశంపై మరోసారి బీఎల్ఓలకు శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త కోడళ్లకు ‘సర్’ఇక్కట్లు.. కొత్తగా పెళ్లయి అత్తారింటికి వచ్చిన కొత్త కోడళ్లకు ఎన్యూమరేషన్ దరఖాస్తులు నింపడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంబంధిత మహిళ తండ్రి, తల్లి, తాత, నాయనమ్మలకు సంబంధించిన ఎపిక్ నంబర్ను ఫారంలో పొందుపరచడం తప్పనిసరిగా మారింది. దీంతో వారి పుట్టింటికి ఫోన్లు చేసి కనుక్కోవాల్సి వస్తోందని ఆ మహిళలు పేర్కొంటున్నారు. భర్త తరఫు వారి ఎపిక్ నంబర్లతో మ్యాపింగ్ జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు. జిల్లాల్లో పరిస్థితి ఇలా.. – ఉత్తరాది రాష్ట్రాల వలస కార్మిక ఓటర్లు ఎక్కువగా ఉండే ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్చెరు, సంగారెడ్డి వంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ తక్కువగా జరుగుతోంది. చాలా మంది అద్దెకు ఉన్న వారి ఆచూకీ కనుక్కోవడం ఇబ్బందిగా మారిందని బీఎల్ఓలు పేర్కొంటున్నారు. – ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వివాహం చేసుకొని వచ్చిన మహిళల పాత (2002) ఓటరు వివరాలు సేకరించడం కష్టంగా మారింది. ముంబై, హైదరాబాద్ తదితర నగరాలకు వలస వెళ్లిన ఓటర్ల నుంచి సమాచారం, పత్రాలు పొందడం ఇబ్బందిగా మారింది. – ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర–తెలంగాణ రాష్ట్రాల పరిధిలో ఉన్న కెరమెరి మండలం పరందోలి, అంతాపూర్, బోలపటార్ వంటి 11 గ్రామాల్లోని ఓటర్లు రెండు రాష్ట్రాల అధికారులు ఇచ్చిన ఫారాలను తీసుకుంటున్నారు. ఒకే రాష్ట్రంలో ఓటు హక్కు మిగిలే అవకాశం ఉండటంతో ఇరు రాష్ట్రాల బీఎల్ఓలు పోటాపోటీగా ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని కోల్బెల్ట్లో రిటైర్డ్ కార్మికులు తమ సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. దీంతో వారికి ఫారాల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. – కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, హుజురాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లో ఫారాలను పూర్తి చేయడంలో నిరక్షరాస్యులకు సమస్య తలెత్తుతోంది. – ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూపాలపల్లి పట్టణంలో ఓటర్ల చిరునామాలను బీఎల్వోలు గుర్తించలేకపోవడంతో ఆయా వార్డుల్లో పార్టీల నేతల సహకారంతో ఫారాలను పంపిణీ చేస్తున్నారు. సింగరేణి కార్మికుల్లో కొందరికి భూపాలపల్లితోపాటు వారి స్వగ్రామాల్లోనూ ఓట్లు ఉన్నాయి. భూపాలపల్లి ఓటు హక్కును తొలగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో భూపాలపల్లి పట్టణంలో సుమారు 10 వేల వరకు ఓట్లు తగ్గే అవకాశం ఉంది. – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని చాలా వరకు రాజకీయ నేతలే చేపడుతున్నారు. బీఎల్ఓలు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారు. – ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు పట్టణాల్లో బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లకుండా తాము ఉన్న చోటకే వచ్చి ఫారాలను తీసుకెళ్లాలని చెబుతున్నారు. అధికారుల కోసం ఎదురు చూస్తున్నాం నాలుగు రోజుల క్రితం అధికారులు వచ్చి ఫారం ఇచ్చి వెళ్లిపోయారు. మాకు చదువు రాదు. ఫారం ఎలా నింపాలో తెలియదు. మళ్లీ అధికారులు వస్తే వివరాలు చెబుదామని ఎదురుచూస్తున్నా. – అచ్చమ్మ, వెంకటాపురం(కె), ములుగు జిల్లాఫారం ఎలా నింపాలో చెప్పట్లేదు ఫారం నింపి ఇవ్వకపోతే ఓటు పోతుందంటున్నారు. ఎలా నింపాలో మాత్రం ఎవరూ చెప్పట్లేదు. ఫారం నింపేందుకు చదువుకున్న వాళ్ల చుట్టూ తిరిగా. కానీ వాళ్లకూ అర్థంకాకపోవడంతో చివరకు బీఎల్ఓల దగ్గరకే వెళ్లా. – కథలప్ప, మరికల్, నారాయణపేట జిల్లా -
దొంగ ఓట్ల సృష్టికి టీడీపీ నేతల కుతంత్రం
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో దొంగ ఓట్ల సృష్టికి టీడీపీ నేతలు కుతంత్రం పన్నుతున్నారనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీ నేతలు.. ఇతర నియోజకవర్గాల వ్యక్తులను ఇంటింటికీ పంపి ఓటర్ల నుంచి సమగ్ర ఓటర్ సర్వే(సర్) ఎన్యూమరేషన్ ఫారాల జిరాక్సులను సేకరించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలోని బూత్ నంబర్ 70, 71 పరిధిలో శనివారం ఉరవకొండ మండలానికి చెందిన ఓ టీడీపీ వ్యక్తి ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల జిరాక్సులు ఇవ్వాలని కోరాడు.మీరేవరని ఓటర్లు ప్రశ్నిస్తే తొలుత బీఎల్వోనని, గతంలో పనిచేస్తున్న బీఎల్వో సరిగా పనిచేయనందున తనను పంపారని సమాధానమిచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు వైఎస్సార్సీపీ బీఎల్ఏలకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు సేకరిస్తున్న వ్యక్తిని అడ్డుకున్నారు. బీఎల్వో అయితే ఐడీ కార్డు చూపాలని కోరారు. తడబడిన ఆ వ్యక్తి సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలాడు. అనంతరం సమస్య పెద్దదవుతుందని గుర్తించి స్థానిక టీడీపీ నేత డిష్ మురళి తనను పంపించాడని నిజం చెప్పాడు.దీంతో వైఎస్సార్సీపీ నాయకులు, బీఎల్ఏలు డిష్ మురళిని నిలదీయగా ‘మా వాళ్లే వదిలిపెట్టండి’ అని చెప్పడం గమనార్హం. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కనుసన్నల్లోనే ఈ తతంగం సాగుతోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఫొటోలు మార్చి ఆన్లైన్లో దొంగ ఓట్లు సృష్టించేందుకే ఎన్యూమరేషన్ ఫారాల జిరాక్సులు తీసుకెళ్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరపాలని వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. -
ఓటు కోసం కోటి కష్టాలు! సరిగ్గా జరగడం లేదు ‘సర్’!
నేను కాశీబుగ్గ శ్రీనివాసనగర్లో ఉంటున్నా. ఇంత వరకు ఎవరూ ఎన్యూమరేషన్ పత్రం ఇవ్వలేదు. మా వీధికి వచ్చిన వారిని అడిగితే ఇక్కడ కాదని అంటున్నారు. మా సొంతూరు అంబుసోలి వెళ్తే అక్కడ ఏమీ తెలియదంటున్నారు. మా ఇంటిలో 3 ఓట్లు ఉన్నాయి. ఎవరికీ ఫారాలు ఇవ్వలేదు. – కోనేటి కుమారి, శ్రీనివాసనగర్, కాశీబుగ్గ సాక్షి, అమరావతి: ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – సర్) కార్యక్రమానికి ఇక మిగిలింది పదిరోజులే.. ఓటును కాపాడు కోవడం కోసం ఓటర్లు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. చాలా మందికి ఎన్యూమరేషన్ ఫారాలే అందలేదు. తీసుకున్న వారు వాటిని ఎలా పూర్తి చేసి ఇవ్వాలో అర్థం కాక తలపట్టుకు కూర్చుంటున్నారు. సర్ కార్యక్రమంపై ఓటర్లకు సమగ్ర అవగాహన కలిగించకుండా, బీఎల్వోలకు పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వకుండా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎవరి ఓట్లు మిగులుతాయో, ఎవరి ఓట్లు ఎగిరిపోతాయోనన్న ఆందోళనలో అందరూ ఉన్నారు. జూన్ 15న మొదలైన ‘సర్’ కార్యక్రమంలో ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియ ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. రాష్ట్రంలో 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా.. శనివారం నాటికి 2,00,46,384 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ వివరాలు డిజిటలైజ్ చేయడం పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఇరవై రోజుల్లో సగం మాత్రమే పూర్తికావడంతో అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. బీఎల్వోలు సతమతమవుతున్నారు. ఓటర్లలో చాలామందికి ఈ ఫారాలు ఎలా పూర్తిచేయాలో తెలియడం లేదు. మీరే పూర్తిచేయండి అంటూ ఇచ్చేస్తున్నారని బీఎల్వోలు అంటున్నారు. వివరాలు లేకుండా ఇస్తున్న ఫారాలు సచివాలయాలలో గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియ ఎలా సాగుతుందో ‘సాక్షి’ పరిశీలించింది. ఫారాలు ఇవ్వకుండానే... అధికారుల ఒత్తిడి భరించలేక బీఎల్వోలు చాలా చోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకుండానే ఇచ్చేసినట్లు రికార్డుల్లో చూపించినట్లు ‘సాక్షి’ పరిశీలనలో స్పష్టమయ్యింది. గత నాలుగు రోజుల నుంచి ఎన్నికల సంఘం ఎన్యూమరేషన్ ఫారాలు 100 శాతం ఇచ్చేసినట్లు ప్రతి రోజు విడుదల చేస్తున్న నివేదికల్లో వెల్లడిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే ఇప్పటికీ చాలా మందికి ఫారాలు అందలేదని ఓటర్లు చెబుతున్నారు. చాలా మంది ఓటర్లు ఎక్కడున్నది తెలియకపోయినా పై అధికారుల ఒత్తిడితో ఇచ్చేసినట్లు రికార్డుల్లో చూపించినట్లు పలువురు బీఎల్వోలు తెలిపారు. ముందు రికార్డుల్లో ఇచ్చేసినట్లు చూపించండి ఆ తర్వాత డిజిటలైజేషన్ సమయంలో ఏం చేయాలో చెప్తామనడంతో 100 శాతం ఇచ్చేసినట్లు చూపించినట్లు బీఎల్వోలు చెబుతున్నారు. 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ సమస్య.. సర్ ప్రక్రియలో ప్రధాన సమస్య 2002 ఓటర్ల జాబితాల్లో పేరు లేని ఓటర్లే. ఆ ఓటర్ల సమగ్ర సమాచారం సేకరించడం సమస్యగా మారింది. రాష్ట్రంలో ప్రతి పోలింగ్ బూత్లో ఉండే మొత్తం ఓటర్లలో కనీసం 20 శాతం మంది ఈ 24 ఏళ్ల కాలంలో పెళ్లిళ్ల కారణంగా అత్తారి ఊళ్లో ఓటు న మోదు చేసుకున్న వారు, మరో ఊరు వలస వచ్చిన వారి ఓట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి వారు ఓటు వివరాలను వారు 2002 నివాసం ఉన్న ప్రాంత వివరాలతో మ్యాపింగ్ చేసేలా నిబంధనలు పెట్టడంతో లక్షలాది ఓటర్లు తమ ఓటును కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదువుకున్న వాళ్లు సైతం ‘సర్’ నిబంధనలు తెలియక తికమక పడుతున్నారు. ఉద్యోగ రీత్యా వేరొక చోట నివాసం ఉండే వాళ్లు లేదా కొడుకులు, కూతుళ్ల వద్ద ఉంటున్న తల్లిదండ్రులు తాము తాత్కాలికంగా అక్కడ నివాసం ఉంటున్నా, సొంత ఊరిలో ఓటు కాపాడుకోవడానికి బంధువుల ద్వారా తమ వివరాలు నమోదు చేసుకుంటున్నారని బీఎల్వోలు పేర్కొంటున్నారు. అద్దంకి నియోజకవర్గం పాతమాగులూరు గ్రామానికి చెందిన చల్లా శేషమ్మ గుంటూరులో కొడుకు వద్ద నివాసం ఉంటూ, సర్ కార్యక్రమంలో ఊళ్లో ఉన్న తన ఓటు నిలుపుకునేందుకు శుక్రవారం పాతమాగులూరు వచ్చి తమ బీఎల్వోకు ఏమేమి వివరాలు ఇవ్వాలో అడిగి తెలుసుకుని మరీ తమ వివరాలు నమోదు చేసుకోవడం ‘సాక్షి ’ ప్రతినిధి కంట పడింది. ఫారాలు పక్కన పడేస్తున్నారు.. 2002 నాటి ఓటర్ల జాబితాలో పేరు లేకుండా తరువాత ఓటు హక్కు వచ్చిన వారు ఎన్యూమరేషన్ ఫారాల్లో తల్లిదండ్రుల పేర్లు, వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలు సరిగా లేవని, పేర్లలో తేడాలున్నాయని రకరకాల సాకులు చూపిస్తూ డిజిటైజేషన్ చేయడంలేదు. అలా చాలా ఎన్యూమరేషన్ ఫారాలను పక్కన పడేస్తున్నారు. వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం పొట్లూరు గ్రామ పరిధిలోని 1042 ఓటర్లు ఉన్న 117 నెంబరు పోలింగ్ బూత్ పరిధిలో 53 మంది ఫారాల్లో వివరాలు సరిగా లేవంటూ పక్కన పడేశారు. అధికారపార్టీ బీఎల్ఏలను సంప్రదిస్తున్నాం.. అధికార పార్టీ నాయకులు చెప్పిన వాళ్లకే బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తున్నారని, కొంతమందికి ఫారాలు ఇవ్వకుండా సచివాలయాలకు వచ్చి సంప్రదించాలని చెబుతున్నారని చాలాచోట్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కొందరు ఓటర్ల ఇళ్ల వివరాలు తెలియక తాము అధికారపార్టీ నియమించిన బీఎల్ఏలకు రోజూ ఫోన్లు చేస్తున్నమాట నిజమేనని చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలో ఓ బీఎల్వో పేర్కొన్నారు. ‘‘ఓటర్లకు పంచిన ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకుందామని ఇళ్లకు వెళ్లితే చాలా ఇళ్లలో కుటుంబ సభ్యులు పనులకు పోయారని చెబుతున్నారు. ఉదయానే వెళ్లినా పనులకు పోతున్నాం, సాయంత్రం రమ్మంటున్నారు.’’ అని బీఎల్వోలు చెబుతున్నారు. ‘ఫారాలు మేమే పూర్తి చేయాల్సి రావడంతో సర్ కార్యక్రమం వేగంగా ముందుకు సాగడం లేదు’ అని చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ పరిధిలోని బీఎల్వో వివరించారు. మొరాయిస్తున్న యాప్.. ఇవన్నీ ఓక ఎత్తయితే ఆన్లైన్ సాంకేతిక సమస్యలు ఉండనే ఉన్నాయి. సర్ కార్యక్రమంలో ఓటరు ఇచ్చే ఎన్యూమరేషన్ ఫారాల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే బీఎల్వోల మొబైల్ ఫోన్లో యాప్ రోజూ సాయంత్రం అయితే మొరాయిస్తోంది. కనీసం లాగిన్ అవడానికి వీలులేకుండా యాప్ ఓపెన్ కావడం లేదని బీఎల్వోలు అంటున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల మధ్య తరచూ ఈ సమస్య తలెత్తుతోందని, సమస్య తలెత్తినప్పుడు కనీసం 20 నిమిషాలు యాప్ పూర్తిగా పనిచేయకుండా ఆగిపోతుందని బీఎల్వోలు అంటున్నారు. ‘ఆధార్’ వివరాలు ఎందుకు అడుగుతున్నట్లు? ఎన్నికల సంఘం ‘సర్’ కార్యక్రమ నిబంధనల్లో ప్రతి ఓటరు తల్లిదండ్రుల వివరాలను మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నెంబరు, పుట్టిన తేదీ తదితర వివరాలు తప్పనిసరికాదు. కానీ బీఎల్వోలు ప్రతి ఓటరు నుంచి ఆధార్ వివరాలు కూడా సేకరిస్తున్నారు. తమ ఎన్యూమరేషన్ ఫారాలలో ఆధార్ వివరాలు లేకుండా ఇస్తే తిరిగి ఆధార్ వివరాలు తీసుకురండి అంటూ బీఎల్వోలు ఒత్తిడి తెస్తున్నారని పలువురు ఓటర్లు చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే అధికారులు ఆధార్ వివరాలు తప్పనిసరి అంటూ ఓటర్లను భయపెట్టి ఆ వివరాలు సేకరిస్తున్నారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. సొంతంగా ఆన్లైన్లో ఎన్యూమరేషన్ వివరాలు నమోదు చేసుకోవడానికే ఆధార్ అవసరమవుతుంది. కానీ అలా ఆన్లైన్లో ఎన్యూమరేషన్ కావడం లేదని పలువురు చెబుతున్నారు. ఇంటి పేరు అసలు పేరు ముందు వెనకా తారుమారు కావడంతో ఆన్లైన్ కావడంలేదు. అలాగే ఆధార్తో ఫోన్ అనుసంధానం కాక, ఓటీపీ రాక ఆన్లైన్లో వివరాలు నమోదు కావడం లేదని అంటున్నారు.గడువు పొడిగింపు కోసం.. దాదాపు సగం మంది ఓటర్ల వివరాలు నమోదు ఇంకా జరగాల్సి ఉండడంతో కార్యక్రమం గడువు పొడిగించాలని బీఎల్వోలు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని పోలింగ్ బూత్లలో 60 శాతం ప్రక్రియ పూర్తయినపటికీ... 25 శాతం కూడ పూర్తికాని బూత్లు ఒక్కో మండలంలో పదుల సంఖ్యలోనే ఉన్నట్టు తెలుస్తోంది. అద్దంకి నియోజకవర్గంలో శుక్రవారం నాటికి ఇంకా 25 శాతం ప్రక్రియ కూడ పూర్తి కాని పోలింగ్ బూత్లు 24 దాక ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కార్యక్రమాన్ని పొడిగించాల్సిందిగా జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన టెలికాన్ఫరెన్స్లో పలువురు అధికారులు కోరడం గమనార్హం. హడావుడిగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తే లక్షలాది మంది ఓటును కోల్పోవాల్సి వస్తుందని వారు పేర్కొంటున్నారు. మమ అనిపించాలనే తొందర...‘సర్’ ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారులు చేస్తున్న హడావిడి చూస్తుంటే తూతూమంత్రంలా మమ అనిపించేయాలన్నట్లే కనిపిస్తోందని పలువురు ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. పై అధికారులు క్షేత్రస్థాయి సమస్యలతో సంబంధం లేకుండా ఏసీ గదుల్లో కూర్చొని కేవలం అక్కడ ఇంత శాతం అయ్యింది, వాళ్లు మొదటిస్థానంలో ఉన్నారు మీరు ఎందుకు వెనకున్నారని అడుగుతున్నారే కానీ వాస్తవ పరిస్థితులను పట్టించుకోవడం లేదని బీఎల్వోలు పేర్కొంటున్నారు. డిజిటలైజేషన్లో మేమంటే మేము ముందుండాలని జిల్లాలు పోటీ పడుతూ ఆయా కలెక్టర్లు కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి పట్టించుకోవడం లేదని వారంటున్నారు.పనులకు వెళ్లేటప్పుడు వస్తే ఎలా..? సవర కుడ్డబ గ్రామంలో సుమారు 56 పైచిలుకు ఓట్లు ఉన్నాయి. బీఎల్వో కనీసం సమాచారం ఇవ్వకుండా.. అందరూ పనులకు వెళ్లే సమయంలో గ్రామానికి వస్తే ఎలా. మేమే బాధ్యత తీసుకుని చదువుకున్న వారితో ఎన్యూమరేషన్ ఫారాలు నింపించాం. అయినా ఇప్పటికీ కొన్ని కుటుంబాలకు ఫారాలు ఇవ్వలేదు. – సవర వెంకటేశ్, సవర కుడ్డబ గ్రామం, శ్రీకాకుళం జిల్లావివరాలు నింపడానికి డబ్బులా? వివరాలు ఫారంలో నింపకపోతే ఓటు పోతుందని అధికారులు భయపెట్టారు. సచివాలయంలో వాళ్లు పెట్టిన ఓ వ్యక్తి తనవద్ద డబ్బులు వసూలు చేశాడు. నాకు చదువు రాదు. ఐదు దశాబ్దాలుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నా ఇపుడు నా ఓటును కాపాడుకోవడానికి డబ్బులివ్వాల్సి రావడం బాధనిపించింది. – వెంకటేశ్వరరావు, ఎనికేపాడు, కృష్ణా జిల్లా ఊళ్లో వివరాలు తెలియడం లేదు.. నాకు పెళ్లి అయినప్పటి నుంచి మా ఊళ్లోనే ఓటు ఉంది. ఓటరు ఐడీ కార్డు జీజీవీ 2596393. కానీ, మా అమ్మవాళ్ల వివరాలు కావాలంట. అమ్మానాన్న ఫొటోలు, ఆ జిల్లా, నియోజకవర్గం, మండలం, ఓటు వేసిన వార్డు నెంబరు ఇవ్వమంటున్నారు. మా అమ్మవాళ్లకి ఫోను చేసి అడిగితే వాళ్లు తెలియదంటున్నారు. ఎవరూ ఏమీ చెప్పడం లేదు. ఏమి చేయాలి మేం? – షేక్ సైదాబీ, పాతమాగులూరు, ప్రకాశం జిల్లా -
ఇలా చేద్దాం 'సర్'
ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)– 2026లో భాగంగా గత నెల 25న రాష్ట్రంలో ఓటర్ల గణన ప్రక్రియప్రారంభమైంది. ఇప్పటికే ‘సర్’ పూర్తయిన రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించడంతో రాష్ట్రంలో సైతం ఆందోళన నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీలు సైతం క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా మారి నేరుగా ఓటర్ల వద్దకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నాయి. కుల, మత, ప్రాంత, లింగ విభేదాలతో ప్రమేయం లేకుండా వయోజనులైన పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిరక్షించుకోవడానికి ఓటరూ చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ‘సర్’పై ఓటర్లకు అవగాహన కల్పించడానికి ‘సాక్షి’ ఇస్తున్న ప్రత్యేక కథనం ఇదీ...1 ఎన్యూమరేషన్ దశఫారం ఇస్తేనే ఓటుఓటు హక్కు పరిరక్షణకు ఓటరు వేయాల్సిన తొలి అడుగు .. ఎన్యూమరేషన్ ఫారాన్ని ఎలాంటి లోపాలు లేకుండా నింపి సంతకం/వేలి ముద్ర వేసి బూత్ స్థాయి అధికారికి(బీఎల్ఓ) నిర్దేశిత గడువు జూలై 24లోగా తిరిగి ఇవ్వాలి. అప్పుడే వారి పేరు ముసాయిదా ఓటర్ల జాబితాలో ప్రచురిస్తారు. ఎన్యూమరేషన్ ఫారం ఎలా పూరించాలి?» బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరుకు రెండు ప్రతుల ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతోపాటు ఎలా నింపాలో అవగాహన కల్పిస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారాన్ని మూడు విభాగాలుగా విభజించి రూపొందించగా, ఎగువ విభాగంలో సంబంధిత ఓటరు పేరు, ఎపిక్ సంఖ్య, చిరునామా, ఫొటో తదితర పాక్షిక వివరాలు ముద్రించి ఉంటాయి. పాత ఫొటో ముద్రించి ఉంటే కొత్త ఫొటోను అతికించడానికి ఒక బాక్స్ ఇదే విభాగంలో ఉంటుంది. » చివరిసారిగా రాష్ట్రంలో 2002లో ‘సర్’ నిర్వహించి తయారు చేసిన ఓటర్ల జాబితాలో ఓటరు పేరు, బంధువు పేరు ఉంటే.. ఆ వివరాలను ఫారం మధ్యలోని రెండో విభాగంలో నింపాల్సి ఉంటుంది. తప్పొప్పులతో సంబంధం లేకుండా 2002 జాబితాలో వివరాలు ఎలా ఉంటే సరిగ్గా అలానే పూరించాలి. ఎడమవైపు కాలమ్లో ఓటరు, కుడి వైపు కాలమ్లో బంధువుకి సంబంధించి 2002 జాబితాలోని వివరాలు రాయాలి. 2002 జాబితాలో ఇద్దరిలో ఒకరి పేరే ఉంటే సంబంధిత కాలమ్లో ఆ వివరాలను నమోదు చేయాలి. ఇద్దరిలో ఒకరి పేరు లేకుంటే సంబంధిత కాలమ్ ఖాళీగా వదిలేయాలి. ఇద్దరి పేర్లూ లేకుంటే రెండు కాలమ్స్నూ ఖాళీగా వదిలేయాలి. » ఇక కింద ఉండే మూడో విభాగంలో ఓటరు పుట్టిన తేదీ,ఆధార్ (ఐచ్ఛికం), మొబైల్ నంబర్, తండ్రి/సంరక్షకుడి పేరు– వారి ఎపిక్ నంబర్, తల్లి పేరు–ఆమె ఎపిక్ నంబర్, జీవిత భాగస్వామి పేరు–ఎపిక్ నంబర్ రాయాల్సి ఉంటుంది. ఒక ప్రతిని బీఎల్ఓ తీసుకుని మరో ప్రతిని రశీదుగా తన సంతకంతో తిరిగి ఓటరుకే ఇస్తారు. రశీదును భద్రంగా దాచుకోవాలి. భవిష్యత్తులో అవసరం పడొచ్చు. ఉమ్మడి జిల్లా, తెలంగాణ రాష్ట్రం పేర్లే రాయాలి2002 సర్ ఓటర్ల జాబితాలో మీ పేరు, మీ బంధువుల పేర్లను రాసే కాలమ్స్లో జిల్లా రాయాల్సిన చోట ఉమ్మడి జిల్లా, రాష్ట్రం రాయాల్సిన చోట తెలంగాణ రాయాలి. అసెంబ్లీ నియోజకవర్గం రాయాల్సిన చోట 2002 నాటి అసెంబ్లీ నియోజకవర్గం పేరు రాయాలి. 2002 తర్వాత రాష్ట్రం, జిల్లాలు, నియోజకవర్గాల పునర్విభజన జరిగిన నేపథ్యంలో చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తుండడంతో ఎన్నికల యంత్రాంగం ఈ మేరకు స్పష్టతనిచ్చింది.2002 జాబితాలో పేరెలా వెతకాలి?2002 నుంచి ఒకే చిరునామాలోఉంటున్న ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారం నింపడంలో ఇబ్బందులు ఉండవు. 2002 ఓటర్ల జాబితాలో వారి పేరు, బంధువుల పేర్ల వివరాలు స్థానిక బీఎల్ఓల వద్ద ఉంటాయి. ప్రస్తుతం కొత్త చిరునామాలో నివాసముంటున్న ఓటర్లు మాత్రం 2002లో ఎక్కడ నివాసం ఉన్నారో ఆ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో తమ పేరు, బంధువు పేర్లను అన్వేషించక తప్పదు. 2002 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో వాటి సరిహద్దులతోపాటు పేర్లూ మారాయి. నాటి నియోజకవర్గం పేరు, పోలింగ్ బూత్ వివరాలతో 2002 జాబితాలో పేర్లను వెతకవచ్చు. ఈసీ వెబ్సైట్ (https://www.eci.gov.in) తోపాటు సీఈఓ తెలంగాణ వెబ్సైట్ (https://ceotelangana.nic.in/SIR&2002. html) లో ‘2002 ఓటర్ల జాబితా’ను అందుబాటులో ఉంచారు. ఇక్కడ రెండు రకాల సెర్చ్ సౌలభ్యం కల్పించారు. నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల జాబితాలో సెర్చ్ చేసుకోవచ్చు. ఓటరు పేరు, ఇతర వివరాలతో సైతం పేర్లను వెతికే మరో సదుపాయం కల్పించారు.ఓటరు అందుబాటులో లేకుంటే?నిబంధనల ప్రకారం ఓటరే తన ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపాలి. విద్య, ఉద్యోగాల కోసం సుదూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు మాత్రం మినహాయింపు కల్పించారు. వారి కుటుంబ పెద్ద భర్తీ చేసి తన సంతకంతో బీఎల్ఓకు తిరిగి ఇవ్వవచ్చు. బీఎల్ఓ ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వకుంటే..ఎన్యూమరేషన్ ఫారాన్నికేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ (https:// voters.eci. gov.in) ద్వారా సమర్పించవచ్చు. అయితే, ఆధార్ అథెంటికేషన్ సదుపాయం కలిగిన ఓటర్లు మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోగలరు. ఇక బీఎల్ఓ ఎన్యూమరేషన్ ఫారాన్ని పంపిణీ చేయకుంటే సీఈఓ వెబ్సైట్ (https:// ceotelangana.nic. in) నుంచి తమ ప్రాంత బీఎల్ఓ ఫోన్ నంబర్ను తీసుకుని నేరుగా ఫోన్ చేయొచ్చు. ఈసీ వెబ్సైట్లో ‘బుక్ ఎ కాల్ విత్ బీఎల్ఓ’ సదుపాయాన్ని సైతం వినియోగించుకోవచ్చు. విదేశాల్లోని భారత పౌరులు ఆన్లైన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించవచ్చు.2 ఎన్యూమరేషన్ తర్వాతి దశముసాయిదాలో పేరు ఉందా?పోలింగ్ కేంద్రాల వారీగా సర్ ముసాయిదా ఓటర్ల జాబితాను జూలై 31న ప్రచురిస్తారు. ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించడంలో విఫలమైన ఓటర్లను గైర్హాజరు/నివాసం మారడం/చనిపోయిన/డూప్లికేట్ ఓటర్లుగా పరిగణించి వారి పేర్లను ఈ జాబితా నుంచి తొలగిస్తారు. ఇలా తొలగించిన ఓటర్ల జాబితాను సైతం పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచురించి స్థానిక గ్రామ పంచాయతీ/వార్డు కార్యాలయంతోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వెబ్సైట్లో ప్రదర్శిస్తారు.గరిష్టంగా ఎన్నిఅభ్యంతరాలు?ముసాయిదాజాబితాలోని అనర్హుల పేర్ల తొలగింపునకు రాజకీయ పార్టీల బూత్ స్థాయిఏజెంట్ల (బీఎల్ఏ)తో పాటు ఇతరులెవరైనా రోజుకు 10కి మించకుండా గరిష్టంగా 30 వరకు అభ్యంతరాలను ఆగస్టు 30లోగా ఫారం–7 ద్వారా తెలపవచ్చు.ముసాయిదాలో పేరు లేకుంటే ?ముసాయిదా జాబితాపై అభ్యంతరాల (ఫారం–7)తో పాటు కొత్తగా ఓటర్లుగా నమోదు (ఫారం–6), వివరాల దిద్దుబాటు/చిరునామా మార్పు(ఫారం–8) కోసం జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ముసాయిదా జాబితాలో పేరు రాకపోయినా లేదా అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన/నిండనున్న యువత ఓటర్లుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్యకాలంలో ఈ దరఖాస్తులను పరిష్కరిస్తారు. ఈ ప్రక్రియలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ముసాయిదా జాబితాకు మార్పులు చేర్పులు చేసి తుది జాబితా ప్రచురిస్తారు. ముసాయిదా జాబితాలో పేరు రాకపోయినా లేదా అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన/నిండనున్న యువత ఓటర్లుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి.2002లో ఓటరు పేరు లేకుంటే? ఓటరు పేరు సర్2002 ఓటర్ల జాబితాలో లేకపోతే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. 2002 జాబితాలో వారి తల్లిదండ్రులు/ నాయనమ్మ, తాతయ్యల పేర్లను సేకరించి ఎన్యూమరేషన్ ఫారంలోనిసంబంధిత కాలమ్లో పూరిస్తే సరిపోతుంది.స్వీయ ధ్రువీకరణ ఎవరు ఇవ్వాలి?కొత్తగా ఓటరుగా నమోదుకావడానికి ఫారం–6, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఓటును బదిలీ చేసుకోవడానికి ఫారం–8 దరఖాస్తును స్వీయ ధ్రువీకరణ ఫారంతోపాటు బీఎల్ఓకు సమర్పించాల్సి ఉంటుంది. దీనిపై సంబంధిత ఓటరే సంతకం చేయాలి. ఒకే రాష్ట్రం పరిధిలో ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి లేదా ఒకే నియోజకవర్గంలో మరో చిరునామాకి ఓటును బదిలీ చేసుకోవడానికి స్వీయ ధ్రువీకరణ అవసరం లేదు.3 నోటీసులు/విచారణ దశనోటీసులు ఎవరికి ఇస్తారు?రెండు కేటగిరీల ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా లో పేరు వచ్చినప్పటికీ, 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్లో తేడాలను గుర్తించిన ఓటర్లతోపాటు 2002 ఓటర్ల జాబితాలో తమతోపాటు తమ బంధువుల పేర్లు లేని ఓటర్లకు మాత్రమే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వోలు) నోటీసులు ఇస్తారు. నిర్దేశిత తేదీకి విచారణకు హాజరై వీరు ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తమ/తమ తల్లిదండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణగా ఇవ్వాల్సి ఉంటుంది.పుట్టిన తేదీ/ప్రాంతం రుజువు చేసుకోవాల్సిందే..నోటీసు అందుకున్న ఓటర్లు తమ/తల్లిదండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేయడానికి ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదానిని రుజువుగా ఈఆర్వోలు/ఏఈఆర్వోల వద్ద విచారణకు హాజరై సమర్పించాల్సి ఉంటుంది. 1987 జూలై 1కి ముందు పుట్టిన ఓటర్లు తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణపత్రం సమర్పిస్తే సరిపోతుంది.1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన ఓటర్లు తమతోపాటు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సిఉంటుంది. 2002 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన ఓటర్లు తమతోపాటు తమ తల్లిదండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆధారం కోసం ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 పత్రాలు 1. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి లేదా పెన్షనర్కు జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ 2. ప్రభుత్వం/స్థానిక సంస్థలు/బ్యాంకులు/ పోస్టాఫీస్/ఎల్ఐసీ/ ప్రభుత్వ రంగ సంస్థలు 01.07.1987కు ముందు జారీ చేసిన గుర్తింపు పత్రాలు 3. జనన ధ్రువీకరణ పత్రం 4. పాస్పోర్ట్ 5. గుర్తింపు పొందిన బోర్డులు/వర్సిటీలు జారీ చేసిన పదో తరగతి/విద్యా ధ్రువీకరణ పత్రాలు 6. ప్రభుత్వం జారీ చేసిన శాశ్వత నివాస సర్టిఫికెట్ 7. అటవీ హక్కుల సర్టిఫికెట్ 8. ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ లేదా ఇతర కుల ధ్రువీకరణ 9. జాతీయ పౌరుల రిజిస్టర్ (తెలంగాణకు వర్తించదు) 10. రాష్ట్ర/స్థానిక సంస్థలు తయారు చేసిన కుటుంబ రిజిస్టర్ 11. ప్రభుత్వం ఇచ్చిన స్థలం/ఇంటి కేటాయింపు పత్రం 12. ఆధార్ కార్డు (గుర్తింపు ధ్రువీకరణ మాత్రమే. పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంత ధ్రువీకరణకుస్వీకరించరు)12 రకాల పత్రాలూ లేకుంటే?భారత పౌరులనే ఓటర్లుగా నమోదు చేయడానికి పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతంతోపాటు గుర్తింపు ధ్రువీకరణకు రుజువులు ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తింపు ధ్రువీకరణకు ఆధార్ను స్వీకరిస్తారు. పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ కోసం మిగిలిన 11 రకాల పత్రాలనే రుజువుగా స్వీకరించనున్నారు. ఒకవేళ ఈ 11 రకాల పత్రాలూ లేని ఓటర్లు.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇతర ధ్రువీకరణ పత్రాలనూ రుజువులుగా సమర్పించవచ్చు. అయితే ఈ పత్రాలను స్వీకరించాలా? తిరస్కరించాలా? అనే విషయంలో పూర్తి విచక్షణాధికారాన్ని ఈఆర్వోలకు ఈసీ కల్పించింది. వారిదే తుది నిర్ణయం. కలెక్టర్,సీఈఓకు అప్పీల్విచారణలో ఈఆర్వోలు/ఏఈఆర్వోలు తీసుకున్న నిర్ణయంపై ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 24(ఏ) కింద 15 రోజుల్లోగా జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చు. తొలి అప్పీల్లో కలెక్టర్ తీసుకున్న నిర్ణయంపై సెక్షన్ 24(బీ)తోపాటు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960లోని 27వ నిబంధన కింద 30 రోజుల్లోగా సీఈఓకు రెండో అప్పీల్కు అవకాశం కల్పిస్తారు.‘సర్’ షెడ్యూల్ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీజూన్ 25 నుంచి జూలై 24 వరకుముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ జూలై 31ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, దరఖాస్తులు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకునోటీసుల జారీ/ విచారణ, ఎన్యూమరేషన్ ఫారాలు/ అభ్యంతరాలు/ దరఖాస్తుల పరిష్కారం జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకుతుది జాబితా ప్రచురణ అక్టోబర్ 1-సాక్షి, హైదరాబాద్ -
‘సర్’ లోపాలమయం
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)లో పారదర్శకత లేదని, జవాబుదారీతనం కరువైందని, విధానపరమైన పలు లోపాలున్నాయని ప్రముఖ ఆర్థిక, సామాజిక విశ్లేషకులు, రచయిత డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు. దీనిని పౌర సమాజం, బుద్ధి జీవులు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు 105వ జయంతిని పురస్కరించుకుని గురువారం అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని ఓ ఆడిటోరియంలో ఆయన స్మారకోపన్యాసాన్ని నిర్వహించారు. ‘ఎస్ఐఆర్ 2025–26: భారతదేశ భావనను ఛిన్నాభిన్నం చేయడమా?’అనే అంశంపై పరకాల ప్రసంగించారు. పీవీతో తనకున్న సన్నిహిత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆధునిక భారతదేశపు గొప్ప నాయకులలో పీవీ ఒకరని దగ్గర నుంచి గమనించే అవకాశం లభించడం ఒక ‘అర్హత లేని భాగ్యం’అని అభివర్ణించారు. విస్తృత చర్చ జరగాలి వందేమాతరంపై కేంద్ర ప్రభుత్వ సర్క్యులర్, జనాభా మార్పులపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు వంటి ఇటీవలి కేంద్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై విస్తృతంగా చర్చ జరగాలని పరకాల అన్నారు. 2002లో చేపట్టిన విస్తృత సవరణతో పోలిస్తే ప్రక్రియ పూర్తి భిన్నంగా ఉందని పేర్కొన్నారు. కచ్చితమైన ఓటర్ల జాబితాలను నిర్వహించాల్సిన ఆవశ్యకతను ప్రస్తావిస్తూనే.. ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని అన్నారు. సమాధానం చెప్పేవారే లేరు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ముగించగా ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలు అనేకం మిగిలి పోయాయని, ఆలోపే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ముగిసిపోయాయని పరకాల చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓటర్లను జాబితాల నుంచి తీసేశారని వీటిపై ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పేవారే లేరన్నారు. అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించినట్లు సూచించే గణాంకాలను వెల్లడిస్తూ, ఈ ధోరణులను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అంబేడ్కర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, బలోపేతం చేయడానికి పారదర్శకమైన, కచ్చితమైన ఓటర్ల జాబితానే పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ డైరెక్టర్ (అకడమిక్) ప్రొఫెసర్ జి.పుష్ప చక్రపాణి, రిజి్రస్టార్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'సర్' ప్రక్రియలో లోపాలపై ఎన్నికల CEOకి వైఎస్సార్సీపీ లేఖ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల CEOకి లేఖ రాశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 (Special Intensive Revision) ప్రక్రియలో అనేక లోపాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా విశ్వసనీయత దెబ్బతినకుండా మరో నెల గడువు ఇవ్వాలని అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్యుమనరేషన్ ఫారాలు ఇవ్వకుండానే పంపిణీ చేసినట్లు తప్పుడు నమోదు జరుగుతోందని ఆయన ఆరోపించారు. బీఎల్వోల పంపిణీపై ర్యాండమ్ వెరిఫికేషన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 30 శాతం ఫారాలకే డిజిటలైజేషన్ పూర్తయింది. అనేక నియోజకవర్గాల్లో అది 20 శాతం కూడా దాటలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటలైజేషన్ పూర్తయ్యే వరకు సర్ తదుపరి దశలు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన, అటవీ, నెట్వర్క్ లేని ప్రాంతాల్లో ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాలని సూచిస్తూ, ఓటర్ల హక్కులను కాపాడేందుకు ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని CEOను కోరారు. ఈ లేఖలో అప్పిరెడ్డి ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. -
ఎన్యూమరేషన్ ఫారం 'లక్ష్యానికి దూరం'
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల్లో నత్తనడకన సాగుతోంది. రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా బుధవారం రాత్రి నాటికి 2.38 కోట్ల మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగింది. ఇందులో అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 32 శాతం, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో 37 శాతం, హైదరాబాద్ జిల్లాలో 42 శాతం మంది ఓటర్లకే ఎన్యూమరేషన్ ఫారాలు అందాయి. సర్–2026 షెడ్యూల్ ప్రకారం గత నెల 24న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని ప్రారంభించగా వారం రోజుల్లోగా పూర్తి చేయాలని పెట్టుకున్న లక్ష్యం నెరవేరలేదు. మరో 2, 3 రోజుల్లో గ్రామీణ జిల్లాల్లో ఫారాల పంపిణీ పూర్తికావచ్చని అధికారులు అంచనా వేస్తుండగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల విషయంలో మాత్రం ఏమీ చెప్పలేకపోతున్నారు. ఈ మూడు జిల్లాల్లో గరిష్టంగా 70 శాతానికి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగే అవకాశం లేదని అంచనా వేశారు. రాష్ట్రంలోని 33.75 శాతం ఓటర్లు ఈ మూడు జిల్లాల్లోనే ఉండగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో తీవ్రంగా వెనుకబడటం ఆందోళన కలిగిస్తోంది. ఓటర్ల మ్యాపింగ్లో సైతం ఈ మూడు జిల్లాలు అట్టడుగు స్థానంలో ఉన్నాయి. ఫారాలను నింపి ఈ నెల 24లోగా స్థానిక బీఎల్ఓలకు అందించే ఓటర్ల పేర్లనే ఈ నెల 31న ముసాయిదా ఓటర్ల జాబితాలో ప్రచురించనున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ మూడు జిల్లాల్లోనే లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతు కావొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిలకడ లేని ఓటర్లు... వలసల్లో భాగంగా తరచూ అద్దె ఇళ్లు మారడం, ఉద్యోగాల మార్పు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల వలసలు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు కలిగి ఉండటం, ఇళ్లకు తాళాలు వేసి ఉండటం వంటి కారణాలతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల్లో ఓటర్ల ఆచూకీని బీఎల్ఓలు కనిపెట్టలేకపోతున్నారని అధికారులు తెలిపారు. ఒకవేళ బీఎల్ఓలు మూడుసార్లు ఇంటికి వెళ్లినా తాళం వేసి ఉంటే ఆ ఇంట్లోని ఓటర్ల ఫారాలను తలుపు వద్దే పెట్టి రావాలని బీఎల్ఓలకు జీహెచ్ఎంసీ సూచించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. రెండు రోజుల్లో డిజిటలైజేషన్ మరో రెండు రోజుల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను ముగించి ఆ వెంటనే డిజిటలైజేషన్ ప్రక్రియను ఈసీ ప్రారంభించనుంది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) మళ్లీ ఓటర్ల ఇళ్లకు వెళ్లి వారు నింపిన ఫారాలను వెనక్కి తీసుకుని తమ మొబైల్ ఫోన్లోని ఈసీ యాప్ ద్వారా స్కాన్ చేసి అప్లోడ్ చేయనున్నారు. స్కాన్ చేసిన ఫారాల్లోని సమాచారాన్ని ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఫారాలను ఎలా నింపాలో ఓటర్లకు బీఎల్ఓలు అవగాహన కల్పిస్తారని అధికారులు పదేపదే పేర్కొంటుండగా బీఎల్ఓలలో అధిక శాతం మందికి ఫారాలను ఎలా నింపాలో తెలియడం లేదు. దీంతో వారికి మరోసారి శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు సీఈఓ కార్యాలయం ఆదేశించింది. భాగ్యనగరంలో ఇళ్లకు రాని బీఎల్ఓలు.. హైదరాబాద్లో ఇంకా చాలా మందికి ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. బీఎల్ఓలే ఇళ్లకు వచ్చి ఫారాలు ఇస్తారని ఓటర్లు ఎదురుచూస్తున్నారు. అయితే కొందరు బీఎల్ఓలు మాత్రం తమ వద్దకు వచి్చన ఓటర్లకే ఫారాలు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే మరికొందరు బీఎల్ఓలు రాజకీయ పార్టీల కార్యాలయాలు, నేతల ఇళ్ల వద్ద మకాం వేసి ఫారాలు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేయడం గమనార్హం. -
పతనం ఖాయమనే ‘సర్’లో కుట్రలు
స్వార్థ రాజకీయం కోసం పేదల ఓట్లు తొలగిస్తే భవిష్యత్లో వారికి పథకాలు ఎలా వస్తాయి? పథకాలు నిలిచిపోతే పేదలు ఎలా బతుకుతారు? ఓటును తొలగిస్తే వాళ్లు ఏ రాష్ట్రం, ఏ దేశం పౌరులు అవుతారు? ఇలా చేయడం ధర్మమేనా? నీకు ఓటు వేస్తారా.. వేయరా.. అనేది ముఖ్యం కాదు. చేతనైతే మంచి చేసి, ప్రజల మనసు గెలుచుకుని ఓట్లు సంపాదించు. అలాకాకుండా ఓటు వేయరనే అనుమానం ఉన్న వారి ఓట్లను తొలగించడం న్యాయం కాదు. - వైఎస్ జగన్సాక్షి, అమరావతి: చంద్రబాబు తన పతనం ఖాయమని నిశ్చయించుకుని ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ను అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాటా్లడారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఎన్యూమరేషన్ ఫామ్స్ జారీ చేయకుండానే ఇచ్చేసినట్టు రాసేసుకోవాలని చంద్రబాబు ఆర్డీవోలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారని మండిపడ్డారు. ఎన్యూమరేషన్ ఫామ్స్ సమర్పించలేదనే సాకుతో వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించే కుట్రకు తెరలేపుతున్నారన్నారు. అసలీ మనిషికి మానవత్వం ఉందా.. అని ప్రశ్నించారు. ‘స్వార్థ రాజకీయం కోసం పేదల ఓట్లు తొలగిస్తే భవిష్యత్లో పథకాలు ఎలా వస్తాయి? పథకాలు నిలిచిపోతే పేదలు ఎలా బతుకుతారు? ఓటును తొలగిస్తే వాళ్లు ఏ రాష్ట్రం, ఏ దేశం పౌరులు అవుతారు? ఇలా చేయడం ధర్మమేనా? నీకు ఓటు వేస్తారా? వేయరా? అనేది ముఖ్యం కాదు. చేతనైతే మంచి చేసి, ప్రజల మనసు గెలుచుకుని ఓట్లు సంపాదించు. అలాకాకుండా ఓటు వేయరనే అనుమానం ఉన్న వారి ఓట్లను తొలగించడం న్యాయమా? ఓట్లు తొలగించాలని మంత్రులు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. ఇందు కోసం మై టీడీపీ యాప్ను ఎలా ఉపయోగించాలనే దానిపై ఈఆర్వో హోదాలో ఉన్న నెల్లూరు మున్సిపల్ కమిషనర్.. మంత్రి నారాయణతో చర్చించిన ఆడియో బయటకు వచ్చింది. ఇలా నేరుగా మంత్రులు అధికారులతో మాట్లాడుతూ టీడీపీ యాప్ ద్వారా ఓట్లు తొలగిస్తున్నారు. అధికారులు దగ్గరుండి దుర్మార్గాలు చేస్తుంటే వ్యవస్థలు ఎలా బాగుపడతాయి?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏపీ ‘సర్’పై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటు హక్కును రాజకీయ ప్రయోజనాల కోసం లక్ష్యంగా చేసుకోవడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. పేదల ఓట్లను తొలగించడం ద్వారా వారి హక్కులను హరించే ప్రయత్నం జరుగుతోందని అన్నారాయన .ఎన్యుమరేషన్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని బుధవారం మీడియా సమావేశంలో జగన్ వ్యాఖ్యానించారు. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా రికార్డుల్లో నమోదు చేస్తున్నారని అన్నారు. దీంతో వేలాది మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. "చంద్రబాబుకు మానవత్వం ఉందా? స్వార్థ రాజకీయాల కోసం పేదవాడి ఓటునే తొలగిస్తారా?" అని ప్రశ్నించారు.పేదల ఓటు తొలగిస్తే వారు సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఎలా కొనసాగుతారని జగన్ ప్రశ్నించారు. ప్రజలను ఓటు హక్కు లేనివారిగా మార్చే ప్రయత్నం జరుగుతోందని, ఇది పౌరసత్వాన్ని నిర్వీర్యం చేసే చర్యలతో సమానమని విమర్శించారు.ఇక.. టీడీపీ ప్రత్యేక యాప్ను ఉపయోగించి ఓటర్ల జాబితాలో జోక్యం చేసుకుంటున్నారని జగన్ ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్న వారి ఓట్లను నమోదు చేయించి, వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉన్న వారి పేర్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తాయని, ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ, ఓ మున్సిపల్ కమిషనర్ మధ్య జరిగినట్లు పేర్కొన్న ఫోన్ సంభాషణ ఆడియోను జగన్ మీడియా సమావేశంలో వినిపించారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో అధికార యంత్రాంగంపై రాజకీయ ఒత్తిళ్లు ఎలా పనిచేస్తున్నాయో ఈ సంభాషణ వెల్లడిస్తోందని ఆయన చెబుతున్నారు. -
‘సర్’పై సీజేఐకి 23 పార్టీల బహిరంగ లేఖ
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై దేశంలోని 23 రాజకీయ పార్టీలు, ఒక స్వతంత్ర ఎంపీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు బహిరంగ లేఖ రాశాయి. సర్ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ పాత్ర, తదితర అంశాలపై ప్రశ్నలు లేవనెత్తాయి. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో సర్ ప్రక్రియ ప్రభావం ఎలా ఉందో వివరిస్తూనే అందులో ఎన్నికల కమిషన్ పాత్రను కూడా వివరించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇండియా కూటమిలోని పార్టీలతోపాటు ఆప్, డీఎంకే కూడా ఈ లేఖపై సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఎక్స్ వేదికగా తెలిపారు. ‘సర్’పై విపక్షాలన్నీ ఒకే మాటపై ఉన్నాయని, ఉమ్మడిగా నిరసన తెలుపుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటిస్తున్నాయని పేర్కొన్నారు. జూన్ 8న ఇండియా కూటమి పార్టీలతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ లేఖ రాసినట్లు తెలిపారు. ఈ లేఖపై కాంగ్రెస్ తరఫున అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, వామపక్ష పార్టీ నేతలు, స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ సంతకాలు చేసినట్లు తెలిపారు. తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ మీడియాతో మాట్లాడుతూ... ‘ఇండియా కూటమి పార్టీల ఉమ్మడి కృషి ఫలితం ఇది’ అని లేఖపై వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలోని అన్ని ఇతర వ్యవస్థలు విఫలమైన నేపథ్యంలో న్యాయ వ్యవస్థే శరణ్యమన్న ఆలోచన నుంచే ఈ లేఖ పుట్టుకొచ్చిందని కీలక ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు. ఇది న్యాయవ్యవస్థ ఆత్మను స్పృశించే అంశమని, దేశంలో ఏం జరుగుతోందో న్యాయవ్యవస్థ కూడా పట్టించుకోవాలని ఆ నేత వ్యాఖ్యానించారు. -
టీడీపీ బీఎల్ఏల పర్యవేక్షణలోనే ‘సర్’
నెల్లూరు (బారకాసు) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (సర్) ప్రక్రియ పూర్తిగా టీడీపీ కనుసన్నల్లోనే జరుగుతోంది. మంత్రి నారాయణ ఏకంగా బీఎల్ఓలతో సమీక్షించాక ఈ ప్రక్రియను పూర్తిగా టీడీపీ పర్యవేక్షణలోనే చేపడుతున్నారు. మంత్రి అండ చూసుకుని మున్సిపల్ కమిషనర్ నందన్, కమిషనర్ అండ చూసుకుని బీఎల్వోలు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించి బరితెగించి టీడీపీ బీఎల్ఏలు చెప్పినట్లు వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లు తొలగిస్తున్నారంటూ స్థానిక ఓటర్లు మండిపడుతున్నారు. వాస్తవానికి.. బీఎల్వోలే ఓటర్ల చిరునామాను గుర్తించి స్వయంగా వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాన్ని సదరు ఓటరుకు అందజేసి పూరించి తిరిగి తీసుకుని ఆన్లైన్ చేయాల్సి ఉంది. ఒకవేళ ఓటరు చిరునామా తెలియకపోతే ఆ ప్రాంత అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన బీఎల్ఏల సహకారంతో సదరు ఓటరు వద్దకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేయాల్సి ఉంది. అయితే, ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. నెల్లూరు నగరం, 5వ డివిజన్లోని సత్యనారాయణపురంలో ఉన్న ఎస్వీఆర్ స్కూల్ సమీపంలో ఓ వాటర్ ప్లాంట్ వద్ద సోమవారం టీడీపీ బీఎల్ఏలు సమావేశమయ్యారు. 5వ డివిజన్ పరిధిలో 128 నుంచి 135వ నంబరు వరకు ఎనిమిది బూత్లు ఉన్నాయి. ఆయా బూత్ల పరిధిలో ఉన్న ఓటర్లలో తమ పార్టీకి అనుకూలమైన ఓటర్లను గుర్తించి వారిని మాత్రమే వాటర్ప్లాంట్ వద్దకు పిలిపించుకుని బీఎల్ఓలతో కలిసి అక్కడే ఎన్యూమరేషన్ ఫారాల పరిశీలన ప్రక్రియను నిర్వహించారు. ఇది తెలిసి తమకు ఫారాలు ఇవ్వకుండా కొందరికే ఇవ్వడంపై ఆ ప్రాంత స్థానికులు అగ్గివీుద గుగ్గిలమవుతున్నారు. -
‘సర్’పై మధ్యంతర ఉత్తర్వులివ్వలేం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్)–2026 కోసం ఎన్నికల కమిషన్ (ఈసీ) హైదరాబాద్ మినహా ఫారాలను తెలుగులోనే ముద్రించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరించింది. అయితే, ఉర్దూ మాట్లాడే జనాభా 20 శాతానికి పైగా ఉన్న ప్రాంతాల్లో ఆ భాషలో ఫారాలు అందించే విషయాన్ని పరిశీలించా లని ఈసీని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, బిహార్ వంటి రాష్ట్రాల్లో సర్ ఫారాలు ఏఏ భాషల్లో ముద్రించారో వివరాలివ్వాలన్నారు. అలాగే పిటిషనర్ అభ్యంతరాలపై ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను వారంపాటు వాయిదా వేశారు. ఎస్ఐఆర్ ఫారాలను కేవలం తెలుగు భాషలో మాత్రమే ముద్రించి పంపిణీ చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ కరీంనగర్కు చెందిన ఎంఏ ముజీబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఓటర్ల నమోదు నియమావళి రూల్ 4కు ఈసీ తీరు వ్యతిరేకం.. వివక్షపూరితమని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై జస్టిస్ విజయ్సేన్రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. రాజకీయ పార్టీలన్నీ సమ్మతించాయి.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపిస్తూ.. ‘బీఎల్వోలకు ఏ భాష వచ్చో.. ఏ భాష రాదో.. తెలియదు. మైనారిటీలను తొలగించాలనే ఉద్దేశంతోనే తెలుగు, ఆంగ్ల భాషల్లో మాత్రమే దరఖాస్తు ముద్రించారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. ఆంగ్లంలో ఉన్న ఫారాలను కూడా హైదరాబాద్ వరకే ఇచ్చారు. తెలిసిన భాషలో పత్రం కోరడం రాజ్యాంగ హక్కు. హైదరాబాద్లో ఉర్దూ వచ్చిన వారెక్కువ. తెలుగు రాని వారి కోసం ఉర్దూలో ముద్రించాల్సిన అవసరం ఉంది’అని చెప్పారు. ఈసీ తరఫున అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ‘బీఎల్వోల వద్ద తెలుగు ఫారాలతోపాటు ఆంగ్లం, ఉర్దూ డమ్మీ ఫారాలుంటాయి. ఎవరికైనా తెలుగు తెలియకుంటే ఇతర భాషలోనివి చూపించి.. తెలుగు ఫారమ్లో నింపుతారు. ఈ నెల 17న జరిగిన భేటీలో రాజకీయ పార్టీలన్నీ దీనికి ఏకగ్రీవంగా సమ్మతించాయి. తెలంగాణలో అన్ని రాష్ట్రాల వారున్నారు.. దేశంలోని అన్ని భాషల్లో సర్ ఫారాలు ప్రింట్ చేయాలనడం సరికాదు. ఇప్పటికే ప్రింటింగ్ ముగిసింది. బీఎల్వోలు పత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఒకే ఫారమ్లో రెండు, మూడు భాషలిస్తే ప్రజలు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ఫారమ్ ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంది’అని చెప్పారు. -
సర్ జాబితాలో నా పేరు లేదు.. జైలుకు పంపుతారేమో!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బోరబండ ఏరియాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) జాబితాలో తన పేరు లేదన్న ఆందోళనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానిక భరత్నగర్లో కలకలం రేపింది.మృతుడు షేక్ ముజీబుర్ రహ్మాన్ (51) కార్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. SIR జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో తనను జైలుకు పంపిస్తారేమోనని భయపడుతూ.. ‘‘అదే జరిగితే మన ముగ్గురు పిల్లలను ఎవరు చూసుకుంటారు?" అంటూ భార్య వద్ద పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.భార్య ఎంతగా ధైర్యం చెప్పినా.. ఆయన మనస్తాపం తగ్గలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. చివరకు ఇంటి బయట ఉన్న షెడ్డు ఇనుప రాడ్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిజంగానే ముజీబుర్ రహ్మాన్ పేరు ఓటర్ సవరణ జాబితాలో లేదా? అసలు ఆ కారణంతోనే ఉరేసుకున్నాడా?.. మరణానికి దారితీసిన పరిస్థితులు, ఆయన ఆందోళనకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా.. SIR జాబితాపై ప్రజల్లో నెలకొన్న సందేహాలు, ఆందోళనలపై మరోసారి చర్చకు దారితీసింది. ఇలాంటి అనుమానాలను ఎన్నికల సంఘం నివృత్తి చేస్తుందేమో చూడాలి. -
కమిషనర్ 'సర్'కొత్త ఊడిగం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా జరగాల్సిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ నెల్లూరు నియోజకవర్గంలో గాడి తప్పుతోంది. నగర కార్పొరేషన్ కమిషనర్ నందన్ ఏకంగా సరికొత్త టీడీపీ నేత అవతారం ఎత్తారు. రాజ్యాంగ విలువలను కాలరాస్తూ అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారు. టీడీపీకి మేలు చేసేలా మంత్రి నారాయణ కనుసన్నల్లో పచ్చ కండువా కప్పుకుని సర్ ప్రోగ్రామ్ను పార్టీ వ్యవహారంగా మార్చేశారు. బీఎల్ఓల సమీక్షకూ మంత్రి నారాయణను ఆహ్వానించడమే కాకుండా ఏకంగా టీడీపీకి చెందిన బీఎల్ఏలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ‘సర్’ ప్రక్రియ వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా మై టీడీపీ యాప్ను పొగడ్తలతో ముంచెత్తడం కలకలం రేపింది. టీడీపీ బీఎల్ఏ కాన్ఫరెన్స్లో కమిషనర్ మాట్లాడిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంత్రి కనుసన్నల్లోనే.. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కనుసన్నల్లో పనిచేస్తున్న కమిషనర్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏకంగా టీడీపీ అధికారిక కార్యాలయంగా మార్చేశారు. టీడీపీ బీఎల్ఏలకు దిశానిర్దేశం చేసే బాధ్యతను తన భుజ స్కంధాలపై వేసుకున్నారు. టీడీపీ బీఎల్ఏల టెలికాన్ఫరెన్స్లోకి లాగిన్ అయి వారితో తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా నిర్వహించాల్సిన బీఎల్ఓల సమీక్షలకు ఇటీవల మంత్రి నారాయణతోపాటు మేయర్, డిప్యూటీ మేయర్లను ఆహ్వానించారు. దీనిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ హిమాన్షు శుక్లా కమిషనర్ నందన్కు షోకాజు నోటీసు జారీ చేశారు. అయినా కమిషనర్ తీరు మారలేదు. ఆయన నోటీసును లెక్కచేయలేదు. ఏకంగా టీడీపీ బీఎల్ఏల సమీక్షలో పాల్గొని మై టీడీపీ యాప్ బహు బాగు అంటూ కితాబిచ్చారు. ఆ యాప్ను తాము ఫాలో అవుతున్నామని, ఓట్లు తొలగించేందుకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన టీడీపీ కార్యకర్త డ్యూటీ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి నారాయణ అండదండలు ఉండడంతోనే కమిషనర్ కలెక్టర్, ఎన్నికల కమిషన్ ఆదేశాలూ పాటించడం లేదన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. మై టీడీపీ యాప్లో ఓటర్ వ్యక్తిగత సమాచారం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఓటర్ వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ బీఎల్ఏలు మై టీడీపీ యాప్లోకి లోడ్ చేస్తున్నారు. ఓటర్ వ్యక్తిగత సమాచారం చోరీకి కమిషనర్ ఆదేశాలతో బీఎల్ఓలే సహకరిస్తున్నారు. దీంతో వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఓట్లను తొలగించే కుట్రలో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తోంది. -
ఎన్ని ఓట్లు తొలగిస్తారు సర్!
జూన్ 25వ తేదీని బీజేపీ మాదిరిగా దేశంలో మరే పార్టీ గుర్తుపెట్టుకోలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఐదు దశాబ్దాల కింద ఇందిరాగాంధి విధించిన ఎమర్జెన్సీ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’గా ప్రతియేటా బీజేపీ పాటిస్తున్నది. ఈయేడు కూడా బీజేపీ అగ్రనేతలంతా ఆనాటి అకృత్యాలపై ఎలుగెత్తారు. ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తూ ‘దేశ చరిత్రలో ఆరోజు కాంగ్రెస్ పార్టీ ఒక చీకటి అధ్యాయాన్ని ప్రారంభించింద’ని విమర్శించారు. పురాణాల్లోంచి నాలుగు సంస్కృత పంక్తులను సంగ్ర హించి ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేశారు. ‘స్వాతంత్య్రం ద్వారానే మనిషి నిజమైన సుఖాన్ని పొందుతాడు, ఉన్నతమైన విజయాలను సాధిస్తాడు. స్వేచ్ఛ ద్వారానే మనిషికి మనశ్శాంతి, సంతృప్తి లభిస్తాయి. స్వాతంత్య్రం ద్వారానే అత్యున్నత స్థితికి చేరుకోగలుగుతాము’ అని ఆయన సందేశానికి అర్థం. ప్రధాని చెప్పినట్టుగా ఎమర్జెన్సీ కాలం ఈ దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయమే. లక్షమందికి పైగా ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను, నాయకులను అక్రమంగా నెలల తరబడి నిర్బంధించిన రోజులవి! భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాణప్రదమైన పౌరహక్కులను సమస్త ప్రజానీకం సామూహికంగా కోల్పోయిన అస్వతంత్ర దినాలవి! లాకప్ చిత్రహింసలకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కోటిమందికి పైగా బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయగా వారిలో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పీడకాలం అది. లక్షలాది నిరుపేదల ఆవాసాలను సర్కారీ బుల్డోజర్లు కర్కశంగా చిది మేసిన నిరంకుశ క్షణాలవి. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేని అటు వంటి స్థితిలో మనిషికి నిజమైన సుఖసంతోషాలుండవని ప్రధానమంత్రి ప్రబోధించారు. కాకతాళీయంగా జూన్ 25 మాదిరిగానే జూన్ 24 కూడా భవిష్యత్తు చరిత్రలో గుర్తుంచుకోదగిన రోజుగా మిగిలిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. భారత రాజకీయాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న ఓటర్ల జాబితాల ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్) కార్యక్రమం గత సంవత్సరం జూన్ 24న బిహార్లో ప్రారంభమైంది. ఇప్పటికి పన్నెండు రాష్ట్రాల్లో 50 కోట్లకు పైగా ఓటర్ల పరిశీలన పూర్తయింది. వీరిలో ఐదు కోట్ల పైచిలుకు మందిని జాబితాల నుంచి తొలగించారు. చని పోయిన వారిని మినహాయించగా మిగిలిన వారి సంఖ్య ఇది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా మిగిలిన రాష్ట్రాల్లో 39 కోట్ల మంది ఓటర్ల పరిశీలనా కార్యక్రమం ఈ జూన్లో ప్రారంభమైంది. సర్ కార్యక్రమం తొలగింపు సరాసరి లెక్కన ఈ మూడో దశలో కూడా మరో పది శాతం మందిని జాబితాల నుంచి తొల గించే అవకాశం ఉన్నదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ అనుమానాలే నిజమైతే జర్మనీ జనాభాకు ఇంచుమించు సమాన స్థాయిలో మన దేశంలో అనర్హులుగా తేల్చిన ఓటర్ల సంఖ్య ఉంటుంది. వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది? వారి అప్పీళ్లు ఎప్పుడు పరిష్కారమవుతాయన్నది అగమ్యగోచరం. తమ అనర్హతపై బిహార్లో 47 లక్షలమంది, బెంగాల్లో 27 లక్షల మంది చేసుకున్న అప్పీళ్లపై ఇప్పటికీ విచారణే ప్రారంభం కాలేదు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలదీ అదే కథ. ఈలోగా ఎన్ని కలు పూర్తయి కొత్త ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. వయోజను లైన భారత పౌరులందరికీ మన రాజ్యాంగం ఎటువంటి వివక్ష లేకుండా ఓటు హక్కును కల్పించింది. మానసిక స్థితి బాగా లేనివారు, కొన్ని తీవ్రమైన నేరాల్లో శిక్షపడినవారు, విదేశీయు లకు మాత్రమే ఓటు హక్కును తిరస్కరించే అవకాశం ఉన్నది. ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్న ఐదు కోట్లమంది, ఉండే అవ కాశం ఉన్న మరో మూడు కోట్ల మందిని ఏ కేటగిరీలో చేర్చాలి?సార్వత్రిక ఓటు హక్కు అనేది రాజ్యాంగ స్ఫూర్తి. అర్హులైన అందరినీ ఓటర్లుగా నమోదు చేసి వారి జాబితాలను తయారు చేసే బాధ్యతను రాజ్యాంగం ఎన్నికల సంఘం మీద మోపింది. ఇందుకు పూర్తి విరుద్ధంగా ఓటర్లుగా నమోదయ్యే బాధ్యతను, అందుకోసం తన పౌరసత్వాన్ని నిరూపించుకునే బాధ్యతను ప్రజలపైనే ప్రస్తుత ఎన్నికల సంఘం మోపింది. వయోజనులైన ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించడం రాజ్యాంగ ఆశయమైతే, అదే రాజ్యాంగం ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం వైఖరి వీలై నంత ఎక్కువమందిని ఓటు హక్కుకు దూరం చేసేదిగా కనిపి స్తున్నది. రాజ్యాంగ ఆశయానికి అనుగుణంగా ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని (1950) రూపొందించారు. దాంతోపాటు ఓటర్ల నమోదు నిబంధనావళి (1960)ని పార్లమెంట్ తయారు చేసింది.ఈ చట్టం ప్రకారం ప్రతి జనరల్ ఎలక్షన్కు ముందు సాధా రణ స్థాయిలో ఓటర్ల జాబితా సవరణ జరగాలి. చనిపోయిన వారు, శాశ్వతంగా వలస వెళ్లినవారి ఓట్లను తొలగించడం, కొత్త ఓటర్లను నమోదు చేయడం వరకు ఈ ప్రక్రియ పరిమిత మవుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఓటర్ల జాబితా ‘ప్రత్యేక’ సవరణకు ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 21 (2) అనుమతినిస్తున్నది. అయితే ఆ ప్రత్యేక సందర్భాన్ని ముందుగా ఎన్నికల సంఘం పేర్కొనాలి. ఆ తర్వాత ఈసీఐ అవసరమని భావించిన ఏదైనా నియోజకవర్గంలోగానీ, నియోజకవర్గంలోని కొన్ని భాగాల్లోగానీ ప్రత్యేక సవరణ చేపట్టవచ్చునని చట్టం చెబుతున్నది. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ అనేది చట్టం పరిధి దాటిన వ్యవహారంగా న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఎన్నికల ముందు చేపట్టే సవరణ సాధారణ సవరణగానే ఉండా లని చట్టం స్పష్టంగా పేర్కొన్నది.పెద్దసంఖ్యలో అక్షరజ్ఞానం లేనివారు, అంతకంటే ఎక్కువ సంఖ్యలో కనీస డిజిటల్ పరిజ్ఞానం లేనివారు, తాత్కాలిక వలస లకు వెళ్లే శ్రమజీవులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజలున్న దేశంలో ఓటర్ల నమోదు ప్రక్రియ అనేది వీలైనంత సరళంగా ఉండాలి. కానీ సాధ్యమైనంత సంక్లిష్టమైన ప్రక్రియగా ఈ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్చివేసింది. 2002 ఓటర్ల జాబితాను ఆధారం చేసుకొని ప్రస్తుత ఓటర్లను మ్యాపింగ్ చేయడం ఈ ప్రక్రియలో తొలిదశ. అందులో ఉన్న ఓటర్లకు ఇబ్బందేమీ ఉండదు. ఎన్యుమరేషన్ ఫాం నింపితే సరిపోతుంది. నలభయ్యేళ్ల లోపు వయసు వాళ్లకు అప్పట్లో ఓటు ఉండే అవకాశం లేదు కనుక వారు అప్పటి జాబితాలో ఉన్న తండ్రి పేరును, తాత పేరును వెతికి పట్టుకొని సమర్పించాలి. దాంతోపాటు మీరు మీరేనని ధ్రువీకరించే పత్రాన్ని కూడా సమర్పించాలి.2002 జాబితాలో పేరు లేక మ్యాపింగ్ కాని ఓటర్లతోపాటు అప్పటి జాబితాతో పోల్చితే స్వల్ప తేడాలు, స్పెల్లింగ్ తప్పు లున్న మ్యాపింగ్ అయినవారికి కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉన్నది. వారు ఈఆర్వో ముందు హాజరై తాము ఈ దేశ పౌరులమే, ఓటు హక్కుకు అర్హులమే అని నిరూపించుకోవ లసిన బాధ్యత వారిపైనే ఉన్నది. ఇప్పుడున్న సమాచారాన్ని బట్టి తెలంగాణలో 30 శాతం, ఏపీలో 24 శాతం మంది ఓటర్లకు 2002 జాబితాలో మ్యాపింగ్ జరగలేదు. అధికార యంత్రాంగం కనుక కొన్ని సెక్షన్ల ఓటర్లను తొలగించాలనే లక్ష్యంతో పనిచేస్తే మ్యాపింగ్లో ఎదురయ్యే చిన్నచిన్న తప్పులను కూడా అవకాశంగా మలుచుకోవచ్చు. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ విచక్షణాధికారాలన్నీ కేంద్రం నియమించిన ‘సూక్ష్మ పరిశీలకులకు’ సంక్రమించాయి.ఓటర్ల తొలగింపు కార్యక్రమంలో పలురకాల వింతలు చోటు చేసుకున్నాయి. కొద్దిపాటి చరిత్ర జ్ఞానమున్న వారికి సైతం మీర్ జాఫర్ పేరు తెలియకుండా ఉంటుందా? 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో ఈస్టిండియా కంపెనీకి సహకరించి సిరాజుద్దౌలా ఓటమికి కారణమైన వ్యక్తి. ఈ ఘటన దేశ చరిత్ర గతిని మలుపు తిప్పిన సంగతి తెలిసిందే. అతని కుటుంబ వారసులు గత పది పదిహేను తరాలుగా ముర్షిదాబాద్లో నివసిస్తున్నారట! ఆ ఖాన్దాన్కు చెందిన 346 మంది ఓట్లు అనుమానితుల జాబితాలో చేరాయి. వారిప్పుడు తమ పౌర సత్వాన్ని నిరూపించుకోవడమనే అగ్ని పరీక్షను ఎదుర్కోవలసి ఉన్నది. విదేశాంగ శాఖ కార్యదర్శిగా, కామన్వెల్త్ నేషన్స్ డిప్యూటీ సెక్రటరీ జనరల్గా పనిచేసిన కృష్ణన్ శ్రీనివాసన్ పేరు 2002 జాబితాలో ఎందుకు లేదని నోటీసులిచ్చారట! ఉద్యోగ బాధ్యతలో చిరకాలం విదేశాల్లో ఉన్న వ్యక్తిని ఈ ప్రశ్న అడగడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వ్యవస్థకు ఇంగితజ్ఞానం కూడా లేదని నిరూపించే ఇటువంటి విశేషాలు పెద్దఎత్తున వెల్లడవుతున్నాయి.సాధారణ ఎన్నికలు నిర్వహించడానికి దేశం మొత్తానికి ఒకే ఎలక్షన్ కమిషన్ ఉండాలా? లేదంటే జాతీయ స్థాయితోపాటు రాష్ట్రాలకు వేర్వేరుగా కమిషన్లు ఉండాలా అనే అంశంపై కూడా రాజ్యాంగ సభలో చర్చ జరిగింది. ఉద్యోగం, ఉపాధి అవకాశా లను వెతుక్కుంటూ పెద్దసంఖ్యలో ప్రజలు శాశ్వత వలసలకు వెళ్లే అవకాశాలున్నందువలన రాష్ట్రాల కమిషన్లు ఈ వలస ప్రజల పట్ల వివక్ష చూపవచ్చన్న అనుమానంతో దేశమంతటికీ ఒకే ఎలక్షన్ కమిషన్ ఉండాలని రాజ్యాంగ సభ నిర్ణయించింది. సార్వత్రిక ఓటు హక్కుకు ఏరకమైన అవరోధాలు రాకూడదనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నది. రాజ్యాంగ సభ ఆశ యానికీ, ఓటర్ల తగ్గింపే పరమావధిగా పెట్టుకున్న ప్రస్తుత ఎన్ని కల సంఘం వ్యవహార శైలికీ మధ్యన హస్తి మశకాంతరం ఎందుకేర్పడిందో చెప్పవలసిన బాధ్యత ఆ సంఘంపైనే ఉన్నది.ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు సమర్థించి ఉండవచ్చు. చట్టం పరిధిని మీరినట్టు స్పష్టంగా కనిపి స్తున్న ఎన్నికల సంఘం వ్యవహారం రాజ్యాంగబద్ధమేనని సర్వో న్నత న్యాయస్థానం అభిప్రాయపడి ఉండవచ్చు. ఆధిపత్య శక్తుల ప్రభావం వలన రాజ్యాంగ వ్యవస్థల నడుమ మంచి సమ న్వయం సమకూరి ఉండవచ్చు. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు లేకుండా జాబితాలను శుద్ధి చేయడమే లక్ష్యమని ఎన్నికల సంఘం చెబుతున్న మాటలు మంచివే కావచ్చు. కానీ ఓటర్ల తొలగింపే ధ్యేయమన్నట్టు సాగుతున్న ఈసీ సంక్లిష్ట కార్యక్ర మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ సంక్లిష్టత కారణంగా ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉన్నవారిలో పేదవర్గాలు, నిరక్షరాస్యులు, మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో ఉండే పరిస్థితిని ఎలా అడ్డుకోగలుగుతాము? ఇప్పటికే బెంగాల్, బిహార్లలోని బీజేపీ ప్రభుత్వాలు కొత్త ఓటర్ల జాబితాలను సంక్షేమ పథకా లకు లింక్ చేశాయి. తొలగించిన ఓటర్లందరూ లబ్ధిదారుల జాబితా నుంచి కోతకు గురికాబోతున్నారు.ఈమాత్రం హింట్ చాలదా ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ చెలరేగిపోవడానికి! ఇటువంటి సావకాశం లేకుండానే అది వీలైనంతవరకు ఎన్నికల హామీలకు ఎగనామం పెట్టింది. అమలు చేస్తున్న పథకాల్లో కూడా లబ్ధిదారుల సంఖ్యలకు కత్తెర వేస్తున్నది. సర్ రూపంలో మరో అవకాశం తరుముకొస్తుంటే ఒడిసిపట్టకుండా ఊరుకుంటుందా? టీడీపీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్లను క్రియాశీలకంగా రంగంలోకి దింపింది. ఎన్ని కల సంఘం తరఫున పనిచేసే బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓ)తో టీడీపీ ఏజెంట్లను పూర్తిస్థాయిలో ‘మ్యాపింగ్’ చేసి నట్టు వార్తలు వస్తున్నాయి. బీఎల్ఓల దగ్గర మాత్రమే ఉండా ల్సిన సమాచారం కూడా టీడీపీ ఏజెంట్లకు అందుబాటులోకి వస్తున్నది. టీడీపీ బీఎల్ఏలు తమ పరిమితికి మించి ఎన్యూమ రేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారని సమాచారం. కొందరు బీఎల్ఓలు అన్ని పార్టీల ఏజెంట్లకూ ఇవ్వాల్సిన హౌస్ విజిట్ సమాచారాన్ని కూటమి ఏజెంట్లకు మాత్రమే చేరవేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం బీఎల్ఏల గ్రూప్ కాల్స్లో అధికారులు మాట్లాడుతూ మార్గ నిర్దేశనం చేస్తున్న వ్యవహారాలు కూడా అక్కడక్కడా బయటపడుతున్నాయి. ఇటువంటి ధోరణులకు చెక్ పెట్టే విధానంగానీ, యంత్రాంగంగానీ ఎన్నికల సంఘం దగ్గర లేదు. అసలు ఎన్నికల సంఘం నిష్పాక్షికత పైనే ఎవరికీ నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది. పాస్పోర్టు కూడా పౌరసత్వానికి రుజువు కాదని తాజాగా విదేశాంగ శాఖ అధికారి ఒకరు ప్రకటించారు. భారతీయ పౌరులు కానివారికి పాస్పోర్టు జారీ చేయరాదని పాస్పోర్టు చట్టం స్పష్టంగా చెబుతున్నది. చట్టం చెప్పినదానికీ, అధికారి వివరణకూ మధ్యన ఉన్న వైరుధ్యాన్ని ఎవరు పరిష్కరించాలి? ఆధార్, ఓటర్ ఐడీ, పాన్కార్డు ఏదీ కూడా పౌరసత్వానికి రుజువులు కావని గతంలోనే న్యాయస్థానాలు, ప్రభుత్వ శాఖలు స్పష్టం చేశాయి. మరి ఓటరు జాబితాలో నమోదుకు అనర్హు లుగా మిగులుతున్న కోట్లాదిమంది పరిస్థితి ఏం కానున్నది? వారి సమస్యను పరిష్కరించడానికి ఎంతకాలం పడుతుంది? పుట్టి పెరిగిన దేశంలో పౌరసత్వం లేదని నిబంధనలు వెక్కిరి స్తుంటే స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఆ ప్రజలు ఎలా అనుభవించగలరు? సంక్షేమ పథకాల నుంచి తొలగిస్తుంటే బడుగు వర్గాల ప్రజలు సంతృప్తిగా ఎలా జీవించగలరు? ‘స్వాతంత్య్రాత్ సుఖమాప్నోతి/ స్వాతంత్య్రాల్లభతే పరమ్!’ అంటూ ప్రధాని చెప్పిన శ్లోకం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి కౌంటర్గా మాత్రమే పనికొస్తుందా? సర్ ఎమర్జెన్సీ మీద సెటైర్గా పనికిరాదా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
సర్కు ఏడాది.. 6 కోట్ల పేర్లు తొలగింపు
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదంగా మారిన ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) అమలుకు ఏడాది పూర్తయ్యింది. దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, ఎన్నికల కమిషన్కు మధ్య తీవ్ర వివాదం రేపిన ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు కనీసం 6 కోట్ల ఓటర్ల పేర్లు తొలగింపునకు గురయ్యాయి. ఓటరు జాబితా ప్రక్షాళన ప్రస్తుతం దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతోంది. గతేడాది జూన్ 24వ తేదీన బిహార్లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ పైలట్ ప్రాజెక్టుగా సర్ను చేపట్టింది. సర్ పూర్తయ్యే సరికి అక్కడ 65 లక్షల పేర్లు ఓటరు జాబితా నుంచి తీసివేశారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు గగ్గోలుపెట్టాయి. అర్హులైన ఓటర్ల పేర్లను ధ్రువీకరణ పత్రాలు లేవనే సాకుతో బీజేపీకి అనుకూలంగా ఈసీ తొలగిస్తోందంటూ ఆరోపించాయి. వివిధ అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలుమార్లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో సర్ చేపట్టే అధికారం ఈసీకి ఉందని స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగింది. -
మీ ఓటుండాలంటే!
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ద్వారా ఇంటింటి సర్వే మొదలై పది రోజులు దాటింది. ఇప్పటికే బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) ఇంటింటికి తిరిగి 60 శాతం మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం పూర్తైంది. ఇప్పుడే కీలక అంకం మొదలు కానుంది. తీసుకున్న ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి తిరిగి ఇస్తేనే మీ ఓటు హక్కు కొనసాగుతుంది. ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోని వారు తక్షణం పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో మీ ఓటు హక్కును కాపాడుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం.. ఇది చాలా ముఖ్యంప్రతి ఒక్కరూ 2002 ఓటరు జాబితా చెక్ చేసుకోవాలి.. » జాబితాలో మీ పేరు ఉందో లేదో అన్నది https://voters.eci.gov.in వెబ్సైట్లో “సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్’ అనే ఆప్షన్ను క్లిక్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు. » 2002 ఓటరు జాబితాలో మీ పేరు ఉంటే ఎటువంటి అదనపు వివరాలూ బీఎల్వోకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. » మీకిచ్చిన ఎన్యూమరేషన్ ఫారంలో “గత ఎస్ఐఆర్ ఓటర్ల జాబితాలో ఓటరు వివరాలు’’ అనే కాలంలో వివరాలు పూర్తి చేస్తే సరిపోతుంది. » ఓటరు పేరు, ఓటరు గుర్తింపు కార్డు (అందుబాటులో ఉంటే ఇవ్వాలి. తప్పనిసరి కాదు) » బంధువు పేరు (తండ్రి లేదా తల్లి), జిల్లా, రాష్ట్రం, నియోజకవర్గం, బూత్ నెంబర్ వివరాలు ఇస్తే సరిపోతుంది. ధ్రువీకరణ కోసం ఈ పత్రాలలో ఏదో ఒకటి దగ్గర ఉంచుకోండి.. 1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉద్యోగి గుర్తింపు కార్డు లేదా పెన్షన్ గుర్తింపు కార్డు 2. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎల్ఐసీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు జారీ చేసిన గుర్తింపు కార్డులు లేదా ధ్రువీకరణ పత్రాలు3. జనన ధ్రువీకరణ పత్రం 4. పాస్పోర్టు 5. విశ్వవిద్యాలయాలు లేదా సంబంధిత బోర్డులు జారీ చేసిన విద్యార్హత కార్డులు 6. సంబంధిత రాష్ట్రాలు జారీ చేసిన శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం 7. అటవీ హక్కులకు చెందిన పత్రం 8. సంబంధిత శాఖలు జారీ చేసిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు 9. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ 10. రాష్ట్ర, స్థానిక అథార్టీలు జారీ చేసిన ఫ్యామిలీ రిజిస్టర్ 11. ప్రభుత్వం జారీ చేసిన భూమి, గృహ కేటాయింపుల సర్టిఫికెట్ 12. ఆధార్ కోసం 9.9.2025న కమిషన్జారీ చేసిన ఆదేశాలు2002 ఓటరు జాబితాలో పేరు లేకపోతే..» ప్రస్తుతం 40 ఏళ్లలోపు వయసు ఉన్న వారు ఎవరికీ 2002 ఓటరు జాబితాలో పేరు ఉండే అవకాశం లేదు. కాబట్టి వీరంతా తమ ఓటు హక్కును కాపాడుకోవాలంటే.. మీ తండ్రి లేదా తల్లి 2002లో ఎక్కడ ఓటు కలిగి ఉన్నారనే విషయాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. » ఇందుకోసం మీకిచ్చిన ఎన్యూమరేషన్ ఫారం రెండో కాలమ్లో “గత ఎస్ఆఐర్లో ముందు కాలమ్లో పేర్కొన్న బంధువు వివరాలు’’ పూర్తి చేయాల్సి ఉంటుంది. » ఇక్కడ తండ్రి పేరు, తండ్రి ఓటరు కార్డు నెంబరు, బంధువు పేరు అన్న చోట తాత పేరు, అలాగే మీ తండ్రి ఓటు హక్కు కలిగి ఉన్న నియోజకవర్గం, బూత్ నెంబర్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ ఈ పత్రాలు లేని ఓటర్లు రాష్ట్ర ప్రభుత్వం వారికి జారీ చేసిన ఇతర ధ్రువీకరణ పత్రాలను సైతం ఆధారంగా సమర్పించవచ్చు. అయితే ఆ పత్రాలను స్వీకరించాలా? తిరస్కరించాలా? అనే విషయంలో పూర్తి విచక్షణాధికారాన్ని ఈఆర్వోలకు ఈసీ కల్పించింది. వారిదే తుది నిర్ణయం కానుంది.బీఎల్ఓ మీ వద్దకు రాకపోతే..» మొత్తం ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్వో)దే కీలక పాత్ర. » ఇప్పటివరకు బీఎల్వో మీ ఇంటికి రాకపోతే తక్షణం వారిని సంప్రదించండి. » మీ బీఎల్వో ఎవరు? అనేది సులభంగా తెలుసుకోవచ్చు. » voters.eci.gov.in లేదా ‘ఈసీఐనెట్’ యాప్లో ‘నో యువర్ బీఎల్వో’ లేదా ‘బుక్ ఏ కాల్ విత్ బీఎల్వో’ ఆప్షన్ వినియోగించుకోవడం ద్వారా మీ బీఎల్వో పేరు, ఫోన్ నెంబరు లాంటి వివరాలు పొందవచ్చు. » ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారు, 2024 ఓటరు జాబితాలోని చిరునామా నుంచి ఇల్లు మారినవారు బీఎల్వోను సంప్రదించడం ద్వారా ఓటు హక్కును కాపాడుకోవచ్చు. ఒక ఫారం మీ దగ్గరే.. » ప్రతీ బీఎల్వో మీ ఫొటో వివరాలు ముద్రించిన రెండు ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారు. » ఇందులో ఒక ఫారం మీ దగ్గర ఉంచుకొని ఇంకొకటి మీ బీఎల్వోకి ఇవ్వాలి. » ఎన్యూమరేషన్ ఫారం మీద మీ తాజా ఫొటో అంటించి ఫారం పూర్తి చేసి సంతకం చేసి ఇవ్వాలి. »ఒకవేళ మీ తరుఫున ఎవరైనా ఈ ఫారాలు అందచేస్తే ఆ ఓటరు మీకు ఏమవుతారు? అనే వివరాలను కూడా పేర్కొనాల్సి ఉంటుంది. » అలాగే ఎటువంటి తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం లేదని, తప్పుడు సమాచారం ఇస్తే ఎలాంటి శిక్ష విధిస్తారనే వివరాలు మీకు తెలుసని ధ్రువీకరిస్తూ డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. ఈ వివరాలు ఇవ్వండి » ఎన్యూమరేషన్ ఫారంలో ఈ వివరాలు అందరూ సమర్పించాలి. » ఓటరు పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబరు (ఇది ఐచ్ఛికం), మొబైల్ నెంబర్, తండ్రి పేరు, తండ్రి లేదా సంరక్షకుడి ఓటరు గుర్తింపు కార్డు నెంబరు (అందుబాటులో ఉంటే), తల్లి పేరు, తల్లి ఓటరుకార్డు (అందుబాటులో ఉంటే), జీవిత భాగస్వామి (వర్తిస్తేనే) పేరు, జీవిత భాగస్వామి ఓటరు కార్డు నెంబరు (అందుబాటులో ఉంటేనే) ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్లో కూడా ఇవ్వొచ్చు.. » వేరే ప్రాంతాల్లో నివసించే వారు కూడా సొంతంగా ఆన్లైన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించే వీలుంది. » ఇందుకోసం ‘ఈసీఐనెట్’ యాప్లో ప్రత్యేకంగా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. » ‘ఈ – సైన్’ ద్వారా ఫారంను ఆన్లైన్లో సమర్పించేందుకు మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఓటర్ గుర్తింపు కార్డుతో అనుసంధానించి ఉండాలి. » గుర్తింపు కార్డుపై ఉన్న ఓటరు పేరు స్పెల్లింగ్, ఓటరు ఆధార్ కార్డుతో కచ్చితంగా సరిపోవాలి. » ఏదైనా వ్యత్యాసం ఉంటే డిజిటల్ ఈ – సైన్ విఫలం అవుతుంది. » అలాంటప్పుడు ఓటర్ తన బూత్ లెవల్ ఆఫీసర్ ద్వారా ఫిజికల్గా ఫారం సమర్పించాల్సి ఉంటుంది. ముసాయిదా జాబితా సరి చూసుకోవడం తప్పనిసరి.. » ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. » ప్రతీ బీఎల్వో దగ్గర అది అందుబాటులో ఉంటుంది. లేకపోతే http://www. ceoandhra.ap.gov.in/ నుంచి డౌన్లోడ్ చేసి కూడా చూసుకోవచ్చు. » ముసాయిదా జాబితాలో మీ ఓటు ఉందో లేదో ప్రతీ ఒక్కరు విధిగా సరి చూసుకోవాలి. ఇదే అత్యంత కీలకం. » ఒకవేళ ఆ జాబితాలో మీ పేరు లేకపోతే వెంటనే అభ్యంతరం వ్యక్తం చేయాలి. కేవలం ఆగస్టు 20 వరకు మాత్రమే అభ్యంతరాలను స్వీకరిస్తారు. » సెప్టెంబర్ 18లోగా అభ్యంతరాలను పరిష్కరించి సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. » అభ్యంతరాలను తెలిపేందుకు మూడు రకాల ఫారాలు అందుబాటులో ఉంటాయి. జూలై 1లోగా 18 ఏళ్లు నిండి ఇంకా ఓటరుగా నమోదు కాకపోతే ఫారం 6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. » చనిపోయిన లేదా వలస వెళ్లిన వారి ఓట్లు తొలగించడానికి ఫారం 7 వాడాలి. » జాబితాలో ఓటు లేకున్నా లేకపోతే వేరే చోటకి ఓటు బదలాయించాలన్నా, తప్పులున్నా ఫారం 8 ఉపయోగించాలి. నోటీసులు ఎవరికి ఇస్తారు?» ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు వచ్చినప్పటికీ, 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్లో పాక్షిక తేడాలను గుర్తించిన ఓటర్లతో పాటు 2002 ఓటర్ల జాబితాతో తమతో పాటు తమ బంధువుల పేర్లు లేని ఓటర్లకు ఈఆర్వోలు నోటీసులు ఇస్తారు. » నిర్దేశిత తేదీకి విచారణకు హాజరై వీరు ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తమ/తమ తల్లిందండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణగా ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసు ఇస్తే రుజువు చేసుకోవాల్సిందే..» నోటీసు అందుకున్న ఓటర్లు తమ/తల్లిదండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేయడానికి ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదానిని రుజువుగా ఈఆర్వోలు/ఏఈఆర్వోల వద్ద విచారణకు హాజరై సమర్పించాల్సి ఉంటుంది. » 1987 జూలై 1కి ముందు పుట్టిన ఓటర్లు తమ పుట్టిన తేదీ/ పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. » 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 2002 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లిదండ్రులిద్దరి పుట్టిన తేదీ/ పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అజాగ్రత్తగా ఉంటే ఓటు హుళక్కే..» ఎన్యూమరేషన్ ఫారం అందుకున్నప్పటి నుంచి తుది జాబితా ప్రచురించే సెప్టెంబర్ 22 వరకు అప్రమత్తంగా ఉండాల్సిందే. » ప్రస్తుతం రాష్ట్రంలో 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా డూప్లికేట్, మరణించిన, వలస వెళ్లిన వారి ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పేరుతో నిజమైన ఓట్లను తొలగించే ప్రమాదం పొంచి ఉంది. » ప్రస్తుతం చేపట్టిన సర్వే ద్వారా మరణించిన వారి పేర్లను, వలస వెళ్లి ఆచూకీ తెలియని వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. » ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదైన వారు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఓటు హక్కు ఉంచి మిగిలిన చోట్ల తొలగిస్తారు. ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వని వారు తమ ఓటు హక్కును కోల్పోతారు. 2002 ఓటర్ల జాబితాలో లేని వారు నిర్దేశించిన 12 ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించకుంటే వారు కూడా ఓటు హక్కు కోల్పోతారు. -
పాస్పోర్టూ పనికిరాదా?
ప్రపంచంలో ఏ దేశం పాస్పోర్టు శక్తిమంతమైందో లెక్కేసిచెప్పే హెన్లే పాస్పోర్టు ఇండెక్స్ (హెచ్పీఐ)... మన పాస్పోర్టు 75వ స్థానంలో ఉందంటూ ఈ ఏడాది మొదట్లో నిర్ధారించింది. ‘హమ్మయ్య... నిరుటితో పోలిస్తే పదిమెట్లు పైకొచ్చాం’ అని మన పౌరులు గర్వపడి ఆర్నెల్లు కాకుండానే దానికేమీ పెద్దగా విలువలేదనీ, భారత పౌరసత్వానికి అదేమీ రుజువు కాబోదనీ మన విదేశాంగ శాఖ తేల్చిచెప్పి, ఆ సంతోషంపై నీళ్లు చల్లింది. ‘ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు... గత పుష్కరకాలంలోని నిర్ణయం కానేకాదు. 1967 నాటి పాస్పోర్టు చట్టమే ఆ మాట చెప్పిం’దని సెలవిస్తోంది. గత కాలపు నిర్ణయం అయినంత మాత్రాన ఏదైనా శిరోధార్యమవుతుందా... దాన్ని సమీక్షించటం, మార్చటం అసాధ్యమా అన్న ప్రశ్నలు సహజంగానే అందరిలో తలెత్తుతున్నాయి. ఈమధ్యకాలంలో ఎన్నికల సంఘం (ఈసీ) ధర్మమా అని పౌరసత్వంపై ప్రజానీకంలో ఆందోళన బయల్దేరింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట బిహార్లో మొదలై పలు రాష్ట్రాల్లో సాగిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కావలసినంత కలవరపాటును సృష్టించింది.ఇంకా సృష్టిస్తోంది. పౌరులమని నిరూపించుకునే పత్రాలు సమర్పిస్తేనే ఓటు ఉంటుందనటంవల్ల పలు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో పౌరులు ఓటుహక్కు కోల్పోయారు. యూపీలో అలాంటివారు రెండు కోట్ల పైమాటే. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగిపోవటం తక్షణ ప్రమాదమైతే... దేశంలో నివసించటం అసాధ్యమయ్యే స్థితి ఏర్పడటం మున్ముందు ఎదురయ్యే ముప్పు. ఈ దేశ పౌరులని ఈసీ నమ్మితేనే ఎవరికైనా ఓటుహక్కు లభిస్తుంది. అలాగని ఓటర్ గుర్తింపు కార్డు పౌరసత్వానికి రుజువు కాబోదని ప్రభుత్వమే చెబుతోంది. ఇప్పుడు పాస్పోర్టు సైతం ఆ ఖాతాలో చేరింది.పదిహేనేళ్ల క్రితం మహారాష్ట్రలోని తెంబ్లీలో ఆధార్ను లాంఛనంగా ప్రారంభించి నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ కార్డే ఇకపై సర్వస్వమనీ, దాని ఆధారంగానే పథకాల వర్తింపు అయినా, పౌరుల గుర్తింపయినా వుంటుందనీ అన్నారు. నిరుపేదలకు ఏ గుర్తింపు కార్డూ లేకపోవటాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్టు ప్రారంభించామని కూడా చెప్పారు. తీరా సర్ ప్రక్రియ సమయంలో అది చెల్లుబాటు కాబోదని ఈసీ తేల్చి చెప్పింది. అటుపై సుప్రీంకోర్టు అనుమతించిన 12 పత్రాల్లో పాస్పోర్టు కూడా ఉండటం చాలామందికి ఊరటనిచ్చింది. ఇప్పుడు పాస్పోర్టు కూడా పౌరసత్వాన్ని నిర్ధారించటానికి పనికిరాదనటం సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. అవధానాల్లో ఆశువుగా పద్యం చెప్పే అవధానికి ‘నిషిద్ధాక్షరి’ మాటున పృచ్ఛకుడు అడుగడుగునా అడ్డుతగులుతూ, ప్రతి పదంలోనూ అక్షరాలను నిషేధిస్తూ ముప్పు తిప్పలు పెడతాడు. వీటన్నిటినీ అధిగమించి ఛందోబద్ధంగా అందమైన పద్యాన్ని అల్లటం అవధాని పద సంపదకు పరీక్ష. పౌరసత్వం విషయంలో దేశ పౌరులకు ఇలాంటి పరీక్షే ఎదురవుతోంది. ఏ పత్రం దాఖలు చేద్దామనుకున్నా అది పనికిరాదని చెప్పటం తప్ప, పనికొచ్చేదేమిటో పాలకులు నిర్ధారణగా చెప్పరు. ఇందువల్ల సామాన్యుల్లో అభద్రతా భావన ఏర్పడటం తప్ప సాధిస్తున్నదేమిటి? పాస్పోర్టు చట్టం సెక్షన్ 6(2)(ఏ) ఈ దేశ పౌరుడుకాని వ్యక్తికి పాస్పోర్టు నిరాకరించాలని స్పష్టంగా చెబుతోంది. ప్రభుత్వం జారీ చేసే పాస్పోర్టే వేరే దేశాలకు ప్రమాణం. దాన్నిబట్టే వీసాలు జారీ అవుతాయి. అది పనికిరాదంటే ఆ దేశాలు అడుగుపెట్టనిస్తాయా?హెచ్పీఐ ర్యాంకులు సాధారణమైనవేం కాదు. ప్రపంచంలో సింగపూర్ పాస్పోర్టును మొత్తం 192 దేశాలు గుర్తించి, వీసా అవసరం లేకుండానే తమ భూభాగాల్లో అడుగు పెట్టేందుకు అనుమతిస్తున్నాయి. అందువల్లే అది ప్రథమ స్థానంలో ఉంది. 187 దేశాల గుర్తింపుతో జపాన్, దక్షిణ కొరియాలు... 186 దేశాల గుర్తింపుతో స్వీడన్, యూఏఈలు 2, 3 స్థానాల్లో ఉన్నాయి. అలా చూస్తే మన పాస్పోర్టుకు 56 దేశాల గుర్తింపు మాత్రమే ఉంది. ఇతరచోట్లకు వెళ్లాలంటే వీసా కావాలి. వారు సైతం పాస్పోర్టు ఆధారంగానే వీసా జారీచేస్తారు. ఇప్పుడు విదేశాంగశాఖ తకరారుతో అంతర్జాతీయంగా ఎవరైనా తలుపులు మూస్తే మన పౌరుల గతేమిటి? ఎన్నో దేశాల్లో అన్నిటికీ చెల్లుబాటయ్యే కార్డు జారీ విధానం దశాబ్దాల క్రితమే అమల్లోకొచ్చింది. మనం మాత్రం అభద్రతాభావంతో పౌరులకు అడుగడుగునా సమస్యలు సృష్టిస్తున్నాం. ఇది సబబేనా? -
ఓటర్ల వద్దకు బీఎల్ఓలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమం గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ)లు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడం ప్రారంభించారు. బీఎల్ఓల వెంట ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్ఏలు (బూత్ లెవెల్ ఏజెంట్లు) కూడా ఉన్నారు. జూలై 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. తొలుత బీఎల్ఓలు ప్రతి ఇంటికీ తిరిగి ఈ ఫారాలను పంపిణీ చేస్తారు. ఓటర్లు పూర్తి వివరాలు నింపిన తర్వాత తిరిగి వాటిని సేకరిస్తారు. ఎవరికైనా ఈ ఫామ్లు అందకపోతే ఆన్లైన్లో ఎన్నికల సంఘం వెబ్సైట్లో నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఎన్యూమరేషన్ ఫారాలను తెలుగులో కూడా ముద్రించారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనున్నారు. అనంతరం జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. సెపె్టంబర్ 28 వరకు ఈ అభ్యంతరాలు పరిష్కరిస్తారు. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు ప్రకటించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
72 సార్లు ఢిల్లీకి పోయి 72 పైసలు కూడా తేలేదు: కేటీఆర్
సాక్షి, చేవెళ్ల: రైతులు సహా అన్నివర్గాలను మోసం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చి.. అమలులో మాత్రం పూర్తిగా విఫలమైందని అన్నారు. గురువారం చేవెళ్లలో నిర్వహించిన బీఆర్ఎస్ ‘సర్’ శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధు సాయాన్ని వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. అలాంటి రేవంత్ను ఏమనాలో రైతులే చెప్పాలన్నారు. రైతు సంక్షేమం గురించి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు.రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలు పలికిన భూముల ధరలు ప్రస్తుతం భారీగా పడిపోయాయని అన్నారు. పెట్టుబడులు తగ్గడంతో పాటు నిర్మాణ రంగం కూడా మందగించిందని చెప్పారు.రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్.. ప్రజల సమస్యల పరిష్కారం కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. "72 సార్లు ఢిల్లీకి వెళ్లి 72 పైసలు కూడా తీసుకురాలేకపోయారు" అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.ప్రజాస్వామ్య విలువలను పక్కనబెట్టి వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ.. "హిట్లర్ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ ఎగిరెగిరి పడుతున్నారు" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని, రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే సర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు ఇచ్చారు. -
ఓటరు వివరాల సేకరణ నేటి నుంచి షురూ
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026లో భాగంగా గురువారం నుంచి రాష్ట్రంలోని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం..జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటా తిరిగి ప్రతి ఓటరుకు ఒక జత ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయనున్నారు.ఫారంపై సంబంధిత ఓటరు పేరు, ఎపిక్కార్డు సంఖ్య, చిరునామా, ఫొటో, తదితర పాక్షిక వివరాలు ముద్రించి ఉండనున్నాయి. మిగిలిన వివరాలతో రెండు ప్రతులను పూరించాక వాటిపై బీఎల్ఓ సంతకం చేసి ఒక ప్రతిని ఓటరుకే రశీదుగా ఇచ్చి మరో ప్రతిని తనతో పాటు తీసుకెళ్తారు. ఈ విధంగా ఓటర్లు వివరాలు భర్తీ చేసి తమ సంతకం/వేలి ముద్రతో జూలై 24 లోగా బీఎల్ఓలకు తిరిగి అప్పగిస్తేనే జూలై 31న ప్రచురించే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు రానుంది. మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, ప్రతి ఒక్క ఓటరుకు పంపిణీ చేసేందుకు జత ఎన్యూమరేషన్ ఫారాలను ఇప్పటికే ముద్రించి బీఎల్ఓలకు సరఫరా చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆంగ్లంలో, మిగిలిన జిల్లాల్లో తెలుగులో ప్రచురించిన ఎన్యూమరేషన్ ఫారాన్ని ఓటర్లకు పంపిణీ చేయనున్నారు. ఓటరు స్థానికంగా అందుబాటులో లేకపోతే అతడి ఎన్యూమరేషన్ ఫారాన్ని కుటుంబ పెద్ద భర్తీ చేసి సంతకం పెట్టి బీఎల్ఓకు ఇవ్వవచ్చు. పోలింగ్ కేంద్రాల వారీగా సర్ ముసాయిదా ఓటర్ల జాబితాను జూలై 31న ప్రచురిస్తారు.ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించడంలో విఫలమైన ఓటర్లను గైర్హాజరు/నివాసం మారడం/చనిపోయిన/డూప్లికేట్ ఓటర్లుగా పరిగణించి వారి పేర్లను ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. ఇలా తొలగించిన ఓటర్ల జాబితాలను సైతం పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచురించి స్థానిక గ్రామ పంచాయతీ/వార్డు కార్యాలయంతో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వెబ్సైట్లో ప్రదర్శిస్తారు.ముసాయిదా జాబితాపై అభ్యంతరాల (ఫామ్–7)తో పాటు కొత్తగా ఓటర్లుగా నమోదు (ఫామ్–6), వివరాల దిద్దుబాటు/చిరునామా మార్పు (ఫామ్–8) కోసం జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ముసాయిదా జాబితాలో పేరు రాకపోయినా లేదా అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన/నిండనున్న యువత ఓటర్లుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్యకాలంలో ఈ దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించడంతో పాటు మ్యాపింగ్ సరిపోలని అనుమానిత ఓటర్లకు ఈఆర్ఓ (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్)లు నోటీసులు జారీ చేసి నిర్దిష్ట తేదీలో విచారణకు పిలుస్తారు. 11 పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలి రాష్ట్రంలోని 3.38 కోట్ల మంది ఓటర్లలో ఇప్పటివరకు 2.38 కోట్ల మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తికాగా, మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో 89.98 లక్షల మంది ఓటర్ల వివరాల్లో తేడాలున్నట్టు గుర్తించారు. వీరందరూ విచారణకు హాజరై ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని సమర్పించి తమ పుట్టిన తేదీ/నివాస ధ్రువీకరణ చేసుకోవాల్సి ఉంటుంది.ఈ జాబితాలో 12వ ధ్రువీకరణ పత్రంగా ఆధార్ను ఈసీ చేర్చినా, పుట్టిన తేదీ/నివాస ధ్రువీకరణ కోసం పరిగణనలోకి తీసుకోరు. కేవలం గుర్తింపునకు ధ్రువీకరణగానే ఆధార్ను స్వీకరించనున్నారు. ఈసీ నిర్దేశించిన పత్రాల్లో ఏ ఒక్క పత్రం లేని ఓటర్లు వారికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇతర ధ్రువీకరణ పత్రాలను సైతం సమర్పించవచ్చు. అయితే వాటి స్వీకరణ పూర్తిగా ఈఆర్వోల విచక్షణాధికారాలపై ఆధారపడి ఉంటుంది. అభ్యంతరాలు/దరఖాస్తుల పరిష్కరణ, ఈఆర్వోల విచారణలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ముసాయిదా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేసి అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. బీఎల్ఓకు ఫోన్ కూడా చేయొచ్చుఎన్యూమరేషన్ ఫారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ ( https://voters.eci.gov.in ) ద్వారా కూడా సమర్పించవచ్చు. అయితే ఆధార్ ఆథెంటికేషన్ సదుపాయం కలిగిన ఓటర్లు మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోగలరు. ఇక బీఎల్ఓ ఎన్యూమరేషన్ ఫారాన్ని పంపిణీ చేయకుంటే సీఈఓ వెబ్సైట్ ( https://ceotelangana.nic.in ) నుంచి తమ ప్రాంత బీఎల్ఓ ఫోన్ నంబర్ను తీసుకుని నేరుగా ఫోన్ చేయవచ్చు. ఈసీ వెబ్సైట్లోని ‘బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ’ సదుపాయాన్ని సైతం వినియోగించుకోవచ్చు. విదేశాల్లోని భారత పౌరులు ఆన్లైన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించవచ్చు. -
‘సర్’..వెరీ సీరియస్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గట్టి ఝలక్ ఇచ్చారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం విషయంలో చాలామంది ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ వైఖరిని మార్చుకోకపోతే వారి స్థానంలో కొత్తవారిని పార్టీ ఇన్చార్జులుగా నియమిస్తామని హెచ్చరించారు. ‘మీరు ఈసారి గెలుస్తారో, ఓడతారో మీ ఇష్టం. కానీ ‘సర్’లో పేదల ఓట్లు పోకుండా చూడాల్సిన బాధ్యత మీదే. పార్టీకి నష్టం కలిగితే చూస్తూ ఊరుకోం. మళ్లీ ఎమ్మెల్యే కావాలనుకున్నా, కొత్తగా ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నా ఎస్ఐఆర్ను సీరియస్గా తీసుకోవాల్సిందే.మీరేం చేస్తున్నారనే దానికి సంబంధించిన అన్ని నివేదికలూ నా దగ్గర ఉన్నాయి. 10 రోజుల సమయమిస్తున్నా. మీ తీరు మార్చుకోండి. లేదంటే మీ స్థానంలో కొత్త వారు వస్తారు..’ అని రేవంత్ స్పష్టం చేశారు. ఎస్ఐఆర్పై పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్చార్జులతో బుధవారం ఉదయం టీపీసీసీ ఆధ్వర్యంలో జూమ్ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్తో పాటు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలనుద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు.. ‘ఎస్ఐఆర్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, పోలింగ్ బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నేతలు, కార్యకర్తలను అప్రమత్తం చేస్తూ, క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాల్సిన ఎమ్మెల్యేలు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు? పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తే సహించేది లేదు. ఓట్లు తీసేసే వాళ్లు విస్తృతంగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లూ మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు.ఓట్లను కాపాడాల్సిన పార్టీగా మనం ఎందుకు సమావేశాలు నిర్వహించడం లేదు? అధికారంలో ఉన్న పార్టీగా అన్ని హంగులూ అందుబాటులో ఉన్నా ఎందుకు వినియోగించుకోవడం లేదు? కేడర్ కూడా లేని కొత్తగూడెంలో బీజేపీ సమావేశాలు పెట్టింది. కనీసం కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉండే సూర్యాపేట జిల్లాలో మనం అవగాహన సమావేశాలు పెట్టుకోలేకపోయాం. ప్రజలకు అవగాహన కల్పించండి ఓట్లు పోయిన తర్వాత పేదలు చాలా ఇబ్బంది పడతారు. కేవలం ఓట్లు మాత్రమే పోవు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోతాయి. వెంటనే డీడీలు కట్టండి. 2002 ఓటరు లిస్టు, ఇప్పటి ఓటరు లిస్టు తెప్పించుకుని సరి చూసుకోండి.అర్హులైన వారి ఓట్లు పోవడానికి వీల్లేకుండా ప్రతి 10 పోలింగ్ బూత్లకు ఒక ఇన్చార్జిని నియమించండి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ సమన్వయకర్త ఉండాలి. ఈ నెల రోజులూ ఎస్ఐఆర్ కార్యక్రమం మీదనే పనిచేయాలి. మనకు గ్రామాల్లో సర్పంచ్లున్నారు. వారి సహకారంతో ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎస్ఐఆర్ గురించి గ్రామాల్లో డప్పు చాటింపులు వేయించాలి..’ అని రేవంత్ సూచించారు. హైదరాబాద్లో ఓకే ఎస్ఐఆర్ కార్యక్రమంపై 33 జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు ఎన్ని సమావేశాలు నిర్వహించాయో ప్రతి జిల్లా వారీగా సీఎం చదివి విన్పించారు. ‘హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశాలు బాగా జరిగాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో జరగడం లేదు. అన్ని జిల్లాల్లో పార్టీ కేడర్, నేతలతో సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి యంత్రాంగానికి దిశానిర్దేశం చేయాలి.పోలింగ్ బూత్ వారీగా ఓట్లను సరిచూసుకోవాలి..’ అని చెప్పారు. జిల్లాల వారీగా ఎస్ఐఆర్ కార్యక్రమంపై పార్టీ ఆదేశాలు అమలయ్యేలా ఇన్చార్జి మంత్రులు బాధ్యతలు తీసుకోవాలి. చొరవ తీసుకోకపోతే ఇన్చార్జి మంత్రులను కూడా మారుస్తాం..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందరూ చురుగ్గా పాల్గొనాలి: మీనాక్షి గురువారం నుంచి జరిగే ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చురుగ్గా పాల్గొనాలని మీనాక్షి నటరాజన్ కోరారు. గ్రామీణ పేదలు, నిరక్షరాస్యులకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని, గ్రామాల్లో టెంట్లు వేసుకుని ఓట్లను మ్యాపింగ్ చేయాలని సూచించారు. అర్హులైన వారు తమ ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని పిలుపునిచ్చారు. అందుకే టీఎంసీ ఓడిపోయింది: మహేశ్గౌడ్ మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీజేపీ దేశంలో చేస్తున్న రాజకీయాలను చూసిన తర్వాతైనా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు ‘సర్’ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశ్చిమబెంగాల్లో కేవలం ఓట్ల చోరీతోనే బీజేపీ గెలిచిందని చెప్పారు. అక్కడ టీఎంసీ అప్రమత్తంగా లేకపోవడంతోనే అధికారం కోల్పోయిందని అన్నారు. -
ఇంత అలసత్వమా?.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అల్టిమేటం!
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్లో అలసత్వం కనిపిస్తోందా? క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదా? ఈ ప్రశ్నలకు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలే బలం చేకూరుస్తున్నాయి. ఎస్ఐఆర్ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకోవాలని స్పష్టం చేసిన ఆయన.. పార్టీ ఆదేశాలను పట్టించుకోని నేతలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో బుధవారం నిర్వహించిన టీపీసీసీ జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ సాధారణ అంశం కాదని, పేద ప్రజల హక్కులతో ముడిపడి ఉన్న కీలక ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొందరి తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఆయన.. పని చేయని వారి పేర్లు చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దని, అవసరమైతే వారి స్థానంలో కొత్త ఇన్ఛార్జ్లను నియమిస్తామని హెచ్చరించే దాకా వెళ్లారు.కొంతమంది నాయకులు ఎస్ఐఆర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పీసీసీ మీటింగ్లో సీఎం రేవంత్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలపై తన వద్ద పూర్తి నివేదిక ఉందని, ఎవరు పని చేస్తున్నారు.. ఎవరు చేయడం లేదన్న విషయం తనకు తెలుసని చెప్పారు. పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్పై కాంగ్రెస్ తరఫున మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో సర్పంచ్లను కూడా భాగస్వామ్యం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.ఎస్ఐఆర్ ప్రక్రియలో పొరపాట్లు జరిగితే పేదల ఓటు హక్కు దెబ్బతినే ప్రమాదం ఉందని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఓటు తొలగిపోతే భవిష్యత్తులో ఆధార్, రేషన్ కార్డులు వంటి సంక్షేమ ప్రయోజనాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి అన్యాయం జరగకుండా పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసిన సీఎం రేవంత్.. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని క్షమించబోమని హెచ్చరించారు. మరో పది రోజుల సమయం ఇస్తున్నామని, ఈ వ్యవధిలో పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని అన్నారు. లేకపోతే చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చారు. -
ఓటర్ల సవరణలో టీడీపీ జోక్యంపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వేలో టీడీపీకి చెందిన మంత్రులు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. జూన్ 22న నెల్లూరు నగరంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్తో పాటు మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ల సమక్షంలో ఓటర్ల సవరణ ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించిన విషయాన్ని ఆధారాలతో సహా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు. అధికారిక సమావేశానికి పెద్దసంఖ్యలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) హాజరుకావడంపై ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్–324 ప్రకారం ఎన్నికల సంఘం పూర్తి స్వతంత్రంగా, రాజకీయ ప్రభావం లేకుండా పనిచేయాలని లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదులో గుర్తు చేశారు. ఓటర్ల జాబితా తయారీ, సవరణ అనేది కేవలం ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే జరగాల్సిన చట్టబద్ధమైన ప్రక్రియ అని, ఇందులో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఓటర్లలో, రాజకీయ పార్టీలలో తీవ్ర అనుమానాలకు తావిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన సమీక్షా సమావేశంపై తక్షణమే విచారణ జరిపించాలని, నిబంధనలను ఉల్లంఘించి, రాజకీయ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. విచారణ ముగిసేవరకు సదరు సమావేశానికి సహకరించిన అధికారులందరినీ తక్షణమే ఎన్నికల విధుల నుండి తొలగించాలని కోరారు. భవిష్యత్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల సవరణ ప్రక్రియల్లో, సమీక్షల్లో పాల్గొనకుండా తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. -
రానున్న రెండు నెలలూ అత్యంత కీలకం: సజ్జల
తాడేపల్లి : SIR( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై అందరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. గత రెండు నెలలుగా పార్టీ యంత్రాంగమంతా దీనిపైనే పనిచేస్తోందని, పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లు పోకుండా కాపాడుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈరోజు(మంగళవారం) వైఎస్సార్సీపీ నేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. SIR, సోషల్ మీడియా బలోపేతం, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘SIR పై అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించాలి. గత రెండు నెలలుగా పార్టీ యంత్రాంగమంతా దీనిపైనే పనిచేస్తోంది. రానున్న రెండు నెలలూ అత్యంత కీలకం. అధికార పార్టీ నేతలు అడ్డదారుల్లో ఓట్ల తొలగింపునకు ప్రయత్నిస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఇందులో బూత్ లెవల్ ఏజెంట్లదే కీలక పాత్ర. ఎన్యూమరేషన్ ఫారాలు ప్రతి అర్హుడికి అందించి, వాటిని సేకరించి సరైన మ్యాపింగ్ చేయాలి. బీఎల్వోలతో సమన్వయం చేసుకోవాలి. బీఎల్వో ఏదైనా దరఖాస్తును తిరస్కరిస్తే, పరిష్కారం కోసం పైస్థాయికి సమాచారం అందించాలి. సోషల్ మీడియాలో పార్టీ వాణి మరింత బలంగా వినిపించాలి. పార్టీ నెట్వర్క్ను విస్తృతంగా పెంచుకోవడంతో పాటు, ప్రజలకు వాస్తవాలను చేరవేయాలి. టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలి. పార్టీ సభ్యత్వ నమోదు, ఐడీ కార్డుల వెరిఫికేషన్లో జాప్యం లేకుండా చూసుకోవాలి’ అని పేర్కొన్నారు. -
రక్తపాత రహిత రాజకీయ నరమేధమే ‘సర్’
సాక్షి, అమరావతి: ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్(సర్) అనేది ఒక రక్తపాత రహిత రాజకీయ నరమేధమని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ అభివర్ణించారు. ఇప్పటి వరకు పాలకులను ఓటర్లు ఎన్నుకుంటున్నారని, అయితే సర్ ప్రక్రియ ద్వారా ఎవరు ఓటర్లుగా ఉండాలనేది పాలకులు నిర్ణయిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే పది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్ ప్రక్రియను పూర్తి చేసి సుమారు 6.5 కోట్ల మంది ఓటర్లను తొలగించారని చెప్పారు. దేశమంతటా సర్ ప్రక్రియ పూర్తయ్యే సరికి 16.5 కోట్ల మంది ఓట్లను తొలగిస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. విశాలాంధ్ర దినపత్రిక 74వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం విజయవాడ గాంధీనగర్లోని ఓ ఫంక్షన్ హాలులో ‘ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ఆంతర్యం–సవాళ్లు’ అంశంపై సదస్సు నిర్వహించారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా హాజరైన డాక్టర్ పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ సర్ అనేది కేవలం ఓటరు జాబితా ప్రక్షాళన కార్యక్రమం అని మాత్రమే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని చెప్పారు.వాస్తవానికి దానికి వెనుక వేరే రహస్య అజెండా ఉందన్నారు. కేవలం కొన్ని వర్గాల ఓట్లు తొలగించడమే లక్ష్యంగా సర్ చేపట్టారని ఆందోళన వ్యక్తంచేశారు. 2002లో నిర్వహించిన ‘సర్’లో ఓటర్లు తమ అర్హతలను నిరూపించుకునేందుకు పత్రాలు సమర్పించాల్సిన అవసరం రాలేదన్నారు. ఇప్పుడు కచ్చితంగా డాక్యుమెంట్లు సమర్పించాలని నిబంధన విధించారని తెలిపారు. దీనివల్ల కనీస పరిజ్ఞానం లేని దళితులు, మైనారిటీలు, మహిళలు, ఆదివాసీలు, రోజువారీ కూలీలు భారీగా ఓట్లు కోల్పోతున్నారని తమ పరిశీలనలో తేలిందన్నారు. తెలంగాణలోనూ దాదాపు 88 లక్షలమంది ఓటర్ల మ్యాపింగ్ జరగలేదని ప్రకటించారని, అంటే అక్కడా ఆ ఓట్లలో అత్యధికం తొలగించే అవకాశం ఉందన్నారు. ఎటువంటి సమీక్ష లేకుండానే... బిహార్లో సర్ ప్రక్రియ అనంతరం సుమారు 63 లక్షల మంది ఓట్లు తొలగించడంతో వివాదాలు చెలరేగినా, ఎన్నికల సంఘం కనీసం సమీక్ష చేయకుండానే ముందుకు వెళుతోందని పరకాల చెప్పారు. సర్ ప్రక్రియ ప్రభావం కేవలం ఒకటి, రెండు ఎన్నికలకే పరిమితం కాదన్నారు. దీనివల్ల దేశంలో ఓటు హక్కు ఉన్నవారు, ఓటు హక్కు లేనివారుగా పౌరులను విభజించే పరిస్థితి వస్తుందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన కూడా అత్యంత దారుణంగా చేస్తున్నారని చెప్పారు. ఓటు హక్కును, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు వీధి పోరాటాలు ఒక్కటే శరణ్యమన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ సర్పై రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేస్తామన్నారు. విశాలాంధ్ర ఎడిటర్ ఆర్వీ రామారావు, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్లో ఓట్ల గల్లంతు!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 కార్యక్రమంలో కీలకమైన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాకముందే భారీ సంఖ్యలో ఓటర్ల పేర్ల గల్లంతు సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో ఓటర్ల జాబితా భారీ ‘శుద్ధికరణ’కు లోనుకానుందని ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల ఓటర్ల మ్యాపింగ్ గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,38,62,322 మంది (70.54%) ఇప్పటివరకు మ్యాపింగ్ అయ్యారు. ఇంకా 99,64,126 మంది ఓటర్లు (29.46%) మ్యాపింగ్కు అందుబాటులోకి రాలేదు. మూడు జిల్లాల్లో.. హైదరాబాద్ జిల్లాలో 25.24 లక్షలు, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో 16.78 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 15.29 లక్షల మంది ఓటర్ల మ్యాపింగ్ పెండింగ్లో ఉంది. ఓటర్ల మ్యాపింగ్ జరగాల్సిన వారిలో 57.31 లక్షల (57.5 శాతం) మంది ఈ మూడు జిల్లాల ఓటర్లే కావడం గమనార్హం. రాష్ట్రంలోనే అత్యల్ప మ్యాపింగ్ ఈ జిల్లాల్లోనే జరిగింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 43.67శాతం, హైదరాబాద్ జిల్లాలో 46.69 శాతం, రంగారెడ్డి జిల్లాలో 58.68 శాతమే మ్యాపింగ్ జరిగింది. స్థానిక బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) సైతం మిగిలిన ఓటర్లకు సంబంధించిన ‘ఆచూకీ’తెలియరావడం లేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అద్దె ఇళ్లల్లో నివా సం ఉండటం, తరచూ ఉద్యోగాలు మారడం, ఐటీ ఉద్యోగుల వలసలు, విద్యార్థుల వలసలు, ఒకే వ్యక్తి బహుళ చిరునామాలు కలిగి ఉండటం వంటి కారణాలతో ఈ మూడు జిల్లాల్లో ఓటర్ల ఆచూకీని కనిపెట్టలేకపోతున్నారు. దీంతో జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల సిబ్బంది సహాయాన్ని ఎన్నికల సంఘం కోరింది. మేడ్చల్లో మరింత తీవ్రమా? ప్రస్తుత ఓటర్ల జాబితాను 2002 ఓటర్ల జాబితాతో అనుసంధానం చేసి రెండు జాబితాల్లో ఓటర్ల సమాచారాన్ని ప్రత్యేక సాఫ్ట్వేర్తో సరిపోల్చి చూస్తున్నారు. రాష్ట్రంలో మ్యాపింగ్ జరిగిన 2.38 కోట్ల ఓటర్లలో 89.88లక్షల (37.67శాతం) మందికి సంబంధించిన వివరాల్లో వ్యత్యాసాలు/లోపాలున్నట్టు గుర్తించారు. వీరిలో 28.55 లక్షల (32శాతం) మంది ఓటర్లు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలవారే. రంగారెడ్డి జిల్లాలో 11.44 లక్షలు, హైదరాబాద్ జిల్లాలో 8.65 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 8.45 లక్షల మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలున్నట్టు తేలింది. మేడ్చల్ జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. జిల్లాలో 13 లక్షలు మంది ఓటర్లు మ్యాపింగ్ పూర్తైతే 8.45 లక్షల (65శాతం) మంది వివరాల్లో తేడాలున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక శాతం వ్యత్యాసాలు ఈ జిల్లాలోనే ఉండటం గమనార్హం. గ్రామీణ జిల్లాల ముందంజ గ్రామీణ జిల్లాలు ఓటర్ల మ్యాపింగ్లో ముందంజలో ఉండటమే కాకుండా అతి తక్కువగా వ్యత్యాసాలను కలిగి ఉన్నాయి. మహబూబాబాద్లో 94.54శాతం, జనగాంలో 93.44 శాతం, మెదక్లో 89.98 శాతం, నారాయణపేటలో 85.54 శాతం, రాజన్న సిరిసిల్లలో 84.92శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తైంది. గ్రామీణ జిల్లాల్లో జనాభా స్థిరంగా ఉండటం, వారిని స్థానిక బీఎల్ఓలు సులభంగా చేరుకోగలగడంతో మ్యాపింగ్ వేగంగా జరిగింది. రాజకీయాలు, ఎన్నికలపై తీవ్ర ప్రభావం రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల ఓటర్లుండగా, 1.13 కోట్ల మంది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలవారే. రాష్ట్రంలో ఇంకా మ్యాపింగ్ మిగిలిన ప్రతి ఇద్దరు ఓటర్లలో ఒకరు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికే చెందినవారే కాగా, వివరాల్లో వ్యత్యాసాలున్న ప్రతి ముగ్గురు ఓటర్లలో ఒకరు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వారే కావడం గమనార్హం.హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఏకంగా 28 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్సభ స్థానాలున్నాయి. అసెంబ్లీ, లోక్సభతోపాటు గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలపై ఈ జిల్లాల్లో జరిగే ఓటరు జాబితా మార్పులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా భారీ మార్పుకు లోనైతే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం సైతం మారే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. -
ఒత్తిడిలోనే ఓటర్ల సర్వే
సాక్షి, అమరావతి: సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్–సర్)లో భాగంగా జరుగుతున్న ఇంటింటి సర్వేలో అధికారుల ఒత్తిడిని తట్టుకోలేక బూత్ లెవెల్ ఆఫీసర్(బీఎల్వో)లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. క్షేత్రస్థాయి ఇబ్బందులతో సంబంధం లేకుండా రోజుకు 200, 300 ఎన్యూమరేషన్ ఫారంలు పంపిణీ చేయాలంటూ జిల్లా స్థాయి అధికారులు చేస్తోన్న ఒత్తిడిని తాము తట్టుకోలేకపోతున్నామని బీఎల్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల జాబితాలో పేర్కొన్న చిరునామాలో ఓటర్లు లేకపోవడంతో వారు ఎక్కడున్నారన్న విషయం పట్టుకోవడం బీఎల్వోలకు తలకు మించిన భారమవుతోంది.పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. 2024 ఓటరు జాబితాలో పేర్కొన్న చిరునామాలో ఓటర్లు అక్కడ ఉండకుండా వేరే చోటకు మారిపోవడంతో వారు ఎక్కడున్నారో తెలుసుకుని అక్కడికెళ్లి ఎన్యూమరేషన్ ఫారంలు ఇచ్చి, పూర్తి చేసి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటోందని వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే, ఉదయం 6 గంటలు కాకుండానే టెలీకాన్ఫెరెన్స్లు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఇన్ని ఫారాలు ఇవ్వాలని లేకపోతే మీకు మోమోలు జారీ చేస్తామంటూ అధికారులు బెదిరిస్తున్నారని పలువురు బీఎల్వోలు ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కష్టంగా ఆ 8 నియోజకవర్గాలు మొత్తం 175 నియోజకవర్గాల్లో 18 నియోజకవర్గాల్లో అత్యధిక ఓట్లు మ్యాపింగ్ కాకుండా ఉండటంతో అక్కడ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేషన్ ఫారంలు సరఫరా, తిరిగి తీసుకోవడం అతిపెద్ద సవాల్గా మారింది. లక్షకుపైగా ఓట్లు మ్యాపింగ్కానీ నియోజకవర్గాలు 10 ఉంటే, 90 వేల నుంచి లక్షలోపు ఓట్లు మ్యాపింగ్ కాకుండా మరో 8 నియోజకవర్గాలున్నాయి. నెల్లూరు గ్రామీణంలో అత్యధికంగా 1,40,836 ఓట్లు, చంద్రగిరి (1,35,749), తిరుపతి (1,23,129), రాజమండ్రి గ్రామీణం (1,07,906), నెల్లూరు జిల్లా కొవ్వూరు (1,05,415), కర్నూలు (1,07,479), రాయచోటి (1,00,472), రాజమండ్రి సిటీ (1,01,130), మైలవరం (1,04,430), భీమిలి (1,23,737) నియోజకవర్గాలున్నాయి.ఇలా పట్టణ ప్రాంత నియోజకవర్గాల ఓటర్లను గుర్తించి ఎన్యూమరేషన్ ఫారంలు ఇవ్వడం పెద్ద సమస్యగా తయారైంది. ఇలాంటి నియోజకవర్గాలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి తమకు సహాయకులను కేటాయించాలని బీఎల్వోలు డిమాండ్ చేస్తున్నారు. 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ కాని వారు 2002లో ఏ నియోజకవర్గంలో ఓటు ఉందో చెప్పలేకపోతున్నారని, 2002లో ఓటు హక్కు లేని వారు తండ్రి పేరు కాకుండా తాత పేరు చెప్పడం, తాతకు చెందిన ఓటును గుర్తించడం చాలా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌరవ వేతనం లేకుండానే... 3 నెలలుగా జనాభా లెక్కలు, మ్యాపింగ్, ఇప్పుడు ఇంటింటి సర్వే అంటూ ఉదయం నుంచి రాత్రి వరకు తమను తిప్పుతున్నారని, దీనికితోడు ప్రభుత్వం యోగాంధ్ర, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అంటూ ఒకే మనిíÙపై అనేక పనులతో ఒత్తిడి తీసుకువస్తుండటంతో 4 నెలలుగా తాము కుటుంబంతో గడపలేని పరిస్థితి నెలకొందంటూ ఒక మహిళా బీఎల్వో ఏడ్చేశారు. రెండేళ్లుగా బీఎల్వోగా సేవలు అందిస్తున్నా..ఇంత వరకు రూపాయి కూడా గౌరవ పారితోషకం లేదని, అలాగే జనాభా లెక్కల్లో తొలి దశ పూర్తయినా దానికి సంబంధించి కూడా వేతనం విడుదల చేయలేదని ఉత్తరాంధ్రకు చెందిన మరో బీఎల్వో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా గౌరవ వేతనం లేకుండా ఒక వ్యక్తికే వివిధ పనులు ఒకేసారి అప్పగిస్తే ఏవిధంగా పూర్తి చేయాలని నిలదీస్తున్నారు. -
12 పత్రాలే అంతిమం కాదు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్), 2026లో భాగంగా రాష్ట్రంలో నోటీసులు అందుకోనున్న వ్యక్తులు సమర్పించాల్సిన రుజువులకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల జాబితానే పరిమితం కాదు..రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇతర పత్రాలను సైతం రుజువుగా సమర్పించొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్రెడ్డి అన్నారు. సర్ కార్యక్రమానికి ముందస్తు సన్నద్ధతలో భాగంగా 2002, 2026 ఓటర్ల జాబితాలను అనుసంధానం (మ్యాపింగ్) చేయగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 89,88,175 మంది ఓటర్ల వివరాల్లో తార్కిక వ్యత్యాసాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. ‘సర్’షెడ్యూల్ ప్రకారం వ్యత్యాసాలు కలిగిన ఓటర్లందరికీ జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య స్థానిక ఎలక్టరోల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) నోటీసులు జారీ చేసి నిర్దేశిత తేదీకి విచారణకు పిలుస్తారన్నారు. సర్ కార్యక్రమ ఏర్పాట్లపై శనివారం తన కార్యాలయంలో సుదర్శన్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏఏ ధ్రువీకరణ పత్రాలను రుజువుగా స్వీకరిస్తారని విలేకరులు ప్రశ్నించగా, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఈఆర్వోలకు విచక్షణాధికారాలను కల్పించినట్టు వెల్లడించారు. 5 లక్షల డూప్లికేట్ ఓటర్ల తొలగింపు రాష్ట్రంలో 5 లక్షలకు పైగా డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించినట్టు సీఈఓ సుదర్శన్రెడ్డి తెలిపారు. ఒకే పేరు, ఇతర వివరాలతో వేర్వేరు చోట్లలో ఓటర్లు కలిగి ఉన్నట్టు ప్రత్యేక సాఫ్ట్వేర్తో ఈ ఓటర్లను గుర్తించామన్నారు. గడువు పొడిగింపు ఉండదు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 మధ్య బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికి తిరిగి ప్రతి ఓటరుకు సంబంధించిన పాక్షిక వివరాలతో ముద్రించిన ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని సుదర్శన్రెడ్డి అన్నారు. ఒక వేళ ఇంటికి తాళం వేసి ఉన్నా, మూడు నాలుగు పర్యాయాలు ఆ ఇంటికి వెళ్లి ఫారాలను పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తారన్నారు. ఫారాలను పూరించి వచ్చే నెల 24లోగా సమర్పిస్తే 31న ప్రచురించే ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు లభిస్తుందని స్పష్టం చేశారు. గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. గడువులోగా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించని వారి పేరు ముసాయిదా జాబితాలో గల్లంతు అవుతుందని, అలాంటి వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి మళ్లీ ఫారం–6 సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎన్యూమరేషన్ ఫారంతో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి అవసరం లేదన్నారు. 2002 ఓటర్ల జాబితా వివరాలు బీఎల్ఓల వద్ద ఉంటాయని, ఆ వివరాలను సైతం ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్లో ఆంగ్లంలోనే ఎన్యూమరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాషలో ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయనున్నామని సీఈఓ సుదర్శన్రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆంగ్ల భాషలో ముద్రించిన ఫారాలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. అత్యల్పంగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో 43.67 శాతం ఓటర్ల మ్యాపింగ్ జరగ్గా, ఆ తర్వాత హైదరాబాద్ 46.69 శాతం, రంగారెడ్డి జిల్లాలో 58.68 శాతం మ్యాపింగ్ మాత్రమే జరిగిందన్నారు. మిగిలిన జిల్లాల్లో 80 శాతం వరకు మ్యాపింగ్ పూర్తయిందన్నారు. విలేకరుల సమావేశంలో అదనపు సీఈఓ వాసం వెంకటేశ్వర్లు, జాయింట్ సీఈఓ ఎం.సత్యవతి, అదనపు కార్యదర్శి శంకర్, సహాయ కార్యదర్శి ఏఎస్ చారి, డిప్యూటీ కలెక్టర్ బి.చెన్నయ్య పాల్గొన్నారు. -
వివాహితలకు కష్టాలే 'సర్'..
సాక్షి, హైదరాబాద్: గతంలో భర్త పేరు.. ఇప్పుడు తండ్రి పేరును బంధువుగా ఓటర్ల జాబితాలో పేరు కలిగి ఉన్న మహిళలకు ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 కార్యక్రమంలో తలనొప్పులు తప్పేటట్టు లేదు. చివరిసారిగా రాష్ట్రంలో సర్ కార్యక్రమాన్ని 2002లో నిర్వహించగా, నాటి జాబితాతో ప్రస్తుత ఓటర్ల జాబితాను అనుసంధానం (మ్యాపింగ్) చేసి వ్యత్యాసాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా గుర్తిస్తోంది. 2002 ఓటర్ల జాబితాలో భర్త పేరును బంధువుగా కలిగి ఉండి ... ప్రస్తుత ఓటర్ల జాబితాలో తండ్రి పేరును బంధువుగా ఓటు కలిగి ఉంటే మ్యాపింగ్ ప్రక్రియలో తార్కిక వ్యత్యాసంగా గుర్తించి వారికి సైతం నోటీసులు జారీ చేయనున్నారు.2002 నాటి జాబితాలో తండ్రి పేరును బంధువుగా కలిగి ఉండి..ఆ తర్వాత పెళ్లి కావడంతో ప్రస్తుత జాబితాలో భర్త పేరు కలిగి ఉంటే ఇబ్బంది ఉండదు. కానీ, దీనికి భిన్నంగా భర్త పేరును తీసేసి తండ్రి పేరును బంధువుగా ప్రస్తుత జాబితాలో పేరును నమోదు చేసుకునే ఉంటే మాత్రం అలాంటి మహిళలు విచారణ హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా, ఇప్పటి వరకు 2,38,62,322 మంది (70.54శాతం) మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. ఇప్పటి వరకు మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో 89,88,175 (37.67) శాతం ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలున్నట్టు గుర్తించారు. వీరందరికీ ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ అధికారులు (ఈఆర్ఓ) నోటీసులు జారీ చేసి నిర్దేశిత తేదీకి విచారణకు పిలుస్తారు. ఈ 11 రకాల తార్కిక వ్యత్యాసాలు ఇలా ఉన్నాయి. » 2002 ఓటర్ల జాబితాలోని తల్లిదండ్రుల పేర్లతో అనుసంధానమైన తోబుట్టువుల మధ్య వయస్సులో తేడా 9 నెలల కంటే తక్కువ ఉండడం. » తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయస్సులో తేడా 15 ఏళ్ల కంటే తక్కువగా ఉండడం. » తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయస్సులో తేడా 50 ఏళ్లకు మించి ఉండడం. » 2002 ఓటర్ల జాబితాలోని నానమ్మ/తాతయ్య పేర్లతో మ్యాపింగ్ జరిగితే వారి మధ్య వయసులో 40 ఏళ్ల కంటే తక్కువ తేడా ఉండడం. » 2002 ఓటర్ల జాబితా, ప్రస్తుత ఓటర్ల జాబితాల్లో వేర్వేరు తల్లిదండ్రుల పేర్లు కలిగి ఉండడం. » 2002 జాబితా, ప్రస్తుత జాబితాల్లో వేర్వేరు బంధుత్వం పేర్లు కలిగి ఉండడం. ఒక జాబితాలో తండ్రి ఉంటే మరో జాబితాలో తల్లి పేరు కలిగి ఉండడం. » 2002 జాబితాలో భర్త పేరు, ప్రస్తుత జాబితాలో తండ్రి పేరును బంధువుగా ఓటు కలిగి ఉండడం. » 2002 జాబితా, ప్రస్తుత జాబితాల్లో వేర్వేరు తండ్రి పేరు కలిగి ఉండడం. » 2002 జాబితా, ప్రస్తుత ఓటర్ల జాబితాల్లోని ఓటరు వయస్సుల్లో తేడాలుండడం. »ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయకపోవడం » కేవలం ఆధార్ మాత్రమే కలిగి ఉండడం. -
సర్ ప్రక్రియలోకి టీడీపీ వైరస్లా చొరబడింది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్) లోపభూయిష్టంగా మారిందని, మై టీడీపీ యాప్ ద్వారా ఓట్ల చోరీకి అధికార పార్టీ మరోసారి ప్రయత్నిస్తోందని, సర్ ప్రక్రియలోకి టీడీపీ వైరస్లా చొరబడిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మై టీడీపీ యాప్లో ఎన్నికల కమిషన్ ప్రచురించిన దానికంటే స్పష్టంగా ఓటర్ల వివరాలు ఉన్నాయని అన్నారు.బీఎల్వో ప్రక్రియ పూర్తయిన తర్వాత వివరాలు ఫొటో తీసుకుని టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తున్నారని తెలిపారు. భారీ ఎత్తున దళితులు, మైనార్టీలు, పేదల ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈసీ వెంటనే అక్రమాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల కన్నుసన్నల్లో సాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను తాము అడ్డుకుని ప్రశ్నిస్తే పొరబాటు జరిగిందని చెప్తున్నారని తెలిపారు. ఇటీవల పశ్చిమ బెంగాల్, తమిళనాడు తరహాలోనే ఏపీలోనూ ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని చెప్పారు.అనంతపురంలో టీడీపీ ప్రణాళికాబద్ధమైన కుట్రఅనంతపురం జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో 20కి పైగా బూత్లను పరిశీలించగా.. చంద్రబాబు, ఆయన పార్టీ నేతల ఆదేశాలతో అధికారులు ముసుగులు తీసేసి మరీ ప్రత్యక్షంగా బరి తెగిస్తున్న విషయం వెల్లడైందన్నారు. టీడీపీ యాప్ ప్రభుత్వ అధికారులు పెట్టిన గ్రూప్స్లో వచ్చిందని, దానిని ప్రశ్నిస్తే పొరబాటున పెట్టామని చెప్పి తీసేశారని అన్నారు. బుధవారం శింగనమలలోని ఓ బూత్లో నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పంచాయతీ కార్యదర్శి సీట్లో కూర్చుని ఎస్ఐఆర్ ప్రక్రియలో దూరాడని, తాము అడ్డుకుంటే పొరపాటు అంటున్నారన్నారు. ఇది పొరబాటు కాదని, టీడీపీ ప్రణాళికాబద్ధమైన కుట్ర అని చెప్పారు. అక్కడికక్కడే ఫొటోలు తీయడం, కులం, మతం రాసుకుని వెళ్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఓటరుకు సంబంధించిన ప్రతి విషయం గోప్యంగా ఉండాలన్న విషయం తెలియదా అని అన్నారు. అధికారుల్ని బెదిరించి, ఎన్యుమరేషన్ ఫారంలు తీసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారన్నారు, ఎస్ఐఆర్ ఫారం నింపి ఇస్తే అది కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తుందా లేదా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తుందా అని జనానికి అనుమానాలు వస్తున్నాయన్నారు. ఎన్నికల సంఘం నుంచి మా ఫిర్యాదుపై తగిన సమాధానం రాకపోతే వైఎస్సార్సీపీ పోరాటాలకు సిద్ధంగా ఉందని చెప్పారు. -
తప్పుల తడకగా ఓటరు జాబితా
కడప కార్పొరేషన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ముసుగులో వైఎస్సార్సీపీ ఓట్లను గంపగుత్తగా తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం కడపలో విలేకరుల సమావేశంలో వారు ఎన్నికల కమిషన్ ఆన్లైన్లో ఉంచిన ఓటరు జాబితాలోని ఘోరాలను సాక్ష్యాధారాలతో సహా ఎండగట్టారు. తప్పులను సవరించకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అధికారులు అధికార పార్టీ తొత్తులుగా మారకుండా, పారదర్శకమైన ఓటరు జాబితాను తయారు చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ పాకా సురేష్, జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.నా డోర్ నంబరే లేదు: అంజద్ బాషాకడపలోని ఎస్ఎఫ్ఎస్ వీధిలో ఉన్న డోర్ నంబర్ 19/420 ఇంటిలో నేను 60 ఏళ్లుగా ఉంటున్నాను. నేను పుట్టింది, పెరిగింది, చదివింది ఇక్కడే. 30 ఏళ్లుగా ఇదే చిరునామాపై ఓటు హక్కు వినియోగించుకుంటున్నాను. 2005లో కార్పొరేటర్గా, 2014, 2019లో రెండు సార్లు శాసన సభ్యుడిగా గెలిచి డిప్యూటీ సీఎంగా సేవలు అందించాను. అలాంటి నా డోర్ నంబరే ఓటరు లిస్టులో లేదు. జాబితాలో 19/417 నుంచి 19/425 వరకు అసలు డోర్ నంబర్లే గల్లంతు చేశారు. మా లాంటి ప్రజాప్రతినిధుల ఇళ్లను, ఓట్లనే మాయం చేస్తే ఇక సామాన్య ఓటరు పరిస్థితేమిటి? ఒక్కో పోలింగ్ బూత్లో కనీసం 50 ప్రతిపక్ష ఓట్లను తగ్గించాలనే దుర్బుద్ధితోనే ఈ అస్తవ్యస్త జాబితాను తెచ్చారు. బీఎల్ఓలు దరఖాస్తు ఫారాలు ఇళ్ల వద్ద పడేసి వెళ్తున్నారే తప్ప వాటిని ఎలా నింపాలో ప్రజలకు చెప్పడంలేదు. తక్షణమే ఈ తప్పుల తడక జాబితాను సవరించకపోతే న్యాయపోరాటం చేస్తాం.2002లో ఎమ్మెల్యేగా ఉన్నా ప్రస్తుత ఓటరు జాబితాలో నా పేరు లేదు: శెట్టిపల్లె రఘురామిరెడ్డి2002లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అయినా ప్రస్తుత ఓటరు జాబితాలో నా పేరే లేకపోవడం ఆశ్చర్యకరం. నా స్వగ్రామమైన చాపాడు మండలం నక్కలదిన్నెలో 2002 ఓటరు లిస్టు ప్రకారం 1142 ఓట్లు ఉన్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. కానీ, ఆ జాబితాలో నా పేరు, నా కుటుంబ సభ్యుల పేర్లుగానీ, కనీసం మా గ్రామస్తుల పేర్లుగానీ ఎక్కడా లేవు. నక్కలదిన్నె లిస్టులో రాజుపాలెం గ్రామానికి చెందిన వారి పేర్లను చొప్పించి తారుమారు చేశారు.వైఎస్సార్సీపీకి మెజార్టీ వచ్చిన పోలింగ్ బూత్లను టార్గెట్ చేసి ఓటర్లను తగ్గించడమే వీరి లక్ష్యం. నక్కలదిన్నె గ్రామంలో 2014లో 6,200 ఓట్లు, 2019 నాటికి 8,400 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లన్నింటినీ అక్రమంగా ఏరివేసేందుకు టీడీపీ కుట్ర చేస్తోంది. అధికారులకు ఈ తప్పులు చూపిస్తున్నా పట్టించుకోవడం లేదు. దేశీ మద్యం విక్రయాలకు అనుమతి లేదు. » ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం విక్రయాలు ఉంటాయి. » విశాఖపట్నం, సూర్యలంక బీచ్ల్లో ఏర్పాటు చేసే బీచ్ బార్లకు మూడేళ్ల కాలపరిమితితో లైసెన్స్ మంజూరు చేస్తారు. ఈ ఏడాది సెపె్టంబరు 1 నుంచి 2029 ఆగస్టు 31 వరకు లైసెన్స్ గడువుగా నిర్ణయించారు. » లైసెన్స్ కోసం దరఖాస్తు చేసే వారు రూ.2 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతోపాటు రూ.10వేలు దరఖాస్తు రుసుం చెల్లించాలి. వార్షిక రీటైల్ ట్యాక్స్(ఆర్ఈటీ) మొదటి ఏడాది రూ.7.50లక్షలు చెల్లించాలి. ఆర్ఈటీ ఏటా 10శాతం పెంచుతారు. -
రాష్ట్రంలో 76.36% ఓట్లు మ్యాపింగ్
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో అత్యంత కీలకమైన మ్యాపింగ్ ప్రక్రియలో రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా మొదటి స్థానంలో నిలవగా, నెల్లూరు జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇంటింటి సర్వే ప్రారంభమయ్యే నాటికి 90 శాతం మ్యాపింగ్ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, 76.36 శాతం ఓట్లను మాత్రమే మ్యాపింగ్ చేయగలిగారు. 2024 ఓటర్ల జాబితాలో ఉన్న ఓట్లను 2002లో జరిగిన సర్ ఓటర్ల జాబితాతో సరిపోల్చడాన్ని మ్యాపింగ్ అంటారు. మ్యాపింగ్ అయిన ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంలు పూర్తి చేసి ఇస్తే చాలు.. ఆ ఓట్లన్నీ కొనసాగుతాయి. 2024 ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 4,16,27,694 మంది ఓటర్లు ఉంటే అందులో 76.36 శాతం ఓట్లు మ్యాపింగ్ అయ్యాయి. మ్యాపింగ్ కాని 98,39,351 ఓట్లే ఇప్పుడు కీలకం కానున్నాయి. మ్యాపింగ్ కాని ఓటర్లు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన 11 ధృవీకరణ పత్రాల్లో ఏదో ఒకటి ఇచ్చి ఓటరుగా నమోదు చేసుకోవాలి. అంతేకాదు మ్యాపింగ్ అయితే ఇంటింటి సర్వేలో ఎన్నికల సంఘమే ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసి ప్రింట్ కాపీతో ఓటరు ఇంటికి వస్తుంది. కేవలం దానిపైన సంతకం చేసి, ఈ మధ్యే తీసుకున్న ఒక ఫొటో ఇస్తే సరిపోతుంది. మ్యాపింగ్ కాకపోతే ఖాళీ ఎన్యూమరేషన్ ఫారాన్ని ఇస్తారు. దాంట్లో అన్ని వివరాలు పూర్తి చేసి ధృవీకరణ పత్రం ఇస్తే వాటిని పరిశీలించి మీరిచ్చిన వివరాలతో అధికారులు సంతృప్తి చెందితేనే ఓటు కొనసాగుతుంది. అందుకనే ఇప్పుడు మ్యాపింగ్ కాని 98.39 లక్షల ఓట్లపై రాజకీయపార్టీలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి.ఆ 86 నియోజకవర్గాలు కీలకం89.38 శాతం ఓట్లను మ్యాపింగ్ చేయడం ద్వారా అనకాపల్లి జిల్లా మొదటి స్థానంలో నిలిస్తే, 66.55 శాతం మ్యాపింగ్తో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. అదే నియోజకవర్గాల విషయానికి వస్తే అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం 94.58 శాతం మ్యాపింగ్తో మొదటి స్థానంలో నిలవగా, 94.50 శాతంతో కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రెండోస్థానంలో నిలిచింది. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో మొత్తం ఓట్లలో కేవలం 50.11 శాతం ఓట్లు మాత్రమే మ్యాపింగ్ అయ్యాయి. ఇక్కడ సగం ఓట్లు మ్యాపింగ్ కాకపోవడంతో సుమారు 1,40,836 మంది ఓటర్లు వారికి వారు ఓటరుగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 76.36 శాతం ఓట్లు మ్యాపింగ్ అయితే 86 నియోజకవర్గాల్లో ఈ సగటు కంటే తక్కువగా మ్యాపింగ్ జరిగింది. దీంతో ఓట్లు నిలబెట్టుకోవడంలో ఈ 86 నియోజకవర్గాలు అత్యంత కీలకం కానున్నాయి. తొమ్మిదికిపైగా నియోజకవర్గాలు 90 శాతం పైగా మ్యాపింగ్ పూర్తి కావడంతో అక్కడ ఓట్ల తొలగింపు సంఖ్య తక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
89 లక్షల మంది ఓటర్లకు నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 12న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను స్తంభింపజేసింది. ఆ సమయానికి రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా వారందరికీ పంపిణీ చేసేందుకు పేర్లు, ఇతర పాక్షిక వివరాలతో ‘సర్’ఎన్యూమరేషన్ ఫారాలను ప్రచురిస్తోంది. ఓటర్ల జాబితాను స్తంభింపజేశాక ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్లను నమోదు చేసే ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. రాష్ట్రంలో చివరిసారిగా 2002లో సర్ కార్యక్రమం నిర్వహించగా అప్పటి ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లతో ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేర్లను సర్–2026లో భాగంగా మ్యాపింగ్ చేస్తోంది. ప్రస్తుత ఓటర్లు 2002 జాబితాలో తమ పేరైనా లేక తల్లిదండ్రులు/నాయనమ్మ/తాతయ్యల పేర్లను అయినా కలిగి ఉంటేనే మ్యాపింగ్ జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 70.02 శాతం మంది ఓటర్ల మ్యాపింగ్ను ఇప్పటివరకు పూర్తి చేశారు. మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో ఏకంగా 89.55 లక్షల మంది ఓటర్ల పేర్లు/తల్లిదండ్రుల పేర్లు/బంధుత్వం/చిరునామా ఇతర వివరాల్లో తేడాలున్నట్లు ఎన్నికల సంఘం రూపొందించిన సాఫ్ట్వేర్ గుర్తించింది. సర్ కార్యక్రమంలో భాగంగా జూలై 31 నుంచి సెపె్టంబర్ 28 మధ్య వారికి స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) నోటిసులు జారీ చేసి వివరణ కోరనున్నారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఏకంగా 26.47 శాతం మందికి ఈసీ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయా అనుమానాల నివృత్తికి ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల పత్రాలను ఆధారాలుగా చూపాలని వారిని కోరే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 మధ్యలో వారితోపాటు రాష్ట్రంలోని ఓటర్లందరికీ రెండు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయనున్నారు. వాటిని నింపాక ఒక ప్రతిని వెనక్కి తీసుకోనున్నారు. స్థానిక బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికీ తిరిగి ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాతే మ్యాపింగ్లో వ్యత్యాసాలున్న గుర్తించిన ఓటర్లకు నోటీసులు జారీ చేసి నిర్దేశిత తేదీన విచారణకు హాజరు కావాలని కోరనున్నారు. ఆరుగురికన్నా ఎక్కువ సంతానమున్నా నోటీసులు... ‘సర్’నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపకల్పన చేసింది. ఓటర్ల వివరాల్లో ఎలాంటి తేడాలున్నా పట్టేసి అనామలీస్(అనుమానస్పద) ఓటర్ల జాబితాలో చేరుస్తోంది. 2002 జాబితాకు, ఇప్పటి జాబితాకు పేర్ల అక్షరాల్లో మార్పులు, బంధుత్వం పొరపాటుగా నమోదై ఉండటం (ఉదాహరణ తండ్రికి బదులు భర్త), తండ్రికి, బిడ్డకు మధ్య వయసులో అసాధారణ తేడాలుండటం (ఉదాహరణకు తండ్రి, కుమారుడికి మధ్య వయసు తేడా 15 ఏళ్ల కంటే తక్కువగా ఉండటం), ఒకే కుటుంబంలో ఆరుగురు కంటే ఎక్కువ మంది సంతానం ఉండటం, క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు తప్పుడు మ్యాపింగ్ చేయడం వంటి లోపాలను సాఫ్ట్వేర్ గుర్తిస్తోందని అధికారులు తెలిపారు. ఇలాంటి కారణాలతోనే రాష్ట్రంలో 89.55 లక్షల మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు, అనుమానాలున్నట్లు సాఫ్ట్వేర్ గుర్తించిందని అధికారులు తెలిపారు. మ్యాపింగ్ యథాతథంగా కొనసాగింపు... సర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఓటర్ల జాబితాను స్తంభింపజేసినా మ్యాపింగ్ ప్రక్రియ యథాతథంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 12 నాటికి ఓటర్లుగా నమోదై ఉన్న వారికే ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయనుండగా జాబితాలో పేరు లేని వారికి సైతం ఓటరుగా నమోదు చేసుకోవడానికి సర్ ప్రక్రియలో భాగంగా అవకాశం కల్పిస్తారు. 18 ఏళ్లు నిండి ఓటర్ల జాబితాలో పేరు లేని వారికి బీఎల్ఓలు ఫారం–6 దరఖాస్తుతోపాటు ఒక స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు. వాటిని నింపి తిరిగి బీఎల్ఓకు అందజేయాలి. జూలై 31 నుంచి ఆగస్టు 30 మధ్య దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం ప్రక్రియలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను ఈఆర్వోలు పరిశీలించి అర్హులకు తుది ‘సర్’ఓటర్ల జాబితాలో చోటుకల్పిస్తారు. -
నాతోపాటు కుటుంబ సభ్యుల ఓట్లు లేవు
మైదుకూరు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)కు ఆధారంగా చెబుతున్న 2002 ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని, దానిలో తనతోపాటు తన కుటుంబ సభ్యుల ఓట్లు లేవని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి చెప్పారు. ‘సర్’ పేరుతో వైఎస్సార్సీపీ అనుకూల ఓట్లను తొలగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ధ్వజమెత్తారు. రఘురామిరెడ్డి మంగళవారం వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను 2002 ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహిస్తున్నప్పుడు దానిని ఆన్లైన్లో ఎందుకు సక్రమంగా ఉంచలేదని ప్రశ్నించారు. ఇప్పుడు చూపిస్తున్న 2002 ఓటర్ల జాబితాలో మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు మండలంలో ఒక గ్రామానికి చెందిన ఓటర్ల జాబితాలో మరొక గ్రామానికి చెందిన వారి పేర్లు ఉన్నాయని తెలిపారు. తన సొంత గ్రామమైన నక్కలదిన్నె ఓటర్ల జాబితాలో స్థానిక ఓటర్ల పేర్లు లేవని చెప్పారు. తన ఓటుతో సహా తన కుటుంబ సభ్యుల ఓట్లు కూడా లేవని రఘురామిరెడ్డి వివరించారు. చిన్నగురువలూరు గ్రామంలో తన కుమారుడు, కోడలి ఓట్లను తొలగించారని మీడియాకు ఆధారాలు చూపారు. తిప్పిరెడ్డిపల్లె, అన్నవరం, పల్లవోలు గ్రామాల్లోనూ స్థానిక ఓటర్ల పేర్లు లేవని తెలిపారు.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సోమవారమే ప్రారంభం కాగా, ఇప్పటికే 80 శాతం మ్యాపింగ్ జరిగిందని అధికారులు చెబుతున్నారని రఘురామిరెడ్డి తెలిపారు. ఈ విధంగా తుది ఓటర్ల జాబితా వస్తే, అందులో అసలైన ఓటర్ల పేర్లు లేకపోతే ఏం చేయాలని ప్రశి్నంచారు. మైదుకూరు నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి (ఈఆర్వో)తో మాట్లాడేందుకు ప్రయతి్నస్తున్నా అందుబాటులో లేరని చెప్పారు. 2002 ఓటర్ల జాబితాను సరిదిద్దాలని, లేదంటే న్యాయం కోసం కోర్టుకు వెళతామని స్పష్టంచేశారు. -
ఓట్లు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)పై నియోజకవర్గాల్లోని కో–ఆర్డినేటర్లు, రీజనల్ ఇన్ఛార్జిలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సర్ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ప్రతిరోజూ సమీక్ష చేయాలని, ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకమని, సర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. సర్ ప్రక్రియపై చర్చిస్తూ.. ఈ ప్రక్రియలో ఒక్కసారి ఓటు తొలగించిన తర్వాత, దాన్ని తిరిగి చేర్పించాలంటే అత్యంత కష్టమవుతుందన్నారు. ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు, తన అధికార దుర్వినియోగంతో ఏదో రకంగా వైఎస్సార్సీపీకి చెందిన ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, బూత్కు కనీసంగా 50 ఓట్లు తొలగించాలని చూస్తున్నారని ఎత్తిచూపారు. గిమ్మిక్కులతో ఓట్లు తొలగించే తప్పుడు పనుల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని, వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు దీన్ని అడ్డుకోవాలని, ప్రతి ఓటునూ కాపాడుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సర్ ప్రక్రియపై ప్రతి అంశంలోనూ అప్రమత్తత, నిరంతర సమీక్షలు నిర్వహించాలని పార్టీ నేతలను ఆదేశించారు. -
‘సర్’లో టీడీపీ చొరబాటు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలోకి అధికార తెలుగుదేశం పార్టీ అక్రమంగా చొరబడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తూ.. టీడీపీ కేంద్ర కార్యాలయం స్థావరంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అడ్డదారులు తొక్కుతోంది. రాజకీయ ప్రత్యర్థి వైఎస్సార్ సీపీ ఓట్లను పెద్ద ఎత్తున తొలగించడమే లక్ష్యంగా ‘సర్’ పేరుతో టీడీపీ ఏకంగా ఒక యాప్ను రూపొందించింది. ఓటర్ల కులం ఏమిటి? ఏ రాజకీయ పార్టీ సానుభూతిపరుడు? అనే వ్యక్తిగత వివరాలను టీడీపీ బూత్ లెవల్ ఏజెంట్ల ద్వారా సేకరించి గోప్యతకు తూట్లు పొడుస్తూ ప్రత్యేక యాప్లో నిక్షిప్తం చేస్తోంది. టీడీపీకి చెందిన ప్రతీ బీఎల్ఏ కనీసం 50 ఓట్లను తొలగించాలని, ఇందుకోసం ఫారం–7 వాడాలని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో పెద్ద ఎత్తున ఓటర్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల అధికారుల వద్ద మాత్రమే ఉండాల్సిన ఓటర్ల జాబితా కలర్ జిరాక్స్లు, సాఫ్ట్ కాపీలు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ బీఎల్ఏల వాట్సాప్లో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓటర్ల జాబితాతో కూడిన ఫిజికల్ కాపీల కలర్ ప్రింటవుట్లతో టీడీపీ బీఎల్ఏలు ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ వ్యక్తిగత వివరాలను గుచ్చి గుచ్చి ఆరా తీస్తున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన బీఎల్వోలకు బ్లాక్ అండ్ వైట్ లిస్ట్ మాత్రమే ఇవ్వడం.. టీడీపీ ఏజెంట్లకు మాత్రం కలర్ ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను అందచేయడం అధికార దుర్వినియోగం కాక మరేమిటని రాజకీయ పరిశీలకులు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించాల్సిన ప్రక్రియలో అధికార పార్టీ తలదూర్చడం ఏమిటని నిలదీస్తున్నారు.టీడీపీ కార్యాలయంలో బీఎల్ఏలకు ప్రత్యేక శిక్షణప్రత్యేకంగా సిద్ధంచేసుకున్న యాప్ ద్వారా ప్రత్యర్థి పార్టీ ఓట్లను గుర్తించి వాటిని తొలగించే విధంగా పథకం టీడీపీ కేంద్ర కార్యాలయం పక్కా పథకాన్ని రచించింది. ‘సర్’లో భాగంగా సోమవారం నుంచి వచ్చేనెల 14వతేదీ వరకు జరిగే ఇంటింటి సర్వేలో పాల్గొనేందుకు అధికారులతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ)ను ఎన్నికల సంఘం అనుమతిస్తోంది. దీన్ని అదునుగా తీసుకుని వైఎస్సార్ సీపీ ఓట్లను తొలగించేందుకు ‘మై టీడీపీ పాస్పోర్టు’లో సర్ పేరుతో టీడీపీ ఒక యాప్ను రూపొందించింది. ఎన్నికల సంఘం వద్ద గోప్యంగా ఉంచాల్సిన ఓటర్ల జాబితా, కలర్ ఫోటోలతో కూడిన మాస్టర్ డేటాను సేకరించి టీడీపీ అధికార దుర్వినియోగానికి తెగబడింది. ఈ మాస్టర్ డేటాను బూత్లవారీగా ఓటర్ల కలర్ ఫోటోలతో యాప్లో అప్లోడ్ చేసి టీడీపీ బూత్ ఏజెంట్లకు అందచేసింది. అధికారులతో పాటు ఇంటింటి సర్వేలో పాల్గొన్న సమయంలో టీడీపీ ఏజెంట్లు ఈ డేటా ఆధారంగా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఓటరు బూత్ నంబర్, ఓటరు ఐడీతో పాటు మొబైల్ నంబర్, ఓటరు కులం, ఏ పార్టీ సానుభూతిపరుడనే వివరాలను ఇంటింటి సర్వే సమయంలో టీడీపీ బీఎల్ఏలు సేకరిస్తున్నారు. ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరవేసేలా బీఎల్ఏలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు సమాచారం.టీడీపీ రూపొందించిన యాప్లో ‘సర్’ విభాగం ఒక్కో టీడీపీ బీఎల్ఏ పరిధిలో 50 ఓట్ల తొలగింపే టార్గెట్ఇంటింటి సర్వేలో ఎవరైనా ఓటరు వైఎస్సార్సీపీ మద్దతుదారుడని తేలితే వారి ఓట్లను తొలగించేందుకు కుట్రకు తెరతీశారు.ప్రతీ బీఎల్ఏ కనీసం 50 ఓట్లను తొలగించడంతో పాటు టీడీపీకి చెందిన ఓట్లను చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఫారం–7 ఉపయోగించాల్సిందిగా ఆదేశించారు. ఒక్కో బీఎల్ఏ 50 వరకు ఫారం –7 దరఖాస్తులను బల్క్గా సమర్పించేందుకు అనుమతిస్తుండటంతో దీన్ని ఆసరాగా చేసుకుని వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే విధంగా వారికి టీడీపీ శిక్షణ ఇచ్చింది. దీనికి సహకరించే విధంగా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి బీఎల్వోలను లోబర్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.నాడు ‘సేవామిత్ర’ పేరుతో ఇదే రీతిలో.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా 2019లో తెలుగుదేశం పార్టీ ఇదే విధానాన్ని అనుసరించడం ద్వారా వైఎస్సార్ సీపీకి చెందిన 39 లక్షల ఓట్లను తొలగించింది. ఈవీఎంలను అపహరించిన వేమూరి హరిప్రసాద్తో పాటు లోకేశ్ సన్నిహితుడు కిలారు రాజేశ్ కలిసి 3.50 కోట్ల మంది ఓటర్ల మాస్టర్ డేటా జాబితాను దొంగిలించి ఈ మొత్తం డేటాను టీడీపీకి ‘సేవామిత్ర’ యాప్లో నిక్షిప్తం చేసినట్లు బహిర్గతమైంది. ఈ మాస్టర్ డేటాలోని ఓటర్ల వివరాలను ఒక్కో సేవా మిత్రకు, పార్టీ బూత్ కన్వీనర్కు సేవా మిత్ర యాప్లో అందుబాటులో ఉంచారు. వాటి ద్వారా ఓటర్ ఏ కులానికి చెందిన వారు? ఏ పార్టీ సానుభూతిపరుడు? ఓటరు ఏ ఊరిలో ఉంటున్నారు? అనే వివరాలను సేకరించి ఐటీ గ్రిడ్కు పంపించారు. ఈ సమాచారం ఆధారంగా ఆన్లైన్లో ఫారం 7 దాఖలు చేయడం ద్వారా వైఎస్సార్ సీపీ ఓట్లను తొలగించారు. ఈ కుట్రపై అప్పట్లో వైఎస్సార్ సీపీ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి తొలగించిన ఓట్లను తిరిగి చేర్చే విధంగా పోరాడింది. ‘సర్’లో కూడా అదే రీతిలో ఓట్లను తొలగించడానికి టీడీపీ కుట్రలు చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్కు ఫిర్యాదు చేశారు. -
మీ ఇంటికే వస్తున్నాం ‘సర్’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్)లో భాగంగా సోమవారం నుంచి ఇంటింటా సర్వే ప్రారంభం అవుతోంది. బీఎల్వో (బూత్ లెవెల్ ఆఫీసర్), రాజకీయ పార్టీలు నియమించుకున్న బీఎల్ఏ (బూత్ లెవెల్ ఏజెంట్)లతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాల్లో పేర్లను సరిచూస్తారు. రాష్ట్రంలో 2002లో చివరిసారిగా ఎస్ఐఆర్ (సర్) జరిగింది. తిరిగి 24 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే 13 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తికాగా.. మూడో దశలో 16 రాష్ట్రాల్లో జరగనుంది. ఏపీ,తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఈ విడతలోనే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే జరుగుతోంది. ఏపీకి చెందిన ఓటర్లలో కొందరు ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వలస వెళ్లడంతో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి జూన్ 15 నుంచి ఏపీలో జరిగే ఎస్ఐఆర్లో ఓటు హక్కును కాపాడుకునే బాధ్యత ఆయా ఓటర్లపైనే ఉంది. 3.75 కోట్ల ఓట్లు సేఫ్ ఎస్ఐఆర్లో అత్యంత కీలకమైనది ఓటర్ మ్యాపింగ్. 2002 ఎస్ఐఆర్ తర్వాత ప్రకటించిన తుది ఓటరు జాబితాతో 2024 ఓటర్ల జాబితాను మ్యాపింగ్ చేస్తున్నారు. 2024 ఓటరు జాబితాలో ఓటుహక్కు ఉన్నవారు 2002 ఓటర్ల జాబితాలో ఓటుహక్కు కలిగి ఉండటం లేదా వారి తల్లిదండ్రులు, సమీç³ బంధువుల ఓటు ఉంటే వాటితో మ్యాపింగ్ చేస్తారు. ఇలా మ్యాపింగ్ జరిగిన ఓట్లు కొనసాగుతాయి. జూన్ 14న మధ్యాహ్నంతో మ్యాపింగ్ను ముగించారు. జూన్ 13 సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 76% ఓటర్ల మ్యాపింగ్ జరిగిందని, ఇది 80% దాటుతుందని అంచనా వేసినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ‘సాక్షి’కి తెలిపారు. 2024 ఓటర్ల జాబితా ప్రకారం ఏపీలో 4,16,27,694 మంది ఓటర్లు ఉంటే.. అందులో ఇప్పటివరకు 3.75 కోట్ల మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. 42 లక్షల ఓట్లు మాత్రం మ్యాపింగ్ కాలేదు. జూన్ 15 నుంచి ఇంటింటా జరిగే సర్వేలో ఈ 42 లక్షల మంది సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తేనే తమ ఓటుహక్కును కాపాడుకోగలుగుతారు. మ్యాపింగ్ పూర్తయిన వారు ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికి రాష్ట్రంలో ఎన్నిసార్లు ఎన్నికల్లో పాల్గొన్నా.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా విధిగా ఎన్యుమరేషన్ ఫారం పూర్తిచేసి ఇవ్వాల్సిందే. ఆ ఫారాలు సకాలంలో ఇచ్చిన వారి ఓట్లు మాత్రమే కొనసాగుతాయి. ఎన్యుమరేషన్ ఫారం, ఫొటో తప్పనిసరి సర్ ప్రక్రియలో బీఎల్వో కీలకపాత్ర పోషించనున్నారు. ప్రతి పోలింగ్ బూత్కు ఒక బీఎల్వోను నియమించారు. ఏపీలో 46,397 మంది బీఎల్వోలున్నారు. మీ బీఎల్వో ఎవరన్నది సులభంగా తెలుసుకోవచ్చు. voters.eci.gov.in లేదా ఈసీఐనెట్ యాప్లో ‘నో యువర్ బీఎల్వో’ లేదా ‘బుక్ ఏ కాల్ విత్ బీఎల్వో’ ఆప్షన్ వినియోగించుకోవడం ద్వారా మీ బీఎల్వో పేరు, ఫోన్ నంబర్ తెలుసుకోవచ్చు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారు బీఎల్వోను సంప్రదించి ముందస్తుగా మీ ఇంటికి వచ్చే తేదీని తెలుసుకుంటే ఆ సమయానికి ఓటర్లు అక్కడ ఉండి ఓటును కాపాడుకోవచ్చు.ఇంటింటా సర్వే సమయంలో బీఎల్వో ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారం ఇస్తారు. మ్యాపింగ్ పూర్తయిన ఓటర్ వివరాలను ముద్రించిన ఎన్యుమరేషన్ ఫారం ఇస్తారు. దానిపై ఈ మధ్యనే తీయించుకున్న ఒక కలర్ ఫొటో అతికించి ఇస్తే సరిపోతుంది. మ్యాపింగ్ పూర్తికాని వారికి ఖాళీ ఎన్యుమరేషన్ ఫారం ఇస్తారు. ఆధార్, మొబైల్ నంబర్తో పాటు తల్లి/తండ్రి లేదా సమీప బంధువుల ఓటరు ఐడీ నంబర్లను అందులో పేర్కొనాలి. మ్యాపింగ్ కానివారు కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 11 ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి విధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చిన సమాచారంతో బీఎల్వో సంతృప్తి చెందితేనే మీ ఓటు కొనసాగుతుంది. 2002 ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో అన్నది https:// voters. eci. gov. in/ అనే వెబ్సైట్లో ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్’ అనే ఆప్షన్ను క్లిక్ చేసి చూసుకోవచ్చు. ముసాయిదా ఓటర్ల జాబితాయే కీలకం ఇంటింటా సర్వే పూర్తయిన తర్వాత జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఈ జాబితా ప్రతి బీఎల్వో దగ్గర ఉంటుంది. http:// www. ceoandhra. ap. gov. in/ నుంచి డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. ఈ జాబితాలో మీ ఓటు ఉందో లేదో ప్రతి ఒక్కరు విధిగా సరిచూసుకోవాలి. ఈ జాబితాలో మీ పేరు లేకపోతే వెంటనే అభ్యంతరం వ్యక్తం చేయండి. ఈ అభ్యంతరాలను ఆగస్టు 20లోపే స్వీకరిస్తారు. ఇలా వచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్ 18లోగా పరిష్కరించి సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. అభ్యంతరాలను వ్యక్తం చేయడానికి 3 రకాల ఫారాలు ఉంటాయి. జూలై 1లోగా మీకు 18 ఏళ్లు నిండినా.. కొత్తగా ఓటరుగా నమోదు కాకపోతే ఫారం–6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అలాగే చనిపోయిన లేదా వలస వెళ్లిన వారిని ఓట్లు ఉంటే వాటిని తొలగించడానికి ఫారం–7, జాబితాలో ఓటు లేకపోయినా.. వేరే చోటుకు ఓటు బదలాయించడానికి ఫారం–8ని ఉపయోగించాలి. ఈ తేదీలను గుర్తుంచుకోండి» జూన్ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్వోలు సర్వే కోసం ఇంటింటికీ వస్తారు » జూలై 21న ముసాయిదా జాబితా విడుదల » ఆగస్టు 20 వరకు అభ్యంతరాల స్వీకరణ » సెప్టెంబర్ 18లోగా అభ్యంతరాల పరిష్కారం » సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల » జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులు.మ్యాపింగ్ కానివారు వీటిలో ఏదో ఒక ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి1. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందిన ఉద్యోగి లేదా పెన్షన్ వంటి ఏదైనా గుర్తింపు కార్డు 2. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎల్ఐసీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు జారీ చేసిన గుర్తింపు కార్డులు లేదా ధ్రువీకరణ పత్రాలు 3. జనన ధ్రువీకరణ పత్రం 4. పాస్పోర్టు 5. విశ్వవిద్యాలయాలు లేదా సంబంధిత బోర్డులు జారీ చేసిన విద్యార్హత కార్డులు 6. సంబంధిత రాష్ట్రాలు జారీ చేసిన శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం 7. అటవీ హక్కులకు చెందిన పత్రం 8. సంబంధిత శాఖలు జారీ చేసిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు 9. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ 10. రాష్ట్ర, స్థానిక అథారిటీలు జారీ చేసిన ఫ్యామిలీ రిజిస్టర్ 11. ప్రభుత్వం జారీ చేసిన భూమి, గృహ కేటాయింపుల సర్టిఫికెట్ -
‘సర్’తో కొన్ని వర్గాల ఓట్లు తొలగించే కుట్ర
నెల్లూరు(అర్బన్): దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరుతో ఎన్నికల కమిషన్, మిలిటరీ దళాలను గుప్పెట్లో పెట్టుకుని కొన్ని వర్గాల ప్రజలకు ఓట్లు లేకుండా చేస్తున్నారని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ ఆరోపించారు. సర్ ప్రక్రియలో భాగంగా ఓట్లు తొలగించిన 20 మంది సుప్రీంకోర్టుకు వెళ్లి తాము బతికే ఉన్నామని చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. నెల్లూరులో ఆదివారం డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల ఆధ్వర్యంలో జెట్టి శేషారెడ్డి 18వ స్మారక రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘వికసిత్ భారత్– భ్రమలు, వాస్తవాలు’ అనే అంశంపై పరకాల మాట్లాడారు. ఇప్పటి వరకు సర్ ప్రక్రియ ద్వారా 6.5 కోట్ల మంది ఓట్లను తొలగించారని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో కూడా ఎన్నికల ముందు సర్ పేరుతో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారని తెలిపారు. రానున్న రోజుల్లో 16 కోట్ల మంది ఓట్లను తొలగిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి వాటిపై ప్రశ్నించకుండా ఉండేందుకు వికసిత్ భారత్ పేరుతో డ్రామాలాడుతూ కుల, మత, భాషాపరంగా ప్రజలను విభజన చేస్తున్నారని వివరించారు. ఇలాంటి దారుణాలను ఎదుర్కోవాలంటే ప్రజలు రోడ్ల మీదకు రావాలని, పోరాటాలు చేయాలని పరకాల పిలుపునిచ్చారు. స్కిల్ ఇండియా ఒక స్కామ్దేశంలో గడిచిన వందేళ్లలో లేనంతగా ప్రస్తుతం ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగిపోయాయని, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, కార్మికులు, కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పరకాల ప్రభాకర్ చెప్పారు. విద్య, వైద్యం, అక్షరాస్యత... ఇలా పలు రంగాల్లో అనేక చిన్న దేశాల కంటే భారత్ వెనుకబడి ఉందన్నారు. ఉత్పాదక రంగంలో 133వ స్థానానికి, ఆకలి సూచీలో 102 స్థానానికి మన దేశం దిగజారిపోయిందని తెలిపారు. అయినా భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిలో 5వ స్థానంలో ఉందని పాలకులు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దేశంలో ప్రధాన మంత్రి కౌసల్ యోజన (స్కిల్ ఇండియా) పెద్ద స్కామ్గా మారిపోయిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టం చేసిందని చెప్పారు. స్కిల్ ఇండియా ద్వారా శిక్షణ పొందినట్లు చెబుతున్న వారిలో 61 లక్షల మంది పేర్లు, ఊçర్లు లేవన్నారు. 12 వేల మంది మళ్లీ మళ్లీ శిక్షణలో పాల్గొంటున్నట్లు తేలిందన్నారు. శిక్షణ పొందిన 34 లక్షల మంది ఇళ్లకు వెళ్లి పరిశీలించగా, వారికి స్టైఫండ్ అందలేదన్నారు. కాగ్ నివేదిక ప్రకారం 95 శాతం బోగస్ అకౌంట్లు ఉన్నాయని, స్కిల్ ఇండియా పేరుతో డబ్బును దోచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. -
SIR ప్రక్రియపై అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: SIR ప్రక్రియపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సర్’ మ్యాపింగ్లో సమస్యలు ఉన్నాయని వ్యాఖ్యానించారు ఒవైసీ. ఈసీ కోరుతున్న 12 డాక్యుమెంట్స్లో తెలంగాణలో మూడు డాక్యుమెంట్స్ లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను ‘సర్’ పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అసదుద్దీన్ ఒవైసీ. కాగా, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడంతోపాటు నకిలీ ఓట్లను ఏరివేసే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం తలపెట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియ చివరి దశకు చేరింది. ఈనెల 25 నుంచి ఇంటింటి సర్వేతో సర్ ప్రక్రియ ఊపందుకోనుంది. ఇదే సమయంలో అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతుకాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని సర్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అప్పటి జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి స్థానిక బీఎల్వోను సంప్రదిస్తే సరిపోతుంది. ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ https://ceotelangana.nic.in లేదా https://voters.eci.gov.in పోర్టల్లోనూ వివరాలు తెలుసుకోవచ్చు. -
సర్ చట్టబద్ధమే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ అమలు చేస్తున్న ఓటరు జాబితా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ప్రక్రియ చట్టబద్ధమైన ప్రక్రియ అని స్పష్టం చేసింది. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ఇది జీవ నాడి వంటిదని వ్యాఖ్యానించింది. వివిధ రాష్ట్రాలు ముఖ్యంగా బిహార్, బెంగాల్లలో చేపట్టిన సర్పై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన ఈ తీర్పును ఎన్నికల కమిషన్ సాధించిన ఘన విజయంగా భావిస్తున్నారు. సర్ ప్రజాప్రాతినిధ్య చట్టం–1960లోని నిబంధనలకు ఏమాత్రం విరుద్ధం కాదని తేల్చిచెప్పింది. ప్రజాస్వామ్య ప్రక్రియ విశ్వసనీయత ఓటరు జాబితా కచ్చితత్వంపైనే ఆధారపడి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ ప్రక్రియను కేవలం పరిపాలనా పరమైన సౌలభ్యం కోసం చేపట్టినట్లుగా తాము నిర్థారించలేకపోతున్నామని తెలిపింది. ఎన్నికల కమిషన్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించిందనే వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం..ఎన్నికలను నిష్పక్షపాతంగా జరపాలన్న రాజ్యాంగం నిబంధనలకు సర్ ప్రాణం పోస్తుందని వ్యాఖ్యానించింది. అయితే, ఓటరు జాబితా సవరణ ద్వారా ఒక వ్యక్తి పౌరసత్వాన్ని అంతిమంగా నిర్ధారించే అధికారం మాత్రం ఈసీకి లేదని స్పష్టం చేసింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ తదితరుల పిటిషన్లపై జనవరిలో విచారణ ముగించిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు బుధవారం 124 పేజీల సవివర తీర్పు వెలువరించింది. జాబితా ప్రక్షాళన ఈసీ అధికారమే ఓటర్ల జాబితాలో ఒకసారి పేరు నమోదైన తర్వాత, దానిపై మళ్లీ కొత్తగా విచారణ జరిపి పేర్లను తొలగించే అధికారం ఎన్నికల సంఘానికి ఉండదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. జాబితా సవరణ పేరుతో ఈసీ చేపట్టిన తొలగింపులు నిబంధన 21ఏకు విరుద్ధమని వారన్నారు. అలాగే, ఓటరు నమోదు, ధ్రువీకరణలకు సంబంధించి పత్రాల పరిశీలన కోసం ఈసీ విధించిన నిబంధనలు ఏకపక్షంగా ఉన్నాయని, వీటి కారణంగా ఎందరో ఓటు హక్కును కోల్పోతున్నారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల సంఘం చర్యలను సమర్థించింది. ఓటరు జాబితాలో పేరు ఉండటం ఒక గుర్తింపే అయినప్పటికీ, దాన్ని మళ్లీ పరిశీలించకూడదన్న నియమం ఏదీ లేదని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియను, ఓటర్ల జాబితాను పారదర్శకంగా ఉంచేందుకు ఇలాంటి సవరణలు (ఎస్ఐఆర్) చేపట్టే పూర్తి అధికారం ఈసీకి ఉంటుందని వ్యాఖ్యానించింది. పత్రాల పరిశీలనకు ఈసీ విధించిన నిబంధనలు పరీక్షకు నిలబడతాయని, అవి పూర్తిగా సహేతుకమైనవేనని తెలిపింది. అయితే, ఒక వ్యక్తి పౌరసత్వంపై ఈసీ కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే చేయగలదని, పౌరసత్వాన్ని అంతిమంగా నిర్ధారించే అధికారం ఆ సంస్థకు లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈసీ తీసుకునే నిర్ణయం కేవలం ఎన్నికల ప్రయోజనాలకు మాత్రమే పరిమితం అవుతుందని, పౌరసత్వ చట్టం కింద సదరు వ్యక్తులు తమ హక్కులు కోల్పోయినట్లు భావించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనుమానిత కేసులన్నీ అథారిటీకేసర్లో ముందుగా ఈసీ నోటీసులిచ్చి, సంబంధిత వ్యక్తుల నుంచి వివరణ తీసుకునే విధానాన్ని పాటించినందున ఈ ప్రక్రియ చట్టబద్ధంగా అమలైందని ధర్మాసనం తుది తీర్పులో పేర్కొంది. అయితే, 2003 జాబితా నుంచి భారత పౌరులు కారు అనే కారణంతో తొలగింపునకు గురైన వారి కేసులన్నిటినీ నాలుగు వారాల్లోగా పౌరసత్వ చట్టం–1955 కింద ఏర్పాటు చేసిన ‘కాంపిటెంట్ అథారిటీ’కి తప్పనిసరిగా పంపాలని ఆదేశించింది. ఆ అథారిటీ చట్టబద్ధంగా విచారణ జరిపి వారు భారత పౌరులే అని తేల్చితే, ఆ పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని స్పష్టం చేసింది. మరణించినవారు, వలస వెళ్లిన వారు లేదా నకిలీలు అనే కారణాలతో పొరపాటున జాబితా నుంచి తొలగింపునకు గురైన వారు న్యాయ సమీక్ష ద్వారా ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం కూడా ఉందని ధర్మాసనం వివరించింది. పౌరసత్వానికి ఆధార్ ధ్రువీకరణ కాదుసర్ కోసం ఎన్నికల కమిషన్ అమలు చేసిన ధ్రువీకరణ పత్రాల విధానాన్ని ధర్మాసనం సమర్థించింది. ఎన్నికల సంఘం అనుమతిస్తున్న డాక్యుమెంటేషన్ ప్రమాణాలపై అభ్యంతరాలను ధర్మాసనం కొట్టివేసింది. ఓటర్ల జాబితాల తయారీ ఒక యాంత్రిక ప్రక్రియ కాదు, అదొక ప్రాథమిక రాజ్యాంగబద్ధమైన విధి అని తీర్పు నొక్కి చెప్పింది. నివాసం, అర్హత వంటి చట్టబద్ధమైన నిబంధనల నిర్ధారించే హక్కు ఈసీకి ఉందని పేర్కొంది. అదేవిధంగా, ఆధార్ పౌరసత్వానికి రుజువు కాదని కూడా తెలిపింది. 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) చట్టం ప్రకారం ఆ కార్డును పౌరసత్వానికి, స్థానికతకు నిరూపణగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఓటు హక్కుకు అవసరమైన చట్టబద్ధ అర్హతగా దీనిని పరిగణించకపోవడంలో ఈసీ నిర్ణయం సరైందేనని పేర్కొంది. ఒక వ్యక్తి గుర్తింపును ధ్రువీకరించే పరిమిత ప్రయోజనం కోసం మాత్రమే ఆధార్ను ఉపయోగించాలని తెలిపింది. ఓటర్ల ముమ్మర సర్వే కోసం నిర్దేశించిన పత్రాల జాబితా నుంచి రేషన్ కార్డులను మినహాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించింది. సర్ ప్రక్రియకు అనుగుణంగా రేషన్ కార్డుల స్థానంలో మరింత విశ్వసనీయమైన పత్రాలను కోరడం, కొన్ని రకాల పత్రాలను మార్చడం వంటి విచక్షణాధికారాలు ఈసీకి ఉన్నాయని తీర్పులో పేర్కొంది.తీర్పు ముఖ్యాంశాలు→ బిహార్లో చేపట్టిన సర్ ప్రక్రియ ప్రజా ప్రాతినిధ్య చట్టం–1960 నిబంధనలకు విరుద్ధంగా లేదు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిబంధనలకు భంగం కలిగించడం లేదు. → ప్రస్తుతం నిర్వహించిన సర్ ప్రక్రియ, చట్ట పరమైన అవసరాలకు అనుగుణంగానే ఉంది. సాధించాల్సిన లక్ష్యానికి అనుగుణంగానే ఈ చర్యలు ఉన్నాయి. ఇవి హేతుబద్ధమైనవి. ఏకపక్షంగా ఎవరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించకుండా నిరోధించడానికి తగు రక్షణ విధానాలు ఇందులో ఉన్నాయి. → ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడేందుకే కొన్ని రకాల పత్రాల వర్గీకరణ, కొన్ని వర్గాల పత్రాల మినహాయింపు స్పష్టమైన ప్రమాణాల ఆధారంగానే నిర్ణయించారు. → ఓటర్ల జాబితాలో చేర్చడానికి కావలసిన అర్హతను నిర్ధారించే క్రమంలో పౌరసత్వంపై పరిమితమైన విచారణ చేపట్టే అధికారం ఈసీకి ఉంది. అయితే, ఇటువంటి విచారణ పౌరసత్వాన్ని పూర్తిగా నిర్ధారించే ప్రక్రియ మాత్రం కాదు. → ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించిన వారు తమ ఫిర్యాదులను నాలుగు వారాల్లోగా పౌరసత్వ చట్టం పరిధిలోని సంబంధిత అథారిటీకి ఎన్నికల సంఘం రిఫర్ చేయాలి. → ఆయా కేసులపై సంబంధిత అథారిటీ చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలి. వీలైతే తదుపరి పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలలో ఏది ముందుగా జరిగితే దానికి ముందే నిర్ణయం ప్రకటించాలి. అలాగే, ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన వ్యక్తులకు ముందుగా నోటీసు ఇచ్చి, వారి వాదనలు వినడానికి తగిన అవకాశం కల్పించాలి. → ఒకవేళ సదరు అథారిటీ విచారణ తర్వాత తొలగింపునకు గురైన వారు భారత పౌరులేనని తేలితే వారి పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలి. ఎవరు ఓటేయాలో నిర్ణయించేది బీజేపీయే: యోగేందర్ యాదవ్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పిటిషనర్లలో ఒకరైన యోగేందర్ యాదవ్ స్పందించారు. తీర్పు తనకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు. ఇలాంటి తీర్పు వస్తుందని తాను ముందే ఊహించానన్నారు. అందుకే, తీర్పు సమయానికి తాను కోర్టుకు వెళ్లలేదని చెప్పారు. సర్ రాజ్యాంగబద్ధతను పరిశీలించడం వదిలేసి, ఫిర్యాదుల పరిష్కారం, మధ్యవర్తిత్వంపైనే న్యాయస్థానం దృష్టి సారించినప్పుడే తనకీ విషయం అర్థమైందని చెప్పారు. ఇకపై ఎవరు ఓటేయాలో, ఎవరు ఓటేయ కూడదో నిర్ణయించేది బీజేపీనంటూ ఆయన ఎక్స్లో వ్యాఖ్యానించారు. అసలు వాస్తవమేమంటే.. ఈ తీర్పు లక్షలాది మంది పౌరుల ఓటు హక్కును రద్దు చేయడానికి అనుమతి ఇవ్వడం. ఇప్పటివరకు కనీసం 5.9 కోట్ల మంది పౌరులు ఓటు హక్కు కోల్పోయారు. ఇది మున్ముందు 10 కోట్లకు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.సుప్రీం తీర్పుతో సమాధానాలకు మించి ప్రశ్నలు: కాంగ్రెస్ సర్కు రాజ్యాంగబద్ధతను కట్టబెడుతూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువ ఉత్పన్నమవుతున్నాయని కాంగ్రెస్ పేర్కొంది. ఈ తీర్పుతో తాము గౌరవప్రదంగా ఏకీభవించడం లేదని తెలిపింది. ‘సర్కు అనుమతి ప్రాథమికంగా ఒక చట్టబద్ధతను చేకూర్చవచ్చు. కానీ, దాని అమలులోని దురుద్దేశాన్ని ఎంతమాత్రం సరిదిద్దలేదు’అని పేర్కొంది. సర్ ప్రక్రియను ఈసీ అమలు చేసిన తీరుపై తాము లేవనెత్తిన అనేక ప్రశ్నలను న్యాయస్థానం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని తెలిపింది. పౌరసత్వంపై నిర్ణయం తీసుకునే హక్కు ఈసీకి లేదని ఈ తీర్పు స్పష్టం చేసినప్పటికీ ఈసీ ఇప్పటికే పౌరసత్వం ప్రాతిపదికన ప్రజలను ఓటర్ల జాబితా నుంచి మినహాయించడం పరస్పర విరుద్ధం కాదా? అని ప్రశ్నించింది. -
ఏంటి 'సర్'.. ఇంత 'స్లో'..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– సర్)కు ముందు చేపట్టిన ఓటర్ల మ్యాపింగ్ (ప్రీ సర్) ప్రక్రియ నగర ప్రాంతాల్లో ఆశించిన వేగంతో సాగడం లేదు. ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో తక్కువ శాతం మ్యాపింగ్ ఎన్నికల యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రత్యేకించి హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 42.82 శాతం మ్యాపింగ్ మాత్రమే జరగడం గమనార్హం. అయితే జిల్లాల్లోని గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఈ ప్రక్రియ గణనీయంగా ముందంజలో ఉంది. ఈ నెల 20వ తేదీ నాటికి రాష్ట్రంలోని 3.39 కోట్ల మంది ఓటర్లలో 2.23 కోట్ల మందిని (65.95 శాతం) మాత్రమే 2002 ‘సర్’జాబితాలతో మ్యాపింగ్ చేయగలిగారు. ఇంకా 1.15 కోట్లకు పైగా ఓటర్లు మ్యాపింగ్ కావాల్సి ఉంది. ఇందులో అర్బన్ ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. ముషీరాబాద్లో అత్యల్పం హైదరాబాద్ జిల్లాలో మొత్తం 47.10 లక్షల మంది ఓటర్లుండగా, ఇప్పటివరకు సుమారు 20.17 లక్షల మందిని మాత్రమే మ్యాప్ చేయగలిగారు. ఇంకా దాదాపు 26.92 లక్షల మంది ఓటర్ల మ్యాపింగ్ జరగాల్సి ఉంది. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 5 నియోజకవర్గాల్లో.. ముషీరాబాద్ (34.33 శాతం), నాంపల్లి (37.59 శాతం), జూబ్లీహిల్స్ (38.09 శాతం), సనత్నగర్ (39.80 శాతం), సికింద్రాబాద్ (40.12 శాతం)లో అత్యల్పంగా మ్యాపింగ్ జరిగింది. ఈ ప్రాంతాల్లో వలస జనాభా ఎక్కువగా ఉండటం, తరచూ చిరునామాలు మారడం, అద్దె ఇళ్లలో నివసించే వారు ఎక్కువగా ఉండటం, పాత కుటుంబ వివరాలు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు మ్యాపింగ్కు ప్రధాన అడ్డంకులుగా మారుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక మిగతా నియోజకవర్గాల విషయానికొస్తే..మలక్పేటలో 41.92 శాతం, అంబర్పేట్లో 41.40, ఖైరతాబాద్లో 46.30, కార్వాన్లో 50.64, గోషామహల్లో 42.45, చార్మినార్లో 47.68, చాంద్రాయణగుట్టలో 42.39, యాకుత్పురాలో 45.22, బహదూర్పురాలో 51.65, కంటోన్మెంట్లో 42.38 శాతం మ్యాపింగ్ జరిగింది. పాతబస్తీ పరిధిలోని బహదూర్పురా, కార్వాన్లలో అత్యధికంగా జరగడం విశేషం. మేడ్చల్లో మరీ దారుణం క్యూర్ పరిధిలో ఉన్న మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ మ్యాపింగ్ కేవలం 35.85 శాతం మాత్రమే నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 51.59 శాతం మ్యాపింగ్ నమోదైనా, రాష్ట్ర సగటుతో పోలిస్తే ఇది కూడా చాలా తక్కువే. ఐటీ ఉద్యోగులు, వలస జనాభా, కొత్తగా ఏర్పడిన కాలనీలు, అపార్ట్మెంట్ సంస్కృతి పెరగడం వల్ల కుటుంబ వారసత్వ ఓటరు వివరాలను గుర్తించడం కష్టమవుతోందని ఎన్నికల సిబ్బంది చెబుతున్నారు. గ్రామీణ జిల్లాలు ముందంజలో.. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో పరిస్థితి ఇలా ఉండగా, గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలున్న జిల్లాల్లో మాత్రం మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. జనగామ జిల్లా 91.07 శాతంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. మహబూబాబాద్ లో 90.83%, యాదాద్రి–భువనగిరిలో 86.32% మ్యాపింగ్ జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల స్థిర నివాసం, తరతరాలుగా ఒకే ప్రాంతంలో నివసించడం, కుటుంబ సభ్యుల వివరాలు సులభంగా అందుబాటులో ఉండటం వల్ల మ్యాపింగ్ సులభతరమయ్యింది. కుమురంభీమ్ ఆసిఫాబాద్లో దాదాపు 78 శాతం, మంచిర్యాల 71, ఆదిలాబాద్ 70, నిర్మల్ 78, నిజామాబాద్ 80, కామారెడ్డి 78, జగిత్యాల 76, పెద్దపల్లి 76, కరీంనగర్ 75, రాజన్న సిరిసిల్ల 77, సంగారెడ్డి 61, మెదక్ 82, సిద్దిపేట 85, రంగారెడ్డి 51, వికారాబాద్ 74, మేడ్చల్ మల్కాజిగిరి దాదాపు 36, హైదరాబాద్ 42, మహబూబ్నగర్ 74, నాగర్కర్నూల్ 75, వనపర్తి 80, జోగుళాంబ గద్వాల 77, నల్లగొండ 80, సూర్యాపేట 76, వరంగల్ 71, హనుమకొండ 69, జయశంకర్ భూపాలపల్లి 72, భద్రాద్రి 77, ఖమ్మం 70, ములుగు 81, నారాయణపేటలో 83 శాతం మ్యాపింగ్ జరిగింది. జూన్ 25 నుంచి ఇంటింటి ధ్రువీకరణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ¯25 నుంచి జూలై 24 వరకు ఈ ప్రక్రియకు కీలకమైన ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. అంటే బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓ) ప్రతి ఇంటికీ వెళ్లి ముందుగానే ముద్రించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేస్తారు. ఇందుకోసం ప్రతి ఓటరును కనీసం మూడుసార్లు సంప్రదించాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఓటర్లు స్వయంగా కూడా ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఫామ్స్ సమర్పించవచ్చు. నగరాల్లో సవాలే.. ఈ ప్రీ సర్ లేదా మ్యాపింగ్ ప్రక్రియ నగర ప్రాంతాల్లో మందకొడిగా సాగుతుండటం ఎన్నికల సంఘానికి సవాల్గా మారుతోంది. జూన్ 25 నుంచి కేవలం నెలరోజుల వ్యవధిలో జరిగే ఈ ప్రక్రియలో ఇంకా భారీ స్థాయిలో ధ్రువీకరణ జరగాల్సి ఉండటంతో, నగరాల్లో అదనపు సిబ్బంది, సాంకేతిక సహకారం అవసరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి హైదరాబాద్లో మ్యాపింగ్ ఐదారు నెలలుగా కొనసాగుతోంది. అయినా అంతంత మాత్రంగానే మ్యాపింగ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం నెల రోజుల్లో కీలక సర్వే ఎలా చేయగలుగుతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు మ్యాపింగ్ అంటే ఏమిటి? ప్రతి ఓటరును 2002 ప్రత్యేక సమగ్ర సవరణ జాబితాతో అనుసంధానం (లింకింగ్) చేయాల్సి ఉంది. ఓటరు సొంత నమోదు లేదా తల్లిదండ్రులు, అమ్మమ్మ, నాయనమ్మ, తాతల వివరాల ఆధారంగా ఈ లింకింగ్ జరుగుతుంది. ఈ కుటుంబ లింకింగ్ విజయవంతంగా పూర్తైతే అదనంగా పత్రాలేవీ సమర్పించాల్సిన అవసరం ఉండదు. లింక్ కాని ఓటర్లకు తర్వాతి దశలో నోటీసులు జారీ చేసి నిర్దిష్ట పత్రాలు సమర్పించాల్సిందిగా కోరే అవకాశం ఉందని సంబంధిత అధికారి తెలిపారు. -
ఓటర్ లిస్ట్పై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి: బొత్స
సాక్షి, విజయనగరం జిల్లా: పార్టీ కమిటీలను సమర్థవంతంగా నియమించాలని, వైఎస్సార్సీపీని సంస్థాగతంగా బలమైన నిర్మాణం చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఓటరు పేరు తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడాలి. పక్క రాష్ట్రాల్లో SIR వలన పార్టీలు ఓడిపోయాయి. అందువలన ఓటర్ లిస్ట్లపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి’’ అని సూచించారు.‘‘కొందామంటే ఎరువులు లేవు. అమ్ముదామంటే పంటలకు గిట్టుబాటు ధర లేదు. ప్రభుత్వం పేదల కోసం ఆలోచించడం లేదు. మాయ, మోసం, దగాతో మళ్లీ రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడైనా ఒక్క స్కూల్ కట్టారా? స్కూల్స్ ఓపెన్ అయితే పుస్తకాలు, యూనిఫామ్లు లేవు అంటున్నారు. ప్రభుత్వ సంస్థను మూసేసి ప్రైవేట్కి ఇచ్చేయాలనే తాపత్రయం తప్ప పాలన పై ధ్యాస లేదు.ఉత్తరాంద్ర ఎమ్మెల్యేకి వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చారు. ఏం ఉపయోగం. ఎరువులు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారు. యూరియా ఇవ్వలేని దిక్కుమాలిన దుస్థితి లో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో అన్ని శాఖలు పడుకున్నాయి. హోమ్ శాఖ మాత్రం తప్పుడు కేసులు పెట్టడానికి, ఇతరులను అవమానించడానికి పని చేస్తుంది’’ అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘సర్’కు.. 'ఆధారం' కాదు!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 ప్రక్రియలో భాగంగా పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం రుజువు చేసుకోవాలని నోటీసులు అందుకున్న ఓటర్లు ఆధార్ కార్డు సమర్పిస్తే సరిపోతుందా?.. ఏమాత్రం కాదంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. నోటీసులు అందుకున్న ఓటర్లు తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేయడానికి 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది. అందులో 12వ ధ్రువీకరణ పత్రంగా ఆధార్ కార్డును చేర్చినా దానిని కేవలం ఓటరు గుర్తింపు నిర్ధారణ కోసమే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. ‘ఓటరు గుర్తింపు ధ్రువీకరణ కోసమే ఆధార్ కార్డును స్వీకరించి వాడాలి, పౌరసత్వ ధ్రువీకరణ కోసం కాదు’... అని పేర్కొంటూ ఈసీ 2025 సెప్టెంబర్ 9న మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా ఆధార్ చట్టంలోని సెక్షన్ 9 సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని ఈ సందర్భంగా ఈసీ తెలిపింది. ఈ నేపథ్యంలో పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతంపై అనుమానాలతో నోటీసులు అందుకున్న ఓటర్లు అందుకు రుజువుగా ఆధార్ కార్డు సమర్పిస్తే సరిపోదని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ఈసీ నిర్దేశించిన తొలి 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వక తప్పదని స్పష్టం చేస్తున్నాయి. ఇబ్బందులు తప్పవా..?: నిరుపేదలు, నిరక్షరాస్యులు, మారుమూల ప్రాంతాల్లో నివసించే ఆదివాసుల వద్ద ఈ పత్రాలు ఉండే అవకాశాలు చాలా తక్కువే. విచారణ సమయంలో ఇలాంటి పౌరులు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడకతప్పదని తెలుస్తోంది. ‘సర్’తొలి విడత నిర్వహించిన బిహార్లో 47 లక్షలు, రెండో విడత జరిగిన మరో 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5.2 కోట్ల ఓటర్లను ఈసీ తొలగించింది. నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ(అడ్జుడికేషన్) దశలో ఈసీ నిర్దేశించిన పత్రాలను అందజేయకపోవడంతో తొలగించిన ఓటర్ల పేర్లే ఇందులో అధికంగా ఉన్నాయి. వీరికి నోటీసులు.. ముసాయిదా ఓటర్ల జాబితాలో స్థానం పొందినప్పటికీ సర్–2002 జాబితాతో మ్యాపింగ్ కాకపోయినా, ఒక వేళ మ్యాపింగ్ జరిగినప్పటికీ పేర్లు, ఇతర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నా.. వారిని జూలై 31 –సెప్టెంబర్ 28 మధ్య కాలంలో నోటీసులిచ్చి విచారణకు పిలుస్తారు. అప్పుడు ఈసీ నిర్దేశించిన 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతానికి రుజువుగా సమర్పించాల్సి ఉంటుంది. ఓటరు గుర్తింపు విషయంలో అనుమానాలున్న పక్షంలోనే ఆధార్ కార్డును రుజువుగా స్వీకరిస్తారు. సర్–2002 జాబితాలోని ఓటర్ల పేర్లు, ఇతర వివరాలతో పోల్చితే ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేర్లు, వివరాల్లో చిన్న చిన్న వ్యత్యాసాలున్నా సాఫ్ట్వేర్ గుర్తించనుంది. దీంతో ఆయా ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నారు. ఒక ఓటుకు ఇద్దరు, ముగ్గురి ధ్రువీకరణ పత్రాలు జెన్జీతో పాటు 1987 తర్వాత పుట్టిన మిలినియల్స్ ఓటర్లు తమ ఒక్కరి ఓటు హక్కును కాపాడుకోవడానికి ఇద్దరు లేదా ముగ్గు వ్యక్తులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించక తప్పదు. 1987 జూలై 1కి ముందు పుట్టిన ఓటర్లు తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అంటే వీరు ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. 2002 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లిదండ్రులిద్దరి పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. వీరు మొత్తం మగ్గురు వ్యక్తుల పుట్టిన తేదీ/ప్రాంతం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసులు అందితే ఈ కింది పత్రాల్లో ఏదో ఒకటి ఇవ్వాల్సిందే... 1. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి లేదా పెన్షనర్కు జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ 2. 01.07.1987కు ముందు ప్రభుత్వం/స్థానిక సంస్థలు/బ్యాంకులు/పోస్ట్ ఆఫీస్/ఎల్ఐసీ/ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జారీ చేసిన గుర్తింపు పత్రాలు 3. జనన ధ్రువీకరణ పత్రం 4. పాస్పోర్ట్ 5. గుర్తింపు పొందిన బోర్డులు/విశ్వవిద్యాలయాలు జారీ చేసిన విద్యా సర్టిఫికెట్లు 6. శాశ్వత నివాస సర్టిఫికెట్ 7. అడవి హక్కుల సర్టిఫికెట్ 8. ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ లేదా ఇతర కుల ధ్రువీకరణ పత్రం 9. జాతీయ పౌరుల రిజిస్టర్ (అందుబాటులో ఉన్న చోట్ల) 10. రాష్ట్ర/స్థానిక సంస్థలు తయారు చేసిన కుటుంబ రిజిస్టర్ 11. ప్రభుత్వం జారీ చేసిన భూమి/ఇంటి కేటాయింపు పత్రం 12. ఆధార్ కార్డు (కేవలం గుర్తింపు నిర్ధారణ కోసమే) -
‘ఎన్యూమరేషన్’ ఇస్తేనే ఓటు!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా విస్తృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్/సర్)–2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని బూత్ లెవల్ అధికారుల(బీఎల్ఓ)కు ఇవ్వని ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితాలో తొలగిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్రెడ్డి చెప్పారు. బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ప్రతి ఓటరుకు 2 ప్రతుల ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేస్తారని తెలిపారు. ఇళ్లకు తాళం వేసి ఉంటే బీఎల్ఓలు కనీస పర్యాయాలు ఆ ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం ఇస్తారని స్పష్టం చేశారు. ఓటర్లకు సంబంధించిన పాక్షిక సమాచారంతో ఈ ఫారాలను ముందే ముద్రిస్తారన్నారు. మిగిలిన సమాచారాన్ని ఓటర్లు పూరించి ఒక ఫారం ప్రతిని తిరిగి బీఎల్ఓలకు జూలై 24లోగా అందజేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ దశలో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ (https://voters.eci.gov. in) ద్వారా కూడా ఎన్యూమరేషన్ ఫారాన్ని భర్తీ చేసి సమర్పించవచ్చని తెలిపారు. త్వరలో రాష్ట్రంలో ప్రారంభం కానున్న ‘సర్–2026’ కార్యక్రమంపై శనివారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముసాయిదాలో ఈ ఓటర్ల తొలగింపు ‘అందుబాటులో లేని/ వలసవెళ్లిన/చనిపోయిన(అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్) ఓటర్లను ముసాయిదా జాబితాలో తొలగిస్తారు. ఆయా కారణాలతో ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేకపోయిన ఓటర్ల జాబితాలను స్థానిక పోలింగ్ బూత్ వద్ద ప్రదర్శిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,68,18,902 పురుష, 1,71,02,883 మహిళా, 2,879 ట్రాన్స్జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 3,39,24,664 మంది ఓటర్లున్నారు. వీరిలో 2,18,39,741 మంది (64.38శాతం) ఓటర్లను సర్–2002 జాబితా మేరకు మ్యాపింగ్ పూర్తి చేశాం. ముసాయిదాలో ఉన్నా మ్యాపింగ్ కాకపోతే కష్టమే ముసాయిదా ఓటర్ల జాబితాలో స్థానం పొందినప్పటికీ సర్–2002 జాబితాతో మ్యాపింగ్ కాలేకపోయినా, ఒక వేళ మ్యాపింగ్ జరిగినప్పటికీ పేర్లు, ఇతర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నా.. వారిని జూలై 31 –సెప్టెంబర్ 28 మధ్య కాలంలో నోటీసులిచ్చి విచారణకు పిలుస్తారు. ఇలా నోటీసులు అందుకునే ఓటర్ల జాబితాలను ఓటర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో)లు ప్రచురిస్తారు. ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం రుజువుగా విచారణ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్కార్డును ఓటరు గుర్తింపు నిర్థారణకు అనుమతిస్తారు..’అని సీఈఓ వివరించారు. వివరాల్లో వ్యత్యాసాలుంటే ఎదురయ్యే పరిస్థితులపై సీఈఓ ఒక ఉదాహరణ తెలిపారు. సర్–2002 ఓటర్ల జాబితాలో తన తండ్రి పేరు ‘నారాయణ’గా ఉండగా, ప్రస్తుత జాబితాలో ‘సి.నారాయణ’గా ఉండడంతో తాను సైతం విచారణకు హాజరై ‘మా నాన్న నారాయణే’అని రుజువులు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు/దరఖాస్తులను జూలై 31–ఆగస్టు 30 మధ్య స్వీకరించి పరిష్కరిస్తామని తెలిపారు. జూలై 31–సెప్టెంబర్ 28 మధ్య నోటీసుల జారీ/విచారణ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామన్నారు. పుట్టిన తేదీ/ప్రాంతం రుజువు చేసుకోవాల్సిందే.. నోటీసు అందుకున్న ఓటర్లు తమ/తల్లిదండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేయడానికి ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదానిని రుజువుగా ఈఆర్వోలు/ఏఈఆర్వోల వద్ద విచారణకు హాజరై సమర్పించాల్సి ఉంటుంది. – 1987 జూలై 1కి ముందు పుట్టిన ఓటర్లు తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. – 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. – 2002 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లిదండ్రులిద్దరి పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆధారంగా ఎన్నికల సంఘం నిర్దేశించిన పత్రాలు – కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి లేదా పెన్షనర్కు జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ – 01.07.1987కు ముందు ప్రభుత్వం/స్థానిక సంస్థలు/బ్యాంకులు/పోస్ట్ ఆఫీస్/ఎల్ఐసీ/ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జారీ చేసిన గుర్తింపు పత్రాలు – జనన ధ్రువీకరణ పత్రం – పాస్పోర్ట్ – గుర్తింపు పొందిన బోర్డులు/విశ్వవిద్యాలయాలు జారీ చేసిన విద్యా సర్టిఫికెట్లు – శాశ్వత నివాస సరి్టఫికెట్ – అడవి హక్కుల సర్టిఫికెట్ – ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ లేదా ఇతర కుల ధ్రువీకరణ పత్రం – జాతీయ పౌరుల రిజిస్టర్ (అందుబాటులో ఉన్న చోట్ల) – రాష్ట్ర/స్థానిక సంస్థలు తయారు చేసిన కుటుంబ రిజిస్టర్ – ప్రభుత్వం జారీ చేసిన భూమి/ఇంటి కేటాయింపు పత్రం – ఆధార్ కార్డు (09.09.2025 నాటి ఈసీ సూచనలు వర్తిస్తాయి) -
‘సర్’ సైరన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్/సర్) కార్యక్రమం చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ను ప్రకటించింది. తొలి విడతలో బిహార్, రెండో విడతలో మరో ఆరు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా మూడో విడత కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘సర్’ నిర్వహించనుంది. తెలంగాణలో 2026 అక్టోబర్ 1ని అర్హత తేదీగా పరిగణిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అంటే ఆ రోజుకు 18 ఏళ్లు నిండిన/నిండనున్న పౌరులందరూ ఓటర్లుగా నమోదు కావడానికి అర్హత కలిగి ఉంటారన్నమాట. ఇదీ షెడ్యూల్..: ఈసీ షెడ్యూల్ ప్రకారం..రాష్ట్రంలో వచ్చే జూన్ 15–24 మధ్యకాలంలో దరఖాస్తులు, మెటీరియల్ ముద్రణ, సిబ్బందికి శిక్షణ వంటి చర్యలు తీసుకుంటారు. జూన్ 25–జూలై 24 మధ్య బూత్ స్థాయి అధికారులు (బీఎస్ఓలు) ఇంటింటా తిరిగి ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. ఇందుకోసం ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారు. ఈ ప్రక్రియలో బీఎల్ఓలకు ఆయా రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏ) సహకరించాలని ఎన్నికల సంఘం సూచించింది. జూలై 31న ‘సర్’ ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలతో పాటు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. జూలై 31 నుంచి సెపె్టంబర్ 28 మధ్యకాలంలో ఈ దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించడంతో పాటు మ్యాపింగ్ సరిపోలని అనుమానిత ఓటర్లకు నోటీసులు జారీ చేసి ఈఆర్ఓ (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్)ల ఆధ్వర్యంలో విచారణకు పిలుస్తారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. రాష్ట్రంలో ఈ నెల 12 నాటికి 3,39,20,705 మంది ఓటర్లు ఉండగా, 35,985 మంది బీఎల్ఓలు, 25,886 మంది బీఎల్ఏలు ‘సర్’ ప్రక్రియలో పాల్గొననున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 60 శాతమే మ్యాపింగ్ పూర్తి! సాధారణంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఎస్ఆర్) పేరుతో ప్రతి ఏటా జనవరిలో కొత్త ఓటర్ల జాబితాను ప్రచురించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అనేక చోట్ల ఓట్లు ఉన్న వలస ఓటర్ల డూప్లికేట్ ఓట్లను, మరణించిన ఓటర్ల పేర్లను తొలగించడానికి ‘సర్’ను చేపట్టినట్టు ఎన్నికల సంఘం పేర్కొంటోంది. చివరిసారిగా 2002లో ఉమ్మడి ఏపీలో ‘సర్’ నిర్వహించగా, రెండు దశాబ్దాల విరామం తర్వాత ఈ ఏడాది మళ్లీ నిర్వహిస్తున్నారు. ‘సర్’ 2026 కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేర్లను.. ‘సర్’ 2002 జాబితాలోని వారి పేర్లు/ తల్లిదండ్రులు/తాత అమ్మమ్మల పేర్లతో మ్యాపింగ్ చేస్తున్నారు. అంటే ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉన్న వారిలో ఎవరెవరు .. 2002 జాబితాలో వారి పేర్లు గానీ వారి తల్లిదండ్రులు/తాత అమ్మమ్మల పేర్లు గానీ కలిగి ఉన్నారో గుర్తించి మ్యాపింగ్ చేస్తున్నారు. సర్ 2002 జాబితా ప్రకారం తెలంగాణలో నాడు మొత్తం 2.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కాగా ప్రస్తుత ఓటర్ల జాబితాలోని 60 శాతం మంది పేర్లను మాత్రమే ఇప్పటివరకు 2002 జాబితాతో మ్యాపింగ్ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా హైదరాబాద్ మహానగరంతో పాటు పట్టణ ప్రాంతాల్లో మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతి లేదు. మ్యాపింగ్ జరగని ఓటర్లకు ‘సర్’ 2026లో ఇబ్బందులు తప్పవు. సర్–2002 జాబితాను స్థానిక బీఎల్ఓలతో పాటు సీఈఓ కార్యాలయం వెబ్సైట్(https:// ceotelangana.nic.in)తో పాటు ఎన్నికల సంఘం వెబ్సైట్ (https:// voters.eci.gov.in)లో అందుబాటులో ఉంచారు. ప్రతి ఇంటికీ బీఎల్ఓలు సర్వేలో భాగంగా జూన్ 25–జూలై 24 మధ్య బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరుకు సంబంధించి ముందే ముద్రించిన ఎన్యూమరేషన్ ఫామ్ రెండు ప్రతులను అందజేస్తారు. ఆన్లైన్ నుంచి కూడా ఓటర్లు ఈ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. భర్తీ చేసిన ఒక ప్రతిని బీఎల్ఓలకు అందజేయాల్సి ఉంటుంది. మరో ప్రతిని స్వీకరణ రశీదుగా నమోదు చేసి ఓటరు వద్దే ఉంచుతారు. 2002 జాబితాలో తమ ఓటు ఉందా? లేక తమ తల్లిదండ్రులు/తాతఅమ్మమ్మల పేర్లు ఉన్నాయా ? వంటి వివరాలను ఈ ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో బీఎల్ఓలు ఓటర్లకు సహకరిస్తారు. ఎన్యూమరేషన్ దశలో ఓటర్లు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. గడువులోగా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించని ఓటర్లకు.. జూలై 31– ఆగస్టు 30 మధ్య అభ్యంతరాలు, దరఖాస్తుల సమయంలో మరో అవకాశం కల్పిస్తారు. వారు కొత్తగా ఓటరుగా నమోదు కోసం ఫామ్–6 దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. దీనితో పాటు నియోజకవర్గం లోపల/బయట నివాసం మారిన ఓటర్లు/ వివరాల దిద్దుబాటు/కొత్త ఎపిక్కార్డు/ దివ్యాంగ ఓటరుగా గుర్తింపు కోసం ఇదే సమయంలో (ఫారం–8) దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాపింగ్ జరగని ఓటర్లకు నోటీసులు పూర్తి వివరాలు ఇవ్వని ఓటర్లతో పాటు 2002 జాబితాలో పేర్లు లేని/సరిపోల్చలేని ఓటర్లకు జూలై 31 నుంచి సెపె్టంబర్ 28 మధ్యకాలంలో నోటీసులు జారీ చేసి నిర్దిష్ట తేదీన స్థానిక ఈఆర్వో)/ఏఈఆర్ఓల వద్ద విచారణకు పిలిపిస్తారు. అప్పుడు తమ అర్హతలను రుజువు చేసే ఆధారాలను సంబంధిత ఓటర్లు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం నిర్దేశించిన పత్రాల్లో ఏదో ఒకదానిని వారు ఆధారంగా సమర్పించాల్సి ఉంటుంది. కలెక్టర్, సీఈఓకు అప్పీల్ అవకాశం... విచారణలో ఈఆర్వోలు/ఏఈఆర్వోలు తీసుకున్న నిర్ణయంపై ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 24(ఏ) కింద జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చు. తొలి అప్పీల్లో కలెక్టర్ తీసుకున్న నిర్ణయంపై సెక్షన్ 24(బీ)తో పాటు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960లోని 27వ నిబంధన కింద రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ)కు రెండో అప్పీల్ చేయవచ్చు. -
తెలుగు రాష్ట్రాల్లో.. మూడో దశ ‘ఎస్ఐఆర్’కు ఈసీ ప్రకటన
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో.. మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనలో తెలుగు రాష్ట్రాలతో కలిపి దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించింది. ఫేజ్-3 ప్రక్రియ కోసం 3.94 లక్షలకుపైగా బూత్స్థాయి అధికారుల్ని నియమించింది.ఏపీలో జులై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఓటర్ల ముసాయిదా జాబితా.. ఏపీలో సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రకటించనుంది. అదే విధంగా తెలంగాణలో జులై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఓటర్లు ముసాయిదా.. తెలంగాలో అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనుంది. ఏపీలో ఎస్ఐఆర్ షెడ్యూల్46,397 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ నియామకం68,868 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్మే 12 నాటికి 4,16,16,061 మంది ఓటర్లుజూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటికి వెళ్లి ఓట్లు తనిఖీ చేయనున్న బిఎల్ఓలుజూన్ 14 పోలింగ్ కేంద్రాల రేషన్నలైజేషన్జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలజూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్, అభ్యంతరాల స్వీకరణజూలై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు క్లెయిమ్ అభ్యంతరాల పరిష్కారంసెప్టెంబర్ 22న ఓటర్ల తుది జాబితా విడుదలతెలంగాణలో ఎస్ఐఆర్ షెడ్యూల్35,985 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ నియామకం25,886 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్మే 12 నాటికి 3,39,20,705 కోట్ల మంది ఓటర్లు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఓట్లు తనిఖీ చేయనున్న బిఎల్ఓలుజూన్ 24 పోలింగ్ కేంద్రాల రేషన్నలైజేషన్జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలజూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్, అభ్యంతరాల స్వీకరణజూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు క్లెయిమ్ అభ్యంతరాల పరిష్కారంఅక్టోబర్ 1న ఓటర్ల తుది జాబితా విడుదలఈసీ అధికారిని కలవనున్న కాంగ్రెస్ నేతలుహైదరాబాద్: తెలంగాణ పీసీసీ ఛీఫ్, ఎమ్మెల్యేలు , ఎంపీలు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల అధికారిని కలవనున్నారు. త్వరలో తెలంగాణలో SIR పక్రియ చేపట్టనున్న నేపథ్యంలో తమకు ఉన్న అనుమానాలను తీర్చాలని ఎన్నికల అధికారిని కాంగ్రెస్ నేతలు కోరనున్నారు. -
ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టుకు మమత : షాకింగ్ రియాక్షన్
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు , ఓటర్ల జాబితా నుండి భారీగా పేర్ల తొలగింపుపై రేగిన వివాదం సోమవారం సుప్రీంకోర్టుకు చేరింది. ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా 90.8 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించడంపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యంతరం వ్యక్తం చేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్ల పరిష్కారంపై సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.2021లో తమ పార్టీ గెలుచుకుని, ఇపుడు (2026 అసెంబ్లీ ఎన్నికల్లో) బీజేపీకి ఖాతాలో చేరిన 31 స్థానాల్లో ఈ తొలగింపు వల్ల ఓట్ల లెక్కింపుపై తీవ్ర ప్రభావం పడిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ 31 స్థానాల్లో ప్రతి దానిలోనూ తొలగించిన ఓటర్ల సంఖ్య, గత ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థుల గెలుపు మార్జిన్ కంటే ఎక్కువగా ఉందని పార్టీ ఎంపీ, సీనియర్ న్యాయవాది ల్ కళ్యాణ్ బెనర్జీ ఎత్తి చూపారు. చాలా సందర్భాల్లో ఈ సంఖ్యలు దాదాపు ఒకేలా ఉన్నాయని కోర్టుకు వివరించారు. ఉదాహరణకు, ఒకచోట టీఎంసీ అభ్యర్థి 862 ఓట్లతో ఓడిపోగా, అక్కడ 5,000 మంది పేర్లను తొలగించారని పేర్కొన్నారు.ఓటర్ల జాబితా నుండి తొలగింపుపై అప్పీళ్లు పెండింగ్లో ఉన్న సమయంలో, తక్కువ మెజారిటీతో ఫలితాలు ప్రభావితమై ఉంటే.. బాధితులు 'ఎలక్షన్ పిటిషన్' దాఖలు చేయవచ్చని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలను గెలుచుకుని బెంగాల్లో తొలిసారి అధికారాన్ని దక్కించుకుంది. ఘుస్పైథియా' లేదా అక్రమ చొరబాటుదారులు అంశాన్ని బీజేపీ ప్రచారాస్త్రంగా మార్చుకోగా, అట్టడుగు వర్గాల ఓట్లను తొలగించడానికి బీజేపీ, ఈసీ కుమ్మక్కయ్యాయని మమతా బెనర్జీ ప్రభుత్వం ఆరోపించింది.ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడనుఈ పిటిషన్ల పరిష్కారంపై ప్రస్తుత రేటు ప్రకారం, పెండింగ్లో ఉన్న లక్షలాది దరఖాస్తులను పరిష్కరించడానికి మరో నాలుగేళ్లు పట్టే అవకాశం ఉందని న్యాయవాది మేనకా గురుస్వామి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. టీఎంసీ , బీజేపీ మధ్య ఓట్ల తేడా సుమారు 32 లక్షలు కాగా, ఓటర్ల జాబితా నుండి తొలగించినందుకు వ్యతిరేకంగా దాఖలైన 35 లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నారు.ఇదీ చదవండి: అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్, స్పెషల్ ఏంటంటే?ఎన్నికల సంఘం (EC) వాదనఅయితే ఓటర్ల తొలగింపు వల్ల టీఎంసీ నష్టపోయిందన్న వాదనను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఈ ఐదు స్థానాలనూ తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుందని ఈసీ వాదించింది.అత్యధికంగా ఓటర్ల తొలగింపు జరిగిన మాల్దా, ముర్షిదాబాద్ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో (సుజాపూర్, రఘునాథ్గంజ్ వంటివి) టీఎంసీయే విజయం సాధించిందని ఈసీ గణాంకాలతో వివరించింది. కాగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలోని 294 స్థానాలకు గాను బీజేపీ 207 స్థానాలను గెలుచుకుంది. దాదాపు 15 ఏళ్ల మమతా బెనర్జీకోటను దెబ్బ కొట్టి, ఘన విజయాన్ని నమోదు చేసింది. బెంగాల్లో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా? -
‘ఓటర్ల జాబితా సవరణపై అందరూ అప్రమత్తంగా ఉండాలి’
తాడేపల్లి : ఓటర్ల జాబితా సవరణపై అందరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ శ్రేణులకు సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 30వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ ఐటీ, సోషల్ మీడియా, బూత్ కమిటీల అధ్యక్షులు, పలు జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు సంబంధించి బూత్ కమిటీలు కీలకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ‘ పార్టీ ఓట్ల అక్రమ తొలగింపును అడ్డుకోవాలి. S.I.R పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలను అడ్డుకోవాలి. మోసం చేయడంలో కూటమి నేతలు సిద్ధహస్తులు. 2019 ఎన్నికలకు ముందు మన పార్టీ వారి ఓట్లు 40 నుంచి 45 లక్షలు తొలగించారు. ఆ సమయంలో ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. 2002 నాటి ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని ఓటర్ల జాబితా సవరణ జరుగుతోంది. అప్పటి నుంచి రాష్ట్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. 1984 తర్వాత పుట్టి ఓటర్ల జాబితాలో ఉన్నవారు తిరిగి మళ్ళీ తమను తాము నిరూపించుకుంటేనే ఓటర్ల తుది జాబితాలో ఉంటారు. ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. తమిళనాడులో ఏకంగా 97 లక్షల ఓటర్లను తొలగించారు. మన దగ్గర SIR ప్రారంభానికి ముందే అవసరమైన డేటా మొత్తం సిద్ధం చేసుకోవాలి. జోన్ల వారీగా చురుకైన కార్యకర్తలను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీమ్లను సిద్ధం చేయాలి. S.I.R కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేద్దాం’ అని సజ్జల పేర్కొన్నారు. -
కమలానికి ‘వంద’ కష్టాలు: షా వ్యూహం రివర్స్?
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంటున్న తరుణంలో రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన ప్రశ్న చక్కర్లు కొడుతోంది. 2021లో 77 సీట్లు సాధించిన బీజేపీ, ఈసారి కనీసం 100 సీట్ల మార్కును కూడా దాటలేకపోతే ఆ పార్టీ పరిస్థితి ఏమిటి? బెంగాల్ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక ఘట్టంలో ఓటర్ల జాబితా సవరణ (SIR) పేరిట జరిగిన వ్యూహాలు, నాయకత్వ లేమి బీజేపీకి అడ్డంకిగా మారనున్నాయని విశ్లేషకులు అంటున్నారు.చరిత్ర చెప్పిన చేదు నిజంబెంగాల్ రాజకీయ చరిత్రను నిశితంగా గమనిస్తే, ఏ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా ఇంతవరకు 100 సీట్ల మార్కును దాటలేకపోయింది. అధికార పార్టీకి ఎప్పుడూ అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీ దక్కుతూ వస్తోంది. అంతేకాకుండా 1977 నుంచి జరిగిన పరిణామాలను పరిశీలిస్తే, అధికార పార్టీలను ఏ ఒక్క పార్టీ ఒంటరిగా గద్దె దించలేదు. 1977లో కాంగ్రెస్ను లెఫ్ట్ ఫ్రంట్ ఓడించగా, 34 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనను తృణమూల్-కాంగ్రెస్ కూటమి అంతం చేయడం ఈ చారిత్రక వాస్తవాలకు నిదర్శనం.లోక్సభ ఫలితాలే అసెంబ్లీకి పునాదిబెంగాల్లో మరో విచిత్రమైన రాజకీయ సంప్రదాయం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన ప్రతిపక్ష కూటములు, అంతకు ముందు జరిగిన లోక్సభ ఎన్నికల్లో అగ్రస్థానంలో నిలిచాయి. 1977లో కమ్యూనిస్టులు, 2009లో తృణమూల్ కాంగ్రెస్ కూటమి లోక్సభలో సత్తా చాటిన తర్వాతే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాయి. కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వమే ప్రజల రోజువారీ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపుతుందనేది ఇక్కడి ఓటర్ల నమ్మకం. కానీ బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ (29 సీట్లు) చేతిలో ఓడిపోయి కేవలం 12 సీట్లకే పరిమితమైంది. ఈ ఫలితం కమలనాథులకు ఒక అతిపెద్ద ప్రతికూలాంశం.ఓటర్ల జాబితా సవరణ.. ఒక వ్యూహాత్మక అస్త్రం?పదేళ్ల పాటు మతపరమైన ధ్రువీకరణ, తృణమూల్ నేతలపై అవినీతి ఆరోపణలు చేసినప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో హిందూ ఓట్లను ఆకర్షించలేకపోయింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉన్న 48 శాతం ఓటు బ్యాంకును దెబ్బతీయడానికే ఎన్నికల సంఘం ద్వారా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) అనే భారీ ప్రక్రియను బీజేపీ తెరపైకి తెచ్చిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మమతకు మద్దతుగా నిలిచే ముస్లింలు, మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రక్రియను ప్రయోగించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.బలమైన స్థానిక నాయకత్వ లేమిబెంగాల్లో బీజేపీ ఓటు బ్యాంకు విస్తరణకు ప్రధాన ఆటంకం ప్రజాకర్షణ కలిగిన బలమైన స్థానిక నాయకుడు లేకపోవడం. జ్యోతి బసు రెండు దశాబ్దాల పోరాటం తర్వాత సీఎం కాగా, మమతా బెనర్జీ కూడా 90ల నుంచి విపక్షంలో ఉంటూ, సుదీర్ఘ పోరాటం చేసి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ప్రస్తుతం బీజేపీ ప్రధాన ముఖచిత్రంగా ఉన్న సువేందు అధికారి, 2020 వరకు మమత వెంటే ఉండి పార్టీ మారిన నాయకుడు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలిగే స్థాయిలో ఆయనకు ప్రజాదరణ లేకపోవడం బీజేపీకి అతిపెద్ద లోపం.వామపక్ష, కాంగ్రెస్ ఓటర్ల వలసలు2011లో కేవలం 4 శాతంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు, 2021 నాటికి 38 శాతానికి పెరగడం వెనుక వామపక్ష, కాంగ్రెస్ ఓటర్ల వలసలే ప్రధాన కారణం. 2018 నాటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తృణమూల్ సృష్టించిన తీవ్ర హింస (34.2% సీట్లు ఏకగ్రీవం) నుండి రక్షణ పొందేందుకు ఆ ఓటర్లు బీజేపీని ఒక సురక్షిత ఆశ్రయంగా భావించారు. అయితే, ఆ తర్వాత మమతా బెనర్జీ తన శ్రేణులను నియంత్రించడం, సంక్షేమ పథకాలను మరింత విస్తరించడంతో బీజేపీ వైపు ఓటర్ల వలసలు నెమ్మదించాయి.బెడిసికొట్టిన వ్యూహం.. ప్రత్యామ్నాయాల వేటబీజేపీ ప్రయోగించిన ‘సర్’ వ్యూహం బెడిసికొట్టి, ముస్లింలతో పాటు మతువా, రాజ్బన్షీ వంటి అణగారిన వర్గాలు, బెంగాలీయేతర వలసదారులు, సవర్ణ హిందువుల ఓట్లను కూడా గల్లంతు చేసిందనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లు సాధించడంలో విఫలమైతే, తృణమూల్కు ప్రత్యామ్నాయంగా ఓటర్లు మళ్లీ కాంగ్రెస్ లేదా వామపక్షాల వైపు చూసే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: ఢిల్లీలో ‘ఆప్’ క్లీన్ స్వీప్.. రాజ్యసభలో బీజేపీ రికార్డ్! -
పోటెత్తిన ఓటింగ్
కోల్కతా/చెన్నై: ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యానికి సంకేతంగా పశ్చిమ బెంగాల్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో, ఒకే విడతలో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. గురువారం 152 స్థానాలకు జరిగిన బెంగాల్ ఎన్నికల్లో 92.72 శాతం, మొత్తం 234 స్థానాలకు జరిగిన తమిళనాడు ఎన్నికల్లో 85.14 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం. రెండు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే ద్వారా అర్హత లేని లక్షలాది ఓట్లను తొలగించిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో ఓటింగ్ నమోదవడం గమనార్హం. శుక్రవారం ఉదయం కల్లా తుది గణాంకాలు రావొచ్చు. బెంగాల్లో అక్కడక్కడా హింసాకాండ చోటుచేసుకోవడం మినహా తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కనిష్ట స్థాయిలో హింస జరగడం బెంగాల్ ఎన్నిక చరిత్రలో ఇదే మొదటిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. తమిళనాడులోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో ఎన్నికల సంఘం ఊపిరి పీల్చుకుంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకోవడానికి, దేశ పౌరులుగా తమ విధిని నిర్వర్తించడానికి ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి ఉత్సాహంగా ఓటువేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సమయం ముగిసినా పోలింగ్ కేంద్రాల ఎదుట రద్దీ తగ్గలేదు. వరుసలో నిల్చున్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్వాతంత్య్రం తర్వాత అత్యధిక ఓటింగ్ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ నెల 9న జరిగిన అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లోనూ మునుపెన్నడూ లేని రీతిలో అత్యధిక ఓటింగ్ నమోదైంది. అస్సాంలో 85.38 శాతం, పుదుచ్చేరిలో 89.83 శాతం నమోదయ్యింది. బెంగాల్, తమిళనాడులో ఇప్పటిదాకా 2011 నాటి ఎన్నికల ఓటింగే అత్యధికం. అప్పట్లో బెంగాల్లో 84.72 శాతం, తమిళనాడులో 78.29 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ రికార్డును ఈసారి ఓటర్లు తిరగరాశారు. రెండు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటింగ్లో పాల్గొన్నారు. తమిళనాడులో పురుషులు 83.57 శాతం మంది ఓటువేయగా, మహిళలు 85.76 శాతం మంది ఓటువేశారు. బెంగాల్లో పురుషులు 90.92 శాతం, మహిళలు 92.69 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్లో సరికొత్త రికార్డు సృష్టించిన రెండు రాష్ట్రాల ఓటర్లకు సెల్యూట్ చేస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అన్నారు. బెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా 91 లక్షల ఓట్లను తొలగించారు. ఈ నేపథ్యంలో అర్హులైన ఓటర్లలో 91.78 శాతం మంది ఓటు వేశారు.పశ్చిమ బెంగాల్లో స్వల్ప హింస బెంగాల్లో తొలి విడత ఎన్నికల సందర్భంగా హింసాకాండ చోటుచేసుకుంది. అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఉద్రిక్తత పరిస్థితులను సైతం లెక్కచేయకుండా జనం భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. హింసాత్మక ఘటనలు ఓటర్ల ఉత్సాహాన్ని తగ్గించలేకపోయాయి. 2021లో 82.30 శాతం ఓటింగ్ నమోదు కాగా, గురువారం 92 శాతం దాటేసింది. బెంగాల్ ప్రజలు తమ హక్కులను కోల్పోకుండా ఉండేందుకే అధిక సంఖ్యలో ఓటు వేశారని టీఎంసీ పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఓటు వేయకపోతే పౌరులుగా తమ హక్కులను, పౌరసత్వాన్ని కోల్పోతామని ప్రజలు ఆందోళనకు గురయ్యారని, అందుకే ఆ ప్రమాదం తలెత్తకుండా అధిక సంఖ్యలో పాల్గొన్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీర్భూమ్లోని ఖరిసోల్లో ఈవీఎంలలో టీఎంసీకి వేసిన ఓట్లను బీజేపీకి అనుకూలంగా నమోదు చేస్తున్నారని అధికార పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. దాంతో అధికారులు పోలింగ్ను తాత్కాలిక నిలిపివేశారు. స్థానికులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు రాళ్లతో దాడికి దిగారు. పారామిలిటరీ బలగాలు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. దక్షిణ దినాజ్పూర్లోని కుమార్గంజ్లో బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్పై దాడి జరిగిందని, అసన్సోల్ దక్షిణ నియోజకవర్గంలోని రహమత్ నగర్ సమీపంలో బీజేపీ ఎమ్మెల్యే అగి్నమిత్ర పాల్ కారుపై రాళ్లతో దాడి చేసి వెనుక కిటికీని పగలగొట్టారని ఆరోపణలు వచ్చాయి. నవోడాలో ఏజేయూపీ నాయకుడు హుమాయున్ కబీర్ కాన్వాయ్పై కొందరు రాళ్లు విసిరారు. దీంతో అతడి మద్దతుదారులకు, ప్రత్యర్థులకు మధ్య ఘర్షణచోటుచేసుకుంది. లాభ్పూర్, చంచల్. మురారైలలో హింసాత్మక, బెదిరింపు ఘటనలు జరిగాయి. వేర్వేరు పారీ్టల కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. డోమ్కల్లో ఓటర్లు పోలింగ్ బూత్ల వద్దకు చేరుకోకుండా కొందరు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. మొత్తం పోలింగ్ ప్రక్రియ చాలావరకు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి వందలాది ఫిర్యాదులు అందినట్లు తెలియజేసింది. జిల్లాల వారీగా చూస్తే ముర్షిదాబాద్, బంకూర, కూచ్ బెహార్లో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదయ్యింది. అత్యల్పంగా కలింపాంగ్లో 81 శాతం నమోదయ్యింది. బెంగాల్ ఎన్నికలు అంటేనే హింసాకాండకు మారుపేరుగా చెబుతుంటారు. ఈసారి అలాంటి పరిస్థితి లేకపోవడం విశ్లేషకులను ఆశ్చర్యపర్చింది. రాష్ట్రంలో మిగిలిన 142 స్థానాలకు ఈ నెల 29న రెండో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. తమిళనాడులో అంతా ప్రశాంతం అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకే, కొత్తగా రంగప్రవేశం దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే మధ్య జరిగిన త్రిముఖ ఎన్నికల పోరులో 85.14 శాతం మంది ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు. అన్నాడీఎంకే–బీజేపీ కూటమిని లక్ష్యంగా చేసుకుని నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తీవ్రంగా పోరాడిన డీఎంకే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి హోరాహోరీగా పోరాడింది. విజయ్ పార్టీ తమిళగ వేట్రి కళగం(టీవీకే), తమిళ జాతీయవాది సీమాన్కు చెందిన నాన్ తమిళర్ కట్చి(ఎన్టీకే) ఎన్నికల రంగంలో గట్టి పోటీదారులుగా నిలిచాయి. డీఎంకే–కాంగ్రెస్, అన్నాడీఎంకే–బీజేపీ కూటములు తమ విజయం పట్ల ధీమాగా ఉన్నాయి. అత్యధికంగా కరూర్ స్థానంలో 91.86 శాతం, అత్యల్పంగా కన్యాకుమారిలో 75.50 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. చెదురు ముదురు ఘటనల మినహా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించినా, తక్షణం మరమ్మతులు చేసి ఓటింగ్ను కొనసాగించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఓటింగ్ను బహిష్కరించారు. చెన్నైలోని మైలాపూర్లో ఓటర్లకు డీఎంకే డబ్బులు పంపిణీ చేస్తోందని బీజేపీ ముఖ్యనేతలు అన్నామలై, వనతి శ్రీనివాసన్ ఆరోపించారు. అధికార డీఎంకే పార్టీ ఉదయించే సూర్యుడి చిహ్నాన్ని బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ నేత డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ తమ కుటుంబంతో సహా చెన్నైలో ఓటు వేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సేలం సిలువం పాళయం నెడుంకుళం పంచాయతీ పరిధిలోని యూనియన్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్లో కుటుంబంతో సహా వచ్చి ఓటు వేశారు. టీవీకే అధినేత విజయ్ చెన్నై నీలాంకరై పోలింగ్ బూత్లో గట్టి భద్రత నడుమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సంగీత దర్శకుడు ఇళయరాజా, తమిళ సినీ నటులు రజనీకాంత్, కమలహాసన్, అజిత్, సూర్య, జ్యోతిక దంపతులు, కార్తీ, అర్జున్, విక్రమ్, ధనుష్, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, విశాల్, మణిరత్నం, సంగీత దర్శకుడు అనిరుద్, నటీమణులు త్రిష, కీర్తి సురేష్, రాధిక, తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారీ ఓటింగ్ మాకే అనుకూలం: అన్నాడీఎంకే తమిళనాడులో 2021లో 73.63 శాతం ఓటింగ్ నమోదు కాగా, స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే విజయం సాధించింది. 2011లో 78.29 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే జయకేతనం ఎగురవేసింది. వరుసగా రెండుసార్లు గెలిచింది. ఈసారి 85 శాతానికిపైగా ఓటింగ్ నమోదు కావడాన్ని తమకు సానుకూలాంశంగా అన్నాడీఎంకే–బీజేపీ కూటమి నాయకులు భావిస్తున్నారు. తమిళనాట ఎస్ఆఐర్ ద్వారా ఓట్లను తొలగించారు. 2025 అక్టోబర్లో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 5.73 కోట్లకు తగ్గింది. 2021 ఎన్నికల సమయంలో 6.29 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 56 లక్షల మేర తగ్గినట్లు స్పష్టమవుతోంది. తమిళనాట ఓటింగ్ సరళి తమిళనాడులో 1957లో అత్యల్పంగా 47 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత 1960వ దశకం నుంచి నేటి వరకు సగటు ఓటింగ్ శాతం 70కి దరిదాపుల్లోనే ఉంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పాత రికార్డులు చెదిరిపోయాయి.👉 : (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బెంగాల్లో నేడు తొలి దశ పోలింగ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు తొలి దశ పోలింగ్ జరగనుంది. అసెంబ్లీలోని మొత్తం 294 స్థానాలకు గాను 152 సీట్లకు ఎన్నిక జరగనుంది. ఉత్తర బెంగాల్లోని 8 జిల్లాలతోపాటు ముర్షిదాబాద్, హుగ్లీ, నడియా, బిర్భూమ్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 54 సీట్లు బీజేపీకి కీలకంగా మారాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్లో 3.60 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 167 మంది మహిళలు సహా మొత్తం 1,478 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన 8 వేలకు పైగా పోలింగ్ స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈసీ రికార్డు స్థాయిలో 2,450 కంపెనీల బలగాలను మోహరించింది. వీరితోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించింది. ప్రభావం చూపే కీలకాంశాలివే.. అవినీతి, నిరుద్యోగం వంటి కీలక అంశాల కంటే ఈసారి సామాజిక గుర్తింపు, పౌరసత్వం, ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు వంటి అంశాలకే ప్రాధాన్యం పెరిగిన విభిన్న పరిస్థితులు నెలకొన్న వేళ ఈ జిల్లాల్లో సాధించే ఆధిక్యాన్ని బట్టే బెంగాల్లో బీజేపీ అధికారం చేపట్టడం ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గట్టి ప్రతిపక్షంగా ఎదిగేందుకు ఉత్తర బెంగాల్లో సాధించిన ఫలితాలే కీలకంగా మారాయి. ఇదే ఊపుతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశలో ఈ ప్రాంతంలో ఉన్న 152 సీట్లకుగాను బీజేపీ 59 చోట్ల విజయం సాధించగా, అధికార టీఎంసీ 93 సీట్లు దక్కించుకుంది. ఉత్తరబెంగాల్లో బీజేపీ ప్రభావాన్ని అడ్డుకోవడం అధికార పక్షానికి కూడా చాలా కీలకం. ఎందుకంటే, ఇది రెండో దశతోపాటు రాష్ట్రంలో మొత్తం రాజకీయ వాతావరణంపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ప్రాంతాలేవైనా సర్ ఒక్కటే.. ఉత్తర బెంగాల్లో తేయాకు తోటలున్న జల్పాయ్గురి అలీపూర్దువార్, కొండప్రాంతాలైన డార్జిలింగ్, కాలింపాంగ్, రాజ్బన్షీలున్న కూచ్ బెహార్ ఉన్నాయి. సరిహద్దుల్లోని మల్దా, ఉత్తర దినాజ్పూర్, మైనారిటీల ప్రాబల్యమున్న ముర్షిదాబాద్, నడియాలున్నాయి. ఎన్ని తేడాలున్నప్పటికీ, ప్రతి జిల్లాలోనూ ఓటింగ్ సరళిని ప్రభావితం చేయనున్న ఏకైక అంశం ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) అనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో సర్ కారణంగా 91 లక్షలకు పైగా పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో ఇవి సుమారు 12 శాతం. ఒక్క ముర్షిదాబాద్ జిల్లాలోనే 7.48 లక్షల ఓట్లు తొలగింపునకు గురయ్యాయి. తర్వాత, నడియాలో 4.85 లక్షలు, మాల్దాలో 4.59 లక్షలు, ఉత్తర్ దినాజ్పూర్లో 3.63 లక్షలు, కూచ్ బెహార్లో 2.42లక్షలకు పైగా ఓట్లను పక్కనబెట్టారు. దీంతో, ఎన్నికల్లో ప్రచారాంశాలే ఏకంగా మారిపోయాయి. అవినీతి, నిరుద్యోగం, సంక్షేమ పథకాలు అప్రాధాన్యాంశాలు కాగా, పౌరసత్వం, చొరబాట్లు, బోగస్ ఓట్లు, తొలగింపునకు గురైన ఓటర్లు, విదేశీయులు వంటివాటికి ప్రాధాన్యం పెరిగిపోయింది. చొరబాట్లు, పౌరసత్వం అంశాలకు సర్ను రెఫరెండంగా బీజేపీ అభివర్ణించగా, నిజమైన ఓటర్లను ముఖ్యంగా మైనారిటీలు, వలస కార్మికులు, పేదల పేర్లను తొలగించారంటూ టీఎంసీ ప్రచారం చేసుకుంది. బరిలో పలువురు ప్రముఖులు మొదటి దశ బరిలో పలువురు ప్రముఖ నేతలున్నారు. ముఖ్యంగా నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఒకరు. 2021 ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీని ఆయన ఇక్కడ ఓడించారు. రాష్ట్రంలో బీజేపీ రాజకీయాలు ఈయన చుట్టూతా నడుస్తున్నాయి. ఈసారి ఇక్కడ సువేందుకు నమ్మినబంటుగా ఉన్న పబిత్రా కర్ టీఎంసీ తరఫున బరిలో ఉన్నారు. అదేవిధంగా, బహరంపూర్లో కాంగ్రెస్ సీనియర్ నేత ఆధిర్ రంజన్ చౌదరి, బీజేపీ ఎమ్మెల్యే సుబ్రతా మైత్రా పోటీ పడుతున్నారు. మాతాభంగలో కేంద్ర మాజీ మంత్రి నిశిత్ ప్రామాణిక్ పోటీ చేస్తున్నారు. ఖరగ్పూర్ సదర్లో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, టీఎంసీకి చెందిన ప్రదీప్ సర్కార్ తలపడుతున్నారు.నన్ను భయపెట్టాలని చూస్తున్నారు: మమతఆమ్డాంగా(పశ్చిమ బెంగాల్): పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ భారీ సంఖ్యలో శాంతి భద్రతల కోసమంటూ సాయుధ బలగాలను మోహరించడంతోపాటు సీఆర్పీఎఫ్ వాహనాలను రంగంలోకి దించడంపై సీఎం మమతా బెనర్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లక్షలాదిగా బలగాలను తరలించి కేంద్రం తనను భయపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. సీఎం మమత బుధవారం ఉత్తర 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. ‘సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్లతోపాట రైల్వే బలగాలను కూడా కేంద్రం ఇక్కడ ఎన్నికల కోసం తీసుకువచి్చంది ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండగ మాత్రమే, ఎవరినీ చంపడానికి కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల కోసం బెంగాల్కు మునుపెన్నడూ లేని విధంగా సుమారు రెండు లక్షల కేంద్ర బలగాలను తీసుకువచ్చారు. ఇంత భారీ స్థాయిలో బలగాలను మోహరించి నన్ను భయపెట్టాలని చూస్తున్నారా?’అంటూ కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. -
రక్తపాతం లేని నరమేధమే ‘సర్’
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: దేశంలో రక్తపాతం లేని నరమేధమే కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ‘సర్’ (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ అని ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా 16.5 కోట్ల ఓట్లను ఏరివేయాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకుందని.. అందులో ఇప్పటికే 6.5 కోట్ల ఓట్లను ‘సర్’ పేరుతో తొలగించిందని దుయ్యబట్టారు. దీన్ని ప్రజలు తేలికగా తీసుకోరాదని హెచ్చరించారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ఓటర్ల ‘సర్’పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ ‘సర్’ను ఎందుకు తీసుకొచ్చారో ఎన్నికల సంఘం వద్దే సరైన సమాధానం లేదని ఆయన విమర్శించారు.సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ప్రశ్నలు అడిగితే సమాధానాలు కరువు అవుతున్నాయన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న ‘సర్’ను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఓటర్ల ప్రక్షాళన చేపట్టి ఓటర్ల జాబితా తయారు చేయాలని డిమాండ్ చేశారు. ఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ ఓట్లు తొలగిస్తే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అందరూ ఓటును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరకాల సూచించారు. బిహార్లో 63 లక్షల ఓట్ల తొలగింపుపై స్పష్టత ఏదీ? బిహార్లో 63 లక్షల ఓటర్లను తొలగించామని ఈసీ చెబుతోందని.. కానీ ఎవరిని తొలగించారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదని పరకాల చెప్పారు. పదేపదే కోర్టులను ఆశ్రయించినా ఈసీ దానిపై మాట్లాడటం లేదన్నారు. తొలగించే ఓటర్ల జాబితాలో ఎక్కువగా మైనారిటీలు, దళితులు, ఆదివాసీలు, నిరక్షరాస్యులు ఉన్నారన్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం లేదన్నారు. ‘సర్’లో చొరబాటుదారులనే పదమే లేదు.. ఈసీ చేపడుతున్న ఓట్ల తొలగింపులో షిఫ్టెడ్, డెత్, డిలీట్ అని మాత్రమే రాసి ఉందని.. చొరబాటుదారులనే కాలమే లేదని పరకాల చెప్పారు. అక్రమంగా ఉన్న విదేశీయుల ఓట్ల తొలగింపు కోసమే ‘సర్’ ప్రక్రియ జరుగుతోందంటూ బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకుంటోందని.. మరి తొలగించే ఓట్ల జాబితాలో ఆ కాలమ్ ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. మూడు నియోజకవర్గాలలో నమూనా సర్వే చేస్తే నకిలీ చిరునామాలతో 80 వేల ఓట్లు కొత్తగా చేర్చినట్లు తేలిందన్నారు. అలాంటప్పుడు ‘సర్’ సమర్థవంతమైన ప్రక్రియ ఎలా అవుతుందని పరకాల ప్రశ్నించారు. రాజకీయ లబ్ది కోసమే ఇదంతా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హైకోర్టు సీనియర్ అడ్వొకేట్ జి. విద్యాసాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కె. రామచంద్రమూర్తి, డీజీ నర్సింహారావు, ఉమామహేశ్వరరావు, డీఏఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. -
‘సర్’పై పారాహుషార్
సాక్షి, హైదరాబాద్: త్వరలో తెలంగాణలో జరగనున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమంపై దృష్టి పెట్టి.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడకుండా చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘సర్’పై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు గురువారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ‘సర్’ను అడ్డుపెట్టుకుని ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన లక్షలాదిమంది మద్దతుదారుల ఓట్లను బీజేపీ తీసివేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు చేర్పించి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా లబ్ధి పొందిన విషయాన్ని గుర్తుంచుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తమ ఓట్లను కాపాడుకోవడంతో పాటు దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలన్నారు. పోలింగ్ బూత్ల వారీగా దొంగ ఓటర్లను తొలగించేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన యువతను ఓటరుగా నమోదు చేయించేందుకు పార్టీ తరఫున నియమించే బూత్ స్థాయి ఏజెంట్లు ప్రయత్నించాలని ఆదేశించారు. బూత్ లెవెల్ ఏజెంట్లకు పార్టీ తరఫున శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ‘సర్’’ అనేది రానున్న ఎన్నికలకు అత్యంత కీలకమని, దీనికి సంబంధించి ప్రతి ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బూత్ స్థాయి నుంచి సరిగ్గా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని స్పష్టం చేశారు. -
ఓటర్ల జాబితాలో భారీ ప్రక్షాళన
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే రెండో దశలో భాగంగా 9 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఓట్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విజయవంతంగా ప్రక్షాళన చేసింది. పారదర్శకమైన ఎన్నికలే లక్ష్యంగా నకిలీ, బోగస్ ఓట్లకు చెక్ పెడుతూ ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ భారీ ప్రక్షాళనలో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నకిలీ, బోగస్, చనిపోయిన ఓటర్ల పేర్లు ఇలా మొత్తంగా 5.18 కోట్ల పేర్లను జాబితా నుంచి అధికారులు తొలగించారు. ఈ సవరణల అనంతరం ఆయా రాష్ట్రాల్లోని మొత్తం ఓటర్ల సంఖ్య 45.81 కోట్లకు చేరుకుంది. గతంతో పోలిస్తే 10.2 శాతం మేర ఓటర్ల సంఖ్య తగ్గడం గమనార్హం. మొత్తంగా 66,88,636 పేర్లు ఓటర్ల జాబితా నుంచి తీసేశారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 25.47 లక్షల ఓట్లకు కోత పడగా.. ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్లో 24.16 లక్షల పేర్లను అధికారులు తొలగించారు. శుక్రవారం యూపీ తుది ఓటర్ల జాబితా విడుదల కావడంతో రెండో దశ ప్రక్షాళన ప్రక్రియ అధికారికంగా ముగిసినట్లయింది. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రెండో దశ ఎస్ఐఆర్ ప్రక్రియను యూపీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కేరళ, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాల్లో విజయవంతంగా పూర్తి చేశారు. -
‘తొలగింపుల’ జాతర!
పశ్చిమ బెంగాల్లో ఈ నెల 23న జరగబోయే తొలి దశ పోలింగ్కు సంబంధించి తాజాగా 27 లక్షల 17 వేలమంది ఓటర్లు జాబితాల నుంచి కనుమరుగైనట్టు సోమవారం అర్ధరాత్రి దాటాక ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసిన తుది జాబితా వెల్లడిస్తోంది. దీంతో ఇప్పటివరకూ జాబితాల్లో పేర్లు లేనివారి సంఖ్య దాదాపు 91 లక్షలకు చేరింది. రెండో దశకు సంబంధించి తొలగింపులు కూడా కలుపుకొంటే ఇది కోటికన్నా ఎక్కువే ఉండొచ్చు. న్యాయ నిర్ణయ పరిధి (అజ్యుడికేషన్) ప్రక్రియ గత నెలలో మొదలయ్యాక ఈసీ విడుదల చేసిన అనుబంధ జాబితా ఇది. సహజంగానే ముస్లిం మెజారిటీ ఉన్న ముర్షీదాబాద్లో అత్యధికుల పేర్లు తొలగించారు. అక్కడ అజ్యుడికేషన్ పరిధిలోకెళ్లిన 11,01,145 మందిలో 4,55,137 మంది అనర్హులుగా తేలారు. ‘స్వచ్ఛమైన’ జాబితాతోనే ఎన్నికలు నిర్వహించాలన్న దృఢ నిశ్చయంతోనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)కు శ్రీకారం చుట్టామని బిహార్లో ఏరివేతలు మొదలెట్టినప్పుడే ఈసీ చెప్పింది. ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ బిహార్ అనుభవం తర్వాతైనా ఆ ప్రక్రియకు పట్టే సమయంపై అంచనా ఉండాలి. అది లేకపోబట్టే లక్షలాదిమంది ఓటర్లు ఈసారి ఓటింగ్కు దూరం కాబోతున్నారు. వారి అప్పీళ్లపై ట్రిబ్యునళ్ల విచారణ జరుగు తోంది. వారిలో విశ్వసనీయమైన ఓటర్లుగా నిర్ధారణయ్యేవారు కూడా ఉండొచ్చు. కానీ 2031 అసెంబ్లీ ఎన్నికలకు తప్ప వారు ఓట్లేయటం సాధ్యపడదు. న్యాయ నిర్ణయ ప్రక్రియకు సమయం పడుతుంది గనుక అంతవరకూ ఓటర్ల జాబితాలను ఆపటం సాధ్యపడదని సోమవారం సుప్రీంకోర్టు చెప్పటంతో అలాంటి ఓటర్లకు ప్రస్తుతానికి తలుపులు మూసుకుపోయాయి. ఈ నెల 23న పోలింగ్ జరగబోయే 152 నియోజక వర్గాలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా సోమవారం విడుదలైంది. 29న రెండో దశలో 142 నియోజకవర్గాల్లో జరగబోయే పోలింగ్కు సంబంధించిన జాబితా బుధవారం అర్ధరాత్రి విడుదలవుతుంది. వ్యవధి తక్కువున్న తరుణంలో సుదీర్ఘ సమయం పట్టే ఇంత పెద్ద ప్రక్రియను ఒక అంచనా లేకుండా ఈసీ చేపట్టడాన్ని ధర్మాసనం తప్పుబట్టకపోవచ్చు గానీ, సాధారణ పౌరుల దృష్టిలో ఈసీది దోషమే అవుతుంది. ఎందుకంటే వారు బాధితులు. నిజానికి బిహార్ ‘సర్’ బెంగాల్తో పోలిస్తే ఎంతో మెరుగు. ఎన్నికల షెడ్యూల్కు ముందే తొలగింపులు పూర్తికావటం వల్ల ఫామ్–6 ద్వారా తిరిగి జాబితాలోకెక్కడానికి చాలామందికి అవకాశం వచ్చింది. బెంగాల్లో ఆ అదృష్టం దక్కలేదు. తమ పేరుందనుకునే లోగానే ఎవరో ఫామ్–7 కింద ఫిర్యాదు చేశారన్న కారణంతో ఓటర్లకు తాఖీదులు పోయాయి. పనులన్నీ మానుకుని కార్యాలయాల చుట్టూ తిరిగి అవసరమైన పత్రాలు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం అనుమానమే. నిబంధనల ప్రకారం 2002 రికార్డులతో లింక్ లేని (అన్మ్యాప్డ్) సంగతి బయటపడినా, పేర్లలో అక్షర క్రమంలో స్వల్ప తేడాలొచ్చినా అనర్హులుగా జమవేయటం పెను సమస్యగా మారింది. తాజా జాబితాలో పేర్లు లేని వారిలో అనేకులు అడిగిన పత్రాలన్నీ ఇచ్చినా ఫలితం లేకపోయిందని బావురు మంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పెద్దయెత్తున అందజేసే ఫామ్–7 పత్రాలను తీసుకుని, వాటి ఆధారంగా తొలగింపులు చేపడుతున్నారన్న ఆరోపణలు వాస్తవం అనటానికి ఒక బీజేపీ నాయకురాలి పేరిట దాఖలైన ఫిర్యాదులే తార్కాణం. ఆ సంగతే తనకు తెలియదని ఆమె చెప్పటం గమనించదగ్గ అంశం.ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైనవారి సమస్య ఎన్నికల్లో ఓటేయలేకపోవటం మాత్రమే అయితే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో జరిగిన దొంగ ఓటర్ల జాతర మాదిరి ఉదంతాల్లో తప్ప చాలా సందర్భాల్లో పోలింగ్ 65 శాతానికి మించదు. కానీ ఈ ‘సర్’ వల్ల గల్లంతైన వారికి భవిష్యత్తులో కష్టాలు చుట్టుముడతాయి. వారి పౌరసత్వమే సంశయాస్పదంగా మారి దేశం నుంచి గెంటేసే ప్రమాదం ఏర్పడుతుంది. బెంగాల్లో పార్టీల మధ్య ఉన్న కలహాలు సాధారణ ఓటర్ల భవితవ్యాన్ని అగమ్యగోచరం చేస్తున్నాయి. ఈసీ సక్రమంగా వ్యవహ రించివుంటే, ఎన్నికల షెడ్యూల్కు ముందే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసుకుంటే సమస్యలు తలెత్తేవి కాదు. ఆ సంస్థ చేతగానితనం సామాన్యుల బతుకుల్ని అయోమయంలోకి నెట్టింది. -
మాల్డా ఘటనలో సూత్రధారి అరెస్టు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్డా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) విధుల్లో నిమగ్నమైన ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించిన ఘటనలో అసలు సూత్రధారి అడ్వొకేట్ ముఫకరూల్ ఇస్లాంతోపాటు మరో వ్యక్తిని శుక్రవారం సిలిగురి బాగ్దోగ్రా ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో వలపన్ని పట్టుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటిదాకా 35 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) అభ్యర్థి మౌలానా మొహమ్మద్ షాజహాన్ అలీ ఖాద్రీ కూడా ఉన్నాడు. మొతాబారీ అసెంబ్లీ స్థానం పరిధిలోని కాలియాచాక్ గ్రామంలో బుధవారం రాత్రి జ్యుడీషియల్ అధికారులను స్థానికులు ఘెరావ్ చేసి తొమ్మిది గంటలపాటు నిర్బంధించారు. అర్ధరాత్రి తర్వాత సైన్యం వారిని రక్షించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. జ్యుడీషియల్ అధికారులను వేధించిన ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలని ఆదేశించింది. ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని ఇతాహర్ గ్రామానికి చెందిన ముఫకరూల్ ఇస్లాం ప్రస్తుతం కోల్కతాలో న్యాయవాదిగా పని చేస్తున్నాడు. ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ కాలియాచాక్లో స్థానికులను రెచ్చగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ముఫకరూల్ ఇస్లాం ప్రోద్బలంతోనే జనం జ్యుడీషియల్ అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు తేలింది. కాలియాచాక్ పోలీసు స్టేషన్పై అతడిపై మూడు కేసులు నమోదు చేశారు. -
జ్యుడీషియల్ అధికారుల నిర్బంధంపై సీరియస్
న్యూఢిల్లీ/కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో నిమగ్నమైన ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను నిరసనకారులు నిర్బంధించడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏతో విచారణ జరిపించాలని గురువారం ఆదేశించింది. విధి నిర్వహణలో ఉన్న అధికారులకు తగిన రక్షణ కల్పించలేకపోయారని బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగంపై మండిపడింది. జ్యుడీషియల్ అధికారులను జనం ఘెరావ్ చేసి, దాడి చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. ఎస్ఐఆర్ పట్ల అభ్యంతరాలను పరిష్కరిస్తున్న ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘానికి సూచించింది. జ్యుడీషియల్ అధికారులను భయభ్రాంతులకు గురిచేయడం సుప్రీంకోర్టు అధికారానికే సవాలు విసరడంతో సమానమని ఆక్షేపించింది. ఎస్ఆఐర్ను వ్యతిరేకిస్తూ బుధవారం మాల్డా జిల్లాలోని కాలియచౌక్లో జ్యుడీషియల్ అధికారులను నిరసనకారులు తొమ్మిది గంటలపాటు నిర్బంధించారు. ఆహారం, నీరు కూడా ఇవ్వలేదు. అర్ధరాత్రి తర్వాత భద్రతా సిబ్బంది వారిని రక్షించారు. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సుమోటోగా స్వీకరించి, విచారణ చేపట్టింది. అది ఘెరావ్ కాదని, రాజకీయ నిరసన అంటూ బెంగాల్ ప్రభుత్వం వివరణ ఇవ్వగా, ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. అది సాధారణ ఘటన కాదని, అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు ఒక పథకం ప్రకారం, ఉద్దేశపూర్వకంగా జరిగిన చర్య అని పేర్కొంది. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా మేజి్రస్టేట్, ఎస్పీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. మాల్డా జిల్లా ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 6న తమ ఎదుట ఆన్లైన్ ద్వారా హాజరు కావాలని స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దాదాపు 700 మంది జ్యుడీషియల్ అధికారులు బెంగాల్లో ఎస్ఐఆర్పై అభ్యంతరాలను పరిష్కరిస్తున్నారు. వీరంతా బెంగాల్తోపాటు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారు. -
సీఈసీ జ్ఞానేశ్ కుమార్పై అభిశంసన తీర్మానానికి నోటీసు?
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్పై అభిశంసన తీర్మానానికి నోటీసు ఇవ్వాలని విపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్తో పాటు ఇతర భాగస్వామ్య పార్టీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎస్ఐఆర్ (ఓటరు ప్రత్యేక సవరణ)కు నిరసనగా కాంగ్రెస్, టీఎంసీతో పాటు ఇండియా కూటమి విపక్షాలు ఈ తీర్మానాన్ని ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ అభిశంసన తీర్మానంపై మొత్తం 193 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. వీరిలో 130 మంది లోక్సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఓటరు ప్రత్యేక సవరణ (సర్) పేరుతో ఎన్నికల సంఘం ఏకపక్షంగా విపక్ష పార్టీల ఓటర్లను తొలగిస్తోందని. ఈ చర్య ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తోందని ఇండియా కూటమి నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలుపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్పై అభిశంసన తీర్మానం విపక్షాల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచింది. ఈ తీర్మానం ద్వారా విపక్షాలు ఎన్నికల సంఘం తీరుపై తమ అసంతృప్తిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇకపై ఈ అభిశంసన తీర్మానం పార్లమెంట్లో ఎలా ముందుకు సాగుతుందో, ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
బెంగాల్ ‘సర్’ తేలేదెప్పుడు?
నిరుడంతా బిహార్లో కలకలం సృష్టించి, బెంగాల్లో అంతకుమించిన వివాదాలతో గత నెల 28న ముగిసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియలో మొత్తానికి 8.09 శాతం మంది ఓటర్లు... అంటే 60.06 లక్షల మంది జాబితాల నుంచి కనుమరుగై, నికరంగా 7.04 కోట్ల మంది అసలైన ఓటర్లుగా తేలారని ఎన్నికల సంఘం(ఈసీ) చెబుతోంది. జాబితాలో లేనివారు న్యాయనిర్ణయ పరిధి(అజ్యుడికేషన్)లో ఉన్నట్టు లెక్క. ఇలాంటి వారి వినతులను పరిష్కరించటానికి హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో అప్పిలేట్ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ను మంగళవారం కోరింది. ఈ ప్రక్రియ ముగిశాకే బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలుంటాయా... ముందే పూర్తవుతాయా అన్నది చెప్పేవారు లేరు. సాక్షాత్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమారే ఆ విషయంలో స్పష్టత ఇవ్వటానికి నిరాకరించారు. చాలా అంశాల్లో ఇలా మౌనంగా ఉండిపోవటం ఆయనకు అలవాటే కనుక అందులో ఆశ్చర్యమేమీ లేదు. మన దేశంలో మంచికో చెడుకో అట్టడుగు ప్రజానీకంలో దృఢమైన విశ్వాసం ఒక టుంటుంది. ఓటు హక్కు లేకపోతే మనిషి బతికున్నా చనిపోయినవాళ్లతో సమానమని వారు నమ్ముతారు. నిజానికి అంత నమ్మకం ఉండబట్టే... పార్టీలు దొంగ హామీలిచ్చి నెగ్గుతూ, అటుపై అధికారం వెలగబెడుతూ వంచిస్తున్నా మరో దఫా ఎన్నికల్లో ఓటేయటానికి ఎంతో నిబద్ధతతో క్యూలో నిలబడతారు. సామాన్యుల్లో ఉన్న ఈ అచంచల విశ్వా సమే మన ప్రజాస్వామ్యాన్ని ఈ మాత్రంగానైనా నిలబెడుతోంది. బిహార్లో ‘సర్’ ప్రక్రియకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లోనే ప్రధాన పోరాటం సాగింది. బెంగాల్ పరిస్థితి భిన్నం. అక్కడున్నది మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక నిరసనలు, ఇతరత్రా ఉద్యమాలు జోరుగానే కొనసాగాయి. అలాగని న్యాయస్థానా లను విస్మరించలేదు. స్వయానా మమత సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఎంతో ఊరటనిచ్చేవి. ఎందుకంటే ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైనవారు గోడు చెప్పుకోవటానికి హైకోర్టు పర్యవేక్షణలో అప్పిలేట్ ట్రిబ్యునళ్లు ఏర్పడతాయి. నిర్ణయాధికారం అధికారులకే అప్పగిస్తే ఇష్టానుసారం చేస్తారన్న భయం ఉండేది. కానీ ట్రిబ్యునళ్లు ఈ సమస్య లేకుండా చేశాయి. నిజానికి ఈ వివాదానికి మూలం ఈసీ తీరులో ఉంది. ఫలానా ప్రాంతంలో ఓటరుగా నమోదైన వ్యక్తి ఇక్కడ ఉండటం లేదనో, దొంగ ఓటరనో ఫిర్యాదు చేయడానికి ‘ఫామ్–7’ వెసులుబాటు ఉంది. అయితే అలా ఫిర్యాదు చేసినవారి వివరాలు చాలా సందర్భాల్లో సక్రమంగా లేవు. ఎదుటి పార్టీకి పట్టున్న ప్రాంతాల్లోని ఓటర్లు నకిలీలని వచ్చిన ఫిర్యాదులు కోకొల్లలు. దాదాపు అన్ని పార్టీలూ ఈ పనిచేశాయి. వాటి ఆధారంగా ఓటర్లకు నోటీసులీయటం, పత్రాలు తీసుకురావాలని ఆదేశించటం, తీరా నిబంధనల ప్రకారం 2002 రికార్డులతో లింక్ లేని (అన్మ్యాప్డ్) సంగతి బయటపడటం, పేర్లలో అక్షరక్రమం కొంచెం తేడావచ్చినా అనర్హులుగా జమవేయటం సాధారణ ఓటర్లకు తలనొప్పిగా మారింది. చిత్రమేమంటే ఒక బీజేపీ నాయకురాలి పేరుమీద దాఖలైన ఫిర్యాదుల సంగతి అధికారులు చెబితేగానీ ఆమెకు తెలియలేదు. దొంగ ఫిర్యాదులపైనా, వాటి ఆధారంగా నిర్ణయం తీసుకున్న వారి పైనా వెనువెంటనే చర్యలుంటే ఈ అరాచకం ఆగేది. కానీ దానికి సమయం పడుతుంది. బంగ్లాదేశ్కు పొరుగున ఉండటం బెంగాల్ ముస్లింలకు తలనొప్పిగా మారింది. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినవారు కూడా అక్రమ వలసదారులన్న ఫిర్యాదులతో అందు కవసరమైన పత్రాలు సేకరించలేక, పత్రాలున్నా పరిశీలనలో పేర్లలో కనబడిన స్వల్ప తేడా వల్ల జాబితాల నుంచి గల్లంతైనవారు అనేకులు. ఇలాంటి సమస్యలుంటాయని ఎన్నికల సంఘం ముందే అంచనా వేసి, తరుణోపాయం సూచిస్తే ప్రజలు న్యాయ స్థానాలకెక్కే అవసరం ఉండకపోయేది. కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తయి రెండేళ్లు కావస్తున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులపై ఇంతవరకూ ఉలుకూ పలుకూ లేకుండా మిగిలిపోయిన ఎన్నికల సంఘం ఇంతకన్నా మెరుగ్గా ఎలా ఉంటుంది? నిజమైన ఓటర్లకు సత్వరన్యాయం లభించాలని కోరుకోవటం మినహా ఎవరూ చేయగలిగింది లేదు. -
ఓటర్ల తొలగింపును నిరసిస్తూ సీఎం మమత ధర్నా
కోల్కతా: ఓటరు జాబితా సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)తో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం టీఎంసీ అధినేత్రి, పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెంట్రల్ కోల్కతాలో ధర్నాకు పూనుకున్నారు. ఏప్రిల్లో జరగనున్న కీలకమైన ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా వివాదాన్ని టీఎంసీ ప్రచారంలో ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చుకోనున్నట్లు ఆమె సంకేతాలిచ్చారు. రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యం కలిగిన ఎస్ప్లానెడ్ ప్రాంతంలోని మెట్రో చానల్ వద్ద మమత మధ్యాహ్నం 2.15 గంటలకు ధర్నా ప్రారంభించారు. బీజేపీ, ఈసీలు కలిసి బెంగాలీ ఓటర్ల పేర్లను తొలగించాలని కుట్ర పన్నాయన్నారు. ఈ కుట్రను తాను బయటపెడతానని ఆమె ప్రకటించారు. ఇటీవల ప్రకటించిన జాబితాలో బతికున్న వారిని కూడా చనిపోయిన వారి కిందకి చేర్చారని ఆరోపించారు. అలాంటి వారిని ధర్నా వేదికపైకి తీసుకొచి్చ, ఈసీ పాల్పడిన అవకతవకలను బయటపెడతామన్నారు. ఇదే అంశంపై శనివారం మరికొన్ని వివరాలను బయటపెడతామన్నారు. బీజేపీ, ఈసీలోని ఆ పార్టీ ఏజెంట్లు బరి తెగించారని, వారికి ఏమాత్రం సిగ్గు లేదంటూ తిట్టిపోశారు. ఇటీవల ఈసీ వెల్లడించిన తుది ఓటరు జాబితాలో 63.66 లక్షల పేర్లను, అంటే మొత్తం ఓటర్లలో 8.3 శాతం మందిని తొలగించడం తెల్సిందే. మరో 60 లక్షల పేర్లను న్యాయపరమైన పరిశీలన కోసం ఉంచారు. త్వరలో న్యాయాధికారులు వీటిని పరిశీలించి, తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇవన్నీ ఎన్నికల సమీకరణాలను తీవ్రంగా ప్రభావితం చేయనుండగా మమత పోరాటానికి దిగారు. అయితే, ధర్నా ఎన్ని రోజులు కొనసాగనుందనే విషయాన్ని మమత వెల్లడించలేదు. -
తెలంగాణా సహా 22 రాష్ట్రాల్లో ‘సర్’ : నోటిఫికేషన్ జారీ చేసిన ఈసీ
తెలంగాణాలో ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’’ (SIR)కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర న్నికల సంఘం (సీఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. నకిలీ ఓటర్లను తొలగించి, ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసేందుకు ఉద్దేశంలో SIR తీసుకొచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. దీనిలో భాగంగా తెలంగాణతో సహా 22 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్కు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఏప్రిల్లో ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు సంబంధించి సన్నాహకాలను, శిక్షణా కార్యక్రమాలను కూడా ఇప్పటికే చేపట్టింది. ఈసీఐ ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిసుదర్శన్ రెడ్డి శిక్షణ కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా దేశవ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్ దశలవారీగా చేపడుతోంది. దీనిపై అనేక విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. -
ఎస్ఐఆర్కు వేగంగా కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)కు ఎన్నికల సంఘం కార్యాచరణ వేగవంతం చేసింది. ఏప్రిల్ రెండో వారం నుంచి ఈ ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో ఓటర్ల ఎన్యూమరేటర్ల నుంచి సేకరించాల్సిన డేటాకు సంబంధించిన ఫారాల ముద్రణ, బీఎల్ఓలకు శిక్షణ, వారికి అవసరమైన కిట్స్ పంపిణీ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. ఈ టెండర్ల ఆర్థిక బిడ్స్ను శుక్రవారం తెరవనున్నారు. ఆ తరువాత కాంట్రాక్టర్లకు ఆ బాధ్యత అప్పగిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం 3.36 కోట్ల మంది ఉన్నారు. మూడో దశ కింద 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ కోసం ఏప్రిల్ మొదటివారంలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ ప్రక్రియ చేపట్టడానికి అవసరమైన ప్రీ ఎస్ఐఆర్ ర్యాండమ్ పరిశీలన కొనసాగుతోంది. రాష్ట్రంలో ఉన్న 3.36 కోట్ల మంది ఓటర్ల దగ్గరకు వెళ్లి పోలింగ్ కేంద్ర అధికారులు(బీఎల్ఓ)లు పరిశీలన జరుపనున్నారు. ప్రీ ఎస్ఐఆర్ కసరత్తులో భాగంగా జరుగుతున్న ఫీల్డ్ సర్వే వివరాలు వచ్చేనెల మూడవ వారం నుంచి మొదలయ్యే అసలు ప్రక్రియకు దోహదపడనుంది. నోటిఫికేషన్ వచ్చే నాటికి... ఎస్ఐఆర్ నోటిఫికేషన్ వెలువడే నాటికి ఎన్యూమరేటర్ ఫామ్ల ముద్రణ, బీఎల్ఓలకు కిట్ల తయారీ పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కసరత్తు చేస్తున్నారు. నిర్వాచన్ సదన్ నుంచి వచ్చే మార్గదర్శకాలు, ఆదేశాలకు అనుగుణంగా ఒక వారమంతా బీఎల్ఓలకు తుది దశ శిక్షణను ఇవ్వనున్నారు.బీఎల్వోలు పూర్తి చేసే ఎన్యుమరేటర్ ఫారాల్లో ఒకటి ఓటర్కు ఇవ్వడం, ఒకదాన్ని ఎన్నికల సంఘం తన వద్ద రికార్డు చేయనుంది. క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలు, సందేహాలు, కొత్త గైడ్లైన్స్ మీద ఈసీ, సీఈఓ అధికారులు వాళ్లకు అవగాహన కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ పూర్తై, తుది జాబితా వెలువడటానికి నాలుగు నెలలు పట్టే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 350 ఓటర్లు.. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 350 మంది ఓటర్ల వివరాలను బూత్ లెవెల్ ఆఫీసర్లు నమోదు చేయనున్నారు. ప్రతీ 10 మంది బీఎల్ఓలకు ఒక సూపర్వైజర్ ఉంటారు. రోజూ సేకరించిన సమాచారాన్ని ఓటర్లు ఎన్యూమరేషన్ ఫామ్లలో భర్తీ చేసిన తర్వాత ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ రూపంలోకి అప్లోడ్ చేస్తారు. మండలస్థాయిలో తహసీల్దారు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా. ఈఆర్వోగా రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు ఉంటారు. జిల్లాస్థాయిలో ఎలక్షన్ ఆఫీసర్గా కలెక్టర్ వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని మొత్తం 37 వేల పోలింగ్ కేంద్రాల బీఎల్ఓలు, మరో 15 వేల మంది అసిస్టెంట్ బీఎల్ఓలు, సూపర్వైజర్లు.. ఇలా దాదాపు 60 వేల మంది సిబ్బందిని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియలో పాల్గొననున్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు సేకరించిన వివరాల తర్వాత ఓటర్ల పేర్లు గల్లంతైనా, నమోదు కాకపోయినా, పేర్లతో పాటు అడ్రస్ గల్లంతు అయిన వారి ఫిర్యాదులు, అభ్యంతరాలు, అభిప్రాయాలను తీసుకుని పరిష్కరించడానికి నెల రోజుల గడువులోగా పూర్తి చేస్తారని సమాచారం, వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని పరిష్కరించిన తరువాతనే తుది జాబితా సిద్ధం చేస్తారు. ఈ ఏడాది సెపె్టంబరు నాటికల్లా ఓటరు జాబితా వెలువడే అవకాశం ఉంది. అర్హత కలిగినవాళ్ల పేర్లు జాబితాలో యధావిధిగా ఉంటాయని, సమగ్రమైన వివరాలు, నిర్దిష్టమైన ప్రూఫ్ లేనివాళ్లు మాత్రం లిస్టులో నుంచి తొలగిస్తారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
పశ్చిమ బెంగాల్లో బీజేపీని గెలిపిస్తే.. 45 రోజుల్లో..
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర హోం మంత్రి అమిత్షా బంపరాఫర్ ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే 45 రోజుల్లో ఏడో వేతన సంఘం సిఫారసులను అమలు చేస్తామని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల నేపథ్యంలో దక్షిణ 24 పరగణాల జిల్లాలోరి మథురాపుర్లో బీజేపీ పరివర్తన్ యాత్రను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. ‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును వ్యతిరేకించకపోతే.. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రతి హిందూ శరణార్థి ఇప్పటికే పౌరసత్వాన్ని పొందేవాడు. అయినప్పటికీ హిందూ శరణార్థులెవరూ బాధపడాల్సిన అవసరం లేదు. బీజేపీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఒక్క హిందూ శరణార్థి కూడా పౌరసత్వాన్ని కోల్పోకుండా చేస్తాం’ అని హామీ ఇచ్చారు. ‘పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అక్రమ చొరబాటుదారులను లేకుండా చేస్తాం. చొరబాటుదారుల పేర్లను ప్రస్తుతం ఓటర్ల జాబితా నుంచి మాత్రమే తొలగిస్తున్నాం. దీనిపై మమతా దీదీ ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిందంటే చొరబాటుదారులను పూర్తిగా ఇక్కడి నుంచి పంపించేస్తాంప్రజల కోసం దీదీ చేసిందేమీ లేదు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులను మాత్రం ఆమె బుజ్జగిస్తున్నారు. మేమే రామ మందిరాన్ని, కాశి విశ్వనాథ్, మహాకాల్ కారిడార్ను కట్టించాం. మమతా బెనర్జీ ప్రజల్ని విస్మరించి వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సీఎం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇదే వారి పద్ధతి. దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాలు అందుకుంటున్నారు. బెంగాల్ ఉద్యోగులు మాత్రమే ఇప్పటికీ ఆరో వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే 45 రోజుల్లో ఏడో వేతన సంఘం సిఫారసులను అమలు చేస్తాం’ అని అమిత్ షా పునరుద్ఘాటించారు. -
మధ్యప్రదేశ్లో 34 లక్షల ఓట్లు తొలగింపు
మధ్యప్రదేశ్లో 5.39 కోట్ల ఓటర్లతో తుది జాబితాను ఈసీ శనివారం విడుదలచేసింది. పాత జాబితా నుంచి మరణాలు, వలసలు, డూప్లికేట్ల వంటి కారణాలతో 34,25,078 ఓట్లను ఈసీ తొలగించింది. దీంతో గతంలో 5,74,06,143గా ఉన్న ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 5,39,81,065కు దిగొచ్చింది. వీరిలో 2,79,04,975 మంది పురుషులుకాగా 2,60,75,186 మంది మహిళలు ఉన్నారు. మరోవైపు అండమాన్ నికోబార్లో ముసాయిదా జాబితా నుంచీ 5,269 ఓట్లను ఈసీ తొలగించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత 5,269 ఓట్లు తొలగించి 2,58,040 ఓట్లతో తుది జాబితాను ఈసీ శనివారం పబ్లిష్ చేసింది. వాస్తవానికి 2025 అక్టోబర్ 27 నాటికి ఇక్కడ 3,10,404 ఓటర్లు ఉండేవారు. ఎస్ఐఆర్ మొదలయ్యాక మసాయిదా జాబితా తయారీ దశలోనే 64,014 ఓట్లు తొలగించారు. తాజాగా మరో 5,269 ఓట్లు తొలగించారు. తర్వాత మార్పులు చేర్పులతో చివరకు 2,58,040 ఓట్లతో తుది జాబితాను శనివారం ముద్రించింది. -
కేరళలో 9 లక్షల ఓటర్ల పేర్లు తొలగింపు
తిరువనంతపురం: కేరళలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే తర్వాత తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ముద్రించింది. 9 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగిస్తూ తుది జాబితాను ముద్రించారు. దీంతో తుది జాబితాలో స్థానం సంపాదించుకున్న మొత్తం ఓటర్ల సంఖ్య 2.69 కోట్లు దాటింది. http:// electoralsearch.eci.gov.in వెబ్సైట్లో కేరళ ఓటర్లు తమ పేరును సరిచూసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది అక్టోబర్లో ఎస్ఐఆర్ సర్వే మొదలెట్టక ముందు 2,78,50,855 ఓటర్లు ఉండగా తుది జాబితాలో 2,69,53,644 మందికి చోటు దక్కిందని ఈసీ పేర్కొంది. ఎస్ఐఆర్లో ఓట్ల ప్రక్షాళన తర్వాత 8,97,211 పేర్లు తొలగించారు. తాజాగా కేరళ మొత్తం ఓటర్లలో పురుషులు 1,31,26,048 మంది ఉండగా మహిళలు 1,38,27,319 ఉన్నారు. ట్రాన్స్జెండర్లు కేవలం 277 మంది ఉన్నారు. విదేశాల్లో ఉంటున్న ఓటర్ల సంఖ్య 2,23,558గా తేలింది. సరీ్వస్ ఓటర్ల సంఖ్య 54,110కు చేరుకుంది. తప్పులు, సవరణలు, ఇతరత్రా కారణాలతో వివరణ కోరుతూ 36.88 లక్షల ఓటర్లకు నోటీస్లు జారీచేశామని వీళ్లలో 53,229 మంది పేర్లను తనిఖీ తర్వాత చేర్చామని ఈసీ పేర్కొంది. తుది జాబితాను వెరిఫికేషన్ కోసం రాజకీయ పార్టీలకూ అందజేయనున్నారు. శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు చివరితేదీలోపు వరకూ ఓటర్ల జాబితాలోకి కొత్త ఓటర్లను చేర్చేందుకు ఆస్కారముందని ఈసీ అధికారులు స్పష్టంచేశారు. -
ఎస్ఐఆర్ కోసం జ్యుడీషియల్ అధికారులను నియమించండి
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో వివాదాస్పదంగా మారిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై సుప్రీంకోర్టు అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియలో ఎన్నికల సంఘానికి సహకరించడానికి జ్యుడీషియల్ అధికారులను(జిల్లా కోర్టు న్యాయమూర్తులు లేదా జిల్లా కోర్టు మాజీ న్యాయమూర్తులు) నియమించాలని కలకత్తా హైకోర్టుకు స్పష్టంచేసింది. ఎస్ఐఆర్ దరఖాస్తులపై వచ్చే అభ్యంతరాలను ఆయా జ్యుడీషియల్ అధికారులు పరిశీలిస్తారని పేర్కొంది. ఎస్ఐఆర్ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య కొనసాగుతున్న రగడ పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం, రాజ్యాంగబద్ధమైన సంస్థ మధ్య ఇలాంటి వివాదం ఏర్పడడం నిజంగా దురదృష్టకరమని పేర్కొంది. ఇరుపక్షాల మధ్య అపనమ్మకం నెలకొనడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఈ దురదృష్టకరమైన బ్లేమ్ గేమ్ ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ సాఫీగా జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ జస్టిస్ విపుల్ ఎం.పంచోలీ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం స్పష్టంచేసింది. ఎస్ఐఆర్ సక్రమంగా పూర్తికావడానికి వీలుగా ఆదేశాలు జారీ చేసింది. వేర్వేరు కారణాలు, నిబంధనల వల్ల ఓటు హక్కు కోల్పోయే జాబితాలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన క్లెయిమ్లు, అభ్యంతరాల పరిశీలనకు, ఎన్నికల సంఘానికి సహకరించడానికి జ్యుడీషియల్ అధికారులను నియమించాలని పేర్కొంది. అంతకు మించి మరో మార్గం లేదు ఎస్ఐఆర్ కోసం ఎన్నికల సంఘానికి సహాయం అందించడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తగినంత మంది గ్రేడ్ ‘ఎ’అధికారులను నియమించకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ప్రక్రియ సజావుగా ముందుకు సాగాలంటే కొందరు జ్యుడీషియల్ అధికారులను, మాజీ న్యాయమూర్తులను నియమించాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ను ఆదేశించింది. అదనపు జిల్లా జడ్జి, జిల్లా జడ్జి ర్యాంకు ఉన్న జ్యుడీషియల్ ఆఫీసర్లను నియమించాలని సూచించింది. అంతకంటే మరో మార్గం కనిపించడం లేదని పేర్కొంది. పేరు, వయసు వంటి వ్యత్యాసాల వల్ల ఓట్లు కోల్పోయే జాబితా ఉన్న వ్యక్తుల పెండింగ్ క్లెయిమ్లను వీరంతా క్షుణ్నంగా పరిశీలిస్తారని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం లేని పక్షంలో జ్యుడీషియల్ అధికారులను నియమించడం.. లేదా ఎన్నికల సంఘమే ఇతర రాష్ట్రాల నుంచి అధికారులను నియమించుకోవడం మినహా మరో మార్గం లేదని తేలి్చచెప్పింది. జ్యుడీషియల్ అధికారులకు తగిన భద్రత కలి్పంచాలని పోలీసులను ఆదేశించింది. తుది ఓటర్ల జాబితా ప్రచురణకు అనుమతి ఎస్ఐఆర్పై పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ అభ్యంతరాలను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ముందుగా నిర్ణయించిన డెడ్లైన్ ప్రకారమే ఈ నెల 28వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించడానికి ఎన్నికల సంఘానికి అనుమతి మంజూరు చేసింది. అవసరమైతే తర్వాత అనుబంధ జాబితాలు విడుదల చేయవచ్చని సూచించింది. ఫిబ్రవరి 28 తర్వాత కూడా అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చవచ్చని వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసే తేదీ వరకూ కొత్త పేర్లను చేర్చి, అనుబంధ జాబితాలు విడుదల చేసినా ఎలాంటి అభ్యంతరం ఉండదని ధర్మాసనం స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ శనివారం ఒక సమావేశం ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎన్నికల సంఘం అధికారి, అడ్వొకేట్ జనరల్, కేంద్ర ప్రభుత్వం అదనపు సొలిసిటర్ జనరల్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ భేటీకి హాజరు కాబోతున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో సహకరించడానికి జ్యుడీషియల్ అధికారులను నియమించడంపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. -
TG: ‘ఎస్ఐఆర్’కు సన్నాహాలు ముమ్మరం
హైదరాబాద్: ఏప్రిల్లో ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు సంబంధించి సన్నాహకాలను వేగవంతం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి శిక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేశారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని సీఈవో కార్యాలయం నుంచి మెదక్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల సహాయ ఎన్నికల నమోదు అధికారులకు (ఏఈఆర్ఓలు) ఆన్లైన్ శిక్షణ నిర్వహించారు.మొత్తం 195 మంది ఏఈఆర్ఓలు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఓటరు జాబితాల తయారీ, నవీకరణ, నిర్వహణ అంశాలపై విపులంగా అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాల్లో చేర్చడం, అనర్హుల పేర్లను తొలగించడం, వివరాల సవరణ వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు.రాబోయే ఎస్ఐఆర్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సన్నాహకాలను సమయానికి పూర్తి చేయాలని సుదర్శన్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఓటరు జాబితాల స్వచ్ఛతను కాపాడటంలో ఏఈఆర్ఓల పాత్ర అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు దోహదం చేస్తాయని అధికారులు తెలిపారు. -
SIRపై 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈసీ లేఖ
సాక్షి, ఢిల్లీ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఐఆర్ ప్రక్రియను దేశ వ్యాప్తంగా చేపట్టేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా.. 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈసీ లేఖ రాసింది.వివరాల ప్రకారం.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)కి సంబంధించిన సన్నాహకాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈసీ సూచించింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు ఎన్నికల సంఘం లేఖ రాసింది.ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టాలని గతేడాది జూన్లో నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే బీహార్లో ‘సర్’ పూర్తి కాగా.. ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అస్సాంలో మాత్రం ఎస్ఐఆర్కు బదులు ‘ప్రత్యేక సవరణ’ పేరుతో ఓటరు జాబితా సవరణను పూర్తి చేశారు. కాగా, ఏప్రిల్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. -
సర్కు ఆటంకం కలిగిస్తే ఊరుకోం
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో ఓటరు జాబితా సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ విషయంలో ఎన్నికల కమిషన్(ఈసీ), రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. సర్ ప్రక్రియకు అవరోధాలు కలిగించవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అదే సమయంలో, ప్రక్రియను పూర్తి చేసేందుకు ఈసీ గడువును మరో వారంపాటు పొడిగించింది. ఈ నెల 4వ తేదీన జరిగిన విచారణకు సీఎం మమతా బెనర్జీ స్వయంగా హాజరై వాదనలు వినిపించడం తెల్సిందే. ‘వాట్సాప్ ద్వారా కాకుండా ఈసీ అధికారికంగా ఆదేశాలు జారీ చేయాలి. వాటిని ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. మైక్రో అబ్జర్వర్లను తొలగించాలి’అని కోరారు. వీటిపై సుప్రీంకోర్టు కేంద్రం, ఈసీలకు నోటీసులు జారీ చేసింది. సోమవారం వీటిపై ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘సర్ విషయంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తాం. ఈ విషయంలో ఎటువంటి అడ్డంకులను కలిగించం. ఇందులో మావైఖరి సుస్పష్టం’అని సీజేఐ తెలిపారు. సర్ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అవగాహన లేని అధికారులను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారు(ఈఆర్వో)లను నియమించిందంటూ ఈసీ తరఫున సీనియర్ లాయర్ డీఎస్ నాయుడు అభ్యంతరం తెలపగా మైక్రో అబ్జర్వర్లు ఏకపక్షంగా ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారంటూ బెంగాల్ ప్రభుత్వం తరఫున న్యాయవాది శ్యామ్ దివాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 14వ తేదీకల్లా పూర్తి చేసి, తుది జాబితా ప్రకటించాల్సి ఉందంటూ ఆయన..స్వల్ప కారణాలు చూపి 1.68 లక్షల పేర్లను తొలగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో, సంబంధిత దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేయడానికి, తుది జాబితాకు గడువును మరో ఒక వారం పాటు గడువు పొడిగిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. వెరిఫికేషన్ అనంతరం విడుదల చేసే ఫలితాలను తాము తప్పనిసరిగా పరిశీలిస్తామని, అవసరమైన పక్షంలో జోక్యం చేసుకుంటామని సీజేఐ ప్రకటించారు. ఓటర్ల తుది జాబితాపై అంతిమ నిర్ణయం ఎన్నికల అధికారులకే ఉండాలని స్పష్టం చేసింది. బెంగాల్ ప్రభుత్వం అందజేస్తామంటున్న 8,505 మంది అధికారులకు ఎలాంటి బాధ్యతలను అప్పగించాలో ఈసీయే నిర్ణయిస్తుందని కూడా తెలిపింది. ఓటర్లకు ఈసీ విడుదల చేసిన నోటీసులను కొందరు తగులబెట్టారని లాయర్ డీఎస్ నాయుడు తెలపగా, ధర్మాసనం సీరియస్గా తీసుకుంది. ఇటువంటి ఘటనలపై అఫిడవిట్ సమరి్పంచాల్సిందిగా బెంగాల్ డీజీపీని ఆదేశించింది. -
జనంపై ‘సర్’ బుల్డోజర్
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే సక్రమంగా జరగట్లేదని, పనిఒత్తిడితో బూత్ లెవల్ అధికారులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని, బాధితులను ఢిల్లీకి తీసుకొచ్చి బెంగాల్ అంశాన్ని హస్తిన వేదికగా చర్చనీయాంశంగా మార్చిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఈ అంశంపై నేరుగా సర్వోన్నత న్యాయస్థానంలో తన వాదనలు స్వయంగా వినిపించారు. ఐదు నిమిషాలు సమయం ఇస్తే సూటిగా, స్పష్టంగా తమ వాదనలను విన్పిస్తానని మమత కోరగా ధర్మాసనం ఏకంగా 15 నిమిషాల సమయం కేటాయించడం విశేషం. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా స్వయంగా ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో రాష్ట్ర కేసును వాదిస్తుండటంతో ఆమె వాగ్ధాటిని వినేందుకు న్యాయవాదులు సీజేఐ కోర్టురూమ్లోకి ఎగబడ్డారు. ఈ ఘటనకు సర్వోన్నత న్యాయస్థానం వేదికైంది. ఈసీ ఒక వాట్సాప్ కమిషన్..తమ రాష్ట్రంలో ఎస్ఐఆర్ చేపట్టడాన్ని సవాల్ చేస్తూ మమతా బెనర్జీ, మొస్తారీ బానూ, టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓబ్రియాన్, దోలాసేన్లు వేసిన పిటిషన్పై తానే స్వయంగా వాదనలు విన్పించేదుకు అనుమతించాలంటూ ఇప్పటికే మమత ఇంటులాక్యుటరీ పిటిషన్ వేశారు. దీంతో మమతను వాదనలకు కోర్టు అనుమతించింది. మమత తన వాదనల సందర్భంగా ఎన్నికల కమిషన్ను వాట్సాప్ కమిషన్గా అభివర్ణించారు. ‘‘ ఈసీ ఒక వాట్సాప్ కమిషన్. ఉన్నతాధికారులకు కీలక నిర్ణయాలను వాట్సాప్లలో పంపిస్తోంది. మా రాష్ట్రంలో అక్ర మంగా జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో కోర్టు జోక్యం చేసుకోవాలి. ఎన్నికల నేపథ్యంలోనే మా రాష్ట్రాన్ని ఈసీ లక్ష్యంగా చేసుకుంది. ఓటర్లపై ఈసీ ‘ఎస్ఐఆర్’ బుల్డోజర్తో తొక్కిస్తోంది. ఎస్ఐఆర్ పేరిట బూత్ లెవల్ అధికారులను ఈసీ అధికా రాలు వేధిస్తున్నారు. వేధింపులు, పని ఒత్తిడితో పెద్దసంఖ్యలో బీఎల్ఓలు ఆత్మహత్యచేసుకున్నారు. రాష్టంలో ప్రజాస్వామ్యాన్ని మీరే కాపాడాలి. ఈ కేసులో న్యాయం కోసం మొదట్నుంచీ మా లాయర్లు శతథా పోరాడుతున్నారు. అయినాసరే మాకు ఎక్కడా న్యాయం దక్కట్లేదు. నేను కూడా కట్టుబానిసను. సాధారణ కుటుంబం నుంచి వచ్చా. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడట్లేను. రాష్ట్ర ఓటర్ల ఓటింగ్ హక్కుల కోసం పోరాడుతున్నా. ఇదే విషయమై ఇప్పటికే ఆరు సార్లు ప్రధాన ఎన్నికల కమిషన్ వద్ద మొరపెట్టుకుంటూ లేఖలు రాశా. అయినాసరే ఎలాంటి స్పందన రాలేదు. స్పెల్లింగ్లో చిన్నచిన్న తప్పులను ఎత్తిచూపి కోట్లాది ఓట్లను తొలగించొద్దు. ఇతర డాక్యుమెంట్లు అడక్కుండా ఎస్ఐఆర్ వెరిఫికేషన్లో ఆధార్కార్డ్ను గుర్తింపుకార్డుగా అంగీకరించండి’’ అని మమత కోరారు. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంఛోలీల ధర్మాసనం స్పందించింది. ‘‘మీరు చేస్తున్న వాదనల్లో నిజం ఉంది. అయితే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది’’ అని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఫిబ్రవరి 9వ తేదీ(సోమవారం)కల్లా మీ స్పందన తెలపాలని ఎలక్షన్ కమిషన్కు, పశ్చిమబెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ అధికారికి నోటీసులు జారీచేసింది. బీఎల్ఓలు, ఎలక్టోరల్ రోల్ ఆఫీసర్లతో సున్నితంగా వ్యవహ రించాలని, వాళ్లకు నోటీసులు జారీచేసే ముందు ఆలోచించాలని ఈసీకి ధర్మాసనం సూచించింది. కేసు విచారణ సోమవా రానికి వాయిదా వేశారు.ఎందుకింత తొందర?‘‘ఎస్ఐఆర్ సర్వేను సమగ్రంగా, సంపూర్ణంగా చేయాలంటే కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. కానీ హడావుడి గా కేవలం మూడునెలల్లో ముగించాలని ఎందుకు నిర్ణయించారు? ఇదే సమయంలో రాష్ట్రంలో పండగ సీజన్ ఉంది. పంటల సాగు నడుస్తోంది. అంతా బిజీగా ఉండే సమయంలో హడావిడిగా ఎస్ఐఆర్ ముగించాలని ఎందుకు భావిస్తున్నారు?’’ అని మమత వాదించారు. వేధింపులతో బీఎల్ఓలు చనిపోతున్నారని మమత వాదించగా ఎలక్షన్ కమిషన్ తరఫు సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది కలగజేసుకుని ‘‘ ఉద్దేశపూర్వకంగా మమత సర్కార్ తక్కువ పనితనం ఉన్న 80 మంది గ్రేడ్–2 అధికారులను మాకు సహాయకులుగా అందించింది’’ అని వాదించారు. దీనిపై మమత మాట్లాడారు. ‘‘ ఈసీ నిబంధనల్లో పేర్కొన్న మేరకే తగు రాష్ట్ర ఆఫీసర్లను ఈసీ కోసం కేటాయించాం’’ అని బదులిచ్చారు. మళ్లీ ద్వివేది మాట్లాడబోగా మమత చేతులు జోడించి ‘‘ జడ్జిగారు దయచేసి మమ్మల్ని పూర్తిగా మాట్లాడనివ్వండి’’ అని వేడుకున్నారు. దీంతో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ‘‘మమత ఇంతదూరం వచ్చిందే మాట్లాడేందుకు. అయినా నిజమైన ఓటరు పేరు ఖచ్చితంగా ఓటర్లజాబితా తుది లిస్ట్లో ఉండాల్సిందే. తుది జాబితా నుంచి ఏ ఒక్క అమాయకుడిని పేరు తొలగింపునకు గురికావొద్దు’’ అని అన్నారు. ఇంగ్లిష్ స్పెల్లింగ్లో తప్పులుంటే కూడా నోటీస్లు ఇస్తున్నారని శ్యామ్ దివాన్ వాదించగా కోర్టు ‘‘ఇంగ్లిష్ అంటేనే స్పెల్లింగ్ తప్పులమయం’’ అని ఒక బెంగాళీ సామెతను గుర్తుచేశారు. తెలుపురంగు చీర, నలుపు రంగు శాలువా ధరించి న్యాయవాదులు, పార్టీ ఎంపీ, సీనియర్ న్యాయవాది కల్యాణ్ బెనర్జీలతో వచ్చిన మమతను చూసేందుకు సుప్రీంకోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, పలు కేసుల పిటిషనర్లు ఎగబడ్డారు. -
ఢిల్లీలో బంగభవన్ వద్ద ఉద్రిక్తత
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే పేరిట అధికారులు తమ రాష్ట్రంలో కుటుంబాలను వేధిస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదే విషయమై ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన మమత సోమవారం బంగభవన్ వద్ద బందోబస్తు కోసం వచ్చిన ఢిల్లీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ఓటర్ల సమస్యలను ఈసీ ముందు ఏకరవు పెట్టేందుకు వచ్చిన తనను ధర్నా చేస్తాననే ఉద్దేశంతో అడ్డుకోవడం ఏమాత్రం సబబుగా లేదంటూ ఆమె ఢిల్లీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో పోలీసులను మొహరించారు. తర్వాత అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులతో మమత ఘటన వివరాలను వెల్లడించారు. బెంగాల్లో ఎస్ఐఆర్ బాధితులుగా మిగిలిపోయిన వారిలో దాదాపు 50 కుటుంబాలను మమత ఢిల్లీకి తరలించారు. కొందరు చాణక్యపురిలోని రాష్ట్ర ప్రభుత్వ భవనం అయిన బంగ భవన్లో, మరికొందరి వేర్వేరు చోట్ల విడిది ఏర్పాటుచేశారు. వీళ్లను కలిసేందుకు మమత బంగభవన్కు చేరుకోగానే అక్కడ మొహరించిన భారీ బందోబస్తును చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘బెంగాల్లో ఎస్ఐఆర్ బాధిత కుటుంబాలు మీడియాతో మాట్లాడకూడదా? వాళ్ల గోడు వెళ్లబోసుకోవద్దా?’’అని పోలీసులను మమత నిలదీశారు. ‘‘బంగభవన్కు పోలీసులొచ్చి బాధిత కుటుంబాలను బెదిరించారు. మా కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఎలక్షన్ కమిషన్తో మాకు సమావేశముంది. అధికారికంగా అపాయింట్మెంట్ తీసుకున్నాకే ఇక్కడికొచ్చాం. ఎస్ఐఆర్ వేధింపులకు బెంగాల్లో చాలా మంది చనిపోయారు. వాళ్ల కుటుంబాలు మీడియాతో మాట్లాడకూడదా?’’అని పోలీసులను మమత నిలదీశారు. అప్పుడెక్కడికి పోయారు? ‘‘బెంగాల్ కుటుంబాలు బసచేసిన ప్రతి చోటుకు పోలీసులు ఎందుకొస్తున్నారు? ఇప్పుడొచ్చిన ఇదే పోలీసులు ఎర్రకోటవద్ద బాంబు పేలినప్పుడు ఎక్కడికి పోయారు?. క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులను నేను తప్పుబట్టంలేదు. పోలీస్బాస్లను నిలదీస్తున్నా. మీకు దమ్ములేదు. దేశాన్ని రక్షించే సత్తా లేదు. బెంగాలీలు, జనాన్ని పీడించడమే మీకు తెలుసు. ఎస్ఐఆర్ పేరిట అరాచకాలకు పాల్పడుతున్నారు. ఢిల్లీకి నేనొస్తే వీళ్లకు భయం పట్టుకుంటోంది. నేనేమైనా లక్షల మందిని వెంటేసుకొచ్చానా?. పేదలకు ఢిల్లీలో స్థలం లేదా? ఢిల్లీ జమీందారీలా తయారైంది. నేనేమీ ఇక్కడకు వీళ్లతో కలిసి ధర్నా చేపట్టేందుకు రాలేదు. మేమంతా న్యాయంకోసం ఇక్కడికొచ్చాం’’అని మమత అన్నారు. ఢిల్లీ పోలీసుల ప్రశ్నల పరంపర నుంచి కుటుంబాలను రక్షించేందుకు వాళ్లు ఉంటున్న ప్రాంతాలకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సాకేత్ గోఖలే, దోలా సేన్, కకోలీ ఘోష్ దస్తీదార్, బాపీ దల్దార్లు వెళ్లారు. ఢిల్లీ కైలాశ్ కాలనీలోని పశ్చిమబెంగాల్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గెస్ట్హౌస్లో ఉన్న 20 మందికి రక్షణగా సాకేత్ గోఖలే వెళ్లగా అక్కడికి చేరుకున్న పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. హేలీ రోడ్లోని బంగభవన్కు చేరుకున్న బాధితులతో తర్వాత మమత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ భేటీ అయి వాళ్ల సమస్యలను అడిగి తెల్సుకున్నారు. తర్వాత వాళ్లను వెంటబెట్టుకుని మమత ఈసీ కార్యాలయానికి వెళ్లారు. -
బెంగాల్లో హడావుడిగా సర్ ప్రక్రియ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) జరుగుతున్న తీరుపై నోబెల్ గహ్రీత అమర్త్య సేన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అనవసరపు హడావుడితో సర్ను అమలు చేస్తున్నారన్నారు. దీని కారణంగా ప్రజల భాగస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ఉంటున్న ఆయన ఇటీవల పీటీఐ ప్రతినిధితో మాట్లాడారు. ‘ఓటు హక్కును బలోపేతం చేసే ఓటరు జాబితా ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైంది. ఓటరు జాబితా రివిజన్ ప్రక్రియ కూడా అంతే ముఖ్యమైంది. దీన్ని ఎంతో జాగ్రత్తగా నిర్వహించాలి. అవసరమైన సమయం కేటాయించాలి. అయితే, ఇవన్నీ బెంగాల్లో ప్రస్తుతం లోపించాయి’అని సేన్ పేర్కొన్నారు. ‘ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అత్యంత వేగంగా, హడావుడిగా జరుగుతోంది. ఓటర్లు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తమ ఓటు హక్కును నిరూపించుకోవడానికి అవసరమైన పత్రాలను సమరి్పంచేందుకు తగినంత సమయం ఇవ్వడం లేదు. ఇది ఓటర్లకు అన్యాయం, దేశ ప్రజాస్వామ్యానికి ద్రోహం’అని అమర్త్య సేన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారులపైనా తీవ్ర ఒత్తిడి ఓటర్లే కాదు, ఎన్నికల అధికారులు కూడా సర్ విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తనకు అర్థమైందన్నారు. తన నివాసమున్న శాంతినికేతన్ నియోజకవర్గం నుంచి ఎన్నికల అధికారులు ఫోన్ చేసి, వాకబు చేసిన అంశాలను ఆయన ఉదహరించారు. ‘ఎన్నికల అధికారులు చనిపోయిన మా అమ్మ గురించి అడిగారు. నేను పుట్టినప్పుడు మా అమ్మ వయస్సెంత ఉంటుందంటూ ఆరా తీశారు. గత ఎన్నికల సమయంలో అక్కడే ఓటేశా. అప్పట్లో రికార్డులన్నీ అధికారుల వద్ద ఉన్నాయి. అందులో నా చిరునామా, మా కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలు సహా అన్ని వివరాలు రికార్డుల్లో భద్రంగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ విషయాలను అడగడం బట్టి చూస్తే వారెంత ఒత్తిడికి గురవుతున్నారో అర్థమవుతుంది’అని ఆయన అన్నారు. తన మాదిరిగానే అనేక మంది గ్రామీణ భారతీయులు ఇలాంటి విచారణలను ఇప్పుడు ఎదుర్కొంటున్నారని చెప్పారు. శాంతినికేతన్ ఉన్న ఊళ్లో పుట్టిన తనకు బర్త్ సరి్టఫికెట్ లేకపోవడంతో ఓటరుగా అర్హత సాధించేందుకు స్నేహితులు తన తరఫున అవసరమైన పత్రాలను అందజేశారన్నారు. తన విషయం పరిష్కారమైనప్పుటికీ, ఎటువంటి సాయం అందని సామాన్యులు పడే అవస్థలపై అమర్త్య సేన్ ఆందోళన వ్యక్తం చేశారు. సేన్, ఆయన తల్లి వయస్సుల్లో తేడాలపై సర్ అధికారులు ఆయనకు నోటీసు పంపడం తెల్సిందే. బీజేపీకే లాభమని అంటున్నారుబెంగాల్లో చేపట్టిన సర్తో ఎవరికి లాభం చేకూరుతుందనే విషయంలో తనకు సొంతంగా ఎటువంటి అంచనాలు లేవని అమర్త్య సేన్ తెలిపారు. ‘నేనేమీ ఎన్నికల విశ్లేషకుడిని కాను. ఈ విషయం కచి్చతంగా చెప్పలేను. నా కంటే ఎక్కువ విషయాలు తెలిసిన వ్యక్తులు చెప్పినదేమంటే.. సర్తో తక్కువ మంది ఓటర్లు నమోదవడం వల్ల బీజేపీకే ప్రయోజనమని. ఇది నిజమే కాదో నాకు తెలియదు’అని ఆయన అన్నారు. ‘అయితే, ఈసీకి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఎవరు లబ్ధి పొందుతారు అనే విషయంతో సంబంధం లేకుండా, ఎన్నికల సంఘం ఈ లోపభూయిష్టమైన ఏర్పాటును కొనసాగనీయరాదు. గరి్వంచదగ్గ మన ప్రజాస్వామ్యంలో అనవసరమైన తప్పిదాలు జరిగేలా బలవంతం చేయరాదు’అని ఆయన హితవు పలికారు. నిరుపేదలపైనే ఎక్కువ ప్రభావం సర్ ప్రక్రియలో ఓటరు జాబితా నుంచి నిరుపేదలే ఎక్కువగా తొలగింపునకు గురయ్యే అవకాశం ఉందని అమర్త్య సేన్ చెప్పారు. అధికారులు అడిగే ధ్రువీకరణ పత్రాలను సామాన్యులు తీసుకురావడం కష్టసాధ్యమైన విషయంగా మారడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. కొత్త ఓటర్ల జాబితాలో చేరడానికి అవసరమైన కొన్ని నిర్దిష్ట పత్రాలను సేకరించి, చూపించాలనే నిబంధన నిరుపేదలకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు హక్కును వినియోగించుకునే ప్రస్తుత సామాజిక వాతావరణంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీ వర్గాలు కూడా తమ ఓటు హక్కుతో సహా ఇతర హక్కులను పరిరక్షించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బలపడిన హిందుత్వ అతివాదుల వల్ల ముస్లింలతోపాటు, కొన్ని వర్గాల హిందువులు కూడా కొన్నిసార్లు వెనుకబాటుకు గురవుతున్నారని సేన్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు అందేలా ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. -
‘బీజేపీ రూపొందించిన ఏఐ టూల్స్ను వాడటం వల్లే..’
కోల్కతా: బీజేపీ-ఈసీ టార్గెట్గా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి ఆరోపణలు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరుగుతునన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) లో ఇప్పటివరకూ 54 లక్షల ఓటర్లను తొలగించారని మండిపడ్డారు. ప్రస్తుతం ‘సర్’ ఇంకా ఓటర్ల జాబితా సవరణ చేస్తున్న క్రమంలో కోటి వరకూ ఓటర్లను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విషయం అర్దమవుతుందన్నారు. బీజేపీ తయారు చేసిన ఏఐ టూల్స్ను ఈసీ వాడటం వల్లే ఇంత పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు జరుగుతుందని మండిపడ్డారు. తొలగించబడిన ఓటర్లలో మహిళలు, మైనార్టీలు, పేదలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారన్నారు. 2002 నాటి పాత ఓటరు జాబితాలను డిజిటైజ్ చేయడానికి బీజేపీ రూపొందించిన కృత్రిమ మేధస్సు (AI) టూల్స్ వాడటం వల్ల తప్పులు జరగుతున్నాయని మమతా స్పష్టం చేశారు. గత 20 ఏళ్లలో చేసిన సవరణలను పట్టించుకోకుండా, ప్రజలు తమ గుర్తింపును మళ్లీ నిరూపించుకోవాల్సి వస్తోందని అన్నారు. ఈ తొలగింపులు బీజేపీ వ్యూహంలో భాగమని, టీఎంసీ ఓటర్లను బలహీనపరచడమే లక్ష్యంగా ఉందన్నారు. -
కంప్యూటర్ ఆధారిత విధానమే నోటీసులకు కారణం
పనాజీ: ఎస్ఐఆర్లో భాగంగా నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్కు జారీ చేసిన నోటీసుపై భారత ఎన్నికల సంఘం సోమవారం వివరణ ఇచ్చింది. ఆ నోటీసుకు వ్యవస్థ ఆధారిత విధానమే కారణమని తెలిపింది. ఆయన గతంలో నమోదు చేసిన ఫామ్లో వివరాలు సంపూర్ణంగా లేకపోవడమే ఈ నోటీసుకు కారణమయ్యిందని వెల్లడించింది. పాత గణన ఫామ్లో తప్పనిసరి వివరాలైన ఓటరు పేరు, ఎపిక్ నెంబర్, బంధవుపేరు, అసెంబ్లీ నియోజకవర్గం పేరు, నంబర్ వంటివి లేవని ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఫామ్లో అన్ని వివరాలున్నాయని, ఇప్పుడు ఆయన హాజరు కావాల్సిన అవసరం లేదని ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్ డాక్టర్ మెడోరా ఎర్మోమిల్లా డికోస్టా స్పష్టం చేశారు. మాజీ అడ్మిరల్ ప్రకాశ్కు ఎస్ఐఆర్ నోటీసులు ఇచ్చింది. ఎస్ఐఆర్లో అన్ని ఫీల్డులు ఖాళీగా ఉండటంతో అన్మ్యాప్డ్ కేటగిరీగా పేర్కొంటూ.. ఆయన ఓటరు వివరాలు ధృవీకరించడానికి, తన గుర్తింపును నిర్ధారించడానికి ఎన్నికల అధికారి ముందు హాజరు కావాలని పేర్కొంది. దీనిపై ఎక్స్ వేదికగా ప్రకాశ్ స్పందించారు. ‘20 ఏళ్ల కిందట నేను పదవీవిరమణ చేసిన నాటినుంచి ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కోరలేదు. గోవా ఎలక్టోరల్ రోల్–2026లో నా భార్య పేరు, నా పేరు చూసి ఆశ్చర్యం వేసింది. ఎన్నికల అధికారుల ముందు హాజరుకావడానికి అభ్యంతరం లేదు. కానీ.. నేనుండే చోటు నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి వేర్వేరు తేదీల్లో హాజరు కావాలని కోరారు. కొత్త ఫామ్కు, పాత ఫామ్కు ఆటేమేటిక్ లింకేజ్ లేకపోతే ఎస్ఐఆర్ విధానాన్ని సవరించాలి. బీఎల్ఓ మా ఇంటికి మూడుసార్లు వచ్చారు. ఏవైనా డాక్యుమెంట్స్ లేకపోతే ఆయనైనా అడగాలి.’అని వృద్ధులకు ఉన్న లాజిస్టికల్ అడ్డంకులను ఆయన ఎత్తిచూపారు. ఇది సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వీర చక్ర అవార్డు గ్రహీత, 1971 భారత్–పాకిస్తాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన, నావికాదళానికి అధిపతిగా పని చేసిన అధికారి తన గుర్తింపును నిరూపించుకోవాల్సి రావడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అమర్త్యసేన్కు ఎస్ఐఆర్ నోటీస్
కోల్కతా: ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న దిగ్గజ ఆర్థికవేత్త అమర్త్యసేన్కు కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే సంబంధ నోటీస్ను జారీచేసింది. అమర్త్యసేన్, ఆయన తల్లి మధ్య వయసు వ్యత్యాసం కేవలం 15 సంవత్సరాలలోపే ఉన్నట్లు ఎస్ఐఆర్ సంబంధ దరఖాస్తులో పేర్కొనడంతో దీనిపై వివరణ కోరుతూ నోటీస్ పంపామని పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివరించారు. పశ్చిమబెంగాల్లోని బోల్పూర్లోని శాంతినికేతన్లో సేన్ సొంతింటికి ఈ నోటీస్ను పంపించారు. ప్రస్తుతం అమర్త్యసేన్ విదేశాల్లో ఉండటంతో ఆయనకు ఈ విషయం తెలియజేస్తామని సేన్ కుటుంబసభ్యులు తెలిపారు. నోబెల్ పురస్కారంతో భారత్ను గర్వపడేలా చేసిన దిగ్గజ ఆర్థికవేత్తకు సైతం ఇలాంటి నోటీస్లు పంపడమేంటంటూ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈసీ సిగ్గుమాలిన పని చేసిందని ఆరోపించింది. -
6.5 కోట్ల ఓటర్లు తొలగింపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల నుంచి 6.5 కోట్ల మంది ఓటర్ల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. మృతి చెందడం, శాశ్వతంగా వలస వెళ్లడం, డూప్లికేట్ కేటగిరీ వంటి కారణాలతో ఆయా ఓట్లు తొలగింపునకు గురయ్యాయి. రెండో దశలో భాగంగా 9 రాష్ట్రాలు, 3 యూటీల్లో గత ఏడాది నవంబర్లో ప్రారంభించిన ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. రాష్ట్రాలవారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం తాజాగా ప్రచురించింది. ఎస్ఐఆర్లో భాగంగా మొత్తం 50.90 కోట్ల ఓటర్ల అర్హతలను తనిఖీ చేశారు. అనర్హుల పేర్లను తొలగించిన తర్వాత 44.40 కోట్ల మంది ఓటర్ల పేర్లతో ముసాయిదా జాబితాలు సిద్ధం చేశారు. తొలగింపునకు గురైనవారి పేర్లను ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్/డూప్లికేట్(ఎస్ఏడీ) విభాగంలో చేర్చినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఏకంగా 2.89 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించడం గమనార్హం. -
కర్ణాటక పోలీసులపై బీజేపీ మహిళ సంచలన ఆరోపణలు
బెంగళూరు : ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో కర్ణాటకలోని బీజేపీ మహిళపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. తన ప్రాంతంలో ఓటర్ల జాబితా నిర్వహించడానికి వచ్చిన ప్రభుత్వ అధికారులు తన పట్ల దారుణంగా ప్రవర్తించారని వివస్త్రను చేశారని మహిళా కార్యకర్త ఆరోపించారు. సోమవారం తనను అరెస్టు చేసిన పోలీసు సిబ్బంది తనను కొట్టి, బలవంతంగా బట్టలు విప్పించారని ఆమె ఆరోపించారు. అయితే దీనిపై పోలీసల వాదన మరో ఉంది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఈ వివాదం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే...బీజేపీ కార్యకర్త సుజాత హండి, చాలుక్య నగర్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఎస్ఐఆర్ సర్వే సందర్బంగా తలెత్తిన ఘర్షణ కారణంగా ఆమెను అరెస్టు చేస్తున్నప్పుడు, మగ పోలీసులు తనపైదాడిచేసి అసభ్య పదజాలంతో దూషిస్తూ, అభ్యంతర కరంగా ప్రవర్తించారని బాధితురాలి ఆరోపణ. ఈ సంఘటనకు సంబంధించి రెండు వీడియోలు వైరల్ అయ్యాయి.వాటిలో ఒకదానిలో హండిని పోలీసు వ్యాన్లోకి తీసుకెళ్తున్న దృశ్యాలకు సంబంధించింది.🚨BJP woman worker alleges assault and stripping during SIR protest in Karnataka, police DENY CLAIMS. The woman activist is identified as Sujata Handi Cops claim 'she stripped' pic.twitter.com/dL15PuB5hQ— The Tatva (@thetatvaindia) January 7, 2026 మరోవైపు సుజాత ఆరోపణలు పోలీసులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు ఆమెతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణ పూర్తిగా అవాస్తవం అన్నారు. అయితే, సుజాత అరెస్టును ప్రతిఘటించి, అధికారులతో దురుసుగా ప్రవర్తించిందని పోలీసులు పేర్కొన్నారు. దీంతో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 తో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమే చింపేసుకుందిఅధికారులు నిర్వహిస్తున్న సర్వే సమయంలో స్థానికుల మధ్య విభేదాలు తలెత్తి, అది ఘర్షణకు దారితీసింది. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు, వాగ్వాదాలు జరిగాయి, భౌతిక దాడులకుదిగారని పోలీసులుత ఎలిపారు.దీనిపై స్థానికుడు ప్రశాంత్ బొమ్మాజీ ఫిర్యాదు ఆధారంగా ఆమెను అరెస్టు జరిగినట్లు చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా, సోమవారం ఎనిమిది నుండి పది మంది మహిళా అధికారులతో కలిసి హండిని అరెస్టు చేయడానికి వెళ్లారని, ఈ క్రమంలో నిందితురాలు పోలీసు వ్యాన్లోకి తీసుకెళ్తున్నప్పుడు ఆమే తన బట్టలు తీసేసిందని శశికుమార్ చెప్పారు. అక్కడున్న మహిళా అధికారులు ఆమెకు మరో జత బట్టలు అందించడానికి స్థానికుల సహాయం కోరారని, ఆమెను బట్టలు వేసుకోమని పదేపదే కోరామని చెప్పారు. అలాగే నిందితురాలు సుజాతపై గత ఐదేళ్లలో తొమ్మిది కేసులు నమోదయ్యాయన్నారు. ఐదు గత ఐదేళ్లవి కాగా, నాలుగు ఈ సంవత్సరానికి చెందినవి. ఈ నాలుగింటిలో మూడు ప్రజలు దాఖలు చేసినవి, ఒకటి పోలీసు దాఖలు చేసినట్టు వివరించారు.#WATCH | Hubballi, Karnataka: BJP worker allegedly assaulted in Hubballi, sister of victim, Vijaylakshmi says, "... We were sitting outside our house when around 30 policemen arrived. They took Sujata and all of us inside. Sujata was brutally assaulted, and her clothes were torn.… pic.twitter.com/UQooQPrs7j— ANI (@ANI) January 7, 2026సుజాత అరెస్ట్పై కమిషనర్ స్పందిస్తూ, అరెస్టు సమయంలో, ఆమె తన అనుచరులతో కలిసి పోలీసులను తీవ్రంగా ప్రతిఘటించి ఘర్షణకు దిగిందనీ, సబ్-ఇన్స్పెక్టర్, ముగ్గురు నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారనీ, విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారని ఆయన చెప్పారు.బాధితురాలి సోదరి"మా ఇంటి బయట కూర్చుని ఉండగా, సుమారు 30 మంది పోలీసులు వచ్చి సుజాతతో పాటు అందర్నీ లోపలికి తీసుకెళ్లారు. సుజాతపై దారుణంగా దాడి చేశారు, ఆమె బట్టలు చింపేశారు. మహిళా, పురుష పోలీసు అధికారుతొద్దరూ ఉన్నారు, మమ్మల్ని వదిలేయమని వేడుకున్నాం అయినా పోలీసులు సుజాతను ఈడ్చుకెళ్లారు." అని బాధితురాలి సోదరి విజయలక్ష్మి తెలిపింది. ఈ ఘటనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా లోకానికే తీరని అవమానమని, సంబంధిత లీసులను వెంటనే సస్పెండ్ చేయాలని స్థానిక నేతలు డిమాండ్ చేశారు.ఇదీ చదవండి : 16 అంతస్తుల బిల్డింగ్పైనుంచి పడి టెకీ దుర్మరణం -
ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా కోర్టుకెళతా
సాగర్ ఐల్యాండ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియను సవాల్ చేస్తూ కోర్టుకు వెళతామని టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. ఎస్ఐఆర్ అధికారుల వేధింపులు, ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలు భయాందోళనలకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారని ఆమె ఆరోపించారు. దక్షిణ 24 పరగణాల జిల్లా సాగర్ ఐల్యాండ్లో జరిగిన బహిరంగ సభలో మమత మాట్లాడారు. ఎస్ఐఆర్ సిబ్బంది ఎలాంటి సహేతుక కారణాలను చూపకుండానే అర్హులైన ఓటర్ల పేర్లను ఏకపక్షంగా తొలగిస్తున్నారని విమర్శించారు. మామాలుగా చేపట్టే ఈ ప్రక్రియను ఎన్నికల వేళ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ఆయుధంగా వాడుతున్నారని ఆరోపించారు. ఓటర్ల పట్ల అమానవీయంగా వ్యవహరించడం, ఎస్ఐఆర్ నేపథ్యంలో సంభవిస్తున్న మరణాలపై 6న(మంగళవారం) కోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. ఓ సాధారణ పౌరురాలిగా అవసరమైతే దీనిపై సుప్రీంకోర్టు తలుపు కూడా తడతానన్నారు. ‘నేను కూడా అనుభవమున్న లాయర్నే’అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఈ పిటిషన్ను వ్యక్తిగతంగా వేస్తారా, రాష్ట్ర ప్రభుత్వం లేక టీఎంసీ పక్షానా అనే విషయం ఆమె స్పష్టంగా తెలపలేదు. వ్యాధి గ్రస్తులు, వృద్ధులు కూడా తాము అర్హులైన ఓటర్లమే అని నిరూపించుకోవాల్సి వస్తోందన్నారు. ఏమాత్రం కనికరం చూపకుండా ఎస్ఐఆర్ సిబ్బంది వారినీ క్యూలలో నిల్చోబెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే వలస కార్మికులపై వివక్ష చూపుతున్నారని మమత చెప్పారు. బెంగాలీలో మాట్లాడటం ఈ దేశంలో నేరమైపోయిందంటూ ఆమె..‘నన్ను చంపినా సరే, బెంగాలీలోనే మాట్లాడుతా’అని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ప్రజలు తాయిలాలు చూపే బీజేపీ.. గెలిచిన తర్వాత అణచివేతలకు పాల్పడుతుందని హెచ్చరించారు. ‘ఎన్నికలకు ముందు తలా రూ.10 వేలు పంచిపెడుతుంది.. ఆ తర్వాత వారిపైకి బుల్డోజర్లను నడుపుతుంది’అంటూ బీజేపీపై ధ్వజమెత్తారు. -
మహ్మద్ షమీకి ఈసీ నోటీసులు
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, అతడి సోదురుడు మహ్మద్ కైఫ్కి కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం ఓటరు జాబితాల సవరణలో భాగంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ జరుగుతోంది.అయితే షమీ, కైఫ్ సమర్పించిన ఎన్యుమరేషన్ ఫారమ్లలో కొన్ని వ్యత్యాసాలను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే అతడికి నోటీసులు ఇచ్చారు. కాగా ఉత్తర్ప్రదేశ్లో జన్మించిన షమీ, తన క్రికెట్ కెరీర్ కారణంగా చాలాకాలంగా కోల్కతాలోనే నివసిస్తున్నాడు.షమీతో పాటు అతడు సోదరుడు కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) లోని వార్డు నంబర్ 93 (రాష్బెహారీ అసెంబ్లీ నియోజకవర్గం) లో ఓటర్లుగా నమోదై ఉన్నారు. వాస్తవానికి వారిద్దరూ సోమవారం(జనవరి 5) అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ముందు హాజరుకావాల్సి ఉంది. కానీ షమీ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నందున విచారణకు హజరుకాలేకపోయాడు. "దేశవాళీ క్రికెట్ టోర్నీలో బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున, నిర్దేశించిన సమయానికి హాజరు కాలేకపోతున్నాను" అని షమీ ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. దీంతో షమీ అభ్యర్థన ఎన్నికల కమిషన్ విచారణను వాయిదా వేసింది. బెంగాల్ జట్టు లీగ్ దశ మ్యాచ్లు ముగిసిన తర్వాత, జనవరి 9 నుంచి 11 మధ్య హాజరుకావాలని సూచించింది.చదవండి: IND vs SA: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే -
ఓట్లను ఏకపక్షంగా తొలగిస్తున్నారు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే భారీగా ఓట్లు తొలగింపునకు గురయ్యే ప్రమాదముందన్నారు. అదే జరిగితే, ప్రజాస్వామ్య పునాదులపైనే దెబ్బకొట్టినట్లవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏకపక్షంగా, తప్పులతడకగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ను వెంటనే నిలిపివేయాలన్నారు. ఈ మేరకు ఆమె తాజాగా ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్కు మరో లేఖ రాశారు. ఎటువంటి ప్రణాళిక, సన్నద్ధత లేకుండా ఎన్నికల కమిషన్ హడావుడిగా చేపట్టిన ఎస్ఐఆర్తో తీవ్రమైన అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు, పరిపాలనాపరమైన తప్పిదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నవంబర్ 20, డిసెంబర్ 2వ తేదీల్లో రాసిన లేఖలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో మరిన్ని ఘోరమైన తప్పిదాలకు తావిచ్చినట్లయిందని మమత ఆరోపించారు. సరైన శిక్షణ ఇవ్వలేదు ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొంటున్న అధికారులకు సరైన శిక్షణ లేదని, ఓటర్ల జాబితా సవరణకు వాడుతున్న సాఫ్ట్వేర్, ఐటీ వ్యవస్థలు సరైనవి కావని సీఎం మమత పేర్కొన్నారు. విధుల్లో ఉన్న సిబ్బందికి సరైన, ఒకే విధమైన శిక్షణ ఇవ్వలేదని ఆరోపించారు. అంతేకాదు, ఎన్నికల సంఘం జారీ చేస్తున్న ఆదేశాలలో స్పష్టత కూడా లేదన్నారు. పరస్పర విరుద్ధ ఆదేశాల కారణంగా క్షేత్రస్థాయి సిబ్బందిలో గందరగోళం నెలకొందని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ప్రణాళికా లోపం వల్ల ఈ కీలకమైన ప్రజాస్వామ్య ప్రక్రియ ఒక ప్రహసనంగా మారిందని, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన అభ్యంతరాలను ఇకపై అయినా పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తూ మరోసారి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఐటీ వ్యవస్థల దుర్వినియోగం ఓటర్ల నమోదు అధికారు(ఈఆర్వో)లకు తెలియకుండా, వారి ఆమోదం లేకుండానే ఐటి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని ముఖ్యమంత్రి మమత ఆరోపించారు. దీనివల్ల అర్హులైన ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును కోల్పోయే ప్రమాదముందని చెప్పారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, ఓటు తొలగించాలంటే చట్టపరమైన నిబంధనలు పాటించాలి, కానీ ఇక్కడ ఆ సరైన ప్రక్రియ అమలుకు నోచుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తొలగింపులకు ఎవరు అనుమతి ఇచ్చారు? ఏ చట్టపరమైన అధికారం కింద ఇవి జరుగుతున్నాయి? అని ప్రశ్నించారు. ఈ మొత్తం ప్రక్రియ ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలోనే జరుగుతోంది కాబట్టి, ఎటువంటి అక్రమ, ఏకపక్ష, పక్షపాత చర్యలకైనా ఎన్నికల కమిషనే పూర్తి బాధ్యత వహించాలని మమత స్పష్టం చేశారు. -
అస్సాంలో 10.56 లక్షల పేర్లు తొలగింపు
గౌహతి: అస్సాంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ద్వారా 10.56 లక్షల ఓటర్ల పేర్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఈ మేరకు ముసాయిదా ఓటర్ల జాబితాను శనివారం విడుదల చేసింది. రాష్ట్రంలో 2.51 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నట్లు తేల్చింది. అంతేకాకుండా 93,021 డి–ఓటర్లు(డౌట్ఫుల్ఓటర్స్) ఉన్నట్లు గుర్తించింది. మరణించడం, వలసవెళ్లడం, బహుళ ఎంట్రీలు వంటి కారణాలతో 10,56,291 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. పౌరసత్వం లేకున్నా ఓటర్ల జాబితాలో పేరు ఉన్నవారిని డి–ఓటర్లుగా పరిగణిస్తారు. వీరికి ఓటు వేసే హక్కు ఇవ్వడం లేదు. -
తొలగించిన ఓటర్ల జాబితాను ఈసీని కోరుతాం
కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)ఎస్ఐఆర్) సర్వే సమయంలో తొలగించిన 1.31 కోట్ల ఓటర్లకు సంబంధించిన జాబితా ఇవ్వాలని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ను కోరుతామని టీఎంసీ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఈ నెల 31వ తేదీన జ్ఞానేశ్ను కలుస్తామని తెలిపారు. నిర్ణీత సమయంలోగా ఆ జాబితా ఇవ్వాలని అడుగుతామని, తమ డిమాండ్ నెరవేరని పక్షంలో ఢిల్లీలోని ఈసీ కార్యాలయం ఎదుట ఘెరావ్ చేపడతామని హెచ్చరించారు. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించినట్లు తేలితే ఢిల్లీలోనే నిరసనలను కొనసాగిస్తామన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగించిన ఓటర్ల జాబితాను ఈసీ వెల్లడించక పోవడానికి కారణాలేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ సమయంలో కోటిన్నర మంది ఓటర్ల పేర్ల తొలగింపు బీజేపీ టార్గెట్ అని దీనర్థమా అని బెనర్జీ వ్యాఖ్యానించారు. ముసాయిదా జాబితా నుంచి తొలగింపునకు గురైన 58.20 లక్షల ఓటర్లలో రోహింగ్యాలు, బంగ్లాదేశీ వలసదారులు ఎందరున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ అనంతరం రాష్ట్రంలోని మొత్తం 10.05 కోట్ల జనాభాలో 5.79 శాతం జనాభా పేర్లను మాత్రమే తొలగించడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎస్ఐఆర్ చేపట్టిన రాష్ట్రాల్లో ఇదే అత్యంత తక్కువని ఎత్తి చూపారు. పశ్చిమబెంగాల్లో 50 శాతం వరకు ఓటర్లను గుర్తించలేకపోయినట్లు ప్రకటించిన ఈసీ..89 శాతం మేర ఓటర్ల వివరాలను ఎలా ప్రచురించిందని నిలదీశారు. దీనిపై ఈసీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ముఖ్యమైన వ్యక్తులను సైతం చనిపోయిన జాబితాలో ఈసీ చేర్చిందన్నారు. ఇటువంటి ఉదాహరణలెన్నో ఉన్నాయని, వీటిపై ఈసీపై కేసు ఎందుకు నమోదు చేయకూడదు? అంటూ బెనర్జీ నిలదీశారు. మీరు ఎస్ఐఆర్తో గెలవాలనుకుంటే, ప్రజలు ఎఫ్ఐఆర్తో బదులిస్తారని ఆయన ఈసీనుద్దేశించి వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్తో సరిహద్దులు కలిగిన త్రిపుర, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఎస్ఐఆర్ ఎందుకు చేపట్టడం లేదని ఈసీని అడిగారు. -
దేశ వ్యతిరేకి!
నామ్ రూప్: ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఆ పార్టీ తలమునకలుగా ఉందని మండిపడ్డారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులు అసోంలో స్థిరపడేందుకు అన్నివిధాలా సాయం చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘అందుకే ఓటర్ల జాబితా సవరణను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఓటు బ్యాంకు తప్ప దానికి మరేమీ పట్టదు.ఎలాగైనా అధికారాన్ని ఒడిసిపట్టడమే ఆ పార్టీ ఏకైక లక్ష్యం‘ అని ఎద్దేవా చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలున్న అసోంలో దిబ్రుగడ్ జిల్లాలోని నామ్ రూప్ లో రూ.10,601 కోట్లతో నిర్మించిన భారీ ఎరువుల కర్మాగారాన్ని ఆదివారం ప్రధాని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ను దునుమాడారు. ‘‘ఆ రాష్ట్రంపై దానిది ఎప్పుడూ సవతి ప్రేమే. అస్సామీల అస్తిత్వం, సంస్కృతి, ప్రతిష్ఠ కాంగ్రెస్కు ఏనాడూ పట్టలేదు. వాటి పరిరక్షణకు పాటుపడుతున్నది బీజేపీ మాత్రమే. కాంగ్రెస్ అనే విషం బారినుంచి అస్సాంను కాపాడాల్సిన అవసరముంది . ఈ విషయంలో బీజేపీ ఒక కవచంలా నిలుస్తుంది‘ అన్నారు. రాష్ట్రంలో దశాబ్దాల హింసాకాండకు శాశ్వతంగా తెర దించేందుకు బీజేపీ ఎంతో కృషి చేస్తోందన్నారు. నాటి అహోం రాజా వంశ పాలనలో ఉన్నంత శక్తిమంతంగా అసోంను తీర్చిదిద్ది తీరుతామన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని మోదీ చెప్పారు.ద్రోహాలను కడుగుతున్నాందేశానికి కాంగ్రెస్ ఎన్ని ద్రోహాలు చేసిందో లెక్కే లేదని మోదీ అన్నారు. దాంతో, 12 ఏళ్లుగా తమ సర్కారు ఎంతగా సరిచేస్తున్నా, ఇంకా చక్కదిద్దాల్సిన తప్పిదాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ‘అసోం ఆణిముత్యం భూపేన్ హజారికాకు భారతరత్న ప్రకటిస్తే బాహాటంగా వ్యతిరేకించిన చరిత్ర కాంగ్రెస్ ది! ’ఆడిపాడే వారికి మోదీ భారతరత్న ఇస్తున్నాడు’ అంటూ ఎద్దేవా చేసి అస్సామీల మనసులకు తీరని గాయం చేసింది‘ అని మండిపడ్డారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ విభాగం ఏర్పాటు చేసినా వ్యతిరేకించిన కాంగ్రెస్ ను ఏమనాలో కూడా అర్థం కావడం లేదన్నారు. పారిశ్రామికీకరణ, కనెక్టివిటీ అస్సాం కలలు క్రమంగా సా చేస్తున్నాయంటూ హర్షం వెలిబుచ్చారు. సభకు మహిళలు భారీగా తరలిరావడం హర్షణీయమని మోదీ అన్నారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో తాను భేటీ అయినపుడు ఆయనకు అసోం బ్లాక్ టీ పొడి కానుకగా ఇచ్చినట్టు గుర్తు చేశారు.స్టూడెంట్స్తో బోటు షికారుప్రధాని మోదీ ఆదివారం ఉదయం అసోంలో బ్రహ్మపుత్రా నదిలో బోటు షికారు చేశారు. వినూత్నంగా క్రూయిజ్ షిప్ లో విద్యార్థులతో గంటపాటు పరీక్షా పే చర్చా కార్యక్రమం జరిపారు. పలు స్కూళ్లకు చెందిన 25 మంది స్టూడెంట్లు ఇందులో పాల్గొన్నారు. అంతకుముందు గువాహ తిలో అసోం ఆందోళన అమర వీరుల స్తూపం వద్ద మోదీ ఘనంగా నివాళులు అర్పించారు. అసోంలోకి అక్రమ చొరబాట్లను వ్యతిరేకిస్తూ చేపట్టిన స్వహిద్ సమరక్ ఉద్యమంలో 860 మందికి పైగా అసువులు బాశారు. ఇందుకు గుర్తు నిర్మించిన స్వహిద్ సమరక్ క్షేత్ర వద్ద వెలిగే నిత్య ప్రమిదకు మోదీ ప్రణమిల్లారు. ఆయన రెండు రోజుల అసోం పర్యటన ఆదివారంతో ముగిసింది. -
11.49 కోట్ల మందిలో 1.71 కోట్ల పేర్లు తొలగింపు
న్యూఢిల్లీ: తమిళనాడు, గుజరాత్లలో ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనంతరం 1.71 కోట్ల ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలో లేవని ఎన్నికల కమిషన్ తెలిపింది. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం ఓటర్లు 11.49 కోట్లు కాగా, వీరిలో 9.78 కోట్ల మంది పేర్లు తాజాగా విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో ఉన్నాయని శుక్రవారం ఈసీ వివరించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన తమిళనాడులో మొత్తం ఓటర్లు 6.41 కోట్ల మంది కాగా, 84.81 శాతం మంది అంటే, 5.43 కోట్ల మంది బూత్ లెవెల్ అధికారులకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశారని తెలిపింది. మిగతా సుమారు 97.37 లక్షల పేర్లు తొలగింపునకు గురయ్యాయంది. అదేవిధంగా, గుజరాత్లో మొత్తం ఓటర్లు 5.08 కోట్ల మంది కాగా, 85.50 శాతం మంది, 4.34 కోట్ల మంది ఎన్యుమరేషన్ ఫాంలు అందజేసినట్లు ఈసీ వివరించింది. మిగతా 73.74 లక్షల మంది పేర్లు ఓటరు జాబితా ముసాయిదా నుంచి తొలగింపునకు గురయ్యాయని తెలిపింది. 2026 జనవరి 18వ తేదీ వరకు ఓటర్లు తమ అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఫిబ్రవరి 10వ తేదీ వరకు వీటిని పరిశీలిస్తారంది. ఎస్ఐఆర్ కొనసాగుతున్న పశ్చిమబెంగాల్, రాజస్తాన్, గోవా, పుదుచ్చేరి, లక్షద్వీప్లలో ఈ నెల 16వ తేదీన ముసాయిదా జాబితా ప్రకటిస్తామంది. ఇక్కడ మొత్తం 12.32 కోట్ల మంది ఓటర్లు ముసాయిదాలో తమ పేర్లు ఉన్నాయోలేదో చూసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఓటర్లు ముసాయిదా ఓటరు జాబితాను http://ceo. gujarat.gov.in అనే వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలిపింది. -
మహిళలూ వంటింటి ఆయుధాలతో సిద్ధంకండి : మమత సంచలన వ్యాఖ్యలు
కోల్కతా, సాక్షి: ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) పై తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా సమీక్ష సమయంలో తమ పేర్లు తొలగిస్తే వంటగది పనిముట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర మహిళలను కోరారు. ఓటర్ల జాబితా లక్ష్యంగా ఎస్ఐఆర్ సమీక్ష, రానున్న ఎన్నికల నేపథ్యంలో మమతా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.మొదటినుంచీ ఎస్ఐఆర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమత తాజా వ్యాఖ్యలు ఇక బీజేపీపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమైపోయినట్టు కనిపిస్తోంది. కృష్ణానగర్లో జరిగిన ఒక ర్యాలీలో బీజేపీ తీసుకొచ్చిన ఎస్ఐఆర్ ప్రక్రియపై నిప్పులు చెరిగారు. ఎస్ఐఆర్ పేరుతో తల్లులు, సోదరీమణుల హక్కులను లాక్కుంటున్నారని ఆమె మండి పడ్డారు. ఎన్నికల వేళ ఢిల్లీ నుంచి పోలీసులను తీసుకువచ్చి మహిళల్ని బెదిరిస్తున్నారని విమర్శించారు. ‘‘తల్లులారా, సోదరీ మణులారా, మీ పేర్లు తొలగిస్తే, మీ దగ్గర పనిముట్లు ఉన్నాయి కదా? మీరు వంట చేయడానికి ఉపయోగించే పనిముట్లు. మీకు బలం ఉంది కదా? మీ పేర్లు తొలగిస్తే మీరు ఊరుకోరు కదా? మహిళలు ముందుండి పోరాడతారు’’ అన్నారు.ఇదీ చదవండి: ఇండిగో బాధితులకు స్వల్ప ఊరట,ఆఫర్ ఏంటంటే..మహిళలా? బీజేపీ? తేల్చుకుందాంఅంతేకాదు మహిళలు బలవంతులా లేక బీజేపీ బలమైనదా? తేల్చి చెప్పాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. తాను లౌకికవాదిననీ, ఏ మతతత్వాన్ని నమ్మనని చెప్పుకొచ్చారు. కానీ బీజేపీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా, డబ్బుతో ప్రజలను విభజించేందుకు ఇతర రాష్ట్రాల నుండి ప్రజలను తీసుకువస్తుందని ఆరోపించారు.ఆదివారం కోల్కతాలో నిర్వహించిన సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని బెనర్జీ ప్రస్తావించారు. అవసరమైనప్పుడల్లా మనమందరం ఇంట్లోనే గీత పఠిస్తాం. దానికి బహిరంగ ప్రదర్శన ఎందుకు అని ప్రశ్నించారు. దేవుడనేవాడు మన హృదయాల్లో ఉంటాడు. అల్లాను ప్రార్థించేవారు హృదయాల్లోనే ప్రార్థిస్తారు. రంజాన్ సమయంలో, దుర్గా పూజ సమయంలో, ఇక్కడంతా కలిసి ప్రార్థనలు నిర్వహించుకుంటాం అని గుర్తు చేశారు. అలాగే ధర్మం అంటే పవిత్రత, మానవత్వం, శాంతి, హింస, వివక్ష, విభజన కాదు ఇదే కదా గీతారం, శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే గదా అని ఆమె బీజీపీనుద్దేశించి ప్రవ్నించారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి గొప్ప వ్యక్తులెవరూ ప్రజలను విభజించే రాజకీయాలు చేయలేదని చెప్పారు. స్వాతంత్ర్యం కోసం పోరాడి, దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన బెంగాల్ ప్రజలు తాము భారతదేశ పౌరులమని నిరూపించుకోవాలా అని ముఖ్యమంత్రి అన్నారు. బీజేపీ మిమ్మల్ని ఏదీ తిననివ్వదు. చేపలు, మాంసం తినాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. ఎవరు శాకాహారం, ఎవరు మాంసాహారం తినాలనేది వ్యక్తిగత ఎంపిక, అంతేకానీ బీజేపీది కాదని స్పష్టం చేశారు. తన ప్రభుత్వం బెంగాల్ నుండి ఎవరినీ వెళ్లగొట్టడానికి అనుమతించదన్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని బీఎస్ఎఫ్ పోస్టుల దగ్గరకు ఎవరూ వెళ్లవద్దు ఇదొక్కటే తన విన్నపం అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గాయపడిన పులి చాలా డేంజర్గాయపడిన పులి ఆరోగ్యంగా ఉన్న పులి కంటే ఎక్కువ భయంకరంగా ఉంటుందని బెనర్జీ హెచ్చరించారు "మీరు మాపై దాడి చేస్తే, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో మాకు తెలుసు. అన్యాయాన్ని ఎలా ఆపాలో మాకు తెలుసు," అని ఆమె అన్నారు. బీజేపీ తన ఐటీ సెల్ తయారుచేసిన జాబితాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోందని ఆరోపించారు. బిహార్ చేయలేక పోవచ్చు, కానీ బెంగాల్ చేసి చూపిస్తుంది, మీరు ఏమి చేసినా సరే గుర్తుంచుకోండి అంటూ బీజేపీకి సవాల్ విసిరారు.చదవండి: ఫస్ట్ నైటే చెప్పేశాడు...కొత్త పెళ్ళి కూతురి విడాకులు -
అమిత్ షా, రాహుల్ మాటల యుద్ధం
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, అమిత్ షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఓట్ల చోరీపై తనతో చర్చకు సిద్ధమా? అని రాహుల్ సవాలు విసిరారు. ఎన్నికల సంఘం అండతోనే బీజేపీ ఓట్ల దొంగతనం చేస్తోందని మంపడ్డారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఎన్నికల కమిషనర్లకు పూర్తి స్వేచ్ఛ, అధికారాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, దీని వెనుక ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. హరియాణాలో ఓట్ల చోరీ జరగలేదంటూ అమిత్ షా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. అక్కడ ఓట్ల చోరీకి ఆధారాలున్నాయని చెప్పారు. అమిత్ షా స్పందిస్తూ ప్రతిపక్ష నాయకుడు చెప్పినట్లు తాను నడుచుకోవాలా? అని నిలదీశారు. విపక్షాల ఆరోపణలను ఖండిస్తున్నామని తెలిపారు. అమిత్ షా భయపడుతున్నారని, ఆత్మరక్షణ ధోరణిలోకి వెళ్లిపోయారని రాహుల్ ఎద్దేవా చేశారు. నా ప్రశ్నకు సమాధానమేది?ఓట్ల చోరీ అనేది అతిపెద్ద దేశద్రోహమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. లోక్సభలో తాము అడిగిన ప్రశ్నలకు అమిత్ షా సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. రాహుల్ బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో పారదర్శకత, ఓట్ల చోరీ, ఈవీంఎల పనితీరు గురించి తాము ప్రశి్నస్తే అమిత్ షా ఒక్కమాట కూడా మట్లాడలేదని అన్నారు. ఓట్ల చోరీపై ఇప్పటికే ఆధారాలు చూపించానని గుర్తుచేశారు. కానీ, అమిత్ షా దానిపై స్పందించలేదని రాహుల్ ఆక్షేపించారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేర్వేరు రాష్ట్రాల్లో ఓట్లు వేస్తున్నారని, దీనిపై అమిత్ షా ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు పక్కనపెట్టారో చెప్పాలని నిలదీశారు. ‘సర్’ను గబ్బర్సింగ్లా మార్చారు ‘‘గౌరవప్రదమైన ‘సర్’ పదాన్ని గబ్బర్సింగ్లా భయంకరమైన అంశంగా మార్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పేరిట ప్రజలను వేధిస్తున్నారు. సర్ సర్ అంటూ బీజేపీ ఎంతగా గొంతు చించుకున్నా బెంగాల్ ప్రజలు మాత్రం మేడమ్కు(మమతా బెనర్జీ) అండగా నిలుస్తారు. బీజేపీ నేతలు బెంగాల్లో కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజలకు కనిపిస్తుంటారు. ఎన్నికల్లో ఓడిపోయి ఇంటికి తిరిగివెళ్లారు. బీజేపీ బిహార్లో గెలిచిందేమో గానీ బిహార్లో వారి ఆటలు సాగవు. అసెంబ్లీ ఎన్నికల ముందే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎందుకు చేపట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ – శతాబ్ది రాయ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బ్యాలెట్ పేపర్ల విధానం కావాలి ‘‘ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ పేపర్ల విధానం తీసుకురావాలి. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పనిచేస్తోంది. చాలా ఏళ్లుగా బీజేపీకి సహకరిస్తోంది. ఎన్నికల సంఘానికి కలి్పంచిన కొన్ని చట్టపరమైన వెసులుబాట్లను తొలగించాలి. ప్రధాని ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల ఎంపికకు సంబంధించిన ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చాలి’’ – డింపుల్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఎస్ఐఆర్ అంటే బ్యాక్డోర్ ఎన్ఆర్సీ ‘‘పౌరుల జాతీయ రిజిస్టర్(ఎన్ఆర్సీ)కి మరో రూపమే ఎస్ఐఆర్. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముసుగులో దొడ్డిదారిన ఎన్ఆర్సీని అమలు చేస్తున్నారు. మతం ఆధారంగా ఓటు హక్కును తొలగించడానికి ద్రోహపూరితమైన ప్రక్రియ జరుగుతోంది. ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా మార్చాలి. ఎస్ఐఆర్ చేపట్టడం పార్లమెంటరీ వ్యవస్థను ఉల్లంఘించడమే అవుతుంది. పౌరులకు పార్లమెంట్ ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు కూడా ఈ ప్రక్రియ విరుద్ధమే’’ – అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ ప్రజల హృదయాలను మోదీ హ్యాక్ చేశారు ఎన్నికల్లో నెగ్గడానికి ఈవీఎంలను హ్యాక్ చేయాల్సిన అసవరం ప్రధాని మోదీకి ఎంతమాత్రం లేదు. ఎందుకంటే ఆయన ప్రజల హృదయాలను హ్యాక్ చేశారు. వారి మనసులు గెల్చుకున్నారు. ప్రజల అండతో ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగకుండా ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టిస్తున్నారు’’ – కంగనా రనౌత్, బీజేపీ ఎంపీ మళ్లీ బూత్ల ఆక్రమణ, రిగ్గింగ్ కావాలా? ‘‘ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల విధానం మళ్లీ ప్రవేశపెడితే అప్పటి అరాచకాలు పునరావృతం అవుతాయి. బూత్ ఆక్రమణ, రిగ్గింగ్ మళ్లీ జరుగుతుంది. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ల వాడకాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టులు సమరి్థంచాయి. ఈవీఎంలకు అనుకూలంగా ఎన్నో తీర్పులిచ్చాయి. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదు. ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించాలని ఎన్నికల సంఘం డిమాండ్ చేస్తే ఎవరూ ముందుకు రాలేదు. ఈవీఎంలను అనుమానాలను ఇకనైనా మానుకోవాలి. ఈవీఎంలతో ఎన్నికలు వేగంగా, సురక్షితంగా జరుగుతాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. కానీ, ఎన్నికలు ముసిగిన తర్వాత ఓట్ల చోరీ అంశంపై ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు. నిజంగా ఓట్ల చోరీ జరిగిందని రుజువులుంటే ఎందుకు ఫిర్యాదు చేయలేదో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఎన్నికలు స్వచ్ఛంగా, పారదర్శకంగా జరగడానికి ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోంది. ఎన్నికల వరుస పరాజయాలను జీరి్ణంచుకోలేక ఎన్నికల సంఘంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ మరో 15–20 ఏళ్లపాటు అధికారంలో కొనసాగడం తథ్యం’’ – రవి శంకర్ ప్రసాద్, బీజేపీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి -
చొరబాటుదారుల ఓట్ల కోసమే!
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర హోంశాఖ అమిత్ షా కొట్టిపారేశారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగితే.. తప్పుడు మార్గాల్లో ఎన్నికల్లో నెగ్గే అవకాశం పోతుందని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ వరుస ఓటములకు ఆ పార్టీ నాయకత్వమే తప్ప ఈవీంఎలు లేదా ఓట్ల చోరీ కారణం కాదని తేల్చిచెప్పారు. దేశంలో ఎన్నికల సంస్కరణలపై బుధవారం లోక్సభలో ప్రత్యేక చర్చను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం అక్రమ వలసదారులను ఓటర్ల జాబితాలో కొనసాగించడానికే ఎస్ఐఆర్ను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు ఎంతగా వ్యతిరేకించినా, సభ నుంచి ప్రతిపక్షాలు ఎన్నిసార్లు వాకౌట్ చేసినా సరే చొరబాటుదారులను గుర్తించడం, వారి ఓట్లను తొలగించడం, వారిని బయటకు పంపించడం తథ్యమని తేల్చిచెప్పారు. అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించినవారికి ఓటు హక్కు ఇవ్వాలనడం న్యా యమేనా? అని ప్రశ్నించారు. చొరబాటుదారులను అధికారికంగా గుర్తించి, ఎన్నికల జాబితాలో చేర్చాలంటూ నిస్సిగ్గుగా వాదిస్తున్నాయంటూ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడుసార్లు ఓట్ల చోరీ జరిగింది ‘‘దేశంలో మూడుసార్లు ఓట్ల చోరీ జరిగింది. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ ఓట్ల చోరీకి పాల్పడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ ప్రధానమంత్రి కావాలని కోరుతూ 28 మంది ఆయనకు మద్దతిచ్చారు. నెహ్రూకు కేవలం ఇద్దరే మద్దతుగా నిలిచారు. అయినప్పటికీ ఓట్ల చోరీతో నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. ఇందిరా గాంధీ ఎన్నికను న్యాయస్థానం కొట్టివేసింది. అయినా సరే ఆమె ప్రధానమంత్రి అయ్యారంటే కారణం ఓట్ల చోరీ. ఇక సోనియా గాంధీ ఈ దేశ పౌరురాలు కాకముందే ఎన్నికల్లో ఓటు వేశారు. అలా చేయడం ఓటు చోరీ కాదా? విపక్ష నాయకులు కేసుల్లో ఓడిపోతే న్యాయమూర్తిని నిందిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలపై నిందలేస్తున్నారు. ఆ నిందలను జనం పట్టించుకోకపోతే ఓట్ల చోరీ జరిగిందంటున్నారు. బిహార్లో కాంగ్రెస్ పరాజయానికి ముమ్మాటికీ ఆ పార్టీ నాయకత్వమే కారణం. ఈవీఎంలు లేదా ఓట్ల చోరీ కారణం అనడం ఉత్తమాట. కాంగ్రెస్ పెద్దలు ఏదో ఒకరు ఆ పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పక తప్పదు. ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి మృతి చెందినవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, 18 ఏళ్ల వయసున్నవారిని చేర్చడం, విదేశీయులను తొలగించడం ఎస్ఐఆర్ అసలు ఉద్దేశం. ఈ ప్రక్రియను వ్యతిరేకించడం ద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయొచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. నిజానికి మన దేశ ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి. ఓట్ల చోరీ ఓట్ల చోరీ అంటూ కేకలు పెట్టారు. చొరబాటుదారులను కాపాడాలంటూ యాత్రలు చేశారు. చివరికి బిహార్ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో మేమే గెలిచాం. ఎన్నికల్లో ఓడిపోతే ఎన్నికల సంఘాన్ని, ఓటర్ల జాబితాను తప్పుపట్టడం, ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగితే ప్రతిపక్షాలు ఎన్నికల్లో ఎందుకు పోటీచేశాయి? దేశంలో ఇప్పటిదాకా ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సందర్భాల కంటే ఓడిపోయిన సందర్భాలే ఎక్కువ. అయినా సరే ఏనాడూ ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టలేదు. ఈవీఎంలతో ఎన్నికల చోరీని అడ్డుకోవచ్చు. తప్పుడు పనులు చేయడం సాధ్యం కాదు. అందుకే విపక్షాలు ఈవీఎంలు వద్దంటున్నాయి. వారి బండారం పూర్తిగా బయటపడింది. దేశ ప్రజలు ప్రతిపక్షాలకు ఓట్లు వేయడం లేదు. ఎస్ఐఆర్తో చొరబాటుదారుల ఓట్లు కూడా రద్దయితే ఇక పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. 2004, 2009లో ఈవీఎంలతో ఎన్నికలు జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ గెలిచింది కదా! 2014లో ఓడిపోయిన తర్వాతే ఈవీఎంలపై ఆ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చించకుండా మేము పారిపోవడం లేదు. ఎస్ఐఆర్ అంశం ఇప్పుడు ఎన్నికల సంఘం పరిధిలో ఉంది. అందుకే సభలో చర్చించలేం. ఎన్నికల సంస్కరణలపై చర్చించాలని కోరితే వెంటనే అంగీకరించాం. ఎస్ఐఆర్పై ఏకపక్షంగా అసత్య ప్రచారం చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం ఇకనైనా మానుకోవాలి’’ అని అమిత్ షా తేల్చిచెప్పారు. ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. కాంగ్రెస్ హయాంలోనే ఎస్ఐఆర్ ప్రారంభం ఎస్ఐఆర్ గురించి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయి. చొరబాటుదారులు మన ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను ఎన్నుకొనే పరిస్థితి ఉంటే దేశ ప్రజాస్వామ్యం భద్రంగా ఉంటుందా? ఈ విషయం అందరూ ఆలోచించాలి. చరిత్ర గురించి మేము మాట్లాడడం ప్రతిపక్షాలకు నచ్చడం లేదు. చరిత్ర తెలుసుకోకుండా సమాజం గానీ, దేశం గానీ ఎలా ముందుకెళ్తాయి. దేశంలో మొట్టమొదటి ఎస్ఐఆర్ను 1952లో నిర్వహించారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు. రెండోసారి 1957లో నెహ్రూ హయాంలో, మూడోసారి 1961లో నెహ్రూ హయాంలోనే ఎస్ఐఆర్ నిర్వహించారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో, ఇందిరా గాంధీ హయాంలో, రాజీవ్ గాంధీ హయాంలో, పీవీ నరసింహారావు హయాంలో కూడా ఎస్ఐఆర్ చేపట్టారు. అనంతరం అటల్ బిహారీ వాజ్పేయి పాలనలో, మన్మోహన్ సింగ్ పాలనలోనూ ఎస్ఐఆర్ జరిగింది. అప్పట్లో ఎస్ఐఆర్ను ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. ఎన్నికలు స్వచ్ఛంగా జరగాలంటే, ప్రజాస్వామ్యం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఎస్ఐఆర్ అవసరం కాబట్టి వ్యతిరేకించలేదు. -
నెహ్రూ, ఇందిర, సోనియానే ఓట్ చోరీ చేశారు
సాక్షి, ఢిల్లీ: ఓట్ చోరీ వ్యవహారంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ఒక్కసారిగా వేడెక్కాయి. లోక్సభలో రాహుల్ గాంధీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ అంశంపై చర్చకు రావాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. అయితే.. ఆ సవాల్కు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లోక్సభలో ఎస్ఐఆర్పై చర్చకు అమిత్ షా భయపడుతున్నారు. మొదటిసారి ఈసీకి పూర్తి ఇమ్యూనిటీ ఇచ్చారు. హర్యానాలో 19 లక్షల నకిలీ టోర్లు ఉన్నారు. ఓట్ల చోరీ వ్యవహారంలో నా ఆరోపణలకు జవాబివ్వగలారా? చర్చకు సిద్ధమా? అని రాహుల్ అన్నారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ.. నేను ఎప్పుడు మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో ఎవరూ నిర్ణయించలేరు. వాళ్లకు(రాహుల్ను ఉద్దేశించి..) కాస్త సహనం ఉండాలి. అన్ని ప్రశ్నలకు జవాబిస్తా. ధైర్యంగా ఉండాలి. రాహుల్ గాంధీ ఓట్ చోరీ పేరిట హైడ్రోజన్ బాంబు వేశారు. హర్యానాలో నకిలీ ఓటర్లు ఉన్నారని అంటున్నారు. కానీ, అక్కడ ఎలాంటి నకిలీ ఓటర్లు లేరు. నెహ్రూ హయాంలోనే ఓట్ చోరీ జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్కు మెజారిటీ వచ్చినా.. నెహ్రూనే ప్రధాని అయ్యారు. ప్రధాని విషయంలో నెహ్రూ ఓట్ చోరీకి పాల్పడ్డారు. అలహాబాద్లో ఇందిరా గాంధీ ఓట్ చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోనియా గాంధీ భారత పౌరురాలు కాకముందే ఓటేసి ఓట్ చోరీ చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ మేం ఈసీని తప్పుబట్టలేదు’’ అని అమిత్ షా అన్నారు. ఈ క్రమంలో నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధమైన సంస్థ. సీఈసీని ఎన్నుకునే కమిటీలో ప్రతిపక్ష నేత కూడా ఉంటారు. ఓటర్ల సవరణ బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఎస్ఐఆర్ ప్రక్రియ తాము మొదలుపెట్టిందేం కాదని.. ఏనాటి నుంచో కొనసాగుతోందని.. అలాంటప్పుడు దీనిపై చర్చే అనవసరం అని అన్నారాయన. చివర్లో.. భారత్లోని విదేశీ ఓటర్లను ఏరిపారేయాల్సిన అవసరం ఉందని షా వ్యాఖ్యానించారు. -
బ్రెజిల్ మహిళ ఫొటోపై సమాధానం లేదు: రాహుల్
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల ఎనిమిదవ రోజున(బుధవారం) లోక్సభలో.. భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ప్రారంభించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కసరత్తుపై లోక్సభ చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ మనీష్ తివారీ ఈ చర్చను ప్రారంభించారు. ఆయన ఎన్నికల కమిషన్లో సంస్కరణలను డిమాండ్ చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ చర్చను ముందుకు తీసుకెళుతూ.. ఎన్నికల కమిషన్.. ఎన్నికలను రూపొందించేందుకు పాలక భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో కుమ్మక్కవుతున్నదంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఓటు చోరీని మించిన జాతి వ్యతిరేక చర్య మరొకటి లేదని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారు. ఎలక్షన్ కమిషన్, సిబిఐ , ఈడి, ఐటి విభాగాలను బిజెపి కబ్జా చేసిందన్నారు. ఎన్నికల కమిషనర్ల సెలక్షన్ల కమిటీ నుంచి సిజెఐ ని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో సీసీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వడం లేదని చెబతూ, ఈవీఎం వెరిఫికేషన్ కు యాక్సెస్ ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల జాబితాలో 22 సార్లు బ్రెజిల్ మహిళ ఫోటో ఉందని, దీనిపై తన ప్రశ్నలకు ఎన్నికల సంఘం జవాబులు చెప్పడం లేదన్నారు. ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని, తాను అధికారంలోకి వస్తే అన్నింటిని చక్కదిద్దుతామని రాహుల్ పేర్కొన్నారు.కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ ఇండిగో వైఫల్యం వల్ల ఆర్థిక నష్టం అత్యంత భారంగా మారిందని అన్నారు. ఇప్పటివరకు మొత్తం ఆర్థిక నష్టం ఎంతో తెలియదు. ఎన్ని టిక్కెట్లు రద్దు చేశారో తెలుస్తోంది.ఈ విషయంలో ఇతర నష్టాల సంగతేంటి? హోటల్ బుకింగ్, ఈవెంట్లు రద్దు అయ్యాయి. వీటన్నింటినీ ఎవరు భరిస్తారు? ఈ భారీ వైఫల్యం కారణంగా ప్రయాణికులు ఎంత ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారో ప్రభుత్వానికి ఏమైనా అంచనా ఉందా?" అని కార్తీ చిదంబరం ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనను సమర్థించారు. పార్లమెంట్ సమావేశం జరుగుతోంది. అయినప్పటికీ కాలుష్యం గురించి లేదా ఎన్నికల సంస్కరణల గురించి ప్రధానమంత్రికి పెద్దగా పట్టింపు లేదు.వారు 150 ఏళ్ల నాటి వందేమాతరం గురించి మాట్లాడుతున్నారు, కానీ యువత నిరుద్యోగం గురించి ఎటువంటి ఆందోళన లేదు అని రంజీత్ రంజన్ ఎద్దేవా చేశారు. వారు ఎవరి సమస్యలను పరిష్కరిస్తున్నారు? రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్తున్నారు? అని అడుగుతున్నారు. 140 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసే అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందా?" అని ఆమె ప్రశ్నించారు. పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో కూడా ఎన్నికల సంస్కరణలపై చర్చ చేపట్టనున్నారు. దీనికి ముందు వందేమాతరం 150వ వార్షికోత్సవంపై చర్చ కొనసాగింది. అంతకు ముందు రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వందేమాతరం 150వ వార్షికోత్సవంపై రాజ్యసభలో ప్రత్యేక చర్చను చేపట్టారు. వందేమాతరంపై విమర్శలు చేసేవారు కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. -
S.I.R. Row: ఎస్ఐఆర్పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. కీలక వ్యాఖ్యలు చేసింది కూడా. వరుసగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోనే ఎస్ఐఆర్ జరుగుతోంది. ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండోదశ ఎస్ఐఆర్ కొనసాగుతోంది. దీనిపై పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు వేర్వురుగా పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే ఈ పిటిషన్లను వేర్వేరుగా విచారిస్తున్న సుప్రీం కోర్టు.. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుందని మంగళవారం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో భాగమైన బీఎల్ఓలు (బూత్ లెవెల్ అధికారులు), ఇతర అధికారులకు బెదిరింపులు రావడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలను తమ దృష్టికి తీసుకురావాలని లేకపోతే గందరగోళ పరిస్థితులు ఎదురుకావొచ్చని హెచ్చరించింది. బీఎల్ఓలకు బెదిరింపులు, ఎస్ఐఆర్ ప్రక్రియలో అంతరాయాల గురించి తమ దృష్టికి తీసుకువస్తే.. వారి భద్రతకు సంబంధించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించింది. బీఎల్ఓలు ఒత్తిడికి గురైతే వారి స్థానంలో వేరే వారిని తీసుకోవడం వంటి పరిష్కార మార్గాలను అనుసరిస్తూ.. ఎస్ఐఆర్ జరిగేలా చూడాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ ప్రక్రియ నిర్వహణలో ఏవైనా అవాంతరాలు ఏర్పడితే.. అధికారులను రక్షించడానికి పోలీసుల సహకారం తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం (Election Commission) కోర్టుకు వెల్లడించింది. -
పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగాలి: లోక్సభలో మిథున్రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)ను విపక్షాలు వ్యతిరేకిస్తుండడంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నేడు ఈ అంశంపై చర్చ జరిగింది. అందరికీ సౌకర్యంగా ఉంటే.. ఎస్ఐఆర్ తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదని వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే.. ఈ చర్చలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై మాట్లాడారు. అందరికీ సౌకర్యంగా ఉంటే.. ఎస్ఐఆర్తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలి. వెబ్ కాస్టింగ్ ఫుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలి. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే మా అభిమతం.... ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 6గం. తర్వాత అకస్మాత్తుగా ఓటింగ్ శాతం పెరిగింది. ఆ తర్వాతే సుమారు 51 లక్షల ఓట్లు రికార్డయ్యాయి. మేం ఇచ్చిన ఫిర్యాదుల పైన ఈసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. విజయనగరం పార్లమెంటులో కౌంటింగ్ సమయంలో 99 శాతం, పోలింగ్ సమయంలో 60 శాతం చార్జింగ్ ఉంది. ఈవీఎంలో చార్జింగ్ ఎలా పెరిగిందని అడిగితే సమాధానం లేదు. వీవీ ప్యాట్ స్లిప్పులు అడిగితే అప్పటికే తగలబెట్టామని చెప్పారు. వెరిఫికేషన్ కోసం ఈవీఎంలు అడిగితే వేరే వాటిని ఇచ్చారు.... ఈసీ అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఫిర్యాదులు చేసిన ఉపయోగం ఉండడం లేదు. హిందూపురం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బూత్ లో మా పార్టీ కికు 472 ఓట్లు వస్తే.. అక్కడే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని ఎలన్ మస్క్ సహా అనేక మంది నిపుణులు అంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందుకే పేపర్ బ్యాలెట్ సిస్టంలో ఎన్నికలు నిర్వహించాలి. పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయి’’ అని మిథున్రెడ్డి అన్నారు. -
నేడు ఎస్ఐఆర్పై చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే, ఎన్నికలపై సంస్కరణలపై మంగళవారం లోక్సభలో ప్రత్యేక చర్చ జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు చర్చను లోక్సభలో విపక్షనేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. ఈ అంశంపై లోక్సభలో మొత్తంగా పది గంటల సమయం కేటాయించారు. కాంగ్రెస్ తరఫున కేసీ వేణుగోపాల్, మనీష్ తివారీ, వర్ష గైక్వాడ్, మొహమ్మద్ జావైద్, ఉజ్వల్ రామన్ సింగ్, ఇషా ఖాన్ చౌదరి, మల్లు రవి, ఇమ్రాన్ మసూద్లు మాట్లాడతారు. తర్వాత ప్రభుత్వం తరఫున కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ బుధవారం చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ‘ఓట్ల చోరీ‘, ఎన్నికల కమిషన్ జవాబుదారీతనం అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశముంది. ఓటర్ల జాబితాలో గణనీయమైన వ్యత్యాసాలు, ఎన్నికల విధానాలను తారుమారు చేయడం వంటి అంశాలపై ఇప్పటికే ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించడం తెల్సిందే. మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల్లో తీవ్రమైన తప్పిదాలు జరిగాయని, ఓటరు జాబితా సవరణ పేరిట పెద్ద ఎత్తున నిజమైన పౌరుల ఓట్లను తొలగించారని, నకిలీ ఓట్లను కలిపారని రాహుల్ గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఎస్ఐఆర్ కసరత్తు చాలా మంది బూత్ స్థాయి అధికారుల(బీఎల్ఓ) పాలిట శాపంగా తయారైందని, అందుకే తీవ్ర ఒత్తిడితో పలువురు చనిపోయారని విపక్షాలు ఆరోపి స్తున్నాయి. ఈ అంశాన్ని విపక్ష సభ్యులు సభలో లేవనెత్తేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. -
ఎస్ఐఆర్కు తప్పుడు సమాచారం .. దేశంలో తొలి కేసు నమోదు
లక్నో: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే సమయంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించిన ఆరోపణలపై దేశంలోనే మొదటిసారిగా ఉత్తరప్రదేశ్లో ఓ కుటుంబంపై కేసు నమోదైంది. రాంపూర్ జిల్లాకు చెందిన నూర్జహాన్ ఇద్దరు కుమారులు ఆమిర్ ఖాన్, డానిష్ ఖాన్ దుబాయ్, కువాయిట్లలో కొన్నేళ్లుగా నివసిస్తున్నారు. అయితే, నూర్జహాన్ ఎస్ఐఆర్ బూత్ లెవల్ అధికారులకు వాళ్లిద్దరూ రాంపూర్లోని జ్వాలా నగర్లోనే ఉంటున్నట్లు ఫోర్జరీ పత్రాలను ఎన్యుమరేషన్ సందర్భంగా సమర్పించింది. డిజిటైజేషన్ ఫాంలను పరిశీలించిన బీఎల్వోల ఈ విషయాన్ని గుర్తించారు. ఆరా తీయగా వారిద్దరూ విదేశాల్లో ఉంటున్నది నిజమేనని తేలింది. దీంతో, నిజాలను దాచిపెట్టినందుకు నూర్జహాన్, ఆమె ఇద్దరు కుమారులపై ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 31 కింద, బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేసినట్లు జిల్లా మేజిస్ట్రేట్ అజయ్ కుమార్ ద్వివేది చెప్పారు. -
బీఎల్వోలపై పనిభారం తగ్గించండి
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్ పలు రాష్ట్రాల్లో చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో పాల్గొనే బూత్ లెవల్ అధికారు(బీఎల్వో)లపై పని ఒత్తిడి తగ్గించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. వారిపై పనిభారం తగ్గించేందుకు వీలుగా మరింత మంది సిబ్బందిని కేటాయించాలని సంబంధిత రాష్ట్రాలను ఆదేశించింది. ఎస్ఐఆర్ను గడువులోగా పూర్తి చేయాలంటూ బీఎల్వోలపై ఈసీ ఒత్తిడి పెంచుతోందని, అలా చేయని వారిపై ప్రజాప్రాతినిథ్య చట్టం కింద చర్యలు తీసుకుంటోందని, ఈ పరిస్థితుల్లో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా ఉన్నాయని నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) సుప్రీంలో పిటిషన్ వేసింది. దీనిని గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగి్చల ధర్మాసనం విచారణ చేపట్టింది. బీఎల్వోలుగా విధులు నిర్వర్తిస్తున్న టీచర్లు, అంగన్ వాడీ సిబ్బంది వంటి వారిపై ఒత్తిడి చేయడం, కేసులు నమోదు చేయడం వంటి ఆపేలా ఈసీని ఆదేశించాలని ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ లాయర్ గోపాల్ శంకరనారాయణన్ కోరారు. ‘రాష్ట్రాలు ఎస్ఐఆర్ కోసం ఈసీకి అదనంగా సిబ్బందిని కేటాయిస్తే సరిపోతుంది. పనిగంటలు తగ్గి, బీఎల్వోలపై ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. ఇలాంటి ఇబ్బందులుంటే రాష్ట్రాలు పరిష్కరించుకోవాలి. ఎస్ఐఆర్ జరుగుతున్న రాష్ట్రాలు అవసరమైన మేరకు అదనంగా సిబ్బందిని నియమించుకోవాలి’అని ధర్మాసనం పేర్కొంది. ‘సిబ్బంది ఎవరైనా ప్రత్యేక కారణాలతో మినహాయింపు కోరిన పక్షంలో సంబంధిత రాష్ట్ర ఉన్నతాధికారి అలాంటి కేసులను పరిస్థితులను బట్టి డీల్ చేయాలి. వేరొకరిని ఆస్థానంలో నియమించాలి’అని ధర్మాసనం వివరించింది. అలా ప్రత్యామ్నాయం ఇవ్వలేనప్పుడు, ఆ ఉద్యోగిని బాధ్యతల నుంచి ఉపసంహరించుకోవాలనడం తమ ఉద్దేశం కాదని కూడా ధర్మాసనం స్పష్టతనిచి్చంది. విధుల్లో మరణించిన బీఎల్వోల కుటుంబాలకు పరిహారం ఇవ్వడం వంటి అంశాలపై తర్వాత వేరుగా ఆదేశాలిస్తామని తెలిపింది. -
రచ్చ బదులు చర్చ!
పార్లమెంటు శీతకాల సమావేశాలు ఈసారి కూడా వాయిదాల్లోనే ముగిసిపోతాయని నిరాశపడినవారికి మంగళవారం పాలక, ప్రతిపక్షాలు ఒక అంగీకారానికి రావటం ఊరట నిచ్చింది. ఎన్నికల సంఘం(ఈసీ) వివిధ రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే (సర్) పేరిట కొనసాగిస్తున్న ఓటర్ల జాబితా సవరణపై పార్లమెంటులో చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టడం, అందుకు కేంద్రం సిద్ధపడకపోవడం పర్యవసానంగా సమావేశాల తొలి రోజు నుంచే ప్రతిష్టంభన ఏర్పడింది. చివరకు ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ‘సర్’ను చర్చిద్దామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు విపక్షం అంగీకరించింది. దేశ ప్రజల సార్వభౌమా ధికారానికి పార్లమెంటు ప్రతీక అంటారు. ప్రజా సమస్యలపై చర్చకు, దేశ ప్రగతికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవటానికి, చట్టాల రూపకల్పనకు అది ప్రధాన వేదిక. పాలకపక్ష జవాబుదారీతనాన్ని పెంచటం, ప్రజల గొంతుక వినిపించటం విపక్షాలు చేసే పని. కానీ ఆచరణలో అదంతా ఎటో కొట్టుకుపోతోంది. లోక్సభ చరిత్ర గమనిస్తే దాని వర్తమాన స్థితి ఆశ్చర్యం కలిగిస్తుంది. 1952–70 మధ్య అది ఏడాదికి సగటున 121 రోజులు సమావేశమయ్యేది. అంటే అయిదేళ్లలో సగటున 605 రోజులు సమావేశాలుండేవి. అటు తర్వాత నుంచి ఏడాది సగటు 68 రోజులకొచ్చింది. అయిదేళ్ల సగటు 340 రోజులకు తగ్గింది. దాదాపు సగానికి పడిపోయిన పని దినాలైనా సజావుగా సాగుతున్న జాడలేదు. సమావేశాలు మొదలవుతున్నాయంటే ప్రతిష్టంభన సృష్టించటమే విపక్షాల ఏకైక వ్యూహంగా మారింది. సభలో ఆందోళనలు నిర్వహించటం, ముందుకు సాగనీయకపోవటం తమ ప్రజాస్వామిక హక్కని విపక్షాలు భావిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటు ఔన్నత్యం గురించి, ప్రజా స్వామ్యం గురించి గంభీరోపన్యాసాలివ్వటం... విపక్షంలో ఉంటే సమావేశాలకు ఆటంకం కలిగించటం రివాజైంది. ఆ తర్వాత చానెళ్లకొచ్చి మహోద్రేకంతో ఊగిపోతూ ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవటం దానికి అదనం. ఈ మొత్తం వ్యవహారంలో సామాన్య పౌరులకు పనికొచ్చేది ఒక్కటీ ఉండదు. పార్లమెంటు సమావేశాలు సక్రమంగా సాగకపోవటం వల్ల ప్రజలకు జరిగే అన్యాయం సాధారణమైనది కాదు. ఎంతో కీలకమనుకున్న బిల్లులు సైతం ప్రవేశపెట్టిన కొన్ని రోజుల్లోనే ఆమోదం పొంది చట్టంగా మారుతున్నాయి. వాటిని అధ్యయనం చేయ టానికీ, అభ్యంతరాలు చెప్పటానికీ, సవరణలు ప్రతిపాదించటానికీ సమయం ఎక్కడ? కొన్ని బిల్లులైతే నిండా గంట పాటైనా చర్చించిన దాఖలా ఉండటం లేదు. చాలా బిల్లులు విపక్షాల ఆందోళనల మధ్యే ఆమోదం పొందినట్టు ప్రకటించటం ఇటీవలి కాలంలో పెరి గింది. బడ్జెట్ ప్రతిపాదనలూ, ద్రవ్యబిల్లులు కూడా ఏ చర్చా లేకుండానే సునాయాసంగా గట్టెక్కుతున్నాయి. పార్లమెంటులో ఎంతో ప్రాధాన్యం ఉండే ప్రశ్నోత్తరాల సమయం వాయిదాల కారణంగా కుంచించుకుపోతోంది.‘సర్’ చాటున తనకు సంబంధం లేని పౌరసత్వ నిర్ధారణ బాధ్యతను ఈసీ భుజాన కెత్తుకుంది. ఇందువల్ల ఓటర్గా నమోదు కావాలంటే ముందు ఈ దేశ పౌరులమని నిరూపించుకోవాల్సిన బాధ్యత జనం పైనే పడింది. అందుకోసం గడువులోగా దాఖలు చేయాల్సిన పత్రాలు అందరి వద్దా అప్పటికప్పుడు లభ్యమయ్యేవి కాదు. తల్లితండ్రుల పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన పత్రాలు సైతం తెచ్చివ్వాలంటే కూలీ నాలీ చేసుకునే పౌరులు ఎక్కడికని, ఎంతకని తిరుగుతారు? ఈ స్థితిలో బిహార్లో ఓటుహక్కు కోల్పోయిన 47 లక్షల మందిని ‘విదేశీయులు’గా ముద్రేయటం సాధ్యమేనా? చిత్ర మేమంటే ఇంతటి కీలకమైన నిర్ణయంపై ముందుగా పార్లమెంటు చర్చించలేదు. ప్రస్తుతం ఆ అంశాన్ని సుప్రీంకోర్టు విచారిస్తుండగా సభలో చర్చకు రాబోతోంది! ఇది కూడా మొత్తంగా ఎన్నికల సంస్కరణలపై కావటం వల్ల ఆ చర్చ కాస్తా ఎటు మళ్లుతుందో తెలియదు. ఇటీవలి కాలంలో ఈవీఎంల వింతలూ, ఎన్నికలైనాక ప్రకటించే పోలింగ్ శాతం పెరుగుతూ పోవటం వంటి అంశాల్లో ఈసీ మౌనమే సమాధానమవుతోంది. ఎన్నికల సంస్కరణల కన్నా ముందు ఈసీ పనితీరు ప్రక్షాళన, ఆ సంస్థ జవాబు దారీతనం పెంచటం వగైరాల అవసరం ఉంది. వీటన్నిటినీ పార్లమెంటు సమగ్రంగా చర్చిస్తుందా? పరస్పర నిందారోపణలతో కాలం గడుస్తుందా? ఈ నెల 9న జరగబోయే చర్చను దేశమంతా ఆసక్తితో గమనిస్తుంది. -
ఉమ్మడి వ్యూహంపై విపక్షాల చర్చ
న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేతలు బుధవారం పార్లమెంట్లో ప్రాంగణంలోని మల్లికార్జున ఖర్గే చాంబర్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ, జేఎంఎం, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్, ఎన్సీపీ(ఎస్పీ), శివసేన(ఉద్ధవ్) తదితర పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై పార్లమెంట్లో చర్చించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. ఈ విషయంలో విపక్షాలన్నీ ఐక్యంగా ముందుకెళ్లాలని తీర్మానించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రతిపక్ష నేతలు స్పష్టంచేశారు. పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చలు జరగాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే, విపక్షాల భేటీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 1వ తేదీన సమావేశానికి కూడా వారు హాజరు కాలేదు. లేబర్ కోడ్స్పైపత్రిపక్షాల నిరసన కేంద్రం తీసుకొచ్చిన నూతన లేబర్ కోడ్స్పై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. వీటిని వెంటనే రద్దు చేయాలని తేల్చిచెప్పాయి. లేబర్ కోడ్స్ పట్ల విపక్షాలు బుధవారం పార్లమెంట్ మకరద్వారం వద్ద నిరసన వ్యక్తంచేశాయి. కాంగ్రెస్ ముఖ్యనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ వాద్రా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కారి్మకులకు కక్షగట్టిందని, కేవలం ఆశ్రిత పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఖర్గే మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కొత్త లేబర్ కోడ్స్తో కారి్మకులకు, ఉద్యోగులకు నష్టం వాటిల్లుందని పేర్కొన్నారు. లేబర్స్ కోడ్స్ను ప్రియాంకా గాంధీ సైతం తప్పుపట్టారు. -
బెంగాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయండి
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై పోరాటం కొనసాగించాలని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తేల్చిచెప్పారు. బెంగాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ పారదర్శకంగా, సరళంగా జరిగేలా జాగ్రత్త వహించాలని సూచించారు. బెంగాల్ బీజేపీ ఎంపీలు బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఎన్నికల వ్యూహాలపై వారు చర్చించినట్లు సమాచారం. బెంగాల్లో కచ్చితంగా అధికారం దక్కించుకోవాలని, అందుకోసం కష్టపడి పని చేయాలంటూ ప్రధానమంత్రి తమకు దిశానిర్దేశం చేశారని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ చెప్పారు. బీజేపీ కార్యకర్తల అంకితభావాన్ని మోదీ ప్రశంసించారని డార్జీలింగ్ ఎంపీ రాజు బిస్తా తెలిపారు. ప్రజలకు మరింత చేరువ కావడానికి కృషి చేయాలంటూ ఆదేశించారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని మాల్డాకు చెందిన లోక్సభ సభ్యుడు ఖగేన్ ముర్ము కూడా మోదీని కలిశారు. అక్టోబర్లో ముర్ముపై అల్లరిమూక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముర్ము ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి ఆరా తీశారు. -
వాయిదాల పర్వం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే విపక్షాల ఆందోళనతో లోక్సభ అట్టుడికింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వేపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. అందుకే లోక్సభ స్పీకర్ నిరాకరించడంతో విపక్షసభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో పలు మార్లు లోక్సభ వాయిదాపడింది. నివాళులతో మొదలై నినాదాలతో కొనసాగి.. అంతకుముందు సోమవారం ఉదయం 11 గంటలకు జాతీయగీతం జనగణమనతో లోక్సభలో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మృతిచెందిన మాజీ సభ్యులకు ప్రస్తుత లోక్సభ సభ్యులు నివాళిగా సంతాపం తెలిపారు. అనంతరం స్పీకర్ ఓంబిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వెనువెంటనే కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీసహా పలు విపక్ష పార్టీల ఎంపీలు తమతమ స్థానాల్లోంచి లేచారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర(ఎస్ఐఆర్) సర్వే అంశంపై లోక్సభలో చర్చించాలని పట్టుబట్టారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభాకార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ ఓంబిర్లా వెంటనే కల్పించుకున్నారు. ‘తొలిరోజే సభాకార్యకలాపాలకు అడ్డుతగలడం ఏమాత్రం మంచి పధ్దతి కాదు. సభలో విధానాత్మక, నిర్మాణాత్మక చర్చలు జరగాలి. సభలో సమ్మతి, అసమ్మతి రెండు ఉన్నా, చర్చల ద్వారానే అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్ను నినాదాలతో అడ్డుకోకూడదు. ప్రశ్నోత్తరాలు కొనసాగనివ్వండి’’ అని స్పీకర్ అన్నారు. అయినప్పటికీ విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకుండా, ఎస్ఐఆర్పై చర్చను కోరుతూ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక సైతం విపక్ష సభ్యుల వైఖరితో మార్పు రాలేదు. విపక్షాల ఆందోళన ఎక్కువవడంతో కేవలం 12 నిమిషాల తర్వాత సభ మళ్లీ వాయిదాపడింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ మళ్లీ మొదలైంది. బిల్లులను ప్రవేశపెట్టిన సీతారామన్ పొగాకు, పొగాకు ఉత్పత్తులపై ఎక్సయిజ్ డ్యూటీ, పాన్ మసాలాపై కొత్త సెస్ వేసేందుకు ఉద్దేశించిన బిల్లుతోపాటు, సెంట్రల్ ఎక్సయిజ్(సవరణ) బిల్లు–2025, హెల్త్సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు–2025లను ఈలోపే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మణిపూర్లో రాష్ట్రపతిపాలన కొనసాగుతుండటంతో మణిపూర్ జీఎస్టీ(సవరణ) బిల్లును సైతం లోక్సభలో ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే ఈ బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర వేసింది. 2025–26 ఆర్థికసంవత్సర గ్రాంట్లకు సంబంధించిన అనుబంధ పద్దును సైతం సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. తర్వాత సభ మరోసారి వాయిదాపడింది. తర్వాత సభ మొదలైనా విపక్ష సభ్యుల నినాదాలు ఆగలేదు. దీంతో చేసేదిలేక స్పీకర్ మధ్యాహ్నం 2.20 గంటలకు సభను మంగళవారానికి వాయిదావేశారు. రాజ్యసభలోనూ.. ఎగువసభలోనూ దాదాపు ఇవే దృశ్యాలు కనిపించాయి. ఎస్ఐఆర్పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ‘‘ఎస్ఐఆర్పై చర్చకు ప్రభుత్వం వెనుకడుగు వేయట్లేదు. అయితే నిరీ్ణత కాలావధిలోపు ఫలానా సమయంలోనే చర్చించాలనే మొండిపట్టును విపక్షాలు విడనాడాలి. ఎస్ఐఆర్పై చర్చ అంశంలో కేంద్రానికి మరింత సమయం కావాలి’’ అని ఆయన అన్నారు.మంత్రి సమాధానంతో సంతృప్తిచెందని విపక్ష సభ్యులు వెనువెంటనే రాజ్యసభ నుంచి వాకౌట్చేశారు. అంతకుముందు ఎస్ఐఆర్సహా పలు అంశాలపై తక్షణం చర్చ జరపాలంటూ తొమ్మిది మంది విపక్ష సభ్యులు వేర్వేరుగా రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్కు నోటీస్లను అందజేశారు. ఉపరాష్ట్రపతిగా ప్రమాణంచేశాక రాజ్యసభ డిప్యూటీచైర్మన్ హోదాలో రాధాకృష్ణన్ సేవలందించడం ఇదేతొలిసారికావడం విశేషం. ఈ సందర్భంగా ఆయనను ప్రధాని మోదీ పొగిడారు. ‘‘సాధారణ కుటుంబం నుంచి వచి్చన రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదగడం మన ప్రజాస్వామ్యంలోని శక్తికి నిదర్శనం. పలు రాష్ట్రాల్లో కీలక పదవుల్లో సేవచేసి గడించిన అనుభవం రాజ్యసభ సజావుగా సాగేందుకు తోహదపడనుంది’’ అని ఆయన అన్నారు. తర్వాత ఖర్గే మాట్లాడారు. ‘‘ గత ఉపరాష్ట్రపతి హఠాత్తుగా రాజీనామాచేయడం అధికార పక్షాన్ని సైతం విస్మయపరిచింది. రాజ్యసభలో అధికార, విపక్షాల మధ్య సమతూకం పాటిస్తూ విపక్ష సభ్యులకు సైతం సమస్యలపై మాట్లాడే అవకాశం కల్పించాలని విజ్ఞప్తిచేస్తున్నా’’ అని ఖర్గే అన్నారు. -
ఎస్ఐఆర్ గడువు వారం పొడిగింపు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) షెడ్యూల్లో మార్పులు చేసింది. ఓటర్ల జాబితాలో సమగ్రత, పారదర్శకతను పెంచేందుకు చేపట్టిన ఈ ప్రక్రియను మరో వారంపాటు పొడిగించింది. పశి్చమబెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ సహా మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ పొడిగింపు వర్తించనుంది. ఎస్ఐఆర్లో భాగంగా దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీ డిసెంబర్ 4 కాగా, పొడిగింపుతో 11 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పరిశీలనల అనంతరం 2026 ఫిబ్రవరి 14న తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. ఈ ప్రక్రియ జరుగుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులతో చర్చించిన అనంతరం కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈసీ నిర్ణయంపై కాంగ్రెస్ స్పందించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు షెడ్యూల్లో మార్పులు చేయడం చూస్తే.. సభలో ఎస్ఐఆర్పై చర్చించాలన్న ప్రతిపక్షాల డిమాండ్ను పక్కన పెట్టడానికి ప్రభుత్వం కుట్రలు సాగిస్తున్నట్లు అర్థమవుతోందని విమర్శించింది. గోవాలో 90 వేల నకిలీ ఓట్లున్నట్లు ఎస్ఐఆర్లో తేలిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సంజయ్ గోయెల్ తెలిపారు. ఇక్కడి నుంచి వెళ్లిపోయినవారు, మరణించిన వారితోపాటు నకిలీ ఓట్లు కూడా ఇందులో ఉన్నాయని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రారంభానికి ముందు నవంబర్ 4న రాష్ట్రంలో మొత్తం 11,85,000 ఓటర్లున్నారని, ఎస్ఐఆర్ తరువాత కేవలం 10,55,000 దరఖాస్తులు మాత్రమే ఎన్నికల సంఘానికి అందాయని తెలిపారు. ఇంకా 40 వేల దరఖాస్తులు కమిషన్కు రాలేదని వెల్లడించారు. -
నేటి నుంచి సభా సమరం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం కానున్నాయి. డిసెంబర్ 19వ తేదీ వరకు మొత్తం 15 రోజులపాటు సమావేశాలు కొనసాగుతాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభల్లో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇటీవల మరణించిన ఎంపీలకు తొలుత సంతాపం తెలియజేస్తారు. అనంతరం సభా కార్యకలాపాలు మొదలవుతాయి. ఈసారి శీతాకాల సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై పార్లమెంట్లో చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎస్ఐఆర్పై ప్రభుత్వాన్ని ఐక్యంగా నిలదీయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఢిల్లీలో కారుబాంబు పేలుడు ఘటన నేపథ్యంలో దేశ భద్రతపై మోదీ సర్కార్ను ఇరుకున పెట్టాలని నిర్ణయించుకున్నాయి. విదేశాంగ విధానం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, నూతన లేబర్ కోడ్స్, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోవడం వంటి అంశాలతోపాటు ఇతర ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పార్లమెంట్లో ఈ అంశంపై ప్రత్యేక చర్చ చేపట్టబోతున్నారు. పార్లమెంట్లో 14 బిల్లులు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 14 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. మణిపూర్ గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్(రెండో సవర) బిల్లు–2025, సెంట్రల్ ఎక్సైజ్(సవరణ) బిల్లు–2025, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు–2025, పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యం కల్పించే బిల్లు, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు–2025, ఉన్నత విద్యా కమిషన్ బిల్లు–2025ను జన్ విశ్వాస్(నిబంధనల సవరణ) బిల్లు, దివాళా, దివాళా కోడ్ (సవరణ) బిల్లు, పారదర్శకంగా భూసేకరణ కోసం జాతీయ రహదారుల(సవరణ) బిల్లు, కంపెనీల చట్టం సవరించడానికి కార్పొరేట్ చట్టాలు(సవరణ) బిల్లులు వంటివి ఉన్నాయి. ఇటీవల వివిధ పార్టీల అభ్యంతరాల తర్వాత, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్రపతి నేరుగా నిబంధనలు జారీ చేసే అధికారం కల్పించే బిల్లును ప్రభుత్వం విరమించుకున్న విషయం తెలిసిందే. బీఏసీ భేటీలో గళమెత్తిన ప్రతిపక్షాలు లోక్సభ, రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశాలు ఆదివారం నిర్వహించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజైన సోమవారం రాజ్యసభలో ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై స్వల్ప కాల చర్చ చేపట్టాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీలోని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ అధ్యక్షతన ఆదివారం ఈ కమిటీ సమావేశమైంది. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని చెప్పిన ప్రతిపక్ష నేతలు ఎస్ఐఆర్ అంశాన్ని ప్రస్తావించారు. సోమవారం మధ్యా హ్నం 2 గంటలకు ఎన్నికల సంస్కరణలపై చర్చ జరపాలని కోరారు. చర్చ జరపకుంటే, సభా కార్యకలాపాలకు కలిగే అంతరాయానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా వారు స్పష్టం చేశారు. ఈ అంశానికి ఎన్నికల సంస్కరణలు లేదా ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత వంటి పేరు పెట్టుకోవచ్చన్నారు. ఈ నెల 19వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనుండటం తెల్సిందే. -
ఎస్ఐఆర్ ఉద్యోగుల మృతి వెనుక ఈసీ హస్తం ఉంది
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)కు సంబంధించిన 40 మంది మరణించారని టీఎంసీ శుక్రవారం భారత ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. దీని వెనుక రాష్ట్రంలోని పోల్ ప్యానెల్ చీఫ్ హస్తం ఉందని ఆరోపించింది. టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రియన్ నేతృత్వంలో పదిమంది ఎంపీల ప్రతినిధి బృందం శుక్రవారం సీఈసీ అధికారులను కలిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఓబ్రియన్.. తమ పార్టీ ఐదు ప్రశ్నలను సీఈసీ ముందుంచుందని, కానీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలిపారు. తాము ఎస్ఐఆర్ను వ్యతిరేకించడం లేదని, ఈసీ పనిచే స్తున్న తీరుపై తమకు అభ్యంతరం ఉందని నొక్కి చెప్పారు. కమిషన్ దానిని కేవలం ఆరోపణలుగా తోసిపుచ్చిందని లోక్సభ ఎంపీ మహువా మొయిత్రా తెలిపారు. సీఈసీని కలిసిన ప్రతినిధి బృందంలో లోక్సభ ఎంపీలు శతాబ్దిరాయ్, కళ్యాణ్ బెనర్జీ, ప్రతిమా మండల్, సజ్దా అహ్మద్, రాజ్యసభ ఎంపీలు డోలా సేన్, మమతా ఠాకూర్, సాకేత్ గోఖలే, ప్రకాష్ చిక్ బారిక్ ఉన్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ విధుల్లో నిమగ్నమైన బూత్ స్థాయి అధికారులు మరణాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు ఈ సంఖ్య అధికంగా ఉంది. ఒక్క పశ్చిమబెంగాల్లోనే 40 మంది మరణించినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీఎల్ఓల మరణాలపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా ఇతర ప్రతిపక్ష నేతలు ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎస్ఐఆర్ సంస్కరణకాదని, విజయం కోసం బీజేపీ చేస్తున్న నియంతృత్వ పాలనని విమర్శిస్తున్నారు. -
26 లక్షల పేర్లు సరిపోలడం లేదు: ఈసీ
కోల్కతా: పశ్చిమబెంగాల్లో ప్రస్తుత ఓటరు జాబితాలోని 26 లక్షల మంది ఓటర్ల పేర్లు 2002 నాటి ఓటరు జాబితాతో సరిపోలడం లేదని ఎన్నికల కమిషన్(ఈసీ)తెలిపింది. ఓటరు జాబితా ఎస్ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను బెంగాల్లోని సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ ఈసీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఎస్ఐఆర్లో భాగంగా బుధవారం నాటికి రాష్ట్రంలో 6 కోట్లకుపైగా ఎన్యుమరేషన్ దరఖాస్తులను డిజిటైజ్ చేసినట్లు ఈసీ తెలిపింది. అనంతరం వీటిని గత 2002 ఎస్ఐఆర్నాటి ఓటరు జాబితాతో పోల్చగా ఈ తేడా బయటపడిందని ఓ అధికారి వెల్లడించారు. డిజిటైజేషన్ కొనసాగుతున్నందున ఈ తేడా మరింతగా పెరిగే అవకాశాలున్నాయన్నారు. అయితే, తుది ఓటరు జాబితా నుంచి వీటిని ఈ పేర్లను ఆటోమేటిక్గా తొలగించినట్లు కాదన్నారు. -
ఎస్ఐఆర్ అప్లికేషన్ వివరాలు అందుబాటులో లేవెందుకు?
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం ఉపయోగించనున్న ఏఐ అప్లికేషన్ అనుమానం కలుగుతోందని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే అన్నారు. యాప్, దాని కార్యాచరణగురించి ఎటువంటి వివరాలు అందుబాటులో లేవన్నారు. ‘బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో ఏఐ యాప్ను ఉపయోగిస్తున్నామని ఎన్నికల సంఘం చెబుతోంది. ఈ యాప్ను ఎవరు తయారు చేశారు? దాని కార్యాచరణకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఎందుకు లేవు’అని గోఖలే ప్రశ్నించారు. యాప్ డెవలపర్, అమ్మిన సంస్థ వివరాల గురించి తాను ప్రయత్నించానని, ఇప్పటికే ఉన్న సాఫ్ట్వేర్లు బాగా పనిచేయగలిగినప్పుడు, నకిలీలను గుర్తించడానికి ఏఐ అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. 2019లో మహారాష్ట్రలోనూ బీజేపీ ఐటీ సెల్తో అనుబంధం ఉన్న ఓ ఏజెన్సీని ఈసీఐ నియమించుకున్న విషయాన్ని తాను బయటపెట్టానని చెప్పారు. బయటినుంచి వెయ్యిమంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 50 మంది సాఫ్ట్వేర్ డెవలపర్లను నియమించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈసీఐకి రాసిన లేఖను ఆయన ప్రస్తావించారు. -
ఆధార్ ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఇవ్వాలా ? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ( SIR) పై విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వానికి ఆధార్ కార్డు రుజువు కాదని వెల్లడించింది. ఆధార్ కార్డులున్న చొరబాటుదారులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆధార్ కార్డు ఉన్న పౌరుడు కాని వ్యక్తికి కూడా ఓటు హక్కులు ఇవ్వాలా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సామాజిక సంక్షేమ ప్రయోజనాలు అందరికీ చేరేలా చూసుకోవడానికే ఆధార్ తప్ప , ఇది స్వయంచాలకంగా ఓటు హక్కును ప్రసాదించకూడదని ప్రధాన న్యాయమూర్తి (CJI) స్పష్టం చేశారు.అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ చర్య చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్ఘ బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వేడివాడి వాదనలు జరిగాయి. ఆధార్ కార్డు "పౌరసత్వానికి సంపూర్ణ రుజువు కాదని ధర్మాసనం పునరుద్ఘాటించింది. అందుకే అది పత్రాల జాబితాలోని పత్రాలలో ఒకటిగా ఉంటుందనీ, ఎవరి పేరైనా తొలగిస్తే, వారికి తొలగింపు నోటీసు ఇవ్వవలసి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది.ఒక వ్యక్తి పొరుగు దేశానికి చెందినవాడు మరియు కార్మికుడు వంటి అసంఘటిత రంగంలో పనిచేస్తుంటే, వారికి మానవతా దృక్పథంతో రేషన్ లేదా ఇతర ప్రయోజనాల కోసం ఆధార్ ఇవ్వవచ్చని ఆయన అన్నారు. ఇది భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తిలో భాగం. అయితే, ఆధార్ కార్డు కలిగి ఉండటం వల్ల వారిని ఓటరుగా మార్చలేము. పౌరసత్వం మరియు ఓటు హక్కుల ప్రమాణాలు వేరుగా ఉంటాయి. ఆధార్తో అనుసంధానించబడవు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి కూడా ఆధార్ కార్డులు అందుతున్నాయని, అలాంటప్పుడు ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన వారికి ఓటు హక్కు కూడా కల్పించాలా?ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు" అనే వాదన ఒక ప్రక్రియను రాజ్యాంగ విరుద్ధమైనదిగా మార్చలేదని సుప్రీం వ్యాఖ్యానించింది. ఆధార్ పౌరసత్వ రుజువు కాదని, ఎన్నికల కమిషన్కు పత్రాలను ధృవీకరించే రాజ్యాంగ హక్కు ఉందని జస్టిస్ బాగ్చి పేర్కొన్నారు. అలాగే కమిషన్ కేవలం పోస్టాఫీసు కాదు. పత్రాల ఖచ్చితత్వాన్ని ధృవీకరించే రాజ్యాంగ హక్కు దీనికి ఉంది. ఫారం 6లో ఏదైనా తప్పు ఉంటే, దానిపై దర్యాప్తు చేసే అధికారం కమిషన్కు ఉందని స్పష్టం చేశారు.ఆధార్ను నివాస రుజువుగా పేర్కొనడం ద్వారా పౌరులపై సందేహ భారాన్ని మోపడానికి వ్యతిరేకంగా, పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలను వినిపించారు. SIR ముందుకు సాగుతున్న తీరు తొందరపాటు మరియు మినహాయింపుతో కూడుకున్నది. ఇది నిరక్షరాస్యులైన సాధారణ ఓటర్లపై రాజ్యాంగ విరుద్ధమైన భారం మోపుతోందన్నారు. ఫారాలు నింపడం తెలియని వారిని జాబితా నుంచి తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధార్ పౌరసత్వానికి తిరుగులేని రుజువు కాకపోయినా, నివాసానికి సంబంధించి ప్రాథమిక ఆధారంగా పరిగణించాలని ఆయన వాదించారు. SIR ప్రచారం లోపభూయిష్టంగా , రాజ్యాంగ విరుద్ధమైందని పేర్కొన్నారు.తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లలో SIRని ప్రత్యేకంగా సవాలు చేస్తున్న పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు షెడ్యూల్ను కూడా నిర్ణయించింది. డిసెంబర్ 1 లోగా ప్రతిస్పందనలను దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్ను బెంచ్ కోరింది. ఈ గడువులో పిటిషనర్లు తమ వాదనలను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ విషయాలు త్వరలో విచారణకు వస్తాయి. -
దడ పుట్టిస్తున్న ‘సర్’
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట బిహార్లో ప్రకంపనలు సృష్టించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ డజను రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నెల 4న మొదలైంది. వచ్చే నెల 4తో ముగిసే ఈ ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారి(బీఎల్ఓ) పాత్ర కీలకమైనది. ఓటర్ల ఇళ్లకు పోయి ఓటర్ నమోదు పత్రాలు అందించటం, వెనక్కి తీసుకోవటం, అవసరమైన పత్రాలు జతచేశారో లేదో చూడటం వారి బాధ్యత. ఫలానా వ్యక్తి అర్హుడైన ఓటరో కాదో ప్రాథమికంగా తేల్చేది వీరే. అదే వారి చావుకొస్తోంది.బిహార్కు భిన్నంగా ఈ ప్రక్రియ చాలా రాష్ట్రాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. మరణాలు, బలవన్మరణాలు, అస్వస్థులు కావటం, భయాందోళనలతో అప్పగించిన పని వదిలి అదృశ్యం కావటం వంటి ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. బిహార్లో బీఎల్ఓలకు ఈ స్థాయిలో సమస్యలున్న దాఖలా లేదు. నిజానికి అక్కడ బీఎల్ఓలతోనే ఓటర్లకు సమస్యలెదురైన ఉదంతాలున్నాయి. బీఎల్ఓలకు వెరిఫికేషన్లో సహకరించేందుకు పార్టీలు తమ కార్యకర్తలను బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్ఏ)గా నియమించుకునేందుకు ఎన్నికల కమిషన్(ఈసీ) అవకాశమిచ్చింది. సహజంగానే వారు పరిష్కారంలో కాక సమస్యలో భాగమవుతున్నారు. ఓటర్ల ఎదుటే బీఎల్ఓలతో వాదులాటలకు దిగటం, బెదిరించటం చాలాచోట్ల కనబడే దృశ్యాలు.పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్ తదితర చోట్ల బీఎల్ఓలు ‘సర్’ ప్రక్రియలో తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో చేతికి ఎముక లేకుండా భారీ వాగ్దానాలు చేయటం, అధికారం వచ్చాక ఎగనామం పెట్టడం మన దేశంలో దశాబ్దాలుగా సాగిపోతున్న ఒక దుస్సంప్రదాయం. ఈ విషయంలో న్యాయ స్థానాలకెళ్లినా ఫలితం ఉండదు. కడుపు మండి నిలదీస్తే జైలుపాలు చేయటం, కార్య కర్తలను పంపించి దౌర్జన్యం చేయించటం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలాచోట్ల కనబడుతోంది.ఇంత జరుగుతున్నా, ఈవీఎంలు ఏమార్చి ఓట్లు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు మిన్నంటుతున్నా, ఎన్నికల సంఘం పట్టనట్టు వ్యవహరిస్తోంది. అయినా ఎన్నికల వ్యవస్థపై ఉండే అచంచల విశ్వాసమే ప్రజాస్వామ్యాన్ని ఈమాత్రంగానైనా బతికిస్తోంది. ఓటు పోతే జీవచ్ఛవంతో సమానమన్న అభిప్రాయం జనంలో ప్రబలంగా ఉంది. ప్రజాస్వామ్యంలో అసమ్మతి తెలపాలన్నా, ఆగ్రహావేశాలు వ్యక్తంచేయాలన్నా సామాన్యు లకు ఓటును మించిన ఆయుధం మరేదీ లేకపోవటం ఇందుకు కారణం కావచ్చు.బీఎల్ఓలు ఒత్తిడికి లోనవటం వెనక ఇతరేతర సమస్యలు కూడా ఉన్నాయి. గతంలో ఓటేసే రోజునే తమ ఓటు గల్లంతైందని తెలిసేది. కానీ ఇప్పుడలా కాదు. ఓటరు తన వివరాలతోపాటు అవసరమైన పత్రాలన్నీ అందజేసిన క్షణానే అది చూచాయగా తెలిసి పోతుంది. నెల రోజుల తర్వాత పేరుందో లేదో రూఢి అవుతుంది. లేకపోవటానికి గల కారణమేమిటో అందులో ప్రస్తావిస్తారు. ఆ చిరునామాలో ఓటరు లేడనో, మరణించా డనో, తగిన పత్రాలు అందించలేదనో వెల్లడిస్తారు.దానిపై మళ్లీ పంచాయతీ. నమోదు సమయంలో బీఎల్ఏల నుంచి వచ్చే ఒత్తిళ్లు ఒకపక్క, వాటిని తట్టుకోలేక ఏదైనా చేస్తే ప్రభుత్వం నుంచి చర్యలు మరోపక్క వారిని బాధిస్తున్నాయి. బీఎల్ఓల్లో 90 శాతం టీచర్లే. గుజరాత్ వంటిచోట్ల సాయంత్రం వరకూ విద్యాబోధనలోనూ, అటుతర్వాత రాత్రి 9వరకూ ఫీల్డ్లోనూ తలమునకలు కావాలి. మళ్లీ ఇంటికొచ్చి సేకరించిన పత్రాలన్నీ డిజిటల్ ఫామ్లోకి మార్చి పంపాలి. ఇవన్నీ ఎప్పటికప్పుడు కాకపోతే పై అధికారుల హెచ్చరికలు. సారాంశంలో ఓటర్ మొదలుకొని అందరికందరూ పెత్తనం చలాయించే వారే. ఈసీకి ఇవి పట్టవు. ‘సబ్ ఠీక్ హై’ అంటోంది.గౌరవ ప్రదమైన జీవితం వెళ్లదీయదల్చుకున్నవారు ఉద్యోగాలు చేస్తారు. అందుకు జీతంతోపాటు గౌరవ మర్యాదలూ ఆశిస్తారు. కానీ అదనపు భారాలు మోపి, వెట్టి కార్మికుల కన్నా హీనంగా చూస్తూ, బెదిరింపులకు దిగటం వల్ల వారు సమాజంలో ఆత్మ గౌరవంతో బతకగలుగుతారా? పిల్లలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారా? గర్భిణులనూ, 45 ఏళ్లు దాటినవారినీ, అంగవైకల్యం ఉన్నవారినీ ఈ బాధ్యతల నుంచి తప్పించాలని గుజరాత్లో ఒక ఉపాధ్యాయ సంఘం కోరినా ఫలితం లేకపోయిందట! ఈ ధోరణి సరికాదు. దీన్ని వెంటనే చక్కదిద్దటం ఈసీ, కేంద్రం బాధ్యత. -
S.I.Rను ఆపలేం, కానీ..: సుప్రీం కోర్టు
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను నిలిపివేయాలన్న పిటిషనర్లకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పలు రాష్ట్రాల్లో ప్రక్రియ కొనసాగుతున్నందున నిలుపుదల చేయలేమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశాశారు. అయితే పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆయన ఆదేశించారు.పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లను బుధవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా.. ఎస్ఐఆర్ విషయంలో రాజకీయ పార్టీలు లేనిపోని భయాందోళనలు కలిగిస్తున్నాయి ఈసీ పేర్కొంది. ఈ క్రమంలో.. కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం డిసెంబర్ 1వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను వివరణ కోరింది. తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఎస్ఐఆర్ విషయంలో కేరళ ప్రభుత్వం రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. ఎస్ఐఆర్ను సవాల్ చేస్తూ వేరుగా పిటిషన్లో ఇప్పటికే(నవంబర్ 21వ తేదీన) సుప్రీం కోర్టు ఈసీకి నోటీసులు జారీ చేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేదాకా ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని వేసిన మరో పిటిషన్పైనే ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ 9-11 తేదీల మధ్యలో కేరళలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది.తమిళనాడు నుంచి ఎస్ఐఆర్కు అన్నాడీఎంకే మద్దతుగా అప్లికేషన్ను సమర్పించింది. అధికార డీఎంకే సహా అన్ని పార్టీలు వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. పుదుచ్చేరి నుంచి ప్రతిపక్ష నేత ఆర్ శివ వేరుగా పిటిషన్ వేశారు. అలాగే.. పశ్చిమ బెంగాల్ నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ కమిటీ పిటిషన్లు వేసింది. ఈ పిటిషన్పై విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. అయితే.. అదే తేదీన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా విడుదల కావాల్సి ఉందని విషయం ధర్మాసనం దృష్టికి వెళ్లగా.. అవసరమైతే ఆ గడువును(డ్రాఫ్ట్ రోల్స్ ప్రచురణ) పొడిగించవచ్చని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.‘‘అవసరమని తేలితే ఎన్నికల సంఘాన్ని తేదీ పొడిగించమని ఆదేశించవచ్చు. ఆ తేదీ(డిసెంబర్ 9) కారణంగా కోర్టుకు అధికారమే లేదని చెప్పలేం. కోర్టు ఎప్పుడైనా తేదీ పొడిగించమని చెప్పగలదు’’ అని అన్నారాయన. ఎస్ఐఆర్ ఉద్దేశ్యంఎస్ఐఆర్ అనేది ఓటర్ల జాబితా ఖచ్చితత్వం కోసం ఎన్నికల సంఘం చేపట్టే ప్రత్యేక సవరణ ప్రక్రియ. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఇది వివాదాస్పదమై, సుప్రీం కోర్టుకు చేరింది. దీని ఉద్దేశం.. ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేయడంకొత్తగా అర్హులైన ఓటర్లను చేర్చడంమరణించిన లేదా అర్హత కోల్పోయిన వారిని తొలగించడంస్థానిక ఎన్నికలు లేదా ముఖ్యమైన ఎన్నికల ముందు జాబితా ఖచ్చితత్వం పెంచడం ఎస్ఐఆర్ ప్రక్రియలో.. డ్రాఫ్ట్ రోల్స్ ప్రచురణ.. ప్రస్తుత ఓటర్ల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచడం.అభ్యంతరాలు/సవరణలు స్వీకరణ.. ప్రజలు తమ పేర్లు లేకపోవడం, తప్పులు ఉండడం వంటి అంశాలను తెలియజేయవచ్చు.ఫీల్డ్ వెరిఫికేషన్.. అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు ధృవీకరిస్తారు.ఫైనల్ రోల్స్ ప్రచురణ – సవరణల తర్వాత తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు -
నన్ను చాలెంజ్ చేస్తే..బీజేపీ పునాదులే కదిలిస్తా : సీఎం మమత
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు పశ్చిమ బెంగాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు సర్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. బీజేపీ సర్ ప్రక్రియను ఉపయోగించి ఓటర్లను తొలగిస్తోందని తృణమూల్ ఆరోపిస్తోంది. మంగళవారం జరిగిన ఎస్ఐఆర్ వ్యతిరేక ర్యాలీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో తనను చాలెంజ్ చేస్తే దేశంలో బీజేపీ పునాదులు కదిలిస్తానని మమత వ్యాఖ్యానించారు. బొంగావ్లో జరిగిన ఎస్ఐఆర్ వ్యతిరేక ర్యాలీలో మమతా బెనర్జీ ప్రసంగిస్తూ, రాష్ట్రంలోని మతువా-మెజారిటీ ప్రాంతాలలోని ఓటర్లు పౌరసత్వం (సవరణ) చట్టం ప్రకారం తమను తాము విదేశీయులుగా ప్రకటిస్తే వారిని "వెంటనే జాబితా నుండి తొలగిస్తారు" అని కూడా మమతా బెనర్జీ పేర్కొన్నారు. బీజేపీ రాజకీయంగా తనను ఓడించలేదని గతంలోనే పదిసార్లు చెప్పానని మమత మరోసారి నొక్కి వక్కాణించారు. అంతేకాదు ఎన్నికల కమిషన్ ఇకపై నిష్పాక్షిక సంస్థ కాదు, కానీ బిజెపి కమిషన్గా మారిపోయిందంటూ భారత ఎన్నికల సంఘం (ఇసిఐ)పై విమర్శలు గుప్పించారు.చదవండి: స్మృతి పెళ్లికి బ్రేక్స్ : వైరల్ స్ర్కీన్ షాట్స్, ఎవరీ మేరీ డికోస్టా“అక్రమ బంగ్లాదేశీయులను” తొలగించడమే లక్ష్యమైతే, బిజెపి పాలిత రాష్ట్రాల్లో SIR ఎందుకు నిర్వహిస్తు న్నారని మమత ప్రశ్నించారు. అంటే పార్టీ “డబుల్ ఇంజిన్ పాలిత రాష్ట్రాల్లో కూడా చొరబాటుదారులు ఉన్నారని అంగీకరిస్తుందా అని ఆమె ఎద్దేవా చేశారు. తానుఒక దేశంగా బంగ్లాదేశ్ను ప్రేమిస్తున్నాననీ తమ భాషా ఒకటేనని చెప్పారు. ఏదో ఒకరోజు తనను కూడా బంగ్లాదేశీ అని పిలుస్తారని విమర్శించారు. ఈ రాష్ట్రం నుంచి ఈ జాబితా ప్రకారమే 2024లో ప్రధాని మోదీ ఓట్లు గెల్చుకున్నారు. మరి ఆ ఓట్లు తీసేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా తొలగించాలా కదా అన్నారు. అసలు సర్ నిర్వహణకు ఎందుకు ఇంత తొందర పడుతున్నారని సీఎం మమత ప్రశ్నించారు.ఇదీ చదవండి: వామ్మో..తృటిలో తప్పించుకున్నాడు, లేదంటే!"నేను ఇక్కడ ఉన్నంత వరకు, వారు మిమ్మల్ని వెళ్లగొట్టడానికి నేను అనుమతించను. ఎవరూ మిమ్మల్ని వెళ్లగొట్టలేరు’’ అంటూ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇక్కడ బంగ్లాదేశీయులే సమస్య అయితే, మధ్యప్రదేశ్ , యుపీలోSIR ఎందుకు నిర్వహిస్తున్నారు? అని మమతా అటు ఈసీపైనా, ఇటు బీజేపీపైనా నిప్పులు చెరిగారు. కాగా ఇటీవలి బిహార్ ఎన్నికల్లో ఎన్టీయే కూటమి ఘన విజయం తరువాత బిహార్ గెలిచేశాం. ఇక పశ్చిమ బెంగాల్ వంతు అని బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకే కౌంటర్గానే మమతీ ప్రతిసవాల్ చేసినట్టుగా భావిస్తున్నారు.


