‘సర్’పై అత్యంత అప్రమత్తంగా ఉండాలి
వైఎస్సార్సీపీ నేతలకు వైఎస్ జగన్ ఆదేశం
ఈ నాలుగు వారాలు అత్యంత కీలకం
నియోజకవర్గ కో–ఆర్డినేటర్లు రోజూ సమీక్ష చేయాలి
అధికార దుర్వినియోగంతో ప్రతి బూత్కు 50 ఓట్లు తీసేయాలన్నది లక్ష్యం
నియోజకవర్గ కో–ఆర్డినేటర్లు ప్రతి ఓటునూ కాపాడుకోవాలి
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)పై నియోజకవర్గాల్లోని కో–ఆర్డినేటర్లు, రీజనల్ ఇన్ఛార్జిలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సర్ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ప్రతిరోజూ సమీక్ష చేయాలని, ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకమని, సర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు.
మంగళవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. సర్ ప్రక్రియపై చర్చిస్తూ.. ఈ ప్రక్రియలో ఒక్కసారి ఓటు తొలగించిన తర్వాత, దాన్ని తిరిగి చేర్పించాలంటే అత్యంత కష్టమవుతుందన్నారు. ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు, తన అధికార దుర్వినియోగంతో ఏదో రకంగా వైఎస్సార్సీపీకి చెందిన ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, బూత్కు కనీసంగా 50 ఓట్లు తొలగించాలని చూస్తున్నారని ఎత్తిచూపారు.
గిమ్మిక్కులతో ఓట్లు తొలగించే తప్పుడు పనుల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని, వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు దీన్ని అడ్డుకోవాలని, ప్రతి ఓటునూ కాపాడుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సర్ ప్రక్రియపై ప్రతి అంశంలోనూ అప్రమత్తత, నిరంతర సమీక్షలు నిర్వహించాలని పార్టీ నేతలను ఆదేశించారు.


