వైభవ్‌ వివాదం.. స్పందించిన బీసీసీఐ | BCCI Reacts On Vaibhav Sooryavanshi Issue Vs SL A Issues Order To | Sakshi
Sakshi News home page

వైభవ్‌ వివాదం.. స్పందించిన బీసీసీఐ

Jun 16 2026 7:18 PM | Updated on Jun 16 2026 8:01 PM

BCCI Reacts On Vaibhav Sooryavanshi Issue Vs SL A Issues Order To

గత కొన్నాళ్లుగా తన ఆట తీరుతో హాట్‌టాపిక్‌గా మారిన భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ.. ఇప్పుడు తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. భారత్‌- ‘ఎ’ జట్టు తరఫున శ్రీలంక పర్యటనలో ఉన్న ఈ పిల్లాడు.. ముక్కోణపు వన్డే సిరీస్‌ ఆడుతున్నాడు.

సూపర్‌ ఓవర్లో లంక విజయం
ఇందులో భాగంగా శ్రీలంక- ‘ఎ’ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్‌ సూర్యవంశీ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. దంబుల్లా వేదికగా ఈ మ్యాచ్‌లో శ్రీలంక భారత్‌- ‘ఎ’ జట్టుపై సూపర్‌ ఓవర్లో విజయం సాధించింది.

నువ్వు ఇక ఇంటికి వెళ్లు
ఈ క్రమంలో లంక ప్లేయర్‌ విశేన్‌ హలంబగే.. భారత ఆటగాళ్లు వైభవ్‌ సూర్యవంశీని ఉద్దేశించి.. ‘‘మ్యాచ్‌ అయిపోయింది. నువ్వు ఇక ఇంటికి వెళ్లు’’ అని రెచ్చగొట్టినట్లు తెలిసింది. దీంతో సహనం కోల్పోయిన వైభవ్‌.. అతడిపైకి దూసుకెళ్లాడు. విశేన్‌ను వెనక్కి నెట్టేయగా.. అతడూ వైభవ్‌ను తోసేశాడు.

ఇంతలో లంక సీనియర్‌ ప్లేయర్‌ డిక్‌విల్లా ఇద్దరినీ విడదీసి.. వైభవ్‌ను అక్కడి నుంచి పంపించాడు. అయితే, వైభవ్‌ వెళ్తూ వెళ్తూ వేలు చూపించి బెదిరించినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో పదిహేనేళ్ల వైభవ్‌ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. అయితే, ఇది అనధికారిక మ్యాచ్‌ కాబట్టి ఐసీసీ పెద్దగా చర్యలు తీసుకునే అవకాశం లేనట్లు కనిపిస్తోంది.

స్పందించిన బీసీసీఐ
ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) తాజాగా వైభవ్‌ సూర్యవంశీ వివాదం గురించి స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఇండియా- ‘ఎ’ జట్టు కీలక టోర్నమెంట్‌ ఆడుతోంది. వర్దమాన క్రికెటర్లు టీమిండియాలోకి వచ్చేందుకు ఇదొక మంచి అవకాశం.

ముక్కోణపు వన్డే సిరీస్‌ రూపంలో వారికి తమను తాము నిరూపించుకునే అవకాశం దొరికింది. కాబట్టి వాళ్లంతా కేవలం ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఇతరత్రా విషయాలను పట్టించుకోకూడదు. అలా చేస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది.

ఆటపైనే దృష్టి పెట్టండి
అక్కడికి ఎందుకు వెళ్లారో ఆ విషయంపై మాత్రమే దృష్టి పెట్టండి. ప్రతి ఒక్కరు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఈ ట్రై సిరీస్‌లో ఇండియా విజేతగా నిలవగలదు. మా దృష్టి మొత్తం విజయం మీదే కేంద్రీకృతమై ఉంది. ఆటగాళ్లు అందుకు అనుగుణంగా నడుచుకోవాలి’’ అని దేవజిత్‌ సైకియా పరోక్షంగా భారత క్రికెటర్లను హెచ్చరించాడు.

కాగా ఈ మ్యాచ్‌ సందర్భంగా సూపర్‌ ఓవర్‌ విషయంలో కెప్టెన్‌ తిలక్‌ వర్మ సైతం అంపైర్లతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. లంక, భారత్‌తో పాటు అఫ్గనిస్తాన్‌ కూడా ఈ ట్రై సిరీస్‌లో భాగమైంది. భారత్‌ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండు ఓడిపోయింది. తద్వారా ఫైనల్‌ చేరే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement