భారత క్రికెట్లో వయో మోసాన్ని (Age Fraud) అరికట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన చర్యలు చేపట్టింది. వయో విభాగాల క్రికెట్లో పారదర్శకత పెంచేందుకు స్వతంత్ర సంస్థను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
అండర్-16, అండర్-19, అండర్-23 విభాగాల్లో ఆడే క్రికెటర్ల పత్రాలన్నింటినీ ఈ స్వతంత్ర సంస్థ పరిశీలించనుంది. ఆటగాళ్ల ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, పాఠశాల రికార్డులు వంటి వివరాలను సంబంధిత అధికారులు, విద్యాసంస్థలతో సరిపోల్చి వాటి ప్రామాణికతను నిర్ధారించనుంది.
పత్రాల్లో ఏవైనా తేడాలు లేదా తారుమార్లు ఉన్నట్లు తేలితే, సంబంధిత ఆటగాడిని బీసీసీఐ వయో విభాగాల టోర్నీల్లో తన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించకుండా అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే చర్యలు తీసుకునే ముందు ఆటగాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, తమ వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా కల్పించనుంది.
ఇకపై అన్ని వయో విభాగాల క్రికెటర్లకు బయోమెట్రిక్ ధ్రువీకరణ కూడా తప్పనిసరి చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. గతంలో వయో మోసం ఆరోపణలతో రసిఖ్ సలామ్, ప్రిన్స్ యాదవ్, మంజోత్ కల్రా, నితీష్ రాణా వంటి పలువురు ఆటగాళ్లు బీసీసీఐ చర్యలను ఎదుర్కొన్నారు.
ఆధార్లో చిరునామా మార్చాలి
అలాగే 2026-27 సీజన్కు రాష్ట్ర సంఘాన్ని మార్చుకోవాలనుకునే ఆటగాళ్లు సెప్టెంబర్ 1లోపు తమ ఆధార్ కార్డులో చిరునామాను నవీకరించి బీసీసీఐకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఒక సంవత్సరం నిరీక్షణ కాలం పూర్తయిన తర్వాతే వారు కొత్త రాష్ట్రం తరఫున ఆడేందుకు అర్హత పొందుతారు.


