PC: BCCI X
టీమిండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్మన్ గిల్ గత కొంతకాలంగా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఎక్కువసేపు బ్యాటింగ్ చేస్తే అతడి కండరాలు పట్టేస్తున్నాయి. తరచూ మెడ నొప్పి కారణంగానూ అతడు ఇబ్బంది పడుతున్నాడు.
ఇటీవల ఇంగ్లండ్తో వన్డే సిరీస్ సందర్భంగానూ గిల్ అసౌకర్యానికి గురైన సంగతి తెలిసిందే. ఎడ్జ్బాస్టన్లో తొలి వన్డేలో బ్యాటింగ్ చేస్తున్న వేళ కండరాల నొప్పితో గిల్ 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. అంతకుముందు స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు, ఐపీఎల్ సందర్భంగా మెడ నొప్పితో మ్యాచ్లు మిస్సయ్యాడు.
అక్కడ ఎలా ఆడగలరు?
విరామం లేని షెడ్యూల్, ఒత్తిడి ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. ఇక రానున్న ఏడాది కాలంలో టీమిండియా మరింత బిజీ కానుంది. ముఖ్యంగా వన్డే వరల్డ్కప్-2027 వంటి మేజర్ ఐసీసీ టోర్నీలో తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫిట్నెస్ సమస్యల గురించి గిల్ మాట్లాడిన సంగతి తెలిసిందే.
ఒకటి, రెండు మ్యాచ్లు ఆడిన తర్వాత గాయపడి.. జట్టుకు దూరమయ్యే వాళ్లు వరల్డ్కప్లో వరుసగా ఏడు- ఎనిమిది మ్యాచ్లు ఎలా ఆడగలరని ప్రశ్నించాడు. జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకొని ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి తర్వాత ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
శుబ్మన్ గిల్ సంచలన నిర్ణయం
అయితే, స్వయంగా గిల్ సైతం గాయాల బారిన పడటాన్ని ఇంగ్లండ్ దిగ్గజం స్టువర్ట్ బ్రాడ్ ప్రశ్నించాడు. డెబ్బై పరుగులు చేయగానే కండరాలు పట్టేయడం.. మైదానం నుంచి నిష్క్రమించడం గిల్కు అలవాటైపోయిందని విమర్శించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో శుబ్మన్ గిల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బీసీసీఐ వైద్య బృందాన్ని కాదని..
ఫిట్నెస్ సమస్యలకు పరిష్కారం కనుగొనే క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వైద్య బృందాన్ని కాదని.. బయటి డాక్టర్ల వద్ద గిల్ చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ..
‘‘చాన్నాళ్లుగా గిల్ మెడ నొప్పితో బాధపడుతున్నాడు. రోజురోజుకీ పరిస్థితి దిగజారిపోతోందని భావించాడు. అందుకే బీసీసీఐ వైద్యబృందాన్ని కాదని.. బయటి డాక్టర్ల దగ్గర చికిత్స తీసుకున్నాడు. పరిస్థితి ఇప్పుడు చాలా వరకు మెరుగుపడింది. అయితే ఇది నిరంతర ప్రక్రియ’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
చదవండి: 30 ఏళ్లు దాటినా తగ్గేదేలే!.. టీమిండియాలో రీఎంట్రీకి సై!


