PC: BCCI
ముప్పై మూడేళ్ల వయసులో తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు సారాంశ్ జైన్. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించినప్పటికీ ఈ మధ్యప్రదేశ్ స్పిన్ ఆల్రౌండర్ సెలక్టర్ల పిలుపు కోసం సుమారు పన్నెండేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. జట్టు కూర్పు, పోటీ.. ఏదైతేనేమి ఎట్టకేలకు ఒక్కసారైనా జాతీయ జట్టుకు ఎంపిక కావాలన్న అతడి చిరకాల కోరిక తాజాగా నెరవేరింది.
వాషింగ్టన్ సుందర్ గాయం సారాంశ్ జైన్ పాలిట వరంగా మారింది. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్కు వాషీ స్థానంలో సెలక్టర్లు ఈ ఆఫ్ స్పిన్నర్ను ఎంపికచేశారు. దీనిని బట్టి అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టుకు అవసరమైన సమయంలో దేశవాళీ క్రికెట్లో మెరిసిన ఆటగాళ్ల నైపుణ్యాలకే పెద్దపీట వేస్తూ.. వారి వయసును పెద్దగా పట్టించుకోమనే సంకేతాలు ఇచ్చినట్లయింది.
ఈ నేపథ్యంలో ముప్పై ఏళ్లు దాటినప్పటికీ తమను తాము నిరూపించుకుంటే.. ఆపై అదృష్టం కలిసివస్తే ఈ ఐదుగురు క్రికెటర్లకు కూడా టీమిండియా తలుపులు తెరిచే ఉంటాయనిపిస్తోంది. మరి వారెవరో చూసేద్దామా?!

భువనేశ్వర్ కుమార్
36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ ఒకప్పుడు టీమిండియా పేస్ దళంలో కీలక సభ్యుడు. అయితే, 2022 తర్వాత అతడికి టీమిండియాలో అవకాశాలు కనుమరుగయ్యాయి. ఈ క్రమంలో దేశీ క్రికెట్, ఐపీఎల్పై దృష్టి సారించిన భువీ.. ఆర్సీబీ వరుసగా రెండు టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ 2025, 2026 సీజన్లలో మొత్తంగా 45 వికెట్లు కూల్చి ఆర్సీబీ చాంపియన్గా నిలవడంలో భువీ సహకారం అందించాడు. నిలకడగా, పొదుపుగా బౌలింగ్ చేస్తున్న ఈ స్వింగ్ సుల్తాన్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఐసీసీ టోర్నీల్లో భువీని ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

రజత్ పాటిదార్
పదిహేడేళ్లుగా ఐపీఎల్ తొలి టైటిల్ కోసం ముఖం వాచిపోయిన ఆర్సీబీకి.. వరుసగా రెండు ట్రోఫీలు అందించి అభిమానులకు విందుభోజనం పెట్టిన కెప్టెన్ రజత్ పాటిదార్. 2024లో తొలిసారి టీమిండియాకు ఆడిన పాటిదార్కు ఇంత వరకు భారత టీ20 జట్టులో మాత్రం చోటు దక్కలేదు.
అయితే, ఐపీఎల్లో బ్యాటర్గా, కెప్టెన్గా సత్తా చాటుతున్న 33 ఏళ్ల రజత్ పాటిదార్కు సెలక్టర్లు పిలుపునివ్వాలని భారత మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో అతడు 15 మ్యాచ్లలో కలిపి 501 పరుగులు సాధించాడు.

యజువేంద్ర చహల్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ చివరగా 2023లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అయితే, గౌతం గంభీర్ హెడ్కోచ్గా వచ్చిన తర్వాత చహల్ తిరిగి రావడం మరింత కష్టమైపోయింది.
వైవిధ్యమైన నైపుణ్యాలున్న కుల్దీప్ యాదవ్ వంటి స్పిన్నర్లకు పెద్దపీట వేసిన గంభీర్ బృందం.. యుజీ చహల్ను పూర్తిగా పక్కనపెట్టేసింది. అయితే, దేశీ క్రికెట్, కౌంటీ, ఐపీఎల్లో రాణిస్తున్న 36 ఏళ్ల చహల్.. తన బౌలింగ్లో పదును తగ్గలేదని సెలక్టర్లకు గుర్తుచేస్తూనే ఉన్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్ల వీరుడి (233)గా చహల్ ఇప్పటికీ కొనసాగుతుండటం అతడి ఆటలో నిలకడకు నిదర్శనం.

కృనాల్ పాండ్యా
స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా, గన్ ఫీల్డర్గా కృనాల్ పాండ్యాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చివరగా 2021లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన ఈ బరోడా ప్లేయర్.. ఐపీఎల్లో మాత్రం సత్తా చాటుతున్నాడు.
ఆర్సీబీ వరుసగా రెండుసార్లు (2025,2026) టైటిల్ గెలవడంలో కృనాల్ తన వంతు పాత్ర పోషించాడు. 35 ఏళ్ల ఈ ఆల్రౌండర్ టీమిండియాలో పునరాగమనం చేయగలననే నమ్మకంతో ఉన్నాడు.

సూర్యకుమార్ యాదవ్
ఈ ఏడాది టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. అయితే, వ్యక్తిగత వైఫల్యాల కారణంగా ఈ ఐసీసీ టోర్నీ తర్వాత మేనేజ్మెంట్ అనూహ్య రీతిలో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా జట్టులోనే చోటు లేకుండా చేసింది.
సూర్య వయసు 35 ఏళ్లు కావడం కూడా ఇందుకు ఓ కారణం. అయితే, దేశీ క్రికెట్లో గనుక సత్తా చాటితే సూర్య తిరిగి జాతీయ జట్టులోకి తప్పక వస్తాడని ఇటీవలే బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. సూర్య సైతం అందుకు తగ్గట్లుగానే తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. గంటల కొద్దీ నెట్స్లో శ్రమిస్తూ పునర్వైభవం పొందేదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాడు.


