ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన కీలక భేటీ ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైట్హౌస్లో దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరాన్ను ఎదుర్కొనే భవిష్యత్ వ్యూహాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.
అమెరికాను వెంటనే మరో యుద్ధంలోకి నెట్టాలనే ఉద్దేశంతో కాకుండా.. దౌత్య చర్చలు, ఆర్థిక ఆంక్షలు, అవసరమైతే సైనిక చర్య అనే మూడు మార్గాలను పరిశీలించడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశమని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు.
ఇరాన్పై మూడు మార్గాలు..
ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ ముందున్న అవకాశాలపై చర్చ జరిగింది.
1. చర్చల మార్గం:
ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లు చర్చల్లో పాల్గొంటున్నప్పటికీ.. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరుదేశాల మధ్య ఇంకా తీవ్ర విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో నెతన్యాహుకు అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది.
2. ఆర్థిక ఒత్తిడి:
ఇరాన్పై మరిన్ని ఆంక్షలు విధించడం, నౌకా నిర్బంధాన్ని కొనసాగించడం ద్వారా ఒత్తిడి పెంచే అంశాన్ని కూడా పరిశీలించారు.
3. సైనిక చర్య:
చర్చలు, ఆంక్షలు ఫలించని పరిస్థితుల్లో తిరిగి సైనిక దాడులను విస్తరించే అవకాశాన్ని కూడా చర్చించినట్లు సమాచారం.
చమురు ధరలపై ట్రంప్ ఆందోళన
ఇరాన్తో ఘర్షణ కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చమురు ధరలు పెరగడం, ఇంధన మార్కెట్లలో అస్థిరత వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇరాన్కు ప్రస్తుతం ఉన్న ప్రధాన వ్యూహాత్మక ఆధారం హార్మూజ్ జలసంధి అని, దానిని ఒత్తిడి సాధనంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందని నెతన్యాహు పేర్కొన్నట్లు సమాచారం.
సిరియా నుంచి సౌదీ వరకు..
ఇరాన్తో పాటు మధ్యప్రాచ్యంలోని ఇతర పరిణామాలపైనా ట్రంప్, నెతన్యాహు చర్చించారు. సిరియాలో ఇజ్రాయెల్, టర్కీ సైనిక ఉనికి, దక్షిణ సిరియాలో భద్రతా పరిస్థితులపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. అలాగే, అమెరికా-సౌదీ అణు ఒప్పందం, భవిష్యత్లో సౌదీ అరేబియా-ఇజ్రాయెల్ సంబంధాల సాధారణీకరణ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక, రక్షణ రంగంలో అమెరికాపై ఆధారాన్ని క్రమంగా తగ్గించుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. వచ్చే పదేళ్లలో స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు, కొత్త తరం యుద్ధ విమానాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని నెతన్యాహు ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్పై అమెరికా తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతోందన్న అంశం ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రంప్-నెతన్యాహు భేటీ తర్వాత మధ్యప్రాచ్య పరిణామాలు మరింత కీలక దశలోకి ప్రవేశించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.


