న్యూఢిల్లీ: రైతు సంఘాలు- కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సంయుక్తంగా ఉద్యమించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరిగిన ఆందోళనల తర్వాత, సీజేపీ ఇప్పుడు మరింత విస్తృత కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ నేతలు ప్రముఖ రైతు నాయకుడు రాకేశ్ టికైత్ను కలిసి ఏకతాటిపై నిలిచే విషయమై చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని ప్రణాళికలు రచిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు ప్రాధాన్యంత సంతరించుకున్నాయి.
‘ఇండియా టుడే’ నివేదిక ప్రకారం, ఈ భేటీలో సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా సహా పలువురు నేతలు, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికైత్ పాల్గొన్నారు. భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు సీజేపీ వెల్లడించింది. దీని ద్వారా రైతులు, విద్యార్థులు, యువతను ఒకే వేదికపైకి తీసుకురావాలని యోచిస్తున్నారు. దేశంలోని రైతులు, యువత, విద్యార్థులు అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి నిలదీయాలని రాంకా పేర్కొన్నట్లు ఆ నివేదిక పేర్కొంది.
మరోవైపు, రాజస్థాన్లోని అల్వార్ పరిసర ప్రాంతాల్లో జూలై 30న భారీ మహాపంచాయత్ నిర్వహించనున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించింది. ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఢిల్లీకి తరలివస్తున్న రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో, భవిష్యత్ కార్యాచరణపై రైతులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని, గతంలో జరిగిన చర్చల సమయంలో ఇచ్చిన హామీలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఒప్పందాలను గౌరవించకపోతే, అన్ని ఎఫ్ఐఆర్లను బేషరతుగా రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో మరోసారి ఉద్ధృతమైన ఆందోళనలు చేపడతామని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు.


