ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో నేతల మాటల మధ్య మాటల యుద్ధం నడిచింది. బీజేపీ ఎంపీ జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దేశంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, రాజకీయ ప్రత్యర్థులపై చర్యలు వంటి అంశాలపై ఇరువురు నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఎమర్జెన్సీ కాలం నాటి అరెస్టులను ప్రస్తావిస్తూ జేపీ నడ్డా కాంగ్రెస్పై విమర్శలు చేయగా, ప్రస్తుతం బీజేపీ పాలనలో ప్రజాస్వామ్య హక్కులు క్షీణిస్తున్నాయని ఖర్గే ఆరోపించారు.
ప్రజలకు స్వేచ్ఛ లేదు: ఖర్గే
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం ఉదయం సభలో మల్లికార్జున ఖర్గే.. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి రక్షణ లేదని ఆరోపించారు. దేశంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. విద్యార్థులపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు.
దీనికి ప్రతిస్పందించిన జేపీ నడ్డా.. కాంగ్రెస్ పాలనలో ఎమర్జెన్సీ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను నడ్డా రాజ్యసభలో ప్రస్తావించారు. అప్పట్లో తాను విద్యార్థిగా ఉన్న సమయంలో క్లాస్ జరుగుతుండగానే అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల స్వేచ్ఛ, హక్కులు అణచి వేయబడ్డాయని పేర్కొంటూ, కాంగ్రెస్ చరిత్రను ఆయన విమర్శించారు.
Ruckus in Rajya Sabha over police action on protesters: "Those who hit students are roaming free," Congress chief Mallikarjun Kharge slams Centre, JP Nadda hits back, says "police acted to maintain law & order" pic.twitter.com/EZ3u8jj7fu
— NDTV (@ndtv) July 29, 2026
ఇదే సమయంలో తమ పార్టీ కార్యాలయానికి ఢిల్లీ పోలీసులు రావడంపై సీపీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద పోలీసుల జోక్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆందోళనకర సంకేతమని పేర్కొంది. అయితే, పార్టీ కార్యాలయాలకు పోలీసులు వెళ్లడం సాధారణ ప్రక్రియేనని జేపీ నడ్డా స్పందించారు. చట్టపరమైన అంశాల్లో పోలీసులు తమ విధులు నిర్వహిస్తారని తెలిపారు.
దీంతో, ఎమర్జెన్సీ నాటి పరిణామాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజాస్వామ్య హక్కులపై జరిగిన చర్చతో రాజ్యసభలో వాతావరణం వేడెక్కింది. గత ప్రభుత్వాల విధానాలు, ప్రస్తుత పాలనపై అధికార–విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగాయి.


